Showing posts with label devisri prasad. Show all posts
Showing posts with label devisri prasad. Show all posts

Wednesday, November 18, 2015

Saturday, October 3, 2015

Monday, July 2, 2012

'గబ్బర్‌సింగ్' విజయం పవన్‌కల్యాణ్‌కే అంకితం


పవన్‌కల్యాణ్ హీరోగా పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై తాను నిర్మించిన 'గబ్బర్‌సింగ్' చిత్రం శుక్రవారంతో 306 కేంద్రాల్లో 50 రోజులు పూర్తి చేసుకుందని బండ్ల గణేశ్ చెప్పారు. సంస్థ కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ "మా కెరీర్‌కి అర్థం చెప్పిన చిత్రం 'గబ్బర్‌సింగ్'. 81 సంవత్సరాల తెలుగు చిత్ర పరిశ్రమలో మా సినిమా నెంబర్‌వన్‌గా నిలవడం మా అదృష్టం. మలేషియాలో యాభై రోజులు ఆడిన తొలి తెలుగు సినిమా ఇదే. ఈ సినిమా ఇంత హిట్టవడానికి హీరో పవన్‌కల్యాణ్ కారణం. మూడో చిత్రమైనా అద్భుతంగా డైరెక్ట్ చేసి, మాటలు రాసిన హరీశ్ శంకర్, తన కెరీర్‌లోనే బెస్ట్ ఆల్బమ్ ఇచ్చిన దేవి శ్రీ ప్రసాద్, మిగతా టెక్నీషియన్లు, ఆర్టిస్టులు కూడా ఈ విజయంలో భాగమే. జూలై తొలివారంలో భారీ స్థాయిలో అభిమానుల మధ్య యాభై రోజుల వేడుక చేయబోతున్నాం'' అని చెప్పారు.
దర్శకుడు హరీశ్ శంకర్ మాట్లాడుతూ "నేను తీసిన 'మిరపకాయ్' కంటే ముందే పవన్ కల్యాణ్‌కు సబ్జెక్ట్ చెప్పా. అప్పుడు చేయడానికి కుదరలేదు. కానీ నాతో సినిమా చేస్తానని మాటిచ్చిన ఆయన ఏకంగా ఇండస్ట్రీ హిట్ అయిన 'గబ్బర్‌సింగ్'ని డైరెక్ట్ చేసే అవకాశం ఇచ్చారు. నేను మంచి స్క్రిప్టు రాసినా సినిమా ఇంత పెద్ద హిట్టవడానికి కారణం పవన్ కల్యాణ్ పవర్. చేతి మణికట్టు విరిగినా, వెన్నునెప్పి బాధిస్తున్నా లెక్కచెయ్యకుండా మిగతా షూటింగ్‌ని పూర్తిచేశారు. ఆయన అంకితభావానికి ప్రతిఫలం దక్కింది. అందుకే ఈ విజయం పవన్ కల్యాణ్‌కే అంకితం. ఓవర్సీస్‌లోనూ ఈ సినిమా తెలుగులో బిగ్గెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది'' అని తెలిపారు.

Tuesday, June 5, 2012

సూర్య సరసన హన్సిక

సూర్య, అనుష్క జంటగా నటించిన 'సింగమ్' ఘన విజయం సాధించింది. ఈ సినిమా తెలుగులో 'యముడు' పేరుతో విడుదలై ఇక్కడా సక్సెసయింది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ తీసే పనిలో పడ్డాడు దర్శకుడు హరి. ఈ సినిమాలో సూర్య సరసన నాయికగా అందాల తార హన్సిక ఎంపికైంది. తమిళంలో 'చిన్న కుష్బూ'గా పేరుపొందిన హన్సిక ఈ సినిమాలో కాలేజ్ గర్ల్‌గా కనిపించన్నుది. సూపర్‌హిట్ తెలుగు సినిమా 'దేశముదురు'తో హీరోయిన్‌గా పరిచయమైన హన్సిక తెలుగులో కంటే తమిళంలోనే బాగా పాపులర్ అవడం గమనార్హం. 'మాప్పిళ్లై', 'ఎంగేయుమ్ కాదల్', 'వేలాయుధం', 'ఒరు కల్ ఒరు కన్నాడి' సినిమాలతో ఆమె తమిళంలో టాప్ హీరోయిన్ ఇమేజ్ సంపాదించింది. 'సింగమ్ 2' సినిమా తన పాపులారిటీని మరింత పెంచుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తోంది ఈ సుందరి. కాగా ఒరిజినల్‌కి సంగీతం సమకూర్చిన దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకీ బాణీలు కూర్చబోతున్నాడు.

Monday, June 4, 2012

పవన్‌కల్యాణ్ షో గబ్బర్‌సింగ్

"ఒన్‌మ్యాన్ షో 'గబ్బర్‌సింగ్'. పవన్‌కళ్యాణ్ కాకుండా మరొకర్ని 'గబ్బర్‌సింగ్'గా ఊహించలేను. అన్ని రికార్డుల్నీ క్రాస్‌చేసి తెలుగు ఇండస్ట్రీలో నెంబర్‌వన్ సినిమా అయ్యింది'' అని చెప్పారు బండ్ల గణేశ్. పవన్‌కల్యాణ్ హీరోగా హరీశ్‌శంకర్ డైరెక్ట్ చేసిన 'గబ్బర్‌సింగ్'ను ఆయన పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించారు. ఈ చిత్రం ఇటీవల విడుదలై బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన సందర్భంగా తమ సంస్థ కార్యాలయంలో మాట్లాడారు గణేశ్. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే...
కల్యాణ్ దేనికీ ఎగ్జయిట్ అవరు. సినిమా చూశాక ఆయన నోటినుంచి వచ్చిన ఒకే మాట 'బాగుంది' అని. రికార్డుల గురించీ, కలెక్షన్ల గురించీ ఒక్కసారీ అడగలేదు. మానవ అనుబంధాలకీ, మోరల్స్‌కీ నిలబడే మనిషి కల్యాణ్. సినిమాలో 'రౌడీలతో అంత్యాక్షరి' ఎపిసోడ్ ఆలోచన కల్యాణ్‌ది. అది మినహాయిస్తే 'దబాంగ్'లో లేని సన్నివేశాలు కానీ, ఇతర మార్పులు కానీ అన్నీ హరీశ్‌వే. చాలా గొప్పగా చేశాడు. హరీశ్ ఈ సినిమా కథ చెప్పినప్పుడు 'అతను చెప్పినట్లు తీస్తే ఇండస్ట్రీ రికార్డులు కొడుతుంది' అన్నాడు మా అన్నయ్య శివబాబు. అది నిజమైంది. హరీశ్ స్క్రిప్టు తయారుచేసిన విధానం, అతని డైరెక్షన్, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్, శ్రుతీహాసన్ పాత్ర వంటివి కూడా ఈ సినిమా విజయంలో తమ వంతు పాత్ర నిర్వహించాయి.
నా జీవితమే లేదు
'గబ్బర్‌సింగ్'ను తానే సొంతంగా నిర్మిస్తానని ప్రకటించిన తర్వాత నాకివ్వడం నా అదృష్టం. పవన్‌కల్యాణ్ ఎప్పటికీ నాకు వ్యసనమే. ఈ సినిమా రిలీజ్ అయ్యేంతవరకు ఆయన రెమ్యూనరేషన్ ఎంతనేది మేం మాట్లాడుకోలేదు. చరణ్ పెళ్లయ్యాక విజయోత్సవ సభ పెడదామనుకుంటున్నా. దానికి కల్యాణ్ ఒప్పుకోవాలి. త్వరలో ఆయనతో మరో సినిమా ఉంటుంది. ఎప్పుడనేది ఆయనతో మాట్లాడాక చెబుతా. చిన్న చిన్న వేషాలు వేసుకుంటున్న నన్ను నిర్మాతని చేసింది పవన్‌కల్యాణ్. ఆయన లేకపోతే నిర్మాతగా నా జీవితమే లేదు.
భయమేస్తోంది
నేనెవరికీ బినామీని కాను. ఇప్పటికే దీనిపై వచ్చిన ప్రచారాన్ని ఖండించా. ఓవర్‌నైట్ ప్రొడ్యూసర్‌ని అయ్యేప్పటికి ఇలాంటి పుకార్లు వస్తున్నాయి. సినిమా హిట్ కాకపోతే నిర్మాత పరిస్థితి ఘోరం. అందుకని హిట్ సినిమానే తియ్యాలి. 'తీన్‌మార్'తో హిట్ రాలేదని భయపడ్డ నేను 'గబ్బర్‌సింగ్' హిట్‌తో ఇంకా భయమేస్తోంది. రాబోయే సినిమా ఇంకెంత బాగా తియ్యాలనేదే ఆ భయం. తెరపై ఇక నటించాలని నేను అనుకోవడం లేదు. మాస్ నుంచి వచ్చినవాణ్ణి కాబట్టి మాస్ ఎంటర్‌టైనర్స్ అంటేనే ఎక్కువ ఇష్టం.
పెద్ద సినిమాలే చేస్తా
చిన్న సినిమాలు తీసే గట్స్ నాకు లేవు. అందరు అగ్ర హీరోలతోటి పెద్ద సినిమాలే చేస్తా. నేనెవరితో పనిచేసినా, అదే భక్తితో ఆ సినిమా సూపర్‌హిట్ కావాలనే లక్ష్యంతోనే పనిచేస్తా. నేను పవన్‌కల్యాణ్ భక్తుణ్ణయినా, అందరితో బాగుంటా. అందరితో సినిమాలు చేస్తా. అందరితో చెయ్యమని కల్యాణ్ కూడా చెప్పారు. ఎన్టీఆర్, శ్రీను వైట్ కాంబినేషన్ సినిమా 'బాద్‌షా' సినిమా షెడ్యూలు జూన్ 15 నుంచి ఉంటుంది. ఇది ఎన్టీఆర్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ అవుతుంది. కృష్ణానగర్‌లో నేనూ, పూరి జగన్నాథ్ కలిసి తిరిగాం. 'గబ్బర్‌సింగ్' హిట్‌కి తను ఎంతో ఆనందపడ్డాడు. అక్టోబర్ నుంచి ఆయన డైరెక్షన్‌లో ఓ సినిమా చేయబోతున్నా. హీరో ఎవరనేది ఆయనే చెబుతాడు.

Saturday, December 10, 2011

రాంచరణ్ 'ఎవడు'

రాంచరణ్ కథానాయకుడిగా 'ఎవడు' అనే చిత్రం షూటింగ్ లాంఛనంగా ప్రారంభమైంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకుడు. సమంత ఓ హీరోయిన్ కాగా, మరో హీరోయిన్ ఎంపిక జరుగుతోంది. అల్లు అర్జున్ అతిథి పాత్ర చేయబోతున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. ప్రసాద్ ల్యాబ్స్‌లో డిసెంబర్ 9న జరిగిన కార్యక్రమంలో రాంచరణ్‌పై చిత్రీకరించిన తొలి సన్నివేశానికి చిరంజీవి క్లాప్‌నివ్వగా, సీనియర్ నిర్మాత అల్లు అరవింద్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. దీనికి మరో నిర్మాత శ్యాంప్రసాద్‌రెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ "దర్శకుడు వంశీ చెప్పిన పాయింట్ ఎగ్జయిట్ చేసింది. ఆ కథవిని చిరంజీవి గారు, రాంచరణ్ కూడా అంతే ఎగ్జయిట్ అయ్యారు. కమర్షియల్ సినిమాల్లో కొత్త యాంగిల్ ఉన్న చిత్రం. జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుతాం. తెలుగుతో పాటు తమిళంలోనూ ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం. ఇది అన్ని రకాల ఎమోషన్స్ ఉన్న యాక్షన్ ఎంటర్‌టైనర్'' అన్నారు.
సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ "చరణ్‌తో, వంశీ పైడిపల్లితో ఇది నాకు తొలి చిత్రం. స్క్రిప్టు చాలా బాగా వచ్చింది. మంచి ఆడియో ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నా'' అని చెప్పారు. దర్శకుడు వంశీ పైడిపల్లి మాట్లాడుతూ "కథ విన్న రోజే చిరంజీవిగారు, చరణ్ ఓకే చేశారు. ఇది నాకు మూడో చిత్రం. అన్నీ దిల్ రాజు బేనర్‌లో చేసినవే. దేవిశ్రీ మంచి బాణీలిచ్చాడు. మంచి టీమ్ కుదిరింది'' అన్నారు. ఇది కమర్షియల్ యాంగిల్‌లో కచ్చితంగా కొత్త సినిమా అని కథా రచయిత వక్కంతం వంశీ చెప్పారు.
రాంచరణ్ మాట్లాడుతూ "దిల్ రాజు ఏమిటనేది ఆయన సినిమాలే మాట్లాడతాయి. ముఖ్యమైన అతిథి పాత్ర చేయడానికి బన్నీ చేయడానికి ఒప్పుకోవడం వల్లే ఈ సినిమా త్వరగా మొదలైంది. 'ప్రస్థానం' చూసి సాయికుమార్ అభిమానినైపోయా. ఆయనతో కలిసి పనిచేస్తున్నందుకు సంతోషంగా ఉంది'' అన్నారు. సాయికుమార్ మాట్లాడుతూ "ఈ సినిమా విషయంలో ఎంతో ఉత్సుకతతో ఉన్నా. 2012లో నాకు ఈ సినిమా పెద్ద బ్రేక్‌నిస్తుంది'' అని చెప్పారు.
అబ్బూరి రవి మాటలు రాస్తున్న ఈ చిత్రానికి కథా సహకారం: హరి, ఛాయాగ్రహణం: చోటా కె. నాయుడు, కళ: ఆనంద్‌సాయి, సహ నిర్మాతలు: శిరీశ్, లక్ష్మణ్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వంశీ పైడిపల్లి.

Saturday, October 29, 2011

కీలక దశలో నాగచైతన్య కెరీర్

అక్కినేని నాగచైతన్య కెరీర్ కీలక దశలో ప్రవేశించింది. ఇప్పటివరకు నాలుగు సినిమాలు చేసిన అతను రెండు ఫ్లాపులు, రెండు హిట్లతో బేలన్స్‌గా ఉన్నాడు. తొలి సినిమా 'జోష్', నాలుగో సినిమా 'దడ' ఫ్లాపవగా; రెండు, మూడు సినిమాలైన 'ఏమాయ చేసావె', '100% లవ్' సినిమాలు హిట్టయ్యాయి. అయితే మాస్ హీరోగా ఎస్టాబ్లిష్ అవుదామని అతడు చేసిన 'దడ' సినిమా డిజాస్టర్ కావడం అతడికి కొంత నిరుత్సాహాన్ని కలిగించింది. టాప్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ గ్లామర్ కానీ, కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టి విదేశాల్లో రిచ్‌గా చిత్రీకరించిన ఫైట్లు గానీ, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ గానీ సినిమాని రక్షించలేకపోయాయి. అంతకు మించి నాగచైతన్య కేరక్టర్ ప్రేక్షకుల్ని మెప్పించలేక పోయింది. ఫలితంగా కామాక్షి మూవీస్ అధినేత డి. శివప్రసాద్‌రెడ్డి ఖాతాలో మరో ఫ్లాప్ జతకూడింది. ఈ నేపథ్యంలో నాగచైతన్య రెండు ఆసక్తికర సినిమాలు చేస్తున్నాడు. వాటిలో ఒకటి రాంగోపాల్‌వర్మ నిర్మిస్తున్న 'బెజవాడ' కాగా మరొకటి దేవా కట్టా డైరెక్ట్ చేస్తున్న 'ఆటోనగర్ సూర్య'. వీటిలో 'బెజవాడ' సినిమా షూటింగ్ పూర్తిచేసుకుని నవంబర్ ఫస్ట్ వీక్‌లో రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఈ సినిమా మొదలు పెట్టినప్పట్నించే వార్తల్లో ఉండటం వల్ల అందరి దృష్టీ దీనిపైన ఉంది. ఇక 'ఆటోనగర్ సూర్య' ఇప్పుడే మొదలైంది. ఇందులో చైతన్య, సమంత జంటగా రెండోసారి నటిస్తున్నారు. దేవా కట్టా ప్రతిభావంతుడైన దర్శకునిగా ఇప్పటికే రుజువు చేసుకున్నందున ఈ సినిమా మీద కూడా అంచనాలు బాగానే ఉన్నాయి. ఈ సినిమాల్లో ఒక్కటైనా హిట్టయితేనే స్టార్ హీరోగా నాగచైతన్య రూపుదాల్చే అవకాశాలుంటాయి.

Tuesday, October 18, 2011

న్యూస్: ప్రభాస్‌ని డైరెక్ట్ చేస్తున్న కొరటాల శివ

ప్రభాస్ కథానాయకుడిగా తాజా చిత్రం మొదలైంది. 'బృందావనం', 'ఊసరవెల్లి' చిత్రాల రచయిత కొరటాల శివ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ప్రభాస్ స్నేహితులు వి.వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి సంయుక్తంగా యు.వి క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కిస్తున్నారు.
చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ "ఈ చిత్రంలో మా హీరో ప్రభాస్ పాత్ర తీరుతెన్నులు వైవిధ్యంగా ఉండటమే కాకుండా గెటప్ కూడా కొత్తగా ఉంటుంది. ఇంతకుముందు ప్రభాస్ ఆ గెటప్‌లో ఎవరూ చూసి ఉండరు. నవంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ చేస్తాం. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇద్దరు ప్రముఖ నాయికలు ప్రభాస్ సరసన నటిస్తారు. వారి వివరాలను త్వరలో ప్రకటిస్తాం. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుంది'' అని అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ "ప్రభాస్ కథానాయకుడిగా నా తొలి చిత్రం ప్రారంభం కావడం ఆనందంగా ఉంది. ప్రభాస్ ఇమేజ్‌కి ఏ మాత్రం తగ్గకుండా కథ ఉంటుంది'' అని అన్నారు.
"నా స్నేహితులు వి.వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం కథ నాకు బాగా నచ్చింది. నవంబర్ నుంచి సినిమా సెట్స్ మీదకు వెళ్తుంది. కమర్షియల్ హంగులన్నీ ఉంటాయి. దేవిశ్రీ సంగీతం మెప్పిస్తుంది. అన్ని వర్గాల వారికీ చేరువవుతుంది'' అని ప్రభాస్ అన్నారు.
ఈ చిత్రానికి కళ: ఎ.ఎస్.ప్రకాష్, యాక్షన్: అరసు, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు, సంగీతం: దేవిశ్రీప్రసాద్, లైన్ ప్రొడ్యూసర్: అశోక్‌కుమార్ రాజు, రచన-దర్శకత్వం: కొరటాల శివ.

Sunday, September 4, 2011

ప్రివ్యూ: గబ్బర్‌సింగ్

పవన్ కల్యాణ్ హీరోగా 'గబ్బర్‌సింగ్' అనే టైటిల్‌తో సినిమా అంటేనే అదో ఇంటరెస్ట్ క్రియేట్ అవుతోంది. పవన్ వంటి స్టైలిష్ యాక్టర్‌కి 'గబ్బర్‌సింగ్" అనే ఫుల్ మాస్ టైటిల్ ఎలా యాప్ట్ అవుతుందనేది చాలామందికి పెద్ద క్వశ్చన్ మార్క్. ఇది ఇప్పటికే బాలీవుడ్‌లో కండల వీరుడు సల్మాన్‌ఖాన్ నటించగా సూపర్‌హిట్టయిన 'దబాంగ్'కి రీమేక్. మొదట 'షాక్' తిని, తర్వాత 'మిరపకాయ్'తో తేరుకున్న హరీశ్ శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బేనర్‌పై బండ్ల గణేశ్ నిర్మిస్తున్నాడు. "సల్మాన్ బాడీలాంగ్వేజ్‌కు అనుగుణంగా తెరకెక్కిన 'దబాంగ్' హిందీలో ఎంత సూపర్‌హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు పవన్‌కు తగ్గట్టు, ఆయన మేనరిజానికి తగ్గట్టుగా చాలా మార్పులు చేసి పూర్తి స్థాయి మాస్ క్యారక్టర్‌తో ఫుల్ మీల్స్‌గా సిద్ధం చేస్తున్నాం. 'గబ్బర్ సింగ్' పవన్ అభిమానులు ఆశించే విధంగా ఉంటుంది. అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉంటాయి. ఫైట్స్ ఇంతకుముందెన్నడూ రాని విధంగా కొత్త కోణంలో ఉంటాయి'' అని చెప్పాడు హరీశ్.
పొల్లాచ్చి, మహాబలేశ్వర్, పంచ్‌గని, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ పరిసరాల్లో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 'జల్సా' వంటి సూపర్ మ్యూజికల్ హిట్ తర్వాత పవన్‌కల్యాణ్‌తో మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ పనిచేస్తున్న సినిమా ఇది. పవన్ సరసన శ్రుతిహాసన్ నాయిక.
కోట శ్రీనివాసరావు, అజయ్, అభిమన్యు సింగ్, తనికెళ్ళ భరణి, బ్రహ్మానందం, అలీ, మాస్టర్ సాయినాగన్, నాగినీడు, సత్యం రాజేష్, రావు రమేష్, మాస్టర్ ఆకాష్ తదితరులు తారాగణం. ఈ చిత్రానికి  స్క్రీన్‌ప్లే: రమేష్‌రెడ్డి, వేగేశ్న సతీష్, సినిమాటోగ్రఫీ: జయనన్ విన్సెంట్, సంగీతం: దేవిశ్రీప్రసాద్, కళ: బ్రహ్మ, కూర్పు: గౌతంరాజు, సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేష్, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: హరీష్ శంకర్. ఎస్.

Sunday, August 28, 2011

న్యూస్: రెండు హిట్లు, రెండు ఫ్లాపులు!

ఇప్పటివరకు నాలుగు సినిమాల్ని డైరెక్ట్ చేసిన సురేందర్‌రెడ్డి రెండు హిట్లు, రెండు ఫ్లాపులతో బ్యాలెన్స్‌గా ఉన్నాడు. తొలి సినిమా 'అతనొక్కడే', నాలుగో సినిమా 'కిక్'తో హిట్లు కొట్టిన అతను రెండు, మూడు సినిమాలైన 'అశోక్', 'అతిథి'లతో ఫ్లాపులు చవిచూశాడు. ఇప్పుడతను తన ఐదో సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. ఆ సినిమా 'ఊసరవెల్లి'. అఫిషియల్‌గా ఆ సినిమా టైటిల్‌ని ప్రకటించారు. ఇందులో ఎన్టీఆర్ హీరో. ఇదివరకు ఆ ఇద్దరూ కలిసి 'అశోక్' చేశారు. ఆ సినిమాతో పరాజయం పొందిన వాళ్లు 'ఊసరవెల్లి'తో ఆ చేదు అనుభవాన్ని మరచిపోవాలని ఆశిస్తున్నారు. విపరీతమైన వయొలెన్స్, ఏమాత్రం కొత్తదనం లేని కథ వల్లనే 'అశోక్' ఫ్లాపయ్యిందని సురేందర్‌రెడ్డి గ్రహించాడు. అందుకే 'ఊసరవెల్లి'ని 'కిక్' తరహాలోనే రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా మలుస్తున్నాడు. ఇందులో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్. ఎన్టీఆర్, తమన్నా మధ్య వచ్చే సీన్లు యూత్‌ని బాగా ఎట్రాక్ట్ చేస్తాయని ఆ సినిమా యూనిట్ సభ్యులు చెబుతున్నారు. సురేందర్‌కి పర్మనెంట్ రైటర్‌గా మారిన వక్కంతం వంశీ కథని అందించిన ఈ సినిమాకి 'బృందావనం' ఫేం కొరటాల శివ డైలాగ్స్ రాస్తున్నాడు. ఇదివరకు ఎన్టీఆర్ 'రాఖీ'కి సూపర్బ్ మ్యూజిక్‌నిచ్చిన దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి బాణీలనిస్తున్నాడు. 'ఛత్రపతి ప్రసాద్' నిర్మిస్తున్న ఈ సినిమా ద్వారా పేరుపొందిన మోడల్ విద్యుత్ జామ్వాల్, రాంగోపాల్‌వర్మ సినిమా 'కాంట్రాక్ట్' ఫేం ఆద్విక్ మహాజన్ టాలీవుడ్‌కి పరిచయమవుతున్నారు. మొత్తానికి 'ఊసరవెల్లి'తో కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ కొట్టాలనే సురేందర్‌రెడ్డి తపని ఏమేరకు ఫలిస్తుందో చూడాలి.

Sunday, August 21, 2011

న్యూస్: కీరవాణి పాటలు అలరించేదెప్పుడు?

తెలుగు చిత్రసీమలో సంగీతం తెలిసిన అతికొద్దిమంది సంగీత దర్శకుల్లో అగ్రగణ్యుడైన ఎం.ఎం. కీరవాణి 2010 సంవత్సరపు నది అవార్డు విజేతల్లో ఒకరు. చిత్రమేమంటే ఆయనకు నది అవార్డు వచ్చింది సంగీత దర్శకుడిగా కాదు, గాయకుడిగా! ఎస్.ఎస్. రాజమౌళి సినిమా 'మర్యాద రామన్న'లో పాడిన 'తెలుగమ్మాయీ' అనే పాటకి గాను ఆయనకు నంది అవార్డుల జ్యూరీ ఈ అవార్డును ప్రకటించింది. ఇక సంగీత దర్శకుడిగా 'సింహా' చిత్రానికి గాను చక్రి నంది అవార్డును సాధించాడు. మిగతా వాళ్లకు లాగా కాకుండా సెలక్టివ్‌గా సినిమాలు ఎంపిక చేసుకునే కీరవాణికి 2011లో చెప్పుకోదగ్గ సినిమా ఏదంటే 'బద్రినాథ్' మాత్రమే. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంతంత మాత్రంగానే ఆడటంతో అందులోని పాటలు పెద్దగా ప్రాచుర్యంలోకి రాలేకపోయాయి. ఓవైపు మణిశర్మ, దేవిశ్రీ ప్రసాద్, లేటెస్ట్‌గా తమన్ టాలీవుడ్‌ని ఏలుతుంటే, వాళ్లందరికంటే సీనియర్ మాత్రమే కాక, సంగీత పరిజ్ఞానం ఎక్కువగా ఉన్న కీరవాణి అతి తక్కువ సినిమాలు చేస్తూ తనదైన శైలిలో ముందుకు పోతున్నారు. అయితే రానున్న రోజుల్లో ఆయన సంగీతం కూర్చిన రెండు సినిమాల పాటలు జనం నోళ్లలో నానడం ఖాయమని సంగీతజ్ఞులు భావిస్తున్నారు. ఆ రెండింటిలో మొదటగా రాబోతున్న సినిమా 'రాజన్న'. నాగార్జున కథానాయకుడిగా వి. విజయేంద్రప్రసాద్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా సెప్టెంబర్‌లో విడుదల కాబోతోంది. అలాగే రాజమౌళి తాజా చిత్రం 'ఈగ'కి సహజంగానే ఆయన సంగీత దర్శకుడు. రాజమౌళి - కీరవాణి కాంబినేషన్‌లో వచ్చిన ప్రతి సినిమా మ్యూజికల్‌గా హిట్టే. అందువల్ల 'మగధీర' వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత కొంతకాలంగా వెనుకపట్టులో ఉన్నట్టనిపించిన కీరవాణి ఈ సినిమాలతో మళ్లీ తన సత్తా చూపిస్తాడని ఆయన అభిమానులు ఆశిస్తున్నారు.

Thursday, August 11, 2011

ఇంటర్వ్యూ: గేయ రచయిత అనంత శ్రీరాం

"అన్ని రకాల పాటల్లో నాకు శృంగారమంటే ఎక్కువ ఇష్టం. భక్తి పాటని ఎంతగా ఆస్వాదిస్తానో ఎరోటిక్ సాంగ్ రాసేప్పుడు అంతగా ఆస్వాదిస్తా'' అని చెప్పారు యువ గేయ రచయిత అనంత శ్రీరామ్. అతి చిన్న వయసులోనే పాటల రచయితగా చిత్రరంగ ప్రవేశం చేసిన ఆయన అతి తక్కువ కాలంలో అగ్రశ్రేణి గేయ రచయితల్లో ఒకరిగా ఎదిగారు. అన్ని రకాల పాటల్లోనూ ప్రతిభ చూపిస్తున్న ఆయన 'తెలుగమ్మాయి' కోసం రాసిన 'కత్తిలాంటి కుర్రవాడు కళ్లుతిరిగి పడ్డాడు' పాట శ్రోతల నాలుకల మీద నర్తిస్తోంది. చిత్రసీమలో తన ప్రస్థానంతో పాటు గేయ రచనా రంగం గురించి తన అభిప్రాయాల్ని నిర్మొహమాటంగా వ్యక్తం చేశారు అనంత శ్రీరామ్. అవేమిటో ఆయన మాటల్లోనే...

నా అనుభవం, అవగాహన మేరకు చిత్రసీమలో గౌరవం, ప్రోత్సాహం, తక్కువ వత్తిడి ఉన్నది గీత రచనా రంగంలోనే. పాట హిట్టయితే సాహిత్యాన్ని చూస్తున్నారు. తద్వారా రచయితకి పేరు వస్తోంది. పాట ఫ్లాపయితే పట్టించుకోరు కాబట్టి వచ్చే నష్టమేమీ ఉండదు. నెల నెలా ఎంతో కొంత ఆదాయం వస్తుంది. మామీద పుకార్లు ఉండవు. క్రేజ్ లేకపోయినా గౌరవం, ఆప్యాయత ఉంటుంది. సౌకర్యవంతమైన రంగం. మిగతా వాటితో పోలిస్తే పోటీ తక్కువ ఉన్న రంగం ఇదే.
ఈ రంగంలో నిరుద్యోగం లేదు
తెలుగు సినిమా రంగంలో ఏడాదికి కనీసం 200 సినిమాలు నిర్మాణమవుతున్నాయి. ఒక్కో సినిమాలో సగటున ఐదు పాటలుంటాయనుకుంటే ఆ అన్ని సినిమాల్లో కలిపి వెయ్యి పాటలుంటాయి. బాగా డిమాండ్ ఉన్న రచయిత నెలకి పది పాటలు, అంటే సంవత్సరానికి 120 పాటలు రాస్తాడు. అలాంటి వాళ్లు నలుగురు ఉన్నారనుకుంటే వాళ్లు రాసేది 480 పాటలు. ఇంకా 520 పాటలు రాసే అవకాశం మిగతా వాళ్లకి ఉంది. సంవత్సరానికి 20 చొప్పున వేసుకున్నా ఇంకో 25 మందికి ఇక్కడ అవకాశం ఉంది. నాకు తెలిసి ఈ రంగంలో నిరుద్యోగం అయితే ఉండదు. ఇక్కడ క్రేజ్‌ని బట్టి, హిట్టుని బట్టి రెమ్యూనరేషన్ ఉంటుంది. పాట రాయడం రాకుండా ఛాన్స్ ఇవ్వమంటే ఇవ్వరు కదా. సామాన్య ప్రజ్ఞాపాటవాలుంటే ఈ రంగంలో ఉపాధి దొరుకుతుంది.
ఊరికే కష్టపెట్టరు
దేవిశ్రీకి పాట నచ్చితే మొదటి వెర్షన్‌కే ఓకే చేసేస్తారు. తనకి కావాలనుకున్నది రాకపోతే 20వ వెర్షన్ అయినా రాయిస్తారు. రచయితని ఊరికే కష్టపెట్టరు. ఆ విషయం అర్థం చేసుకోలేకపోతేనే రచయితకి ఇబ్బంది వస్తుంది తప్పితే కావాలని చెయ్యరు. రాజమౌళి 'యమదొంగ'లో 'నూనూగు మీసాలోడు' పాటని వెంటనే ఓకే చేశారు. అదే 'మర్యాద రామన్న' విషయానికొస్తే 'తెలుగమ్మాయీ..' పాటని ఓకే చెయడానికి 40 రోజులు పట్టింది.
ఓటమిగా భావించేవాణ్ణి
'100% లవ్' సినిమాలో రెండు సన్నివేశాలకి కష్టపడి రాసినా ఓకే అవ్వలేదు. కానీ కష్టపడినందుకు గీతా ఆర్ట్స్ నుంచి డబ్బులు వచ్చేశాయి. ఇట్లాంటివి కెరీర్ మొదట్లో జరిగినప్పుడు బాధపడేవాణ్ణి. దాన్ని ఓటమిగా భావించేవాణ్ణి. అప్పుడు అంత అనుభవం ఉండకపోవడం, మనసు సున్నితంగా ఉండటం కారణం. ఎప్పుడైనా ఏదైనా పాట ఓకే చెయ్యకపోయినా, ఆ తర్వాత అదే దర్శకుడు, అదే సంగీత దర్శకుడు తర్వాత నా చేత రాయించుకున్న సందర్భాలున్నాయి. అందువల్ల ఇప్పుడు ఇలాంటివాటికి మనస్తాపం చెందడం లేదు.
కీరవాణితో ఎక్కువ సౌకర్యం
సంగీత దర్శకుల్లో కీరవాణి గారితో ఎక్కువ సౌకర్యంగా ఫీలవుతా. రచయితకి ఆయన బాగా స్వేచ్ఛనిస్తారు. నాచేత ముందు పాట రాయించి, ఆ తర్వాత ఆయన బాణీలు కట్టిన సందర్భాలు చాలానే ఉన్నాయి. 'యమదొంగ'లో 'రబ్బరు గాజులు..' పాటని నేను రాస్తే, దానికి ఆయన ట్యూన్ కట్టారు. నాకైతే మొదట పాట రాయడమే హాయనిపిస్తుంది. ట్యూన్‌కి పాట రాయడంలోనే కొంచెం వత్తిడి అనిపిస్తుంది. అన్ని రకాల పాటల్లో నాకు శృంగారమంటే ఎక్కువ ఇష్టం. భక్తి పాటని ఎంతగా ఆస్వాదిస్తానో ఎరోటిక్ సాంగ్ రాసేప్పుడు అంతగా ఆస్వాదిస్తా. నా తొలి చిత్రం 'కాదంటే ఔననిలే'లో 'కర్రా బిళ్లా..' పాట నచ్చి చిరంజీవి గారు 'స్టాలిన్' కోసం 'పరారే పరారే..' పాట రాయించుకున్నారు.
ఆయన ఆరాధ్య రచయిత
ఎప్పటికీ నా ఆరాధ్య రచయిత సీతారామశాస్త్రి గారే. నన్ను పాటలు రాయడానికి ఉసిగొల్పింది ఆయన సాహిత్యమే. 'సిరివెన్నెల', 'స్వాతికిరణం', 'స్వర్ణ కమలం' పాటలు నన్ను బాగా ప్రభావితం చేశాయి.
అది పేరు తెస్తుంది
ఈ సంవత్సరం 'మిస్టర్ పర్‌ఫెక్ట్' మంచి హిట్టయింది. రానున్న 'తెలుగమ్మాయి'లో 'కత్తిలాంటి కుర్రవాడు కళ్లుతిరిగి పడ్డాడు' పాట పేరు తెస్తుందని అనుకుంటున్నా. నాగచైతన్య చిత్రం 'దడ' రిలీజవుతోంది. నాగార్జునగారి సినిమా 'రాజన్న', రాజమౌళి సినిమా 'ఈగ', ఎన్టీఆర్ - సురేందర్‌రెడ్డి సినిమా 'ఊసరవెల్లి', వెంకటేశ్ - గోపీచంద్ మలినేని సినిమా, శేఖర్ కమ్ముల సినిమా 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్', దేవా కట్టా చిత్రం 'ఆటోనగర్ సూర్య'కి పాటలు రాస్తున్నా.

Friday, July 29, 2011

న్యూస్: కమలాకర్ 'సంచలనం' సృష్టిసాడా?

మాజీ ఎమ్మెల్యే (దర్శి) బూచేపల్లి సుబ్బారెడ్డి కుమారుడైన కమలాకర్‌రెడ్డి సినిమా రంగంలో ఎలాగైనా తన ముద్ర వేయాలనే పట్టుదలతో అవిశ్రాంత పోరాటం చేస్తున్నాడు. ఏడేళ్ల క్రితమే 'అభి' అనే సినిమాతో హీరోగా తెరగేంట్రం చేసిన అతను ప్రేక్షకాదరణ పొందలేక పోయాడు. నిజానికి 'అభి' బాక్సాఫీసుని గెలవక పోయినా మ్యూజికల్‌గా మంచి పేరు తెచ్చుకుంది. కారణం దానికి బాణీలు కూర్చింది దేవిశ్రీ ప్రసాద్!. అందులోని 'వంగతోట మలుపుకాడ..' పాట ఇప్పటికీ ఎక్కడో చోట వినిపిస్తూనే ఉంది. దాని తర్వాత కమలాకర్ 'సన్నీ', 'హాసిని' వంటి సినిమాలు చేశాడు. 'హాసిని'లో 'ప్రేమిస్తే' సంధ్య హీరోయిన్. అది కూడా బాక్సాఫీసుని గెలవలేకపోయింది. అయినా కానా ఈ సినిమా డైరెక్టర్ బి.వి. రమణారెడ్డి మీద పూర్తి నమ్మకం ఉంచిన కమలాకర్ ఇప్పుడు అతని డైరెక్షన్‌లోనే 'సంచలనం' చిత్రాన్ని నిర్మించాడు. కమలాకర్, సాయికుమార్, ఆశిశ్ విద్యార్థి ప్రధాన పాత్రధారులు. రెగ్యులర్ సాంగ్ అండ్ ఫైట్, రొమాన్స్‌లకు భిన్నంగా కాన్సెప్ట్ ఓరిఎంటెడ్ సినిమాగా దీన్ని రమణారెడ్డి రూపొందించాడు. ఓ అమాయక యువకుణ్ణి కొంతమంది ఎందుకు టార్గెట్ చేశారు, తనకెదురైన ప్రమాదం నుంచి అతను ఎలా తప్పించుకునాడనేది ఇందులోని ప్రధానాంశం. "ఇది యధార్థ సంఘటన ప్రేరణతో అల్లిన కల్పిత కథతో తయారైన సినిమా. ఎవర్నీ ఉద్దేసించి ఈ సినిమా తీయలేదు. ఎవరినైనా ఉద్దేశించినట్లు అనిపిస్తే అది కేవలం కాకతాళీయమే కానీ ఉద్దేశ పూర్వకంగా చేసింది కాదని గ్రహించాల్సిందిగా కోరుతున్నా" అని కమలాకర్ చెప్పడాన్ని బట్టి ఇందులో పోలీస్ వ్యవస్థ మీదా, రాజకీయ వ్యవస్థ మీదా వివాదాస్పద అంశాలు ఇమిడి ఉన్నాయని అర్థమవుతోంది. అయితే 'సంచలనం' టైటిల్‌కి తగ్గట్లు బాక్సాఫీసు వద్ద అది చేసే సందడి పైనే అది సృష్టించే వివాద తీవ్రత కూడా ఆధారపడి ఉంటుంది. ఇప్పటి వరకూ ప్రేక్షకాదరణ పొందలేక పోయిన కమలాకర్ నిజంగా 'సంచలనం' సృష్టిస్తాడా? ఈ రోజే ఈ సినిమా విడుదలైంది. ఇనిషియల్ టాక్ బావుంది. అది కలెక్షన్ల రూపంలో మారడమే కావలసింది.

Tuesday, July 5, 2011

న్యూస్: 'దడ'తో నాగచైతన్య మాస్ హీరో అవుతాడా?

తొలి సినిమా 'జోష్' ఫ్లాపయ్యాక నాగచైతన్య చేసిన రెండు సినిమాలు హిట్టయ్యాయి. ఆ రెండు సినిమాలు.. 'ఏ మాయ చేసావె', '100% లవ్'. వీటితో అతను లవర్ బాయ్ ఇమేజ్ తెచ్చుకున్నాడు. ఇక ఇప్పుడు యాక్షన్ సినిమా చేయడం మాస్ హీరో ఇమేజ్ తెచ్చుకోవాలనే యత్నంలో 'దడ' సినిమా చేస్తున్నాడు. నాగార్జునతో వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్న ఆయన అభిమాని డి. శివప్రసాద్‌రెడ్డి ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
దీని ద్వారా అజయ్ భుయాన్ డైరెక్టర్‌గా పరిచయమవుతున్నాడు. అజయ్ సాదాసీదా మనిషి కాడు. సినిమా మీద బాగా అధ్యయనం చేసిన యువకుడు. హై క్వాలిఫైడ్ పర్సన్. ఐఐటిలో డిగ్రీ, ఐఐఎం నుంచి ఎంబీఏ చేసిన అతను న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీ నుంచి డిఎఫ్‌టి పట్టా తీసుకున్నాడు. నిజానికి 'దడ' అతని తొలి సినిమా కాదు. ఇదివరకే 'హౌస్‌ఫుల్' అనే సినిమాని డైరెక్ట్ చేశాడు. దీన్ని నిర్మించింది మరో డైరెక్టర్ అయిన చంద్రసిద్ధార్థ్. అయితే ఆర్థిక పరమైన కారణాలతో మూడేళ్ల క్రితమే తయారైన ఆ సినిమా ఇంతవరకు వెలుగు చూడలేదు.
ఏడాది క్రితం అతను చెప్పిన కథ నచ్చడంతో మాస్ హీరోగా జనం ముందుకు రావడానికి ఆ కథే సరైనదని నాగచైతన్యకు అనిపించింది. అలా 'దడ' మొదలైంది. ఇందులో అమెరికాలో నివసించే తెలుగు యువకుడిగా నాగచైతన్య కనిపించబోతున్నాడు. అంటే అమెరికా నేపథ్యంలోనే ఈ కథ నడుస్తుంది. అతనికి జోడీగా అందాల తార కాజల్ అగర్వాల్ నటిస్తోంది. ఇంకో ఆసక్తికరమైన సంగతేమంటే నాగచైతన్య అన్నగా హీరో శ్రీరాం నటించడం. ఈ సినిమాలో ఆరు పాటలు, ఆరు ఫైట్లు ఉన్నాయి. పాటలకి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఇస్తుంటే, ఫైట్లని బ్యాంకాక్‌కు చెందిన ప్రడిట్ సీలుయెం కంపోజ్ చేశాడు. ఈ నెల 20 లేదా 21న ఆడియో రిలీజ్ అవుతుండగా ఆగస్ట్ 11న ఆర్.ఆర్. ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా సినిమా విడుదలవనున్నది. మరి 'దడ'తో నాగచైతన్య మాస్ హీరో అనిపించుకుంటాడో, లేదో చూడాలి.