Showing posts with label suttivelu. Show all posts
Showing posts with label suttivelu. Show all posts

Saturday, March 30, 2013

'రెండుజెళ్ల సీత' రివ్యూ


రచయిత జంధ్యాల అల్లిన పసందైన కథ, దర్శకుడు జంధ్యాల నడిపిన హుషారైన కథనం, సంగీత దర్శకుడు రమేశ్‌నాయుడు కూర్చిన వినసొంపైన బాణీలు, ఛాయాగ్రాహకుడు ఎస్. గోపాలరెడ్డి కెమెరా పనితనం కలిపి 'రెండుజెళ్ల సీత'ను ముగ్ధమోహనంగా తయారుచేశాయి. ఆబాల గోపాలానికి నచ్చేట్టు చేశాయి. ఈ సినిమాలో కథ చాలా సింపుల్. గోపి, కృష్ణ, మోహన్, మూర్తి అనే నలుగురు ఆకతాయి అబ్బాయిలు ఓ అందమైన అమ్మాయిని ప్రేమించేయాలనుకుంటారు. అందమైన అమ్మాయి ఉండే కుటుంబానికి తమ భవనంలో ఓ వాటని అద్దెకు ఇవ్వాలని భావిస్తారు. దీని కోసం సుబ్బారావు అనే అమాయకుణ్ణి ఆటపట్టించి ఓ వాటాని ఖాళీ చేయిస్తారు. ఆ వాటాలో సీత అనే అమ్మాయి తన అమ్మా నాన్నలతో ఆ వాటాలో దిగుతుంది. నలుగురు కుర్రాళ్లూ అమాంతం ఆమెని ప్రేమించేసి, బోలెడు కలలు కంటారు. తన్నులు కూడా తింటారు. రాజీకి వచ్చి "మా నలుగురిలో ఎవరంటే నీకిష్టం" అని సూటిగా సీతనే అడుగుతారు. "నాకు మధు అంటే ఇష్టం" అని చెబుతుంది సీత. ఆ మధు ఎవరన్నది సినిమాలోనే చూడాలి.
ఈ కథలోని సన్నివేశాలకు జంధ్యాల రాసిన సంభాషణలు, ఆ సన్నివేశాల్ని ఆయన చిత్రీకరించిన తీరు వల్ల ఆద్యంతం ఆహ్లాదం కలుగుతుంది. సీత కోసం అబ్బాయిలు పడే పాట్లు, వారి చేతుల్లో సుబ్బారావు పడే అగచాట్లు బాగా నవ్వింపజేస్తాయి. ఈ నవ్వుల మధ్య హృదయాన్ని బరువెక్కించే సన్నివేశాలూ ఉన్నాయి. వరకట్న దురాచారం కష్ట నష్టాల్ని సైతం ఇందులో చూపించారు జంధ్యాల. రమేశ్‌నాయుడు కూర్చిన బాణీల్లో 'లేడి వేటా లేడీ వేటా', 'రెండు జెళ్ల సీతా తీపి గుండె కోతా', 'మందారంలో ఘుమఘుమనై', 'కొబ్బరి నీళ్లా జలకాలాడి' పాటలు మళ్లీ మళ్లీ వినాలనిపిస్తాయి. విశాఖ సముద్ర తీర ప్రాంతంలోనూ, అరకు లోయలోనూ ఈ పాటల్ని నయనానందకరంగా చిత్రించాడు గోపాలరెడ్డి.
రెండుజెళ్ల సీతగా కొత్తమ్మాయి మహాలక్ష్మి చక్కగా నవ్వుతూ నిజంగానే యువతకు 'తీపి గుండెకోత' పెట్టించింది. ఆమె తల్లి పుష్పలత ఇందులోనూ ఆమెకి తల్లిగానే నటించారు. నలుగురు అబ్బాయిలుగా నరేశ్, ప్రదీప్, రాజేశ్, శుభాకర్ హుషారుగా నటించారు. సుబ్బారావుగా సుత్తివేలు నటన, ఆయన డైలాగులు స్పెషల్ ఎట్రాక్షన్. శ్రీలక్ష్మి నవ్వులు పంచుతుంది. ఇది జంధ్యాలకు మరింత పేరు తెచ్చిన సినిమా.

Sunday, September 18, 2011

ప్రివ్యూ: యథార్థ ప్రేమకథ

కొంతకాలం క్రితం 'అనితా ఓ అనితా' అనే ప్రైవేట్ సాంగ్ రాష్ట్రంలో కలకలం సృష్టించింది. నాగరాజు అనే యువకుడు తన ప్రేయసిపై రాసి, స్వరాలు కూర్చి పాడిన పాట అది. అప్పట్లో ఆ పాట వెనుక కథ మీడియాలో ప్రముఖంగా రావడంతో కన్నడ నటుడు చరణ్‌రాజ్ దృష్టి దానిపై పడింది. తెలుగులో 'ప్రతిఘటన'తో విలన్‌గా పరిచయమై పాపులర్ అయిన అతను ఇప్పుడు నాగరాజు జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా 'యథార్థ ప్రేమకథ' అనే చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఈ సినిమాని డైరెక్ట్ చేస్తూ సి.ఆర్. క్రియేషన్స్ బేనర్‌పై స్వయంగా నిర్మిస్తున్నాడు చరణ్‌రాజ్. అంతేకాదు కథ, స్క్రీన్‌ప్లేని కూడా తనే సమకూర్చి, చిత్రంలో ఓ కీలక పాత్ర సైతం చేస్తున్నాడు.
"హృదయాన్ని స్పృశించే సంఘటనలు, సన్నివేశాలతో ఈ సినిమా తయారవుతోంది. ఇందులోని ప్రేమకథతో పాటు, వినోదం కూడా ప్రేక్షకుల్ని అలరిస్తుంది. అక్టోబర్ నెలాఖరులో చిత్రాన్ని విడుదల చేయాలనేది మా సంకల్పం'' అని చరణ్‌రాజ్ తెలిపాడు.
అమర్, చిరి హీరో హీరోయిన్లుగా పరిచయమవుతున్న ఈ చిత్రంలో సుత్తివేలు, నళిని, సుమన్‌శెట్టి, నర్సింగ్ యాదవ్, శరత్, చిన్నా, హర్ష, కీర్తి, చంద్రశేఖర్, ఫణి, గోపాలకృష్ణ, చందు తారాగణం. ఈ చిత్రానికి మాటలు: ఎం.వి.ఎస్. హరనాథరావు, పాటలు: సురేందర్, నాగరాజు, సంగీతం: సాయికార్తీక్, ఛాయాగ్రహణం: వంశీకృష్ణ పి., కూర్పు: వి. నాగిరెడ్డి, కళ: బాబా, కథ, స్క్రీన్‌ప్లే, నిర్మాణం, దర్శకత్వం: చరణ్‌రాజ్ ఎన్.వై.