Showing posts with label suddala. Show all posts
Showing posts with label suddala. Show all posts

Thursday, September 29, 2011

కళాఖండం: మాభూమి (1980)

ఒక అపురూపమైన చిత్రం 1980లో వచ్చింది. తెలంగాణా సాయుధ పోరాట ఇతివృత్తంతో వచ్చిన ఆ సినిమా 'మాభూమి'. ఆ సినిమా విడుదలకు ముందు బిజినెస్ కాలేదు. విడుదలైన మొదటివారంలో థియేటర్లలో జనాలే లేరు. రోజులు గడిచిన కొద్దీ పుంజుకుని జనంతో కిటకిటలాడింది. ఇది అయాచితంగా వచ్చిన విజయం కాదు. ఈ సినిమాలోని గూడ అంజయ్య, సుద్దాల హనుమంతు, దేవీప్రియ పాటలు జనం గుండెల్లో మారుమోగాయి. సంధ్యతో కలిసి ప్రజా గాయకుడు గద్దర్ పాడిన ఆ పాటలు దడదడలాడించాయి. ఆ సినిమాకి సంగీతాన్ని అందించింది సీత.
ఈ సినిమాలో ముఖ్య పాత్రల్ని పోషించింది పెద్ద పేర్లున్న వారు కాదు. ఈ సినిమా నిర్మాత బి. నరసింగరావు స్వతహాగా చిత్రకారుడు. గేయకర్త. విమర్శకుడు, జర్నలిస్టు. చిత్ర నిర్మాణం మీద క్రేజ్ ఉన్న ఉత్తమ అభిరుచులు కలిగిన కళాభినివేశి. "తెలంగాణ సాయుధ పోరాటాన్ని, తదనంతర జీవితాన్ని తెరకెక్కించాలనేది నా చిరకాల వాంఛ. అందుకే ఎన్ని శ్రమదమాదులకోర్చయినా ఈ సినిమా తీయగలిగాను" అని చెప్పారు నరసింగరావు. సినిమాటోగ్రాఫర్‌గా అప్పటికే పేరుపొందిన గౌతం ఘోష్ దర్శకత్వంలో అద్భుతంగా రూపొందింది 'మాభూమి'. తన భార్యతో కలిసి తెలంగాణా జన జీవితంలోని లోతుల్ని తరిచి తరిచి చూసేందుకు నెలల తరబడి ఆ ప్రాంతాల్లో తిరిగాడు గౌతం. సెట్స్ మీదకు వెళ్లేముందు నరసింగరావు, రచయిత ప్రాణ్‌రావు, గౌతం అహోరాత్రాలు స్క్రిప్టుమీద పనిచేశారు. అందుకే అది లోబడ్జెట్ డాక్యుమెంటరీలాగా కాకుండా అందమైన కళాఖండంగా తయారైంది. వర్గభేదం, వయోబేధం, లింగభేదం, ప్రాంతభేదం లేకుండా అన్ని తరగతులవారు అమితంగా ఆ చిత్రాన్ని ఆదరించారని చెప్పారు ఆ సినిమాలో ప్రధాన పాత్ర పోషించిన సాయిచంద్.
ఓ విభిన్న అంశాన్ని సృజిస్తూ వచ్చిన ఈ సినిమా సినీ పండితుల అంచనాల్ని తలకిందులు చేస్తూ పండిత పామరుల్ని కూడా ఒకే రీతిగా అలరించడానికి వెనుకనున్న రహస్యమేమిటి? మూస సినిమాలతో విసిగివున్న ప్రేక్షక హృదయాలు మంచి చిత్రం కోసం తపించే తరుణంలో రావడమేనా? అయితే ఇప్పుడూ అదే పరిస్థితి అంతకన్నా ఘోరంగా ఉంది. మరో 'మాభూమి' కోసం ప్రేక్ష హృదయాలు ఆశగా ఎదురుచూస్తున్నాయి.

Saturday, February 12, 2011

హిట్.. హిట్.. హుర్రే..!: ఖుషి-2

శ్రద్ధగా చదువుకుంటోన్న మధు వద్దకొచ్చి పలకరించాడు సిద్ధు. 'డోంట్ డిస్టర్బ్. చదువుకుంటున్నా' అంది మధు. సరేనంటూ అవతలకి వెళ్లి కూర్చుని, తానూ పుస్తకం తెరిచాడు సిద్ధు. చూపు పుస్తకం మీద నిలవనంటోంది. ఆమె వంక చూశాడు. అప్పుడే గాలికి పైట తొలగి తెల్లని, అందమైన మధు నడుము, పొట్ట మధ్యలో చిన్న నాభి కనిపించాయి. అసలే నల్లని చీర కావడంతో ఆచ్ఛాదన లేని ఆమె నడుము భాగం మరింత తెల్లగా కనిపించింది. చూపు తిప్పుకోలేకపోయాడు. ఎందుకో అతడివంక చూసింది మధు. చప్పున తల తిప్పేసుకున్నాడు. ఆమె మళ్లీ పుస్తకం వేపు దృష్టి పెట్టింది. గాలి వీస్తూనే ఉంది. మధు నడుము అనాచ్ఛాదితంగా కనిపిస్తూనే ఉంది. అతడి చూపులు అటువేపు పోతూనే వున్నాయి. అతడి గొంతు తడారిపోతోంది. గుటకలు మింగుతున్నాడు. నాలుగైదు సార్లు అతడి చూపులు గమనించాక, అప్పుడు అర్థమైంది, అతడు ఎక్కడ, ఏం చూస్తున్నాడో.
"సిద్ధు.. ఇదేం బాలేదు" కోపంగా అంది.
"ఏంటీ?" అడిగాడు సిద్ధు ఏం ఎరగనట్లు.
"నువ్వు చేసే పని"
"నేనేం చేశాను?"
"నీ చూపు గురించి మాట్లాడుతున్నా"
"నేనేం చూశాను?"
"నువ్వు నా నడుం చూశావు"
"లేదు"
"నువ్వు చూశావు. నువ్వు చూసింది నేను చూశాను"
"లేదు. చూడలేదు"
"చూశావు. పదిసార్లన్నా చూసుంటావు"
ఇద్దరూ గొడవపడ్డారు. ప్రతిసారీ తనని అపార్థం చేసుకుంటున్నావని అనాడు సిద్ధు. 'పెద్ద అందగత్తెవని పెద్ద ఫీలింగ్' అని కూడా అన్నాడు. బలవంతాన కోపం అణచుకుంటూ, పళ్లు బిగించి "నువ్వు నడుం చూశావా లేదా?" అని మళ్లీ గటిగా అడిగింది మధు. దానికి సమాధానం చెప్పకుండా "నువ్వు నన్ను లవ్ చేశావా, లేదా?" అడిగాడు సిద్ధు. "లేదు" అంది మధు. "నేనూ నీ నడుం చూడలేదు" అని జవాబిచ్చాడు సిద్ధు. మళ్లీ పోట్లాట. "అసలిలాంటి అమ్మాయితో ఫ్రెండ్‌షిప్ చేయను. ఒకవేళ చేసినా అది లవ్ దాకా రాదు. వచ్చినా మ్యారేజ్ దాకా వెళ్లదు. ఖర్మకాలి నన్ను బలవంతంగా పెళ్లికి దింపినా కానీ, 'ఇలాంటమ్మాయి వొద్దు' అని లెటర్ రాసి పారిపోతా" అన్నాడు సిద్ధు. దాంతో ఏడుస్తూ "సిద్ధు అనేవాణ్ణి లైఫ్‌లో కలవలేదనే అనుకుంటా. మనమధ్య ఏమీ లేదు. నథింగ్ బిట్వీన్ యు అండ్ మి" అని అక్కణ్ణించి విసవిసా వెళ్లిపోయింది మధు.
'ఇగో' (అహం) అనేది ఇద్దరు యువతీ యువకుల మధ్య ఎలాంటి యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తుందనే దానికి చక్కని ఉదాహరణ ఈ సన్నివేశం. 'ఖుషి' చిత్రం మొత్తానికీ కీలకమైన సన్నివేశం ఇది. మిగతా సినిమా అంతా ఆధారపడింది ఈ సన్నివేశం మీదే. ఈ సన్నివేశం వల్లే మధు, సిద్ధు ఎడమొహం పెడమొహం అయ్యారు. ఆ తర్వాత ఆ ఇద్దరూ ఎలా ఒకటయ్యారనేదే మిగతా కథ.
ఈ సన్నివేశాన్ని రాసిన తీరూ, తెరమీద దాన్ని చిత్రీకరించిన తీరూ ఉన్నత స్థాయికి చెందుతాయి. అప్పటివరకూ వచ్చిన చిత్రాల్లో నాయికా నాయకుల మధ్య గొడవలకు ఇతరేతర గొడవలెన్నో కారణంగా కనిపిస్తూ వచ్చాయి. హీరోయిన్ 'బెత్తెడంత నడుము'ని హీరో చూసినందువల్ల గొడవ వచ్చి, వాళ్లు దూరమవడమనేది కొత్త. లాజికల్‌గా చూస్తే, హీరో మీద ప్రేమవున్న (నోరుతెరచి చెప్పకపోయినా) నాయిక తన నడుముని నాయకుడు చూశాడని కోప్పడి, అతడికి దూరమవ్వాలనుకోవడం హాస్యాస్పదం అనిపిస్తుంది. అయితే అలాంటి భావన సగటు ప్రేక్షకుడికి కలగకపోవడమే ఈ సినిమా సాధించిన విజయం. అందుకు దోహదం చేసినవి బిగువైన స్క్రీన్‌ప్లే, ఉలాసభరితమైన సన్నివేశాల కల్పన. ఆ ఘనత స్క్రీన్‌ప్లేనీ సమకూర్చిన దర్శకుడు ఎస్.జె. సూర్యదే. అంతేకాదు, ఆ సన్నివేశం ఏమాత్రం అసభ్యకరంగా లేకుండా 'క్యూట్'గా రావడానికి కారణం, పి.సి. శ్రీరాం ఛాయాగ్రహణ ప్రతిభ. ఆ సన్నివేశంతో పాటు ఆద్యంతం తన కెమెరా పనితనంతో చిత్రాన్ని 'విజువల్ ఫీస్ట్'గా తయారుచేశాడు శ్రీరాం. ఆయా సన్నివేశాల్లో సందర్భానుసారం చక్కగా అమరిన సంభాషణలనీ తక్కువ చేయలేం. రాజేంద్రకుమార్ రాసిన సంభాషణలు కథనంలో కావలసినంత 'టెంపో'ని తీసుకొచ్చాయి.
ఇక సిద్ధు, మధు మధ్య దూరం మరింత పెరిగే సన్నివేశంలో పవన్ కల్యాణ్ నోటివెంట పలికే డైలాగుల్ని ప్రేక్షకులు ఎంతగా అస్వాదించారో! గుడుంబా ప్యాకెట్ల కోసం మోషే (అలీ) బయటకు వెళితే అప్పటికే గుడుంబా మత్తులో ఉన్న సిద్ధు గోడమీది బొమ్మలో మధుని చూస్తూ "ఏంటి చూస్తున్నావ్ చెప్పు. నాకు చెప్పాల్సిందే. బాగా.. పెద్ద పెద్ద రెండు గుడ్లగూబల్లాంటి కళ్లు పెట్టుకుని ఎందుకలా చూస్తున్నావో చెప్పవే. (నడుము సైజు చేతితో కొలుస్తూ) బెత్తెడంత చోటు లేదు. దీన్ని మేం చూశామంట. నువ్వు పెద్ద అందగత్తెవి. పిడతంత ముఖం, చుంచులాంటి ముక్కు, గండుచీమ కుట్టి వాచినట్లుండే చిన్ని పెదిం. ఆ.. ఏదో.. చూడాలనిపించే చిన్ని నడుం. నల్ల చీర కట్టుకుని ఒళ్లంతా కప్పుకుని కూర్చున్నప్పుడు ఎర్రగా నిమ్మపండు రంగులో.. ఓ.. నిమ్మపండు పసుపురంగులో ఉంటుంది కదూ. ఓ.. ఎరుపు, పసుపు మిక్సయిపోయి చిన్ని రొమాంటిక్ కలర్లో.. చిన్ని ఏరియా కనిపించినప్పుడు కళ్లు ఆటోమేటిగ్గా చూస్తాయి. అది దాని ('అవి వాటి' అని వుండాలి) నైజం. అది నువ్వు చూపించకుండా వుండాల్సింది. ముఖం నీ వొంట్లో భాగమే. నడుం నీ వొంట్లో భాగమే. ముఖం చూస్తే కోపం రాలేదు. నడుం చూస్తే కోపం వచ్చింది. ఎందుకు? ఎందుకని నేను ప్రశ్నిస్తున్నానంతే. ఇప్పుడు నీ నడుమే కాదు. నీ ఫుల్ బాడీ చూస్తాను. అసలు నువ్వు నా పక్కన నిల్చునే అర్హత కోల్పోయావ్' అని మధు బొమ్మని చింపేస్తాడు. దాన్ని మధు చూసి కోపంతో వెళ్తున్నప్పుడే మెళ్లో గుడుంబా పాకెట్ల దండ వేసుకుని ఎదురు వస్తుంటాడు మోషే.
"ఓరి బాబూ మోషయ్యో. కుత్తే. నా బతుకును బుగ్గిపాలు చేశావు కదరా నీయయ్య. నా ప్రేమను బుగ్గిపాలు చేశావు కదరా.. రాయ్యా రారా.. ఈ సచ్చినోడు కలకత్తా నుంచి నా ప్రేమను పాడు చేయడానికొచ్చాడు సచ్చినోడు.. నీ జిమ్మడిపోను.." అంటూ బాధపడతాడు సిద్ధు. ఈ సన్నివేశాన్నీ, సిద్ధు పాత్ర పలికే డైలాగుల్నీ, ఆ డైలాగుల్ని కృష్ణా జిల్లా యాసలో పవన్ కల్యాణ్ చెప్పే తీరునీ ఆస్వాదించని వాళ్లెవరు? ప్రేక్షకుల్ని బాగా అలరించిన సన్నివేశాల్లో ఇది ముఖ్యమైన సన్నివేశం. కథ అత్యధిక భాగం సిద్ధు, మధు పాత్రల చుట్టూనే తిరుగుతుంది. ఆ పాత్రల్లో పవన్ కల్యాణ్, భూమిక అలవోకగా ఇమిడిపోయారు. నిజమైన ప్రేమికులే గొడవ పడుతున్నంత సహజంగా పాత్ర పోషణ చేశారు ఆ ఇద్దరూ. కల్యాణ్‌కి సిద్ధు పాత్రలాగా అంత బాగా అమరిన పాత్ర 'ఖుషి'కి ముందు కానీ, తర్వాత కానీ మరొకటి లేదు. మధు పాత్రలో భూమిక కూడా అంతే. అందుకే 'క్యూట్ పెయిర్' అనిపించుకుంది ఆ జంట.
ఇక సినిమా విజయంలో కీలక పాత్ర పోషించిన మరో అంశం సంగీతం. మణిశర్మ బాణీలు అందించిన ఆరు పాటలూ ఇప్పటికీ ప్రేక్షకుల పెదాలపై ఆడుతూనే ఉన్నాయి. 'యే మేరా జహా యే మేరా ఘర్ మేరా ఆషియా', 'ప్రేమంటే సులువు కాదురా అది నీవు గెలవలేవురా', 'అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా', 'ఆడువారి మాటలకు అర్థాలే వేరులే', 'చెలియ చెలియా చిరుకోపమా', 'గజ్జె ఘల్లుమన్నాదిరో గుండె ఝల్లుమన్నాదిరో' పాటలు ఒకదాన్ని మించి మరొకటి సూపర్ హిట్. వీటిలో పింగళి పాట 'ఆడువారి మాటలకు అర్థాలే'తో పాటు తొలి రెండు పాటల కాన్సెప్టు కల్యాణ్‌దే. ఇక సన్నివేశాలకి ఇచ్చిన నేపథ్య సంగీతాన్నీ ప్రశంసించకుండా ఉండలేం. హీరో హీరోయిన్లతో పాటు మిగతా నటుల హావభావాలతో సైతం బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కచ్చితంగా సింక్ అవడం ముచ్చటగా అనిపిస్తుంది. ఇన్ని అంశాలు పక్కాగా కుదిరినందునే కుర్రకారుని అంతగా ఆకట్టుకుంది 'ఖుషి'. చివరకు ముసలాళ్లు కూడా ఈ సినిమా చూస్తూ తమ కాలేజీ రోజుల్లోకి వెళ్లిపోయి, కుర్రాళ్ల మాదిరిగా ఆస్వాదించారన్నది నిజం.

అది అద్భుతమైన సీన్
-రాజేంద్రకుమార్
తమిళంలో ఈ సినిమా చేసేప్పుడే నన్ను పిలిపించారు. సెట్స్ మీదే సూర్య నాతో చర్చించేవారు. సంభాషణల్లో తెలుగుదనం ఉట్టిపడాలని చెప్పేవారు. తెలుగు నుడికారంతో మాటలు రాయగలిగా. క్లుప్తమైన సంభాషణలు బాగా వర్కవుట్ అయ్యాయి. కథనాన్ని సూర్య అద్భుతంగా నడిపారు. చిన్న చిన్న ఎక్స్‌ప్రెషన్స్‌కి కూడా ప్రాధాన్యతనివ్వడం చిత్రానికి జీవాన్ని తెచ్చింది. దానికి కాంప్రమైజ్ కాని నిర్మాణం తోడైంది.
'తొలిప్రేమ', 'తమ్ముడు', 'బద్రి' చేసిన పవన్ కల్యాణ్‌కి యూత్‌లో గొప్ప ఇమేజ్ వచ్చింది. ఆ ఇమేజ్ 'ఖుషి'కి బాగా హెల్పయ్యింది. ఫైట్స్, సాంగ్స్ అతనే కంపోజ్ చేశాడు. ఒరిజినల్ తమిళ సినిమాలో కోల్‌కతా ఎపిసోడ్ లేదు. తెలుగులో దాన్ని తెచ్చింది కల్యాణ్. గుళ్లో దీపం ఆరిపోతుంటే హీరో హీరోయిన్లు ఒకేసారి వచ్చి దాన్ని ఆపే ప్రయత్నం అద్భుతమైన సీన్. అలాగే భూమిక నడుముని కల్యాణ్ చూసే సన్నివేశం ఎలాంటి అసభ్యతకి తావులేకుండా సున్నితంగా తీయడం గొప్ప విషయం. ఇలాంటి స్క్రిప్టు అంతదాకా రాలేదు. రీ-రికార్డింగ్ కూడా అద్భుతం. చివరలో ట్రైన్‌లో వెళ్లేప్పుడు రాజ్‌కపూర్ 'మేరా నాం జోకర్'లోని మ్యూజికల్ బిట్‌ని ఉపయోగించారు. అది బాగా కుదిరింది.
రైటర్‌గా నేను చెప్పుకోదగ్గ సినిమా. ఈ సినిమాకి భాగస్వామిని కావడం నా అదృష్టం.

నా పాట గ్రాండ్ హిట్
-సుద్దాల అశోక్‌తేజ
ఓ పాట కోసం నిర్మాత రత్నం చెన్నైకి పిలిపించారు. అక్కడే దర్శకుడు సూర్యనీ కలిశా. సందర్భం చెప్పి పాట ఎరోటిగ్గా ఉండాలన్నారు సూర్య. ఓ పాట రాసిచ్చి వచ్చేశా. దాన్ని హీరో పవన్ కల్యాణ్ విని, మళ్లీ చెన్నై పిలిపించారు. బాగుందని చెబుతూనే 'మొదలు నుంచి చివరి దాకా అమ్మాయి శరీరాన్ని ఎక్కడా మీ 'నిబ్' టచ్ చేయకుండా పాట రాయగలరా? ఆ ఊపు, కవ్వింపు మాత్రం తప్పనిసరిగా ఉండాలి' అన్నారు. దాంతో పాటు ఏదైనా హిట్ సాంగ్ తీసుకుని దాన్ని అనుసరించి రాయమన్నారు. అప్పుడు మళ్లీ రాశా. 'హోలి.. హోలిలో రంగ హోలీ.. చమకేళిల హోలీ' అనే జానపద పాట పల్లవిని తీసుకుని 'ఏకవీర', 'రోషనార' వంటి పదాలు మధ్యమధ్యలో ఉపయోగిస్తూ 'గజ్జె ఘల్లుమన్నాదిరో.. గుండె ఝల్లుమన్నాదిరో' అంటూ రాశా. గ్రాండ్ హిట్. దాని చిత్రీకరణ కూడా అంత బాగానూ వచ్చింది. కల్యాణ్ సినిమాకి నేను రాసిన తొలిపాట ఇదే. ఇప్పటి దాకా మళ్లీ రాయలేదు.
(వచ్చేవారం 'నువ్వు నాకు నచ్చావ్' విశేషాలు) 

Saturday, February 5, 2011

హిట్.. హిట్.. హుర్రే...!: ఖుషి

తారాగణం: పవన్‌కల్యాణ్, భూమిక, అలీ, సుధాకర్, శివాజీ, విజయ్‌కుమార్, నాజర్, రాజన్ పి. దేవ్, సుధ, ముంతాజ్, జానకి, డింపుల్, ఎస్.జె. సూర్య (అతిథి పాత్ర)
మాటలు: రాజేంద్ర కుమార్
పాటలు: పింగళి, ఎ.ఎం. రత్నం, చంద్రబోస్, సుద్దాల అశోక్‌తేజ, అబ్బాస్ టైర్‌వాలా
సాంగ్స్ కాన్సెప్ట్: పవన్‌కల్యాణ్
సంగీతం: మణిశర్మ
ఛాయాగ్రహణం: పి.సి. శ్రీరాం
కూర్పు: బి. లెనిన్, వి.టి. విజయన్, కోలా భాస్కర్
యాక్షన్: విజయ్
యాక్షన్ సీక్వెన్సెస్ రూపకల్పన: పవన్‌కల్యాణ్
కొరియోగ్రఫీ: బృంద, హరీశ్‌పాయ్
ఆడియోగ్రఫీ: హెచ్. శ్రీధర్
ఆర్ట్: ఆనంద్‌సాయి
పబ్లిసిటీ డిజైనర్: లంక భాస్కర్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అళహరి రఘురాం
నిర్మాత: ఎ.ఎం. రత్నం
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎస్.జె. సూర్య
బేనర్: శ్రీ సూర్యా మూవీస్
విడుదల తేది: 27 ఏప్రిల్, 2001

చిరంజీవికి అసలు సిసలు వారసుడు వచ్చాడు.. అందరినోటా ఈ మాట అనిపించేట్లు చేసిన సినిమా 'ఖుషి'. అప్పటికే  'తొలిప్రేమ', 'తమ్ముడు', 'బద్రి' చిత్రాల విజయాలతో మంచి జోష్ మీదున్న పవన్‌కల్యాణ్ ఇమేజ్‌ని అమాంతం శిఖరం మీద నిలిపిన చిత్రం 'ఖుషి'. ఈ సినిమాతో యువతరంలో తిరుగులేని ఆరాధ్యతారగా రాపుదాల్చాడు పవన్‌కల్యాణ్.  
నిజం చెప్పాలంటే మెగాస్టార్‌గా నెంబర్‌వన్ హోదాని అనుభవిస్తోన్న చిరంజీవినే సవాలుచేసే స్థాయికి ఆయన్ని చేర్చింది ఈ సినిమా. 79 కేంద్రాల్లో వంద రోజులు ఆడిన 'ఖుషి', ఐదు కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ జరుపుకుంది. వాణిజ్యపరంగా కానీ, అభినయపరంగా కానీ కల్యాణ్ కెరీర్‌లో ఇప్పటివరకు అత్యుత్తమ చిత్రం ఇదే. పైగా ఇది ఆయనలోని సృజనాత్మక ప్రతిభని కూడా బయటపెట్టిన తొలి సినిమా. ఇందులోని యాక్షన్ సన్నివేశాలన్నింటినీ డిజైన్ చేసింది ఆయనే. అంతేనా, ఆరింటిలో మూడు పాటల కాన్సెప్ట్ ఆయనదే. మామూలుగా మనం చూసే ఫైట్లకీ, పాటలకీ అవి ఎంత భిన్నంగా ఉన్నాయో, అంత బాగానూ అవి ఆకట్టుకున్నాయి. అలరించాయి. ఇక పవన్‌కల్యాణ్, భూమిక జోడీ 'క్యూట్ పెయిర్'గా పేరు తెచ్చుకుని యువతలో అపూర్వమైన క్రేజ్ సంపాదించుకోవడం మనలో చాలామందికి తెలిసిందే. అలాగే ఆ రోజుల్లో ఎక్కడ విన్నా 'ఖుషి' పాటలే. ఆరుకి ఆరూ సూపర్ హిట్. 'మిస్సమ్మ'లోని 'ఆడువారి మాటలకు అర్థాలే వేరులే' పాట రీమిక్స్ సైతం ఇన్‌స్టంట్ హిట్. 
అలాంటి ఈ సినిమా రీమేక్ కావడం గమనార్హం. దీని మాతృక తమిళంలో విజయ్, జ్యోతిక జంటగా నటించగా 2000 సంవత్సరంలో విడుదలై ఘనవిజయం సాధించిన 'ఖుషి' చిత్రం. చెప్పుకోదగ్గ విశేషమేమంటే ఒరిజినల్ సాధించిన విజయన్ని మించి తెలుగు రీమేక్ మరింత పెద్ద విజయం సాధించడం. మాతృకని రూపొందించిన ఎస్.జె. సూర్య ఈ రీమేక్‌నీ డైరెక్ట్ చేశాడు. శ్రీ సూర్యా మూవీస్ బేనర్‌పై ఎన్నో ప్రతిష్ఠాత్మక చిత్రాల్ని అందించిన ఎ.ఎం. రత్నం ఈ సినిమాకి నిర్మాత. సినిమా ఆద్యంతం 'రిచ్'గా కనిపించిందంటే - అందుకు కారణం సూర్య దర్శకత్వ ప్రతిభకి రత్నం ఉన్నతస్థాయి నిర్మాణ విలువలు తోడవడమే. పేరుకి రీమేక్ అయినా మాతృకని మించిన 'నవ్యత' తెలుగు 'ఖుషి'లో అడుగడుగునా గోచరిస్తుంది. ఫైట్లు, పాటల విషయంలోనే కాక సన్నివేశాల కల్పనకూ ఇది వర్తిస్తుంది. అందుకే "ఇది తమిళ వెర్షన్‌ని మక్కీకి మక్కీ కాపీ చేసిన సినిమా కాదు. తమిళం కంటే తెలుగు సినిమా మరింత సృజనాత్మకంగా, మరింత వైవిధ్యంగా ఉంటుంది" అని చెప్పారు పవన్‌కల్యాణ్. చాలామందికి తెలీని సంగతి ఇంకోటుంది. సంభాషణల రచయిత రాజేంద్రకుమార్ మాటల్లో చెప్పాలంటే "తమిళ వెర్షన్‌లో కోల్‌కతా ఎపిసోడ్ లేదు. అక్కడ ఆ ఎపిసోడ్ వేరేవిధంగా ఉంటుంది. కోల్‌కతా నేపథ్యంలో ఆ ఎపిసోడ్ తెచ్చింది కల్యాణే".
'ఖుషి' యువతరాన్ని ఇంత గొప్పగా ఆకట్టుకోవడానికి కారణమేంటి? కథ పరంగా చూస్తే చెప్పుకోడానికి ఏమీలేదు. అతి సన్నని లైను మీద అల్లుకున్న సన్నివేశాల సమాహారం మాత్రమే. ఏమిటా లైను. మాస్టర్స్ డిగ్రీ చేస్తున్న ఇద్దరు యువతీ యువకుల మధ్య సున్నితంగా నడిచే ప్రేమ వ్యవహారం. అదీ కూడా చివరి రీలులో తప్ప ఇద్దరూ తమ ప్రేమని ఎదుటివాళ్ల వద్ద వ్యక్తం చేయరు. ఎప్పుడూ 'అహం' (ఇగో) ప్రదర్శిస్తూ గొడవపడుతూనే ఉంటారు. అయినా ఒకరంటే ఒకరికి ఎనలేని అనురాగం. అలాంటి ఓ అమ్మాయి, అబ్బాయి మధ్య సున్నితంగా సాగే రొమాన్స్‌ని ఇంకెంత సున్నితంగా నడపాలి! పాత 'మిస్సమ్మ' గుర్తుంది కదా. ఎన్‌టీఆర్, సావిత్రి పాత్రలు గుర్తున్నాయి కదా. అందులో ఆ ఇద్దరికీ ఒకరంటే ఒకరికి చెప్పలేనంత అనురాగం. కానీ దాన్ని బయటపెట్టడానికి ఇద్దరికీ 'అహం' అడ్డు వస్తుంటుంది. ఒక రకంగా చెప్పాలంటే 'ఖుషి'లో పవన్‌కల్యాణ్, భూమిక పోషించిన సిద్ధార్థ్‌రాయ్, మధుమతి పాత్రలు వాటికి కొనసాగింపు. నాటి పాత్రల స్వభావాన్ని అందిపుచ్చుకుని నేటి పాత్రల్ని మలచాడు సూర్య. అదీ, అత్యంత ఆకర్షణీయంగా. అందుకే ఆ పాత్రల్లో తమని తాము చూసుకున్నారు కాలేజీ యువత. ఆ పాత్రలతో సహానుభూతి చెందారు. 'ఖుషి' చేసుకున్నారు. వాళ్లని అంతగా ఆకట్టుకున్న సిద్ధార్థ్‌రాయ్, మధుమతి కథేమిటో ఓసారి చూద్దాం. 

కథాసంగ్రహం:
కోల్‌కతాలో సిద్ధార్థ్‌రాయ్ అలియాస్ సిద్ధు (పవన్‌కల్యాణ్), కైకలూరులో మధుమతి అలియాస్ మధు (భూమిక) దాదాపు ఒకే సమయంలో పుడతారు. కాలేజీలో సిద్ధుకి బెంగాల్ టైగర్ అని పేరు. అతని తండ్రి తెలుగువాడైతే, తల్లి బెంగాలీ. మాస్టర్స్ డిగ్రీ కోసం కెనడాకి వెళ్లాలనేది సిద్ధు కోరిక. తల్లికి ఇష్టముండదు. ఎమ్మెస్ చదవాలనేది మధు లక్ష్యం. తండ్రి బాపిరాజు (విజయ్‌కుమార్) ఒప్పుకోడు. 'మా అమ్మాయి పెళ్లికి ఒప్పుకోవాలి' అంటూ గుడిచుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న తండ్రిని చూసి పెళ్లికి సరేనంటుంది మధు. పెళ్లిరోజు 'ఇంతకు ముందే నేనో అమ్మాయిని ప్రేమించా. ఆమె ఆత్మహత్యకు సిద్ధపడింది. ఆమె వద్దకి వెళ్తున్నా. నన్ను క్షమించండి' అంటూ ఆ కనిపించని వరుడు ఉత్తరం రాసి వెళ్లిపోతాడు.
కెనడాకని కారులో ఎయిర్‌పోర్ట్‌కి వెళ్తున్న సిద్ధు రోడ్డు మీద సిగ్నల్స్ వద్ద అడ్డం వచ్చిన ఓ యువకుణ్ణి (ఎస్.జె. సూర్య) తప్పించబోయి, ఇంకో కారుని గుద్దేస్తాడు. హాస్పిటల్లో తేలతాడు. రెండు నెల్లు బెడ్ రెస్ట్ తప్పదంటారు డాక్టర్లు. పెళ్లి తప్పిన మధు, కెనడా ప్రయాణం ఆగిన సిద్ధు హైదరాబాద్ నిజాం కాలేజీలో అడుగుపెడతారు. అక్కడ సిద్ధుకి స్నేహితుడైన బాబు (శివాజీ), మధుకి ఫ్రెండయిన శాంతి (డిపుల్) ప్రేమలో పడతారు. బాబు అనాథ అయితే శాంతి పేరుపొందిన గూండా గుడుంబా సత్తి (రాజన్ పి. దేవ్) కూతురు. ఆ ఇద్దరికీ సిద్ధు, మధు సాయపడుతుంటారు. ఆ రకంగా ఇద్దరూ ఒకరికొకరు సన్నిహితమవుతారు. ఓసారి చదువుకుంటున్న మధు వద్దకు వచ్చి పలకరిస్తాడు సిద్ధు. 'డోంట్ డిస్టర్బ్. చదువుకుంటున్నా' అంటుంది మధు. కొద్ది దూరంలో కూర్చుని సిద్ధు ఆమె వంక చూస్తే గాలికి పైట తొలగి అనాచ్చాదితమైన ఆమె నడుము, నాభి.. చూపు తిప్పుకోలేకపోతాడు. మధు తనవైపు చూడగానే తల తిప్పుకుంటాడు. ఇలా మూడు నాలుగుసార్లు జరగడంతో సిద్ధు ఏం చూస్తున్నాడో అర్థమై అతడితో గొడవపెట్టుకుంటుంది మధు. 'నువ్వు నా నడుం చూశావు' అని మధు అంటే 'లేదు' అంటాడు సిద్ధు. ఇద్దరి మధ్యా వాదన జరుగుతుంది. "అసలిలాంటి అమ్మాయితో ఫ్రెండ్‌షిప్ చెయ్యను. ఒకవేళ చేసినా అది లవ్‌దాకా రాదు. వచ్చినా అది మ్యారేజ్ దాకా వెళ్లదు. ఖర్మకాలి నన్ను బలవంతంగా పెళ్లికి దింపినా కానీ, ఇలాంటమ్మాయి వొద్దని లెటర్‌రాసి పారిపోతా" అనికూడా అంటాడు. దాంతో ఏడుస్తూ "సిద్ధు అనేవాణ్ణి లైఫ్‌లో కలవలేదనే అనుకుంటా. నథింగ్ బిట్వీన్ యు అండ్ మి" అంటా వెళ్లిపోతుంది మధు. 
బాబు, శాంతికి సిద్ధు సాయపడుతుండటంతో అతడిమీద సత్తి మనుషులు ఎటాక్ చేస్తారు. ఒకడు సిద్ధుని కత్తితో పొడవబోవడం చూసిన మధు ఆ కత్తిని చేతితో గట్టిగా పట్టుకుని గాయపడుతుంది. ఆమెని హాస్పిటల్లో చేరుస్తాడు సిద్ధు. ఇద్దరూ మళ్లీ దగ్గరవుతున్నట్లే వుంటారు కానీ ఇగోలు తగ్గవు. శాంతికి పెళ్లి నిశ్చయం చేస్తాడు సత్తి. దాంతో శాంతి, బాబుకు గుళ్లో పెళ్లి ఏర్పాట్లు చేస్తాడు సిద్ధు. సత్తి, అతని అనుచరులు అక్కడికి వస్తుంటే మధ్యలో అటకాయించి, వాళకి తన కత్తి పదును రుచి చూపిస్తాడు. స్నేహితులమైన మేమే వాళ్ల పెళ్లికి సాయపడుతుంటే, తండ్రివైన నీవెందుకు వాళ్ల పెళ్లిని అడ్డుకుంటున్నావని అడుగుతాడు సత్తిని. అతని మంచి మాటలతో రియలైజ్ అయిన సత్తి మంచివాడిగా మారిపోయి, వధూవరుల మీద అక్షింతలు చల్లుతాడు. ఎవరిదారిన వాళ్లు ఆనందంగా వెళ్లిపోతారు. చదువులు అయిపోతాయి. విడిపోవాల్సిన సమయం వచ్చేసింది. సూట్‌కేసులు సర్దుకుంటుంటే మధు, సిద్ధు హృదయాలు ఆవేదనాభరితం అవుతాయి. ఒకరి మనసులోని భావం మరొకరికి చెప్పుకోవాలనుకుంటారు. కుదరదు. సిద్ధు ఫలక్‌నామా ఎక్స్‌ప్రెస్‌కి వెళ్తున్నాడని మధుకీ, మధు గౌతమి ఎక్స్‌ప్రెస్‌లో వెళ్లబోతున్నదని సిద్ధుకీ తెలుస్తుంది. స్టేషన్‌లో మధు కోసం గౌతమిలో సిద్ధు, అతని కోసం ఫలక్‌నామాలో మధు వెతుకుతారు. కనిపించకపోయేసరికి మధుకివ్వమని సిద్ధు, సిద్ధుకివ్వమని మధు పక్క సీట్లలో ఉన్నవారికి ఓ లెటర్ ఇచ్చి వాళ్లు వచ్చాక ఇవ్వమంటారు. రైలుబళ్లు కదులుతాయి. ఉత్తరాలు అందుతాయి. 'ఐ లవ్ యు మధు' అని సిద్ధు, 'ఐ లవ్ యు సిద్ధు' అని మధు రాసుకుంటారు. 'నన్ను ప్రేమించడానికీ, నాతో గొడవపడ్డానికీ నువ్వు కావాలి సిద్ధూ' అని కూడా రాస్తుంది మధు.

తెలుగు 'ఖుషి' మరింత సృజనాత్మకం
-పవన్‌కల్యాణ్
రీమేక్ అంటే రీమేకే. కథ విషయానికి వస్తే 'ఖుషి' ఒరిజినల్ కాకపోవచ్చు. కానీ చాలా సన్నివేశాల్లో, ఫ్రేముల్లో ఒరిజినాలిటీ ఉంది. పాటలు, ఫైట్లు కొత్తగా డిజైన్ చేశాం. రెండు భాషల్లోనూ 'ఖుషి' చూస్తే ఆ సంగతి మీకు అర్థమవుతుంది. అంటే తమిళ మాతృకని మేం మక్కీకి మక్కీ కాపీ చేయలేదు. సృజనాత్మకత పరంగా చూస్తే చిత్రంలో చాలా కొత్త ఐడియాలు ప్రవేశపెట్టాం. మాతృక కంటే తెలుగు వెర్షన్ మరింత సృజనాత్మకంగా, మరింత వైవిధ్యంగా ఉంటుందనే సంగతి తెలుస్తుంది.
దర్శకుడు సూర్యలో ఏదైనా కొత్తగా చేయాలనే తపన అధికం. నేనూ అలాంటి నావెల్టీనే కోరుకుంటా కాబట్టి మామధ్య మంచి అండర్‌స్టాండింగ్ కుదిరింది. అందువల్లే ఫైట్స్‌నీ, కొన్ని పాటల్నీ నేను డిజైన్ చేశా. కొన్ని సన్నివేశాల్నీ సమన్వయంతో చేసుకుపోయాం. ఈ సినిమాకి రత్నం నిర్మాత కావడం పెద్ద ప్లస్ పాయింట్. దేనికీ ఆయన 'నో' చెప్పలేదు. 

(వచ్చేవారం 'ఖుషి' ఘనవిజయానికి దోహదం చేసిన అంశాలు)