Showing posts with label devadasu. Show all posts
Showing posts with label devadasu. Show all posts

Saturday, June 16, 2012

'ఎందుకంటే ప్రేమంట'ను ప్రేక్షకులు అర్థం చేసుకుంటున్నారు

రామ్, తమన్నా జంటగా తను రూపొందించిన 'ఎందుకంటే ప్రేమంట!'లోని కొత్తదనాన్ని ప్రేక్షకులు అర్థం చేసుకుంటున్నారనీ, సినిమాకి వస్తున్న బ్రహ్మాండమైన స్పందనే దీనికి నిదర్శనమనీ దర్శకుడు ఎ. కరుణాకరన్ చెప్పారు. శ్రీ స్రవంతీ మూవీస్ పతాకంపై రవికిశోర్ నిర్మించిన ఈ సినిమా ఇటీవల విడుదలై ప్రేక్షకాదరణ పొందుతోంది. ఈ సందర్భంగా కరుణాకరన్ మాట్లాడుతూ "చచ్చిన తర్వాతనే ఆత్మ ఉంటుందని అనుకుంటున్నారే తప్ప అసలు నిజమేంటో ఎవరికీ తెలీదు. నేను కోమాలో ఉన్న అమ్మాయి ఆత్మ హీరో సాయంతో తనని బతికించుకోవడం చూపించాను. ఇది అద్భుతమైన ప్రేమకథ. ఈ సినిమాని మెదడుతో చూడొద్దు, ఆత్మతో చూడండి. అందరూ చాలా చక్కని ఎమోషనల్ లవ్‌స్టోరీగా ప్రశంసిస్తున్నారు. ఇప్పటివరకూ ఏ సినిమాలోనూ చేయని రీతిలో ఎంతో ఎనర్జిటిక్‌గా డాన్సులు చేశాడు రామ్'' అని చెప్పారు. నిర్మాత స్రవంతి రవికిశోర్ మాట్లాడుతూ "ఎ, బి సెంటర్లలో సినిమా బాగా ఆడుతోంది. ఓ మంచి సినిమా చూద్దామనుకునే వాళ్లకి సంతృప్తినిస్తోంది. ఏ సినిమాకీ వెంటనే బాగుందని జనం చెప్పలేదు. 'గీతాంజలి', 'దేవదాసు' వంటి సినిమాలు కూడా చాలా రోజుల తర్వాతనే హిట్ టాక్ తెచ్చుకున్నాయి. ప్రస్తుతానికి కలెక్షన్లు ప్రోత్సాహకరంగా ఉన్నాయి. ఇది నవ్యతను కోరుకునేవాళ్ల కోసం తీసిన సినిమా. చూసినవాళ్లంతా ఫ్రెష్‌గా ఫీలవుతున్నారు. రామ్, తమన్నా జంట ముచ్చటగా ఉందని చెబుతున్నారు. చివరలో రామ్ ఎమోషనల్‌గా చెప్పే డైలాగ్స్‌కి చప్పట్లు కొడుతున్నారు. దర్శకుడు కరుణాకరన్ బాగా తీశాడు. కొన్ని రోజులైనా గుర్తుండిపోయే సినిమా. ఇది ఎంత వసూలు చేస్తుందనేది తెలియడానికి కొంత టైమ్ పడుతుంది'' అన్నారు.

Tuesday, September 20, 2011

వార్తల్లో వ్యక్తి: అక్కినేని నాగేశ్వరరావు

అభినయ వాల్మీకి
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సాంఘిక చిత్రాల కథానాయకుడిగా అత్యున్నత స్థాయిని అందుకున్న మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు అనేది జగద్విదితం. పౌరాణిక చిత్రాల కథానాయకుడిగా ఎన్టీ రామారావు అద్భుతంగా రాణిస్తుండటంతో తనంతట తానుగా వాటినుంచి తప్పుకుని సాంఘిక చిత్రాలతోనే అజరామర కీర్తిని సొంతం చేసుకున్నారు అక్కినేని. తొలినాళ్లలో జానపద హీరోగా రాణించినా 'లైలా మజ్ను', 'దేవదాసు' వంటి విషాదాంత ప్రేమకథలతో ప్రేక్షకుల చేత శెభాష్ అనిపించుకుని, ప్రేమకథాచిత్రాల నాయకుడిగా ప్రేక్షకుల్లో తిరుగులేని ఇమేజ్ పొందారు.
మలిదశలో ఆయన చేసిన మరో రెండు విషాదాంత ప్రేమకథాచిత్రాలు 'ప్రేమాభిషేకం', 'మేఘసందేశం' ఈ సంగతినే రుజువు చేశాయి. అయితే వీటిలో ఆయన పాత్రలు ఒకదానికొకటి పూర్తి భిన్నమైనవి కావడం గమనించదగ్గ అంశం. సాంఘిక చిత్రాల్లో ఆయన పోషించినన్ని వైవిధ్యమైన పాత్రలు మరో తెలుగు హీరో పోషించలేదనడం నిస్సందేహం. అక్కినేని చేసిన పౌరాణిక చిత్రాలు పదికి మించవు. చేసిన ప్రతి పౌరాణిక పాత్రలోనూ రాణించినా, ఆ తరహా చిత్రాలు ఆయన ఎక్కువ చేయకపోవడం తెలుగు సినిమాకి ఓ లోటుగానే భావించాలి. ప్రస్తుతం ఆయన బాపు రూపొందిస్తున్న 'శ్రీరామరాజ్యం' చిత్రంలో రామాయణ గాథని రచించిన వాల్మీకి పాత్రని పోషిస్తున్నారు. అడవుల పాలైన సీతకు ఆశ్రయమిచ్చి, అక్కడ ఆమె జన్మనిచ్చిన కవల పిల్లలు లవకుశులకు విద్యాబుద్ధులు, విలువిద్య నేర్పిన గురువు వాల్మీకిగా ఆయన నటన ఎలా ఉంటుందో చూడాలని ఆయన అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకులు కూడా ఎదురుచూస్తున్నారు. ఇక్కడ గమనించదగ్గ విశేషమేమంటే కథానాయకుడిగా అక్కినేని తొలి పాత్ర శ్రీరాముడు కావడం. ఆ సినిమా 1944లో వచ్చిన 'సీతారామ జననం'. ఘంటసాల బలరామయ్య రూపొందించిన ఈ చిత్రంలో శ్రీరామునిగా నాగేశ్వరరావు ఎలా నటిస్తాడోనని ఆయన్ని ఎరిగినవారంతా కొంత ఆసక్తిగా, కొంత అపనమ్మకంగా ఎదురుచూశారు. ఎందుకంటే అప్పటివరకు రంగస్థలంపై ఆడ పాత్రలే చేస్తూ వచ్చిన ఆయన ఎకాఎకి శ్రీరామ పాత్ర చేయడమంటే మాటలు కాదు కదా (అంతకుముందు 1941లో ఆయన 'ధర్మపత్ని'లో ఓ చిన్న పాత్ర చేశారు). కానీ ఆ పాత్రలో ఆయన అందరి అంచనాల్ని మించి రాణించారు.
ఆ తర్వాత కాలంలో ఆయన 'మాయాబజార్'లో అభిమన్యుడిగా, 'భూకైలాస్'లో నారదునిగా, 'చెంచులక్ష్మి'లో విష్ణుమూర్తిగా, 'శ్రీ కృష్ణార్జున యుద్ధం'లో అర్జునునిగా నటించి, మెప్పించారు. 'జయభేరి'లో 'రావోయి రాస విహారీ' పాటలో శ్రీకృష్ణుని వేషంలోనూ బాగున్నారనిపించుకున్నారు. నాగయ్య చిత్రం 'భక్త రామదాసు'లో మరోసారి విష్ణుమూర్తిగా అతిథి పాత్రలో కనిపించారు. వీటితో పాటు 'సతీ సావిత్రి'లో సత్యవంతుడిగానూ అక్కినేని మెప్పించారు. ఇలా చేసిన ప్రతి పౌరాణిక పాత్రలోనూ రాణించిన అక్కినేని మరిన్ని పౌరాణిక చిత్రాలు చేసినట్లయితే తెలుగు సినిమాకి మేలు చేకూరి ఉండేది. ఆ మేరకు ఆయన సేవల్ని పౌరాణిక సినిమా కోల్పోయిందనే చెప్పాలి. ఇప్పుడు 87 సంవత్సరాల వయసులో ఆయన 'శ్రీరామరాజ్యం'లో వాల్మీకిగా నటిస్తుండటం ముదావహం.
ఈ పాత్రలో ఆయన అద్భుతంగా రాణిస్తారనడంలో ఏమాత్రం సందేహించాల్సిన పనిలేదు. బాపు రూపకల్పనలో శ్రీరామునిగా బాలకృష్ణ నటిస్తున్న ఈ చిత్రాన్ని యలమంచిలి సాయిబాబు నిర్మిస్తున్నారు. అక్టోబర్‌లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్నందువల్ల త్వరలోనే అభినవ వాల్మీకిని మనం తిలకించవచ్చు.
(సెప్టెంబర్ 20 అక్కినేని నాగేశ్వరరావు 88 ఏట అడుగు పెడుతున్న సందర్భంగా)

Wednesday, September 14, 2011

న్యూస్: 'మొగుడు' మీద ఆశలెన్నో!

కె. రాఘవేంద్రరావు డైరెక్ట్ చేసిన 'ఝుమ్మంది నాదం' రిలీజయినప్పుడు తాప్సీ రూపంలో టాలీవుడ్‌కి మరో ఇలియానా పరిచయమయ్యిందనే టాక్ వచ్చింది. 'దేవదాసు', 'పోకిరి' సినిమాలతో ఇలియానా హాటెస్ట్ హీరోయిన్ అయిన విధంగానే తాప్సీ కూడా అమిత క్రేజ్ సంపాదించుకుంటుందని అనుకున్నారు. చిత్రంగా నాలుగు సినిమాలు రిలీజైనా ఆమెకి తెలుగులో అనుకున్నంత క్రేజ్ రాలేదు. 'పోకిరి' తరహా హిట్ ఆమెకి రాకపోవడమే దీనికి కారణమని చెప్పాలి. అందచందాల విషయంలో ఏమాత్రం వంకపెట్టలేని రీతిలో ఉండే ఈ పంజాబీ ముద్దుగుమ్మ 'ఝుమ్మంది నాదం' తర్వాత 'వస్తాడు నా రాజు', 'మిస్టర్ పర్ఫెక్ట్', 'వీర' సినిమాల్లో చేసింది. వీటిలో 'మిస్టర్ పర్ఫెక్ట్' ఒక్కటే హిట్టు. అందులోనూ ఆమె చేసింది సెకండ్ హీరోయిన్ కేరక్టరే. ఫలితంగా అనుకున్నంతగా ఆమె కెరీర్ ఊపందుకోలేదు. టాప్ హీరోల సరసన ఆఫర్లు రావడం లేదు. ప్రస్తుతం ఆమె తెలుగులో ఒకే సినిమా చేస్తోంది. ఆ సినిమా 'మొగుడు'. కృష్ణవంశీ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో ఆమె గోపీచంద్ సరసన నటిస్తోంది. నల్లమలుపు బుజ్జి నిర్మిస్తున్న ఈ సినిమాపై తాప్సీ ఎన్నో ఆశలు పెట్టుకుంది. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో గోపీచంద్, తాప్సీ మధ్య రొమాంటిక్ సీన్లు ఆడియెన్స్ మతులు పోగొడతాయని ఆ సినిమా యూనిట్ మెంబర్స్ అంటున్నారు. రొమాంటిక్ సీన్లు తీయడంలో కృష్ణవంశీది అందె వేసిన చెయ్యి కావడంతో తాప్సీ అందాలు ఈ సినిమాలో కనువిందు చేస్తాయని ఊహించవచ్చు. బాలీవుడ్‌లో 'చష్మే బద్దూర్' అనే సినిమాని సిద్ధార్థ్‌తో చేయబోతున్న తాప్సీకి 'మొగుడు' ఎలాంటి కానుకనిస్తాడో చూడాల్సిందే.

Friday, August 5, 2011

న్యూస్: అక్కినేనిగారూ ఇది సభ్యతేనా?

అక్కినేని నాగేశ్వరరావు దేశం గర్వించే మహానటుడు. 'దేవదాసు' పాత్రని ఆయన పోషించినట్లుగా ఇంకెవ్వరూ పోషించలేదనే కీర్తి పొందినవారు. ఆరున్నర దశాబ్దాలుగా అలుపన్నది లేకుండా ఇంకా నటిస్తూనే ఉన్నారు. చివరి శ్వాస వరకూ నటిస్తూనే ఉంటానని తన అంకిత భావాన్ని ప్రదర్శించే అసలు సిసలు కళాకారుడు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న బాపు 'శ్రీరామరాజ్యం'లో వాల్మీకిగా నటిస్తున్నారు. అలాంటి ఆయన అదుపుతప్పి, అసభ్యకర రీతిలో మాట్లాడటమేమిటా అని అందరూ ఆశ్చర్యచకితులవుతున్నారు. మీడియా అంతా పాల్గొన్న ఓ ఆడియో వేడుకలో, టెలివిజన్‌లో ప్రత్యక్షప్రసారమవుతున్న ఆ కార్యక్రమంలో ఆయన ఆడవారి వక్షస్థలం గురించి కొద్దిసేపు అలాగే మాట్లాడటం అందర్నీ బిత్తరపోయేలా చేసింది. కొంతమంది ఆయన మాటల్ని ఎంజాయ్ చేసినా ఎక్కువమంది అంత పెద్దవారు, అందరూ గౌరవించే స్థాయిలో ఉన్నవారు అలా మాట్లాడవచ్చునా? అని పెదవి విరిచారు. గురువారం (ఆగస్ట్ 4) రాత్రి ప్రసాద్ ల్యాబ్ ప్రివ్యూ థియేటర్‌లో జరిగిన 'దగ్గరగా.. దూరంగా...' ఆడియో వేడుకలో ఈ సందర్భం చోటు చేసుకుంది. ఇందులో అందరికంటే చివరగా సుదీర్ఘంగా మాట్లాడిన ఆయన మధ్యలో అకస్మాత్తుగా 'అమాయకురాలు' సినిమా సంగతి ప్రస్తావిస్తూ అందులో నాయిక కాంచనని తను హత్తుకునే సన్నివేశం గురించి చెప్పుకొచ్చారు. "ఆ సమయంలో నిర్మాత మధుసూదనరావు గారు లేరు. నేను, కాంచన ఒకరినొకరం తన్మయత్వంతో గట్టిగా హత్తుకోవాలి. ఆ సీనులో ఆమె 'బ్రెస్ట్స్' కదిలాయి. ఈ సంగతి నాకెలా తెలుస్తుంది? రషెస్ చూసిన మధుసూదనరావు గారు నన్ను పిలిచారు. 'నీకు బుద్ధుందా? అంత గట్టిగా వత్తుకోవాలా? ఆ బ్రెస్ట్స్ చూడు ఎలా కదిలాయో. చూసుకోవద్దా?' అనరిచారు. అప్పట్లో అసభ్యతకు తావు లేకుండా అంత జాగ్రత్త తీసుకునేవారు. ఇప్పుడు అలాంటివేమీ లేవు. అయినా ఇప్పుటి హీరోయిన్లవి కదులుతున్నా అవి నిజమైనవో, కాదో.. ఇప్పుడు కృత్రిమమైనవేవో తొడుక్కుంటున్నారుగా" అని చెప్పుకొచ్చారు. ఆయన ఈ మాటలు చెప్పేప్పుడు ఆయన పక్కనే ఆ సినిమా హీరోయిన్ వేదిక ఉంది. వేడుకకి వచ్చిన వాళ్లలో ఆడవాళ్లు ఉన్నారు. ఆయన ఇలా సినిమాల్లో అసభ్యత గురించి మాట్లాడుతూ, తనే అసభ్యంగా మాట్లాడటం వాళ్లని తలలు దించుకునేలా చేసింది. "ఆడవాళ్ల వక్షస్థలం గురించి అది మాట్లాడే సందర్భమేనా? ముసలాయనకి ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలీకుండా పోతోంది" అనే కామెంట్లు వినిపించాయి.

Tuesday, July 26, 2011

న్యూస్: తాప్సీ ఆ సినిమా చేస్తుందా?

ఇలియానా తరహాలోనే సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని చాలామంది భావించిన పంజాబీ బ్యూటీ తాప్సీ పన్ను నాలుగు సినిమాల తర్వాత కూడా అలాంటి క్రేజ్‌ని సృష్టించలేక పోయింది. తొలి సినిమా 'ఝుమ్మంది నాదం'లో ఆమెని రాఘవేంద్రరావు చూపించిన తీరు చూసి మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్ ఇన్ టాలీవుడ్ అంటూ తీర్మానించేసింది చిత్రసీమ. అయితే 'మిస్టర్ పర్ఫెక్ట్' మినహా ఆమె ఖాతాలో ఇంతదాకా మరో హిట్టు లేదు. ఆ సినిమాలోనూ ఆమెది సెకండ్ హీరోయిన్ రోలే. 'ఝుమ్మంది నాదం'తో పాటు 'వస్తాడు నా రాజు', 'వీర' ఫ్లాపయ్యాయి. ఇలియానా మాదిరిగా తొలి రెండు సినిమాలు 'దేవదాసు', 'పోకిరి' వంటివి తాప్సీకి తగిలుంటే ఆమె కూడా ఈపాటికే యువతరం కలల రాణిగా ఆవిర్భవించి ఉండేదని విశ్లేషకుల అభిప్రాయం. ప్రస్తుతం కృష్ణవంశీ డైరెక్ట్ చేస్తున్న 'మొగుడు'లో గోపీచంద్ సరసన నటిస్తున్న ఆమె తాజాగా సునీల్ సరసన నటించేందుకు అంగీకరించి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. మాధవన్, కంగనా రనౌత్ జంటగా బాలీవుడ్‌లో వచ్చి సూపర్‌హిట్టయిన 'తను వెడ్స్ మను'కి ఇది రీమేక్. మెగా సూపర్‌గుడ్ ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవీప్రసాద్ డైరెక్టర్. అయితే ఈ సినిమాలో తాప్సీ నటించడం లేదనే ప్రచారం కూడా జరుగుతోంది. కమెడియన్ అయిన సునీల్ సరసన నటిస్తే టాప్ హీరోల సినిమాల్లో అవకాశాలు రావని, ఇందుకు 'మర్యాద రామన్న'లో నటించిన సలోని మంచి ఉదాహరణంటూ ఆమె హితులు హెచ్చరించారనీ, అందుకే ఆమె ఆ సినిమా చెయ్యట్లేదనీ వినిపిస్తోంది. తాప్సీ నుంచి మాత్రం అధికారికంగా ఎలాంటి ప్రకటనా రాలేదు. నిజానికి తాప్సీ కంటే ముందు ఇద్దరు ముగ్గురు నేటి క్రేజీ హీరోయిన్లని నిర్మాతలు సంప్రదించారు కానీ వారు సునీల్‌తో చేయడానికి విముఖత చూపించారు. ఈ పరిస్థితుల్లో సునీల్ జోడీ తాప్సీనా లేక మరొకరు ఆ స్థానంలోకి వస్తారా?

Saturday, July 16, 2011

న్యూస్: ఇలియానా అంతేనా?

జూనియర్ సిమ్రాన్‌గా పేరు తెచ్చుకుని అచిర కాలంలోనే టాప్ రేంజికి ఎదిగి, టాలీవుడ్‌లో కోటి రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్న తొలి తారగా కాంతులీనిన గోవా సుందరి ఇలియానాకు ఇప్పుడు చేతిలో ఒక్క తెలుగు సినిమా కూడా లేకపోవడం వింతే! ముఖారవిందం కంటే అందమైన నడుముతోటే యువతరాన్ని పడగొట్టేసిన ఆమె తొలి రెండు సినిమాలు 'దేవదాసు', 'పోకిరి' ఒకదాన్ని మించి మరోటి హిట్టవడంతో రాత్రికి రాత్రే క్రేజీ హీరోయిన్ అయిపోయింది. బెల్లంకొండ సురేశ్ నిర్మించిన 'భలే దొంగలు' సినిమాతో కోటి రూపాయలు తీసుకున్న తొలి టాలీవుడ్ హీరోయిన్‌గా ఆమె సంచలనం సృష్టించింది. అయితే 'కిక్' హిట్ తర్వాత ఆమె సినిమాలేవీ బాక్సాఫీసు వద్ద ఆడకపోవడం, రెమ్యూనరేషన్ విషయంలో కిందికి దిగక పోవడం వంటి కారణాలతో నిర్మాతలు ఆమెకంటే ఇతర తారల వైపు మొగ్గు చూపడం మొదలుపెట్టారు. 'రెచ్చిపో', 'సలీం', 'శక్తి' సినిమాలు ఒకదాన్ని మించి మరోటి అట్టర్‌ఫ్లాప్ కావడం, రానా సరసన చేసిన 'నేను నా రాక్షసి' మంచి పేరు తెచ్చినా, బాక్సాఫీసు వద్ద ఫ్లాపవడంతో నిన్నటి దాకా ఆమెని గోల్డెన్ లెగ్ అన్నవాళ్లే ఇవాళ ఐరన్ లెగ్ అనడం ప్రారంభించారు. ఫలితంగా కాజల్ అగర్వాల్ టాప్ హీరోయిన్ రేంజికి ఎదిగిపోయింది. మరోవైపు తమన్నా, తాప్సీ, సమంతా వంటి తారలకు గిరాకీ పెరిగింది. ప్రస్తుతం సౌతిండియా టాప్ డైరెక్టర్ శంకర్ తీస్తున్న తమిళ 'నంబన్' సినిమా మీదే ఆమె ఆశలన్నీ పెట్టుకుంది. ఇది బాలీవుడ్‌లో సూపర్‌హిట్టయిన '3 ఇడియట్స్'కి రీమేక్. ఇందులో ఆమె విజయ్‌కి జోడీగా నటిస్తోంది. ఈ సినిమా ఆడితే మొదట తమిళంలోనూ, తర్వాత తెలుగులోనూ తనకి మళ్లీ మంచి అవకాశాలొస్తాయనేది ఆమె నమ్మకం. మరోవైపు 'బర్ఫీ'తో బాలీవుడ్‌లోనూ అడుగు పెడుతున్న ఆమె, దానితో అక్కడా తనకి గుర్తింపు లభిస్తుందనే ఆశ పెట్టుకుంది. చూద్దాం ఏం జరుగుతుందో..

Sunday, December 13, 2009

Vedantam Raghavaiah (Director)


Raghavaiah was born in 1919 in Krishna District. He trained in Kuchipudi dance form. He directed nearly 35 films.
Filmography:
as a choreographer:
1. Raitu Bidda
2. Vende Mataram
3. Swargaseema
4. Raksha Rekha
5. Laila Majnu
as an actor:
1. Garuda Garvabhangam (1943)
2. Raksha Rekha
as a director:
1. Stree Sahasam
2. Devadasu
3. Anarkali
4. Chiranjeevulu
5. Suvarna Sundari
6. Mamaku Tagga Alludu
7. Bhale Ramudu
8. Intiguttu