Showing posts with label genelia. Show all posts
Showing posts with label genelia. Show all posts

Tuesday, December 19, 2023

Satyam (2003)

Cast: Sumanth, Genelia DSouza, Malladi Raghava, Varsha, Kota Srinivasa Rao, Brahmanandam, Tanikella Bharani, Kantha Rao, Raghunatha Reddy, Anil, Narsing Yadav, Kondavalasa, Satyam Rajesh, Gundu Hanumantha Rao, Duvvasi Mohan, Apoorva, Gowtham Raju, Sridhar Rao, Naveen, Jenni, IDPL Nirmala, Tanu Rai (special appearance)

Story and Screenplay: R. Soorya Kiran

Dialogues: Ravi, Sateesh

Music: Chakri

Cinematography: Sameer Reddy, AN Raju

Editing: Nandamuri Hari

Art: JK Murthy

Action: Vijay 

Executive Producer: Supriya

Producer: Akkineni Nagarjuna

Director: R. Soorya Kiran

Banner: Annapurna Studios

Release Date: 19 December 2003

Thursday, December 29, 2011

'అన్నపూర్ణ' ద్వారా పరిచయమైన తారలు, దర్శకులు

సతీమణి అన్నపూర్ణ అంటే అక్కినేని నాగేశ్వరరావుకు అమితమైన ప్రేమ. అందుకే హైదరాబాద్‌లో నిర్మించిన స్టూడియోకు ఆమె పేరే పెట్టారు. ఇక తమ నిర్మాణ సంస్థను కూడా 'అన్నపూర్ణ స్టూడియోస్' గానే వ్యవహరించారు. ఆ బేనర్ కింద అనేకమంది నటులు, దర్శకులు పరిచయమయ్యారు. వారిలో కొంతమంది అనంతర కాలంలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించారు.
* 1986లో నిర్మించిన 'విక్రమ్' చిత్రం ద్వారా నాగేశ్వరరావు, అన్నపూర్ణల చిన్న కుమారుడు నాగార్జున హీరోగా పరిచయమయ్యారు. హీరోయిన్‌గా శోభన తెలుగు తెరకు పరిచయమయ్యిందీ ఈ చిత్రంతోటే.
* 1989లో నిర్మించిన 'శివ' సినిమాతో తెలుగు సినిమా గతినే మార్చేసిన రాంగోపాల్‌వర్మ పరిచయమయ్యారు. అదే సినిమా హిందీ వెర్షన్‌తో ఇటు నాగార్జుననూ, అటు వర్మనూ బాలీవుడ్‌కూ పరిచయం చేసింది అన్నపూర్ణ సంస్థ.
* 1995లో నాగార్జున చిన్న కుమారుడు మాస్టర్ అఖిల్‌ను వెండితెరకు పరిచయం చేస్తూ 'సిసింద్రీ'ని నిర్మించారు.
* 1998లో సమర్పించిన 'శ్రీ సీతారాముల కల్యాణం చూతము రారండి' చిత్రం ద్వారా దర్శకుడిగా వై.వి.ఎస్. చౌదరినీ, హీరోగా వెంకట్‌నూ పరిచయం చేశారు.
* 1998లోనే తీసిన 'చంద్రలేఖ' చిత్రంతో బాలీవుడ్ సుందరి ఇషా కొప్పికర్ హీరోయిన్‌గా పరిచయమయ్యారు.
* 1999లో తీసిన 'ప్రేమకథ' ద్వారా మనవడు (కూతురి కుమారుడు) సుమంత్‌ను హీరోగా, ఆంత్రమాలిని హీరోయిన్‌గా పరిచయం చేశారు.
* 2000 సంవత్సరంలో నిర్మించిన 'యువకుడు' ద్వారా నాయికగా భూమిక పరిచయమయ్యారు.
* 2003లో సమర్పించిన 'సత్యం' చిత్రంతో నాయికగా జెనీలియా తెలుగు తెరకు పరిచయం చేశారు. దర్శకుడిగా సూర్యకిరణ్‌కూ ఇదే తొలి చిత్రం.
* 2004లో తీసిన 'మాస్' చిత్రంతో కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ దర్శకుడిగా మారారు.
* 2005లో సమర్పించిన 'సూపర్' సినిమాతో అనుష్క తెరంగేట్రం చేశారు. ఇదే సినిమాతో బాలీవుడ్ బ్యూటీ ఆయేషా తకియా తెలుగు తెరకు పరిచయమయ్యారు.
* 2008లో తీసిన 'పౌరుడు' ద్వారా రాజ్ ఆదిత్య దర్శకుడిగా పరిచయమయ్యారు.
-ఆంధ్రజ్యోతి డైలీ, డిసెంబర్ 29, 2011

Tuesday, November 1, 2011

జెనీలియాని జనం ఇష్టపడతారా?

అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించిన 'సత్యం' (2003)తో గ్రాండ్‌గా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన జెనీలియాకి రాం సరసన నటించిన 'రెడీ' తర్వాత మరో హిట్ దక్కలేదు. 'శశిరేఖా పరిణయం', 'కథ', 'ఆరంజ్' సినిమాలు ఫట్టయ్యాయి. ప్రస్తుతం ఆమె తెలుగులో ఒకే సినిమా రానా సరసన 'నా ఇష్టం' చేస్తోంది. ఇదివరకు 'సింహా' వంటి సూపర్ హిట్ సినిమా నిర్మించిన యునైటెడ్ మూవీస్ సంస్థ ఈ సినిమాని నిర్మిస్తుండగా ప్రకాశ్ తోలేటి డైరెక్టర్‌గా పరిచయమవుతున్నాడు. వాస్తవానికి 'నా ఇష్టం' అనేది రాంగోపాల్‌వర్మ రాసిన పుస్తకం పేరు. ఆ పేరుని క్లాప్‌బోర్డ్ ప్రొడక్షన్స్ బేనర్‌పై జోగినాయుడు ఫిలించాంబర్ వద్ద రిజిస్టర్ చేశాడు. అల్లరి నరేశ్ హీరోగా, పరశురాం డైరెక్షన్‌లో ఆ పేరుతో సినిమాని తీయాలని ఆయన అనుకున్నాడు. కానీ ఆ ప్రాజెక్టు వాస్తవ రూపం దాల్చకపోవడంతో టైటిల్‌ని యునైటెడ్ మూవీస్ అధినేత పరుచూరి శివరామప్రసాద్‌కి ఇచ్చేశాడు. ఈ సినిమాలో మీసాలు తీసేసి కొత్తగా కనిపిస్తున్నాడు రానా. అతనితో జెనీలియా జోడీ ఎలా ఉంటుందనే ఆసక్తి చాలామందిలో వ్యక్తమవుతోంది. 'బొమ్మరిల్లు', 'ఢీ', 'రెడీ' విజయాలతో టాప్ స్లాట్‌లోకి వస్తుందనుకున్న జెనీలియా హఠాత్తుగా వెనుకంజ వేయడం చిత్రమే. ముఖ్యంగా కృష్ణవంశీ తీసిన 'శశిరేఖా పరిణయం', 'భాస్కర్ తీసిన 'ఆరంజ్' సినిమాల్లో ఆమె ఓవరాక్షన్ ప్రేక్షకులకి చికాకు తెప్పించింది. దానివల్లే ఆమెకు తెలుగులో అవకాశాలు తగ్గాయనే అభిప్రాయం ఉంది. ఇప్పుడు 'నా ఇష్టం'లో ఆమె నటన ఎలా ఉంటుందో వేచిచూడాలి. ఈ సినిమా అటు రానాకీ, ఇటు జెనీలియాకీ కీలకమే. చూద్దాం ఏమవుతుందో...

Saturday, September 24, 2011

టర్నింగ్ పాయింట్: జెనీలియా

సినిమాలకి ఏమాత్రం సంబంధం లేని కుటుంబం మాది. సినిమాల్లోకి అనుకోకుండానే వచ్చా. నేనో పెళ్లికి వెళ్లినప్పుడు అక్కడ యాడ్ ఇండస్ట్రీకి చెందిన ఓ వ్యక్తి నన్ను చూశాడు. ఆ తర్వాత ఓ యాడ్‌లో చేయడానికి పిలుపు వచ్చింది. అదీ అమితాబ్ బచ్చన్ వంటి మహా నటుడితో. ఎవరైనా వదులుకుంటారా అలాంటి ఆఫర్‌ని! నేనూ అంతే. అది చేసిన మూడు నెల్లకే తొలి సినిమా ఆఫర్ వచ్చింది. తెలుగులో సూపర్‌హిట్టయిన 'నువ్వే కావాలి'ని హిందీలో 'తుఝే మేరీ కసం' పేరుతో తీయడానికి రామోజీరావు గారు ప్లాన్ చేశారు. మా అమ్మతో పాటు వెళ్లి రామోజీరావు గారినీ, దర్శకుడు విజయభాస్కర్ గారినీ కలిశా. ఆ మీటింగ్ మొత్తం మీద నేనొక్క మాట కూడా మాట్లాడలేదు. అలాంటి అవకాశాలు ఒకే ఒక్కసారి వస్తాయనీ, వాటిని ఉపయోగించుకోవాలనీ అమ్మ నన్ను కన్విన్స్ చేసింది. నేనప్పుడే హైస్కూల్ పూరిచేశా. నేను ఆల్‌రౌండర్ని. సవాళ్లంటే ఇష్టం. సినిమాలు నాకు తాజా సవాళ్లని విసిరాయి.
కెమెరా ముందు తొలిసారి నిల్చున్నప్పుడు నేను భయపడలేదు. ఒకసారి కెమెరా ఆన్ అవగానే అంతకుముందున్న నెర్వస్‌నెస్ మాయమైపోయింది. మధ్యలో 'బాయ్స్' (తమిళ్) కోసం డైరెక్టర్ శంకర్ నుంచి కాల్ వచ్చింది. అయితే ప్రాంతీయ భాషలో నటించాలా, వద్దా అనేది నిర్ణయించుకోలేదు. ఏదైతేనేం, హిందీ, తమిళ్, తెలుగు సినిమాలతో తొలి యేడాది క్లిష్టంగా గడిచింది. నాకు భాష సమస్యగా మారింది. తెలుగు, తమిళంలో మాట్లాడటం కష్టమైపోయింది. అయినా పట్టుదలతో డైలాగులు నేర్చుకుని ప్రాంప్టింగ్ అవసరం లేకుండానే చెప్పగలిగా. 'బాయ్స్' సెట్స్ మీద నేను ఇబ్బంది పడుతుంటే డైలాగుల విషయంలో సిద్ధార్థ్ బాగా సాయపడ్డాడు.

Friday, September 16, 2011

న్యూస్: హీరోయిన్లకు 'మా' నోటీసులు

ఇప్పటివరకు తమ సంఘంలో సభ్యత్వం తీసుకోని కొంతమంది హీరోయిన్లకు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) నోటీసులు జారీ చేసింది. ముంబైతో పాటు తమిళనాడు, కర్ణాటక, కేరళ వంటి చోట్ల నుంచి పలువురు తారలు తెలుగు సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే వీరిలో కొంతమంది 'మా'లో సభ్యత్వం తీసుకోకుండానే నటిస్తూ వస్తున్నారు. వీరివల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిర్మాతలు వారిపై 'మా'కు ఫిర్యాదు చేసినా, వారు తమ సభ్యులు కాకపోవడంతో 'మా' ఎలాంటి చర్యలూ తీసుకోలేకపోతోంది. ఇప్పటికే ఎన్నోసార్లు చెప్పినా వారు సభ్యత్వం తీసుకోకపోవడంతోనే సుమారు 14 మంది హీరోయిన్లకు ఈ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. వారిలో చాలాకాలం నుంచే తెలుగు సినిమాల్లో నటిస్తున్న త్రిష, జెనీలియా, తమన్నాతో పాటు ఇటీవలి కాలంలో క్రేజ్ పొందిన సమంత, నిత్యమీనన్, పార్వతీ మెల్టన్ వంటి తారలు ఉన్నారు. సెప్టెంబర్ 30లోగా వీరు సభ్యత్వం తీసుకోకపోతే అక్టోబర్ 1 నుంచి వారికి సహకరించకూడదని 'మా' నిర్ణయించింది.

Friday, August 19, 2011

న్యూస్: 2012లో హీరోగా పరిచయం కానున్న వరుణ్‌తేజ్

రాంచరణ్, జెనీలియా జంటగా భాస్కర్ డైరెక్షన్‌లో తీసిన 'ఆరెంజ్' సినిమా షాక్ నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారు అంజనా ప్రొడక్షన్స్ అధినేత నాగబాబు. డిజాస్టర్ కావడంతో ఆ సినిమాకి పెట్టిన డబ్బంతా బూడిదలో పోసినట్లయ్యింది. ఈ సినిమా అనుభవం తర్వాత అతని అన్నదమ్ములైన చిరంజీవి, పవన్ కల్యాణ్ అతనికి సపోర్ట్‌గా నిలిచారు. తనకైనా, కల్యాణ్‌కైనా ఇప్పుడు చిరంజీవే తండ్రిలాంటివాడని తండ్రిని కోల్పోయిన ఆయన భావిస్తున్నారు.
త్వరలో నాగబాబు కుమారుడు వరుణ్‌తేజ్ హీరోగా తెరమీదకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. "2012లో వాడు హీరోగా పరిచయమయ్యే సినిమా మొదలవుతుంది. ఈలోగా హీరోకి అవసరమైన అన్ని అంశాల్లోనూ వాడు తర్ఫీదు అవుతున్నాడు. అశ్వనీదత్ వాణ్ణి హీరోగా పరిచయం చేస్తారు. ఆ తర్వాత అల్లు అరవింద్ గారి గీతా ఆర్ట్స్‌లో నటిస్తాడు" అని ఆయన చెప్పారు. వరుణ్ భవిష్యత్ గురించి మాట్లాడుతూ "వాడికి మేం ప్లాట్‌ఫాం మాత్రం అమరుస్తాం. వాడు సక్సెస్ అయ్యేదీ, లేనిదీ వాడి ప్రతిభా పాటవాల మీదే ఆధారపడి ఉంటుంది. స్టార్ల కుటుంబం నుంచి వస్తున్నందువల్ల వాడి మీద ఆ వత్తిడి సహజంగానే ఉంటుంది. దాన్ని వాడు అధిగమించ గలగాలి" అని నిర్మొహమాటంగా ఆయన చెప్పారు.

Tuesday, August 16, 2011

న్యూస్: రానా, జెనీలియా జంట ఆకట్టుకుంటుందా?

దగ్గుబాటి రానా ఇప్పుడు రెండు సినిమాల్లో నటిస్తున్నాడు. ఒకటి తెలుగు సినిమా 'నా ఇష్టం' అయితే, మరొకటి హిందీ సినిమా 'డిపార్ట్‌మెంట్'. వీటిలో రెండోదాన్ని రాంగోపాల్‌వర్మ డైరెక్ట్ చేస్తుండటం విశేషం. గమనించదగ్గ సంగతేమంటే రానా 'నా ఇష్టం' టైటిల్ వర్మ రాసిన పుస్తకం 'నా ఇష్టం' పేరే కావడం. ఇందులో రానా సరసన బక్క పలుచని భామ జెనీలియా నటిస్తోంది. ఈ సినిమాలో ఇదివరకు కనిపించిన దానికి భిన్నంగా మీసం లేకుండా లవర్ బాయ్ రోల్‌లో కనిపించనున్నాడు రానా. సుకుమార్, బొమ్మరిల్లు భాస్కర్ వద్ద అసోసియేట్‌గా పనిచేసిన ప్రకాష్ తోలేటి ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. 'సింహా' వంటి సూపర్‌హిట్ మూవీ తర్వాత యునైటెడ్ మూవీస్ నిర్మిస్తుండటంతో 'నా ఇష్టం'పై అంచనాలు బాగానే ఉన్నాయి. చక్రి మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా కథ ఎక్కువగా మలేషియా బ్యాక్‌డ్రాప్‌లో నడుస్తుంది. 'లీడర్', 'నేను నా రాక్షసి', బాలీవుడ్ సినిమా 'దం మారో దం' బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడంతో 'నా ఇష్టం' మీద చాలా ఆశలే పెట్టుకున్నాడు రానా. మరి రానా, జెనీలియా జోడీని జనం ఆదరిస్తారా? వెయిట్ అండ్ సీ.

Monday, July 18, 2011

న్యూస్: రానాని ప్రేక్షకులు ఇష్టపడతారా?

తొలి రెండు సినిమాలు బాక్సాఫీసు వద్ద పెద్దగా ప్రభావం చూపలేకపోవడంతో మూడో సినిమా మీద ప్రాణమే పెడుతున్నాడు రానా దగ్గుబాటి. శేఖర్ కమ్ముల రూపొందించిన 'లీడర్'లో ముఖ్యమంత్రిగా నటించి బాగానే చేశాడనిపించుకున్న ఈ రామానాయుడి మనవడు, సురేశ్‌బాబు కుమారుడు పూరి జగన్నాథ్ సినిమా 'నేను నా రాక్షసి' కచ్చితంగా తనకి కమర్షియల్ బ్రేక్ ఇస్తుందని ఆశించాడు. కానైతే ఆ సినిమా ఫ్లాప్ అనిపించుకుంది. పైగా ఆ సినిమా వల్ల అతని కంటే ఎక్కువగా ఇలియానాకే పేరు వచ్చింది. ఈ నేపథ్యంలో 'నా ఇష్టం' అనే సినిమా చేస్తున్నాడు రానా. ఇందులో అతని జోడీగా 'బొమ్మరిల్లు' బ్యూటీ జెనీలియా నటిస్తుండటం విశేషం. 'సింహా'తో హిట్టు కొట్టిన పరుచూరి కిరీటి నిర్మిస్తున్న ఈ సినిమా ద్వారా ప్రకాశ్ తోలేటి డైరెక్టర్‌గా పరిచయమవుతున్నాడు. పర్సనాలిటీ పరంగా సీరియస్ కేరక్టర్స్‌కి పనికి వస్తాడనిపించే రానా 'నా ఇష్టం'లో రఫ్ రోల్ చేస్తున్నాడు. ఈ సినిమాతోనైనా ప్రేక్షకులు తనని ఇష్టపడేలా చేసుకోవాలని తపిస్తున్నాడు. అతని ఆశ నెరవేరుతుందా?

Sunday, November 21, 2010

ఫోకస్: నిలిచే తార ఎవరు? (రెండో భాగం)

'శశిరేఖా పరిణయం'లో ఆమె నటన కొన్ని సందర్భాల్లో చికాకుని సైతం కలిగించిన సంగతి అనుభవమే. మిగిలిన తారల్లో తమ నటనా కౌశలంతో సినిమాకి వన్నె తెచ్చిన వాళ్లెవరూ లేరు. వాళ్ల సంగతలా వుంచితే ఇప్పుడిప్పుడే వస్తోన్న తారల్లో అయినా సౌందర్య మాదిరిగానో, విజయశాంతి మాదిరిగానో నిలిచేవాళ్లెవరు?
'జోష్' కలిగిస్తుందనుకున్న రాధ కూతురు కార్తీక, 'వరుడు' సరసన కనిపించిన భానుశ్రీ మెహ్రా, 'మరో చరిత్ర' సృష్టిస్తుందనుకున్న అనిత, 'కొమరం పులి'తో పరిచయమైన నికిషా పటేల్ వంటివాళ్లు ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారు. అందుకే వాళ్లలో ఎవరికీ ఇంతదాకా రెండో సినిమా అవకాశం రాలేదు. 'కొత్త బంగారులోకం'తో పరిచయమై, తొలి సినిమా తోటే ఆకట్టుకున్న బెంగాలీ అమ్మాయి శ్వేతాబసు ప్రసాద్ తర్వాత్తర్వాత మరింత రాణిస్తుందనుకుంటే, అందుకు విరుద్ధంగా క్రేజ్‌ని కోల్పోతూ వస్తోంది.
'ఎవరైనా ఎపుడైనా', 'గాయం 2' చిత్రాల్లో కనిపించిన విమలా రామన్; 'సిద్ధు ఫ్రం సికాకుళం', 'శుభప్రదం' చిత్రాల్లో కనిపించిన మంజరి ఫద్నిస్ కానీ, 'లీడర్', 'రామరామ కృష్ణకృష్ణ' సినిమాల్లో నటించిన ప్రియా ఆనంద్; 'ఏం పిల్లో ఏం పిల్లడో', 'బావ' సినిమాల్లో నటించిన ప్రణీత కానీ ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయారు. ఇక మిగిలిన వాళ్లలో స్టార్లుగా ఎదిగే సత్తా వున్నవాళ్లు ఇప్పటికైతే ఇద్దరే కనిపిస్తున్నారు. ఆ ఇద్దరిలో ఒకరు సమంతా కాగా, మరొకరు తాప్సీ.  
గౌతం మీనన్ డైరెక్ట్ చేసిన 'ఏ మాయ చేసావె'తో పరిచయమైన సమంతా ఎంతగా ఆకట్టుకున్నదీ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జెస్సీ పాత్రలో అమోఘంగా రాణించి, యువతరాన్ని కట్టిపడేసిన ఈ సుందరి ఎన్‌టీఆర్ సినిమా 'బృందావనం'లోనూ తన నటనతో ప్రేక్షకుల్ని మెప్పించింది. కాజల్ అగర్వాల్ చేసిన భూమి పాత్రతో పోలిస్తే తను చేసిన ఇందు పాత్ర నిడివి తక్కువ. అయితేనేం, ఆ పాత్రలోనూ చక్కగా అలరించింది. ఇప్పుడామె చేతిలో రెండు క్రేజీ సినిమాలున్నాయి. రెండూ సూపర్‌స్టార్ల సినిమాలే. వాటిలో ఒకటి మహేశ్ సరసన చేస్తోన్న 'దూకుడు'. మాస్ పల్స్ తెలిసిన డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న శ్రీను వైట్ల రూపొందిస్తోన్న ఈ సినిమాలో సమంతా పాత్రకు తగినంత ప్రాధాన్యత ఉంది. ఇక రెండోది పవన్ కల్యాణ్‌తో చేయబోతున్న సినిమా. వీవీ వినాయక్ దర్శకత్వం వహించే ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మించబోతున్నారు. ఇవికాక మరెన్నో ఆఫర్లు ఆమె చేతిలో ఉన్నాయి.
సమంతా లాగే తాప్సీ తెరంగేట్రం కూడా బాగానే జరిగింది. హీరోయిన్లను అతి సుందరంగా చూపించగల సీనియర్ డైరెక్టర్ కె. రాఘవేంద్రరావు రూపొందించిన 'ఝుమ్మంది నాదం' చిత్రంలో మనోజ్ సరసన నటించడం ద్వారా తెలుగు తెరకి పరిచయమైన ఉత్తరాది భామ తాప్సీ రూప లావణ్యాలు ప్రేక్షకుల్ని కట్టిపడేశాయి. ఆ సినిమా అనుకున్నంతగా ఆడకపోయినా తాప్సీకి వచ్చిన క్రేజ్ చాలా ఎక్కువే. (ఇంకావుంది)

Saturday, November 20, 2010

ఫోకస్: నిలిచే తార ఎవరు? (తొలి భాగం)

కొత్త తారల్లో నిలిచే తార ఎవరు? అసలు ఎవరైనా ఉన్నారా? చాలామందిని తొలుస్తున్న ప్రశ్నలివి. ఇప్పుడు ఏ తారని చూసినా ఇలా వచ్చి అలా వెళ్లిపోయేవాళ్లే. కేవలం గ్లామర్‌ని నమ్ముకొని వస్తున్నందునే వాళ్లు ఎక్కువ కాలం వెండితెర మీద వెలగలేక పోతున్నారు. అందం ఏ కాస్త చెదిరినా వాళ్లకి మరో అవకాశమే ఉండటం లేదు. అంటే 'ఎస్టాబ్లిష్డ్ హీరోయిన్' అనే మాట ఇక తెలుగు సినిసీమలో వినిపించే అవకాశాలు కూడా తక్కువే. తెలుగు సినిమాకి సంబంధించినంత వరకు చివరి ఎస్టాబ్లిష్డ్ హీరోయిన్ ఎవరంటే ఠక్కున స్ఫురించే పేరు సౌందర్య. అవును. సౌందర్యతోటే తెలుగు సినిమా అసలు సిసలైన నాయిక కూడా మాయమైపోయింది.  
అన్ని రంగాల్లో మాదిరిగానే సినిమా పరిశ్రమలోనూ మేల్ డామినేషన్ చాలా చాలా ఎక్కువ. నిర్మాతలు, సాంకేతిక నిపుణుల్లో ఆడవాళ్లని వేళ్లమీద లెక్కించవచ్చు. సినిమా అన్నాక హీరోయిన్‌తో పాటు అక్క, చెల్లి, వదిన, అమ్మ, అత్త, బామ్మ వంటి పాత్రలు వుంటాయి కాబట్టి, వాటిని మగాళ్లతో చేయించడం బాగోదు కాబట్టి, ఆ పాత్రల్లో ఆడవాళ్లని చూస్తున్నాం. ఇతర పాత్రల సంగతలా వుంచితే హీరోయిన్ పాత్రల్లో చాలా కాలం నుంచి రాణిస్తున్న నటి ఎవరు? అని భూతద్దం పెట్టి వెతికినా ఒక్కరూ అగుపించరు. దానికితోడు పేరుపొందిన హీరోలంతా ఎప్పటికప్పుడు కొత్త రుచులు కావాలన్నట్లు కొత్త తారల్నే కోరుకుంటున్నారు. ఫలితం.. రెండు మూడేళ్లలో ఆరేడు సినిమాల్లో కనిపించిన తారలంతా 'ఫేడవుట్' అయిపోతున్నారు.
ప్రస్తుత హీరోయిన్ల సంగతే చూసుకుంటే శ్రియ, త్రిష, జెనీలియా, ఛార్మి, ప్రియమణి, నయనతార, అనుష్క, కాజల్ అగర్వాల్, ఇలియానా వంటి తారల్లో ఏ ఒక్కర్నీ ఎస్టాబ్లిష్డ్ హీరోయిన్ అనలేం. ఛార్మి, అనుష్క లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో రాణించినా అది ఒకట్రెండు సినిమాలకే పరిమితమయ్యింది. 'అనుకోకుండా ఒకరోజు', 'మంత్ర' సినిమాల్లో రాణించిన ఛార్మికి ఆ తర్వాత అన్నీ పరాజయాలే ఎదురవుతూ వస్తున్నాయి. అందుకు 'సై ఆట' పెద్ద ఉదాహరణ. 'అరుంధతి'తో సూపర్ హీరోయిన్ అయ్యిందనుకున్న అనుష్క సైతం ఆ తర్వాత చెప్పుకోదగ్గ రీతిలో రాణించలేకపోతోంది. 'పంచాక్షరి' ఫ్లాపవడం దీనికి నిదర్శనం. 'ఖలేజా'లో అయితే మహేశ్‌కి ఆమె సరైన జోడీ కాలేకపోయిందనే విమర్శలే ఎక్కువ. 'బొమ్మరిల్లు' సినిమాని తన భుజాలమీద లాక్కెళ్లిన జెనీలియా అంతకుముందు, ఆ తర్వాత కూడా అలాంటి ఫీట్ ప్రదర్శించలేకపోయింది. (ఇంకావుంది)

Thursday, November 4, 2010

ఫోకస్: 2010 ముగింపైనా సంతోషాన్నిస్తుందా? (మొదటి భాగం)

విజయాల కోసం మొహం వాచిపోతున్న తెలుగు చిత్ర పరిశ్రమ ఈ ఏడాది చివరినైనా సంతృప్తికరంగా ముగిస్తుందా? అనే ప్రశ్న అందరిలోనూ తలెత్తుతోంది. పేలవమైన ఆరంభాన్నిచ్చిన 2010లో ఇప్పటివరకు 'సింహా', 'డార్లింగ్', 'మర్యాదరామన్న', 'ఏమాయ చేసావె', 'వేదం', 'బిందాస్' వంటి అతికొద్ది సినిమాలు మాత్రమే ప్రేక్షకాదరణ పొందాయి. తాజాగా పరిటాల రవి జీవితంపై రాంగోపాల్ వర్మ రూపొందించిన 'రక్త చరిత్ర' విడుదలైన ఐదు రోజుల్లోనే రాష్ట్రవ్యాప్తంగా ఐదు కోట్ల రూపాయలకు మించి వసూలుచేసి, హిట్టుగా నిలిచింది. రజనీకాంత్ 'రోబో' సూపర్ డూపర్ హిట్టయినా అది మన సినిమా కాదు. ఈ పరిస్థితుల్లో నవంబర్, డిసెంబర్ నెలల్లో రానున్న కొన్ని సినిమాలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. వీటిలో సగమైనా విజయాలను సాధిస్తే చిత్రసీమ కాస్తంతయినా సంతోషాన్ని పొందుతుంది. ఆ ఆసక్తికర సినిమాలేమిటో చర్చించడమే ఈ వ్యాసం ముఖ్యోద్దేశం.
'ఆరెంజ్' మీదే అందరి చూపు
సందేహం అవసరం లేదు. ఈ రెండు నెలల్లో రాబోతోన్న సినిమాలన్నింటిలోకీ అత్యధిక శాతం ప్రేక్షకుల్లో ఎక్కువ ఆసక్తిని రేకెత్తిస్తోన్న చిత్రం 'ఆరెంజ్'. సంచలనాల 'మగధీర' తర్వాత రాంచరణ్ హీరోగా నటించిన సినిమా కావడంతో సహజంగానే ఈ సినిమా విషయంలో అటు ట్రేడ్ వర్గాల్లో, ఇటు సాధారణ ప్రేక్షకుల్లో అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన విశేషాల్లో ముఖ్యమైనవి.. దీన్ని భాస్కర్ డైరెక్ట్ చేయడం, నాయికగా జెనీలియా నటించడం, తొలిసారి రాంచరణ్ లవర్ బాయ్ గా కనిపించబోవడం. పైగా ఈ చిత్రాన్ని నిర్మించింది చిరంజీవి సొంత బేనర్ అయిన అంజనా ప్రొడక్షన్స్. ఈ సినిమా హిట్టయితే భాస్కర్ కి హ్యాట్రిక్ లభించినట్లవుతుంది. అతని మునుపటి సినిమాలు రెండు.. 'బొమ్మరిల్లు', 'పరుగు' విజయాల్ని సాధించాయి. అయితే లవ్ స్టోరీతో తయారైన 'ఆరెంజ్'కి నిర్మాణ వ్యయం అదుపుతప్పి పోయిందని వినిపిస్తోంది. గ్రాఫిక్స్ ప్రధానంగా భారీతనంతో నిర్మాణమైన 'మగధీర' చిత్రానికే 38 కోట్ల రూపాయలు ఖర్చయితే, సాఫ్ట్ లవ్ స్టోరీతో తీసిన 'ఆరెంజ్'కి దాదాపు 35 కోట్ల రూపాయలు ఖర్చయ్యిందని సమాచారం. మలేషియా, ఆస్ట్రేలియాల్లో ఎక్కువ భాగం షూటింగ్ జరగడం, పలు సన్నివేశాల్ని రీ షూట్ చేయడం వ్యయం అదుపు తప్పడానికి కారణమని తెలుస్తోంది. హారిస్ జయరాజ్ సంగీతం సమకూర్చగా ఇటీవలే విడుదలైన ఈ సినిమా పాటలు ప్రజాదరణ పొందాయి. నవంబర్ ప్రథమార్థంలో ప్రేక్షకుల ముందుకు వస్తోన్న ఈ చిత్రం ద్వారా షాజన్ పదంసీ అనే మోడల్ సెకండ్ హీరోయినుగా పరిచయమవుతోంది.
'గగనం'లో 'రగడ'
డిసెంబర్ మాసమంటే సీనియర్ స్టార్ హీరో నాగార్జునకి ఎంతో ఇష్టం. ఎందుకంటే ఆ నెలలో విడుదలైన ఆయన సినిమాలు అధిక శాతం విజయాన్నే చవిచూశాయి. 'మన్మథుడు', 'మాస్', 'కింగ్' వంటి సినిమాలు వాటిలో కొన్ని. ఆ సెంటిమెంట్ తోటే ఆయన సినిమా 'రగడ' డిసెంబర్ ద్వితీయార్థంలో విడుదలయ్యేందుకు సన్నద్ధమవుతోంది. మంచు మనోజ్ కి 'బిందాస్' రూపంలో తొలి విజయాన్ని అందించిన వీరు పోట్ల ఈ చిత్రానికి దర్శకుడు. 'సూపర్', 'డాన్' సినిమాల తర్వాత నాగార్జున సరసన ముచ్చటగా మూడోసారి అనుష్క నాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో రెండో నాయిక పాత్రని ప్రియమణి చేస్తోంది. కామాక్షి కళామూవీస్ పతాకంపై డి. శివప్రసాద్ రెడ్డి నిర్మిస్తోన్న ఈ చిత్రంలో నాగార్జున ఇటు వినోదం, అటు యాక్షన్ మేళవించిన పాత్రని చేస్తున్నారు. మునుపటి సినిమా 'కేడి' అట్టర్ ఫ్లాపవడంతో ఈ సినిమాని ఆయన ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. అయితే దీనికంటే ముందుగా ఆయన నటించిన మరో సినిమా నవంబరులోనే విడుదల కాబోతోంది. ఆ చిత్రం 'గగనం'. చెప్పాలంటే తెలుగులో ఇదో ప్రయోగాత్మక చిత్రం. 1999లో జరిగిన కాందహార్ హైజాక్ సంఘటన ఆధారంగా తయారుచేసిన కథతో ఈ సినిమాని డైరెక్టర్ రాధామోహన్ రూపొందించాడు. ఎయిర్ కమాండరుగా నాగార్జున నటించిన ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్, బ్రహ్మానందం కీలక పాత్రలు చేశారు. పాటలు లేని ఈ సినిమాలో నాగార్జున సరసన హీరోయిన్ కూడా కనిపించదు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రాబోతోంది. (ఇంకావుంది)                                                  

Sunday, August 22, 2010

Movies: North rejects South heroines


సౌత్ ఇండియన్ హీరోయిన్లకి బాలీవుడ్డులో స్థానం దక్కడం లేదు. ఉత్తరాది ప్రేక్షకుల ఆదరణ లభించడం లేదు. ఇదివరలో శ్రీదేవి, జయప్రదకు ఈ పరిస్థితి లేదు. కానీ ఇప్పుడు అక్కడి ప్రేక్షకుల టేస్ట్ మారినట్టుంది. సౌత్ హీరోయిన్లంటే మొహం చాటేస్తున్నారు. అది శ్రియ అయినా, అసిన్ అయినా, త్రిష అయినా ఒకటే.. ఎవరినీ అభిమానించి ఆదరించడం లేదు. ఈ మార్పు 2007లో శ్రియతో మొదలైంది. ఆమె 'ఆవారాపన్'తో హిందీలో అరంగేట్రం చేసి తిరుగుముఖం పట్టింది. ఆ తర్వాత 2008లో 'జానే తూ యా జానే నా'తో జెనీలియాకి ఈ పరిస్తితే ఎదురైంది. ఆ తర్వాత 'గజిని'తో అసిన్, ఇప్పుడు 'ఖట్టా మీఠా'తో త్రిష కూడా తిరుగుముఖం పట్టాల్సి వచ్చింది. ఈలోగా ఇటు మాతృభాషలోనూ డిమాండ్ తగ్గిపోయి త్రిశంకు స్వర్గంలో కొట్టుమిట్టాడుతున్నారు వీళ్లందరూ. దీన్నించి నేర్చుకోవాల్సిన పాఠమేంటి? టౌను పక్కకెళ్లద్దురో డింగరీ అనేకదూ! లేకపోతే రెంటికీ చెడ్డ రేవడి అవుతారు.