Showing posts with label journalism. Show all posts
Showing posts with label journalism. Show all posts

Wednesday, July 27, 2011

గొప్ప వ్యక్తులు: తొలి మహిళా ఫొటో జర్నలిస్ట్ హోమై

మనదేశంలో తొలి మహిళా ఫొటో జర్నలిస్ట్ హోమై వ్యరవల్లా. 1913లో గుజరాత్‌లోని నవసారిలో జన్మించిన 97 యేళ్ల హోమై ఇప్పటికీ సజీవురాలే. ఆమె భర్త విఖ్యాత ఫొటోగ్రాఫర్ మానెక్‌షా. ఆయన ప్రోద్బలంతోటే హోమై ఫొటో జర్నలిజంలోకి అడుగుపెట్టారు. చిత్రమేమంటే "నాకు ఫొటోగ్రఫీ తెలీదు. నిజంగా. నేనేమీ జోక్ చేయడం లేదు" అనంటుంది ఆమె. "నేను థిరీ చదువుకోలేదు. కెమెరాని ఎలా క్లిక్ చేయాలో, కేప్షన్స్ ఎలా రాయాలో, ఇంగ్లీషులో విషయాన్ని ఎలా వివరించాలో తెలుసు. 'థీరీ చదవడానికి నా టైంని వేస్ట్ చేసుకుంటే, నా ప్రాక్టికల్ పనికి ఆటంకం కలుగుతుంది' అని నాకు నేను చెప్పుకునేదాన్ని. థీరీ చదవడం వల్ల మనం చేస్తున్నది రైటా, రాంగా అనే మీమాంసలో పడి పనిని ఆలస్యం చేసేస్తాం" అని ఆమె చెబుతుంది. ఆమె వంట నేర్చుకునే తరహాలో ట్రయల్ అండ్ ఎర్రర్ పద్ధతిలోనే కెమెరాని ఎలా వాడాలో నేర్చుకుందంటే ఆశ్చర్యం కలుగుతుంది.
మొదట్లో ఆమె తీసిన ఫొటోగ్రాఫులు ఆమె భర్త మానెక్‌షా పేరిటే పబ్లిష్ అవుతూ వచ్చాయి. ఆమె ఎన్నో చారిత్రక సందర్భాల్ని తన కెమెరాతో బంధించింది. భారతావనికి స్వాతంత్ర్యం సిద్ధించిన అర్థరాత్రి క్షణాల్నీ, భారతదేశ విభజనకి మన నాయకులు ఓటేసిన సంఘటననీ, రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఎయిర్ రైడ్ ప్రికాషన్ (ఎ.ఆర్.పి.) శిక్షణలొ భారతీయ మహిళలు భాగమైన క్షణాల్నీ తన కెమరాతో బంధించింది హోమై. తనకి భారతీయ తొలి మహిళా ఫొటో జర్నలిస్ట్‌గా గుర్తింపు దక్కడం ఆమెకేమీ గొప్పగా అనిపించదు. అదే ఆమెలోని గొప్పతనం. ద ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియాలో ప్రచురితమైన ఈమె ఫొటోగ్రాఫులెన్నో మంచి పేరుపొందాయి. బ్రిటీష్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ఉద్యోగినిగా పనిచేసిన ఆమె ఢిల్లీ ఈ మూల నుంచి ఆ మూలకి చక్కర్లు కొట్టేది. అప్పట్లో శాంతి భద్రతల పరిస్థితి బాగున్నందువల్లే రాత్రిళ్లు కూడా ఒంటరిగా ప్రయాణించ గలిగానని అప్పటి రోజుల్ని జ్ఞాపకం చేసుకుంటుంది హోమై.
భర్త మరణానంతరం 1973లో వడోదరకి మకాం మార్చిన ఆమె ప్రస్తుతం అక్కడే నివాసముంటోంది. 

Wednesday, September 8, 2010

మీడియా: అర్థంపర్థంలేని టీఆర్పీల వేట


వార్తను ఒక్కొక్క మీడియా ఒక్కో రకంగా నిర్వచించడం, పాత్రికేయులు మరో రకంగా అంచనాకు రావడం వల్ల జర్నలిజం కాకిగోలగా తయారయ్యింది. ప్రజా జీవితాన్ని ప్రభావితం చేసేది, ప్రజలకు ప్రయోజనం కలిగించేది, సామాజిక బాధ్యతను గుర్తించేదే వార్త. కాని యాజమాన్యాలకు ప్రయోజనం కలిగించేది, ప్రకటన కర్తలకు లాభం చేకూర్చేది, ప్రభుత్వాలకు, అధికార పార్టీలకు, అధికారులకు ఆసక్తి కలిగించేది, అర్థబలం, అంగబలం, గ్లామర్ చుట్టూ ప్రదక్షిణ చేసేది వార్త అనే నిర్వచనాన్ని మీడియా నిర్ధారించింది. అందుకే అర్థంపర్థంలేని టీఆర్పీల వేటలో పడి, విశ్వసనీయతను పోగొట్టుకుంటున్నది.
ఏ పత్రికా, ఏ చానల్ తన పాఠకులెవరో, వీక్షకుల అభిరుచులు ఏమిటో అధ్యయనం చేయించకపోవడం, ప్రొఫైల్ తయారు చేసుకోకపోవడం, మీడియా గాలివాటానికి నిదర్శనం. ఫలితంగా లైవ్ ప్రోగ్రాం జర్నలిస్టులు కోతి చేష్టలకు పాల్పడవలసి వస్తోంది.
ప్రజాస్వామ్యానికి నాల్గవ స్తంభంగా మన మీడియా పరిణతి చెందాలంటే ఏం చేయాలో మీడియా సంస్థలే ఆలోచించుకోవాలి. మీడియాలో ఎవరి పెట్టుబడులు ఉన్నాయో పారదర్శకంగా ప్రకటించుకోవాలి.