Showing posts with label ragada. Show all posts
Showing posts with label ragada. Show all posts

Saturday, August 6, 2011

న్యూస్: నాగార్జున, శివప్రసాదరెడ్డి కాంబినేషన్‌లో 11వ సినిమా!

కామాక్షి ఎంటర్‌ప్రైజెస్ అధినేత డి. శివప్రసాద్‌రెడ్డితో మరో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు అక్కినేని నాగార్జున. 'రగడ' వంటి హిట్ తర్వాత ఈ సినిమా తయారు కాబోతోంది. ఇప్పటివరకు ఆ ఇద్దరి కాంబినేషన్‌లో పది సినిమాలొచ్చాయి. వాటిలో విక్కీ దాదా, అల్లరి అల్లుడు, సీతారామరాజు, నేనున్నాను, కింగ్, రగడ హిట్టయ్యాయి. ఆటో డ్రైవర్, ఎదురులేని మనిషి, బాస్, కేడి ఫ్లాపయ్యాయి. అయితే హిట్లు, ఫ్లాపులతో నిమిత్తం లేకుండా వారి అనుబంధం కొనసాగుతుండటం విశేషమనే చెప్పాలి. ఒకప్పుడు అక్కినేని నాగేశ్వరరావు - దుక్కిపాటి మధుసూదనరావు, కృష్ణ-డూండీ కాంబినేషన్ తరహాలో వీరి కాంబినేషన్ తయారయ్యింది. స్టార్లు యేడాదికి ఒకటి, రెండు సినిమాలు కంటే ఎక్కువ చేయని ఈ రోజుల్లో ఒక హీరో ఒకే నిర్మాతతో పది సినిమాలు చేయడం వారి అనుబంధానికి నిదర్శనం. 1988లో 'విక్కీ దాదా'తో ప్రారంభమైన వీరి అనుబంధం 23 సంవత్సరాలుగా అప్రతిహతంగా కొనసాగుతోంది. 'ఆటో డ్రైవర్' ఫ్లాపయ్యాక శివప్రసాద్‌రెడ్డి బాగా డిప్రెస్ అయ్యారు. "ఫైనాన్షియల్‌గా, మెంటల్‌గా నేను పూర్తి నిరాశలో ఉన్న టైంలో నన్ను పిలిచి సినిమా ప్లాన్ చేసుకోండని చెప్పారు నాగార్జున. అలా 'సీతారామరాజు' వచ్చి మళ్లీ నన్ను నిలబెట్టింది. ఫ్లాప్ ఇచ్చినప్పుడు కూడా నన్ను తన నిర్మాతగా భావించిన నాగార్జున సంస్కారం వల్లే మా కాంబినేషన్‌కు ఇంత గుర్తింపు వచ్చింది" అని చెప్పారు శివప్రసాద్‌రెడ్డి. అలాంటి ఈ హీరో, నిర్మాతల 11వ సినిమా 2012 జనవరిలో ప్రారంభం కాబోతోంది. దీని డైరెక్టర్ ఎవరనే సంగతి కొద్ది రోజుల్లో వెల్లడి కానున్నది.

Thursday, November 11, 2010

సినిమా: మసకబారుతున్న అనుష్క క్రేజ్

'విక్రమార్కుడు', 'అస్త్రం', 'డాన్', 'శౌర్యం', 'చింతకాయల రవి' వంటి సినిమాలతో టాప్ హీరోయిన్ రేంజిని సాధించిన యోగా టీచర్ అనుష్క 'అరుంధతి'తో సూపర్ హీరోయిన్ ఇమేజ్‌ని పొందిన సంగతి తెలిసిందే. కానీ ఆ సినిమాతో వచ్చిన పేరుని నిలబెట్టుకోవడంలో ఆమె తప్పటడుగులు వేస్తూ వస్తోంది. ఫలితంగా ఆమెకి వచ్చిన అమితమైన క్రేజ్ క్రమంగా మసకబారుతోంది.
'అరుంధతి' తర్వాత ఆమెకి విమర్శకుల్లో పేరు తెచ్చిన సినిమా క్రిష్ డైరెక్ట్ చేసిన 'వేదం'. ఈ సినిమాలో అమలాపురం సరోజ అనే సెక్స్ వర్కర్ క్యారెక్టర్లో ఆమె బాగా రాణించింది. అందుకే అదే సినిమా తమిళ వెర్షన్ 'వానం'లోనూ ఆమె అదే పాత్రని చేజిక్కించుకుంది. అయితే ఈ మధ్యలో 'బిల్లా', 'పంచాక్షరి', 'ఖలేజా' సినిమాలు ఆమెకి ఏమాత్రం ప్రయోజనం చేకూర్చలేక పోయాయి.
'బిల్లా'లో ప్రభాస్ సరసన కేవలం గ్లామర్ డాల్‌గా మిగిలిన ఆమె 'అరుంధతి' ప్రభావంలో పడి చేసిన 'పంచాక్షరి' సినిమా ప్రేక్షకుల్ని ఏమాత్రం ఆకట్టుకోలేక పోయింది. 'ఖలేజా'లో అయితే మహేశ్ సరసన ఆమె నప్పలేదనే చెడ్డపేరు వచ్చింది. ఇలా వరుసగా ఆమె చేసిన పాత్రలు ప్రేక్షకుల్ని ఆకర్షించక పోతుండటం ప్రమాద ఘంటికలు మోగుతున్నాయనడానికి సంకేతమే.
రానున్న కొద్ది రోజుల్లో ఆమె సినిమాలు రెండు విడుదలవుతున్నాయి. ఒకటి నాగార్జునకి జోడీగా చేస్తోన్న 'రగడ' కాగా, మరొకటి వెంకటేశ్ ప్రధాన పాత్ర చేస్తోన్న 'నాగవల్లి'. ఈ రెండో దానిలో ఆమెదే టైటిల్ రోల్. ఈ సినిమాలు హిట్టయితే ఆమె ఇమేజ్ మరికొంత కాలం సేఫ్‌గా ఉంటుంది. లేదంటే చాలామంది తారల మల్లే ఆమె కూడా డబ్బుల కోసమే ఏదో ఓ సినిమా చేయాల్సిన స్థితిలో పడిపోతుంది.  

Thursday, November 4, 2010

ఫోకస్: 2010 ముగింపైనా సంతోషాన్నిస్తుందా? (మొదటి భాగం)

విజయాల కోసం మొహం వాచిపోతున్న తెలుగు చిత్ర పరిశ్రమ ఈ ఏడాది చివరినైనా సంతృప్తికరంగా ముగిస్తుందా? అనే ప్రశ్న అందరిలోనూ తలెత్తుతోంది. పేలవమైన ఆరంభాన్నిచ్చిన 2010లో ఇప్పటివరకు 'సింహా', 'డార్లింగ్', 'మర్యాదరామన్న', 'ఏమాయ చేసావె', 'వేదం', 'బిందాస్' వంటి అతికొద్ది సినిమాలు మాత్రమే ప్రేక్షకాదరణ పొందాయి. తాజాగా పరిటాల రవి జీవితంపై రాంగోపాల్ వర్మ రూపొందించిన 'రక్త చరిత్ర' విడుదలైన ఐదు రోజుల్లోనే రాష్ట్రవ్యాప్తంగా ఐదు కోట్ల రూపాయలకు మించి వసూలుచేసి, హిట్టుగా నిలిచింది. రజనీకాంత్ 'రోబో' సూపర్ డూపర్ హిట్టయినా అది మన సినిమా కాదు. ఈ పరిస్థితుల్లో నవంబర్, డిసెంబర్ నెలల్లో రానున్న కొన్ని సినిమాలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. వీటిలో సగమైనా విజయాలను సాధిస్తే చిత్రసీమ కాస్తంతయినా సంతోషాన్ని పొందుతుంది. ఆ ఆసక్తికర సినిమాలేమిటో చర్చించడమే ఈ వ్యాసం ముఖ్యోద్దేశం.
'ఆరెంజ్' మీదే అందరి చూపు
సందేహం అవసరం లేదు. ఈ రెండు నెలల్లో రాబోతోన్న సినిమాలన్నింటిలోకీ అత్యధిక శాతం ప్రేక్షకుల్లో ఎక్కువ ఆసక్తిని రేకెత్తిస్తోన్న చిత్రం 'ఆరెంజ్'. సంచలనాల 'మగధీర' తర్వాత రాంచరణ్ హీరోగా నటించిన సినిమా కావడంతో సహజంగానే ఈ సినిమా విషయంలో అటు ట్రేడ్ వర్గాల్లో, ఇటు సాధారణ ప్రేక్షకుల్లో అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన విశేషాల్లో ముఖ్యమైనవి.. దీన్ని భాస్కర్ డైరెక్ట్ చేయడం, నాయికగా జెనీలియా నటించడం, తొలిసారి రాంచరణ్ లవర్ బాయ్ గా కనిపించబోవడం. పైగా ఈ చిత్రాన్ని నిర్మించింది చిరంజీవి సొంత బేనర్ అయిన అంజనా ప్రొడక్షన్స్. ఈ సినిమా హిట్టయితే భాస్కర్ కి హ్యాట్రిక్ లభించినట్లవుతుంది. అతని మునుపటి సినిమాలు రెండు.. 'బొమ్మరిల్లు', 'పరుగు' విజయాల్ని సాధించాయి. అయితే లవ్ స్టోరీతో తయారైన 'ఆరెంజ్'కి నిర్మాణ వ్యయం అదుపుతప్పి పోయిందని వినిపిస్తోంది. గ్రాఫిక్స్ ప్రధానంగా భారీతనంతో నిర్మాణమైన 'మగధీర' చిత్రానికే 38 కోట్ల రూపాయలు ఖర్చయితే, సాఫ్ట్ లవ్ స్టోరీతో తీసిన 'ఆరెంజ్'కి దాదాపు 35 కోట్ల రూపాయలు ఖర్చయ్యిందని సమాచారం. మలేషియా, ఆస్ట్రేలియాల్లో ఎక్కువ భాగం షూటింగ్ జరగడం, పలు సన్నివేశాల్ని రీ షూట్ చేయడం వ్యయం అదుపు తప్పడానికి కారణమని తెలుస్తోంది. హారిస్ జయరాజ్ సంగీతం సమకూర్చగా ఇటీవలే విడుదలైన ఈ సినిమా పాటలు ప్రజాదరణ పొందాయి. నవంబర్ ప్రథమార్థంలో ప్రేక్షకుల ముందుకు వస్తోన్న ఈ చిత్రం ద్వారా షాజన్ పదంసీ అనే మోడల్ సెకండ్ హీరోయినుగా పరిచయమవుతోంది.
'గగనం'లో 'రగడ'
డిసెంబర్ మాసమంటే సీనియర్ స్టార్ హీరో నాగార్జునకి ఎంతో ఇష్టం. ఎందుకంటే ఆ నెలలో విడుదలైన ఆయన సినిమాలు అధిక శాతం విజయాన్నే చవిచూశాయి. 'మన్మథుడు', 'మాస్', 'కింగ్' వంటి సినిమాలు వాటిలో కొన్ని. ఆ సెంటిమెంట్ తోటే ఆయన సినిమా 'రగడ' డిసెంబర్ ద్వితీయార్థంలో విడుదలయ్యేందుకు సన్నద్ధమవుతోంది. మంచు మనోజ్ కి 'బిందాస్' రూపంలో తొలి విజయాన్ని అందించిన వీరు పోట్ల ఈ చిత్రానికి దర్శకుడు. 'సూపర్', 'డాన్' సినిమాల తర్వాత నాగార్జున సరసన ముచ్చటగా మూడోసారి అనుష్క నాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో రెండో నాయిక పాత్రని ప్రియమణి చేస్తోంది. కామాక్షి కళామూవీస్ పతాకంపై డి. శివప్రసాద్ రెడ్డి నిర్మిస్తోన్న ఈ చిత్రంలో నాగార్జున ఇటు వినోదం, అటు యాక్షన్ మేళవించిన పాత్రని చేస్తున్నారు. మునుపటి సినిమా 'కేడి' అట్టర్ ఫ్లాపవడంతో ఈ సినిమాని ఆయన ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. అయితే దీనికంటే ముందుగా ఆయన నటించిన మరో సినిమా నవంబరులోనే విడుదల కాబోతోంది. ఆ చిత్రం 'గగనం'. చెప్పాలంటే తెలుగులో ఇదో ప్రయోగాత్మక చిత్రం. 1999లో జరిగిన కాందహార్ హైజాక్ సంఘటన ఆధారంగా తయారుచేసిన కథతో ఈ సినిమాని డైరెక్టర్ రాధామోహన్ రూపొందించాడు. ఎయిర్ కమాండరుగా నాగార్జున నటించిన ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్, బ్రహ్మానందం కీలక పాత్రలు చేశారు. పాటలు లేని ఈ సినిమాలో నాగార్జున సరసన హీరోయిన్ కూడా కనిపించదు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రాబోతోంది. (ఇంకావుంది)