
మహానటులు ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు కలిసి నటించిన తొలి సినిమా 'పల్లెటూరి పిల్ల' (1950). హీరోగా ఎన్టీఆర్ కెమెరా ముందుకు వచ్చిన తొలి సినిమా కూడా ఇదే. అయితే ముందుగా విడుదలైంది మాత్రం 'షావుకారు'. ఇది దర్శకుడిగా బి.ఎ. సుబ్బారావుకు తొలి చిత్రం. అంజలీదేవి టైటిల్ రోల్ చేసిన ఈ సినిమాకి రిజక్ట్ షెరిటన్ రాసిన 'ఫిజారో' ఆంగ్ల నాటకం ఆధారం. దీన్ని తెలుగు వాతావరణానికి అనుగుణంగా మార్చి కథ తయారుచేశారు పి. ఆదినారాయణరావు. ఆయన ఈ సినిమాకి సంగీతం అందించడమే కాక ఓ పాట సైతం రాశారు.
ఇందులోని రెండో హీరో అయిన వసంత్ పాత్రను మొదట అప్పటి సీనియర్ హీరో కల్యాణం రఘురామయ్య చేశారు. అంజలీదేవి కాంబినేషనులో కొన్ని సీన్లు తీశాక ఆయన సినిమానుంచి తప్పుకున్నారు. దాంతో ఆ పాత్రను అక్కినేని పోషించారు. ఇందులో మెయిన్ హీరో రామారావు కాబట్టి ఆయన పేరు మొదట వెయ్యమని నాగేశ్వరరావు సూచించినా సీనియారిటీని గౌరవించాలని నాగేశ్వరరావు పేరే టైటిల్స్ లో వేశారు నిర్మాత, దర్శకుడు అయిన సుబ్బారావు.
No comments:
Post a Comment