Showing posts with label brindavanam. Show all posts
Showing posts with label brindavanam. Show all posts

Saturday, November 13, 2010

సినిమా: 'బృందావనం' హిట్టేనా?

ఎన్.టి.ఆర్. హీరోగా నటించిన 'బృందావనం' హిట్టేనా? హిట్టయ్యిందని అందరూ అనుకునేలా చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయా? పరిశీలనగాచూస్తే రెండోదే నిజమనిపిస్తోంది. విడుదలైనప్పుడు ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది. 'కొమరం పులి', 'ఖలేజా' సినిమాలు ఫ్లాప్ కావడంతో 'రోబో' ప్రభంజనాన్ని 'బృందావనం' అడ్డుకుంటుందని విశ్లేషకులు భావించారు. చిత్రంగా ఆశించిన రీతిలో ఓపెనింగ్స్‌ని రాబట్టడంలో 'బృందావనం' విఫలమైంది. దాంతో నిర్మాత దిల్ రాజు సినిమా ప్రమోషన్ మీద ఎక్కువ దృష్టిపెట్టి ఊకదంపుడు ప్రచారం సాగిస్తూ వచ్చారు. ఏ చానల్ చూసినా ఈ సినిమా గురించిన ప్రకటనలూ, ప్రచారమే. ఈ యేడాది 'టాప్ 3' సినిమాల్లో 'బృందావనం' ఉంటుందని తానన్న మాటల్ని నిజం చేయాలనే తాపత్రయమే ఆయనలో కనిపిస్తూ వచ్చింది.
నిన్నటికి నిన్న ఈ సినిమా ఆడియో ట్రిపుల్ ప్లాటినం డిస్క్ ఫంక్షన్లో "ఈ సినిమా ఈ యేడాది టాప్ 3లో నిలిచింది' అని చెప్పడం దీన్నే సూచిస్తోంది. అలాగే నైజాంలో టాప్ 5గా నిలిచిందని కూడా ఆయనన్నారు. పైరసీ లేకుండా ఉన్నట్లయితే టాప్ 1గా నిలిచేదని ఆయన ఆక్రోశించారు.
కానీ అదే పైరసీని తట్టుకొని 'రోబో' సూపర్ కలెక్షన్లని సాధించిన సంగతిని ఆయన కావాలనే విస్మరించారు. ఏదేమైనా నైజాం, వైజాగ్ మినహాయించి మిగతా ఏరియాలకి ఈ సినిమాని కొన్న బయ్యర్లు అంత హ్యాపీగా లేరని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. లాభాల సంగతలా వుంచి నష్టాలు రాకుంటే అంతే చాలని వాళ్లు కోరుకుంటున్నారు.

Friday, October 29, 2010

సినిమా: మూడు క్రేజీ సినిమాలు - ఒక వాస్తవం (చివరి భాగం)

'ఖలేజా' కనిపిస్తున్నదెక్కడ?
మూడేళ్ల విరామంతో మహేశ్ సినిమా వస్తున్నదనేసరికి ఆయన అభిమానుల్లోనే కాక, సాధారణ ప్రేక్షకుల్లోనూ ఎంత ఆసక్తి! బాక్సాఫీసు చరిత్రని 'మహేశ్ ఖలేజా' తిరగరాస్తుందనే చాలామంది ఆశించారు, నమ్మారు. తీరా థియేటర్లలో సినిమా విడుదలయ్యాక చూస్తే.. 'ఈ సినిమా కోసమా మహేశ్ మూడేళ్లు ఆగింది' అనే వ్యాఖ్యలే, విమర్శలే. కథని కాక, కేవలం కాంబినేషన్ ని నమ్ముకుని సినిమా తీస్తే ఫలితం ఎలా ఉంటుందో చెప్పిన సినిమా 'ఖలేజా'. ఈ సినిమా కంటే ముందు వేరే దర్శకులతో వేరే సినిమాలు చేస్తానని మహేశ్ నుంచి ప్రకటనలు వచ్చాయి. కానీ అవన్నీ పక్కకి వెళ్లిపోయి, త్రివిక్రమ్ సినిమా ముందుకొచ్చింది. మహేశ్, త్రివిక్రమ్ కాంబినేషనులో అదివరకు వచ్చిన 'అతడు' హిట్టవడం, అప్పుడే త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన 'జల్సా' విజయం సాధించడం దీనికి కారణం. హీరోయిన్ విషయంలోనూ ఇదే స్థితి. మొదట ఎంపిక చేసిన పార్వతీ మెల్టన్ ని కాదని 'అరుంధతి' సూపర్ హిట్టవడంతో అనుష్కని హీరోయినుగా తీసుకున్నారు. సూపర్ హీరో, సూపర్ హీరోయిన్, సూపర్ డైరెక్టర్ కాంబినేషన్ బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుందని నిర్మాత ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. 'పులి' కథని కానీ, 'ఖలేజా' కథని కానీ ముందుగా ఆయన వినలేదు. కాంబినేషన్స్ ని కుదుర్చుకుని, పెట్టుబడి పెట్టారంతే. ఒకప్పటి నిర్మాతలకీ, ఈ కాంబినేషన్ నిర్మాతలకీ అదే తేడా.
'ఖలేజా'లో ప్రారంభం నుంచి చివరిదాకా రీజనింగ్ కి అందని సన్నివేశాలెన్నో. హీరో ఇంట్రడక్షన్ సీనులో ఎడారిలో మనుషుల్ని మహేశ్ కత్తులతో కుత్తుకలు కోస్తుంటే, వాళ్లు అతనికి ఏం అన్యాయం చేశారో, ఎంతటి దుర్మార్గాలు చేశారో.. అనుకుంటాం. కానీ వాళ్లని అతను చంపింది 'నీళ్ల' కోసం! ఆ ఓపెనింగ్ ఫైట్ తోటే హీరో పాత్ర ఔచిత్యం దెబ్బతినిపోయింది. విషపు నీటివల్ల ఐదొందల పైచిలుకు జనాభా ఉన్న ఓ ఊరు వల్లకాడవుతుంటే, వాళ్లని 'దేవుడు'గా మహేశ్ ఎలా కాపాడాడనేది ఈ సినిమా ప్రధానాంశం. 'స్టఫ్' అంటూ లేని ఈ కథలోని 95 శాతం సన్నివేశాల్లో అంతా తానై కనిపిస్తాడు మహేశ్. అంటే ప్రధాన పాత్ర మీదే ధ్యాసంతా పెట్టిన దర్శకుడు మిగతా పాత్రల పట్ల చిన్నచూపు చూశాడు. తనవరకు విభిన్నమైన డైలాగ్ డిక్షనుతో, నటనతో మహేశ్ ఎంతగా చెలరేగిపోయినా, బిగువైన కథనం లేకపోవడమే 'ఖలేజా'కి ప్రతికూలంగా పరిణమించింది. ప్రపంచవ్యాప్తంగా తొలివారం బాక్సాఫీసు వద్ద భారీగా 21 కోట్ల రూపాయల షేరుని వసూలుచేసిన ఈ సినిమా కలెక్షన్లు రెండో వారం బాగా నెమ్మదించాయి. దాదాపు 40 కోట్ల రూపాయల (అంచనా) వ్యయమైన ఈ సినిమాకి పెట్టుబడి రావడం చాలా కష్టమనేది ట్రేడ్ వర్గాల మాట.
'బృందావనం' అందరిదయ్యేనా?
'బృందావనం' బాగుంది.. ఎక్కడికెళ్లినా ఇదే మాట. ఎన్టీఆర్ కథానాయకుడిగా; కాజల్ అగర్వాల్, సమంతా నాయికలుగా నటించిన ఈ సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో సినిమా విడుదలైన తొలిరోజు నిర్మాత రాజు, దర్శకుడు వంశీ పైడిపల్లి ముఖాలు సంతోషంతో వెలిగిపోయాయి. 'బృందావనం' సూపర్ డూపర్ హిట్టయి, బాక్సాఫీసు వద్ద రారాజుగా వెలిగిపోతున్న 'రోబో'ని నిలువరించడం ఖాయమనే ట్రేడ్ వర్గాలు భావించాయి. అయితే టాక్ కీ, కలెక్షన్లకీ కనిపిస్తున్న దూరం బయ్యర్లని ఆందోళన పరుస్తోంది. పైరసీ కారణంగానే ఈ సినిమాకి ఆశించిన రీతిలో వసూళ్లు రావడం లేదనేది ఓ వాదన. అదే నిజమైతే 'రోబో' కలెక్షన్లు ఇంకా నిలకడగా ఎందుకున్నాయనేది ప్రశ్న. ఇంతవరకు చేయని కొత్త తరహా పాత్రలో ఎన్టీఆర్ నటన అందరి ప్రశంసలూ పొందుతున్నప్పటికీ స్త్రీల హక్కులు, సమానత్వం మీద ఎంతో చైతన్యం కనిపిస్తున్న ఈ రోజుల్లోనూ 'ఒక పురుషుడికి ఇద్దరు స్త్రీలు' పాయింట్ ఎలా మెప్పు పొందుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 30 కోట్ల రూపాయలకు మించి వ్యయమైన ఈ సినిమాకి పెట్టుబడి రావాలంటే మరో రెండు వారాల పాటు కలెక్షన్లు బలంగా ఉండాలి. అయితే 'రోబో' స్థాయిలో ఈ సినిమా పట్ల ప్రేక్షకులు ఆసక్తి కనపర్చడం లేదనేది కనిపిస్తున్న వాస్తవం. మాస్ హీరో అయిన ఎన్టీఆర్ సినిమాకి 'బృందావనం' వంటి సాఫ్ట్ టైటిల్ పెట్టడం వల్లే ఓపెనింగ్స్ లో ఉధృతి కనిపించ లేదనేది ట్రేడ్ విశ్లేషకుల భావన.
డబ్బింగ్ సినిమాల వల్ల తెలుగు సినిమాలకు థియేటర్లు కరువవుతున్నాయని ఇప్పటిదాకా చిన్న సినిమాల నిర్మాతలు ఆవేదన చెందుతూ వచ్చారు. ఇప్పుడు ఆ డబ్బింగ్ సినిమాల వల్ల తమకూ ముప్పు ఏర్పడిందని పెద్ద సినిమాల నిర్మాతలు బాధపడే రోజులొచ్చాయి. కిం కర్తవ్యం? కాంబినేషన్ల మీదకంటే కథాకథనాల మీద శ్రద్ధ ఎక్కువగా పెట్టడమే.                          

Thursday, October 28, 2010

సినిమా: మూడు క్రేజీ సినిమాలు - ఒక వాస్తవం (1వ భాగం)

ఒక డబ్బింగ్ సినిమా ఒకవైపు.. మూడు భారీ, క్రేజీ తెలుగు సినిమాలు ఇంకోవైపు.. మామూలుగా అయితే డబ్బింగ్ సినిమా మట్టికరచి మాయం కావాలి. చిత్రం.. సీను రివర్స్. తెలుగులో అగ్ర కథానాయకులు నటించిన సినిమాల్నే వెనక్కి నెట్టేస్తూ ఆ డబ్బింగ్ సినిమా అప్రతిహతంగా బాక్సాఫీసును దున్నేస్తోంది. తెలుగు ప్రేక్షకులకి వినోదపు మజాని రుచి చూపిస్తూ నాణ్యమైన సినిమాకే వాళ్లు పట్టం కడతారనే నిజాన్ని చాటి చెబుతోంది. ఆ డబ్బింగ్ సినిమా 'రోబో'. ఆ భారీ, క్రేజీ సినిమాలు 'పులి', 'మహేశ్ ఖలేజా', 'బృందావనం'. తమిళ అగ్ర కథానాయకుడైన రజనీకాంత్ టాలీవుడ్ టాప్ హీరోల్ని పడగొట్టి బాక్సాఫీసు మీద గుత్తాధిపత్యం చలాయిస్తుండటం ఆషామాషీ సంగతి కాదు. టాలీవుడ్ వర్గాలు చాలా చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన సంగతి.
ఎందుకిలా జరిగింది? మొదటే హీరోని దృష్టిలో పెట్టుకుని కథలు వండటం తెలుగు దర్శకులు, రచయితలకి బాగా అలవాటైన పనయితే, స్క్రిప్టు మీదే ఎక్కువ దృష్టిపెట్టి, ఆ స్క్రిప్టుకి పనికొచ్చే నటుణ్ణి వెతుక్కోవడం తమిళ దర్శకుడైన శంకర్ కి తెలిసిన పని. 'రోబో' గురించీ, ఆ సినిమా ఆంధ్రప్రదేశ్ బాక్సాఫీస్ మీద చేస్తున్న సందడి గురించీ ఇదివరకే చెప్పుకున్నాం. ఇప్పుడు ఆ సినిమా స్థాయిలో మన మూడు తెలుగు స్ట్రెయిట్ సినిమాలు ఎందుకని ప్రేక్షకుల్ని అలరించలేక పోతున్నాయో విశ్లేషించుకోవాల్సిన సందర్భం.
తోకముడిచిన 'పులి'
'రోబో' కంటే మూడు వారాల ముందు విడుదలైన పవన్ కల్యాణ్ సినిమా 'పులి' (కొమరం పులి)ని ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో వెయ్యి ప్రింట్లతో విడుదల చేశారు. అందుకే తొలివారం ఆ సినిమా 25 కోట్ల రూపాయల్ని వసూలు చేసింది. నిజానికి అందులో ముప్పాతిక వంతు తొలి మూడు రోజుల్లోనే రావడం గమనార్హం. ఆ తర్వాత నుంచే ఆ సినిమాకి వచ్చే వాళ్లు కనుచూపు మేరలో కనిపించకుండా పోయారు. ఆ 'ఘనత'ని మొత్తంగా దర్శకుడు ఎస్.జె. సూర్యకే ఆపాదించారు. ప్రేక్షకుల్ని కుర్చీల్లోంచి లేవకుండా కూర్చోపెట్టాలంటే వినోదమన్నా వుండాలి, ఉత్కంఠభరితమైన కథనమన్నా వుండాలి. ఆ రెండూ లేకపోవడమే 'పులి' పరాజయానికి ప్రధాన కారణమనేది విమర్శకుల అభిప్రాయం. పులి పాత్ర చేత పదే పదే 'ప్రసంగాలు' ఇప్పించడం సినిమాకి పెద్ద మైనస్ పాయింట్. జనం సినిమాకి వచ్చేది ప్రధానంగా వినోదం కోసమేననే, సినిమాలోని ప్రధాన పాత్రలతో వాళ్లు సహానుభూతి చేందితేనే సినిమా ఆడుతుందనే ప్రాథమిక సత్యం తెలియకుండా తీసిన సినిమాగా 'పులి'ని చెప్పుకోవాలి. ఆరంభ సన్నివేశాల్లోనే పులి ఆవేశంగా ఐదు నిమిషాల సేపు జనానికి ఉపదేశించే రీతిలో ప్రసంగించడం చూసి బిత్తరపోయిన ప్రేక్షకులు, ఆ తర్వాత మరో మూడు నాలుగు సార్లు అలాంటి సీనులే ఎదురవడంతో కుర్చీల్లో ఎంత ఇబ్బందికరంగా మసిలారో 'పులి'ని చూసిన వాళ్లందరికీ అనుభవమే. నీతిబోధకుడు చెప్పే రీతిలో పవన్ కల్యాణ్ చెప్పిన నీతులు ప్రేక్షకుల్ని కదిలించాయి. ఎలా? కుర్చీల్లో అసహనంగా, చికాకుగా. రాజకీయ వేదికలపై చెప్పే ఆవేశభరిత, ఊకదంపుడు ఉపన్యాసాల్ని వినీ వినీ డంగైపోయిన జనం సినిమాలోనూ అలాంటి సీనే కనిపించడంతో మూకుమ్మడిగా 'పులి'కి వ్యతిరేకంగా ఓటేశారు. ఫలితంగా ఆ సినిమాపై పెట్టుబడి పెట్టిన నిర్మాత, బయ్యర్లు నిలువునా మునిగిపోయారు. తొలివారం భారీ కలెక్షన్లు సాధించిన ఆ సినిమా రెండో వారం సగానికంటే ఎక్కువ సంఖ్య థియేటర్లలో మాయమయ్యింది. మొత్తంగా ఈ ఏడాది ఇప్పటివరకు రిలీజైన సినిమాల్లో నెంబర్ వన్ డిజాస్టర్ అనే ముద్రని సంపాదించుకుంది. (ఇంకావుంది)

Wednesday, October 13, 2010

ఇంటర్వ్యూ: ఎన్టీఆర్

"ఇందులో నా పాత్ర పేరు కృష్ణ. ఒక యాక్టర్‌కి విందుభోజనం లాంటి పాత్ర. అన్ని రకాల ఎమోషన్స్, షేడ్స్ కలగలిపి ఉన్న పాత్ర. 'బృందావనం'లో మెయిన్ హైలైట్ ఎన్టీఆర్ కొత్తగా కనిపించడం'' అని చెప్పారు ఎన్టీఆర్. ఆయన హీరోగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై రాజు నిర్మించిన 'బృందావనం' ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. వంశీ పైడిపల్లి దర్శకుడు. 'శక్తి' షూటింగ్‌లో బిజీగా ఉన్న ఎన్టీఆర్ ఆ సినిమా సెట్స్‌పై మంగళవారం ప్రత్యేక ఇంటర్వ్యూలో 'బృందావనం' గురించీ, అనేక ఇతర అంశాల గురించీ విపులంగా మాట్లాడారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే..


నా కెరీర్‌లో తిరిగి చూసుకుంటే మిగిలిపోయే సినిమా 'బృందావనం'. ఇంతదాకా రెగ్యులర్ ఫార్ములా సినిమాలు, మాస్ మసాలా సినిమాలు చేస్తూ వస్తున్నా. 'బృందావనం' కమర్షియల్ అంశాలు ఉంటూనే ప్రేమ, ఫ్యామిలీ అనుబంధాల మీద ఎక్కువ దృష్టి పెట్టి చేసిన సినిమా. 'బృందావనం' అనేది ఓ ఇంటిపేరు. బృందావనంలో కృష్ణుడు ఉంటే ఎంత కళకళలాడిపోతుంటుందో, ఇదీ అలా కళకళలాడే సినిమా. ఎలాంటి బృందావనంని ఎలాంటి బృందావనంగా నేను మార్చాననేదే ఈ సినిమాలోని ప్రధానాంశం.
విందుభోజనం లాంటి పాత్ర 
ఇందులో నా పాత్ర పేరు కృష్ణ. నాకు బాగా నచ్చిన క్యారెక్టర్. ఒక యాక్టర్‌కి విందుభోజనం లాంటి పాత్ర. అన్ని రకాల ఎమోషన్స్, షేడ్స్ కలగలిపి ఉన్న పాత్ర. బాగా కష్టపడి చేశాను. ఒక మంచి ప్రయత్నమైతే మేం చేశాం. ఎన్టీఆర్‌ని కొత్త కోణంలో చూపించిన సినిమా. అంతేకానీ సూపర్‌హిట్ సినిమా చెయ్యాలనే ఉద్దేశంతో చేసిన సినిమా కాదు. సక్సెస్‌లో టీమ్ వర్క్ ఎంత ఉంటుందో, ఫ్లాపులోనూ టీమ్ వర్క్ అంతే ఉంటుంది. అది ఏ ఒక్కరి క్రెడిటో కాదు. 'బృందావనం'లో మెయిన్ హైలైట్ ఎన్టీఆర్ కొత్తగా కనిపించడం. కొరటాల శివ డైలాగ్స్, తమన్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, ఛోటా కె. నాయుడు సినిమాటోగ్రఫీ సినిమాని అందంగా మలిచాయి. పాటల్లో 'నిజమేనా నిజమేనా' బాగా ఇష్టం.
పోటాపోటీ నటన 
కాజల్, సమంతా - ఇద్దరూ ప్రొఫెషనల్స్. భూమి, ఇందు పాత్రల్లో ఇద్దరూ బాగా కష్టపడ్డారు. పోటాపోటీగా చేశారు. ఇద్దరికీ మంచి భవిష్యత్ ఉంది. వాళ్లని కేవలం గ్లామర్ కోసం పెట్టుకోలేదు. పర్ఫార్మెన్స్‌కి కూడా స్కోప్ ఉన్న పాత్రలు వాళ్లవి. వాళ్లే కాదు, శ్రీహరి, ప్రకాశ్‌రాజ్ కూడా తాము తప్ప ఆ పాత్రల్ని ఇంకెవ్వరూ చేయ్యలేరనే అభిప్రాయం కలిగించే విధంగా చేశారు. కోట శ్రీనివాసరావుగారు అద్భుతంగా నటించారు. చాలా రోజులకి ఆయనలోని నటుణ్ణి పీక్ స్టేజ్‌లో చూశా. ఒక మంచి ఆర్టిస్టుకి మంచి పాత్ర ఇస్తే ఎలా చేస్తారో ఆయన నటన చూస్తే తెలుస్తుంది.
పెయింటింగ్‌లా తీశాడు 
సినిమాని వంశీ చాలా బాగా తీశాడు. ఒక అద్భుతమైన దర్శకుడిగా తయారయ్యే లక్షణాలు అతనిలో కనిపిస్తు న్నాయి. చెప్పిన కథ కన్నా బాగా తీశాడు. ప్రతి ఫ్రేమ్‌ని ఒక పెయింటిం గ్‌లా, చాలా అందంగా తీశాడు. 'బ్యూటిఫుల్ పిక్చరెస్క్' అంటారే - అది 'బృందావనం'లో అడుగడుగునా కనిపిస్తుంది. నా వరకు అయితే వందకి వంద మార్కులు కొట్టేశాడు. 'మున్నా' రూపంలో అతని తొలి ప్రయత్నం ఫలించలేదంతే. అతను ఫ్లాప్ కాదు. 'మున్నా' స్క్రిప్టు ఫ్లాపయ్యిందేమో కానీ డైరెక్టర్‌గా పాసయ్యాడు. చాలా స్టైలిష్‌గా ఆ సినిమాని తీశాడు. అలాంటి డైరెక్టర్ మంచి కథ చేస్తే ఎలా ఉంటుందనేదానికి 'బృందావనం' ఒక నిదర్శనం. అంత బలమైన కథ ఇది.
రాజుకు సినిమా పిచ్చి 
దిల్ రాజు సినిమా మీద తపన ఉన్న నిర్మాత. ఆయనకు సినిమా అంటే పిచ్చి, వ్యామోహం, వ్యాధి. ఎవరితో చేసినా ఒకే విధమైన తపనతో తీస్తారు. బ్యానర్ విలువ పెరగాలనే కించిత్ స్వార్థం కూడా అందులో ఉంటుంది. నాకు దర్శకుడే పనిచేయాలని ఉంటుంది. దర్శకుడికి మనం సలహాలు ఇవ్వాలే కానీ మన అభిప్రాయాల్ని అతని మీద రుద్దకూడదు. ఆ విషయంలో దర్శకుడికి రాజు చాలా స్వేచ్ఛనిచ్చారు. అమోఘంగా ఈ సినిమాని నిర్మించారు. అందుకే అద్భుతమైన టీమ్‌తో పనిచేసిన ఫీలింగ్ నాది.
గ్రాఫిక్స్ వల్లే ఆలస్యం 
8న రిలీజ్ చెయ్యాలనుకున్నారు కానీ సెన్సార్ అయ్యింది 7నే. అంటే 8న విడుదల చెయ్యడం అసాధ్యం. 14 విడుదల అనేది కావాలని చేసిన పోస్ట్‌పోన్ కాదు. అన్నీ మనకు అనుకూలంగా జరగవు. ఈ సినిమాకి సెట్స్‌మీద 130 రోజులు కష్టపడ్డాం. కొన్ని అనుకున్న టైమ్‌కి అవుతాయి. కొన్ని అవవు. గ్రాఫిక్స్ వల్లే పోస్ట్ ప్రొడక్షన్ కాస్త లేటయ్యింది. అందుకే రిలీజ్ డేట్ 14కి జరిగింది.
ప్రేక్షకుల కోసమే సినిమా 
నా కెరీర్‌లో హిట్లు, ఫ్లాపులు చూశా. ఇప్పుడు వాటికి అతీతమై పోయా. మనం హిట్టవుతాయనుకున్నవి హిట్లవ్వవు. ఫ్లాపవుతాయనకున్నవి కావు. మనం చేసేది ప్రేక్షకుల కోసమే. ఒకే ఫార్ములాకి పరిమితమవుతున్నామా అనే భావన మొదలైంది. నాకు ఎన్టీ రామారావుగారు ఇన్‌స్పిరేషన్. ఆయన ఒకదానికొకటి పొంతనలేని ఎన్నెన్నో భిన్నమైన ప్రాతలు చేసుకుంటూ పోయారు. పౌరాణికాలు, జానపదాలు, సోషియో ఫాంటసీలు, సాంఘిక సినిమాల్లో సందేశాత్మకాలు, సెంటిమెంట్ సినిమాలు, వినోదాత్మక చిత్రాలు, మాస్ సినిమాలు, క్లాస్ సినిమాలు.. ఇలా ఎన్నో చేశారు. అందుకే ఆయన ఆల్‌రౌండర్ అయ్యారు. నాకు 'బొమ్మరిల్లు', 'కొత్త బంగారులోకం' సినిమాలు బాగా ఇష్టం. కానీ అలాంటివి చేయాలనుకున్నా చేయలేను. మాస్‌ని వొదులుకోకుండానే కొత్తకోణంలో, కొత్తరకంగా చెయ్యాలని చేసిన సినిమా 'బృందావనం'.
ఎవడి పని వాడిదే 
నాకు కథ చెప్పిన తర్వాత ఫైనల్ నెరేషన్ అడుగుతా. అది నచ్చితే ఇక వదిలేస్తా. నాకు తెలిసింది యాక్టింగ్ ఒక్కటే. ఎవడి పని వాడు చెయ్యాలి. ఒక్కొక్కరిది ఒక్కో టాలెంట్. కథ పూర్తిగా వినేవరికే నా జోక్యం కానీ, ఇన్‌వాల్వ్‌మెంట్ కానీ ఉంటుంది. అప్పుడైనా సజెషన్స్ ఇస్తానే కానీ ఇలాగే ఉండాలని శాసించను.
ఆ రోజులు వేరు 
థియేటర్లు మూత పడుతుండటానికీ, జనం థియేటర్లకు రాకపోతుండటానికి పది రకాల కోణాలుంటాయి. వాటిలో స్టార్ల సినిమాలు ఎక్కువగా లేకపోవడం కూడా ఒకటనేది నిజమే. ఎన్టీ రామారావు గారు ఓ ఏడాది పదిహేను సినిమాలు, కృష్ణగారు పద్దెనిమిది-ఇరవై సినిమాలు చేసిన సందర్భాలున్నాయి. ఆ రోజులు వేరు. ఈ రోజులు వేరు. మనది ప్రపంచ మార్కెట్ ఉన్న సినిమా కాదు. హాలీవుడ్‌లో 'అవతార్', '2012' సినిమాలకు వందల కోట్ల డాలర్లు వెచ్చించి అత్యున్నత ప్రమాణాలతో తీశారు. బ్రహ్మాండంగా ఆడాయి. అంత బడ్జెట్‌తో మనం సినిమాలు తియ్యలేం. అప్పట్లో 'యమగోల'ని రెండు మూడు నెలల్లో తీస్తే, ఇవాళ 'యమదొంగ' తియ్యడానికి ఏడాది పట్టింది. నా వరకు నేను ఏడాది మూడు సినిమాలు చెయ్యాలని అనుకుంటున్నా. అది జరుగుతుందో, లేదో తెలీదు. దర్శకులు, నిర్మాతల కృషి కూడా కావాలి. ఇది కేవలం ఆర్టిస్టులతో అయ్యే పనికాదు.
పబ్బులకు దూరం 
'బృందావనం' నుంచి ఇప్పుడు చేసున్న 'శక్తి'కి వరుసగా 135 రోజులు షూటింగ్ చేశా. మధ్యలో అమ్మమ్మ చనిపోయినప్పుడు ఓ రెండు రోజులు మాత్రమే సెలవు తీసుకున్నా. నేనెంతగా పనిచేస్తున్నాననే దానికి ఇదో నిదర్శనం. ఎప్పుడైనా తీరిక దొరికితే ఇంట్లోనే ఉండి అమ్మతో ఎక్కువగా గడుపుతుంటా. నన్ను నన్నుగా చూసే అద్భుతమైన స్నేహితులు నాకు దొరికారు. వాళ్లలో ఇండస్ట్రీ లోపలి, బయటి వాళ్లిద్దరూ ఉన్నారు. నేను పబ్బులు, డిస్కోథెక్కులకు వెళ్లను. ఆ వాతావరణం నాకు నచ్చదు.
నేనింకా ఎదగాలి 
'దానవీరశూరకర్ణ' వంటి పౌరాణికం చెయ్యాలంటే నేనింకా ఎదగాలి. రామారావుగారంత కాకపోయినా ఆయనలో కొంతైనా చెయ్యగలగాలి కదా. దుర్యోధనుడి పాత్ర చెయ్యడమంటే ఒక యుద్ధం చెయ్యడం లాంటిది. దానికి నేనింకా రెడీ కాలేదు. 'యమదొంగ'లో యముడిగా ఒక ప్రయత్నం లాంటిది చేశా. సక్సెస్ అయ్యా. అయితే నేనేం చేసినా రామారావుగారితో పోలిక వస్తుంది. చేస్తే ఆయనలో 80 శాతమన్నా సక్సెస్ చేయగలగాలి. నాలో ఆ పరిణతి ఇంకా రావాలి. పైగా అలాంటి సినిమా చెయ్యగల దర్శకుడు ఉండాలి, అలాంటి స్క్రిప్టు రావాలి. నిర్మాత కావాలి. చెయ్యగలననే ధైర్యం నాలో ఉండాలి.
వచ్చే మార్చిలో 'శక్తి' 
ప్రస్తుతం 'శక్తి' షూటింగ్ జరుగుతోంది. తెలుగు చిత్రసీమలోని అత్యంత భారీ బడ్జెట్ సినిమాల్లో ఒకటిగా అది తయారవుతోంది. 'శక్తి' శక్తిగానే ఉంటుంది. ఇందులో చాలా చాలా గ్రాఫిక్స్ ఉన్నాయి. ఇంకా చాలా వర్క్ ఉంది. వచ్చే ఏడాది మార్చిలో వస్తుందనుకుంటున్నా. మరికొన్ని చర్చల స్థాయిలో ఉన్నాయి. ఫైనలైజ్ అయ్యాక వాటి వివరాలు చెబుతా.
పెళ్లి వచ్చే ఏడాది 
నా పెళ్లి నవంబర్‌లో అనే ప్రచారం జరుగుతోంది. కానీ నవంబర్‌లో నా పెళ్లి లేదు. వచ్చే ఏడాది ఉంటుంది. ఎప్పుడనేది నేనే చెబుతా. నేను సాంప్రదాయక పెళ్లి చేసుకుంటున్నా. మా అమ్మా నాన్న వెతికి చూసిన సంబంధం. అలాగే పెళ్లి బట్టల కోసం బ్యాంకాక్ వెళ్లాననే ప్రచారంలో కూడా ఏమాత్రం నిజంలేదు. పెళ్లిలో నేను వేసుకునేవి కూడా సాంప్రదాయకమైనవే. సూటూ బూటూ వేసుకుని చేసుకోను. అభిమానుల మధ్య పెళ్లి చేసుకోవాలనేది నా కోరిక. ఎంతవరకు వీలవుతుందో చూడాలి. లక్ష్మీ ప్రణతితో మాట్లాడుతుంటా కానీ కలవడం బాగా తక్కువ.

Tuesday, October 5, 2010

సినిమా: 'రోబో', 'ఖలేజా'లకి 'బృందావనం' పోటీనిస్తుందా?

అక్టోబర్ 1న వచ్చిన రజనీకాంత్ 'రోబో'కీ, 7న వస్తున్న 'మహేశ్ ఖలేజా'కీ గట్టి పోటీ ఇచ్చేందుకు 14న రాబోతున్న మరో సినిమా 'బృందావనం'. జూనియర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా నటించిన ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తే, 'మున్నా' ఫేమ్ వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో నారీ నారీ నడుమ మురారి తరహా పాత్రలో ఎన్టీఆర్ కనిపించబోతున్నాడు. అతని సరసన నేటి అగ్ర నాయికల్లో ఒకరైన కాజల్ అగర్వాల్, 'ఏ మాయ చేసావె'తో యువతరంలో క్రేజ్ పొందిన సమంతా తమ అందచందాలు, అభినయంతో ఆకట్టుకోబోతున్నారు.
'అదుర్స్' తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తోన్న సినిమా కావడమే కాక, దిల్ రాజు సంస్థ నుంచి వస్తుండటంతో 'బృందావనం' మీద అంచనాలు చాలానే ఉన్నాయి. నటనలోనే కాకుండా డాన్సులోనూ నిష్ణాతుడైన ఎన్టీఆర్ ఈ సినిమాలో ఇప్పటివరకు చేయని ఓ కొత్తపాత్రలో అల్లరి యువకుడిగా కనిపించబోతున్నాడు. "టైటిల్ సాఫ్టుగా ఉన్నా ఎన్టీఆర్ అదరగొట్టడం ఖాయం. ఎంతో మాస్ ఇమేజ్ ఉన్న బాలకృష్ణగారు ఇదివరకు 'నారీ నారీ నడుమ మురారి', 'అనసూయమ్మగారి అల్లుడు' వంటి పాత్రలు చేశారు. ఆకట్టుకున్నారు. అలాగే ఎన్టీఆర్ కూడా ఈ సినిమాతో ఒక కుటుంబంలో ఉండే అన్ని వయసుల వాళ్లనీ ఆకట్టుకుంటారు" అని నిర్మాత రాజు చెప్పారు.
అయితే నందమూరి వంశానికి చెందిన హీరోల సినిమాల్ని తెలంగాణలో ఆడనివ్వమని ఇప్పటికే కొన్ని తెలంగాణ సంఘాలు హెచ్చరించిన నేపథ్యంలో నైజాంలో 'బృందావనం' ప్రదర్శనపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్టీఆర్ మునుపటి సినిమా 'అదుర్స్'కి ఆ అనుభవం ఎదురయ్యింది కూడా. కాకపోతే 'బృందావనం' నిర్మాత రాజు స్వయంగా తెలంగాణవాసి కావడం వల్ల అడ్డంకులేమీ ఆ సినిమాకి ఎదురుకావనే నమ్మకం ఎన్టీఆర్ అభిమానుల్లో వ్యక్తమవుతోంది.                        

Sunday, October 3, 2010

సినిమా: మహేశ్ 'ఖలేజా' చూపిస్తాడా?

'రోబో' తర్వాత ప్రేక్షకుల ముందుకు వస్తున్న పెద్ద సినిమా 'మహేశ్ ఖలేజా'. ఈ సినిమా ఈ నెల 7న విడుదలవుతోంది. 'పులి'ని నిర్మించిన కనకరత్నా మూవీస్ సంస్థే ఈ సినిమానీ నిర్మించింది. 'పులి' డిజాస్టర్ కావడంతో 'ఖలేజా' మీదే నిర్మాతల ఆశలన్నీ వున్నాయి. తెలుగులో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటుడు మహేశ్ నుంచి మూడేళ్ల విరామంతో వస్తుండటంతో ఆయన అభిమానులతో పాటు, సాధారణ ప్రేక్షకులూ ఎంతో ఆసక్తితో ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. తెలుగులో 'పులి' మాదిరిగానే అత్యంత భారీ వ్యయంతో 'ఖలేజా' తయారయ్యింది.
అనధికార సమాచారం ప్రకారం ఆ బడ్జెట్ సుమారు 40 కోట్ల రూపాయలు. నేటి అగ్ర దర్శకుల్లో ఒకడిగా గుర్తింపు పొందిన త్రివిక్రమ్ ఈ సినిమాకి దర్శకుడు. 'అతడు' వంటి స్టైలిష్ మూవీ తర్వాత మహేశ్, త్రివిక్రమ్ కాంబినేషనులో వస్తున్న ఈ సినిమాలో అగ్రనటి అనుష్క నాయిక. ఒక సినిమాకి అమితమైన క్రేజ్ రావడానికి ఇంతకు మించిన కాంబినేషన్ ఇంకేం కావాలి! 2007 సెప్టెంబరులో 'అతిథి' వచ్చిన తర్వాత మహేశ్ ఏడాది పైగా సినిమా షూటింగులకు దూరంగా ఉండి, కమర్షియల్ యాడ్స్ చేస్తూ రావడం విమర్శలకు తావిచ్చింది.
'అతిథి'కి ముందు ఆయన వరుసగా సినిమాలు చేయబోతున్నారంటూ ఆరు సినిమాలకు సంబంధించిన వివరాలను ప్రకటించారు. కానీ 'అతిథి' తర్వాత వాటిలో ఒక్కటీ కార్యరూపం దాల్చలేదు. ఏడాదిన్నర తర్వాతనే త్రివిక్రమ్ సినిమా సెట్స్ మీదకు వచ్చింది. బాక్సాఫీసుని ప్రభావితం చేసే ఒక టాప్ హీరో ఇంతకాలం సినిమా షూటింగులకు దూరం కావడం విచారకరం. ఇప్పటికైనా 'మహేశ్ ఖలేజా'తో ఆయన తమ ముందుకు వస్తున్నందుకు అభిమానులు కొండంత సంబరంతో ఉన్నారు.
ఈ సినిమాలో మహేశ్ ఓ టాక్సీ డ్రైవర్ పాత్రలో తొలిసారి కనిపించనున్నాడు. విగ్రహాల దొంగతనం నేపథ్యంలో ఈ సినిమా కథ నడుస్తుందనేది తెలిసిన సమాచారం. మహేశ్ సినిమా అంటే గుర్తుకు వచ్చే సంగీత దర్శకుడు మణిశర్మ ఈ సినిమాకీ సంగీతాన్ని అందించాడు. ఆరు పాటల్లో కనీసం మూడు పాటలు బ్రహ్మాండంగా పాపులరయ్యాయి. ముఖ్యంగా 'సదాశివా', 'పిలిచే పెదవులపైన' పాటలు హైలైట్ అంటున్నారు. ఇక మహేశ్ సినిమాల్లో యాక్షన్ కి ఉండే ప్రాధాన్యత తెలిసిందే. రామ్-లక్ష్మణ్ సమకూర్చిన ఫైట్లు ఈ సినిమాకి మరో ఎస్సెట్. ఇప్పటికే సూపర్ హిట్ అంటున్న 'రోబో'నీ, 14న రాబోతున్న ఎన్టీఆర్ 'బృందావనం'నీ 'ఖలేజా' ఎలా ఎదుర్కొంటుందన్నది ఆసక్తికరం.                        

Monday, September 20, 2010

సినిమా: మహేశ్ వర్సెస్ ఎన్టీఆర్



తెలుగులో ఇద్దరు టాప్ హీరోలు దసరాకి ఢీ అంటే ఢీ అంటున్నారు. ఆ ఇద్దరు - మహేశ్, జూనియర్ ఎన్టీఆర్. మహేశ్ హీరోగా నటించిన 'మహేశ్ ఖలేజా' సినిమా అక్టోబర్ 7న రిలీజ్ అవుతుందని నిన్న (సెప్టెంబర్ 19) ఆ సినిమా నిర్మాతలు శింగనమల రమేశ్, సి. కల్యాణ్ అధికారికంగా ప్రకటిస్తే, ఎన్టీఆర్ సినిమా 'బృందావనం' అక్టోబర్ 8న రిలీజవుతుందని ఆ సినిమా నిర్మాత రాజు ఈరోజు (సెప్టెంబర్ 20) ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రకటించారు. నిజానికి ఇంతకుమునుపు 'ఖలేజా' సెప్టెంబర్ 30న, 'బృందావనం' అక్టోబర్ 1న విడుదలవుతాయని వాళ్లు ప్రకటించారు.
కానీ రజనీకాంత్ 'రోబో' సినిమా విడుదల సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 1కి మారడంతో దానికి అనుగుణంగా ఈ సినిమాలని కూడా ఓ వారం వెనక్కి జరిపారు. అయితే ఈ డేట్లు ఫైనల్ అవుతాయా, మళ్లీ పోస్ట్ పోన్ అవుతాయా అనే సంగతి చెప్పలేం. అయితే దసరాకి మాత్రం మహేశ్, ఎన్టీఆర్ 'నువ్వా నేనా' అనక తప్పేట్లు లేదు. వాళ్లిద్దరూ ఇలా ఢీకొనడం ఇదే ప్రథమం. అక్టోబర్ 17 విజయదశమి. 10 నుంచే దసరా సెలవులు మొదలు. వాటిని క్యాష్ చేసుకోవాలంటే 7 లేదా 8 తేదీల్లో సినిమాని విడుదల చేయాలి. అందుకే 'ఖలేజా', 'బృందావనం' సినిమాల్ని ఆ తేదీల్లో విడుదల చేయాలని నిర్మాతలు నిర్ణయించారు.
ఇలా ఒక వారం తేడాతో మూడు మెగా మూవీలు వస్తుండటంతో థియేటర్లకు కొరత తప్పడం లేదు. ఇప్పటికీ 'రోబో' నైజాం బిజినెస్ సంగతి తేలకపోవడం వల్ల ఆ సినిమాని ఈ ప్రాంతంలో ఎన్ని థియేటర్లలో విడుదల చేసేదీ ఇంకా ఓ కొలిక్కి రాలేదు. మరోవైపు 'ఖలేజా'ని అల్లు అరవింద్, 'బృందావనం'ని దిల్ రాజు విడుదల చేస్తున్నందువల్ల ప్రధాన థియేటర్లన్నీ ఈ రెండు సినిమాలకే బుక్ అయ్యాయి. అయినప్పటికీ ఒకే టైంలో ఈ మూడింటినీ విడుదల చేస్తున్నందువల్ల మరీ ఎక్కువ ప్రింట్లతో విడుదల సాధ్యం కాదు. ఈ సంగతిని నిర్మాత రాజు ఒప్పుకున్నారు కూడా. 'వంద థియేటర్లలో వేయాల్సింది తొంభై థియేటర్లలో వేస్తాం' అని ఆయన చెప్పారు.
ఏదేమైనా 'ఖలేజా', 'బృందావనం' సినిమాలపై అంచనాలు అంబరాన్ని చుంబిస్తున్నాయి. ల్యాబ్ రిపోర్టులు కూడా ఈ రెండింటికీ పాజిటివ్ గానే ఉండటం వల్ల రిజల్ట్ ఏమవుతుందనే కుతూహలం అందరిలో పెరుగుతోంది. ఇద్దరిలో గెలుపెవరిది? ఒకరు ఓడి, ఒకరు గెలుస్తారా? ఇద్దరూ గెలుస్తారా? లేక ఇద్దరూ చేతులెత్తేస్తారా? దీనిపై ఇద్దరు హీరోల అభిమానులు ఇప్పటికే పందేలు కడుతున్నారు. ఈ పందెంలో గెలుపు పుంజు ఎవరో?