Showing posts with label shankar. Show all posts
Showing posts with label shankar. Show all posts

Saturday, November 8, 2014

Cinema: Best Performances of Kamal Hassan

నడిచే నట పాఠశాల

భారతీయ చిత్రసీమలోని సమకాలీన నటుల్లో కమల్‌హాసన్ చేసినన్ని విలక్షణమైన, వైవిధ్యమైన పాత్రలు మరే నటుడూ చేయలేదనేది నిర్వివాదం. ఆయన వయసు అరవై అయితే, ఆయన సినీ కెరీర్ వయసు యాభై నాలుగేళ్లు. బాలనటునిగా కేవలం ఆరేళ్ల వయసులో నటించిన మొదటి సినిమాకే జాతీయ అవార్డు అందుకున్న ఘన చరిత్ర ఆయనది. అప్పట్నించీ ఇప్పటిదాకా ఆయన పోషించిన ఎన్నో పాత్రలు మన హృదయల్లో సుస్థిర స్థానాన్ని పొందాయి. పాత్రలో పరకాయ ప్రవేశం చేయడమంటే ఏమిటో ఇప్పటి నటులు ఆయనను చూసే నేర్చుకోవాలి. దక్షిణాదిన కానీ, ఉత్తరాదిన కానీ సూపర్‌స్టార్లు ఎంతోమంది ఉండోచ్చు కానీ, కమల్ వంటి గ్రేట్ యాక్టర్లు ఒకరిద్దరు కంటే కనిపించరు. నిజానికి కమల్‌కు సాటిరాగల నటుడు ఈ కాలంలో ఎవరున్నారనీ!

జాతీయ ఉత్తమ నటుడు 

1960లో వచ్చిన తమిళ చిత్రం 'కళత్తూర్ కన్నమ్మ' సినిమాతో ఆరేళ్ల వయసులో బాలనటునిగా పరిచయమయ్యారు కమల్. అందులో జంటగా నటించిన జెమినీ గణేశన్, సావిత్రి కొడుకు పాత్రను ఆయన పోషించారు. పసితనంలోనే తల్లిదండ్రులకు దూరమై అనాథాశ్రమంలో పెరిగిన పిల్లవాడిగా ఉన్నత స్థాయి నటనను ప్రదర్శించి ఉత్తమ బాలనటునిగా జాతీయ అవార్డు అందుకున్నారు కమల్. కథానాయకుడిగా ఎదిగాక ఆయన మరో మూడుసార్లు జాతీయ ఉత్తమ నటుడి అవార్డును పొందారు. వాటిలో మొదటిది 'మూండ్రం పిరై' (1982). బాలు మహేంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగులో 'వసంత కోకిల'గా అనువాదమైంది. రెండు భాషల ప్రేక్షకుల హృదయాలనూ పిండేసింది ఈ సినిమా. మతిస్థిమితం కోల్పోయిన శ్రీదేవికి అండగా నిలిచి, ఆమెకు అన్నీ తానై కంటికి రెప్పలా కాపాడి, ఆమె మామూలు మనిషయ్యాక తనను గుర్తుపట్టకపోతే విలవిల్లాడిపోయిన స్కూల్ టీచర్‌గా కమల్ ప్రదర్శించిన అభినయం అపూర్వం. రైల్వే స్టేషన్‌లో శ్రీదేవికి తానెవరో స్ఫురణకు రావాలనే ఉద్దేశంతో ఆమెకు ఇష్టమైన కోతి చేష్టలన్నీ చేస్తే, అతను మానసిక రోగి అయిన భిక్షగాడేమోనని ఆమె భావించే క్లైమాక్స్ సీన్ ఎంతటి కఠిన హృదయులనైనా కదిలించి వేస్తుంది. ఆ సన్నివేశం చూసి దు:ఖపడని వాళ్లు ఒక్కరూ లేరు. భారతీయ సినిమాలో ఓ క్లాసిక్‌గా పేరు తెచ్చుకున్న 'నాయకన్' (1987 - తెలుగులో 'నాయకుడు') ఆల్‌టైం 20 గ్రేటెస్ట్ ఇండియన్ ఫిలిమ్స్‌లో ఒకటిగా నిలిచింది. ఒకప్పటి బొంబాయి చీకటి సామ్రాజ్య చక్రవర్తి వరదరాజ మొదలియార్ జీవితం ప్రేరణతో మణిరత్నం రూపొందించిన ఈ చిత్రంలో కథానాయకుడు వేలు నాయకర్ పాత్రలో కమల్ నటనా విన్యాసాలు చూసి తీరాల్సిందే. ఈ పాత్రతో ఆయన మరోసారి ఉత్తమ నటునిగా జాతీయ అవార్డు అందుకునారు. ఆ అవార్డును ఆయన చివరిసారి అందుకున్న చిత్రం 'ఇండియన్' (1996 - తెలుగులో 'భారతీయుడు'). దేశంలో అన్ని రంగాల్లో వేళ్లూనుకుపోయిన అవినీతి, లంచగొండితనం నేపథ్యంలో శంకర్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో తండ్రీ కొడుకులుగా ద్విపాత్రలు పోషించారు కమల్. ప్రధానంగా స్వాతంత్ర్య సంగ్రామ కాలంలో ఇండియన్ నేషనల్ ఆర్మీలో పనిచేసిన సేనాపతి అనే డెబ్భై ఏళ్ల వృద్ధుడి పాత్రను ఆయన పోషించిన తీరు అనన్యసామాన్యం.

అమావాస్య చంద్రుడు 

కథానాయకుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతులు పొందిన తర్వాత కూడా ఇమేజ్ అనేదాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా, పాత్రల విషయంలో ఎన్నో ప్రయోగాలు చేశారు కమల్. ప్రధానంగా కె. బాలచందర్, కె. విశ్వనాథ్, సింగీతం శ్రీనివాసరావు వంటి దర్శకులు ఆయనలోని నటుణ్ణి ప్రపంచం ముందు గొప్పగా ప్రదర్శింపజేశారు. వందో చిత్రమంటే ఏ నటుడికైనా మైలురాయే. అలాంటి వందో చిత్రంలో ఏ హీరో గుడ్డివాని పాత్రతో రిస్క్ చేస్తాడు, కమల్ తప్ప! ఆ సినిమా 'రాజా పార్వై' (1981 - తెలుగులో 'అమావాస్య చంద్రుడు'). సింగీతం శ్రీనివాసరావు రూపొందించిన ఈ చిత్రంలో ఓ అందమైన క్రిస్టియన్ యువతి (మాధవి) ప్రేమలో పడిన అంధ వయొలినిస్ట్‌గా నటించి, మెప్పించారు కమల్. ఇక అదే దర్శకుడు తీసిన 'పుష్పక విమానం' (1987) గురించి చెప్పేదేముంది. 1930ల కాలంలోని మూకీ సినిమాల తరహాలో ఎలాంటి సంభాషణలూ లేకుండా పాత్రల సైగలతోటే నడిచే నిశ్శబ్ద చిత్రమిది. ఇందులో కమల్ ప్రదర్శించే హావభావాలు ఔత్సాహిక నటులకు పాఠాలు. సీఎన్ఎన్-ఐబీఎన్ రూపొందించిన వంద గొప్ప భారతీయ చిత్రాల జాబితాలో చోటు సంపాదించింది ఈ చిత్రం. సింగీతమే రూపొందించిన 'అపూర్వ సహోదరగళ్' (1989 - తెలుగులో 'విచిత్ర సోదరులు') బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. తను స్వయంగా నిర్మించిన ఇందులో తండ్రిగా, ఆయన ఇద్దరు కవల పిల్లలుగా త్రిపాత్రలు చేశారు  కమల్. ముఖ్యంగా తండ్రి మరణానికి కారకులైన వాళ్లపై పగతీర్చుకునే మరుగుజ్జు అప్పు పాత్రను ఆయన పోషించిన తీరు సినిమాకు హైలైట్. ఎలాంటి కంప్యూటర్ గ్రాఫిక్స్ లేకుండా మరుగుజ్జుగా కనిపిస్తూ నటించడానికి ఆయన పడిన విపరీతమైన కష్టం అనితర సాధ్యం.

సాగర ముత్యం 

కె. విశ్వనాథ్, కమల్ కాంబినేషన్ గొప్పగా రాణించింది. అందుకు చక్కని ఉదాహరణలు 'సాగర సంగమం' (1983), 'స్వాతిముత్యం' (1986). సంగీత నృత్య దృశ్యకావ్యంగా రూపొందిన 'సాగర సంగమం' సీఎన్ఎన్-ఐబీఎన్ వంద గొప్ప భారతీయ చిత్రాల్లో స్థానం పొందింది. శాస్త్రీయ నృత్యంలో నిష్ణాతుడైన బాలకృష్ణగా కమల్ అభినయం అసామాన్యం. నీళ్లబావిపై నిల్చుని ఆయన చేసే నాట్యం సినిమాకే హైలైట్. నడవలేని స్థితిలో వీల్‌చైర్‌లో కూర్చొని స్టేజిపై శైలజ నృత్యాన్ని చూస్తూ ఆయన చనిపోయే సన్నివేశం గుండెను బరువు చేసేస్తుంది. ఇక వయసు పెరిగినా, మెదడు ఎదగని శివయ్య అనే అమాయక గ్రామీణ యువకునిగా కమల్ నటించిన చిత్రం 'స్వాతిముత్యం'. దేశంలోనే తానెందుకు అత్యుత్తమ నటుడో మరోసారి ఆయన ప్రపంచానికి నిరూపించిన పాత్ర శివయ్య. ఈ సినిమా తర్వాత నిష్కల్మష హృదయుణ్ణి 'వాడు స్వాతిముత్యంరా' అనడం పరిపాటి అయ్యింది. అది ఆ పాత్ర, ఆ పాత్ర పోషణలో కమల్ సాధించిన విజయం.

మరో చరిత్ర 

కె. బాలచందర్ రూపొందించిన ప్రేమకావ్యం 'మరో చరిత్ర' (1978) టైటిల్‌కు న్యాయం చేస్తూ బాక్సాఫీస్ వద్ద మరో చరిత్రను సృష్టించింది. ఆ కాలం కుర్రకారు ఈ సినిమాను ఎన్నిసార్లు చూశారో! ఒక క్రిస్టియన్ మతానికి చెందిన తెలుగమ్మాయి ప్రేమలోపడ్డ తమిళ బ్రాహ్మణ యువకుడు బాలు పాత్రలో యువతరానికి ప్రతినిథిగా కమల్ అత్యుత్తమ నటన ప్రదర్శించారు. తర్వాత కాలంలో ఇదే సినిమాను కమల్‌తోటే 'ఏక్ దూజే కే లియే'గా హిందీలో రీమేక్ చేశారు బాలచందర్. ఈ రెండు చిత్రాలూ సీఎన్ఎన్-ఐబీఎన్ జాబితాలో స్థానం పొందడం విశేషం. మహాకవి శ్రీశ్రీ అభిమానిగా కమల్ కనిపించే చిత్రం 'ఆకలి రాజ్యం' (1981). డెబ్భైల చివరి నాళ్లనుంచీ, ఎనిమిదో దశకం వరకు దేశంలోని యువతను నిరుద్యోగం ఎంతగా బాధించిందనే దానికి ఈ సినిమా ఓ ఉదాహరణ. నిజాయితీగా ఉద్యోగం సంపాదించాలనుకుని భంగపడే నిరుద్యోగిగా కమల్ ప్రదర్శించిన అభినయాన్ని మరచిపోవడం కష్టం. అదివరకు కమల్‌తో తనే తీసిన తమిళ చిత్రం 'వారుమయిన్ నీరం శివప్పు'కు రీమేక్‌గా దీన్ని రూపొందించారు బాలచందర్. 

మహానది 

నటునిగా కమల్ కెరీర్‌లోని అత్యుత్తమ చిత్రాల్లో 'మహానది' (1994)ని ప్రస్తావించకపోతే ఈ వ్యాసం అసమగ్రం అవుతుంది. ఫోర్బ్స్ ఇండియా ఎంపిక చేసిన '25 గ్రేటెస్ట్ యాక్టింగ్ పర్ఫార్మెన్సెస్ ఆఫ్ ఇండియన్ సినిమా'లో ఈ చిత్రంలో కమల్ పోషించిన పాత్ర చోటు పొందిందంటేనే, ఆ పాత్రను ఆయన ఏ రీతిలో పోషించారో అర్థం చేసుకోవచ్చు. బీభత్స రస ప్రధానంగా దర్శకుడు సంతాన భారతి రూపొందించిన ఈ చిత్రంలో భార్యను కోల్పోయిన ఇద్దరు పిల్లల తండ్రి కృష్ణస్వామిగా కనిపిస్తారు కమల్. స్నేహితుని వంచనకు గురై జైలుపాలై, బయటకు వచ్చాక కనిపించకుండా పోయిన పిల్లల కోసం అన్వేషించే తండ్రిగా కమల్ ప్రదర్శించిన నటన వర్ణనలకు అందనిది. ముఖ్యంగా కలకత్తాలోని వ్యభిచారవాడ సోనాగచ్చిలో ఉన్న కూతురిని వెతుక్కుంటూ, అక్కడకు వెళ్లి మొదటిసారి ఆమెను కమల్ చూసే సన్నివేశం భారతీయ సినిమాలోని అత్యంత హృదయ విదారక సన్నివేశాల్లో ఒకటిగా పేర్కొనవచ్చు. దానితో పాటు మరికొన్ని సన్నివేశాలు, ఆ సన్నివేశాల్లో కమల్ అభినయం మనల్ని చాలా కాలం వెంటాడుతూనే ఉంటాయి.
ఇవే కాకుండా తమిళ చిత్రాలు 'అవల అప్పడిదన్' (1978), 'మైఖేల్ మదన కామ రాజన్' (1990), 'గుణ' (1991), 'అన్బే శివం' (2003), 'విరుమాండి' (2004), 'దశావతారం' (2008), తెలుగు చిత్రాలు 'ఇంద్రుడు చంద్రుడు' (1989), 'శుభసంకల్పం' (1995), హిందీ చిత్రాలు 'సాగర్' (1985), 'హే రాం' (2000) వంటివి కూడా కమల్ విలక్షణ నటనా సామర్థ్యానికి మెచ్చు తునకలు.

(నవంబర్ 7 కమల్‌హాసన్ షష్టి పూర్తి సందర్భంగా)

Saturday, September 24, 2011

టర్నింగ్ పాయింట్: జెనీలియా

సినిమాలకి ఏమాత్రం సంబంధం లేని కుటుంబం మాది. సినిమాల్లోకి అనుకోకుండానే వచ్చా. నేనో పెళ్లికి వెళ్లినప్పుడు అక్కడ యాడ్ ఇండస్ట్రీకి చెందిన ఓ వ్యక్తి నన్ను చూశాడు. ఆ తర్వాత ఓ యాడ్‌లో చేయడానికి పిలుపు వచ్చింది. అదీ అమితాబ్ బచ్చన్ వంటి మహా నటుడితో. ఎవరైనా వదులుకుంటారా అలాంటి ఆఫర్‌ని! నేనూ అంతే. అది చేసిన మూడు నెల్లకే తొలి సినిమా ఆఫర్ వచ్చింది. తెలుగులో సూపర్‌హిట్టయిన 'నువ్వే కావాలి'ని హిందీలో 'తుఝే మేరీ కసం' పేరుతో తీయడానికి రామోజీరావు గారు ప్లాన్ చేశారు. మా అమ్మతో పాటు వెళ్లి రామోజీరావు గారినీ, దర్శకుడు విజయభాస్కర్ గారినీ కలిశా. ఆ మీటింగ్ మొత్తం మీద నేనొక్క మాట కూడా మాట్లాడలేదు. అలాంటి అవకాశాలు ఒకే ఒక్కసారి వస్తాయనీ, వాటిని ఉపయోగించుకోవాలనీ అమ్మ నన్ను కన్విన్స్ చేసింది. నేనప్పుడే హైస్కూల్ పూరిచేశా. నేను ఆల్‌రౌండర్ని. సవాళ్లంటే ఇష్టం. సినిమాలు నాకు తాజా సవాళ్లని విసిరాయి.
కెమెరా ముందు తొలిసారి నిల్చున్నప్పుడు నేను భయపడలేదు. ఒకసారి కెమెరా ఆన్ అవగానే అంతకుముందున్న నెర్వస్‌నెస్ మాయమైపోయింది. మధ్యలో 'బాయ్స్' (తమిళ్) కోసం డైరెక్టర్ శంకర్ నుంచి కాల్ వచ్చింది. అయితే ప్రాంతీయ భాషలో నటించాలా, వద్దా అనేది నిర్ణయించుకోలేదు. ఏదైతేనేం, హిందీ, తమిళ్, తెలుగు సినిమాలతో తొలి యేడాది క్లిష్టంగా గడిచింది. నాకు భాష సమస్యగా మారింది. తెలుగు, తమిళంలో మాట్లాడటం కష్టమైపోయింది. అయినా పట్టుదలతో డైలాగులు నేర్చుకుని ప్రాంప్టింగ్ అవసరం లేకుండానే చెప్పగలిగా. 'బాయ్స్' సెట్స్ మీద నేను ఇబ్బంది పడుతుంటే డైలాగుల విషయంలో సిద్ధార్థ్ బాగా సాయపడ్డాడు.

Thursday, September 8, 2011

న్యూస్: రెండు ఛాన్సులు కొట్టేసిన ఇలియానా

ప్రస్తుతం తమిళంలో శంకర్ డైరెక్షన్‌లో 'నంబన్' ('3 ఇడియట్స్' రీమేక్)లో నటిస్తోన్న గోవా బ్యూటీ ఇలియానా ఎట్టకేలకు రెండు తెలుగు సినిమాల్లో బుక్కయ్యింది. తెలుగులో పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో 'నేను నా రాక్షసి' చేశాక మళ్లీ మరో సినిమాలో ఆమె దర్శనమివ్వలేదు. సాధారణంగా ఇలియానా స్టార్ హీరోయిన్ ఇమేజ్‌కి ఎలాంటి గ్యాప్ లేకుండా కనీసం రెండు మూడు సినిమాలు చేతిలో ఉండాలి. కానీ ఆ సినిమా పూర్తి చేసిన ఆర్నెల్ల వరకూ ఆమె మరో తెలుగు సినిమా సెట్స్ మీద కాలుపెట్టలేదు. కోటి దాటిన ఆమె రెమ్యూనరేషనే దీనికి కారణమని ప్రచారంలోకి వచ్చింది. అయితే ఇప్పుడు ఆమెకి ఇద్దరు డైరెక్టర్ ఫ్రెండ్స్ మళ్లీ అవకాశాలిచ్చారు. ఒకరు 'పోకిరి'తో ఆమెని స్టార్ హీరోయిన్‌ని చేసిన పూరి జగన్నాథ్ అయితే, మరొకరు ఆమెతో 'జల్సా' చేసిన త్రివిక్రం. రవితేజ హీరోగా జగన్ సంకల్పించిన 'ఇడియట్ 2'లో ఇలియానా హీరోయిన్‌గా ఎంపికైంది. ఇటు జగన్‌తో, అటు రవితేజతో ఆమెకి ఇది మూడో సినిమా కావడం విశేషం. అలాగే అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రం డైరెక్ట్ చేసే సినిమాలోనూ హీరోయిన్‌గా ఇలియానా కన్‌ఫామయ్యింది. నిజానికి ఇందులో తనకి జోడీగా మిస్ బ్యూటిఫుల్ స్కిన్ సమంతా కావాలని అర్జున్ పట్టుబట్టగా, త్రివిక్రం ఇలియానాకి ఓటేసి, అర్జున్‌ని కన్విన్స్ చేశాడనీ ఫిలింనగర్ వాసులు చెప్పుకుంటున్నారు. ఏదేమైనా ఏవో అల్లాటప్పా చాన్సులు కాకుండా రెండు క్రేజీ ప్రాజెక్టుల్లో అవకాశాలు దొరకడంతో ఇలియానా ఆనందంతో తబ్బిబ్బవుతోంది.

Wednesday, July 27, 2011

న్యూస్: తమిళంలో అదరగొడ్తున్న తెలుగు కుర్రాడు

తెలుగులో ఆదరణ పొందలేకపోయిన ఓ తెలుగు కుర్రాడు తమిళంలో మంచి గుర్తింపుతో పాటు మంచి సినిమాల అవకాశాల్నీ పొందుతూ ముందుకు దూసుకు పోతున్నాడు. అతను ఆది. అసలు పేరు సాయిప్రదీప్ పినిశెట్టి. 'పెదరాయుడు' డైరెక్టర్ రవిరాజా పినిశెట్టి కుమారుడు. 2006లో తేజ డైరెక్ట్ చేసిన 'ఒక విచిత్రం'తో హీరోగా పరిచయమైన ప్రదీప్ ఆ సినిమా అట్టర్ ఫ్లాపవడంతో తెలుగులో మరో సినిమా అవకాశాన్ని పొందలేక పోయాడు. కానీ అతడి రూపం తమిళ దర్శకుడు సామిని ఆకట్టుకుంది. అంతే. 'మిరుగం' అనే సినిమా తీసేశాడు. విచ్చలవిడి ప్రవర్తనతో ఎయిడ్స్ రోగిగా అతడి నటన తమిళ ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. అందుకే దాన్ని హిట్ చేశారు. ఆ సినిమాతో ప్రదీప్ కాస్తా ఆదిగా మారాడు. ఆ సినిమా తెలుగులో 'మృగం'గా అనువాదమై ఇక్కడా సొమ్ము చేసుకుంది. 'మిరుగం' తర్వాత తమిళంలో ఒక్కో అవకాశం అతడి వళ్లో వచ్చి వాలుతోంది. అక్కడ ఇప్పటికి అతడివి నాలుగు సినిమాలు విడుదలయ్యాయి. రెండేళ్ల క్రితం ఎస్. శంకర్ నిర్మించిన 'ఈరం'తో మరో విజయాన్ని అందుకున్నాడు ఆది. ఆ సినిమాని ఇటీవలే దిల్ రాజు తెలుగులో 'వైశాలి' పేరుతో విడుదల చేసి సక్సెస్ సాధించిన సంగతి మనకి తెలుసు. దీంతో ఆది తమిళంలో నటించిన మిగతా సినిమాలు కూడా తెలుగులో డబ్ అవుతున్నాయి. 2010 డిసెంబర్‌లో వచ్చిన 'అయ్యనార్' సినిమా 'వస్తాద్'గా, 2011 ఫిబ్రవరిలో విడుదలైన 'ఆదు పులి' సినిమా 'చెలగాటం' పేరుతో రాబోతున్నాయి. ఆది ప్రస్తుతం నటిస్తున్న తమిళ చిత్రం 'అరవాన్' అక్కడ అమితాసక్తిని రేకెత్తిస్తోంది. 600 యేళ్ల క్రితం నాటి మదురై నేపథ్యంతో వసంతబాలన్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. సు. వెంకటేశన్ ప్రసిద్ధ నవల 'కావల్ కొట్టం' ఆధారంగా ఈ సినిమా తయారవుతోంది. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అది కూడా తెలుగులో వచ్చే అవకాశాలు చాలానే ఉన్నాయి. అంటే ఏమిటి? మనవాళ్లు ఆదరించకపోయినా తమిళులు ఆదిని తమవాణ్ణి చేసుకున్నారు. ఇప్పుడిప్పుడే మనవాళ్లు అతడి వైపు చూస్తున్నారు. త్వరలోనే తెలుగులో అతడు తన రెండో సినిమా చేసే అవకాశాలున్నాయి.

Saturday, July 16, 2011

న్యూస్: ఇలియానా అంతేనా?

జూనియర్ సిమ్రాన్‌గా పేరు తెచ్చుకుని అచిర కాలంలోనే టాప్ రేంజికి ఎదిగి, టాలీవుడ్‌లో కోటి రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్న తొలి తారగా కాంతులీనిన గోవా సుందరి ఇలియానాకు ఇప్పుడు చేతిలో ఒక్క తెలుగు సినిమా కూడా లేకపోవడం వింతే! ముఖారవిందం కంటే అందమైన నడుముతోటే యువతరాన్ని పడగొట్టేసిన ఆమె తొలి రెండు సినిమాలు 'దేవదాసు', 'పోకిరి' ఒకదాన్ని మించి మరోటి హిట్టవడంతో రాత్రికి రాత్రే క్రేజీ హీరోయిన్ అయిపోయింది. బెల్లంకొండ సురేశ్ నిర్మించిన 'భలే దొంగలు' సినిమాతో కోటి రూపాయలు తీసుకున్న తొలి టాలీవుడ్ హీరోయిన్‌గా ఆమె సంచలనం సృష్టించింది. అయితే 'కిక్' హిట్ తర్వాత ఆమె సినిమాలేవీ బాక్సాఫీసు వద్ద ఆడకపోవడం, రెమ్యూనరేషన్ విషయంలో కిందికి దిగక పోవడం వంటి కారణాలతో నిర్మాతలు ఆమెకంటే ఇతర తారల వైపు మొగ్గు చూపడం మొదలుపెట్టారు. 'రెచ్చిపో', 'సలీం', 'శక్తి' సినిమాలు ఒకదాన్ని మించి మరోటి అట్టర్‌ఫ్లాప్ కావడం, రానా సరసన చేసిన 'నేను నా రాక్షసి' మంచి పేరు తెచ్చినా, బాక్సాఫీసు వద్ద ఫ్లాపవడంతో నిన్నటి దాకా ఆమెని గోల్డెన్ లెగ్ అన్నవాళ్లే ఇవాళ ఐరన్ లెగ్ అనడం ప్రారంభించారు. ఫలితంగా కాజల్ అగర్వాల్ టాప్ హీరోయిన్ రేంజికి ఎదిగిపోయింది. మరోవైపు తమన్నా, తాప్సీ, సమంతా వంటి తారలకు గిరాకీ పెరిగింది. ప్రస్తుతం సౌతిండియా టాప్ డైరెక్టర్ శంకర్ తీస్తున్న తమిళ 'నంబన్' సినిమా మీదే ఆమె ఆశలన్నీ పెట్టుకుంది. ఇది బాలీవుడ్‌లో సూపర్‌హిట్టయిన '3 ఇడియట్స్'కి రీమేక్. ఇందులో ఆమె విజయ్‌కి జోడీగా నటిస్తోంది. ఈ సినిమా ఆడితే మొదట తమిళంలోనూ, తర్వాత తెలుగులోనూ తనకి మళ్లీ మంచి అవకాశాలొస్తాయనేది ఆమె నమ్మకం. మరోవైపు 'బర్ఫీ'తో బాలీవుడ్‌లోనూ అడుగు పెడుతున్న ఆమె, దానితో అక్కడా తనకి గుర్తింపు లభిస్తుందనే ఆశ పెట్టుకుంది. చూద్దాం ఏం జరుగుతుందో..

Thursday, October 28, 2010

సినిమా: మూడు క్రేజీ సినిమాలు - ఒక వాస్తవం (1వ భాగం)

ఒక డబ్బింగ్ సినిమా ఒకవైపు.. మూడు భారీ, క్రేజీ తెలుగు సినిమాలు ఇంకోవైపు.. మామూలుగా అయితే డబ్బింగ్ సినిమా మట్టికరచి మాయం కావాలి. చిత్రం.. సీను రివర్స్. తెలుగులో అగ్ర కథానాయకులు నటించిన సినిమాల్నే వెనక్కి నెట్టేస్తూ ఆ డబ్బింగ్ సినిమా అప్రతిహతంగా బాక్సాఫీసును దున్నేస్తోంది. తెలుగు ప్రేక్షకులకి వినోదపు మజాని రుచి చూపిస్తూ నాణ్యమైన సినిమాకే వాళ్లు పట్టం కడతారనే నిజాన్ని చాటి చెబుతోంది. ఆ డబ్బింగ్ సినిమా 'రోబో'. ఆ భారీ, క్రేజీ సినిమాలు 'పులి', 'మహేశ్ ఖలేజా', 'బృందావనం'. తమిళ అగ్ర కథానాయకుడైన రజనీకాంత్ టాలీవుడ్ టాప్ హీరోల్ని పడగొట్టి బాక్సాఫీసు మీద గుత్తాధిపత్యం చలాయిస్తుండటం ఆషామాషీ సంగతి కాదు. టాలీవుడ్ వర్గాలు చాలా చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన సంగతి.
ఎందుకిలా జరిగింది? మొదటే హీరోని దృష్టిలో పెట్టుకుని కథలు వండటం తెలుగు దర్శకులు, రచయితలకి బాగా అలవాటైన పనయితే, స్క్రిప్టు మీదే ఎక్కువ దృష్టిపెట్టి, ఆ స్క్రిప్టుకి పనికొచ్చే నటుణ్ణి వెతుక్కోవడం తమిళ దర్శకుడైన శంకర్ కి తెలిసిన పని. 'రోబో' గురించీ, ఆ సినిమా ఆంధ్రప్రదేశ్ బాక్సాఫీస్ మీద చేస్తున్న సందడి గురించీ ఇదివరకే చెప్పుకున్నాం. ఇప్పుడు ఆ సినిమా స్థాయిలో మన మూడు తెలుగు స్ట్రెయిట్ సినిమాలు ఎందుకని ప్రేక్షకుల్ని అలరించలేక పోతున్నాయో విశ్లేషించుకోవాల్సిన సందర్భం.
తోకముడిచిన 'పులి'
'రోబో' కంటే మూడు వారాల ముందు విడుదలైన పవన్ కల్యాణ్ సినిమా 'పులి' (కొమరం పులి)ని ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో వెయ్యి ప్రింట్లతో విడుదల చేశారు. అందుకే తొలివారం ఆ సినిమా 25 కోట్ల రూపాయల్ని వసూలు చేసింది. నిజానికి అందులో ముప్పాతిక వంతు తొలి మూడు రోజుల్లోనే రావడం గమనార్హం. ఆ తర్వాత నుంచే ఆ సినిమాకి వచ్చే వాళ్లు కనుచూపు మేరలో కనిపించకుండా పోయారు. ఆ 'ఘనత'ని మొత్తంగా దర్శకుడు ఎస్.జె. సూర్యకే ఆపాదించారు. ప్రేక్షకుల్ని కుర్చీల్లోంచి లేవకుండా కూర్చోపెట్టాలంటే వినోదమన్నా వుండాలి, ఉత్కంఠభరితమైన కథనమన్నా వుండాలి. ఆ రెండూ లేకపోవడమే 'పులి' పరాజయానికి ప్రధాన కారణమనేది విమర్శకుల అభిప్రాయం. పులి పాత్ర చేత పదే పదే 'ప్రసంగాలు' ఇప్పించడం సినిమాకి పెద్ద మైనస్ పాయింట్. జనం సినిమాకి వచ్చేది ప్రధానంగా వినోదం కోసమేననే, సినిమాలోని ప్రధాన పాత్రలతో వాళ్లు సహానుభూతి చేందితేనే సినిమా ఆడుతుందనే ప్రాథమిక సత్యం తెలియకుండా తీసిన సినిమాగా 'పులి'ని చెప్పుకోవాలి. ఆరంభ సన్నివేశాల్లోనే పులి ఆవేశంగా ఐదు నిమిషాల సేపు జనానికి ఉపదేశించే రీతిలో ప్రసంగించడం చూసి బిత్తరపోయిన ప్రేక్షకులు, ఆ తర్వాత మరో మూడు నాలుగు సార్లు అలాంటి సీనులే ఎదురవడంతో కుర్చీల్లో ఎంత ఇబ్బందికరంగా మసిలారో 'పులి'ని చూసిన వాళ్లందరికీ అనుభవమే. నీతిబోధకుడు చెప్పే రీతిలో పవన్ కల్యాణ్ చెప్పిన నీతులు ప్రేక్షకుల్ని కదిలించాయి. ఎలా? కుర్చీల్లో అసహనంగా, చికాకుగా. రాజకీయ వేదికలపై చెప్పే ఆవేశభరిత, ఊకదంపుడు ఉపన్యాసాల్ని వినీ వినీ డంగైపోయిన జనం సినిమాలోనూ అలాంటి సీనే కనిపించడంతో మూకుమ్మడిగా 'పులి'కి వ్యతిరేకంగా ఓటేశారు. ఫలితంగా ఆ సినిమాపై పెట్టుబడి పెట్టిన నిర్మాత, బయ్యర్లు నిలువునా మునిగిపోయారు. తొలివారం భారీ కలెక్షన్లు సాధించిన ఆ సినిమా రెండో వారం సగానికంటే ఎక్కువ సంఖ్య థియేటర్లలో మాయమయ్యింది. మొత్తంగా ఈ ఏడాది ఇప్పటివరకు రిలీజైన సినిమాల్లో నెంబర్ వన్ డిజాస్టర్ అనే ముద్రని సంపాదించుకుంది. (ఇంకావుంది)

Wednesday, October 20, 2010

సినిమా: డిసెంబర్ నుంచి మహేశ్ '3 ఇడియట్స్'

'ఖలేజా' తర్వాత మహేశ్ చేసే సినిమా ఏది? 'దూకుడు', '3 ఇడియట్స్'లో ముందు ఏ సినిమా చేయబోతున్నాడు? ప్రస్తుతం ఆయన అభిమానుల్ని వేధిస్తున్న ప్రశ్నలివి? నిజానికి శ్రీను వైట్ల దర్శకత్వం వహించే 'దూకుడు' ఈ అక్టోబరులో టర్కీలో మొదలవుతుందనే వార్తలు వచ్చాయి. తాజా సమాచారం ప్రకారం ఆ సినిమా షూటింగ్ ఈ నెలలో లేదు. నవంబరులో మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు '3 ఇడియట్స్' తెలుగు వెర్షన్ డిసెంబర్ 6న ప్రారంభం కానున్నట్లు ఫిలింనగర్ వర్గాల భోగట్టా. 'రోబో' తర్వాత శంకర్ డైరెక్ట్ చేయబోతున్న సినిమా ఇదే. జెమిని ఫిల్మ్ సర్క్యూట్ నిర్మించే ఈ సినిమాకి హారిస్ జయరాజ్ మ్యూజిక్ డైరెక్టర్. ఇప్పటికే రెండు పాటల్ని రికార్డ్ చేశారు. ఇందులో ప్రధాన హీరోగా మహేశ్ నటించనుండగా, మరో ఇద్దరు హీరో పాత్రల కోసం తమిళ నటులు ఆర్య, జీవాలను సంప్రదిస్తున్నారు.

Friday, October 8, 2010

సినిమా: రజనీ - ద గ్లోబల్ స్టార్!

నిన్నటిదాకా దక్షిణాది సూపర్ స్టారుగా వెలుగొందిన రజనీకాంత్ ఇప్పుడు ఏకంగా గ్లోబల్ స్టార్ అయిపోయాడు. ఇది ఆషామాషీగా చెబుతున్న సంగతి కాదు. సంచలనాల 'రోబో' సాక్షిగా వెల్లడైన నిఖార్సయిన నిజం. ఇది ఒక భారతీయ నటుడు - అదీ ఒక దక్షిణ భారత దేశానికి చెందిన ఓ ప్రాంతీయ నటుడు - సాధించిన అపూర్వ, అపురూప విజయం. తమిళ చిత్ర రంగానికి చెందిన ఓ నటుడి సినిమాకి 180 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం ఏమిటి! ఆ సినిమా ప్రపంచవ్యాప్తంగా మూడంటే మూడు రోజుల్లో 95 కోట్ల రూపాయల్ని వసూలు చేయడం ఏమిటి!! ఇది అద్భుతం కాక మరేమిటి!!!                        
బాక్సాఫీసు రికార్డులు పాదాక్రాంతం
భారతీయ సినిమాకి సంబంధించి 'రోబో' ఎన్నో సరికొత్త రికార్డుల్ని లిఖిస్తోంది. భవిష్యత్తులో మరెన్నింటినో లిఖించబోతోంది. ఇప్పటిదాకా దేశంలో అత్యంత వ్యయభరిత చిత్రం 'రోబో'నే. మునుపటి రికార్డు 120 కోట్ల రూపాయల వ్యయమైన హృతిక్ రోషన్ సినిమా 'కైట్స్' పేరుతో ఉంది. అలాగే మూడు భారతీయ భాషల్లో (తమిళ, తెలుగు, హిందీ) ప్రపంచవ్యాప్తంగా రెండు వేలకు పైగా ప్రింట్లతో విడుదలైన సినిమా కూడా 'రోబో'నే. అక్టోబర్ 1న విడుదలైన ఈ సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ సినిమా ఇటీవలే సల్మాన్ ఖాన్ సినిమా 'దబాంగ్' నెలకొల్పిన తొలి మూడు రోజుల వసూళ్ల రికార్డుని ఏకంగా రెట్టింపు వసూళ్లతో బద్దలు కొట్టడం గొప్ప విశేషం. విడుదలైన తొలి మూడు రోజుల్లో 'దబాంగ్' 49 కోట్ల రూపాయల్ని ఆర్జించి రికార్డు నెలకొల్పింది. ఇప్పుడు ఆ రికార్డుని భారీ వ్యత్యాసంతో బద్దలు కొట్టాడు 'రోబో.
బాలీవుడ్ ట్రేడ్ విశ్లేషకుడు కోమల్ నహతా చెప్పిన లెక్కల ప్రకారం 'రోబో' సాధించిన మూడు రోజుల వసూళ్లు 95 కోట్ల రూపాయలు. ఆయన అంచనా ప్రకారం ఆ సినిమా రానున్న రోజుల్లో మరో 125 కోట్ల రూపాయల్ని ఆర్జించనున్నది. అయితే మనదేశంలో కచ్చితమైన బాక్సాఫీసు ఫలితాలు బహిర్గతం కావడం కష్టం. ఒక విశ్లేషణకీ, మరో విశ్లేషణకీ వ్యత్యాసాలు సాధారణం. ఉదాహరణకి స్వతంత్ర పారిశ్రామిక వెబ్ సైట్ అయిన బాక్సాఫీస్ ఇండియా డాట్ కామ్ అంచనాల ప్రకారం తొలి వారాంతంలో 'రోబో' వసూలు చేసిన మొత్తం 57 కోట్ల రూపాయలే. అయినప్పటికీ ఇది కూడా కొత్త రికార్డే కావడం గమనార్హం. మనదేశం బయట అమెరికా, మలేషియా, జపాన్ లలో వీర విహారం చేస్తున్న ఈ సినిమా కొత్తగా స్వీడన్ లోనూ బ్రహ్మాండంగా ఆడుతుండటం రజనీ సినిమాల మార్కెట్ విస్తృతికి ఒక చక్కని నిదర్శనం. రజనీ చేసిన ఈ మ్యాజిక్ తో దక్షిణాది నటులే కాదు, దేశంలో తామే అగ్రగణ్యులమని విర్రవీగే బాలీవుడ్ సూపర్ స్టార్లు సైతం ముక్కు మీద వేలేసుకుని విస్తుపోతున్నారు. వృద్ధాప్యమనదగ్గ అరవై ఏళ్ల వయసులో అందం చందం కూడా లేని నటుడికి ఇదెలా సాధ్యమని వాళ్లు తలలు బద్దలు కొట్టుకుంటున్నారు. ఒక నటుడికీ, దేవుడికీ ఉన్న వ్యత్యాసాన్ని సైతం చెరిపేసిన రజనీని చూసి దిగ్భాంతి చెందుతున్నారు. అదీ రజనీ మాయ! తమిళనాడులో నిన్నటిదాకా బాక్సాఫీసు కొలబద్ద రజనీయే నటించిన 'శివాజి'. ఇప్పుడు తన రికార్డుల్ని తానే బద్దలు కొట్టుకుంటూ 'రోబో'గా సరికొత్త 'బెంచ్ మార్క్'ని నెలకొల్పబోతున్నాడు.
సరే - తమిళనాడులో ఆయనే నెంబర్ వన్ హీరో. మరి తెలుగు సంగతేమిటి? కనీ వినీ ఎరుగని రీతిలో 27 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయిన తెలుగు 'రోబో'కి ఈ కలెక్షన్ల తుఫానేమిటి! తెలుగు చలన చిత్ర చరిత్రలోనే ఎన్నడూ ఎరుగని రీతిలో ఒక డబ్బింగ్ సినిమా హైదరాబాదులో 72 స్క్రీన్లలో విడుదలవడం, అన్ని థియేటర్లూ మూడు రోజుల పాటు ఫుల్స్ కావడం మామూలు విశేషం కాదు. దానికి ముందు పవన్ కల్యాణ్ 'పులి' కానీ', దాని తర్వాత 'మహేశ్ ఖలేజా' కానీ అన్నేసి థియేటర్లలో విడుదల కాకపోవడం, రెండూ చాప చుట్టేయడం ఇక్కడ ప్రస్తావనార్హం. ఇప్పుడు చెప్పండి. తెలుగులో సూపర్ స్టార్ ఎవరు? ఏదేమైనా రజనీకాంత్ కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది. దర్శకుడిగా తననెందుకు అగ్రశ్రేణిలో పరిగణిస్తారో 'రోబో'తో మరోసారి నిరూపించుకున్నాడు శంకర్. సాంకేతికంగా భారతీయ సినిమా ఎంత ఎత్తుకు ఎదిగిందో 'రోబో'తో అతను తెలియజేశాడు. ఇప్పుడు 'రోబో'ని ఎందుకు వదులుకున్నానా అని షారుఖ్ ఖాన్ బాధపడుతూ ఉంటాడు. శంకర్ ని తక్కువగా అంచనా వేసినందుకు తనని తాను తిట్టుకుంటూ ఉంటాడు.

Saturday, October 2, 2010

రివ్యూ: రోబో

రేటింగ్: 3.5/5
తారాగణం: రజనీకాంత్, ఐశ్వర్యారాయ్, డానీ డెంజోప్ప
సంగీతం: ఎ.ఆర్. రెహమాన్
సినిమాటోగ్రఫీ: రత్నవేలు
ఎడిటింగ్: ఆంతోనీ
కళ: సాబు సిరిల్
డైలాగ్స్: శ్రీరామకృష్ణ
నిర్మాత: కళానిధి మారన్
సమర్పణ: తోట కన్నారావు
కథ, స్క్రీన్-ప్లే, దర్శకత్వం: ఎస్. శంకర్

దక్షిణాది అగ్ర నటుడు రజనీకాంత్ కెరీరులో మరో మణిపూస చేరినట్లే. దర్శకుడిగా తననెందుకు అగ్రశ్రేణిలో పరిగణిస్తారో 'రోబో'తో మరోసారి నిరూపించుకున్నాడు శంకర్. సాంకేతికంగా భారతీయ సినిమా ఎంత ఎత్తుకు ఎదిగిందో కూడా చెప్పిన సినిమా 'రోబో'.
కథ: రోబోలను తయారుచేయడంలో నిష్ణాతుడైన శాస్త్రవేత్త డా. వసి (రజనీకాంత్) మనిషిలా కనిపించే చిట్టి (రజనీకాంత్) అనే రోబోని తయారుచేస్తాడు. ఇండియన్ ఆర్మీలో చేర్పించి దాని ద్వారా దేశానికి సేవ చేయాలని వసి భావిస్తాడు. అయితే ఆర్మీలో చేరే విషయంలో చిట్టి విఫలమవుతాడు. దాంతో సందర్భానుసారం స్పందనలు కలిగేలా చిట్టిలో ప్రోగ్రాంని అనుసంధానిస్తాడు. మనిషిలాగే స్పందనలు కలిగే లక్షణాన్ని పొందిన చిట్టి అందాలరాశి సనని ప్రేమిస్తాడు. ఆ సన ఎవరో కాదు, సాక్షాత్తూ డా. వసి పెళ్లిచేసుకోబోయే అమ్మాయి. సన విషయంలో వసికీ, చిట్టికీ మధ్య యుద్ధంలాంటి వాతావరణం ఏర్పడుతుంది. దీన్ని తనకు అనుకూలంగా మలచుకుని చిట్టి శక్తి సామర్థ్యాల్ని దుర్వినియోగం చేయాలని భావిస్తాడు మరో సైంటిస్ట్ డా. బోరా (డానీ). ఆ తర్వాత ఏం జరుగుతుంది? వసి, చిట్టిలలో ఎవరు గెలుస్తారు? అనేది మిగతా కథ.
విశ్లేషణ: మామూలుగా అయితే అయితే ఇది అతి పేలవమైన కథే. కానీ రజనీకాంత్ హీరో అవడమే 'రోబో' కథని ఆసక్తికరం చేసింది. నిజానికి ఎప్పటిలా కథ కంటే శంకర్ కథనమే ఈ సినిమాకి ప్రాణవాయువు. రజనీ విన్యాసాలు దానికి పరిపుష్టిని చేకూర్చాయి. ఆ విన్యాసాలు కావలసినన్ని వున్నాయి ఈ సినిమాలో. 'రోబో'గా రజనీ విశ్వరూపాన్నే ప్రదర్శించాడు.
భూమ్యాకర్షణ సిద్ధాంతాన్నే ప్రశ్నించేలా రజనీ చేసే ఫైట్లు, వేలితో తూటాలు పేల్చే తీరు, అతివేగంగా వెళ్తున్న ట్రైన్ పైన కాకుండా దానికి ఒక పక్కనుంచి పరిగెత్తే విధానంతో పాటు, ఆకాశంలోకి ఎగిరే కార్లు, బైకులు, హాస్యాన్ని కురిపించే కట్ డైలాగ్స్ 'రోబో'ని ఆకర్షణీయంగా మలిచాయి. రోబోని అడ్రస్ అడిగితే అతను తన ఐ.పి. అడ్రస్ ఇచ్చే సన్నివేశంలోనూ, పోలీసుల వద్ద గన్స్ పేల్చే ముందు 'హ్యాపీ దీపావళి' అని చెప్పే సన్నివేశంలోనూ నవ్వనివాళ్లు ఉండరు.
సినిమాకి ప్రాణం చివరి 30 నిమిషాలని చెప్పాలి. భారతీయ ప్రధాన స్రవంతి సినిమా ఏ స్థాయికి చేరుకుందో ఈ అరగంట సినిమా మనకి పట్టిస్తుంది. రజనీకాంత్ అభిమానుల్ని క్లైమాక్స్ బాగా అలరిస్తుంది. 'రోబో' ప్రధాన బలాల్లో అత్యున్నత స్థాయి స్పెషల్ ఎఫెక్ట్స్ అతి ముఖ్యమైనవి. 'జురాసిక్ పార్క్', 'అవతార్' సినిమాలకి స్పెషల్ ఎఫెక్ట్స్ సమకూర్చిన స్టాన్ వింస్టన్ స్టూడియో 'రోబో'లో ప్రవేశపెట్టిన సూపర్ మాన్, బ్యాట్ మాన్, సూపర్ హీరో లక్షణాలు, వాటిని తనదైన శైలిలో రజనీ చేసిన విధానం మెచ్చని వాళ్లు ఎవరు!
అలాగే 'కిల్ బిల్', 'మాట్రిక్స్' వంటి టాప్ క్లాస్ సినిమాలకి స్టంట్స్ కూర్చిన యూన్ వూ పింగ్ 'రోబో' కోసం రూపుదిద్దిన ప్రతి ఫైటూ ఆకట్టుకుంటుంది. సినిమా మొత్తం బడ్జెట్ (రూ. 180 కోట్ల రూపాయలు)లో 40 శాతం ఖర్చయ్యింది కేవలం ఈ స్పెషల్ ఎఫెక్ట్స్ కే. సినిమా చూశాక ఆ ఖర్చంతా సద్వినియోగం అయ్యిందనిపిస్తుంది. సినిమాలో అలరించేది ఈ స్పెషల్ ఎఫెక్ట్స్, ఫైట్స్ మాత్రమే కాదు. వసి, చిట్టి, సన మధ్య ముక్కోణ ప్రేమ కూడా. వసి, రోబో పాత్రల్లో రజనీ తనకే సాధ్యమైన మేనరిజమ్స్, స్టైలుతో చెలరేగిపోయాడు. ఐశ్వర్యారాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. ఆమె గ్లామర్ సినిమాకి అదనపు ఆకర్షణ. చిత్రమేమంటే రజనీకాంత్, ఐశ్వర్య జంట బాగా అలరించగలగడం!

Thursday, September 30, 2010

సినిమా: 'రోబో'కి థియేటర్లు దొరుకుతాయా?


దక్షిణ భారతంలోనే - ఆ మాటకొస్తే దేశంలోనే అత్యధిక పారితోషికాలు తీసుకుంటున్న నటుడు రజనీకాంత్, దర్శకుడు శంకర్, నటి ఐశ్వర్యారాయ్ కాంబినేషనులో తయారైన 'రోబో' అక్టోబర్ 1న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. భారత దేశంలో ఒక సినిమా 180 కోట్ల రూపాయల (అనధికార సమాచారం ప్రకారం 225 కోట్లు) వ్యయంతో రూపొందటమనేది ఊహకి అందని సంగతి. కానీ ఊహాతీతంగా సినిమాలు చెయ్యడమే డైరెక్టర్ శంకర్ పంథా. మునుపటి సినిమా 'శివాజి'తో వంద కోట్ల రూపాయల బిజినెస్ మార్కుని అధిగమించిన శంకర్ ఇప్పుడు దానికి రెట్టింపు వ్యయంతో 'రోబో'ని తీసి వార్తల్లో వ్యక్తిగా మారాడు. 
అసాధారణ రిస్కుతో కూడిన ఈ వ్యయాన్ని భరించేందుకు చెన్నైకి చెందిన నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ముందుకు రావడం వల్లే 'రోబో' ప్రాజెక్టు సాధ్యపడింది. సుమారు రెండేళ్లపాటు నిర్మాణం సాగిన ఈ సినిమాకి కథ కంటే గ్రాఫిక్స్, స్పెషల్ ఎఫెక్ట్స్ ప్రాణంగా నిలవనున్నాయి. స్పెషల్ ఎఫెక్ట్స్ పరంగా హాలీవుడ్ లో అత్యున్నత స్థాయి సాంకేతిక ప్రమాణాలతో రూపొందిన సినిమాలకు దీటుగా 'రోబో' నిలవనున్నదని ఈ సినిమా గురించి తెలిసిన ప్రతి ఒక్కరూ చెబుతున్నారు. టీవీల్లో, థియేటర్లలో కనిపిస్తున్న ట్రైలర్లు ఆ సంగతే నిరూపిస్తున్నాయి.
ఇంతటి భారీ ఖర్చుతో తీసినందునే తెలుగు హక్కులు సైతం కనీవినీ ఎరుగని రీతిలో 27 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయి. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మొక్కజొన్న వ్యాపారి తోట కన్నారావు ఈ హక్కులు సొంతం చేసుకున్నారు. రజనీ ద్విపాత్రాభినయం 'రోబో'లోని విశేషం. ఒక పాత్ర సైంటిస్ట్ అయితే, ఆ సైంటిస్ట్ చేతిలో రూపొందిన మరో పాత్రే 'రోబో'. మనుషుల్లాగా స్పందనలు కూడా కలిగిన ఆ రోబోతో అందాల ఐశ్వర్యారాయ్ ఆడే ఆటలు, పాడే పాటలు ప్రేక్షకుల్ని అలరిస్తాయని నిర్మాతలు అంటున్నారు. అలాగే 'రోబో' చేసే యాక్షన్ సన్నివేశాలు గగుర్పాటు కలిగించనున్నాయి.
'రోబో' తెలుగు వెర్షన్ 500 ప్రింట్లతో విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. అయితే అన్ని ప్రింట్లు విడుదల చేయడానికి థియేటర్లు లభ్యమవుతాయా - అనే సందేహం కలుగుతోంది. అక్టోబర్ 7న విడుదలవుతున్న 'మహేశ్ ఖలేజా'ని అల్లు అరవింద్ పంపిణీ చేస్తుండటం, 8న వస్తున్న ఎన్టీఆర్ 'బృందావనం' నిర్మాత దిల్ రాజు స్వయంగా డిస్ట్రిబ్యూటర్ కావడంతో వాటికి లభ్యమైనన్ని ప్రధాన థియేటర్లు 'రోబో'కి లభించే విషయం అనుమానాస్పదమే.
నైజాం ఏరియాకి సంబంధించి రెండు రోజుల క్రితమే 'రోబో' బిజినెస్ పూర్తయింది. ఇదివరకు నైజాంలో 'సింహా'ని పంపిణీ చేసిన మల్టీడైమెన్షన్ ఎంటర్టయిన్మెంట్ సంస్థ 8 కోట్ల రూపాయలకి పంపిణీ హక్కులు సొంతం చేసుకుంది. 12 కోట్ల రూపాయలకు ఈ హక్కులు అమ్మాలని ఆశించిన కన్నారావు ప్రయత్నాలు ఫలించలేదు.                           

Friday, September 17, 2010

సినిమా: 'దూకుడు' మీదున్న తమన్


మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్. తమన్ పేరు చూసి చాలామంది తమిళుడని మోసపోతుంటారు. కానీ అతను తెలుగువాడే. ఘనమైన నేపథ్యం కలిగినవాడే. ఆయన తాత ఎవరో కాదు ఒకప్పటి ప్రఖ్యాత నిర్మాత, దర్శకుడు ఘంటసాల బలరామయ్య. మహానటుడు అక్కినేని నాగేశ్వరరావుని 'సీతారామ జననం'తో నటుణ్ణి చేసింది ఆయనే. అటువంటి నేపథ్యం నుంచి వచ్చిన తమన్ 'కిక్' సినిమాకిచ్చిన సంగీతంతో తెలుగులో బిజీ అయ్యాడు. అతని తాజా చిత్రం ఎన్టీఆర్ హీరోగా నటించిన 'బృందావనం'. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఆడియో బాగానే ఉందంటున్నారు. దీని తర్వాత మరో పెద్ద సినిమాకి మ్యూజిక్ నిచ్చే చాన్స్ సంపాదించేశాడు తమన్. అది మహేశ్, శ్రీను వైట్ల కలయికలో రాబోతున్న 'దూకుడు'.
మీకు తెలీని ఇంకో సంగతేమంటే శంకర్ 'బాయ్స్'లో ఒకడిగా అతను కనిపించాడు. నటన మీద ఆసక్తి లేకపోయినా శంకర్ తో పనిచేయాలనే ఉత్సాహంతో దాన్ని చేశాడు. ఆ తర్వాత నటనావకాశాలు చాలానే వచ్చినా మ్యూజిక్ మీద ఇష్టంతో వాటిని వదులుకున్నాడు. శంకర్ తమిళంలో నిర్మించిన 'ఈరమ్' మ్యూజిక్ డైరెక్టరుగా అతని తొలి సినిమా. ప్రస్తుతం హైదరాబాదులో 'తాళ్' పేరుతో రికార్డింగ్ స్టూడియో ఏర్పాటుచేసే పనిలో ఉన్న అతను తన తాత నెలకొల్పిన ప్రతిభా పిక్చర్స్ బ్యానరుని కొనసాగించి, మంచి సినిమాలు నిర్మించాలనే ఆశయంతో ఉన్నాడు.

Friday, August 27, 2010

Movies: 'Jai Bolo Telangana' launched


మహాలక్ష్మీ ఆర్ట్ ప్రొడక్షన్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం 'జై బోలో తెలంగాణ'. ఎన్. శంకర్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ప్రారంభోత్సవం గురువారం ( 26ఆగస్టు) ఉదయం హైదరాబాద్ బేగంపేటలోని దత్త హ్యూమన్ సర్వీసెస్ సెంటర్‌లో జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి తెలంగాణ జేఏసీ కో కన్వీనర్ మల్లేపల్లి లక్ష్మయ్య కెమెరా స్విచ్ఛాన్ చేశారు.
సీనియర్ డైరెక్టర్ రాఘవేంద్రరావు క్లాప్‌నిచ్చారు. తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్ గౌరవ దర్శకత్వం వహించారు. చిత్ర లోగోను ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ, సిరిసిల్ల ఎమ్మెల్యే కె.తారకరామారావు సంయుక్తంగా ఆవిష్కరించారు. స్క్రిప్టును ఉస్మానియా విశ్వవిద్యాలయం జేఏసీ నాయకులు ఎన్.శంకర్‌కు అందజేశారు.
ఎన్.శంకర్ మాట్లాడుతూ "ఇవాళ, రేపు షూటింగ్ చేస్తాం. తదుపరి షెడ్యూల్ సెప్టెంబరు 3 నుంచి ఉంటుంది. మిగిలిన వివరాలను త్వరలో వెల్లడిస్తామ''ని అన్నారు. "తెలంగాణ నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ సినిమా తప్పక అందరినీ ఆకట్టుకుంటుంద''ని గీతరచయితలు గోరటి వెంకన్న, అందెశ్రీ, నందిని సిద్ధారెడ్డి, జయరాజ్, కోదారి శ్రీను, జూలూరి గౌరీ శంకర్ పేర్కొన్నారు.
"స్వాతంత్య్రం నేపథ్యంలో ఇప్పటిదాకా పలు సినిమాలు వచ్చాయి. విద్యార్థుల జీవితాలు, వారు త్యాగం చేసిన సన్నివేశాలు, ప్రత్యేక రాష్ట్రం వంటి వివరాలతో వస్తున్న ఈ చిత్రం కూడా అందరినీ అలరించాల''ని 'మా' అధ్యక్షుడు మురళీమోహన్ ఆకాంక్షించారు. సినిమా విజయాన్ని సాధించాలని పరుచూరి గోపాలకృష్ణ, బి.గోపాల్, కోదండరామిరెడ్డి, రాఘవేంద్రరావు అభిలషించారు.
ఈ చిత్రానికి సంగీతం: చక్రి, పాటలు: కె.సి.ఆర్, సుద్దాల, గోరటి వెంకన్న, అందెశ్రీ, నందిని సిద్ధారెడ్డి, జయరాజ్, కోదారి శ్రీను, జూలూరి గౌరీ శంకర్, గద్దర్, మాటలు: ఊడుగుల వేణు, కెమెరా: రవి.కె.నీర్ల, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు, నిర్మాణ-నిర్వహణ: ఎన్.శ్రీనివాస్, నిర్వహణ: ఎన్.అంజన్ బాబు, కళ: మధు రెబ్బ