Showing posts with label ramgopal varma. Show all posts
Showing posts with label ramgopal varma. Show all posts

Thursday, November 3, 2016

Saturday, September 20, 2014

Wednesday, June 18, 2014

Cinema: Ram Gopal Varma.. The Experimental Technician

ప్రయోగాలకు వెరవని టెక్నీషియన్

ట్రెండ్‌సెట్టర్లకే ట్రెండ్‌సెట్టర్‌గా నిలిచి నాగార్జున, జగపతిబాబు, జె.డి. చక్రవర్తి వంటి నటులకు స్టార్‌డం కల్పించిన దర్శకుడు రాంగోపాల్‌వర్మ ఇవాళ హిందీ చిత్రసీమకే అంకితమవడం విచారకరం. ఆరు పాటలు, ఐదు ఫైట్లు, వెగటు పుట్టించే ముతక హాస్య సన్నివేశాలు, ద్వంద్వార్థాల సంభాషణలు - ఇవే తెలుగు సినిమా అంటే.. అనే స్థితి నుంచి ఒక్కసారిగా సాంకేతిక అంశాలవైపు దృష్టి మరలింపజేసి తెలుగు ప్రేక్షకులకు కొత్తదనాన్ని చూపించినవాడు వర్మ. కథ కంటే కథనానికే ఎక్కువ ప్రాధాన్యాన్నిచ్చి సూటిగా ప్రేక్షకుల హృదయాల్ని తాకేట్లుగా సన్నివేశాల్ని మలచడంలో వర్మ నిష్ణాతుడు. ఇందుకు మంచి ఉదాహరణ - 'క్షణ క్షణం'. కథగా చెప్పుకోడానికి ఏమీలేని ఈ సినిమాని కేవలం కథనంతో, సహజమని భ్రమింపజేసే సన్నివేశాలతో ఆద్యంతం ఆసక్తికరంగా రూపొందించాడు. పాటల చిత్రీకరణలో కూడా వర్మ ప్రత్యేకత కనిపిస్తుంది. పాటల్లో నేపథ్యం (బ్యాక్‌గ్రౌండ్) ఎలా ఉండాలో కూడా ఈ సినిమాలో చూపించాడు వర్మ.
ఒక్క 'శివ' చిత్రంతోటే వర్మ అగ్రశ్రేణి దర్శకుల జాబితాలో చేరిపోయాడు. పైగా అది మొదటి చిత్రం కూడా. ఆ సినిమా నాగార్జునకు స్టార్‌డం కల్పించి చిరంజీవి తర్వాత రెండో స్థానాన్ని సాధించిపెట్టింది. యువతలో 'శివ' సృస్టించిన అలజడి అంతా ఇంతా కాదు. ఆ సినిమా వల్ల యువత చెడిపోతున్నదని అప్పుడంతా గోలపెట్టినవాళ్లే. కాలేజీ కేంపస్‌లలో 'శివ' తరహాలో జరిగిన అల్లర్లు దీనికి మద్దతుగా నిలిచాయి. మొత్తానికి ఆ సినిమాతో వర్మ, నాగార్జున - ఇద్దరూ పరస్పర ప్రయోజనం పొందారు. ఐనా వర్మ సంతృప్తి చెందలేదు. అతడిలోని టెక్నీషియన్ నిరంతర శోధనలోనే ఉండేవాడు. 'క్షణ క్షణం' ఆ టెక్నీషియన్‌కు మరింత పదునుపెట్టింది. కాగా ఆ సినిమాలోని కొన్ని సన్నివేశాలకు స్ఫూర్తి రాజ్‌కపూర్ 'చోరీ చోరీ' అనిపిస్తుంది.
ప్రయోగాత్మక చిత్రాలకు ఎప్పుడో కానీ ఆదరణ చూపని తెలుగు ప్రేక్షకులను ఒప్పించే లక్ష్యంతో వర్మ 'రాత్రి', 'దెయ్యం' సినిమాలను తీశాడు. మనిషిలో అంతర్లీనంగా ఉండే భయాందోళనలు ఆ మనిషిని ఎలా కల్లోలపరుస్తాయో ఆ రెండు చిత్రాల్లో చూపించేందుకు ప్రయత్నించాడు వర్మ. 'దెయ్యం' విడుదలకు ముందు ప్రకటనల విషయంలోనూ కొత్త పుంతలు తొక్కాడు. ఐతే ఇవి రెండూ బాక్సాఫీస్ వద్ద నిలదొక్కుకోలేక పోయాయి.
అంతకు ముందు జగపతిబాబు హీరోగా 'గాయం' చిత్రాన్ని తీసి సక్సెస్ సాధించాడు వర్మ. సరైన సక్సెస్ లేక డౌన్ స్టేజ్‌కి చేరువవుతున్న సమయంలో జగపతిబాబుకు 'గాయం' ఊరటనివ్వడమే కాకుండా చిత్రసీమలో మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. రాంగోపాల్‌వర్మ డైరెక్షన్‌లో ఇది ఊర్మిళకు రెండో సినిమా. తొలి సినిమా 'అంతం' ఘోరంగా ఫ్లాపైంది. మచ్చుకైనా తెలుగుతనం కనిపించకపోవడం, హాలీవుడ్ స్టయిల్లో రూపొందించాలనే తాపత్రయంతో కథని పూర్తిగా నిర్లక్ష్యం చేసి, కథనాన్ని సైతం చికాకు పరిచేలా తయారుచేయడం 'అంతం' బాక్సులన్నీ తిరుగుటపా కట్టడానికి కారణం. అయినా వర్మ పరాజయానికి కుంగిపోయే రకం కాదు. 'ప్రయోగాలకు స్వస్తిచెప్పి సాధారణ స్థాయిలో సినిమాలు తీసుకుందాం' అనుకొనే సాధారణ దర్శకుడు కాదు. అందుకనే తెలుగువాళ్లకే కాదు, దేశంలోని కోట్లాది ప్రజానీకానికి ఇలవేల్పు అయిన వెంకటేశ్వరస్వామి మీదే ప్రయోగం చేయాలనుకొని 'గోవిందా గోవిందా'ని తలపెట్టాడు. చిత్రం నిర్మాణంలో ఉన్నప్పుడే విమర్శలు వచ్చాయి. అయినా వెరవక చిత్రాన్ని పూర్తిచేశాడు. జయాపజయాల మాటెలా ఉన్నా చిత్రంలోని సన్నివేశాలు, పాటల చిత్రీకరణ వర్మలోని దర్శకత్వ ప్రతిభను చాటిచెప్పాయి. సెన్సార్ వాళ్లు ఈ సినిమాకు చేసిన 'కట్స్' వల్ల వర్మకి తెలుగు సెన్సార్ బోర్డు మీద కోపం వచ్చి "ఇక తెలుగు సినిమాలు చేయను" అని స్టేట్‌మెంట్ ఇచ్చాడు. అయితే తర్వాత జె.డి. చక్రవర్తి, ఊర్మిళ జంటగా 'అనగనగా ఒక రోజు' అనే సినిమా మొదలుపెట్టాడు. "తెలుగు సినిమాలను తీయనన్నారుగా" అనడిగితే "ఆ స్టేట్‌మెంట్ ఇవ్వకముందే ఈ సినిమా మొదలైపోయింది" అన్నాడు. 'అనగనగా ఒక రోజు'తో బ్రహ్మానందం ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు. సినిమా కూడా జనానికి నచ్చింది. అదే ఆఖరు - తెలుగు సినిమాకు వర్మ దర్శకత్వం వహించడం.
ముంబైకి వెళ్లి తీసిన తొలి సినిమా పెద్ద సంచలనం రేపింది. అది 'రంగీలా'. సినిమా రంగానికి వెళ్లిన ఓ సాధారణ యువతి స్టార్ అయినా కూడా సామాన్యుడైన తన పూర్వ స్నేహితుణ్ణే పెళ్లాడాలని నిర్ణయించుకోవడం ఈ సినిమా ఇతివృత్తం. 'రంగీలా ఆయిరే' పాట అప్పట్లో యువతని ఓ ఊపు ఊపింది. ఊర్మిళతోనే ఎక్కువగా సినిమాలు తీస్తుంటే ఇద్దరిమీదా గాసిప్స్ మొదలయ్యాయి. ఇలాంటివేమీ పట్టించుకొనే ఘటం కాదు కాబట్టి ఆ తర్వాత కూడా ఊర్మిళతో సినిమాలు తీస్తూనే వచ్చాడు వర్మ. 'కౌన్', 'సత్య', 'మస్త్', ఇప్పుడు 'జంగిల్' - వీటన్నింటిలోనూ ఊర్మిళనే హీరోయిన్. రెండే పాత్రలతో తీసిన మరో ప్రయోగాత్మక చిత్రం 'కౌన్' సక్సెస్ కాలేదు. దీంట్లో నటించిన మజోన్ బాజ్‌పేయి అంతకుముందు 'సత్య'తో వెలుగులోకి వచ్చాడు. మనోజ్ హీరోగా ఓ చిత్రాన్ని తీస్తానని చెప్పిన వర్మ చెప్పినట్లుగానే 'శూల్' తీశాడు. అయితే తాను నిర్మాతగా మాత్రమే ఉండి శిష్యుడైన నివాస్‌కు దర్శకత్వం అప్పజెప్పాడు. సినీ జగత్తు నేపథ్యంతోనే వర్మ తీసిన 'మస్త్' కూడా ఫ్లాపయింది. త్వరలో 'జంగిల్' సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు. ఇందులో ఫిరోజ్‌ఖాన్ కొడుకు ఫర్దీన్‌ఖాన్‌ని హీరోగా పరిచయం చేస్తున్నాడు. వర్మ స్థాయిలోనే టెక్నికల్ వాల్యూస్‌తో ఈ చిత్రం వస్తుందని అందరూ భావిస్తున్నారు.
తన సినిమాలతో కొంతమందికి స్టార్‌డంనీ, మరికొంతమంది కొత్తవాళ్లకి గుర్తింపునీ తీసుకువచ్చిన వర్మ చిత్రంలో నటించడానికి ఆరాటపడని వాళ్లుండరు. జె.డి. చక్రవర్తి, మనోజ్ బాజ్‌పేయి, అఫ్తాబ్ శివ్‌దాసాని, ఫర్దీన్‌ఖాన్ వంటి వాళ్లని తెరకి పరిచయం చేసినా కొంతమంది మంచి టెక్నీషియన్స్‌ని కూడా చిత్రసీమకు అందించాడు. అతడి శిష్యుడైన కృష్ణవంశీ ఇవాళ అగ్రశ్రేణి దర్శకుల్లో ఒకడు. ఏమైనా హిందీ చిత్రసీమకే పూర్తిగా అంకితమైపోకుండా మాతృసీమ అయిన తెలుగు చిత్రసీమకూ సేవ అందించాలనీ, వర్మ తెలుగు చిత్రాలు తీస్తే బాగుండుననీ కొంతమందైనా అనుకుంటున్నారు.

- ఆంధ్రభూమి 'వెన్నెల', 26 మే, 2000

Saturday, April 26, 2014

Telugu Cinema After Independence

1947 తర్వాత తెలుగు సినిమా
ఈ శతాబ్దంలో దేశంలోనే అత్యంత ప్రాచుర్యం పొందిన, జనరంజకమైన మాధ్యమంగా సినిమా ఖ్యాతికెక్కింది. తొలినాళ్లలో అది ఓ కళా ప్రక్రియ అయితే ఇవాళ అది పక్కా వ్యాపార పరిశ్రమగా మారిపోయింది. స్వాతంత్ర్యానంతరం ఈ యాభైయ్యేళ్ల తెలుగు చలనచిత్ర రంగాన్ని ఓసారి పరిశీలిస్తే కళాఖండాలనదగ్గ చిత్రాలు పదికంటే ఎక్కువ కనిపించవు. తెలుగు సినిమా గురించి గొప్పగా చెప్పుకోవడానికి పనికొచ్చేది నిర్మాణమవుతున్న చిత్రాల సంఖ్య గురించే. హిందీ చిత్రాలకంటే అధిక సంఖ్యలో ప్రతి యేటా తెలుగులో సినిమాలు నిర్మితమవుతున్నాయి. వాటిలో విమర్శకి నిల్చునేవి అసలు ఉండటం లేదు. అయితే దేశం గర్వించదగ్గ నటులు, దర్శకులు మనకి ఉన్నారని చెప్పుకునే భాగ్యం మనకి లభించింది. దర్శకుల్లో ఎల్వీ ప్రసాద్, బి.ఎన్. రెడ్డి, నటుల్లో అక్కినేని నాగేశ్వరరావు సినిమా రంగంలో దేశానికి సంబంధించిన అత్యున్నత పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్నారు. చిత్తూరు నాగయ్య, ఎస్వీ రంగారావు, ఎన్టీ రామారావు వంటి మహానటులూ, రేలంగి, రమణారెడ్డి వంటి మహా కమెడియన్లూ, కాంచనమాల, కన్నాంబ, భానుమతి, సావిత్రి, సూర్యకాంతం వంటి మహా నటీమణులూ, గూడవల్లి రామబ్రహ్మం, సి. పుల్లయ్య, వేదాంతం రాఘవయ్య, కె.వి. రెడ్డి, కమలాకర కామేశ్వరరావు, ఆదుర్తి సుబ్బారావు, కె. విశ్వనాథ్ వంటి దిగ్దర్శకులూ మనకి లభించారు.
మొదట్లో - అంటే ఆరవ దశకం వరకు తెలుగులో పౌరాణిక చిత్రాలు, మాయా మంత్రతంత్రాల జానపద చిత్రాలే రాజ్యం చేశాయి. సామాజిక స్పృహతో తీసిన చిత్రాలు బహు తక్కువ. గూడవల్లి రామబ్రహ్మం తీసిన 'మాలపిల్ల', 'రైతుబిడ్డ' వంటివి అందుకు మినహాయింపు. అయితే 'దేవదాసు', 'పాతాళభైరవి', 'మాయాబజార్', 'మహాకవి కాళిదాసు' వంటి కళాఖండాలనదగ్గ చిత్రాలు వచ్చాయి. రామారావు, నాగేశ్వరరావు అగ్ర కథానాయకులుగా నిలిచారు. నటీమణుల్లో భానుమతి, సావిత్రి అగ్ర స్థాయికి చేరుకున్నారు. 1953లోనే 'చండీరాణి'కి దర్శకత్వం వహించిన భానుమతి తెలుగులో తొలి దర్శకురాలయ్యారు. 1951లో కె.వి. రెడ్డి దర్శకత్వంలో వచ్చిన 'పాతాళ భైరవి' బాక్సాఫీసు రికార్డుల్ని బద్దలు కొట్టి చరిత్ర సృష్టించింది. ఆ తర్వాత 1955లో తాపీ చాణక్య దర్శకత్వం వహించిన సామాజిక ప్రయోజనాత్మక చిత్రం 'రోజులు మారాయి' అఖండ విజయం సాధించి ఆ తరహా సినిమాలకు తలమానికంగా నిలిచింది.
స్వాతంత్ర్యానికి పూర్వం వ్యాపారాత్మక దృష్టితో తీసిన సినిమాలు మనకు కనిపించవు. 1950లో వచ్చిన విజయా వారి సినిమా 'షావుకారు'తో ఈ వ్యాపార పోకడలు మొదలయ్యాయని చెప్పుకోవచ్చు. ఈ సినిమాతో నటిగా పరిచయమైన జానకి, దానితోటే 'షావుకారు జానకి'గా మారిపోయారు. 1963లో తొలి తెలుగు వర్ణ చిత్రం 'లవకుశ' వచ్చింది. దీనికి పి. పుల్లయ్య దర్శకుడు. అప్పట్లో టిక్కెట్ ధరలు 25 పైసలు నుంచి ఒక రూపాయి ఉన్న కాలంలో ఈ సినిమా ఒక కోటి రూపాయలు వసూలు చేసి, ఆ ఘనత సాధించిన మొదటి తెలుగు సినిమాగా చరిత్ర పుటల్లో శాశ్వత స్థానం పొందింది. ఇదే ఏడాది రూపొందిన 'నర్తనశాల' అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన మొదటి తెలుగు చిత్రంగా పేరు తెచ్చుకుంది. జకార్తాలో జరిగి ఆఫ్రో ఏషియన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శితమైన ఈ సినిమాలో కీచకునిగా ఎస్వీ రంగారావు చూపించిన అభినయం ఆ ఫెస్టివల్ జ్యూరీ సభ్యుల్ని అమితంగా ఆకట్టుకుంది. అలా ఒక అంతర్జాతీయ సినిమా వేదికపై ఉత్తమ నటుడిగా అవార్డు పొందిన తొలి తెలుగు నటుడిగా చరిత్రలో నిలిచిపోయారు ఎస్వీఆర్.
తొలి సాంఘిక వర్ణ చిత్రం 1965లో వచ్చింది. అందరూ కొత్త తారలతో ఆదుర్తి సుబ్బారావు రూపొందించిన ఆ చిత్రం 'తేనె మనసులు'. అదివరకు 'పదండి ముందుకు'లో చిన్న పాత్రలో కనిపించిన కృష్ణ హీరోగా పరిచయమయ్యింది దానితోటే. అంతదాకా జానపద, పౌరాణిక, కుటుంబ కథా చిత్రాలు రాజ్యం చేస్తూ ఉంటే 'గూఢచారి 116'తో యాక్షన్ సినిమాల ట్రెండ్ మొదలైంది. కృష్ణ నటించిన ఈ సినిమా భారత చలన చిత్రసీమలోనే తొలి జేమ్స్‌బాండ్ తరహా సినిమాగా రికార్డులకెక్కింది. ఈ చిత్రకథ ఆరుద్ర కలం నుంచి వెలువడటం మరో విశేషం. ఆ తర్వాత కాలంలో ప్రేమకథా చిత్రాలు, యాక్షన్ సినిమాలు సమాన ఆదరణ పొందుతూ వచ్చాయి. ఏడవ దశకంలో వీటి జోరు ఎక్కువగా కొనసాగుతుండగానే పాశ్చాత్య సినిమా ప్రభావం తెలుగు సీమకీ సోకింది. దాంతో పగ, ప్రతీకారం అంశాలతో సినిమాలు తీయడం మొదలై, అవే సినిమాకి తప్పనిసరి వస్తువుల కింద మారిపోయాయి. అయినప్పటికీ 'కాలం మారింది' (1972), 'చలిచీమలు' (1978) వంటి అభ్యుదయ చిత్రాలూ, 'తూర్పు వెళ్లే రైలు' (1979), 'నీడ' (1979) వంటి ప్రయోగాత్మక చిత్రాలూ కొన్ని వచ్చాయి. మొట్టమొదటి కౌబాయ్ సినిమా 'మోసగాళ్లకి మోసగాడు' (1971) వచ్చింది. యాదృచ్ఛికంగా ఈ సినిమాకి రచన చేసింది కూడా ఆరుద్రే. ఇందులో హీరోగా నటించిన కృష్ణ 1974లో సొంత నిర్మాణ సంస్థ పద్మాలయా స్టూడియోస్ పతాకంపై 'అల్లూరి సీతారామరాజు' చిత్రాన్ని నిర్మించి ఆ పాత్రలో తానే నటించించాడు. ఇది తెలుగులో పూర్తిస్థాయి తొలి సినిమా స్కోప్ సినిమాగా చరిత్రకెక్కింది. స్వాతంత్ర్య పోరాట నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద ఘన విజయం సాధించింది.
ఈ దశకంలోనూ కొన్ని పౌరాణిక చిత్రాలు వచ్చాయి. ఎన్టీ రామారావు స్వయంగా దర్శకత్వం వహించి మూడు పాత్రల్లో (కర్ణుడు, కృష్ణుడు, దుర్యోధనుడు) నటించిన 'దాన వీర శూర కర్ణ' (1977) కలెక్షన్ల వర్షంలో తడిసింది. కేవలం రూ. 10 లక్షల వ్యయంతో నిర్మించిన ఈ సినిమా ఏకంగా రూ. కోటి వసూలు చేసిందంటే ఈ చిత్రానిది ఏ స్థాయి విజయమో గ్రహించవచ్చు. మహా భారతంలో దుష్ట పాత్రలుగా చిత్రీకరణకు గురైన కర్ణ, దుర్యోధన పాత్రలను కొత్త కోణంలో చూపించి, ఆ పాత్రలకి హీరో ఇమేజ్ తెచ్చిన ఘనత నిస్సందేహంగా ఎన్టీఆర్‌దే.
ఇక ఎనిమిదో దశకంలో తెలుగు సినిమా పూర్తిగా వాణిజ్యమయమై పోయింది. డాన్సులూ, ఫైట్లూ లేకపోతే సినిమా జనంలోకి పోదన్న అభిప్రాయానికి వచ్చారు నిర్మాతలూ, దర్శకులూ. బూతు మాటలు, శృంగార సన్నివేశాలు ఉన్న సినిమాలు తామరతంపరగా వచ్చాయి. క్లబ్ డాన్సు అనేది సినిమాకి తప్పనిసరి అంశమైంది.
ఏడవ దశకం ద్వితీయార్ధంలో నటుడిగా రంగ ప్రవేశం చేసిన చిరంజీవి హీరోగా మారి నిలదొక్కుకుంటున్న సమయంలో 'ఖైదీ' (1983) అతడి స్థాయిని అనూహ్యంగా పెంచేసింది. యాక్షన్ సినిమాల్లో 'ఖైదీ' సరికొత్త ధోరణికి తెరతీసింది. హీరోల పరంగా నృత్యాలకు అక్కినేని ఆద్యుడైనా, వాటికి ఎక్కువ ప్రాచుర్యం వచ్చింది చిరంజీవి వల్లనే. ఓ వైపు యాక్షన్ సినిమాలు వెల్లువగా వస్తుంటే, మరోవైపు కొద్ది సంఖ్యలోనైనా కళాత్మక విలువలున్న సినిమాలు వచ్చాయి. కె. విశ్వనాథ్ 'శంకరాభరణం' (1980) తెలుగు చిత్రసీమకి ఏనాటికైనా గర్వంగా చెప్పుకోదగ్గ కళాఖండంగా చరిత్రలో నిలిచింది. శాస్త్రీయ సంగీతమే హీరోగా తీసిన ఈ సినిమాలో ఒక సదాచార బ్రాహ్మణ సంగీత విద్వాంసునికీ, ఒక కళావంతుల కుటుంబానికి చెందిన స్త్రీకీ మధ్య అమలిన అనుబంధాన్ని విశ్వనాథ్ చూపించిన తీరు దేశ విదేశాల్లో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అక్కినేనితో దాసరి నారాయణరావు తీసిన 'మేఘసందేశం' (1982) కూడా ఈ కోవలోకే వస్తుంది. ఈ దశకంలోనే 'యువతరం కదిలింది' (1980), 'ఎర్రమల్లెలు' (1981), 'విప్లవ శంఖం' (1982) వంటి విప్లవ కథాంశ చిత్రాలు కూడా వచ్చాయి. అభ్యుదయ చిత్రాల సృష్టికర్తగా టి. కృష్ణ 'నేటి భారతం', 'దేశంలో దొంగలు పడ్డారు', 'దేవాలయం', 'వందేమాతరం', 'ప్రతిఘటన', 'రేపటి పౌరులు' అనే ఆరు చిత్రాలే తీసినా శాశ్వత కీర్తిని సముపార్జించుకున్నాడు.
ఎన్టీఆర్ వారసునిగా అంతకుముందే హీరోగా బాలకృష్ణ ప్రవేశిస్తే 80లలో మరింతమంది తండ్రులకి వారసులుగా చిత్రరంగ ప్రవేశం చేశారు. నాగేశ్వరరావు కొడుకు నాగార్జున, కృష్ణ కొడుకులు రమేశ్, మహేశ్, అగ్ర నిర్మాతల్లో రామానాయుడి కుమారుడు వెంకటేశ్, వి.బి. రాజేంద్రప్రసాద్ తనయుడు జగపతిబాబు హీరోలుగా అడుగుపెట్టారు. తెలుగు సినిమా చరిత్రలో తనపేరిట ఓ యుగాన్ని సృష్టించుకున్న ఎన్టీఆర్ రాజకీయాల్లో అడుగుపెట్టి తెలుగుదేశం పార్టీని స్థాపించి, అతి స్వల్ప కాలంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని కూడా అధిష్టించారు. ఆ తర్వాత కూడా ఆయన మూడు సినిమాల్లో నటించారు. తెలుగులో మొదటి 70 ఎం.ఎం. సినిమా 'సింహాసనం' (1986) కూడా ఈ దశకంలోనే వచ్చింది.
ఆ తర్వాత తెలుగులో కొత్త రక్తం మొదలైంది. ఎంతోమంది నవ యువ దర్శకులు తమ ప్రతిభని ప్రదర్శించడంతో పాత తరం దర్శకులు చాలమంది రిటైరయ్యే పరిస్థితి వచ్చింది. వస్తూనే భారీ సంచలనం సృష్టించాడు రాంగోపాల్ వర్మ. అతడి దర్శకత్వంలో వచ్చిన తొలి సినిమా 'శివ' కలెక్షన్ల వర్షం కురిపించడమే కాకుండా సాంకేతిక విలువల్లో కొత్త అధ్యాయానికి నాంది పలికింది. అయితే ఆ సినిమా యువతపై చేదు ప్రభావాన్ని కలిగించిందనే విమర్శలు ఉన్నాయి. 'శివ'తో వయొలెన్స్ కొత్తపుంతలు తొక్కింది. వరుసబెట్టి హింసాత్మక కథలతో సినిమాలు వచ్చిపడ్డాయి. కథకంటే కథనానికి ప్రాముఖ్యం హెచ్చింది. టెక్నికల్ అంశాలపై శ్రద్ధ పెరిగింది. కథల విషయంలో అప్పటికీ ఇప్పటికీ స్పష్టమైన తేడా ఉంటోంది. అప్పట్లో ఏదైనా కథని సినిమాగా తీయాలంటే దర్శకులు, నటులు, రచయితలు అందరూ కలిసి సమావేశమై చర్చించుకొని అందరూ కలిసే కథని నిర్ణయించేవాళ్లు. ఇప్పుడా వాతావరణం మచ్చుకి కూడా కనిపించదు. ఎనిమిదో దశకం నుంచే హీరోనిబట్టి కథలు తయారుచెయ్యడం మొదలైంది. ఇప్పటికీ అదే స్థితి. గతంలో సినిమా ఫెయిల్యూర్ అయితే దానికి కారణం సమష్టి లోపమేనని ఒప్పుకునేవాళ్లు. ఇప్పుడైతే సినిమా ఫ్లాప్ అయ్యిందంటే దర్శకుడి మీదకో, నటుల మీదకో, అదీ కాదంటే సంగీతం మీదకో నెపం నెట్టేస్తున్నారు.
ఇతర భాషా చిత్రాలతో పోలిస్తే వాసి విషయంలో మనం చాలా వెనుకంజలో ఉన్నామన్నది నిజం. మన పొరుగునే ఉన్న మలయాళ సినిమాలు దేశంలో అత్యుత్తమ చిత్రాలుగా ఎక్కువ భాగం ప్రశంసలకి నోచుకుంటున్నాయి. తమిళంలోనూ ఇటీవలి కాలంలో మంచి మంచి సినిమాలు వస్తున్నాయి. తెలుగు సినిమానే దుస్థితిలో ఉన్నట్లు కనిపిస్తోంది. ఇటీవల 'పెళ్లి' నేపథ్యంలో వచ్చిన ఓ సినిమా మంచి హిట్టవడంతో అదే మూసలో చిత్రాలు వస్తున్నాయి. ఒక విప్లవ కథాచిత్రం బాగా ఆడితే అదే తరహా చిత్రాల్ని తీస్తున్నారు. ఇదంతా ట్రెండుని క్యాష్ చేసుకోవడం తప్ప వాటితో చిత్రాలు తీసేవారికి చిత్తశుద్ధి ఉందంటే నమ్మలేం. ఓ దశాబ్దం నుంచి వస్తున్న చిత్రాల్లో మానవతా విలువలు చాలా అరుదుగా కనిపిస్తున్నాయి. వికారమైన చేష్టలు, జుగుప్స కలిగించే డాన్సులు, రౌడీలు, గూండాలు హీరోలుగా చలామణీ అవడం ఇప్పటి ఫ్యాషన్. మిగతా అన్ని రంగాలతో పోలిస్తే పురుషాధిక్యం ఎక్కువగా రాజ్యమేలుతున్న చిత్రసీమలో హీరోయిన్ల స్థితి మరీ తీసికట్టుగా తయారైంది. వ్యాంప్ కేరక్టర్ల అవసరం లేకుండా హీరోయిన్లతోనే వ్యాంప్ చేసే చేష్టలన్నీ చేయిస్తున్నారు దర్శకులు. పాటల్లో హీరో హీరోయిన్ల నడుము  కదలికలు చూస్తుంటే మనం దాన్ని ఆస్వాదించాలో, అసహ్యించుకోవాలో అర్థం కాదు. అట్లాంటి సన్నివేశాలకే థియేటర్లో ఈలలు, చప్పట్లు! మన అభిరుచి స్థాయి అలా ఉంది మరి. వీటినే ఆశీర్వచనాలుగా నమ్ముతున్న నిర్మాతలు అట్లాంటి చిత్రాల నిర్మాణానికే మొగ్గు చూపుతున్నారు. ఆధునిక ధోరణుల్నీ, వేగాన్నీ ఇష్టపడుతున్న ఇప్పటి యువతకి ఇట్లాంటి సినిమాలు కావలసినంత వినోదాన్ని ఇస్తున్నప్పటికీ మంచి కంటే చెడే త్వరగా ఆదరణ పొందుతుందనే సత్యాన్ని సినీ పరిశ్రమకారులు విస్మరించకూడదు. ఆడవాళ్లని ఏడ్పించడమే మగవాడి జన్మహక్కుగా చిత్రించడం, ఎంత ఏడ్పించినా ఏమీ అనని హీరోయిన్లనీ, భర్త ఎంత హింసించినా సహించే భార్యల్నీ మంచివాళ్లుగా చిత్రిస్తూ సినిమాలు తీస్తున్నారు. ఇది సాంస్కృతిక వినాశనానికి దారితీసే ప్రమాదం ఉంది.
అట్లా అని తెలుగు సినిమా పూర్తిగా దిగజారిపోలేదు. కొద్దిమంది అయినా యువతరం దర్శకులు వాస్తవిక అంశాలతో చిత్రాలు తీస్తూ ప్రశంసలందుకుంటున్నారు. ఆధునిక సాంకేతిక విజ్ఞానం తెలుగు చిత్ర రంగాన్ని మార్పుకు గురిచేస్తోంది. ఈ స్వాతంత్ర్య స్వర్ణోత్సవ సమయంలోనైనా సినిమా కేవలం వినోదాన్ని అందించే రంగంగానే కాకుండా ఆలోచింపజేసే మీడియా అనే ధోరణి చిత్రసీమలో వ్యాపించాల్సి ఉంది. అప్పుడే విమర్శకి నిల్చే స్థాయికి తెలుగు సినిమా చేరుకునే వీలుంటుంది.
- స్వాతంత్ర్య స్వర్ణోత్సవం సందర్భంగా 
ఆంధ్రభూమి 'వెన్నెల' 15 ఆగస్ట్ 1997

Tuesday, November 1, 2011

జెనీలియాని జనం ఇష్టపడతారా?

అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించిన 'సత్యం' (2003)తో గ్రాండ్‌గా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన జెనీలియాకి రాం సరసన నటించిన 'రెడీ' తర్వాత మరో హిట్ దక్కలేదు. 'శశిరేఖా పరిణయం', 'కథ', 'ఆరంజ్' సినిమాలు ఫట్టయ్యాయి. ప్రస్తుతం ఆమె తెలుగులో ఒకే సినిమా రానా సరసన 'నా ఇష్టం' చేస్తోంది. ఇదివరకు 'సింహా' వంటి సూపర్ హిట్ సినిమా నిర్మించిన యునైటెడ్ మూవీస్ సంస్థ ఈ సినిమాని నిర్మిస్తుండగా ప్రకాశ్ తోలేటి డైరెక్టర్‌గా పరిచయమవుతున్నాడు. వాస్తవానికి 'నా ఇష్టం' అనేది రాంగోపాల్‌వర్మ రాసిన పుస్తకం పేరు. ఆ పేరుని క్లాప్‌బోర్డ్ ప్రొడక్షన్స్ బేనర్‌పై జోగినాయుడు ఫిలించాంబర్ వద్ద రిజిస్టర్ చేశాడు. అల్లరి నరేశ్ హీరోగా, పరశురాం డైరెక్షన్‌లో ఆ పేరుతో సినిమాని తీయాలని ఆయన అనుకున్నాడు. కానీ ఆ ప్రాజెక్టు వాస్తవ రూపం దాల్చకపోవడంతో టైటిల్‌ని యునైటెడ్ మూవీస్ అధినేత పరుచూరి శివరామప్రసాద్‌కి ఇచ్చేశాడు. ఈ సినిమాలో మీసాలు తీసేసి కొత్తగా కనిపిస్తున్నాడు రానా. అతనితో జెనీలియా జోడీ ఎలా ఉంటుందనే ఆసక్తి చాలామందిలో వ్యక్తమవుతోంది. 'బొమ్మరిల్లు', 'ఢీ', 'రెడీ' విజయాలతో టాప్ స్లాట్‌లోకి వస్తుందనుకున్న జెనీలియా హఠాత్తుగా వెనుకంజ వేయడం చిత్రమే. ముఖ్యంగా కృష్ణవంశీ తీసిన 'శశిరేఖా పరిణయం', 'భాస్కర్ తీసిన 'ఆరంజ్' సినిమాల్లో ఆమె ఓవరాక్షన్ ప్రేక్షకులకి చికాకు తెప్పించింది. దానివల్లే ఆమెకు తెలుగులో అవకాశాలు తగ్గాయనే అభిప్రాయం ఉంది. ఇప్పుడు 'నా ఇష్టం'లో ఆమె నటన ఎలా ఉంటుందో వేచిచూడాలి. ఈ సినిమా అటు రానాకీ, ఇటు జెనీలియాకీ కీలకమే. చూద్దాం ఏమవుతుందో...

Monday, September 26, 2011

న్యూస్: 'బెజవాడ'తో టాలీవుడ్‌పై అమల కన్ను

ప్రభు సాల్మన్ డైరెక్ట్ చేసిన తమిళ సినిమా 'మైనా' (తెలుగులో ఇది 'ప్రేమఖైదీ'గా వచ్చింది)తో పరిచయమై, టైటిల్ పాత్రలో తన నటనతో ఆకట్టుకున్న కేరళ కుట్టి అమలా పాల్ టాలీవుడ్‌లో తొలి సినిమాతోటే అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఆ సినిమా 'బెజవాడ'. రాంగోపాల్‌వర్మ నిర్మాణంలో తయారవుతున్న ఈ సినిమాలో నాగచైతన్య జోడీగా నటిస్తోంది అమల. నాగచైతన్య సవతితల్లి పేరు అమల కావడం ఇక్కడ యాదృచ్ఛికం. కాగా 'బెజవాడ' సినిమా ఒకప్పుడు బెజవాడని తమ ఆధిపత్య పోరాటంలో భాగంగా చేసిన వంగవీటి, దేవినేని కుటుంబాల కథగా ప్రచారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో వంగవీటి రంగా, రత్నకుమారి ప్రేమ కోణం కూడా ఉంది. అంటే ఇప్పుడు నాగచైతన్య, అమల చేస్తున్న పాత్రలు రంగా, రత్నకుమారి పాత్రల్ని పోలి ఉంటాయని చెప్పుకుంటున్నారు. వారి మధ్య రెండు డ్యూయెట్లని కూడా తీస్తున్నారు. అది కూడా స్విట్జర్లాండ్, ఇటలీ, ఒమన్ వంటి విదేశీ లొకేషన్లలో. సెప్టెంబర్ 15 నుంచి తీస్తున్న ఈ పాటల్ని 25కి పూర్తిచేస్తారు. వివేక్‌కృష్ణ డైరెక్టర్‌గా పరిచయమవుతున్న ఈ సినిమాని దీపావళికి రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా హిట్టయితే అమల తమిళంతో పాటు తెలుగులోనూ బిజీ హీరోయిన్ అయ్యే అవకాశాలున్నాయి.

Saturday, September 3, 2011

న్యూస్: 'బెజవాడ' గొడవ రాముకే తెలుసు!

మొత్తానికి 'బెజవాడ రౌడీలు' టైటిల్ పేరు కుదించుకుపోయి 'బెజవాడ'గా మారిపోయింది. 'బెజవాడ రౌడీలు' అనే టైటిల్ ప్రకటన వచ్చినప్పట్నించీ విజయవాడకు చెందిన వివిధ పార్టీల రాజకీయ నాయకులు, సామాజిక కార్యకర్తలు ఆ టైటిల్ పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. అయితే ఆ సినిమా నిర్మాత రాంగోపాల్‌వర్మ మాత్రం ఆరునూరైనా టైటిల్ మార్చేదిలేదని ఇప్పటిదాకా భీష్మించారు. నాగచైతన్య, అమలా పాల్ ('ప్రేమఖైదీ' ఫేం) జంటగా నటిస్తున్న ఈ సినిమా ద్వారా వివేక్‌కృష్ణ డైరెక్టర్‌గా పరిచయమవుతున్నాడు. ఈ సినిమాలో "ఈ బెజవాడ నాదిరా" అనే డైలాగ్ అదిరిపోతుందని రాము చెబుతున్నాడు. వివేక్‌కృష్ణ "రాముగారు 'బెజవాడ' సినిమాని ఎంతో ఇష్టపడి తీస్తున్నారు. దుర్గమ్మ-కృష్ణమ్మ ఉన్న బెజవాడ ప్రశాంతంగా ఉన్నప్పుడు ఎంత అందంగా కనిపిస్తుందో, కోపంగా ఉన్నప్పుడు అంత రౌద్రంగా ఉంటూ ప్రళయం సృష్టిస్తుంది. అది బెజవాడలో ఉన్న ఎమోషన్. బెజవాడని ఓ కేరక్టర్‌గా తీసుకుని చేస్తున్న సినిమా ఇది. నాగచైతన్య హీరోయిజాన్ని పూర్తిగా చూపించే సినిమా 'బెజవాడ'. నాలా ఫస్ట్ టైం డైరెక్టర్‌కి నాగచైతన్య బెస్ట్ చాయిస్" అని చెప్పాడు. అక్టోబర్ చివరి వారంలో అంటే దీపావళికి ఈ సినిమాని రిలీజ్ చెయ్యాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.
అయితే ఇప్పుడు హఠాత్తుగా టైటిల్‌ని 'బెజవాడ'గా ఎందుకు మార్చినట్లు? "అనేకానేక కారణల వల్ల 'బెజవాడ రౌడీలు' పేరును 'బెజవాడ'గా మార్చడం జరిగింది. ఆ కారణాలు ఏమిటని ఎవరెవరు ఏమేమి ఊహాగానాలు చేసుకున్నా అసలు కారణం నా ఒక్కడికే తెలుసు. కానీ ఆ కారణం ఏమిటన్నది నేను ఎప్పటికీ చెప్పను" అని చెప్పుకొచ్చారు రాము. ఆ కారణం ఆయన ఎప్పటికీ చెప్పకపోయినా జనానికి తెలుసు. "అసలు కారణం నా ఒక్కడికే తెలుసు" అని ఆయన ఎంత చెప్పినా సినిమా పేరు మార్చకపోతే దాన్ని విడుదల కానివ్వమని విజయవాడ జనం ప్రతిన పట్టడంతోనే ఆయన దిగివచ్చి టైటిల్ మార్చారని అంతా నమ్ముతున్నారు. దీనికోసం వాళ్లేమీ ఊహాగానాలు చేయాల్సిన పనిలేదు. కానీ ఆ సంగతి ఒప్పుకుంటే రాంగోపాల్‌వర్మ ఎందుకవుతాడు? అందుకనే టైటిల్ మార్చడానికి గల కారణం తనకొక్కడికే తెలుసని సర్దిచెప్పుకుంటున్నాడు. అంతే!

Thursday, August 25, 2011

ఇంటర్వ్యూ: జె.డి. చక్రవర్తి

"ఖాన్‌దాదాగా బ్రహ్మానందం విశ్వరూపం చూపించారు. ఈ సినిమాని నేనెలా ప్రేమించానో, ఆయనా అంతగా ప్రేమించారు. అయితే ఆయన వల్ల నాకు నష్టం జరిగింది'' అని చెప్పారు జె.డి. చక్రవర్తి. చక్రవర్తి ప్రొడక్షన్స్, ఫస్ట్ చాయిస్ మీడియా హౌస్ సంయుక్తంగా నిర్మించిన 'మనీ మనీ మోర్ మనీ' చిత్రానికి ఆయన దర్శకత్వం వహించడంతో పాటు ఓ కీలక పాత్రనీ చేశారు. కె. సత్యనారాయణ నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రం ఈ నెల 26న విడుదలవుతున్న సందర్భంగా చక్రవర్తి చెప్పిన విశేషాలు ఆయన మాటల్లోనే...
ఎంత పబ్లిసిటీ చేసినా ప్రేక్షకులు ముందే నిర్ణయించుకుంటారండీ. వాళ్లకి ఆ సినిమా మీద ఇంటరెస్ట్ ఉండాలి. అంతే. సినిమా బాగుందనే టాకే వాళ్లని థియేటర్లకి తీసుకువస్తుంది. కొన్ని సినిమాలకి ఎంత పబ్లిసిటీ ఇచ్చినా జనం రారు. కొన్నింటికి పెద్దగా లేకపోయినా జనం చూస్తారు.
ఇది స్క్రీన్‌ప్లే సీక్వెల్
ఇది సీక్వెలే కానీ మునుపటి వాటిలాంటి సినిమా కాదు. ఇది స్టోరీ సీక్వెల్ కాదు, స్క్రీన్‌ప్లే సీక్వెల్. 'మనీ' నుంచి కొన్ని పాత్రలు తీసుకున్నా. వాటి ప్రోగ్రెస్ ఉంటుంది కానీ కథ కొత్తది. ఈ కథ 2009లో మొదలవుతుంది. రియల్ ఎస్టేట్‌లో బాగా సంపాదించిన ఖాన్‌దాదా 2011కు వచ్చేసరికి డబ్బంతా పోగొట్టుకుని ఉంటాడు. కాకపోతే జూబ్లీహిల్స్‌లో అతనికి పెద్ద ఇల్లుంటుంది. అప్పులపాలై దాన్ని అమ్మేసుకుందామని అనుకుంటుంటాడు. ఆ టైమ్‌లో నలుగురు వ్యక్తులు అతని ఇంట్లో ప్రవేశించి, అతన్ని ఎలా ఆడుకున్నారనేదే కథ. ఆ తర్వాత ఆ ఇంట్లోకి ఎంతోమంది వస్తారు. వాళ్లందరి నుంచీ ఎదురైన సమస్యని ఖాన్‌దాదా ఎలా పరిష్కరించుకున్నాడనేది క్లైమాక్స్. ఖాన్‌దాదా ఇంట్లో ప్రవేశించే నలుగురు కిడ్నాపర్లుగా నేను, బ్రహ్మాజీ, ముకుల్‌దేవ్, కెవిన్ (మోడల్) నటించాం. ఇది కంప్లీట్ ఫ్యామిలీ ఫిల్మ్. డబుల్ మీనింగ్స్, అసభ్యకరమైన మాటలు, సన్నివేశాలు ఉండవు.
బ్రహ్మానందం విశ్వరూపం
ఈ సినిమాలో ఎవరూ కామెడీ చెయ్యరు. సందర్భాలే కామెడీని సృష్టిస్తాయి. ఖాన్‌దాదాగా బ్రహ్మానందం విశ్వరూపం చూపించారు. ఈ సినిమాని నేనెలా ప్రేమించానో, ఆయనా అంతగా ప్రేమించారు. అయితే ఆయన వల్ల నాకు నష్టం జరిగింది. ఎలాగంటే ఆయన నటిస్తున్నప్పుడు 'కట్' చెప్పడం మర్చిపోయేవాణ్ణి. అలా నెగటివ్ ఎక్కువ ఖర్చయింది. ఆయన నటనలో ఎన్ని కోణాలున్నాయో అప్పుడు అర్థమైంది. ఖాన్‌దాదా ఇంట్లో, అతని చుట్టూ తిరిగే కథ కాబట్టి ఫోకస్ అంతా ఆయనమీద ఉండటం సహజం.
వాటిని ఇష్టపడి చెయ్యలేదు
'హోమం', 'సిద్ధం' నా తరహా సినిమాలు కావు. వాటిని నేను ఇష్టపడి చెయ్యలేదు. నాకు కామెడీ ఇష్టం. అందుకే బాపు, కె. విశ్వనాథ్ సినిమాలకంటే రాఘవేంద్రరావు, జంధ్యాల సినిమాలు ఎక్కువ ఇష్టం. నిజానికి నవ్వించడం కష్టమైన ప్రక్రియ. 'మనీ మనీ మోర్ మనీ' నా తరహా సినిమా. మనం అన్ని సినిమాల్ని కాక కొన్ని సినిమాల్నే ఎంజాయ్ చేస్తాం. అలాగే నేను చేసిన వాటిలో కొన్నింటినే ఎంజాయ్ చేశా. 'కాశి', 'సూరి, 'సర్వం' (తమిళం) వంటివి సరిగా ఆడలేదు. కానీ వాటిని ఎంజాయ్ చేశా. 'ఎగిరే పావురమా', 'హోమం' వంటివాటిని నేను ఎంజాయ్ చెయ్యలేదు. ఇక్కడ ఎంజాయ్ చెయ్యడమనేది ఆ సినిమా మేకింగ్‌కి సంబంధించింది. ఇప్పుడు 'మనీ మనీ మోర్ మనీ' మేకింగ్‌ని బాగా ఎంజాయ్ చేశా.
ఇదే తొలిసారి
ఒక సినిమాకి సీక్వెల్ రావడమనేది నాకు తెలిసి దేశం మొత్తం మీద 'మనీ మనీ'తోటే మొదలు. ఇప్పుడు సెకండ్ సీక్వెల్ రావడం ఇదే తొలిసారి. తొలి రెండు సినిమాలకి దర్శకుడు శివనాగేశ్వరరావు. నేను 'మనీ మనీ మోర్ మనీ' టైటిల్ రిజిస్టర్ చేసిన రెండు రోజులకి ఆయన నుంచి ఫోన్ వచ్చింది. 'మనీ మనీ మోర్ మనీ'తో ఇంకో సినిమా చేద్దామనుకుంటున్నానని ఆయన చెప్పారు. నేను నవ్వేసి, ఆల్రెడీ టైటిల్ రిజిస్టర్ చేశాననీ, సినిమా స్టార్ట్ చేస్తున్నాననీ చెప్పా. ఆయన 'ఆల్ ద బెస్ట్' చెప్పారు.
నాది బాధ్యతారాహిత్యం
నా కెరీర్‌కి నాదే బాధ్యత. తెలుగులో వరుసగా మంచి హిట్లిచ్చి బూమ్‌లో ఉండగా రాము గారు (రాంగోపాల్‌వర్మ) రమ్మనగానే ఇక్కడన్నీ వదిలేసి బాంబే వెళ్లిపోయా. 'సత్య' సినిమా చేశా. ఆయన దగ్గరే ఉన్నా. ఇదంతా పరిణతి లేక, బాధ్యతారాహిత్యంతో చేసింది. నా కెరీర్‌ని ఎలా మలచుకోవాలన్నది నా చేతిలో పని. కానీ నేనప్పుడు అలా చెయ్యలేదు. అయితే జరిగినదానికి నేనేమీ బాధపడట్లేదు.

Tuesday, August 23, 2011

న్యూస్: కామెడీతో 'మనీ మనీ మోర్ మనీ' వస్తుందా?

గురువు రాంగోపాల్‌వర్మ్‌తో పోలిస్తే జె.డి. చక్రవర్తికి ఎన్నో పోలికలు కనిపిస్తాయి. దెయ్యాలు, భూతాల మీదా, గేంగ్‌స్టర్ల మీదా కథలల్లి సినిమాలు తియ్యడం వాటిలో ఒకటి. అయితే కొన్ని ఇతర అంశాల విషయాలకొస్తే ఇద్దరికీ ఏమాత్రం పొంతన కుదరదు. 'నిశ్శబ్ద్', 'అప్పల్రాజు' లాంటి సినిమాల్ని తానెన్నటికీ తీయనంటాడు జేడీ. వర్మ పని రాక్షసుడూ, కుటుంబ అనుబంధాలకు అతీతుడూ అయితే, జేడీ ఎమోషనల్ మేన్. రాత్రి 7.30 గంటల తర్వాత ఇంటికి వెళ్లకుండా అతణ్ణి ఏ శక్తీ ఆపలేదు. ఎందుకంటే అమ్మకోసం. ఇటీవలి కాలంలో వర్మ చాలా వివాదాల్లో ఇరుక్కొని, మీడియాలో వార్తల్లో వ్యక్తిగా నిలుస్తున్నా వర్మని తాను తొలిసారి చూసినప్పటికీ, ఇప్పటికీ ఆయనలో తనకి కనిపించిన మార్పేమీ లేదంటాడు జేడీ. తన తోటివాళ్లంతా ఫేస్‌బుక్‌లోనో, ట్విట్టర్ ద్వారానో తమ భావాల్ని పంచుకుంటుంటే అతను మాత్రం వాటికి చాలా దూరంగా ఉంటున్నాడు. తనెప్పుడు ఏం చేసేదీ జనానికి తెలియాల్సిన పని లేదనేది అతడి సమాధానం. ప్రస్తుతం అతను 'మనీ మనీ మోర్ మానీ' అనే తెలుగు సినిమా డైరెక్షన్‌లో మునిగి ఉన్నాడు. ఇది 'మనీ'కి రెండో సీక్వెల్ అనీ, అయితే ఇది కొత్త కథనీ అతను తెలిపాడు. ఇదివరకటి సినిమాల్లో నటించిన బ్రహ్మానందం, బ్రహ్మాజీ ఈ సినిమాలోనూ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. "ఖాన్‌దాదా (బ్రహ్మానందం) కరాటేలో బ్లాక్‌బెల్ట్ హోల్డర్. రియల్ ఎస్టేట్ బూంలో బాగా సంపాదించిన ఖాన్‌దాదా జూబ్లీహిల్స్‌లో మంచి ఇల్లు కొనుక్కుంటాడు. అయితే 2011కి వచ్చేసరికి అప్పులపాలై ఇల్లు అమ్మకానికి పెట్టాలనుకుంటాడు. ఆ టైంలో అతనింట్లోకి నలుగురు కిడ్నాపర్లు ప్రవేశించి అతనితో ఎలా ఆడుకున్నారనేదే కథ.ఈ సినిమా కథ బ్రహ్మానందం చుట్టూ నడుస్తుంది. ఆయన లేకుండా ఈ సినిమాని మెప్పించలేను. బ్రహ్మానందం విశ్వరూపం ఇందులో కనిపిస్తుంది" అని చెప్పాడు జేడీ. ముందటి సినిమాల్లో బ్రహ్మానందం మీద తీసిన 'భద్రం బే కేర్‌ఫుల్ బ్రదరూ', 'వారెవా యేమి ఫేసు' మాదిరిగానే ఈ సినిమాలోనూ బ్రహ్మానందంపై ఓ పాటని అతను తీశాడు. 'హోమం', 'సిద్ధం' వంటి యాక్షన్ సినిమాల్ని జగపతిబాబుతో తీసిన జేడీ ఇప్పుడు బాణా మార్చి కామెడీతో ప్రేక్షకుల్ని ఆకట్టుకోవాలని ఆశిస్తున్నాడు. అతని ప్రయత్నం ఫలిస్తుందా?

Tuesday, August 16, 2011

న్యూస్: రానా, జెనీలియా జంట ఆకట్టుకుంటుందా?

దగ్గుబాటి రానా ఇప్పుడు రెండు సినిమాల్లో నటిస్తున్నాడు. ఒకటి తెలుగు సినిమా 'నా ఇష్టం' అయితే, మరొకటి హిందీ సినిమా 'డిపార్ట్‌మెంట్'. వీటిలో రెండోదాన్ని రాంగోపాల్‌వర్మ డైరెక్ట్ చేస్తుండటం విశేషం. గమనించదగ్గ సంగతేమంటే రానా 'నా ఇష్టం' టైటిల్ వర్మ రాసిన పుస్తకం 'నా ఇష్టం' పేరే కావడం. ఇందులో రానా సరసన బక్క పలుచని భామ జెనీలియా నటిస్తోంది. ఈ సినిమాలో ఇదివరకు కనిపించిన దానికి భిన్నంగా మీసం లేకుండా లవర్ బాయ్ రోల్‌లో కనిపించనున్నాడు రానా. సుకుమార్, బొమ్మరిల్లు భాస్కర్ వద్ద అసోసియేట్‌గా పనిచేసిన ప్రకాష్ తోలేటి ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. 'సింహా' వంటి సూపర్‌హిట్ మూవీ తర్వాత యునైటెడ్ మూవీస్ నిర్మిస్తుండటంతో 'నా ఇష్టం'పై అంచనాలు బాగానే ఉన్నాయి. చక్రి మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా కథ ఎక్కువగా మలేషియా బ్యాక్‌డ్రాప్‌లో నడుస్తుంది. 'లీడర్', 'నేను నా రాక్షసి', బాలీవుడ్ సినిమా 'దం మారో దం' బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడంతో 'నా ఇష్టం' మీద చాలా ఆశలే పెట్టుకున్నాడు రానా. మరి రానా, జెనీలియా జోడీని జనం ఆదరిస్తారా? వెయిట్ అండ్ సీ.

Thursday, August 11, 2011

ఇంటర్వ్యూ: దగ్గుబాటి రామానాయుడు

"నిజానికి ఇతర భాషల్లో సినిమాలు తీసి ఆర్థికంగా పోగొట్టుకున్నానే కానీ లాభపడలేదు. ఈ విషయంలో నా ఇద్దరు కొడుకులూ నన్నెప్పుడూ తప్పు పట్టలేదు. ఆ విషయంలో నేను అదృష్టవంతుణ్ణి'' అని ఒకింత ఉద్వేగంగా చెప్పారు సీనియర్ ప్రొడ్యూసర్ డాక్టర్ దగ్గుబాటి రామానాయుడు. నవదీప్, అవసరాల శ్రీనివాస్, రాహుల్ హీరోలుగా; రీమాసేన్, శ్రద్ధాదాస్, సంజన, సౌమ్య హీరోయిన్లుగా సురేశ్ ప్రొడక్షన్స్ పతాకంపై తాజాగా ఆయన నిర్మించిన చిత్రం 'ముగ్గురు'. వి.ఎన్. ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ చిత్రం చిత్రం ఈ నెల 19న విడుదలవుతున్న సందర్భంగా ప్రత్యేకంగా సంభాషించారు రామానాయుడు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే...

వైవిధ్యమైన కథతో రూపొందించిన వినోదాత్మక చిత్రం 'ముగ్గురు'. 2 గంటల 7 నిమిషాల సేపు ఆద్యంతం ఉత్కంఠభరితంగా సినిమా నడుస్తుంది. ఈమధ్య విడుదలైన ఆడియోకు వెరీగుడ్ రిపోర్ట్ వచ్చింది. ముఖ్యంగా టైటిల్ సాంగ్ చాలా బాగుందంటున్నారు. మొత్తం ఆరు పాటలు. ఇప్పటికే మా బేనర్‌లో చాలా సినిమాలు చేసిన కోటి ఈ సినిమాకీ మంచి మ్యూజిక్‌నిచ్చాడు. రచయితలు సాహిత్యం బాగా రాశారు. థియేటర్ ట్రైలర్స్‌కూ స్పందన బాగుంది. తమ పాత్రలకి ఆర్టిస్టులందరూ న్యాయం చేశారు. ముగ్గురు హీరోలు, హీరోయిన్లు హుషారుగా నటించారు. ఈ సినిమాని 37 రోజుల్లోనే పూర్తి చేశాం. అందులో 23 రోజులు మలేషియాలో షూటింగ్ చేశాం. నాలుగు రోజులు కారంచేడులో చిత్రీకరించాం.
ఆదిత్య బాగా తీశాడు
డైరెక్టర్ ఆదిత్య సినిమాని బాగా తెరకెక్కించాడు. అతను 'ప్రేమించుకుందాం రా'తో మరో రెండు మూడు సినిమాలకి మా బేనర్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. అతను సబ్జెక్ట్ చెప్పగానే బాగా నచ్చింది. చెప్పినదానికంటే బాగా తీశాడు. సాధారణంగా నా సినిమాని సెట్స్‌లో ఉండి గమనించడం అలవాటు కాబట్టి, ఆదిత్య ప్రతిభ ని సెట్స్ మీద చూశాను. వెరీగుడ్ డైరెక్టర్. నేను కథ బాగుంటేనే సినిమా తీస్తాను. ఇదివరకు కొన్ని సినిమాలు ఆడకపోవడానికి రకరకాల కారణాలున్నాయి. మునుపటి సినిమా 'ఆలస్యం అమృతం' కచ్చితంగా వంద రోజులు ఆడుతుందని తొలి కాపీ చూసినవాళ్లంతా అభిప్రాయపడ్డారు. చంద్రమహేశ్‌కి కచ్చితంగా హిట్ వస్తుందని ఆశించా. అయితే రాంగ్ టైమ్‌లో రిలీజ్ చెయ్యడం వల్లే అది ఆడలేదు.
అది విత్తనం, ఇది చెట్టు
ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడే ధైర్యంగా ఉండాలనీ, సక్సెస్ వచ్చినప్పుడు ఒదిగి ఉండాలనీ నేర్చుకున్నా కాబట్టి నేనెప్పుడూ ఫెయిల్యూర్స్‌కి భయపడలేదు. గతంలో 'ద్రోహి' ఫ్లాపయినప్పుడు ఆర్థికంగా కష్టాలు ఎదుర్కొన్నా. కె. బాపయ్యకి డైరెక్టర్‌గా అది తొలి చిత్రం. దానికి పెట్టిన పది లక్షలూ పోయాయి. ఆ తర్వాత అక్కినేని నాగేశ్వరరావు, వాణిశ్రీతో 'ప్రేమనగర్' ప్లాన్ చేశా. దానికి పదిహేను లక్షలు ఖర్చుపెట్టాం. ఆ సినిమా జీవన్మరణ సమస్య. అది ఆడితే మద్రాసులోనే ఉంటాననీ, లేదంటే కేళంబాక్కం వెళ్లిపోతాననీ చెప్పా. ఎందుకంటే కేళంబాక్కంలో అప్పట్లో పొలాలు కొన్నా. అక్కడే వ్యవసాయం చేసుకోవాలనేది ఆలోచన. కారంచేడుకు మాత్రం పోకూడదనుకున్నా. ఎందుకంటే 'రామానాయుడు సినిమాల్లో అంతా పోగొట్టుకుని వచ్చేశాడురా' అనే మాటలు సొంతూరు వాళ్లనుంచి వినకూడదని. అయితే 'ప్రేమనగర్' పెద్ద హిట్టవడంతో కేళంబాక్కంకి వెళ్లాల్సిన పనిలేకపోయింది. అందుకే అంటుంటాను - మా సురేశ్ ప్రొడక్షన్స్‌కి 'రాముడు-భీముడు' విత్తనమైతే, 'ప్రేమగనర్' చెట్టు అని. ఈ రెండో సినిమాతో సినీ ఫీల్డ్‌లో నిలబడిపోయా. దాని హిందీ రీమేక్ 'ప్రేమనగర్'తో బాలీవుడ్‌లో అడుగుపెట్టి, అక్కడా సక్సెసయ్యా. అదే సినిమాని తమిళంలో 'వసంత మాళిగై'గా తీసి అక్కడా హిట్టుకొట్టా. ఆ తర్వాత కెరీర్‌లో కొన్ని ఆటుపోట్లు ఎదురైనా నేను చలించలేదు. ముందుకు సాగుతూ వచ్చా.
ఈ ఏడాదే పంజాబీ సినిమా
ఇప్పటికి పన్నెండు భారతీయ భాషల్లో సినిమాలు తీశా. పంజాబీలో కూడా సినిమా తీస్తే, అన్ని భారతీయ భాషా సినిమాల్ని తీసిన నిర్మాతగా పేరు సంపాదించుకుంటా. ఈ ఏడాదే పంజాబీలో సినిమా తీయబోతున్నా. నిజానికి ఇతర భాషల్లో సినిమాలు తీసి ఆర్థికంగా పోగొట్టుకున్నానే కానీ లాభపడలేదు. సినిమా మీద తపనతోటే ఆ భాషల్లోనూ మంచి సినిమాలు తీయాలనుకుని తీశా. ఈ విషయంలో నా ఇద్దరు కొడుకులూ నన్నెప్పుడూ తప్పు పట్టలేదు. ఆ విషయంలో నేను అదృష్టవంతుణ్ణి. పైగా వైజాగ్ స్టూడియోని చూసుకోవడానికి అక్కడకి వెళ్తానన్నా వాళ్లు ఒప్పుకోవడం లేదు. అందరం కలిసి ఇక్కడే ఉండాలని పట్టుబడుతున్నారు.
అన్ని రకాలుగా హ్యాపీ
తదుపరి సినిమాని భూపతిరాజా కథతో చెయ్యాలని అనుకుంటున్నా. అన్నీ కుదిరితే వెంకటేశ్ హీరోగా, ఆదిత్య దర్శకత్వంలో దాన్ని తీస్తా. ఆ తర్వాత నా మనవడు నాగచైతన్య హీరోగా వచ్చే ఏడాది జనవరి నుంచి మరో సినిమా ఉంటుంది. రానా హిందీలో బిజీ అయ్యేటట్లున్నాడు. ఇప్పుడక్కడ రాంగోపాల్‌వర్మ తీస్తున్న 'డిపార్ట్‌మెంట్'లో నటిస్తున్నాడు. సురేశ్‌బాబు మరో కొడుకు అభిరామ్ కూడా నటించేందుకు రెడీ అంటున్నాడు. రెండేళ్ల తర్వాత అతనూ హీరో అవుతాడు. 'మొదట మన బేనర్‌లోనే చేస్తా తాతా' అంటున్నాడు. నేను, నా తర్వాత నా కొడుకులు, ఇప్పుడు నా మనవళ్లు ఈ రంగంలోనే సక్సెస్ సాధించి, ముందుకెళుతుండటం ఎంతో సంతోషంగా అనిపిస్తుంటుంది. సినిమా రంగానికి సంబంధించి అత్యున్నత పురస్కారమైన దాదాసాహెబ్ ఫాల్కే అందుకున్నా. ఇక ప్రత్యేకంగా నేను సాధించాల్సిందంటూ ఏమీ లేదు.