Showing posts with label allu arjun. Show all posts
Showing posts with label allu arjun. Show all posts

Wednesday, November 4, 2015

Unusual Movie Targets Mass

మాస్ హిట్ కోసమే బన్నీ-బోయపాటి కాంబినేషన్?

'స్తైలిష్ స్టార్'గా పేరుపడ్డ అల్లు అర్జున్, పక్కా నాటు మాస్ మసాలా సినిమాలు తీసే బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో సినిమా చేస్తుండటం చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఎందుకంటే బోయపాటి వర్కింగ్ స్టయిల్‌కు బాలకృష్ణలాంటి మాస్ హీరోలైతేనే కరెక్ట్ అనేది సినీ వర్గాల అభిప్రాయం. అందుకే అర్జున్-బోయపాటి సినిమాని 'అన్‌యూజ్వల్ మూవీ'గా పేర్కొంటున్నారు. అయితే 'లెజెండ్' వంటి హిట్ సినిమా తర్వాత బోయపాటి తీస్తున్న సినిమా కావడంతో సహజంగానే దీనిపై ఆసక్తీ, అంచనాలూ వ్యక్తమవుతున్నాయి. మరోవైపు 'రేసుగుర్రం' వంటి కెరీర్ టాప్ ఫిల్మ్ తర్వాత చేసిన 'సన్నాఫ్ సత్యమూర్తి' చిత్రం మాస్‌లో కంటే క్లాస్‌లోనే పేరు తెచ్చుకొని, బయ్యర్లకు లాభాల్ని అందించడంలో విఫలమవడంతో మాంచి మాస్ హిట్ కోసమే బోయపాటితో బన్నీ జతకట్టాడని ఇన్‌సైడర్స్ అంటున్నారు. కాకపోతే బన్నీ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకొని మాస్‌తో పాటు క్లాస్‌నీ ఆకట్టుకునేలా మలిచేందుకు  బోయపాటి కృషి చేస్తున్నట్లు యూనిట్ వర్గాల సమాచారం. గీతా ఆర్ట్స్ బేనర్‌పై అల్లు అరవింద్ నిర్మిస్తున్న ఈ సినిమాకు 'సరైనోడు' అనే టైటిల్ వినిపిస్తోంది. మెగా క్యాంప్ ప్రమోట్ చేస్తున్న హీరోయిన్లలో ఒకరైన రకుల్‌ప్రీత్ సింగ్ ఇందులో బన్నీకి జోడీగా చేస్తోంది. వచ్చే సంక్రాంతికి ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ అన్‌యూజ్వల్ మూవీ ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.

Thursday, October 8, 2015

Tuesday, April 14, 2015

Thursday, December 15, 2011

గుణశేఖర్‌కి 'నిప్పు' పరీక్ష!

లాఠీ, సొగసు చూడతరమా, రామాయణం, చూడాలని ఉంది, మనోహరం, మృగరాజు, ఒక్కడు, అర్జున్, సైనికుడు, వరుడు... ఈ సినిమాలకీ, గుణశేఖర్‌కీ సంబంధం ఉంది. అది - ఆ సినిమాలకు దర్శకుడు ఆయనే. ఒక్కసారి వాటిని పరిశీలిస్తే 2003లో వచ్చిన 'ఒక్కడు' తర్వాత ఆయనకు మరో హిట్ లేదని అర్థమైపోతుంది. 
'ఒక్కడు'తో మహేశ్ ఇమేజ్‌ని ఎంతో పెంచిన గుణశేఖర్ అదే హీరోతో 'అర్జున్', 'సైనికుడు' సినిమాలు తీసి అటు మహేశ్‌ని దెబ్బకొట్టడమే కాకుండా తానూ దెబ్బతిన్నాడు. 'అర్జున్' స్వయంగా మహేశ్ వాళ్ల బేనర్ నిర్మించినదే. దాని కోసం మధుర మీనాక్షి దేవాలయం సెట్‌ని భారీ ఖర్చుతో నిర్మించారు. ఫలితంగా 'అర్జున్' కాస్ట్ ఫెయిల్యూర్ ప్రాజెక్టుగా మిగిలింది. ఇక అశ్వనీదత్ నిర్మించిన 'సైనికుడు' డిజాస్టరైంది. దీని కోసం కూడా ఓ సునామీ సెట్‌ని భారీ ఖర్చుతో ఏర్పాటు చేయించాడు గుణశేఖర్. వీటి తర్వాత పెళ్లి ఔన్నత్యాన్ని చాటి చెపుతున్నానంటూ అల్లు అర్జున్ హీరోగా అతను రూపొందించిన 'వరుడు' సినిమా సైతం ఘోరంగా ఫెయిలైంది. దీనికి సైతం బిగ్ బడ్జెట్ అయింది. 
ఇలా ఫ్లాపుల్లో హ్యాట్రిక్ నమోదుచేసిన గుణశేఖర్ ఇప్పుడు రవితేజ హీరోగా 'నిప్పు' సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. దీన్ని బొమ్మరిల్లు బేనర్‌పై వైవీఎస్ చౌదరి నిర్మిస్తుండటం విశేషం. తన మునుపటి సినిమాలకు చాలా ఎక్కువ సమయం తీసుకున్న గుణశేఖర్ 'నిప్పు'ను మాత్రం యమ స్పీడుగా తీసేస్తున్నాడు. అతడి మునుపటి సినిమాలతో పోలిస్తే బడ్జెట్ కూడా బాగా తక్కువని తెలుస్తోంది. అంటే అతడు మారాడని అనుకోవాలి. వచ్చే సంక్రాంతికి ఈ సినిమాని విడుదల చేయనున్నట్లు ఇప్పటికే చౌదరి ప్రకటించాడు. దీక్షాసేథ్ హీరోయిన్‌గా నటిస్తున్న నటిస్తున్న ఈ సినిమాతో గుణశేఖర్ మునుపటి ఫాంని అందుకుంటాడా? క్రియేటర్‌గా ఫ్లాపుల హ్యాట్రిక్ కొట్టిన అతడి క్రియేటివిటీకి ఇది అగ్ని పరీక్ష. ఇందులో అతను పాసవుతాడా, ఫెయిలవుతాడా అన్నది ఇప్పుడు తేలాలి

Wednesday, December 14, 2011

త్రివిక్రం ఎదుట సవాలు

దర్శకుడిగా హ్యాట్రిక్ హిట్స్ కొట్టి నాలుగో సినిమాతో బోల్తాపడ్డ త్రివిక్రం ఐదో సినిమాతో సవాలును ఎదుర్కొంటున్నాడు. అతను డైరెక్ట్ చేసిన 'నువ్వే నువ్వే', 'అతడు', 'జల్సా' సినిమాలు ఒకదాన్ని మించి మరొకటి హిట్టయిన సంగతి తెలిసిందే. అదివరకు రచయితగా టాప్ రేంజ్ పొందిన త్రివిక్రం ఈ మూడు సినిమాలతో డైరెక్టర్‌గానూ టాలీవుడ్ టాప్‌లీగ్‌లో చేరిపోయాడు. అయితే అతడి నాలుగో సినిమా తొలి ఫ్లాప్‌ని అతడి జాబితాలో చేర్చింది. ఆ సినిమా 'ఖలేజా'. మహేశ్ హీరోగా అతడు డైరెక్ట్ చేసిన రెండో సినిమా ఇది. 'మగధీర' స్ఫూర్తితో తీయడం వల్ల ఈ సినిమాలో ఒరిజినాలిటీ మిస్సయ్యిందనే అపవాదుతో పాటు మహేశ్, అనుష్క మధ్య కెమిస్ట్రీ వర్కవుట్ కాలేదనే విమర్శా వచ్చింది. కథలోనే దమ్ములేదనే మాట ఎలాగూ ఉంది. 
ఈ సినిమాతో దెబ్బతిన్న త్రివిక్రం ఇప్పుడు అల్లు అర్జున్‌ని డైరెక్ట్ చేయడంలో నిమగ్నమయ్యాడు. నవంబర్ 2న ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. అర్జున్ సరసన ఇలియానా తొలిసారి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాతో బంపర్‌హిట్ కొట్టి తన సత్తా చాటాలని ఆశిస్తున్నాడు త్రివిక్రం. తొలి మూడు సినిమాలతో దర్శకుడిగా త్రివిక్రంలోని ప్రతిభ ఆవిరైందనీ, అందువల్లే 'ఖలేజా' లాంటి సబ్జెక్ట్ చేశాడనీ వచ్చిన విమర్శల్ని తాజా సినిమాతో తిప్పికొట్టాలని అతను భావిస్తున్నాడు. ఈ సవాలుని అతడు ఎలా అధిగమిస్తాడో చూడాల్సిందే.

Saturday, December 10, 2011

రాంచరణ్ 'ఎవడు'

రాంచరణ్ కథానాయకుడిగా 'ఎవడు' అనే చిత్రం షూటింగ్ లాంఛనంగా ప్రారంభమైంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకుడు. సమంత ఓ హీరోయిన్ కాగా, మరో హీరోయిన్ ఎంపిక జరుగుతోంది. అల్లు అర్జున్ అతిథి పాత్ర చేయబోతున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. ప్రసాద్ ల్యాబ్స్‌లో డిసెంబర్ 9న జరిగిన కార్యక్రమంలో రాంచరణ్‌పై చిత్రీకరించిన తొలి సన్నివేశానికి చిరంజీవి క్లాప్‌నివ్వగా, సీనియర్ నిర్మాత అల్లు అరవింద్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. దీనికి మరో నిర్మాత శ్యాంప్రసాద్‌రెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ "దర్శకుడు వంశీ చెప్పిన పాయింట్ ఎగ్జయిట్ చేసింది. ఆ కథవిని చిరంజీవి గారు, రాంచరణ్ కూడా అంతే ఎగ్జయిట్ అయ్యారు. కమర్షియల్ సినిమాల్లో కొత్త యాంగిల్ ఉన్న చిత్రం. జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుతాం. తెలుగుతో పాటు తమిళంలోనూ ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం. ఇది అన్ని రకాల ఎమోషన్స్ ఉన్న యాక్షన్ ఎంటర్‌టైనర్'' అన్నారు.
సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ "చరణ్‌తో, వంశీ పైడిపల్లితో ఇది నాకు తొలి చిత్రం. స్క్రిప్టు చాలా బాగా వచ్చింది. మంచి ఆడియో ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నా'' అని చెప్పారు. దర్శకుడు వంశీ పైడిపల్లి మాట్లాడుతూ "కథ విన్న రోజే చిరంజీవిగారు, చరణ్ ఓకే చేశారు. ఇది నాకు మూడో చిత్రం. అన్నీ దిల్ రాజు బేనర్‌లో చేసినవే. దేవిశ్రీ మంచి బాణీలిచ్చాడు. మంచి టీమ్ కుదిరింది'' అన్నారు. ఇది కమర్షియల్ యాంగిల్‌లో కచ్చితంగా కొత్త సినిమా అని కథా రచయిత వక్కంతం వంశీ చెప్పారు.
రాంచరణ్ మాట్లాడుతూ "దిల్ రాజు ఏమిటనేది ఆయన సినిమాలే మాట్లాడతాయి. ముఖ్యమైన అతిథి పాత్ర చేయడానికి బన్నీ చేయడానికి ఒప్పుకోవడం వల్లే ఈ సినిమా త్వరగా మొదలైంది. 'ప్రస్థానం' చూసి సాయికుమార్ అభిమానినైపోయా. ఆయనతో కలిసి పనిచేస్తున్నందుకు సంతోషంగా ఉంది'' అన్నారు. సాయికుమార్ మాట్లాడుతూ "ఈ సినిమా విషయంలో ఎంతో ఉత్సుకతతో ఉన్నా. 2012లో నాకు ఈ సినిమా పెద్ద బ్రేక్‌నిస్తుంది'' అని చెప్పారు.
అబ్బూరి రవి మాటలు రాస్తున్న ఈ చిత్రానికి కథా సహకారం: హరి, ఛాయాగ్రహణం: చోటా కె. నాయుడు, కళ: ఆనంద్‌సాయి, సహ నిర్మాతలు: శిరీశ్, లక్ష్మణ్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వంశీ పైడిపల్లి.

Tuesday, November 8, 2011

బిగ్ స్టోరీ: చుక్కల్లో హీరో.. చిక్కుల్లో సినిమా!

తెలుగు సినిమా బడ్జెట్ రూ. 40 కోట్లకు చేరుకోవడంతో హీరోల, డైరెక్టర్ల రెమ్యూనరేషన్ అంశం మరోసారి తెరమీదకు వచ్చింది. ఎక్కువ బడ్జెట్ సినిమాల్ని మరింత ఎక్కువ రేటుకు కొనుగోలు చేసి, ఆ సినిమాలు ఫ్లాపయ్యాక విలవిల్లాడటం బయ్యర్లకు పరిపాటి వ్యవహారం. అయితే ప్రస్తుతం వాళ్లు సైతం రియలైజయి, భారీ రేట్లకు సినిమాలు కొనేందుకు వెనుకాడుతున్నారు. దీనికి మంచి ఉదాహరణ ఇండస్ట్రీ హిట్టయిన 'దూకుడు' రూ. 5 కోట్ల డెఫిసిట్‌తో రిలీజవడమే. 30 నుంచి 40 కోట్ల రూపాయలు వెచ్చించి పెద్ద హీరోతో సినిమా తీసే నిర్మాత, ఆ స్థాయిలో బిజినెస్ కాకపోతే కొన్ని ప్రాంతాల్లో అయినా సొంతంగానే విడుదల చేసుకోక తప్పని స్థితి నెలకొని ఉంది. మహేశ్, పవన్ కల్యాణ్, ఎన్టీఆర్, రాంచరణ్, ప్రభాస్, అల్లు అర్జున్ వంటి టాప్ హీరోల సినిమాలు ఫెయిలైనా కనీసం సగటున రూ. 20 కోట్లయినా (తాజా అంచనాల ప్రకారం) వసూలు చేస్తాయి. అంటే వారి సినిమాల్ని 20 కోట్లు పెట్టి కొనే బయ్యర్లు 'నో గెయిన్ - నో లాస్' పద్ధతిన బతికిపోతారు. అదే 40 కోట్లకు కొన్నప్పుడు, ఆ సినిమా సూపర్ హిట్టయితేనే వాళ్లకు ఓ రూపాయి మిగులుతుంది. లేదంటే సగం డబ్బు నష్టపోతారు. వాళ్లు బతికి బట్ట కట్టడం కష్టం. 
2011లో బాలకృష్ణ 'పరమవీరచక్ర', ఎన్టీఆర్ 'శక్తి', అల్లు అర్జున్ 'బద్రినాథ్', నాగచైతన్య 'దడ' సినిమాల బయ్యర్ల పరిస్థితే ఇందుకు నిదర్శనం. ఈ సినిమాలన్నీ బాక్సాఫీసు వద్ద డిజాస్టర్లుగా నిలవడంతో బయ్యర్ల గుండెలు పగలడమొక్కటే తక్కువ. సమస్యకు మూలం భారీ బడ్జెట్లే. సినిమా బడ్జెట్‌లో అత్యధిక భాగం హీరోకూ, ఆ తర్వాత డైరెక్టర్‌కూ పోతోంది. స్టార్ హీరోలెవరికీ ఇవాళ ఆరు కోట్ల కంటే తక్కువ పారితోషికం లేదు (ఆ డబ్బుతో మూడు చిన్న సినిమాలు తీసేయొచ్చు). స్టార్ డైరెక్టర్లు సైతం మూడు నుంచి ఐదు కోట్ల దాకా వసూలు చేస్తుండటం సమస్యను మరింత జటిలం చేస్తోంది.
నిర్మాతల్లో ఏకాభిప్రాయమేదీ?
ఓ స్టార్ హీరో, మరో స్టార్ డైరెక్టర్, ఇంకో స్టార్ హీరోయిన్ కాంబినేషన్‌లో సినిమా తీయాలనుకునే నిర్మాత 30 కోట్ల రూపాయల దాకా (కొండొకచో 40 కోట్ల దాకా) వెచ్చించాల్సి వస్తోంది. ఇంత డబ్బుపెట్టి సినిమా తీశాక, ఆ సినిమా ఆడకపోతే హీరో, డైరెక్టర్ బాగానే ఉంటున్నారు కానీ బయ్యర్లు, నిర్మాత మాత్రమే మళ్లీ కోలుకోలేని విధంగా దెబ్బతినిపోతున్నారు. అలాంటప్పుడు 'పెద్ద హీరోతో సినిమా తీయడం దేనికి? చిన్న సినిమా తీయొచ్చు కదా?' అనే సందేహం ఎవరికైనా రావచ్చు. అయితే చిన్న సినిమా పరిస్థితి మరింత అధ్వాన్నం. 'రిస్క్' వ్యవహారం. ఎందుకంటే - చిన్న సినిమాకు ఇవాళ మార్కెట్ లేదు. విలువలు వదిలేసి యువత బలహీనతల్ని సొమ్ముచేసుకునే కథలతో తీసిన సినిమాలకు మాత్రమే మనుగడ. అందువల్లే ఇవాళ రెండొందలకు మించిన సంఖ్యలో చిన్న సినిమాలు విడుదలకు నోచుకోక ల్యాబుల్లో బూజుపట్టిపోతున్నాయి. బయ్యర్ లేకపోయినా సొంతంగా సినిమాను విడుదల చేసుకోగల శక్తి ఉన్నవాళ్లు చిన్న సినిమాల్ని నిర్మిస్తున్నా, 'సేలబిలిటీ' లేకపోవడంతో అవి కలెక్షన్లు తేలేకపోతున్నాయి. అందువల్లే ఏ నిర్మాతైనా పెద్ద హీరోతో సినిమా తీయడానికే ఉత్సాహం చూపుతున్నాడు. ఫలితంగానే పారితోషికాలు కొండెక్కి కూర్చుంటున్నాయి. ఈ పరిస్థితిలో మార్పు రావాలంటే ప్రాథమికంగా పారితోషికాలు తగ్గాలనే డిమాండ్ సినీ పరిశ్రమలో తరచూ వినిపిస్తోంది. ఇంతకుముందు వరకు పబ్లిసిటీ వ్యయాన్ని అదుపు చేయడం వరకే నిర్మాతలు ఐక్యంగా వ్యవహరిస్తూ వచ్చారు. ఇటీవల యాక్టర్లకు ఇస్తున్న సౌకర్యాల్లో కోత విధించారు. అయితే ఇప్పుడు వాటిని కొంతమంది నిర్మాతలు ఉల్లంఘిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు హీరోలు, టెక్నీషియన్లు తమ రెమ్యూనరేషన్‌లో కనీసం 20 శాతమైనా తగ్గించుకుంటే బాగుంటుందని నిర్మాతలు కోరుతున్నారు. అయితే అసలైన మెలిక ఇక్కడే ఉంది. హీరోల, దర్శకుల పారితోషికాలు స్థిరంగా ఉండవు. ఓ సినిమా హిట్టయ్యిందంటే ఆ వెంటనే వాళ్ల రెమ్యూనరేషన్ పెరగటం సర్వసాధారణం. ఈ పారితోషికం పెంచే ట్రెండే సినీ పరిశ్రమను నాశనం చేస్తున్నదని దాసరి నారాయణరావు తరచూ చెబుతుంటారు. 
కావాలని హీరోలు, డైరెక్టర్లు తమ రేటుని పెంచకపోయినా, వాళ్లతో సినిమా తీయాలని ఉబలాటపడే నిర్మాతలే వాళా రేటు పెంచేస్తున్నారు. ఎవరు ఎక్కువ పారితోషికం ఇస్తారో ఆ నిర్మాతకే హీరో, డైరెక్టర్ కమిట్ కావడాన్ని తప్పు పట్టలేం. ఎవరైనా పేరు, డబ్బు కోసమే యత్నిస్తారు. అంటే వేళ్లు తిరిగి నిర్మాతల వైపుకే మళ్లుతున్నాయి. నిర్మాతలు గట్టిగా ఓ కట్టుబాటుతో ఉండి, రెమ్యూనరేషన్లని విపరీతంగా పెంచకుండా ఉంటే సమస్య ఉప్పుడున్న స్థాయికి చేరుకునేది కాదు.

Saturday, October 22, 2011

న్యూస్: జోరంతా సమంతదే!

టాలీవుడ్‌లో ఇప్పుడు సమంత జోరు నడుస్తోంది. 'ఏమాయ చేసావె', 'బృందావనం', 'దూకుడు' సినిమాలతో ఆమె టాప్ లీగ్‌లోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం ఎస్.ఎస్. రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న 'ఈగ'లో హీరోయిన్‌గా నటిస్తున్న ఆమె రెండోసారి నాగచైతన్య సరసన 'ఆటోనగర్ సూర్య'లో నటిస్తోంది. తాజాగా మరో మూడు సినిమాల్లో నాయికగా ఎంపికైంది. వాటిలో మహేశ్‌తో రెండోసారి చేయబోతున్న 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు', సిద్ధార్థ్ సరసన ఓ సినిమాలోనూ, అల్లు అర్జున్ సరసన మరో సినిమాలోనూ చేయబోతోంది. 'ఆటోనగర్ సూర్య'ని దేవా కట్టా డైరెక్ట్ చేస్తుండగా, మాక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బేనర్‌పై కె. అచ్చిరెడ్డి నిర్మిస్తున్నారు. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'ను 'కొత్త బంగారులోకం' ఫేం శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేయనుండగా, దిల్ రాజు నిర్మించబోతున్నారు. వెంకటేశ్, త్రిష మరో జోడీగా నటించే ఈ సినిమా 2012 జనవరిలో సెట్స్ మీదకు వెళ్లనున్నది. సిద్ధార్థ్ సరసన నటించే సినిమాని నందినీరెడ్డి డైరెక్ట్ చేయనుండగా, బెల్లంకొండ సురేశ్ నిర్మించనున్నారు. ఈ సినిమా నవంబర్‌లో రెగ్యులర్ షూటింగ్‌లోకి వెళ్లనున్నది. ఇక అల్లు అర్జున్ సరసన ఆమె నటించే సినిమాని బొమ్మరిల్లు భాస్కర్ రూపొందించనున్నాడు. అలాగే తన మెంటర్ గౌతం మీనన్ తెలుగు, తమిళ, మలయాళ్ భాషలు మూడింటిన్లోనూ తీసే మరో సినిమానీ సమంతా చేయనున్నది. ప్రస్తుతం ఆమె చేస్తున్న, చేయబోతున్న సినిమాలు చూస్తే మిగతా హీరోయిన్లకి కన్నుకుట్టక మానదు.

Monday, September 26, 2011

న్యూస్: ఆసక్తి రేపుతున్న మహేశ్, సుకుమార్ కాంబినేషన్



మహేశ్, శ్రీను వైట్ల తొలి కాంబినేషన్‌లో వచ్చిన 'దూకుడు' సినిమా రికార్డు కలెక్షన్ల వైపు దూసుకుపోతుండగా, మరో డైరెక్టర్‌తో మహేశ్ తొలి కాంబినేషన్ సినిమా విషయంలో మరింత ఆసక్తి నెలకొంది. ఆ కాంబినేషన్ సుకుమార్‌తో. పూరి జగన్నాథ్‌తో చేస్తున్న 'బిజినెస్‌మేన్' తర్వాత సుకుమార్ డైరెక్షన్‌లో చేయడానికి మహేశ్ నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రచారంలో ఉన్న నిజాన్ని సుకుమార్ ధృవీకరించాడు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్టుని అతను సిద్ధం చేశాడు. 'బిజినెస్‌మేన్' 2012 జనవరిలో విడుదల కాగానే ఈ సినిమా షూటింగ్ మొదలయ్యే అవకాశాలున్నాయి. ఈ చిత్రాన్ని కూడా 'దూకుడు' నిర్మాతలే తీయనున్నారనేది సమాచారం. సుకుమార్‌కి అత్యంత ఇష్టమైన సినిమాటోగ్రాఫర్ రత్నవేలు ఈ సినిమాకి పనిచేసే అవకాశాలున్నాయి. సుకుమార్ విషయానికి వస్తే సూపర్‌స్టార్ ఇమేజ్ ఉన్న ఓ హీరోతో పనిచేయడం అతడికి ఇదే తొలిసారవుతుంది. ఇదివరకు అతను అల్లు అర్జున్, రాం, నాగచైతన్యలను డైరెక్ట్ చేశాడు. ఆ ముగ్గురిలో స్టార్ ఇమేజ్ ఉన్నది అర్జున్‌కే. 'ఆర్య'తో అతడికి ఆ ఇమేజ్ తెచ్చింది సుకుమార్ అనేది గమనార్హం. ఇప్పుడు మహేశ్‌ని అతడు డైరెక్ట్ చేసే సినిమా స్క్రిప్ట్ ఎలా ఉంటుందనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. అతడి స్క్రిప్టుల్లో ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు మేధావితనం కూడా ఉంటుందనేది నిజం. అంటే ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరిచే తీరులో అతడు హీరో పాత్రని మలుస్తుంటాడు. మరి మహేశ్‌ని అతడు ఎలా చూపిస్తాడు? మహేశ్‌లోని నటుణ్ణి ఎలా ఉపయోగించుకుంటాడు? అనే ఆసక్తి వ్యక్తమవుతోంది.

Thursday, September 8, 2011

న్యూస్: రెండు ఛాన్సులు కొట్టేసిన ఇలియానా

ప్రస్తుతం తమిళంలో శంకర్ డైరెక్షన్‌లో 'నంబన్' ('3 ఇడియట్స్' రీమేక్)లో నటిస్తోన్న గోవా బ్యూటీ ఇలియానా ఎట్టకేలకు రెండు తెలుగు సినిమాల్లో బుక్కయ్యింది. తెలుగులో పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో 'నేను నా రాక్షసి' చేశాక మళ్లీ మరో సినిమాలో ఆమె దర్శనమివ్వలేదు. సాధారణంగా ఇలియానా స్టార్ హీరోయిన్ ఇమేజ్‌కి ఎలాంటి గ్యాప్ లేకుండా కనీసం రెండు మూడు సినిమాలు చేతిలో ఉండాలి. కానీ ఆ సినిమా పూర్తి చేసిన ఆర్నెల్ల వరకూ ఆమె మరో తెలుగు సినిమా సెట్స్ మీద కాలుపెట్టలేదు. కోటి దాటిన ఆమె రెమ్యూనరేషనే దీనికి కారణమని ప్రచారంలోకి వచ్చింది. అయితే ఇప్పుడు ఆమెకి ఇద్దరు డైరెక్టర్ ఫ్రెండ్స్ మళ్లీ అవకాశాలిచ్చారు. ఒకరు 'పోకిరి'తో ఆమెని స్టార్ హీరోయిన్‌ని చేసిన పూరి జగన్నాథ్ అయితే, మరొకరు ఆమెతో 'జల్సా' చేసిన త్రివిక్రం. రవితేజ హీరోగా జగన్ సంకల్పించిన 'ఇడియట్ 2'లో ఇలియానా హీరోయిన్‌గా ఎంపికైంది. ఇటు జగన్‌తో, అటు రవితేజతో ఆమెకి ఇది మూడో సినిమా కావడం విశేషం. అలాగే అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రం డైరెక్ట్ చేసే సినిమాలోనూ హీరోయిన్‌గా ఇలియానా కన్‌ఫామయ్యింది. నిజానికి ఇందులో తనకి జోడీగా మిస్ బ్యూటిఫుల్ స్కిన్ సమంతా కావాలని అర్జున్ పట్టుబట్టగా, త్రివిక్రం ఇలియానాకి ఓటేసి, అర్జున్‌ని కన్విన్స్ చేశాడనీ ఫిలింనగర్ వాసులు చెప్పుకుంటున్నారు. ఏదేమైనా ఏవో అల్లాటప్పా చాన్సులు కాకుండా రెండు క్రేజీ ప్రాజెక్టుల్లో అవకాశాలు దొరకడంతో ఇలియానా ఆనందంతో తబ్బిబ్బవుతోంది.