Showing posts with label democracy. Show all posts
Showing posts with label democracy. Show all posts

Tuesday, January 5, 2016

Society: Encouragement to Superstitious Beliefs

మూఢత్వానికి ప్రోత్సాహం

సమాజాన్ని నిస్సహాయత ఆవహించింది. తప్పని తెలిసి కూడా ఆ తప్పునే అంతా ఆచరిస్తున్నారు. సమాజ దృష్టితో కూడిన ధ్యేయం లేకుండా పోయింది. సంకుచిత స్వార్థాలు, పార్టీ, ముఠా, కులం, మతం, ప్రాంతం, భాష పేరిట కక్షలు పెరిగిపోయాయి. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ కర్త, నిర్ణేత పౌరుడే. కానీ ఆ పౌరుడు ప్రభుత్వాన్ని ఆజ్ఞాపించాల్సిందిపోయి, దీనంగా మంత్రుల్నీ, ఎమ్మెల్యేలనీ, స్థానిక ప్రతినిథుల్నీ, ప్రభుత్వాధికారుల్నీ అర్థించే బానిస మాదిరిగా దిగజారిపోయాడు. పౌరుడు దీనుడవటంతో, జనశక్తి బలహీనపడటంతో అధికారులు, పాలక వర్గాల వాళ్లూ తమ ఇష్టాయిష్టాలకు, రాగద్వేషాలకు, భోగవిలాసాలకు, సంపదను పోగేసుకోడానికి ప్రభుత్వ యంత్రాంగాన్ని సాధనంగా చేసుకొని ప్రజల్ని బలి చేస్తున్నారు.
అధికారంలో ఉన్నవాళ్లు నిజంగా ప్రజా ప్రయోజనాలు కోరేవారైతే ప్రజల్లోని మూఢ విశ్వాసాల్ని తొలగించడానికి కృషిచేసి, వారిలో నూతన చైతన్యాన్ని, ప్రేరణనీ కల్పించాలి. కానీ ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నవాళ్లు ప్రజా చైతన్యాన్ని పెంపొందించడానికి బదులు వాళ్లలోని మూఢ నమ్మకాలకు మరింత ప్రోత్సాహమిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జరిగేదొకటే. అది.. ప్రజాస్వామ్య వ్యవస్థ అంటేనే ప్రజల్లో ఏహ్యభావం ఏర్పడి నియంతృత్వంపై అభిమానం పెరగడం. ఇలాంటప్పుడు ఏ అభివృద్ధి కార్యక్రమాలు అమలు జరిపినా, ఎన్ని ప్రణాళికలు వేసినా, వాటి ఫలితాలు ప్రజలదాకా చేరకుండానే ఇంకిపోతాయి.
ఈ రకంగా భ్రష్టమైన రాజకీయ జీవితం మొత్తం ప్రజా జీవితాన్ని బాధలు పెడుతోంది. ప్రజాస్వామ్యంలో ప్రజా ప్రతినిథులు తమ కర్తవ్యాల్ని సక్రమంగా నిర్వర్తించకపోతే దానివల్ల వాళ్లు ప్రాతినిథ్యం వహించే కోటానుకోట్ల ప్రజలు కష్టాల పాలవుతారు. అందువల్ల వాళ్లను సంకుచిత ముఠా స్వార్థాలలోకి దిగజారకుండా చూడాల్సిన బాధ్యత ప్రజలదే.

Friday, January 1, 2016

Society: We and Our Responisibility

మనం - మన బాధ్యత

ప్రజాస్వామిక వ్యవస్థలో ప్రభుత్వాన్ని ప్రజలే నిర్మించుకుంటారు. మాతృదేశాన్ని సంరక్షించుకుంటూ ప్రపంచంలో తమ దేశానికి మహోన్నతమైన స్థానాన్ని సంపాదించి పెట్టేందుకు కృషి చేస్తారు. ఇదే ప్రజల బాధ్యత. కానీ మనదేశంలో ప్రజలు చాలావరకు తమ బాధ్యతల్ని విస్మరిస్తున్నారు. లంచగొండితనం, బంధుప్రీతి, స్వకుల పక్షపాతం, పార్టీ నియంతృత్వం విస్తృతమైపోతున్నది. లంచాలిస్తున్న వాళ్లెవరు? ఓట్లకు నోట్లు తీసుకుంటున్న వాళ్లెవరు? నాయకుల్ని ఎన్నుకుంటున్న వాళ్లెవరు? ప్రజలే!
అసమర్థులైన నాయకుల్ని ఎన్నుకోకుండా నీతీ నిజాయితీ కలిగినవాళ్లను ఎన్నుకుంటే మేలు జరక్కపోయినా వ్యవస్థకు ప్రమాదమైతే ఉండదు. నోట్లు తీసుకొని ఓట్లు వేసే జనం, లంచాలిచ్చి పనులు చేయించుకునే పెద్ద మనుషులు, లంచాలు తీసుకోవడమే వృత్తిగా పెట్టుకొని, నాయకులకు నీడలాగా తిరుగుతూ అయిన దానికీ, కాని దానికీ రాజకీయ ఏజెంట్లుగా బతుకుతున్న చెంచాలూ, ఈ చెంచాల అడుగులకు మడుగులొత్తే ఉప నాయకులూ ప్రజల్లోనే ఉన్నారు. కాబట్టే ప్రజలు కష్టాలకు గురవుతున్నారు. దేశమంతటా జరుగుతున్న అన్యాయాల్నీ, అక్రమాల్నీ, అరాచకాల్నీ, అత్యాచారాల్నీ, అవినీతినీ కళ్లారా చూస్తూ నిర్లక్ష్యంతో, నిర్లిప్తంతో ఉన్నవాళ్లూ ప్రజలే.
ప్రజల ప్రతిబింబమే ప్రభుత్వం. వాళ్లు సృష్టించుకున్నదే ప్రభుత్వం. కాబట్టి ప్రజలు తమ బాధ్యతల్ని గ్రహించుకొని ప్రవర్తించినప్పుడే నీతీ నిజాయితీ కలిగిన పార్టీలు ఏర్పడతాయి. అప్పుడే మహోన్నతమైన నాయకత్వం లభిస్తుంది. మహా శక్తిమంతమైన ప్రభుత్వం నెలకొంటుంది. దేశం బాగుపడుతుంది. ప్రజల్లో నైతిక శక్తి కొరవడితే ప్రజలెన్నుకొన్న పార్టీల్లో అవినీతి పెరిగిపోతుంది. అవినీతికి ఆశ్రయమిచ్చే పార్టీలు నెలకొల్పే ప్రభుత్వాలు అన్యాయాన్ని అవలంబిస్తాయి. దీనివల్ల ప్రజాస్వామ్యానికే ముప్పు వాటిల్లుతుంది. దేశం అధోగతిలోకి వెళ్తుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ తన బాధ్యతను గుర్తించి, తన కర్తవ్యాన్ని నిర్వర్తించాలి.