Showing posts with label suryakantham. Show all posts
Showing posts with label suryakantham. Show all posts

Friday, December 25, 2015

Synopsis of the movie VAGDANAM (1961)

'వాగ్దానం' (1961) చిత్ర కథాంశం

జమీందారు విశ్వనాథం, దివాన్ రంగనాథం (గుమ్మడి), పరిస్థితుల వల్ల తాగుబోతుగా మారిన జగన్నాథం బాల్య మిత్రులు. జగన్నాథాన్ని విశ్వనాథం ప్రాణంగా చూసుకుంటుంటే, రంగనాథం దురాలోచన, దూరాలోచనతో జగన్నాథాన్ని ద్వేషిస్తుంటాదు. కులంలేని స్త్రీని పెళ్లి చేసుకున్నాడని వెలివేయబడిన జగన్నాథం కొడుకు సూర్యానికి విదేశాల్లో డాక్టర్ కోర్సు చెప్పించడమే కాకుండా తన కూతుర్ని అతనికిచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు విశ్వనాథం. ఆయన ఏకైక పుత్రిక విజయను తన కొడుకు చంద్రం (చలం)కు ఇచ్చి పెళ్లిచేసి జమీందారు ఆస్తిని కాజేయాలని చూస్తుంటాడు రంగనాథం. ఇంతలో జగన్నాథం చనిపోవడంతో, విశ్వనాథం కూడా సానుభూతితో మరణిస్తాడు.
చదువు పూర్తిచేసుకొని పల్లెకు వచ్చిన సూర్యం (అక్కినేని నాగేశ్వరరావు) డాక్టరుగా మంచి పేరు తెచ్చుకుంటాడు. సునాయాసంగా విజయ (కృష్ణకుమారి) ప్రేమను  పొందుతాడు. కానీ రంగనాథం చెడుబుర్ర కారణాన అనేక అవాంతరాలొస్తాయి. వాటిని తొలగించడంలో సూర్యం సఫలమవడంతో విజయ అతనికే దక్కుతుంది. జగన్నాథానికి విశ్వనాథం ఇచ్చిన వాగ్దానం నిలబడుతుంది.

తారాగణం: అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణకుమారి, గుమ్మడి, రేలంగి, చలం, సూర్యకాంతం, గిరిజ, పద్మనాభం, కె. వెంకటేశ్వరరావు, మల్లాది, మద్దాలి, సురభి కమలాబాయి
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
నిర్మాతలు: కె. సత్యనారాయణ, డి. శ్రీరామమూర్తి
దర్శకత్వం: ఆత్రేయ
బేనర్: కవితా చిత్ర
విడుదల తేదీ: 5 అక్టోబర్ 1961

Saturday, December 19, 2015

Synopsis of the movie KALASI UNTE KALADU SUKHAM (1961)

'కలసివుంటే కలదు సుఖం' (1961) చిత్ర కథాంశం


రామలక్ష్మణులకు ప్రతిరూపాలు అన్నదమ్ములైన పట్టాభిరామయ్య, సుందరరామయ్య. పట్టాభిరామయ్య భార్య సౌభాగ్యం. కానీ ఆమె తన పాలిట దౌర్భాగ్యమని పబ్లిగ్గాన్నే పిలుస్తుంటాడు. అంత గయ్యాళి సౌభాగ్యం. సుందరరామయ్య భార్య రమణమ్మ హృదయం వెన్నకన్నా మెత్తన. ఆమె ఎంత మంచిదంటే సంతలో కనిపించిన అనాథ యువతి రాధను తీసుకువచ్చి, తర్వాత తన పెద్ద కోడల్ని చేసుకుంటుంది.
రమణమ్మకు ఇద్దరు కొడుకులు. పెద్దవాడు కిష్టయ్యకు ఏడో యేట ఎలక్ట్రిక్ షాక్ తగిలి ఒక కాలు, ఒక చేయి వంకరతిరిగిపోతాయి. చిన్నవాడు రఘు పట్నంలో పాఠాలతో పాటు ప్రేమపాఠాలూ వల్లె వేస్తుంటాడు. అమ్మలాగే కిష్టయ్య హృదయం చాలా మంచిది. పదిమందికి పనికివచ్చే మంచి తనకు చెడు అయినా అతనికి సంతోషమే. రఘుకూడా మంచివాడే కానీ ఉడుకురక్తంతో మంచీ చెడూ తెలుసుకోలేని స్థితిలో కొట్టుకులాడుతుంటాడు.
ఇంట్లో తాను తప్ప అందరూ మంచివాళ్లయిపోవడంతో, ఆఖరికి కట్టుకున్న మొగుడు కూడా ఎగస్పార్టీ అవడంతో సౌభాగ్యానికి దిక్కు తోచదు. కానీ రోజులన్నీ ఒక్కలాగే ఉండవు కదా. ఆమెకీ రోజులొచ్చాయి. ఆమె మేనల్లుడు రంగూన్ రాజా, అతని చెల్లెలు జానకి వాళ్లింట్లో దిగారు. సిద్ధాంతి జోస్యం చెబుతూ 'శని ఇంట్లో అడుగు పెడ్తున్నాడయ్యా' అని అంటుంటే, 'పెట్టడమేం ఖర్మ.. పెట్టేశాడు' అని నిట్టూరుస్తాడు పట్టాభిరామయ్య. రంగూన్ రాజా దీపావళి టపాకాయలు టెన్ థౌశండ్ వాలా పేల్చినట్లు అదేపనిగా వాగేస్తుంటాడు. అతని నాలుకతో పాటు బుద్ధీ పదునైనదే. ఆ వాడి బుర్రలోంచి వేడివేడి ఐడియాలు వస్తుంటాయి. గిరీశానికి ఒక ఆకు ఎక్కువే.
వాడు ఆ ఇంటికి వస్తూనే ఆటబొమ్మలు తెచ్చాడు. వాటిని మించి మేనత్తను ఆడించేశాడు. పాచిక వేసి, విషం నూరి, ఆమె గొంతులో తియ్యగా పోశాడు. సౌభాగ్యం చిన్న బుర్ర పెద్ద పెద్ద ఆలోచనలతో ఉక్కిరిబిక్కిరైపోయింది. చిందులు తొక్కింది. భర్తతో వేరు పడాల్సిందేనంది. ఆయన గోల పెట్టాడు. బతిమిలాడాడు. చివరకు అందరిముందే ఏడ్చాడు. అయినా సౌభాగ్యం తగ్గలేదు. మరింత బిగుసుకుపోయింది. ఫలితం.. అనందమ్ములు విడిపోయారు. రెండు వాటాల మధ్య గోడలేచింది.
మనుషులు వేరయ్యారు. కానీ మనసులు వేరవలేదు. రఘు మినహా సుందరరామయ్య కుంటుంబం పడరాని అవమానాలు పడింది. కృష్ణయ్య మరీనూ. అన్నింటినీ చాలా ఓర్పుతో భరించారు. ఈలోగా సెలవలకు ఇంటికి వచ్చిన రఘు, ఆ వెంటనే జానకిని ప్రేమించేసి ఆమెను అందుకోడానికి రాజాకు దగ్గరయ్యాడు. అటేపే వెళ్లిపోయాడు. తను కూడా యధాశక్తి అన్ననీ, అమ్మానాన్నల్నీ అవమానించి, అది చాలదన్నట్లుగా తండ్రి చావు బతుకుల్లో ఉంటే, అన్నకంటే ముందుగా జానకిని పెళ్లి చేసుకున్నాడు.
కృష్ణయ్య మనిషి అవుడైనా, మనసు చాలా మంచిదని గ్రహించిన రాధ అతను అడక్కుండానే తన మనసును అతనికిచ్చేసింది. సమయం చూసుకొని ఆ సంగతి తనే బయటపెట్టి, అతనితో మూడు ముళ్లూ వేయించుకుంటుంది. తొడికోడళ్లిద్దరూ పోటీలుపడి చెరో మగపిల్లాణ్ణీ కంటారు. ఆలస్యంగా పెళ్లయినా జానకి కంటే ముందే కంటుంది రాధ. ఓర్వలేనివాళ్లు అవిటివాడికి అవిటి పిల్లాడే పుడ్తాడని దీవించినా, మంచి పిల్లాడే పుడతాడు. హైదరాబాద్‌లో ఉద్యోగం రావడంతో అక్కడకు భార్యా పిల్లల్తో వెళ్లిపోతాడు రఘు.
ఈలోగా సౌభాగ్యం దగ్గరున్న భాగ్యాన్ని తన పరం చేసుకొని హైదరాబాద్ మకాం మారుస్తాడు రాజా. అక్కడ గతంలో బందర్ బజార్లో బజ్జీలు అమ్మే మంజువాణి కూతురు అనార్కలితో కలిసి నాట్యాలూ, సర్కసులూ నడుపుతుంటాడు. రఘుచేత ఆఫీసు డబ్బు ఇరవై వేలు కాజేయించి అనార్కలికి అర్పణం చేస్తాడు. అదే సమయంలో భర్త కాలూ చెయ్యీ బాగు చేయించడానికి రాధ హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చేర్పిస్తుంది. సర్కస్‌లో ఏనుగు చేత ఫీట్లు చేయించడానికని ఆమె బిడ్డను ఎత్తుకుపోతాడు రాజా. అయితే రఘు బుద్ధి తెచ్చుకొని రాజాని నాలుగు వాయిస్తాడు. దాంతో మంజువాణి బృందం డబ్బుతో బొంబాయ్ పారిపోతుంది. ముసలాళ్లంతా పల్లె నుంచి హైదరాబాద్ చేరుకుంటారు. కిష్టయ్య ఆస్పత్రి నుంచి పారిపోయి సర్కస్ డేరాలో కరంట్ షాక్ తిని బాగైపోయి ఏనుగు నుంచి పిల్లవాణ్ణి రక్షిస్తాడు.
పారిపోయిన మంజువాణినీ, అనార్కలినీ, పారిపోబోతున్న రాజానీ పోలీసులు పట్టుకుంటారు. కిష్టయ్య మంచితనంతో రాజా బయటపడతాడు. అత్తా చెల్లెళ్లతో పాటు తనూ బుద్ధి తెచ్చుకుంటాడు. ఇంట్లో కట్టిన అడ్డుగోడని నలుగురూ కలిసి పగులకొట్టి 'కలసి ఉంటే కలదు సుఖం' అని నిరూపిస్తారు.

తారాగణం:  ఎన్టీ రామారావు, సావిత్రి, ఎస్వీ రంగారావు, హరనాథ్, రేలంగి, సూర్యకాంతం, హేమలత, గిరిజ, పెరుమాళ్లు
సంగీతం: మాస్టర్ వేణు
నిర్మాతలు: సీవీఆర్ ప్రసాద్, వై. రామకృష్ణప్రసాద్
దర్శకత్వం: తాపీ చాణక్య
బేనర్: శ్రీ సారథీ స్టూడియోస్
విడుదల తేదీ: 8 సెప్టెంబర్

Thursday, November 12, 2015

Synopsis of the movie UNDAMMA BOTTU PEDATHA (1968)

'ఉండమ్మా బొట్టుపెడతా' కథాంశం:

భూమిని నమ్ముకుని కాయకష్టం చేసి శ్రమించే దశరథరామయ్య (నాగయ్య) కుటుంబం ఒక సంవత్సరం పంటలు పుష్కలంగా పండించింది. అది గుర్తించిన ప్రభుత్వం ఆయనను 'కృషి పండిట్' బిదురుతో సత్కరించాలనుకుంది. ఆ బిరుదుకు తను అర్హుణ్ణి కాననీ, తన మనవరాలు లక్ష్మి అని చెబుతూ ఆయన తన కుటుంబ గాథను వివరిస్తాడు. ఆ కథ ప్రకారం...
దశరథరామయ్యకు నలుగురు కొడుకులు. పెద్ద కొడుకు శ్రీనివాసులు (నాగభూషణం) పేకాట మినహా మరో వ్యాపకంలేని వ్యక్తి. అతని భార్య తులశమ్మ (జానకి) మూఢభక్తి శిఖామణి. పత్రీ పుష్పాలతో దేవుణ్ణి కొలవడం తప్ప ఇల్లూ వాకిలీ చక్కదిద్దుకోవడం ఎరుగని ఇల్లాలు. రెండో కొడుకు వెంకటేశ్వర్లు (అర్జా జనార్దనరావు) కండబలంతో రౌడీగా బతుకుతూ, నిత్యం సారా మైకంతో భార్య శేషు (సూర్యకళ)పై పిడిగుద్దులు కురిపిస్తుంటాడు. పగలంతా మొగుడితో కీచులాటలాడి, తన్నులుతిని అదే ఊళ్లోని పుట్టింటికి పోవడం, రాత్రయ్యేసరికల్లా సింగారించుకుని మొగుడి పక్కలో చేరడం శేషు దినచర్య.
మూడో కొడుకు ఆంజనేయులు (చలం) మోజుపడి ఇంగ్లీష్ చదివిన అమ్మాయిని భార్యగా చేసుకొని, ఆమెకు బెడ్ కాఫీ అందిస్తూ వంటవాడిగా తయారైన మనిషి. ఆ భార్య సుమతి (మీనాకుమారి) అచ్చంగా కుమతి. మొగుణ్ణి వాజమ్మను చేసి దర్జా, దర్పం వెలిగిస్తూ ఉంటుంది. ఇక నాలుగో కొడుకు కృష్ణ (కృష్ణ) అవివాహితుడు. తన భాగానికొచ్చిన పొలాన్ని నమ్ముకొని తండ్రికి అండగా ఉన్న మంచివాడు.
బాధ్యత తెలీని కొడుకులూ, కోడళ్లతో అరాచకత్వం తాండవిస్తున్న ఇంటిని చూసి దశరథరామయ్య కుమిలిపోతుంటాడు. ఆ ఊళ్లోనే ఓ హరిదాసు (ధూళిపాళ) కుటుంబం ఉంటోంది. ఆయనకు ఒకే ఒక్క కూతురు లక్ష్మి (జమున). 'అడుగడుగున గుడివుంది, అందరిలో గుడివుంది' అని నమ్మిన యువతి. శుచి, శుభ్రం ఉన్న ఇంట్లోనే శ్రీ మహాలక్ష్మి కొలువుంటుందని ఆమె నమ్మకం.
హరిదాసు రోజూ ఊళ్లో భిక్షాటన చేసి, ఆ వచ్చిన బియ్యాన్ని పాపాయమ్మకు అమ్ముకుని, ఆ డబ్బు ఆమె వద్దే కూడబెడుతుంటాడు. ఆ డబ్బుతో కూతురికి మంచి సంబంధం తెచ్చి పెళ్లి చేయాలనేది ఆయన సంకల్పం. పాపాయమ్మ (సూర్యకాంతం) పేరుకు తగినట్లే పాపాలపుట్ట. కాఫీ ఇడ్లీల దగ్గర్నుంచి 'రూపాయి సోడా' (సారా) దాకా ఆమె దగ్గర దొరుకుతాయి. ఎవరింట్లోనన్నా ఏ వస్తువైనా కనిపించలేదంటే అది పాపాయమ్మ ఇంట్లో తాకట్టుకు చేరివుంటుందని చెప్పుకుంటారు. లక్ష్మికి సంబంధం ఖాయం చేసుకున్న హరిదాసు తన డబ్బు కోసం పాపాయమ్మ దగ్గరకు వచ్చి అడుగుతాడు. ఆ డబ్బు ఇవ్వకపోగా హరిదాసే తన డబ్బు కాజేయడానికి తనను కొట్టాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసి, ఆయనను అరెస్ట్ చేయిస్తుంది పాపాయమ్మ.
పీటలమీద పెళ్లి చెదిరిపోవడం, తన తండ్రి అపనిందకు గురికావడం భరించలేని లక్ష్మి ఆత్మహత్యకు పూనుకుంటుంది. ఆమెను కృష్ణ కాపాడతాడు. అదే ముహూర్తానికి లక్ష్మిని తనయింటి కోడలిగా చేసుకుంటాడు దశరథరామయ్య. ముష్టివాడి కూతుర్ని ఆ ఇంటి కోడల్ని చేసినందుకు పెద్ద కోడళ్లు ఈసడిస్తారు. అడుగడుగునా అవమానిస్తారు. తోడికోడళ్లు ఎలా ప్రవర్తించినా, ఆ ఇంటికి దీపంగా, భర్తకు నీడగా ఉంటూ వస్తుంది లక్ష్మి.
అరాచకత్వం, అపరిశుభ్రం తాండవిస్తున్న ఆ ఇంటినుండి శ్రీ మహాలక్ష్మి వెళ్లిపోతుండగా, ఆమెను అక్కడ నిలిపేందుకు ఆత్మత్యాగం చేసిన లక్ష్మి పేరంటాలై వెలుస్తుంది. ఆమె ఆత్మత్యాగంతో కళ్లు తెరిచిన ఆ కుటుంబం ఏకమై, అందరూ కష్టించి పనిచేసి, ఆ ఇంటిని సిరులతో కళకళలాడిస్తారు.

తారాగణం: కృష్ణ, జమున, గుమ్మడి, షావుకారు జానకి, ధూళిపాళ, సూర్యకాంతం, అంజలీదేవి, చలం, నాగభూషణం, నాగయ్య, అర్జా జనార్దనరావు, మీనాకుమారి, సూర్యకళ
సంగీతం: కె.వి. మహదేవన్
సమర్పణ: ఆదుర్తి సుబ్బారావు
నిర్మాత: సి. సుందరం
దర్శకత్వం: కె. విశ్వనాథ్
బేనర్: బాబూ మూవీస్
విడుదల తేది: 28 సెప్టెంబర్ 1968

Monday, August 30, 2010

Nostalgia: Great Comedian Padmanabham


నవ్వించడంలోనే కాక హృదయం ద్రవింపజేయడంలో కూడా పద్మనాభంది అందె వేసిన చెయ్యి. 1931లో కడప జిల్లా సింహాద్రిపురంలో జన్మించిన ఆయన పూర్తిపేరు బసవరాజు వెంకట పద్మనాభరావు. 1943లో విడుదలైన 'మాయాలోకం' ఆయన తొలి చిత్రం. ప్రేక్షకులకి దగ్గరయ్యింది మాత్రం విజయా వారి 'పాతాళ భైరవి'లో వేసిన సదాజపుని పాత్రతో. రేలంగి, రమణారెడ్డి, అల్లు రామలింగయ్య, సూర్యకాంతం, ఛాయాదేవి వంటి మేటి నటీనటులతో నటించి తనదైన ప్రత్యేకతను నిలుపుకున్నారు.
పద్మనాభం మంచి గాయకుడు, దర్శకుడు, నిర్మాత కూడా. పొట్టి ప్లీడరు, ఆజన్మ బ్రహ్మచారి, శ్రీశ్రీ మర్యాద రామన్న, కథానాయిక మొల్ల, మాంగల్యబలం, దేవత వంటి గొప్ప చిత్రాలు నిర్మించారు. 'కథానాయిక మొల్ల', 'శ్రీరామకథ' సినిమాలకి దర్శకత్వం వహించారు. పాండవ వనవాసంలో లక్ష్మణ కుమారుడిగా, పొట్టి ప్లీడరులో ప్లీడరుగా, పాతాళభైరవిలో సదాజపునిగా, దేవతలో సినిమా పిచ్చోడిగా, దసరా బుల్లోడులో ఏఎన్నార్ స్నేహితునిగా, ఆజన్మ బ్రహ్మచారిలో చాటుమాటు ప్రేమికునిగా.. ఇలా అనేక పాత్రలు వేసి ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. కృష్ణవంశీ సినిమా 'చక్రం'లో 'జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది' అన్నట్లు ఆయన ఈ ఏడాది ఫిబ్రవరి 20న చెన్నైలో గుండెపోటుతో ఏకాకిగానే ఈ లోకాన్ని వీడి వెళ్లారు.