Showing posts with label nippu. Show all posts
Showing posts with label nippu. Show all posts

Monday, December 26, 2011

బిగ్ స్టోరీ: సంక్రాంతికి సై

సంక్రాంతికి ఏయే సినిమాలు రానున్నాయో దాదాపు తేలిపోయింది. తెలుగు సినిమాకు సంబంధించి ఓ కేలండర్ సంవత్సరంలో వచ్చే తొలి పెద్ద సీజన్ సంక్రాంతి అనేది తెలిసిందే. సంక్రాంతికి వారం నుంచి పది రోజుల దాకా బడులకు ఇచ్చే సెలవుల్ని సొమ్ము చేసుకోవాలని నిర్మాతలు భావిస్తుంటారు. పెద్ద సినిమాలు రంగంలో ఉంటే చిన్న సినిమాలకు థియేటర్లు దొరక్క ఆ సినిమాల నిర్మాతలు నిరాశ పడటం మామూలే. ఇప్పుడూ అదే స్థితి. ఏకంగా నాలుగు పెద్ద సినిమాలు ఒకదానితో ఒకటి ఢీ అంటుండటంతో చిన్న సినిమాకు చోటెక్కెడ దొరుకుతుంది? పైగా ఈ పెద్ద సినిమాలే థియేటర్లను పంచుకోవాల్సి వస్తుండటం వల్ల వాటికీ మిగతా సమయాల్లో లభ్యమయ్యే రీతిలో థియేటర్లు దొరకవనేది నిజం. ఫలితంగా వాటి కలెక్షన్ల మీద కూడా ఇది ప్రభావం చూపడం తథ్యం. సంక్రాంతి విజేతలుగా నిలవాలనే తపనతో వస్తున్న ఆ నాలుగు సినిమాలు - 'బిజినెస్‌మేన్', 'బాడీగార్డ్', 'నిప్పు', 'పూలరంగడు'.
మళ్ళీ కలిశారు 
'దూకుడు' వంటి బ్లాక్‌బస్టర్ సినిమా తర్వాత మహేశ్ హీరోగా వస్తున్న 'బిజినెస్‌మేన్' సినిమా పట్ల వెల్లువెత్తుతున్న అంచనాలు అంబరాన్నంటుతున్నాయి. పూరి జగన్నాథ్ దర్శకుడవడం వల్ల కూడా ఈ సినిమా పట్ల ఇటు సినీ వర్గాలవారూ, అటు సాధారణ ప్రేక్షకులూ అమితాసక్తి కనపరుస్తున్నారు. ఇదివరకు ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన 'పోకిరి' చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డుల్ని నెలకొల్పిన సంగతి మనకు తెలుసు. 'బిజినెస్‌మేన్' ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తోందోననే ఆసక్తి సర్వత్రా ఉంది. అందుకే దీన్ని కొనుగోలు చేసేందుకు బయ్యర్లు బారులు తీరారు. మహేశ్ సరసన కాజల్ అగర్వాల్ తొలిసారి నాయికగా నటించిన ఈ చిత్రాన్ని ఆర్.ఆర్. మూవీమేకర్స్ పతాకంపై వెంకట్ నిర్మిస్తున్నారు. 'దూకుడు' మీదున్న తమన్ సంగీతం సమకూర్చిన పాటలు ఇప్పటికే పెద్ద హిట్టయ్యాయి. ముంబై మాఫియా నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం సంక్రాంతి సీజన్‌లో అన్నిటికంటే ముందుగా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
ఇప్పుడు తెలుగులో... 
వెంకటేశ్ హీరోగా నటించిన 'బాడీగార్డ్' సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించడం ఖాయమని సినీ వర్గాలు నమ్ముతున్నాయి. కారణం - ఇప్పటికే ఈ సినిమా మూడు భాషల్లో జయకేతనం ఎగురవేయడం. మొదట మలయాళంలో (దిలీప్ హీరో), తర్వాత తమిళంలో (విజయ్ హీరో), ఆ పిమ్మట హిందీలో (సల్మాన్‌ఖాన్ హీరో) కలెక్షన్ల వర్షం కురిపించింది ఈ సినిమా. వాటికంటే తెలుగు వెర్షన్ మరింత బాగా వచ్చిందని శ్రీ సాయిగణేశ్ మూవీస్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించిన బెల్లకొండ సురేశ్ గట్టి నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలి కాలంలో ఎక్కువగా కామెడీ ఎంటర్‌టైనర్స్ చేస్తూ వచ్చిన వెంక టేశ్ చాలా రోజుల తర్వాత ఓ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో నటించడం ఇప్పుడే. ఆయన సరసన త్రిష హీరోయిన్‌గా చేయడం ఇది మూడోసారి. 'డాన్ శీను' ఫేమ్ గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ సినిమాకి రామ్-లక్ష్మణ్ కూర్చిన ఫైట్లు, తమన్ సంగీతం అందించిన పాటలు హైలైట్ అవుతాయంటున్నారు. జనవరి 12న విడుదలవుతున్న ఈ సినిమా ట్రైలర్లకు మంచి స్పందన వస్తోంది.

ముగ్గురు మిత్రులు 
ముగ్గురు మిత్రుల సినిమా 'నిప్పు'. కెరీర్ తొలినాళ్లలో చెన్నైలో ఒకే ఇంట్లో ఉండి అవకాశాలు వెతుక్కున్న ఆ ముగ్గురు - గుణశేఖర్, రవితేజ, వైవీఎస్ చౌదరి. రవితేజ కథానాయకుడిగా గుణశేఖర్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని బొమ్మరిల్లు వారి పతాకంపై వైవీఎస్ నిర్మిస్తున్నారు. ఇలా ఓ అరుదైన కాంబినేషన్‌తో, ఆరోగ్యకరమైన వాతావరణంలో తయారవుతున్న ఈ చిత్రం ఎప్పుడు విడుదలవుతుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు. దీక్షాసేథ్ హీరోయిన్‌గా నటిస్తుంటే, రాజేంద్రప్రసాద్ ఓ కీలక పాత్ర చేస్తున్నారు. రవితేజ మార్కు వినోదానికి, గుణశేఖర్ శైలి టేకింగ్ తోడైన ఈ సినిమాకి సైతం తమన్ సంగీతం సమకూరుస్తుండటం విశేషం. ఇలా ఒకే సంగీత దర్శకుడు పనిచేసిన మూడు సినిమాలు ఒకదానితో ఒకటి పోటీపడనుండటం అనేది కూడా అరుదైన సందర్భం. జనవరి 13న 'నిప్పు' విడుదలవుతోంది.
నవ్వులు పువ్వులు 
కమెడియన్‌గా మంచి పేరు తెచ్చుకొని, కామెడీ హీరోగా ఎదుగుతున్న సునీల్ ఇప్పుడు 'పూలరంగడు'గా అవతారమెత్తాడు. 'అందాల రాముడు', 'మర్యాద రామన్న' చిత్రాలతో ఘన విజయాలు సాధించిన ఈ భీమవరం నటుడు తనకంటూ సొంత మార్కెట్‌ని సంపాదించుకోవడం చిన్న విషయమేమీ కాదు. అందుకు తగ్గట్లే 'పూలరంగడు' పట్ల బిజినెస్ వర్గాలు ఆసక్తి కనపరుస్తున్నాయి. 'అహ నా పెళ్లంట' ఫేమ్ వీరభద్రమ్ దర్శకత్వంలో తయారవుతున్న ఈ చిత్రాన్ని ఆర్.ఆర్. మూవీమేకర్స్ సమర్పణలో దాని సోదర సంస్థ మాక్స్ ఇండియా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. జనవరి 5న ఆడియో ఆవిష్కరణ జరగనున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీత దర్శకుడు. జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ వినోదాత్మక చిత్రంలో 'ప్రేమ కావాలి' ఫేమ్ ఇషా చావ్లా నాయిక. ఒకే సంస్థ నిర్మిస్తున్న రెండు సినిమాలు ఒకదానితో ఒకటి పోటీపడుతుండటాన్నీ ఈసారి మనం చూడబోతున్నాం.
-ఆంధ్రజ్యోతి డైలీ, డిసెంబర్ 26, 2011

Thursday, December 15, 2011

గుణశేఖర్‌కి 'నిప్పు' పరీక్ష!

లాఠీ, సొగసు చూడతరమా, రామాయణం, చూడాలని ఉంది, మనోహరం, మృగరాజు, ఒక్కడు, అర్జున్, సైనికుడు, వరుడు... ఈ సినిమాలకీ, గుణశేఖర్‌కీ సంబంధం ఉంది. అది - ఆ సినిమాలకు దర్శకుడు ఆయనే. ఒక్కసారి వాటిని పరిశీలిస్తే 2003లో వచ్చిన 'ఒక్కడు' తర్వాత ఆయనకు మరో హిట్ లేదని అర్థమైపోతుంది. 
'ఒక్కడు'తో మహేశ్ ఇమేజ్‌ని ఎంతో పెంచిన గుణశేఖర్ అదే హీరోతో 'అర్జున్', 'సైనికుడు' సినిమాలు తీసి అటు మహేశ్‌ని దెబ్బకొట్టడమే కాకుండా తానూ దెబ్బతిన్నాడు. 'అర్జున్' స్వయంగా మహేశ్ వాళ్ల బేనర్ నిర్మించినదే. దాని కోసం మధుర మీనాక్షి దేవాలయం సెట్‌ని భారీ ఖర్చుతో నిర్మించారు. ఫలితంగా 'అర్జున్' కాస్ట్ ఫెయిల్యూర్ ప్రాజెక్టుగా మిగిలింది. ఇక అశ్వనీదత్ నిర్మించిన 'సైనికుడు' డిజాస్టరైంది. దీని కోసం కూడా ఓ సునామీ సెట్‌ని భారీ ఖర్చుతో ఏర్పాటు చేయించాడు గుణశేఖర్. వీటి తర్వాత పెళ్లి ఔన్నత్యాన్ని చాటి చెపుతున్నానంటూ అల్లు అర్జున్ హీరోగా అతను రూపొందించిన 'వరుడు' సినిమా సైతం ఘోరంగా ఫెయిలైంది. దీనికి సైతం బిగ్ బడ్జెట్ అయింది. 
ఇలా ఫ్లాపుల్లో హ్యాట్రిక్ నమోదుచేసిన గుణశేఖర్ ఇప్పుడు రవితేజ హీరోగా 'నిప్పు' సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. దీన్ని బొమ్మరిల్లు బేనర్‌పై వైవీఎస్ చౌదరి నిర్మిస్తుండటం విశేషం. తన మునుపటి సినిమాలకు చాలా ఎక్కువ సమయం తీసుకున్న గుణశేఖర్ 'నిప్పు'ను మాత్రం యమ స్పీడుగా తీసేస్తున్నాడు. అతడి మునుపటి సినిమాలతో పోలిస్తే బడ్జెట్ కూడా బాగా తక్కువని తెలుస్తోంది. అంటే అతడు మారాడని అనుకోవాలి. వచ్చే సంక్రాంతికి ఈ సినిమాని విడుదల చేయనున్నట్లు ఇప్పటికే చౌదరి ప్రకటించాడు. దీక్షాసేథ్ హీరోయిన్‌గా నటిస్తున్న నటిస్తున్న ఈ సినిమాతో గుణశేఖర్ మునుపటి ఫాంని అందుకుంటాడా? క్రియేటర్‌గా ఫ్లాపుల హ్యాట్రిక్ కొట్టిన అతడి క్రియేటివిటీకి ఇది అగ్ని పరీక్ష. ఇందులో అతను పాసవుతాడా, ఫెయిలవుతాడా అన్నది ఇప్పుడు తేలాలి

Thursday, July 28, 2011

న్యూస్: 'నిప్పు'తో వైవీఎస్ చౌదరి చెలగాటం

'సొగసు చూడతరమా', 'రామాయణం', 'చూడాలని వుంది', 'మనోహరం', 'ఒక్కడు'... ఇవన్నీ ఒకే దర్శకుడు రూపొందించిన సినిమాలు. 'మృగరాజు', 'సైనికుడు', 'వరుడు'... ఇవి కూడా అదే దర్శకుడు తీసిన సినిమాలు. అతను గుణశేఖర్. తన కెరీర్‌లో అబ్బురమనిపించే చిత్రాలతో పాటు 'ఇంత ఘోరంగా తీశాడేంటి?' అనిపించే చిత్రాలూ తీసిన గుణశేఖర్‌పై ప్రధానంగా ఒక విమర్శ ఉంది. అది ఔట్‌డోర్‌లో తీయాల్సిన సన్నివేశాల్ని కూడా భారీ సెట్స్ వేసి తీస్తాడనీ, తద్వారా బడ్జెట్‌ని విపరీతంగా పెంచేస్తాడనీ. అందుకే 'బడ్జెట్ పెంచాలంటే గుణశేఖర్‌లా సెట్స్ వేస్తే సరి' అనే నానుడి టాలీవుడ్‌లో ఏర్పడింది. 'ఒక్కడు'లోని చార్మినార్ సెట్, 'అర్జున్'లోని మధుర మీనాక్షి దేవాలయ సెట్, 'సైనికుడు'లోని సముద్రం సెట్ వంటివి అందుకు ఉదాహరణలు. మునుపటి డిజాస్టర్ మూవీ 'వరుడు'లోనూ పెళ్లి మండపం సెట్‌ని అతి లావిష్‌గా ఏర్పాటు చేయించాడు. ఇలా నిర్మాతల పాలిట విలన్‌లాగా తయారైన ఆయన్ని తన 'ఇదీ నా కథ'లో ప్రఖ్యాత కవి, నిర్మాత మల్లెమాల సుందరరామిరెడ్డి (ఎమ్మెస్ రెడ్డి) తూర్పారబట్టిన సంగతి ఇటీవలే మీడియాలో విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది.
ప్రస్తుతానికి వస్తే అలాంటి గుణశేఖర్ డైరెక్షన్‌లో మరో డైరెక్టర్ వైవీఎస్ చౌదరి 'నిప్పు' అనే సినిమాని నిర్మిస్తుండటం విశేషంగా చెప్పుకోవాలి. ఇందులో రవితేజ హీరో. దీక్షా సేథ్ హీరోయిన్. 'దేవదాసు' తర్వాత డైరెక్టర్‌గా మరో హిట్‌లేని చౌదరి ఇప్పుడు గుణశేఖర్‌తో ఎందుకు సినిమా నిర్మిస్తున్నాడో అర్థంకాక సినీ వర్గాల వారు తలబద్దలు కొట్టుకుంటున్నారు. ఒకప్పుడు సినిమా అవకాశాల కోసం తిరిగే రోజుల్లో మద్రాసులో ఒకే చోట ఉన్నామనీ, ఆ స్నేహంతో ఈ సినిమా చేస్తున్నాననీ చౌదరి చెబుతున్నాడు. కానీ గుణశేఖర్ గురించి తెలిసి తెలిసీ ఎందుకు 'నిప్పుతో చెలగాటమాడుతున్నాడు? ఇది తెలియాలంటే కొంత కాలం ఆగక తప్పదు.