Showing posts with label vanisri. Show all posts
Showing posts with label vanisri. Show all posts

Thursday, December 10, 2015

Synopsis of the movie KALASINA MANASULU (1968)

'కలసిన మనసులు' (1968) చిత్ర కథాంశం


రామాపురం గ్రామంలో మోతుబరి వెంకటరత్నం (రేలంగి). కొడుకు శేఖర్ (జగ్గయ్య), మనవరాలు లక్ష్మి (బేబీ శంతికళ) తప్ప ఆ ఇంట్లో మరో ప్రాణి లేదు. లక్ష్మి బాగోగులు చూసేందుకు ఆయాగా నిర్మల (వాణిశ్రీ) వస్తుంది. నిర్మల అన్నయ్య రాము (శోభన్‌బాబు) పట్నంలో వెంకటరత్నం దయాధర్మాలతో చదువుతుంటాడు. ఆ ఊళ్లోనే ఉండే రిటైర్డ్ హెడ్‌మాస్టర్ కోరికల కొండలరావు (అల్లు రామలింగయ్య) ఏకైక పుత్రిక లీల (భారతి) పంతులమ్మగా పనిచేస్తుంటుంది. రాము, లీల చిన్ననాటి చెలిమితో పెద్దయ్యాక ప్రేమలో పడ్డారు. కోరికల కొండలరావుకు కోరికలు జాస్తి. తనకు కాబోయే అల్లుడు అర్హతలంటూ బ్లాక్‌బోర్డుపై ఓ దండకం రాసి వాటిని కూతురి చేత నిత్య పారాయణం చేయిస్తూ ఉంటాడు.
పట్నంలో బీకాం పరీక్ష రాసిన రాము ఇంటికి వస్తూ దారిలో మూర్తీ అండ్ కంపెనీ మేనేజర్ ఆనంద్ (రామ్మోహన్)ను దొంగల బారి నుండి కాపాడటమే కాక ఆస్పత్రిలో తన రక్తం ఇచ్చి ప్రాణదానం చేస్తాడు. రాము నిజాయితీకి, త్యాగనిరతికి ఆకర్షితుడైన ఆ కంపెనీ యజమాని రాముకు తన కంపెనీలో ఉద్యోగం ఇస్తాడు.
రాము ఆహ్వానంపై అతని ఇంటికి వచ్చిన ఆనంద్, అక్కడ లీలను చూసి, ఆమెను రాము చెల్లెలు నిర్మలగా భ్రమించి ప్రేమిస్తాడు. ప్రేమ పర్యవసానం - ఆనంద్, నిర్మల వివాహం. తీరా తాళికట్టబోయే సమయంలో నిర్మలను చూసిన ఆనంద్ 'ఇదంతా మోసం' అంటూ పెళ్లిపీటల మీదనుంచి లేచిపోతాడు. ఆ అవమానం కలిగించిన దుఃఖంతో నిర్మల తల్లి మరణిస్తుంది. పచ్చని కల్యాణమంటపం శోకానికి నిలయం కాగా, నిర్మలకు పెళ్లి చేశాకే తను వివాహం చేసుకుంటానని చివరి క్షణాల్లో తల్లికి మాటిస్తాడు రాము.
ఎందుకిలా చేశావని ఆనంద్‌ను నిలదీస్తాడు రాము. పేరు ఏదైనా తను చూసిందీ, ప్రేమించిందీ లీలననీ, ఆమె కూడా తనను ప్రేమించిందనీ, దానికి నిదర్శనం కూడా ఉందనీ దబాయిస్తాడు ఆనంద్. దీంతో నిర్ఘాంతపోయిన రాము భగ్న ప్రేమికుడిలా బాధను అనుభవిస్తుంటాడు. లీలను ఆనంద్ ప్రేమిస్తున్నట్లు తెలుసుకున్న అతని తల్లి కోర్కెల కొండలరావుతో మాట్లాడి లీల, ఆనంద్ పెళ్లి నిశ్చయం చేస్తుంది. ఈ విషయం తెలుసుకున్న లీల తన హృదయంలో రాముకు తప్ప మరొకరికి చోటులేదని ఆనంద్‌కు తేల్చిచెప్పి, ఆనంద్ తన ప్రేమకానుకను ఇచ్చింది నిర్మలకేనని రుజువుచేస్తుంది. దాంతో కథ సుఖాంతం.

తారాగణం: శోభన్‌బాబు, భారతి, వాణిశ్రీ, జగ్గయ్య, రామ్మోహన్, రేలంగి, అల్లు రామలింగయ్య, హేమలత, రావి కొండలరావు, గుంటూరు వెంకటేశ్, బేబీ శాంతికళ
సంగీతం: మాస్టర్ వేణు
నిర్మాత: ఎమ్మెస్ రెడ్డి
దర్శకుడు: కమలాకర కామేశ్వరరావు
బేనర్: కౌముది పిక్చర్స్
విడుదల తేదీ: 11 అక్టోబర్

Saturday, September 24, 2011

మరపురాని చిత్రం: ప్రేమనగర్


రామానాయుడు సినీభవితవ్యాన్ని నిర్దేశించి, నిర్మాతగా ఆయన్ని నిలబెట్టిన 'ప్రేమనగర్' చిత్రం విడుదలై నేటికి సరిగ్గా నలభై ఏళ్లు. ఈ సందర్భంగా ఈ సినిమా విశేషాలు..
ప్రఖ్యాత నిర్మాత డి. రామానాయుడు ఈరోజున అత్యధిక చిత్రాల నిర్మాతగా చరిత్రలో స్థానం దక్కించుకున్నారంటే అందుకు మూలస్తంభం 'ప్రేమనగర్' చిత్రం. ఈ సినిమాకి ముందు ఆయన కె. బాపయ్యను డైరెక్టర్‌గా పరిచయం చేస్తూ 'ద్రోహి' చిత్రాన్ని నిర్మించారు. జగ్గయ్య, వాణిశ్రీ, నాగభూషణం కాంబినేషన్‌లో తయారైన ఈ సినిమా అట్టర్‌ఫ్లాపయ్యింది. దీనితో ఐదు లక్షల రూపాయల నష్టం చవిచూశారు రామానాయుడు. 40 ఏళ్ల క్రితం అది చాలా పెద్ద మొత్తం. అప్పుడాయనకు రెండే దార్లు మిగిలాయి. ఒకటి నిర్మాతగానే కొనసాగి, నష్టాన్ని పూడ్చుకోవడం, లేదంటే చెన్నై దగ్గరోని కోణంబాకంలో ఉన్న పొలాలతో వ్యవసాయం చేసుకోవడం. తాడో పేడో తేల్చుకుందామని చివరి ప్రయత్నంగా 'ప్రేమనగర్' ప్రాజెక్టుని ప్రారంభించారు.
కోడూరి కౌసల్యాదేవి అదే పేరుతో రాసిన నవల అప్పటికే పాపులర్ కావడంతో దాని హక్కుల్ని నిజామాబాద్‌కు చెందిన కొత్త నిర్మాత శ్రీధర్‌రెడ్డి కొన్నారు. అందులో నటించేందుకు అక్కినేని నాగేశ్వరరావు అంగీకరించారు. అయితే శ్రీధర్‌రెడ్డి ఎంతకీ ఆ సినిమా ప్రారంభించక పోవడంతో ఆయన నుంచి ఆ హక్కులు కొనుగోలు చేశారు రామానాయుడు. అప్పటికే తమ బేనర్‌లో 'స్త్రీజన్మ'ని తీసిన కె.ఎస్. ప్రకాశరావుని దర్శకునిగా తీసుకున్నారు. రచయిత ఆత్రేయతో కలిసి నవలలో చాలా మార్పులు చేశారు ప్రకాశరావు. సినిమా సెట్స్ మీదకు వెళ్లే ముందు రామానాయుడికి బౌండ్ స్క్రిప్ట్ అందించారు ఆత్రేయ.
రూ. 15 లక్షల ఖర్చు అంచనాతో ఈ సినిమా ప్రారంభించారు. అక్కినేని, వాణిశ్రీ, సత్యనారాయణ, రాజబాబు, రమాప్రభ, గుమ్మడి వంటి భారీ తారాగణంతో రామానాయుడు 'ప్రేమనగర్'ని మొదలు పెట్టారని తెలిసి సినీ వర్గాలు ఆశ్చర్యపోయాయి. అప్పటికే వాళ్లకి తెలుసు, రామానాయుడు నిండా మునిగిపోయి ఉన్నారని. కొంతమంది సన్నిహితులు రిస్క్ తీసుకోవద్దని వారించినా ఆయన లెక్కచెయ్యలేదు. 1971 జనవరి 20న చెన్నై వాహినీ స్టూడియోలో కొబ్బరికాయ కొట్టి షూటింగ్ ప్రారంభించారు అక్కినేని. పూజలకు అక్కినేని దూరమైనా రామానాయుడు అడిగేసరికి కాదనలేకపోయారు. ఆరు నెలల్లో సినిమా పూర్తయింది. 1971 సెప్టెంబర్ 24న 'ప్రేమనగర్' విడుదలైంది. అప్పుడే పెద్ద గాలివాన. రామానాయుడిని ఓవైపు ఆందోళన, మరోవైపు నమ్మకం కలిపి విచిత్రావస్థలోకి నెట్టాయి. అయితే ప్రేక్షకులు 'ప్రేమనగర్'కి బ్రహ్మరథం పట్టారు. ప్రేమ కథా చిత్రాల నాయకునిగా అక్కినేని ఇమేజ్‌ని మరింత పరిపుష్టం చేస్తూ అఖండ విజయం సాధించింది ఈ సినిమా.
హీరో కల్యాణ్‌వర్మ పాత్రకి జీవం పోశారు అక్కినేని. 'మనసు గతి ఇంతే', 'ఎవరి కోసం ఈ ప్రేమమందిరం' అంటూ ఆత్రేయ రాసిన అపూర్వ గీతాలని అంతే అపూర్వ స్థాయిలో అభినయించి వాటికి చిరస్థాయిని కల్పించడంలో తనవంతు పాత్ర పోషించారు. అలాగే నవలా నాయికగా వాణిశ్రీకి ఈ చిత్రం సరికొత్త ఇమేజ్ తెచ్చింది. ఆమె కట్టు, బొట్టు, కొప్పుని అనుకరించడానికి ఆ రోజుల్లో యువతులు పోటీపడ్డారు. అక్కినేని, వాణిశ్రీపై చిత్రీకరించిన డ్యూయెట్లు యువతని ఎంతగా రంజింపచేశాయో చెప్పనక్కర్లేదు. ఈ సినిమాలో సత్యనారాయణ చిన్నప్పటి పాత్రలో వెంకటేశ్ నటించడం విశేషం.
తెలుగు సినిమా సాధించిన అమోఘమైన విజయంతో దీన్ని తమిళంలోనూ నిర్మించాలనుకున్నారు రామానాయుడు. శివాజీ గణేశన్, వాణిశ్రీ జంటగా 'వసంత మాళిగై' పేరుతో రీమేక్ చేశారు. అక్కడా ఆ సినిమా దిగ్విజయం సాధించి, తమిళనాడులో రామానాయుడికి 'వసంత మాళిగై రామానాయుడు'గా పేరు తెచ్చింది. ఇలా రెండు భాషల్లో ఈ సినిమా సూపర్‌హిట్టయ్యాక ఆయన కన్ను బాలీవుడ్ మీద పడింది. హిందీ 'ప్రేంనగర్'కు రూపకల్పన జరిగింది. అందులో నటించేందుకు అప్పటి హిందీ రొమాంటిక్ హీరో రాజేశ్‌ఖన్నా, డ్రీం గర్ల్ హీమమాలిని సరేనన్నారు. అక్కడా ఈ సినిమా విజయకేతనం ఎగురవేసింది. రామానాయుడి బాలీవుడ్ ప్రవేశం ఘనంగా మొదలైంది. ఈ మూడు భాషల్లోనూ దర్శకుడు ప్రకాశరావే. ఇలా ఈ సినిమా విజయ విహారం చేయడంతో రామానాయుడు ఎక్కడికీ కదలాల్సిన అవసరం లేకపోయింది.

Thursday, August 11, 2011

ఇంటర్వ్యూ: దగ్గుబాటి రామానాయుడు

"నిజానికి ఇతర భాషల్లో సినిమాలు తీసి ఆర్థికంగా పోగొట్టుకున్నానే కానీ లాభపడలేదు. ఈ విషయంలో నా ఇద్దరు కొడుకులూ నన్నెప్పుడూ తప్పు పట్టలేదు. ఆ విషయంలో నేను అదృష్టవంతుణ్ణి'' అని ఒకింత ఉద్వేగంగా చెప్పారు సీనియర్ ప్రొడ్యూసర్ డాక్టర్ దగ్గుబాటి రామానాయుడు. నవదీప్, అవసరాల శ్రీనివాస్, రాహుల్ హీరోలుగా; రీమాసేన్, శ్రద్ధాదాస్, సంజన, సౌమ్య హీరోయిన్లుగా సురేశ్ ప్రొడక్షన్స్ పతాకంపై తాజాగా ఆయన నిర్మించిన చిత్రం 'ముగ్గురు'. వి.ఎన్. ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ చిత్రం చిత్రం ఈ నెల 19న విడుదలవుతున్న సందర్భంగా ప్రత్యేకంగా సంభాషించారు రామానాయుడు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే...

వైవిధ్యమైన కథతో రూపొందించిన వినోదాత్మక చిత్రం 'ముగ్గురు'. 2 గంటల 7 నిమిషాల సేపు ఆద్యంతం ఉత్కంఠభరితంగా సినిమా నడుస్తుంది. ఈమధ్య విడుదలైన ఆడియోకు వెరీగుడ్ రిపోర్ట్ వచ్చింది. ముఖ్యంగా టైటిల్ సాంగ్ చాలా బాగుందంటున్నారు. మొత్తం ఆరు పాటలు. ఇప్పటికే మా బేనర్‌లో చాలా సినిమాలు చేసిన కోటి ఈ సినిమాకీ మంచి మ్యూజిక్‌నిచ్చాడు. రచయితలు సాహిత్యం బాగా రాశారు. థియేటర్ ట్రైలర్స్‌కూ స్పందన బాగుంది. తమ పాత్రలకి ఆర్టిస్టులందరూ న్యాయం చేశారు. ముగ్గురు హీరోలు, హీరోయిన్లు హుషారుగా నటించారు. ఈ సినిమాని 37 రోజుల్లోనే పూర్తి చేశాం. అందులో 23 రోజులు మలేషియాలో షూటింగ్ చేశాం. నాలుగు రోజులు కారంచేడులో చిత్రీకరించాం.
ఆదిత్య బాగా తీశాడు
డైరెక్టర్ ఆదిత్య సినిమాని బాగా తెరకెక్కించాడు. అతను 'ప్రేమించుకుందాం రా'తో మరో రెండు మూడు సినిమాలకి మా బేనర్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. అతను సబ్జెక్ట్ చెప్పగానే బాగా నచ్చింది. చెప్పినదానికంటే బాగా తీశాడు. సాధారణంగా నా సినిమాని సెట్స్‌లో ఉండి గమనించడం అలవాటు కాబట్టి, ఆదిత్య ప్రతిభ ని సెట్స్ మీద చూశాను. వెరీగుడ్ డైరెక్టర్. నేను కథ బాగుంటేనే సినిమా తీస్తాను. ఇదివరకు కొన్ని సినిమాలు ఆడకపోవడానికి రకరకాల కారణాలున్నాయి. మునుపటి సినిమా 'ఆలస్యం అమృతం' కచ్చితంగా వంద రోజులు ఆడుతుందని తొలి కాపీ చూసినవాళ్లంతా అభిప్రాయపడ్డారు. చంద్రమహేశ్‌కి కచ్చితంగా హిట్ వస్తుందని ఆశించా. అయితే రాంగ్ టైమ్‌లో రిలీజ్ చెయ్యడం వల్లే అది ఆడలేదు.
అది విత్తనం, ఇది చెట్టు
ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడే ధైర్యంగా ఉండాలనీ, సక్సెస్ వచ్చినప్పుడు ఒదిగి ఉండాలనీ నేర్చుకున్నా కాబట్టి నేనెప్పుడూ ఫెయిల్యూర్స్‌కి భయపడలేదు. గతంలో 'ద్రోహి' ఫ్లాపయినప్పుడు ఆర్థికంగా కష్టాలు ఎదుర్కొన్నా. కె. బాపయ్యకి డైరెక్టర్‌గా అది తొలి చిత్రం. దానికి పెట్టిన పది లక్షలూ పోయాయి. ఆ తర్వాత అక్కినేని నాగేశ్వరరావు, వాణిశ్రీతో 'ప్రేమనగర్' ప్లాన్ చేశా. దానికి పదిహేను లక్షలు ఖర్చుపెట్టాం. ఆ సినిమా జీవన్మరణ సమస్య. అది ఆడితే మద్రాసులోనే ఉంటాననీ, లేదంటే కేళంబాక్కం వెళ్లిపోతాననీ చెప్పా. ఎందుకంటే కేళంబాక్కంలో అప్పట్లో పొలాలు కొన్నా. అక్కడే వ్యవసాయం చేసుకోవాలనేది ఆలోచన. కారంచేడుకు మాత్రం పోకూడదనుకున్నా. ఎందుకంటే 'రామానాయుడు సినిమాల్లో అంతా పోగొట్టుకుని వచ్చేశాడురా' అనే మాటలు సొంతూరు వాళ్లనుంచి వినకూడదని. అయితే 'ప్రేమనగర్' పెద్ద హిట్టవడంతో కేళంబాక్కంకి వెళ్లాల్సిన పనిలేకపోయింది. అందుకే అంటుంటాను - మా సురేశ్ ప్రొడక్షన్స్‌కి 'రాముడు-భీముడు' విత్తనమైతే, 'ప్రేమగనర్' చెట్టు అని. ఈ రెండో సినిమాతో సినీ ఫీల్డ్‌లో నిలబడిపోయా. దాని హిందీ రీమేక్ 'ప్రేమనగర్'తో బాలీవుడ్‌లో అడుగుపెట్టి, అక్కడా సక్సెసయ్యా. అదే సినిమాని తమిళంలో 'వసంత మాళిగై'గా తీసి అక్కడా హిట్టుకొట్టా. ఆ తర్వాత కెరీర్‌లో కొన్ని ఆటుపోట్లు ఎదురైనా నేను చలించలేదు. ముందుకు సాగుతూ వచ్చా.
ఈ ఏడాదే పంజాబీ సినిమా
ఇప్పటికి పన్నెండు భారతీయ భాషల్లో సినిమాలు తీశా. పంజాబీలో కూడా సినిమా తీస్తే, అన్ని భారతీయ భాషా సినిమాల్ని తీసిన నిర్మాతగా పేరు సంపాదించుకుంటా. ఈ ఏడాదే పంజాబీలో సినిమా తీయబోతున్నా. నిజానికి ఇతర భాషల్లో సినిమాలు తీసి ఆర్థికంగా పోగొట్టుకున్నానే కానీ లాభపడలేదు. సినిమా మీద తపనతోటే ఆ భాషల్లోనూ మంచి సినిమాలు తీయాలనుకుని తీశా. ఈ విషయంలో నా ఇద్దరు కొడుకులూ నన్నెప్పుడూ తప్పు పట్టలేదు. ఆ విషయంలో నేను అదృష్టవంతుణ్ణి. పైగా వైజాగ్ స్టూడియోని చూసుకోవడానికి అక్కడకి వెళ్తానన్నా వాళ్లు ఒప్పుకోవడం లేదు. అందరం కలిసి ఇక్కడే ఉండాలని పట్టుబడుతున్నారు.
అన్ని రకాలుగా హ్యాపీ
తదుపరి సినిమాని భూపతిరాజా కథతో చెయ్యాలని అనుకుంటున్నా. అన్నీ కుదిరితే వెంకటేశ్ హీరోగా, ఆదిత్య దర్శకత్వంలో దాన్ని తీస్తా. ఆ తర్వాత నా మనవడు నాగచైతన్య హీరోగా వచ్చే ఏడాది జనవరి నుంచి మరో సినిమా ఉంటుంది. రానా హిందీలో బిజీ అయ్యేటట్లున్నాడు. ఇప్పుడక్కడ రాంగోపాల్‌వర్మ తీస్తున్న 'డిపార్ట్‌మెంట్'లో నటిస్తున్నాడు. సురేశ్‌బాబు మరో కొడుకు అభిరామ్ కూడా నటించేందుకు రెడీ అంటున్నాడు. రెండేళ్ల తర్వాత అతనూ హీరో అవుతాడు. 'మొదట మన బేనర్‌లోనే చేస్తా తాతా' అంటున్నాడు. నేను, నా తర్వాత నా కొడుకులు, ఇప్పుడు నా మనవళ్లు ఈ రంగంలోనే సక్సెస్ సాధించి, ముందుకెళుతుండటం ఎంతో సంతోషంగా అనిపిస్తుంటుంది. సినిమా రంగానికి సంబంధించి అత్యున్నత పురస్కారమైన దాదాసాహెబ్ ఫాల్కే అందుకున్నా. ఇక ప్రత్యేకంగా నేను సాధించాల్సిందంటూ ఏమీ లేదు.