Showing posts with label trisha. Show all posts
Showing posts with label trisha. Show all posts

Monday, December 26, 2011

బిగ్ స్టోరీ: సంక్రాంతికి సై

సంక్రాంతికి ఏయే సినిమాలు రానున్నాయో దాదాపు తేలిపోయింది. తెలుగు సినిమాకు సంబంధించి ఓ కేలండర్ సంవత్సరంలో వచ్చే తొలి పెద్ద సీజన్ సంక్రాంతి అనేది తెలిసిందే. సంక్రాంతికి వారం నుంచి పది రోజుల దాకా బడులకు ఇచ్చే సెలవుల్ని సొమ్ము చేసుకోవాలని నిర్మాతలు భావిస్తుంటారు. పెద్ద సినిమాలు రంగంలో ఉంటే చిన్న సినిమాలకు థియేటర్లు దొరక్క ఆ సినిమాల నిర్మాతలు నిరాశ పడటం మామూలే. ఇప్పుడూ అదే స్థితి. ఏకంగా నాలుగు పెద్ద సినిమాలు ఒకదానితో ఒకటి ఢీ అంటుండటంతో చిన్న సినిమాకు చోటెక్కెడ దొరుకుతుంది? పైగా ఈ పెద్ద సినిమాలే థియేటర్లను పంచుకోవాల్సి వస్తుండటం వల్ల వాటికీ మిగతా సమయాల్లో లభ్యమయ్యే రీతిలో థియేటర్లు దొరకవనేది నిజం. ఫలితంగా వాటి కలెక్షన్ల మీద కూడా ఇది ప్రభావం చూపడం తథ్యం. సంక్రాంతి విజేతలుగా నిలవాలనే తపనతో వస్తున్న ఆ నాలుగు సినిమాలు - 'బిజినెస్‌మేన్', 'బాడీగార్డ్', 'నిప్పు', 'పూలరంగడు'.
మళ్ళీ కలిశారు 
'దూకుడు' వంటి బ్లాక్‌బస్టర్ సినిమా తర్వాత మహేశ్ హీరోగా వస్తున్న 'బిజినెస్‌మేన్' సినిమా పట్ల వెల్లువెత్తుతున్న అంచనాలు అంబరాన్నంటుతున్నాయి. పూరి జగన్నాథ్ దర్శకుడవడం వల్ల కూడా ఈ సినిమా పట్ల ఇటు సినీ వర్గాలవారూ, అటు సాధారణ ప్రేక్షకులూ అమితాసక్తి కనపరుస్తున్నారు. ఇదివరకు ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన 'పోకిరి' చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డుల్ని నెలకొల్పిన సంగతి మనకు తెలుసు. 'బిజినెస్‌మేన్' ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తోందోననే ఆసక్తి సర్వత్రా ఉంది. అందుకే దీన్ని కొనుగోలు చేసేందుకు బయ్యర్లు బారులు తీరారు. మహేశ్ సరసన కాజల్ అగర్వాల్ తొలిసారి నాయికగా నటించిన ఈ చిత్రాన్ని ఆర్.ఆర్. మూవీమేకర్స్ పతాకంపై వెంకట్ నిర్మిస్తున్నారు. 'దూకుడు' మీదున్న తమన్ సంగీతం సమకూర్చిన పాటలు ఇప్పటికే పెద్ద హిట్టయ్యాయి. ముంబై మాఫియా నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం సంక్రాంతి సీజన్‌లో అన్నిటికంటే ముందుగా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
ఇప్పుడు తెలుగులో... 
వెంకటేశ్ హీరోగా నటించిన 'బాడీగార్డ్' సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించడం ఖాయమని సినీ వర్గాలు నమ్ముతున్నాయి. కారణం - ఇప్పటికే ఈ సినిమా మూడు భాషల్లో జయకేతనం ఎగురవేయడం. మొదట మలయాళంలో (దిలీప్ హీరో), తర్వాత తమిళంలో (విజయ్ హీరో), ఆ పిమ్మట హిందీలో (సల్మాన్‌ఖాన్ హీరో) కలెక్షన్ల వర్షం కురిపించింది ఈ సినిమా. వాటికంటే తెలుగు వెర్షన్ మరింత బాగా వచ్చిందని శ్రీ సాయిగణేశ్ మూవీస్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించిన బెల్లకొండ సురేశ్ గట్టి నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలి కాలంలో ఎక్కువగా కామెడీ ఎంటర్‌టైనర్స్ చేస్తూ వచ్చిన వెంక టేశ్ చాలా రోజుల తర్వాత ఓ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో నటించడం ఇప్పుడే. ఆయన సరసన త్రిష హీరోయిన్‌గా చేయడం ఇది మూడోసారి. 'డాన్ శీను' ఫేమ్ గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ సినిమాకి రామ్-లక్ష్మణ్ కూర్చిన ఫైట్లు, తమన్ సంగీతం అందించిన పాటలు హైలైట్ అవుతాయంటున్నారు. జనవరి 12న విడుదలవుతున్న ఈ సినిమా ట్రైలర్లకు మంచి స్పందన వస్తోంది.

ముగ్గురు మిత్రులు 
ముగ్గురు మిత్రుల సినిమా 'నిప్పు'. కెరీర్ తొలినాళ్లలో చెన్నైలో ఒకే ఇంట్లో ఉండి అవకాశాలు వెతుక్కున్న ఆ ముగ్గురు - గుణశేఖర్, రవితేజ, వైవీఎస్ చౌదరి. రవితేజ కథానాయకుడిగా గుణశేఖర్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని బొమ్మరిల్లు వారి పతాకంపై వైవీఎస్ నిర్మిస్తున్నారు. ఇలా ఓ అరుదైన కాంబినేషన్‌తో, ఆరోగ్యకరమైన వాతావరణంలో తయారవుతున్న ఈ చిత్రం ఎప్పుడు విడుదలవుతుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు. దీక్షాసేథ్ హీరోయిన్‌గా నటిస్తుంటే, రాజేంద్రప్రసాద్ ఓ కీలక పాత్ర చేస్తున్నారు. రవితేజ మార్కు వినోదానికి, గుణశేఖర్ శైలి టేకింగ్ తోడైన ఈ సినిమాకి సైతం తమన్ సంగీతం సమకూరుస్తుండటం విశేషం. ఇలా ఒకే సంగీత దర్శకుడు పనిచేసిన మూడు సినిమాలు ఒకదానితో ఒకటి పోటీపడనుండటం అనేది కూడా అరుదైన సందర్భం. జనవరి 13న 'నిప్పు' విడుదలవుతోంది.
నవ్వులు పువ్వులు 
కమెడియన్‌గా మంచి పేరు తెచ్చుకొని, కామెడీ హీరోగా ఎదుగుతున్న సునీల్ ఇప్పుడు 'పూలరంగడు'గా అవతారమెత్తాడు. 'అందాల రాముడు', 'మర్యాద రామన్న' చిత్రాలతో ఘన విజయాలు సాధించిన ఈ భీమవరం నటుడు తనకంటూ సొంత మార్కెట్‌ని సంపాదించుకోవడం చిన్న విషయమేమీ కాదు. అందుకు తగ్గట్లే 'పూలరంగడు' పట్ల బిజినెస్ వర్గాలు ఆసక్తి కనపరుస్తున్నాయి. 'అహ నా పెళ్లంట' ఫేమ్ వీరభద్రమ్ దర్శకత్వంలో తయారవుతున్న ఈ చిత్రాన్ని ఆర్.ఆర్. మూవీమేకర్స్ సమర్పణలో దాని సోదర సంస్థ మాక్స్ ఇండియా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. జనవరి 5న ఆడియో ఆవిష్కరణ జరగనున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీత దర్శకుడు. జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ వినోదాత్మక చిత్రంలో 'ప్రేమ కావాలి' ఫేమ్ ఇషా చావ్లా నాయిక. ఒకే సంస్థ నిర్మిస్తున్న రెండు సినిమాలు ఒకదానితో ఒకటి పోటీపడుతుండటాన్నీ ఈసారి మనం చూడబోతున్నాం.
-ఆంధ్రజ్యోతి డైలీ, డిసెంబర్ 26, 2011

Tuesday, December 13, 2011

ఇంటర్‌వ్యూ: వెంకటేశ్

నేను కలలు కనను


"నేను కలలు కనను కాబట్టి డ్రీమ్ ప్రాజెక్టులనేవి ఉండవు. ఏదన్నా చెయ్యాలనుకుంటే సిన్సియర్‌గా చెయ్యడమే'' అని చెప్పారు హీరో వెంకటేశ్. ఆయనతో శ్రీ సాయిగణేశ్ ప్రొడక్షన్స్ పతాకంపై బెల్లంకొండ సురేశ్ నిర్మిస్తున్న 'బాడీగార్డ్' చిత్రం సంక్రాంతికి విడుదల కాబోతోంది. త్రిష నాయికగా నటించిన ఈ చిత్రానికి 'డాన్ శీను' ఫేమ్ గోపీచంద్ మలినేని దర్శకుడు. మంగళవారం వెంకటేశ్ జన్మదినం. ఈ సందర్భంగా 'బాడీగార్డ్'తో పాటు, తన తదుపరి చిత్రాల గురించీ, జీవితం పట్ల తన ఆలోచనలూ, అభిప్రాయాల గురించీ విపులంగా సంభాషించారు. అవేమిటో ఆయన మాటల్లోనే...


'బాడీగార్డ్' వచ్చిన తీరుకి చాలా హ్యాపీగా ఉన్నా. జనవరి 12న రిలీజ్. సంక్రాంతికి మంచి ఆల్‌రౌండ్ సినిమా అవుతుంది. మంచి ఎంటర్‌టైనర్. ఫ్యామిలీ డ్రామా, చక్కని సంగీతం ఉన్నాయి. తమన్ చాలా బాగా సంగీతం ఇచ్చాడు. తొలిసారి అతనితో కలిసి పనిచేశా. ఇతర సినిమాలకంటే ఎక్కువగా దీన్ని సంగీతభరిత చిత్రం చేశాడు. అతనిచ్చిన నేపథ్య సంగీతం గురించి కూడా చెప్పుకుంటారు.
నేను వెంకటాద్రిని 
ఇది గుడ్ క్లీన్ ఫిల్మ్. మలయాళ ఒరిజినల్ 'బాడీగార్డ్'తో పోలిస్తే మన అభిరుచికి తగ్గట్లు స్క్రిప్టులో కొన్ని మార్పులు చేశాం. ప్రేక్షకులకి మంచి ఫీల్‌నిస్తుంది. ఇందులో నా పాత్ర పేరు వెంకటాద్రి. 'చంటి' తర్వాత ఓ అమ్మాయికి బాడీగార్డుగా ఉండి కాలేజీ క్యాంపస్‌కి వెళ్లడం మళ్లీ ఈ చిత్రానికే. ఆ సన్నివేశాలన్నీ బాగా వచ్చాయి. లవ్ స్టోరీ ఈజ్ వెరీ యూనిక్. త్రిష, నేను ఇదివరకు కలిసి చేసిన 'ఆడవారి మాటలకు అర్థాలే వేరులే' తర్వాత తనది ఇందులో మరో మంచి పాత్ర. చివరి 30 నిమిషాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. యాక్షన్ సన్నివేశాలు చాలా బాగా వచ్చాయి. రామ్-లక్ష్మణ్ బాగా కంపోజ్ చేశారు.
చక్కని దర్శకుడు, మంచి నిర్మాత 
గోపీచంద్ మంచి డైరెక్టర్. సింపుల్ అండ్ సిన్సియర్. అతనితో మంచి రాపో కుదిరింది. సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కె. నాయుడు మంచి కెమెరా పనితనం చూపించాడు. బెల్లంకొండ సురేశ్‌తో ఇది నాకు రెండో సినిమా. అతను మంచి నిర్మాత. చక్కని నిర్మాణ విలువలతో తీశాడు. మిగతా సినిమాలన్నింటి కంటే భారీ ఎత్తున చేశాడు. ఇటీవలి కాలంలో చూడని చాలా అందమైన ప్రదేశాల్లో చిత్రీకరణ జరిపారు. దానికి నేను గ్యారంటీ.
తదుపరి చిత్రాలు 
ఈ నెల 16 నుంచి 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' షూటింగ్‌లో పాల్గొనబోతున్నా. ఇది చాలా చక్కని చిత్రం. చాలా రోజుల తర్వాత ఓ అందమైన ఫ్యామిలీ ఫీల్‌తో, ఇద్దరు అన్నాతమ్ముళ్ల జీవిత ప్రయాణంతో, వాళ్ల ఎత్తుపల్లాలతో రాబోతున్న చిత్రం. నేను, మహేశ్ కలిసి చేయడానికి ఉద్వేగంతో ఎదురుచూస్తున్నాం. దీని తర్వాత మల్టీస్టారర్స్ పెరుగుతాయని ఆశిస్తున్నా. సంవత్సరానికి ఒకటాన్నా వస్తే బాగుంటుంది. దీనితో పాటు మెహర్ రమేశ్‌తో బాగా స్టయిలిష్‌గా ఉండే యాక్షన్ ప్రధాన చిత్రం చేయబోతున్నా. అందులో ఫ్యామిలీ డ్రామానీ, వినోదాన్ని చాలా తెలివిగా మేళవించాడు రమేశ్. ఆల్‌రౌండ్ సాలిడ్ కమర్షియల్ అప్పీల్‌తో ఉంటుంది. 'సీతమ్మ వాకిట్లో..' తర్వాత నాకు వైవిధ్యమైన సినిమా అవుతుంది. 'వివేకానంద' 2012 ద్వితీయార్థంలో మొదలవుతుంది. మణిశంకర్ దర్శకుడు. స్క్రిప్టు సిద్ధమయింది.
'బొబ్బిలి రాజా' సీక్వెల్ 
'బొబ్బిలి రాజా'కి సీక్వెల్ చేయాలంటే ఇవాళ చాలా నియమ నిబంధనలు అడ్డుగా ఉన్నాయి. ఆ సినిమాలో చాలా జంతువులు ఉంటాయి. నిజమైన జంతువులతో చేయాలంటే చాలా పర్మిషన్లు తెచ్చుకోవాలి. దానికి చాలా టైమ్ పడుతుంది. వాటిని సడలిస్తే చేయొచ్చు. అందులో రానా కూడా చేస్తానంటున్నాడు సరదాగా.
రానాకే ఎక్కువ తెలుసు 
రానా ఊరంతా తిరుగుతున్నాడు. తిరగనివ్వండి. తెలుగు, తమిళం, హిందీల్లో చేస్తున్నాడు. వాడు కష్టజీవి. నాకన్నా ఎక్కువ సినిమా తపన ఉన్నవాడు. నిజంగా చెప్పాలంగా నాకన్నా సినిమా గురించి ఎక్కువ తెలుసు. చిన్నప్పట్నించీ సినిమా గురించి నేర్చుకుంటూ వస్తున్నాడు. సాంకేతికంగా సినిమా గురించి అధ్యయనం చేయడం గానీ, సినిమాకు సంబంధించిన పుస్తకాలు చదవడం గానీ నాకంటే ఎక్కువ చేస్తుంటాడు. చాలామందితో కలుస్తుంటాడు. ఇది ఆరోగ్యకరమైన విషయం. ఎప్పుడూ విభిన్నంగా ఆలోచిస్తుంటాడు. ప్రయోగాల కోసం తాపత్రయపడుతుంటాడు. దానివల్ల ప్రతిభ కూడా పెరుగుతుంటుంది. ఇప్పట్లో వాడూ, నేనూ కలిసి సినిమా చేసే అవకాశం లేదు.
అర్జున్ చిన్న పిల్లాడు 
మా అబ్బాయి అర్జున్ చాలా చిన్న పిల్లాడు. మూడో గ్రేడ్ చదువుతున్నాడు. అప్పుడే సినిమాలెందుకు? ఈ మధ్య స్కూల్లో ఓ ఎగ్జామ్‌కి సరిగా ప్రిపేరయినట్లు లేడు. దాంతో దిగాలుపడ్డాడు. నేనూ, మా ఆవిడా 'అదేమీ కంపల్సరీ కాదు కదా. రాయొద్దులే' అని చెప్పాం. కారులో కూర్చున్నాక "డాడ్. ఫియర్ ఈజ్ ద డార్క్‌సైడ్ ఆఫ్ ద పాత్'' అన్నాడు. అదేదో హాలీవుడ్ సినిమాలో డైలాగ్ అంట. వెళ్లి ఎగ్జామ్ రాశాడు. వాడికి ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఏమీ లేవు. పిల్లలు సహజంగా పెరగాలి. నిబంధనలు ఉండకూడదు. అన్నీ చేస్తుండాలి. సినిమాల్లో చెయ్యాలని వాడికి ఉంది. 'కరాటే కిడ్' చేస్తానంటున్నాడు.
శుభ పరిణామం 
ఇప్పటికే అందరు హీరోలూ వరుసగా సినిమా చేసుంటే ఇండస్ట్రీ బాగా సెట్టయి ఉండేది. ఏదేమైనా ఇప్పుడు చేస్తున్నందుకు సంతోషం. ఇది శుభ పరిణామం. అయితే బడ్జెట్ మీద కంట్రోల్ ఉండాలి. ఆ కంట్రోల్ లేకపోతే సమస్యలొస్తాయి. మినిమం గ్యారంటీ ఉండేట్లు చూసుకోవాలి. ఎక్కువ సినిమాలు చేసేప్పుడు ప్లానింగ్ ముఖ్యం. కథ మీద నమ్మకం ఉండాలి.
వివాదాల్లో తప్పు లేదు 
ఏదో జన్మలో అంతా అయిపోయుంటుంది. అందుకే ఈ జన్మలో ఎలాంటి వివాదాలూ లేకుండా జీవితం సాగించగలుగుతున్నా. వివాదాల్లో చిక్కుకోవడంలో తప్పేమీ లేదు. అది శక్తినిస్తుంది. బహుశా నేను వాటికి ఎట్రాక్ట్ కాలేదేమో.
లక్ష్యాలు ఉండవు 
నేను కలలు కనను కాబట్టి డ్రీమ్ ప్రాజెక్టులనేవి ఉండవు. ఏదన్నా చెయ్యాలనుకుంటే సిన్సియర్‌గా చెయ్యడమే. జీవితంలో మనం ఏదన్నా కండిషన్ పెట్టుకుంటే ఆ రోజు నుంచే మన జీవితంలో సంతోషం లేకుండా పోతుంది. అది ఎవరు నేర్పించారో నాకు తెలీదు కానీ నాకు మాత్రం అది సూటవదు. వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవడం తెలుసు కానీ, ఈ లక్ష్యాలనేవి నాకు తెలీదు. ఓ లక్ష్యం అనేది పెట్టుకొని అది సాధించగానే, మళ్లీ ఇంకో లక్ష్యం పెట్టుకోవడం... ఈ పద్ధతికి నేను దూరం. ఇవన్నీ పెట్టుకొంటే ఇక ఎప్పుడు సంతోషంగా ఉంటాం. ఈ సంగతి తెలుసుకుంటే జీవితం చాలా సింపుల్‌గా ఉంటుంది. జీవితాన్ని వృథా చేయకూడదు. ఎన్నో చేస్తుంటాం. టైమ్ లేనట్లు ఉరుకులు పరుగులు పెడుతుంటాం. కానీ మన ఆరోగ్యం గురించి మనం ఓ అరగంట కేటాయించుకోం. జీవితంలో నిజమైన ఎమర్జన్సీ అనేది ఒకటే ఉంటుంది. అది మన చివరిదశ. అది తెలుసుకోకపోవడం మనం చేసే అతి పెద్ద తప్పు.
బౌద్ధ క్షేత్రాలు దర్శించుకున్నా 
ఇటీవల బుద్ధుడికి సంబంధించిన నాలు సుప్రసిద్ధ స్థలాల్ని దర్శించి వచ్చా. నేపాల్ సరిహద్దులకు వెళ్లా. బుద్ధుడు జ్ఞానోదయం పొందిన బుద్ధగయ, సారనాథ్, నేపాల్‌లోని ఆయన జన్మస్థలం లుంబినీ వనం, ఆయన పరినిర్వాణం చెందిన ఖుషినగర్ (ఉత్తరప్రదేశ్) సందర్శించా. అలాగే వారణాసిలోని ప్రవక్త కబీర్ సమాధి, కాశీలోని నంది దేవుణ్ణి దర్శించుకున్నా.
ఆలోచనా విధానం మారాలి 
సమస్యలు ఉండని మనుషులు ఉండరు. దేవుడికి కూడా సమస్యలే. సమస్య నుంచి ఎవరూ తప్పించుకోలేరు. దాన్ని ఎలా ఎదుర్కొంటున్నామన్నదే ప్రధానం. సంతోషమనేది మానవుడికి ఎప్పుడూ ఉండదు. అది తెలుసుకుంటే ఆలోచనా విధానం మారుతుంది. జీసస్ కానీ, బుద్ధుడు కానీ, రాముడు కానీ, మహ్మద్ ప్రవక్త కానీ మనలాగే మనుషులు. వాళ్లు అందరూ ఆరాధించే స్థాయిలో ఎందుకున్నారు, మనం ఇలా ఎందుకున్నాం అని ఆలోచించుకోవాలి. అందరం అత్యున్నత స్థాయికి అర్హులమే. సమర్థులమే. ఆలోచనా విధానమే మారాలి. మనకీ, వాళ్లకీ అదే తేడా.


-ఆంధ్రజ్యోతి డైలీ, డిసెంబర్ 13, 2011

Saturday, October 22, 2011

న్యూస్: జోరంతా సమంతదే!

టాలీవుడ్‌లో ఇప్పుడు సమంత జోరు నడుస్తోంది. 'ఏమాయ చేసావె', 'బృందావనం', 'దూకుడు' సినిమాలతో ఆమె టాప్ లీగ్‌లోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం ఎస్.ఎస్. రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న 'ఈగ'లో హీరోయిన్‌గా నటిస్తున్న ఆమె రెండోసారి నాగచైతన్య సరసన 'ఆటోనగర్ సూర్య'లో నటిస్తోంది. తాజాగా మరో మూడు సినిమాల్లో నాయికగా ఎంపికైంది. వాటిలో మహేశ్‌తో రెండోసారి చేయబోతున్న 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు', సిద్ధార్థ్ సరసన ఓ సినిమాలోనూ, అల్లు అర్జున్ సరసన మరో సినిమాలోనూ చేయబోతోంది. 'ఆటోనగర్ సూర్య'ని దేవా కట్టా డైరెక్ట్ చేస్తుండగా, మాక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బేనర్‌పై కె. అచ్చిరెడ్డి నిర్మిస్తున్నారు. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'ను 'కొత్త బంగారులోకం' ఫేం శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేయనుండగా, దిల్ రాజు నిర్మించబోతున్నారు. వెంకటేశ్, త్రిష మరో జోడీగా నటించే ఈ సినిమా 2012 జనవరిలో సెట్స్ మీదకు వెళ్లనున్నది. సిద్ధార్థ్ సరసన నటించే సినిమాని నందినీరెడ్డి డైరెక్ట్ చేయనుండగా, బెల్లంకొండ సురేశ్ నిర్మించనున్నారు. ఈ సినిమా నవంబర్‌లో రెగ్యులర్ షూటింగ్‌లోకి వెళ్లనున్నది. ఇక అల్లు అర్జున్ సరసన ఆమె నటించే సినిమాని బొమ్మరిల్లు భాస్కర్ రూపొందించనున్నాడు. అలాగే తన మెంటర్ గౌతం మీనన్ తెలుగు, తమిళ, మలయాళ్ భాషలు మూడింటిన్లోనూ తీసే మరో సినిమానీ సమంతా చేయనున్నది. ప్రస్తుతం ఆమె చేస్తున్న, చేయబోతున్న సినిమాలు చూస్తే మిగతా హీరోయిన్లకి కన్నుకుట్టక మానదు.

Friday, September 16, 2011

న్యూస్: హీరోయిన్లకు 'మా' నోటీసులు

ఇప్పటివరకు తమ సంఘంలో సభ్యత్వం తీసుకోని కొంతమంది హీరోయిన్లకు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) నోటీసులు జారీ చేసింది. ముంబైతో పాటు తమిళనాడు, కర్ణాటక, కేరళ వంటి చోట్ల నుంచి పలువురు తారలు తెలుగు సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే వీరిలో కొంతమంది 'మా'లో సభ్యత్వం తీసుకోకుండానే నటిస్తూ వస్తున్నారు. వీరివల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిర్మాతలు వారిపై 'మా'కు ఫిర్యాదు చేసినా, వారు తమ సభ్యులు కాకపోవడంతో 'మా' ఎలాంటి చర్యలూ తీసుకోలేకపోతోంది. ఇప్పటికే ఎన్నోసార్లు చెప్పినా వారు సభ్యత్వం తీసుకోకపోవడంతోనే సుమారు 14 మంది హీరోయిన్లకు ఈ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. వారిలో చాలాకాలం నుంచే తెలుగు సినిమాల్లో నటిస్తున్న త్రిష, జెనీలియా, తమన్నాతో పాటు ఇటీవలి కాలంలో క్రేజ్ పొందిన సమంత, నిత్యమీనన్, పార్వతీ మెల్టన్ వంటి తారలు ఉన్నారు. సెప్టెంబర్ 30లోగా వీరు సభ్యత్వం తీసుకోకపోతే అక్టోబర్ 1 నుంచి వారికి సహకరించకూడదని 'మా' నిర్ణయించింది.

Thursday, August 25, 2011

న్యూస్: 'శంఖం' దర్శకుడితో రవితేజ కొత్త సినిమా!

రవితేజ హీరోగా కొత్త సినిమా మొదలైంది. ఇదివరకు గోపీచంద్ హీరోగా 'శౌర్యం', 'శంఖం' సినిమాల్ని రూపొందించిన సినిమాటోగ్రాఫర్ శివ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్ లిమిటెడ్ బేనర్‌పై సీనియర్ ప్రొడ్యూసర్ బూరుగపల్లి శివరామకృష్ణ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఆగస్ట్ 18న లాంఛనంగా మొదలైంది. ఈ సినిమా గురించి రవితేజ మాట్లాడుతూ "శివ సెన్సిబుల్ డైరెక్టర్. అతనికి మాస్ పల్స్ బాగా తెలుసు. అతను చెప్పిన కథ ఎంతో ఇన్‌స్పైరింగ్‌గా ఉంది" అని చెబితే, "రవితేజ ఇప్పటివరకు చెయ్యని కేరక్టర్ ఇది. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్‌తో మంచి మాస్ ఎంటర్‌టైనర్‌గా ఇది రూపొందుతుంది" అని శివ తెలిపాడు. ఇంకా హీరోయిన్‌ని ఎంపికచేయని ఈ సినిమాకి ఇద్దరు తమిళ టెక్నీషియన్లు పనిచేస్తున్నారు. ఒకరు సంగీత దర్శకుడు విజయ్ ఆంథోని, మరొకరు సినిమాటోగ్రాఫర్ వెట్రి. ఇంకో చెప్పుకోదగ్గ సంగతేమంటే సీనియర్ కామెడీ హీరో రాజేంద్రప్రసాద్ ఇందులో ఓ కీలక పాత్ర చేస్తుండటం.
డైరెక్టర్ శివకి మాస్ పల్స్ బాగా తెలుసని రవితేజ అన్నాడు కానీ 'శంఖం' సినిమా చూసినవాళ్లు మాత్రం ఆ మాటలతో ఏకీభవించరు. నిజానికి అది క్రేజీ కాంబినేషన్‌తో తయారైన సినిమా. అదివరకు విలన్, హీరోయిన్‌గా 'వర్షం'లో నటించిన గోపీచంద్, త్రిష ఈ సినిమాలో హీరో హీరోయిన్లుగా నటించడంతో విడుదలకి ముందు దానికి ఎంతో క్రేజ్ వచ్చింది. కానీ సినిమా చూశాక జనం ఉసూరుమన్నారు. సినిమా అంతా పాత చింతకాయ పచ్చడి వాసన వేయడం, చాలా సీన్లు బోర్ కొట్టించడంతో 'శంఖం'ని వారు తిరస్కరించారు. దాంతో నిర్మాతలు జె. భగవాన్, జె. పుల్లారావు భారీగా నష్టపోయారు. దానికి ఓవర్ బడ్జెట్ అవడం కూడా ప్రధాన కారణం. ఇప్పుడు రవితేజ సినిమాకి అతను ఖర్చుపెట్టించే దానిపైనే దాని విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. కాకపోతే రవితేజ అంటే మినిమం గ్యారంటీ హీరో కాబట్టి ఆ మేరకు నిర్మాతకి ఒకింత లాభం కలగవచ్చు.

Friday, August 19, 2011

న్యూస్: 'దూకుడు'తో తేలనున్న శ్రీను వైట్ల సత్తా!

మహేశ్ హీరోగా నటిస్తున్న 'దూకుడు'తో శ్రీను వైట్ల అసలు సత్తా ఏమిటో తేలిపోతుందని ఫిలింనగర్ వాసులు వ్యాఖ్యానిస్తున్నారు. డైరెక్ట్ చేసిన 11 సినిమాల్లో ('దూకుడు' 12వ సినిమా) 6 హిట్లున్న శ్రీనుకి మునుపటి సినిమా 'నమో వెంకటేశ' నిరాశని కలిగించింది. వెంకటేశ్, త్రిష జంటగా నటించిన ఈ సినిమాలో వెంకటేశ్ పాత్రని శ్రీను తీర్చిదిద్దిన విధానం విమర్శలకి తావిచ్చింది. వెంకటేశ్ ఈ సినిమాలో బ్రహ్మానందం కేరక్టెర్‌ని మించి జోకర్‌గా కనిపించిందని చాలామంది విమర్శించారు. అయితే ఈ విమర్శలేవీ అతనితో మహేశ్ పనిచేయడాన్ని ఆపలేకపోయాయి. ఎందుకంటే 'ఢీ' నుంచి 'కింగ్' దాకా వరుసగా శ్రీను డైరెక్ట్ చేసిన నాలుగు సినిమాలు ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడం. యాక్షన్‌కి అతను జోడించే వినోదం ఇప్పటివరకూ సత్ఫలితాల్నే ఎక్కువగా ఇస్తూ వచ్చింది. అందుకే అతని డైరెక్షన్‌లో చేయాలని మహేశ్ భావించాడు. అలా 'దూకుడు' సినిమా రూపుదాల్చింది. శ్రీనుతో 'నమో వెంకటేశ'ని తీసిన 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థే ఈ సినిమానీ నిర్మిస్తోంది. విడుదలైన పాటలకి రెస్పాన్స్ మాత్రం అదిరింది. కొట్టిన ట్యూన్లే కొట్టే తమన్ ఈసారి కొన్ని డిఫరెంట్ ట్యూన్స్ ఇచ్చాడు. రామజోగయ్యశాస్త్రి, విశ్వా రాసిన పాటలు బాగున్నాయి. ఎక్కువగా దేవిశ్రీ ప్రసాద్‌నే సంగీత దర్శకుడిగా తీసుకుంటూ వస్తున్న శ్రీను 'దూకుడు'తో తొలిసారి తమన్‌తో పనిచేశాడు. ప్రస్తుతం టాలీవుడ్‌లో మహా 'దూకుడు' మీదున్న తమన్ టైటిల్‌కి న్యాయం చేశాడు. కాగా 'దూకుడు' ప్రోమోస్‌లో మహేశ్ చాలా బాగున్నాడనే పేరు వచ్చింది. ఇక సినిమాలో అతణ్ణి శ్రీను ఎలా చూపించాడు, దానికంటే కూడా సబ్జెక్ట్ ఎలా చేశాడు, స్క్రీన్‌ప్లేని ఎలా అల్లాడు.. అనే అంశాల మీదే ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని సాధిస్తుందనేది ఆధారపడి ఉంది. 'నమో వెంకటేశ' రిజల్ట్‌తో 'దూకుడు'ని అతడు కసిగా తీశాడని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి 'దూకుడు' తర్వాత శ్రీను టాప్ డైరెక్టర్‌గా మరింత డిమాండ్ పొందుతాడో, లేదో చూడాల్సిందే.

Thursday, July 14, 2011

న్యూస్: అది హిట్టయితే ఓకే, లేకపోతే..?

సీనియర్ హీరోయిన్ త్రిష క్రేజ్ తెలుగులో క్రమేపీ తగ్గుతున్నట్లు కనిపిస్తోంది. ఏడేళ్ల క్రితం 'వర్షం'తో యువత కలల రాణిగా ఆవిర్భవించిన ఈ తమిళ తార ఆ మరుసటి యేడాదే 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా'తో అగ్ర తారల్లో చేరిపోయింది. ఈ రెండూ ఎమ్మెస్ రాజు నిర్మించినవే కావడం గమనార్హం. అనంతరం 'అతడు', 'ఆడవారి మాటలకు అర్థాలే వేరులే', 'కృష్ణ', 'కింగ్' వంటి హిట్ సినిమాల్లో నటించి నెంబర్‌వన్ హీరోయిన్ అనిపించుకుంది. ఆ తర్వాత కాలంలో కొత్త తారల సందడి వల్ల ఆమె కెరీర్ వెనుకపట్టు పట్టింది. 'కింగ్' తర్వాత ఆమె చేసిన 'శంఖం', 'నమో వెంకటేశ' సినిమాలు ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేక పోయాయి. ఆమె పాత్రలు కూడా అంతే. వాటి తర్వాత పవన్ కల్యాణ్‌తో తొలిసారిగా నటించిన 'తీన్‌మార్' కూడా ఆమెకి ప్రయోజనం కలిగించలేదు. ఇప్పుడు ఆమె చేతిలో ఒకే తెలుగు సినిమా ఉంది. అది వెంకటేశ్‌తో చేస్తున్న మలయాళ 'బాడీగార్డ్' రీమేక్. బెల్లంకొండ సురేశ్ నిర్మిస్తున్న ఈ సినిమాకి గోపీచంద్ మలినేని దర్శకుడు. వెంకటేశ్ కాంబినేషన్‌లో ఇది మూడో సినిమా. ఈ సినిమా బాక్సాఫీసు ఫలితం తెలుగులో త్రిష కెరీర్‌ని ప్రభావితం చేసే అవకాశాలు చాలా ఉన్నాయి. ఈ సినిమా హిట్టయితే సరే, లేకపోతే.. సమస్యే.

Wednesday, July 13, 2011

న్యూస్: నెంబర్‌వన్ రేసులో తమన్నా!

మిల్కీ బ్యూటీగా పేరు తెచ్చుకున్న తమన్నా తెలుగులో ఇప్పుడు నెంబర్ వన్ రేసులో దూసుకుపోతోంది. ఈ విషయంలో ఆమె కాజల్ అగర్వాల్‌కి ప్రధాన పోటీదారుగా మారింది. రేసులో నిన్నటి వరకు ముందున్న గోవా సుందరి ఇలియానా వెనకడుగు వేయడం, త్రిష ఇమేజ్ క్రమేపీ తగ్గుతుండటం, తాప్సీ, సమంతా ఇంకా టాప్ స్లాట్‌లోకి రాకపోవడంతో తమన్నాకి అవకాశాలు మెరుగయ్యాయి. ఆరేళ్ల క్రితమే మంచు మనోజ్ సరసన చేసిన 'శ్రీ'తో తెలుగులో అడుగుపెట్టినప్పటికీ ఆమెకి బాగా గుర్తింపు తెచ్చింది శేఖర్ కమ్ముల రూపొందించిన 'హ్యాపీడేస్' సినిమానే. అయితే దాని తర్వాత కూడా ఆమె సరైన సినిమాల్ని ఎంచుకోలేకపోయింది. రెండేళ్ల క్రితం 'కొంచెం ఇష్టం కొంచెం కష్టం' సినిమాలో ఆకట్టుకున్న ఆమె మళ్లీ రెండేళ్ల గ్యాప్‌తో '100% లవ్'తో ప్రేక్షకుల్నీ, విమర్శకుల్నీ సమానంగా సమ్మోహనపరిచింది. సుకుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో హీరో నాగచైతన్య కంటే తమన్నాకే ఎక్కువ పేరు రావడం గమనార్హం. ఈ సంగతిని నాగచైతన్య తండ్రి, సీనియర్ టాప్ హీరో నాగార్జున సైతం పబ్లిగ్గా చెప్పారు కూడా. ఈ సినిమాతో ఆమెకి వరుస అవకాశాలు వెల్లువెత్తాయి. '100% లవ్' నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ నిర్మించిన భారీ చిత్రం 'బద్రీనాథ్'లో రెగ్యులర్ హీరోయిన్‌గా కనిపించినా తనదైన ముద్రని వేసింది తమన్నా. ప్రస్తుతం ఆమె చేతిలో మూడు క్రేజీ ప్రాజెక్టులున్నాయి.
వాటిలో ఒకటి రాంచరణ్‌కి జోడీగా నటిస్తున్న 'రచ్చ' కాగా రెండోది ఎన్‌టీఆర్‌తో చేస్తున్న 'ఊసరవెల్లి'. ఇక మూడోది రాం సరసన నటిస్తున్న 'ఎందుకంటే.. ప్రేమంట'. ఈ మూడు సినిమాలతో తమన్నా తెలుగులో నెంబర్ వన్ తార అవడం ఖాయమని చాలామంది నమ్ముతున్నారు. వారి నమ్మకం నిజమవుతుందో, లేదో వెయిట్ అండ్ సీ.

Sunday, July 3, 2011

న్యూస్: ఆచితూచి అడుగేస్తున్న 'మొగుడు'

హీరోగా గోపీచంద్ రెండో ఇన్నింగ్స్ 'యజ్ఞం'తో సజావుగానే మొదలైంది. ఆంధ్రుడు, రణం, లక్ష్యం, శౌర్యం వంటి హిట్ సినిమాల్ని అతను అందించగలిగాడు. 'శౌర్యం' తర్వాత త్రిష జంటగా అతను చేసిన 'శంఖం' ఫ్లాపవగా, పూరి జగన్నాథ్ డైరెక్షన్లో చేసిన 'గోలీమార్' ఫర్వాలేదనిపించుకుంది. దాని తర్వాత ఎంతో నమ్మకంతో బీవీఎస్ రవి అనే రచయితని డైరెక్టర్‌గా పరిచయం చేస్తూ అతను నటించిన 'వాంటెడ్' అట్టర్‌ఫ్లాపయ్యింది. ఇలా ఓ సినిమా హిట్టయి, రెండు సినిమాలు ఫ్లాపవుతూ రావడం గోపీచంద్‌కి ఏమాత్రమూ ఇష్టం లేదు. అందుకే ఇక నుంచీ సినిమాల ఎంపికలో మరింత శ్రద్ధ పెట్టాలని అతను నిర్ణయించుకున్నాడు. అందుకు తగ్గట్లే తొలిసారి కృష్ణవంశీ డైరెక్షన్‌లో చేస్తున్నాడు. ఆ ఇద్దరి కాంబినేషన్లో తయారవుతున్న ఆ సినిమా 'మొగుడు'. ఇందులో అందాలరాశి తాప్సీ నాయిక. ఇప్పటివరకు చేయని పాత్రని ఈ సినిమాలో గోపీచంద్ చేస్తున్నట్లు యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. ఇంతదాకా హీరోగా అతను చేసినవన్నీ పెళ్లికాని బ్రహ్మచారి పాత్రలే. తొలిసారి పెళ్లయిన యువకుడి పాత్రను 'మొగుడు'లో చేస్తున్నాడు. ఈ సినిమా తనకి సరికొత్త ఇమేజ్‌ని ఇవ్వడమే కాక, నటుడిగా తనని మరో మెట్టు పైకెక్కిస్తునంది నమ్ముతున్నాడు గోపీచంద్. అతడి ఆశ నెరవేరుతుందో, లేదో చూడాలి.

Sunday, August 22, 2010

Movies: North rejects South heroines


సౌత్ ఇండియన్ హీరోయిన్లకి బాలీవుడ్డులో స్థానం దక్కడం లేదు. ఉత్తరాది ప్రేక్షకుల ఆదరణ లభించడం లేదు. ఇదివరలో శ్రీదేవి, జయప్రదకు ఈ పరిస్థితి లేదు. కానీ ఇప్పుడు అక్కడి ప్రేక్షకుల టేస్ట్ మారినట్టుంది. సౌత్ హీరోయిన్లంటే మొహం చాటేస్తున్నారు. అది శ్రియ అయినా, అసిన్ అయినా, త్రిష అయినా ఒకటే.. ఎవరినీ అభిమానించి ఆదరించడం లేదు. ఈ మార్పు 2007లో శ్రియతో మొదలైంది. ఆమె 'ఆవారాపన్'తో హిందీలో అరంగేట్రం చేసి తిరుగుముఖం పట్టింది. ఆ తర్వాత 2008లో 'జానే తూ యా జానే నా'తో జెనీలియాకి ఈ పరిస్తితే ఎదురైంది. ఆ తర్వాత 'గజిని'తో అసిన్, ఇప్పుడు 'ఖట్టా మీఠా'తో త్రిష కూడా తిరుగుముఖం పట్టాల్సి వచ్చింది. ఈలోగా ఇటు మాతృభాషలోనూ డిమాండ్ తగ్గిపోయి త్రిశంకు స్వర్గంలో కొట్టుమిట్టాడుతున్నారు వీళ్లందరూ. దీన్నించి నేర్చుకోవాల్సిన పాఠమేంటి? టౌను పక్కకెళ్లద్దురో డింగరీ అనేకదూ! లేకపోతే రెంటికీ చెడ్డ రేవడి అవుతారు.

Friday, September 11, 2009

Sankham (2009)


Synopsis: Set on the backdrop of Australia, the story begins with the happy go lucky Chandu (Gopichand) whose only aim in life seems to be to get into fight given his martial arts and fitness skills. However, action doesn’t happen but love happens to him when he sees Mahalakshmi (Trisha) and since then he chases her. Finally she gives in but not before her aunty comes and takes her back to India. Mahalakshmi is the daughter of the dreaded Pasupathy (Kota) in Rayalaseema region and he has got his staunch enemy in Sivaiah (Sathyaraj) who is considered as god by the locals. The interesting bit is Chandu happens to be the son of Sivaiah but he doesn’t know that until he comes to India to take Mahalakshmi. The father and son meet and what happens from there forms the rest of the story.
Cast: Gopichand, Trisha, Satyaraj, Chandra Mohan, Kota Srinivasa Rao, Supreet, Dharmavarapu Subrahmanyam, Vunumadhav, Ali, Krishna Bhagawan, L.B. Sriram, Ahuti Prasad, M.S. Narayana, Benarjee, Sita, Fish Venkat.
Dialogues: Anil
Story, Screen-play: Siva
Songs: Veturi, Bhaskarabhatla
Music: Taman
Cinematography: Vetri
Fights: Vijay
Producers: J. Bhagawan, J. Pulla Rao
Director: Siva
Banner: Sri Balaji Cine Media
Release Date: 11 Sept, 2009