Showing posts with label dil raju. Show all posts
Showing posts with label dil raju. Show all posts

Friday, November 24, 2023

రివ్యూలతో బెంబేలెత్తుతున్న నిర్మాతలు?!

సినిమా బాగుంటే, కాలం కలిస్తొస్తే బాక్సాఫీస్ దగ్గర దాని విజయాన్ని ఎవరూ ఆపలేరు. మౌత్ టాక్‌తోటే వాటికి కాసుల వర్షం కురుస్తుంది. అయితే, ఇటీవలి కాలంలో వెబ్‌సైట్లలో, యూట్యూబ్ చానళ్లలో వచ్చే రివ్యూస్ వల్ల తమ సినిమాలు నష్టపోతున్నాయని కొంతమంది నిర్మాతలు తలలు బాదుకుంటున్నారు. రివ్యూలు తమ సినిమాల కలెక్షన్ రాతల్ని మార్చేస్తున్నాయని వారు వాపోతున్నారు. 

రీసెంట్‌గా జరిగిన సినిమాల ఈవెంట్లలో ఈ రివ్యూల గురించిన డిబేట్ జర్నలిస్టులకు, దర్శక నిర్మాతలకు మధ్య చోటుచేసుకుంటూ వస్తోంది. 'కోటబొమ్మాళి పి.ఎస్.' మూవీ ఈవెంట్‌లో కొంతమంది జర్నలిస్టులను స్టేజి మీద కూర్చోబెట్టి కింద నుంచి నిర్మాతలు అల్లు అరవింద్, దిల్ రాజు, బన్నీ వాస్, డైరెక్టర్ సాయిరాజేశ్ ఈ రివ్యూల విషయంలో తమ ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. సినిమా రిలీజైన వెంటనే ఇస్తున్న నెగటివ్ రివ్యూల వల్ల వాటి కలెక్షన్లు ఎఫెక్ట్ అవుతున్నాయని దిల్ రాజు ఆవేదన వ్యక్తం చేశారు. మంచి సినిమాలకు కూడా 4 పైన రేటింగ్ ఎందుకు ఇవ్వట్లేదని సాయిరాజేశ్ అడిగారు. రిలీజైన మూడు రోజుల తర్వాత రివ్యూ ఇస్తే ఈలోపు తమ సినిమాకు రావాల్సిన కలెక్షన్లు వస్తాయని, ఆ తర్వాత రివ్యూ ఇచ్చినా తమకు పెద్ద బాధ ఉండదనీ రాజు చెప్పుకొచ్చారు.

అలాగే 'ఆదికేశవ' సినిమా ఈవెంట్‌లో ఆ మూవీ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ సినిమా రిలీజైన రోజునే రివ్యూ ఇవ్వకుండా ఆ తర్వాత రోజు ఇస్తే బాగుంటుందని జర్నలిస్టులకు సూచించాడు. సినిమా బాగాలేదని ఇచ్చే రివ్యూల వల్ల వాటిని చూసిన సినీప్రియులు ప్రభావితమవుతున్నారనీ, తద్వారా థియేటర్లకు రావట్లేదనేది ఆయన ఆవేదన. 

అంటే రివ్యూల ఎఫెక్ట్ నిర్మాతల్నీ, దర్శకుల్నీ బాధపెడుతోందని, భయపెడుతోందని స్పష్టమవుతోంది. నిజానికి రివ్యూ ఉద్దేశం, లేదా ప్రయోజనం ఏమిటి? అనే ప్రశ్న వస్తుంది. సినిమా చూసిన సమీక్షకుడు ఆ సినిమా ఎలా ఉందో తన కోణం నుంచి చెప్పడానికి ప్రయత్నిస్తాడు. కథా కథనాలు ఎలా ఉన్నాయి, ప్రధాన పాత్రలను ఎలా చూపించారు, సన్నివేశాలు ఎలా ఉన్నాయి, టెక్నికల్‌గా సినిమా ఎలా ఉంది? అంతిమంగా దర్శకుడు ఈ సినిమా ద్వారా ఏం చెప్పాడు? సినిమాలో మంచి ఎక్కువ ఉందా? చెడు ఎక్కువ ఉందా?.. అనే అంశాల్ని తన రివ్యూ ద్వారా సమీక్షకుడు విశ్లేషిస్తాడు. వాటిని బట్టి ప్రేక్షకుడు ఆ సినిమాకి వెళ్లవచ్చా, లేదా అనేది నిర్ణయించుకుంటాడు. ప్రేక్షకుల అభిరుచిని పెంపొందింపజేయడం కూడా ఇక్కడ సమీక్షకుడి బాధ్యత. మితిమీరిన హింస, సెక్స్‌తో కూడిన సినిమాని దర్శకుడు భావోద్వేగాలతో, బావోద్రేకాలతో నింపి తీయవచ్చు. ఇలాంటి సినిమాకి కాసుల వర్షం కురియవచ్చు. కానీ ఈ తరహా సినిమాల వల్ల సొసైటీకి నష్టం జరుగుతుందనే విషయాన్ని తెలియజెప్పాల్సిన బాధ్యత రివ్యూయర్‌కు ఉంటుంది. సినిమాని బాధ్యతారాహిత్యంతో తీశారని రివ్యూయర్ రాసినప్పటికీ, ఆ సినిమా రికార్డు స్థాయి కలెక్షన్లు రాబట్టవచ్చు. బాక్సాఫీస్ ఫలితానికీ, రివ్యూయర్ చెప్పిన దానికీ పొంతన లేకపోవచ్చు. అంతమాత్రాన రివ్యూయర్ చెప్పింది తప్పైపోదు.

సమాజంలో మంచి కంటే చెడు ఎక్కువగా ఆకర్షిస్తుందనేది అందరికీ తెలిసిన నిజమే. ఎన్నో మంచి కథలతో వచ్చిన సినిమాలను జనం ఆదరించకపోవడం మన చూశాం. స్టార్ హీరోలు చేసిన సినిమాలను కూడా జనం రిజెక్ట్ చేశారు. మంచి కథలతో చిరంజీవి చేసిన 'ఆరాధన', 'ఆపద్బాంధవుడు' లాంటి సినిమాల్ని జనం ఎందుకు చూడలేదు? ఒక్క చిరంజీవే కాదు, చాలామంది స్టార్ల మంచి సినిమాలు ఫ్లాపయ్యాయి. అయినంతమాత్రాన అవి చెడ్డ సినిమాలు కావని అందరూ ఒప్పుకుంటారు. అలాగే కథపరంగా గొప్పగాలేని సినిమాలెన్నో హిట్టయ్యాయి. కారణం, వాటిలోని భావోద్వేగాల్ని రేకెత్తించే సన్నివేశాలు. 'దొంగ' అనే నెగటివ్ టైటిల్స్‌తో వచ్చిన సినిమాలెన్ని సక్సెస్ కాలేదు! 'ఇడియెట్', 'పోకిరి' లాంటి టైటిల్స్‌తో వచ్చిన సినిమాల్ని బ్లాక్‌బస్టర్స్ చేశారు జనం. ఆ టైటిల్స్‌ని రివ్యూయర్స్ ఆక్షేపించినా వాటి కలెక్షన్లు అదిరిపోయాయి.

కొన్నేసి సినిమాలను విడుదలైనప్పుడు పట్టించుకోని జనం, వాటి రివ్యూస్‌ను చూసి థియేటర్లకు వెళ్లిన దాఖలాలు చాలానే ఉన్నాయి. ఇటీవలి కాలంలోనే రైటర్ పద్మభూషణ్, బలగం, సామజవరగమన, మేం ఫేమస్, మ్యాడ్ లాంటి సినిమాలు ఆడటానికి రివ్యూలు దోహదం చేశాయనేది ఇండస్ట్రీ వాళ్లకు తెలియని విషయం కాదు కదా! అలా అని రివ్యూయర్స్ మెచ్చుకున్న అన్ని సినిమాలూ ఆడతాయనేది కూడా నిజం కాదు. అలా ఆడకపోవడానికి ఎన్నో కారణాలు ఉంటాయి.

ఒక విషయం మాత్రం స్పష్టం. సినిమా థియేటర్లలోకి వచ్చిందంటే, అది ప్రజలది అయిపోయినట్లే. దాని మీద రివ్యూ చెప్పే, రాసే హక్కు ఎవరికైనా ఉంటుంది. ఫలానా సమయంలోనే రివ్యూ ఇవ్వాలని చెప్పే అధికారం ఎవరికీ ఉండదు. సోషల్ మీడియా యుగంలో అసలుకే ఉండదు. సినిమా కానీ, ఇంకేదైనా కానీ పబ్లిక్ డొమైన్‌లోకి వచ్చినప్పుడు ఎవరైనా సరే, దానిపై తన అభిప్రాయాన్ని చెప్పే హక్కు దానంతట అదే వస్తుంది. సినిమా తియ్యడం దర్శక నిర్మాతల పని ఎలాగో, రివ్యూ ఇవ్వడం సమీక్షకుడి పని. ఒక సినిమా ఎలా ఉందో చెప్పి, ఆడియెన్స్‌ను అలెర్ట్ చేసే బాధ్యతను నిర్వర్తిస్తున్నాడు రివ్యూయర్.ఈ విషయాన్ని సినీ దర్శక నిర్మాతలు గుర్తించి, రివ్యూల గురించి ఆలోచించి మనసు పాడుచేసుకోకుండా తమ సినిమాల క్వాలిటీపై మరింత దృష్టిపెడితే బాగుంటుంది. అప్పుడే ఇండస్ట్రీలో సక్సెస్ రేటూ పెరుగుతుంది.

Wednesday, September 30, 2015

Wednesday, July 18, 2012

నిర్మాత దిల్ రాజుతో ఇంటర్వ్యూ

అవి కనెక్టయితే 'తూనీగ తూనీగ' సూపర్ హిట్టే
"హీరోకి సంగీతమంటే పిచ్చి. హీరోయిన్‌కి జంతువులంటే ప్రేమ. వారి అభిరుచులు కథలో కీలక పాత్ర పోషిస్తాయి. ప్రేక్షకులకి అవి కనెక్టయితే సినిమా సూపర్ డూపర్ హిట్టవడం ఖాయం" అని చెప్పారు దిల్ రాజు. పద్మిని ఆర్ట్స్ పతాకంపై మాగంటి రాంజీ నిర్మించిన్న 'తూనీగ తూనీగ' సినిమాని ఆయన సమర్పిస్తున్నారు. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన ఎమ్మెస్ రాజు కుమారుడు సుమంత్ అశ్విన్ హీరోగా పరిచయమవుతున్నారు. ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా గురించీ, మరికొన్ని ఆసక్తికర అంశాల గురించీ దిల్ రాజు చెప్పిన సంగతులు ఆయన మాటల్లోనే...
మేకర్‌గా ఎమ్మెస్ రాజు ప్రతిభ ఏమిటో తెలుసు. వాళ్ల అబ్బాయినే హీరోగా పరిచయం చేస్తున్నారు కాబట్టి కచ్చితంగా బాగుంటుందనే ఉద్దేశంతో మాగంటి రాంజీతో పాటు నిర్మాణంలో నేనూ పాలు పంచుకున్నా. నా సొంత సినిమాకి ఎలాగైతే అన్ని విషయాలూ చూసుకుంటానో అలాగే ఈ సినిమాకీ చేయాలని నిర్ణయించుకుని 70 శాతం షూటింగ్ అయ్యాక రషెస్ చూపించమన్నా. అప్పటికి క్లైమాక్స్, కొన్ని కీలక సన్నివేశాలు తియ్యలేదు. అందులో పొరబాట్లుగా నాకు అనిపించినవీ, నాకు కలిగిన సందేహాలనూ చెప్పాను. రచయితలు పరుచూరి బ్రదర్స్‌తో చర్చించా. ఈ సినిమాని సూపర్‌హిట్ చెయ్యాలంటే ఏం చెయ్యొచ్చో వాటిని అందరినీ కూర్చోపెట్టి చర్చించాను. అప్పటివరకు జరిగిన షూటింగ్‌లో ఎక్కడ మార్పులు చెయ్యాలో, తర్వాత కథ ఎలా ఉండాలో అందరం కలిసి నిర్ణయించుకున్నాం. రాజుగారు కూడా కన్విన్స్ అయ్యారు. దానికి తగ్గట్లే సినిమా తీశారు.

అంచనాలకు తగ్గ సినిమా
ఎమ్మెస్ రాజు, దిల్ రాజు కలిసి చేస్తున్న సినిమా అంటే ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు ఉంటాయో, దానికి తగ్గట్లే ఈ సినిమా ఉంటుంది. ఇది లవ్, ఎంటర్‌టైన్‌మెంట్, ఫ్యామిలీ డ్రామా మేళవించిన సినిమా. నిర్మాణ విలువలు, కథ, సంగీతం సినిమాకి ప్లస్ పాయింట్స్. హీరో హీరోయిన్లది చూడ ముచ్చటైన జంట. ఇళయరాజా గారబ్బాయి కార్తీక్‌రాజా చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు.
సుమంత్ భలే చేశాడు
హీరో సుమంత్ అశ్విన్ చాలా అందంగా ఉన్నాడు. తన కేరక్టర్‌ను సూపర్బ్‌గా చేశాడు. కథని మరో లెవల్‌కి తీసుకెళ్లాడు. హీరో సరిగా నటించకపోతే ఎంత మంచి కథయినా కిందికి పడిపోతుంది. సుమంత్ వల్ల ఈ సినిమా పై స్థాయికి వెళ్లిందని గట్టిగా చెప్పగలను. థియేటర్ నుంచి బయటకు వచ్చేవాళ్లు 'సినిమా భలే ఉంది, అబ్బాయి భలే ఉన్నాడు' అంటారు. సుమంత్ రెండో సినిమా మా బేనర్‌లో ఉంటుంది. నా వద్ద ఉన్న రెండు స్క్రిప్టులకు అతను సరిపోతాడు. 'తూనీగ తూనీగ' ఏ స్థాయిలో సక్సెస్ అవుతుందో చూసి, అప్పుడు స్క్రిప్టు ఎంచుకుంటా.
సినిమా హిట్టవ్వాలంటే...
మన జనాభాలో థియేటర్‌కు వచ్చి సినిమాలు చూసేది కేవలం 10 శాతం లోపే. 40 శాతం మంది టీవీలు చూస్తుంటే, మిగతా 50 శాతం మందికి సినిమా అంటేనే అవగాహన లేదు. టీవీల్ని దాటి థియేటర్‌కు జనం వచ్చేలా చేస్తేనే సక్సెస్. 'ఈగ'లో ఏం ఉందని అంతమంది చూస్తున్నారు. 'బొమ్మరిల్లు', 'దూకుడు', 'గబ్బర్‌సింగ్' సినిమాల్ని ఎందుకు అంతమంది చూశారు. వాటిలో విషయం ఉంది కాబట్టి. ఓ సినిమా హిట్టవ్వాలంటే నా దృష్టిలో మూడు విషయాలు కీలకం. కంటెంట్ (కథాంశం), కాస్టింగ్ (తారాగణం), టెక్నీషియన్స్ (సాంకేతిక నిపుణులు). 'తూనీగ తూనీగ'లో కంటెంట్, కాస్టింగ్, టెక్నీషియన్స్ పర్‌ఫెక్ట్. తమ ప్రేమకు ఎదురైన అడ్డంకుల్ని హీరో హీరోయిన్లు ఎలా అధిగమించి ఒక్కటయ్యారనేదే కథ. దాన్ని ఎంత ఇంటరెస్టింగ్‌గా రాజుగారు మలిచారన్నది తెరమీద చూడాల్సిందే.
కౌన్సిలింగ్‌కి రెడీ
ప్రతి నెలా రెండో ఆదివారం కొత్త నిర్మాతలకి కౌన్సిలింగ్ ఇస్తే ప్రయోజనం ఉంటుందని ప్రొడ్యూసర్స్ కౌన్సిల్‌లో నేను ప్రపోజల్ పెట్టాను కానీ ఎందుకనో దాన్ని పట్టించుకోలేదు. సినిమా ఎలా తియ్యాలనే విషయంలో కొత్త నిర్మాతలకి కౌన్సిలింగ్ ఇవ్వడానికి నేను రెడీ. ప్రేక్షకులకి ఎలాంటి సినిమాలు నచ్చుతాయనే విషయంలో నిర్మాతలకి జడ్జిమెంట్ ఉండాలి. కథ విన్నాక తన సినిమా ఎలా ఉంటుందో అనే విజన్ ఉండాలి. సినిమా మేకింగ్ పట్ల తపన, ఇన్‌వాల్వ్‌మెంట్ ఉండాలి. మిగతా వ్యాపారాలతో పోలిస్తే ఇక్కడ ఆదాయం తక్కువనే విజ్ఞత ఉండాలి. లాభం సంగతి తర్వాత, పెట్టుబడి వస్తుందనే గ్యారంటీ లేదనే సంగతి గ్రహించాలి. వీటిలో అవగాహన ఉంటే సక్సెస్ రేట్ కచ్చితంగా పెరుగుతుంది. నేను ఇప్పుడు తీస్తున్న సినిమాలకి పెట్టిన పెట్టుబడి వేరే వ్యాపారాల మీద పెడితే గ్యారంటీగా లాభాలు ఎక్కువే ఉంటాయి. కానీ సినిమా అంటే ఉన్న ప్యాషన్‌తోనే ఇక్కడ ఉన్నా.
అంజలి నటన అసాధారణం
వచ్చే దసరా సెలవులకు 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' విడుదలవుతుంది. డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల చాలా బాగా తీస్తున్నాడు. రాజమండ్రి, తణుకు, భద్రాచలంలో రెండో షెడ్యూల్ చేశాం. ఆగస్టు 7 నుంచి హైదరాబాద్‌లో మూడో షెడ్యూల్ చేస్తాం. సెప్టెంబర్ 5 నాటికి షూటింగ్ మొత్తం పూర్తి చేయాలనేది ప్లాన్. సినిమాలో మొత్తం తొమ్మిది పాటలున్నాయి. సినిమాకి మిక్కీ జె. మేయర్ మ్యూజిక్ ఎస్సెట్. 'సీతమ్మ వాకిట్లో..'కీ, బాలీవుడ్ హిట్ ఫిల్మ్ 'కభీ ఖుషి కభీ ఘమ్'కీ ఎలాంటి పోలికా లేదు. 'సీతమ్మ వాకిట్లో' అంటే భారతదేశం, 'సిరిమల్లె చెట్టు' అంటే ఓ కుటుంబం. భారతదేశంలోని ఓ అందమైన కుటుంబం కథ ఈ సినిమా. వెంకటేశ్ సరసన అంజలి, మహేశ్ జోడీగా సమంత నటిస్తున్నారు. నిజానికి వెంకటేశ్‌కి జోడీగా త్రిషను కానీ, అనుష్కను కానీ తీసుకోవాలనుకున్నాం. కానీ పాత్ర కంటే మహేశ్‌కి వదినగా నటించాలనే అంశం హైలైట్ అవడంతో వారు వెనుకంజ వేశారు. చివరకు అంజలిని తీసుకున్నాం. ఆమె అసాధారణంగా నటిస్తోంది. ఈ సినిమా కథ ప్రధానంగా వెంకటేశ్, మహేశ్, అంజలి పాత్రల చుట్టూ నడుస్తుంది. ఈ సినిమా తర్వాత అంజలి తెలుగులో పెద్ద రేంజ్ హీరోయిన్ అవుతుంది.

Monday, July 2, 2012

ఎవరైనా చిన్న సినిమా అంటే నరికేస్తా


"ఎవరైనా చిన్న సినిమా అంటే నరికేస్తాను. ఎవరిది పెద్ద సినిమా? ఎవరు పెద్ద? సక్సెస్ ఈజ్ ద బిగ్. సక్సెస్ కంటే పెద్ద సినిమా మరోటి లేదు'' అని వ్యాఖ్యానించారు నూట యాభై చిత్రాల దర్శకుడు డాక్టర్ దాసరి నారాయణరావు. ఆదివారం ప్రసాద్ ల్యాబ్స్ ప్రివ్యూ థియేటర్‌లో జరిగిన 'ఈ రోజుల్లో' వంద రోజుల వేడుకలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. "నాకు తెలిసి ఈ ఆరేడు సంవత్సరాల్లో నా మనసుకు నచ్చినవి మూడే మూడు సినిమాలు. ఒకటి 'బొమ్మరిల్లు', తర్వాత 'అలా మొదలైంది', ఇప్పుడు 'ఈ రోజుల్లో'. ఈ సినిమా కోసం ఒక్క వారానికే థియేటర్లు బుక్ చేశారు. 'ఇది వంద రోజులు ఆడుతుంది, ఆ ఫంక్షన్‌కి నేనొస్తాన'ని చెప్పాను. సినిమాని నేను ప్రేక్షకుడిగానే చూస్తా. సినిమాలో ఏడుపు సీన్లుంటే నా కళ్లవెంట నీళ్లొస్తాయి. నవ్వు సీన్లొస్తే చంటి పిల్లాడిలా నవ్వుతాను. నేను బడ్జెట్ గురించి మాట్లాడటం లేదు. ఆ రోజుల్లో కేవలం రూ. లక్షతో పాటలు లేకుండా, అక్కడక్కడా తప్పితే మాటలు కూడా లేకుండా తీసిన 'నీడ' పెద్ద సినిమానా? చిన్న సినిమానా? 110 రోజులాడింది. ప్రేక్షకులు ఏ సినిమాని ఆదరిస్తారో అదే పెద్ద సినిమా. ఎక్కువ డబ్బు ఖర్చుపెట్టి తీసిన సినిమానో, అమెరికాలో షూటింగ్ చేసిన సినిమానో పెద్ద సినిమా కాదు. 'ప్రేమాభిషేకం' కంటే పెద్ద హిట్టు లేదు. దానికి ఊటీ కూడా వెళ్లలేదు. పాటలన్నీ విజయా గార్డెన్స్‌లోనే తీశాను. వాటికంటే గొప్ప సాంగ్స్ ఉన్నాయా, ఈ మధ్య వచ్చే సినిమాల్లో. ఈ రోజు కోట్లు గురించి మాట్లాడుతున్నారు. 'ఒసేయ్ రాములమ్మా' సినిమా నేల టిక్కెట్టు రూ. రెండు, పై టిక్కెట్లు రూ. 10 ఉన్న రోజుల్లో రూ. 22.5 కోట్లు వసూలు చేసింది. ఇవాళ రేట్ల ప్రకారం లెక్కేస్తే రూ. 220 కోట్లు అవుతాయి. రికార్డుల గురించి కాదు మాట్లాడుకోవాల్సింది, సినిమాల గురించి. 'ఈ రోజుల్లో' సినిమాలో కథలేదు. నిత్య జీవిత సత్యాలున్నాయి. ఒక అబ్బాయిని ఒక అమ్మాయి ఎలా వాడేసుకుంటుంది, ఎలా తీసి అవతల పారేస్తుంది, ఎలా నాకేస్తుంది.. ఇదీ ఇందులో ఉంది. ఇవాళ ఏదైతే యూత్‌లో నడుస్తుందో, సమ సమాజంలో ఏం జరుగుతోందో.. దాన్ని వడపోసి, చక్కని స్క్రీన్‌ప్లేతో తీశాడు మారుతి. 'ఈ రోజుల్లో' వంటివి పది సినిమాలు వస్తే చాలు'' అని ఆయన చెప్పారు.
దిల్ రాజు మాట్లాడుతూ "చిన్న సినిమాలు తీసేవాళ్లకి ఇన్‌స్పిరేషన్ 'ఈ రోజుల్లో'. ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్ అవడానికి రాష్ట్రవ్యాప్తంగా ఎక్కువ థియేటర్లలో విడుదలయ్యేలా చేసి సహకారం అందించాను. అన్ని తరగతుల ప్రేక్షకులు చూస్తే ఇంకా ఎక్కువగా రెవెన్యూ సాధించాల్సిన సినిమా'' అన్నారు. కేవలం 'ఈ రోజుల్లో' సక్సెస్‌ని మాత్రమే కాక దాని వెనుక ఉన్న ప్లానింగ్, కృషిని కూడా ఇన్‌స్పిరేషన్‌గా తీసుకోవాలని నిర్మాత కె. అచ్చిరెడ్డి సూచించారు. ఈ సినిమాకి పెట్టిన ఖర్చునీ, వచ్చిన కలెక్షన్లనూ చూస్తే ఇండస్ట్రీ రికార్డ్ అని చెప్పాలని నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్నకుమార్ చెప్పారు.
నిర్మాతల్లో ఒకరైన ఎస్.కె.ఎన్. మాట్లాడుతూ "రచయిత స్వామిని దర్శకుడిగా పరిచయం చేస్తూ రెండో సినిమా తియ్యబోతున్నాం. మేం తెలుగు ఆర్టిస్టులు, టెక్నీషియన్లతోనే సినిమాలు తీస్తాం'' అన్నారు. దర్శకుడు మారుతి మాట్లాడుతూ "డబ్బులున్నంత మాత్రాన సినిమాలు తియ్యకూడదు. సినిమాని ప్రేమించి తియ్యాలి. అప్పుడే సక్సెస్ వస్తుంది. దాసరిగారి చేతులమీదుగా వంద రోజుల షీల్డు అందుకోవడం నా జీవితంలో జరిగిన అద్భుతం. ఇప్పుడు నా కథని నమ్మి బెల్లంకొండ సురేశ్ 'బస్‌స్టాప్' నిర్మిస్తున్నారు. అది పెద్దలు, పిల్లలు కూడా చూసి ఆనందించే పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రం'' అని చెప్పారు.
ఈ సందర్భంగా ఈ సినిమా యూనిట్ సభ్యులు, డిస్ట్రిబ్యూటర్లకు దాసరి నారాయణరావు, తమ్మారెడ్డి భరద్వాజ్ వంద రోజులు షీల్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు బెల్లకొండ సురేశ్, ఎం.ఎల్. కుమార్‌చౌదరి, బి.ఎ. రాజు, సురేశ్ కొండేటి, దర్శకుడు రవికుమార్‌చౌదరి, రచయిత సంజీవి, మల్టీడైమన్షన్ ఎంటర్‌టైన్‌మెంట్ వాసు, డాక్టర్ దశరథరామిరెడ్డి, హీరోలు శ్రీ, సాయి, హీరోయిన్ రేష్మా, నిర్మాత శ్రీనివాస్, సినిమాటోగ్రాఫర్ ప్రభాకరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Monday, June 25, 2012

జూలైలో 'తూనీగ.. తూనీగ'

తన కుమారుడు సుమంత్ అశ్విన్‌ను హీరోగా పరిచయం చేస్తూ నిర్మాత ఎం.ఎస్.రాజు దర్శకత్వం వహిస్తున్న 'తూనీగ..తూనీగ' చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. దిల్ రాజు సమర్పణలో పద్మిని ఆర్ట్స్ పతాకంపై మాగంటి రామ్‌చంద్రన్ (రాంజీ) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా గురించి సమర్పకుడు రాజు మాట్లాడుతూ ' హై టెక్నికల్ వాల్యూస్‌తో యూత్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ప్రేమకథల్లో ఓ సరికొత్త కోణాన్ని ఆవిష్కరిస్తూ ఎం.ఎస్.రాజుగారు తీసిన ఈ చిత్రం 2012 టాప్ హిట్ మూవీస్‌లో ఒకటిగా నిలవడం ఖాయం. హీరోగా సుమంత్ అశ్విన్‌కు మంచి బిగినింగ్ లభించనుంది. ఇటీవల విడుదలైన ఆడియోకు మంచి స్పందన లభించింది. త్వరలోనే అగ్రహీరోల సమక్షంలో ప్లాటినం డిస్క్ ఫంక్షన్‌ని నిర్వహిస్తాం.జూలైలో సినిమాను విడుదల చేస్తాం' అన్నారు. రియా కథానాయికగా నటించిన ఈ చిత్రానికి మాటలు: పరుచూరి బ్రదర్స్, సంగీతం: కార్తీక్‌రాజా, ఫొటోగ్రఫీ: ఎస్.గోపాలరెడ్డి, పాటలు: సిరివెన్నెల, ఎడిటింగ్: కె.వి.కృష్ణారెడ్డి, కళ: వివేక్.

Saturday, December 10, 2011

రాంచరణ్ 'ఎవడు'

రాంచరణ్ కథానాయకుడిగా 'ఎవడు' అనే చిత్రం షూటింగ్ లాంఛనంగా ప్రారంభమైంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకుడు. సమంత ఓ హీరోయిన్ కాగా, మరో హీరోయిన్ ఎంపిక జరుగుతోంది. అల్లు అర్జున్ అతిథి పాత్ర చేయబోతున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. ప్రసాద్ ల్యాబ్స్‌లో డిసెంబర్ 9న జరిగిన కార్యక్రమంలో రాంచరణ్‌పై చిత్రీకరించిన తొలి సన్నివేశానికి చిరంజీవి క్లాప్‌నివ్వగా, సీనియర్ నిర్మాత అల్లు అరవింద్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. దీనికి మరో నిర్మాత శ్యాంప్రసాద్‌రెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ "దర్శకుడు వంశీ చెప్పిన పాయింట్ ఎగ్జయిట్ చేసింది. ఆ కథవిని చిరంజీవి గారు, రాంచరణ్ కూడా అంతే ఎగ్జయిట్ అయ్యారు. కమర్షియల్ సినిమాల్లో కొత్త యాంగిల్ ఉన్న చిత్రం. జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుతాం. తెలుగుతో పాటు తమిళంలోనూ ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం. ఇది అన్ని రకాల ఎమోషన్స్ ఉన్న యాక్షన్ ఎంటర్‌టైనర్'' అన్నారు.
సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ "చరణ్‌తో, వంశీ పైడిపల్లితో ఇది నాకు తొలి చిత్రం. స్క్రిప్టు చాలా బాగా వచ్చింది. మంచి ఆడియో ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నా'' అని చెప్పారు. దర్శకుడు వంశీ పైడిపల్లి మాట్లాడుతూ "కథ విన్న రోజే చిరంజీవిగారు, చరణ్ ఓకే చేశారు. ఇది నాకు మూడో చిత్రం. అన్నీ దిల్ రాజు బేనర్‌లో చేసినవే. దేవిశ్రీ మంచి బాణీలిచ్చాడు. మంచి టీమ్ కుదిరింది'' అన్నారు. ఇది కమర్షియల్ యాంగిల్‌లో కచ్చితంగా కొత్త సినిమా అని కథా రచయిత వక్కంతం వంశీ చెప్పారు.
రాంచరణ్ మాట్లాడుతూ "దిల్ రాజు ఏమిటనేది ఆయన సినిమాలే మాట్లాడతాయి. ముఖ్యమైన అతిథి పాత్ర చేయడానికి బన్నీ చేయడానికి ఒప్పుకోవడం వల్లే ఈ సినిమా త్వరగా మొదలైంది. 'ప్రస్థానం' చూసి సాయికుమార్ అభిమానినైపోయా. ఆయనతో కలిసి పనిచేస్తున్నందుకు సంతోషంగా ఉంది'' అన్నారు. సాయికుమార్ మాట్లాడుతూ "ఈ సినిమా విషయంలో ఎంతో ఉత్సుకతతో ఉన్నా. 2012లో నాకు ఈ సినిమా పెద్ద బ్రేక్‌నిస్తుంది'' అని చెప్పారు.
అబ్బూరి రవి మాటలు రాస్తున్న ఈ చిత్రానికి కథా సహకారం: హరి, ఛాయాగ్రహణం: చోటా కె. నాయుడు, కళ: ఆనంద్‌సాయి, సహ నిర్మాతలు: శిరీశ్, లక్ష్మణ్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వంశీ పైడిపల్లి.

Saturday, November 19, 2011

ఇంటర్‌వ్యూ: సిద్ధార్థ్

కుర్రాళ్లు కాలేజీ ఎగ్గొట్టి 'ఓ మై ఫ్రెండ్' చూస్తున్నారు




"యువతకి ఈ సినిమా బాగా ఎక్కేసింది. కాలేజీకి ఎగ్గొట్టి మరీ చూస్తున్నారు'' అని చెప్పారు సిద్ధార్థ్. ఆయన హీరోగా వేణుశ్రీరామ్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై రాజు, శిరీశ్, లక్ష్మణ్ నిర్మించిన 'ఓ మై ఫ్రెండ్' ఇటీవల విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సందర్భంగా సిద్ధార్థ్ చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే...
'బొమ్మరిల్లు'లాంటి సినిమా తర్వాత దిల్‌రాజు బేనర్‌లో నేను చేసిన సినిమా కాబట్టి కచ్చితంగా అంచనాలుంటాయి. డైరెక్టర్ వేణు నా కోసం రెండేళ్లు ఎదురుచూశాడు. అంతకాలం ఎదురు చూడాలంటే గట్స్ ఉంటాలి. ప్రధాన పాత్రకు నేనే కావాలని నా మీద నమ్మకం పెట్టాడు. రాజు కూడా నాతోనే దీన్ని తీయాలనుకున్నాడు. ఇది ఒక హీరో సినిమా కాదు. నాలుగు కేరక్టర్ల సినిమా. నిజమైన స్నేహం, నిజమైన ప్రేమ గురించి దీనిలో చెప్పాం. దాన్ని ప్రజలు ప్రశంసిస్తున్నారు.
ఫ్యామిలీల్లోకి వెళ్లాలి
యువతకి ఈ సినిమా బాగా ఎక్కేసింది. కాలేజీకి ఎగ్గొట్టి మరీ చూస్తున్నారు. హైదరాబాద్‌లో ఐదు థియేటర్లకు వెళ్లి చూశాం. ఎక్కువగా కనిపించింది కాలేజీ కుర్రాళ్లే. ఇక ఈ సినిమా వెళ్లాల్సింది ఫ్యామిలీల్లోకి. అది కూడా జరుగుతుంది. ప్రస్తుతం వాళ్లు కూడా థియేటర్లలో కనిపిస్తున్నారు. డిస్ట్రిబ్యూటర్లు అందరూ రెవెన్యూపరంగా సంతోషంగా ఉన్నారు.
20 నిమిషాలే బలం
కొత్తగా ఈ సినిమాలో ఏముంది అనేవాళ్లకి నా సమాధానం ఒక్కటే. ప్రపంచంలో ఏడు కథలే ఉన్నాయంటారు. ఎవరు చెప్పినా వాటిలోంచి తిప్పితిప్పి చెప్పాల్సిందే. ఈ సినిమాకి సంబంధించి చివరి 20 నిమిషాలే బలం. అలాంటి క్లైమాక్స్‌ని ఇప్పటిదాకా ఏ సినిమాలోనూ తియ్యలేదు. వేణు ఓ సున్నితమైన పాయింట్ బాగా డీల్ చేయగలిగాడు. స్నేహితులుగా ఉన్న ఓ అబ్బాయి, ఓ అమ్మాయి చివరివరకు తమ అనుబంధాన్ని అలాగే కొనసాగించలేరా... అనే పాయింట్‌ని గొప్పగా చెప్పారు. ఇప్పటివరకు తెరమీద ప్రకాశ్‌రాజ్, నేను తండ్రీకొడుకులుగా బాగా సరిపోయాం. ఈ సినిమాలో నా తండ్రిగా తనికెళ్ల భరణి బ్రహ్మండంగా చేశారు. క్లైమాక్స్‌లో ఆయన సంభాషణలు చెప్పిన విధంగానీ, ఆయన హావభావాలు కానీ అత్యుత్తమం.
లక్కీ గర్ల్ హన్సిక
నేను, నవదీప్, శ్రుతిహాసన్ మొదటే ఫైనలైజ్ అయినా హన్సిక ఆ పాత్రకి చివరగా ఎంపికైంది. ఆమెకి ఈ ఏడాది తెలుగులో 'కందిరీగ', తమిళంలో 'వేలాయుధం' వంటి హిట్స్ వచ్చాయి. ఆమె ఈ సినిమాకి లక్కీ అవుతుందనుకున్నా. అలాగే అయ్యింది. శ్రుతి, నవదీప్ తమ పాత్రల్లో ఒదిగిపోయారు.
నాలుగు భాషా చిత్రాలు
2012 నాకు మరపురాని సంవత్సరం కాబోతోంది. నాలుగు భాషలు - తెలుగు, తమిళ, హిందీ, ఇంగ్లీష్‌లో నా సినిమాలు రాబోతున్నాయి. హిందీలో డేవిడ్ ధావన్ దర్శకత్వంలో చేస్తున్న 'చష్మే బద్దూర్', ఇంగ్లీష్‌లో దీపా మెహతా డైరెక్షన్‌లో చేస్తున్న 'విండ్స్ ఆఫ్ చేంజ్' వచ్చే ఏడాది రాబోతున్నాయి. దీపాతో పనిచేయడం గ్రేట్ ఎక్స్‌పీరియెన్స్. ఆమె పర్‌ఫెక్షనిస్ట్. బుకర్ ఆఫ్ బుకర్స్‌గా ప్రశంసలు పొందిన సల్మాన్ రష్డీ నవల 'మిడ్‌నైట్ చ్రిల్డన్' ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాలో నిడివి పరంగా పెద్దది కాకపోయినా కథకి కీలకమైన పాత్ర చేస్తున్నా.

Tuesday, November 8, 2011

తొమ్మిదేళ్లు... తొమ్మిది మంది కొత్త దర్శకులు!

కొత్త దర్శకులంటే సిద్ధార్థ్‌కి మోజెక్కువ. అందుకే తొమ్మిదేళ్ల కెరీర్‌లో సరిగ్గా తొమ్మిది మంది కొత్త దర్శకులతో పనిచేశాడు. ఈ వరుసలో వస్తున్న అతడి తదుపరి సినిమా 'ఓ మై ఫ్రెండ్'తో కరీంనగర్‌కి చెందిన వేణుశ్రీరాం దర్శకునిగా పరిచయమవుతున్నాడు. ఇదే సినిమాతో కేరళకు చెందిన రాహుల్ రాజ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా పరిచయమవుతున్నాడు. ఇప్పటికే ఆడియో సక్సెస్ అవడంతో ఈ సినిమా విజయంపై సిద్ధుతో పాటు నిర్మాత దిల్ రాజు చాలా కాన్ఫిడెన్స్ వ్యక్తం చేస్తున్నాడు. తమ బేనర్‌లో ఎన్నో సక్సెస్‌ఫుల్ సినిమాలు వచ్చాయనీ, కానీ 'ఓ మై ఫ్రెండ్' గ్రేట్ ఫిల్మ్ అవుతుందనీ గొప్పగా చెప్పాడు. సిద్ధు విషయానికొస్తే అతడి 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా'తో ఫేమస్ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా డైరెక్టర్‌గా అవతారమెత్తి గ్రాండ్ సక్సెస్ కొట్టాడు. ఆ తర్వాత కాలంలో సిద్ధు నటించిన 'చుక్కల్లో చంద్రుడు' ద్వారా మణిరత్నం శిష్యుడు శివకుమార్, 'బొమ్మరిల్లు' ద్వారా భాస్కర్, 'కొంచెం ఇష్టం కొంచెం కష్టం' ద్వారా డాలీ, 'ఓయ్!'తో ఆనంద్ రంగా, 'బావ'తో రాంబాబు, 'అనగనగా ఓ ధీరుడు'తో సూర్యప్రకాశ్, '180'తో జయేంద్ర డైరెక్టర్లుగా పరిచయమయ్యారు. వీరిలో ప్రభుదేవా, భాస్కర్ మాత్రమే సక్సెసయ్యారు. '180' సినిమా కచ్చితంగా సక్సెస్ అవుతుందని సిద్ధు గట్టిగా నమ్మాడు. అయితే విమర్శకుల ప్రశంసలు పొందిన స్థాయిలో ఆ సినిమా ప్రేక్షకుల హృదయాల్ని గెలవలేకపోయింది. ఇప్పుడు 'ఓ మై ఫ్రెండ్'తోనైనా అతడికో హిట్టు వస్తుందేమో చూడాలి.

Thursday, October 27, 2011

న్యూస్: 'ఓ మై ఫ్రెండ్' మీదే సిద్ధు ఆశలు!

2006లో వచ్చిన 'బొమ్మరిల్లు' తర్వాత సిద్ధార్థ్‌కి చెప్పుకోదగ్గ సినిమా ఏది? ఏదీ లేదు. ఈ మధ్య కాలంలో అతను చేసిన సినిమాలు - 'ఆట' (యావరేజ్), 'కొంచెం ఇష్టం కొంచెం కష్టం' (యావరేజ్), 'ఓయ్' (డిజాస్టర్), 'బావ' (డిజాస్టర్), 'అనగనగా ఓ ధీరుడు' (ఫ్లాప్), '180' (యావరేజ్). ఇదీ అతడి ప్రస్థానం. తెలుగు హీరో అనిపించుకోడానికి ఏడేళ్లు పట్టిందని ఈమధ్య ఇంటర్వ్యూల్లో అతడు చెప్పాడు కానీ మన వాళ్లెవరూ అలా ఫీలవుతున్నట్లు కనిపించడం లేదు. ప్రస్తుతం తెలుగులో కోల్పోయిన ఇమేజ్‌ని తిరిగి తెప్పించుకోడానికి అతను కష్టపడుతున్నాడు. దిల్ రాజు రూపంలో అతగాడికి ఓ మంచి ఫ్రెండ్ దొరకడం అతడు చేసుకున్న భాగ్యం. అందుకే 'ఓ మై ఫ్రెండ్' సినిమాని సిద్ధార్థ్‌తో తీస్తున్నాడు రాజు. వేణు శ్రీరాం దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాలో సిద్ధార్థ్ 'క్లోజ్ ఫ్రెండ్' శ్రుతిహాసన్, హన్సిక హీరోయిన్లుగా నటించారు. నవదీప్ మరో కీలక పాత్ర చేశాడు. కొత్త మ్యూజిక్ డైరెక్టర్ రాహుల్ రాజ్ మ్యూజిక్ ఇచ్చిన ఈ సినిమా ఆడియో అక్టోబర్ 15న రిలీజైంది. పాటలు బాగానే ఉన్నాయని సంగీత ప్రియులు చెబుతున్నారు. ఈ సినిమాతో మరోసారి 'బొమ్మరిల్లు' మేజిక్‌ని రిపీట్ చేస్తానని నమ్ముతున్నాడు సిద్ధు. నిజానికి అది అతడికి చాలా అవసరం కూడా. ఎందుకంటే 'ఓ మై ఫ్రెండ్' కూడా ఆడకపోతే తెలుగులో అతడి కెరీర్ నిజంగా కష్టాల్లో చిక్కుకున్నట్లే. నవంబర్లోనే ఈ సినిమా రిలీజవుతున్నందున అతడి భవిష్యత్ ఏమిటో అప్పుడు తేలనున్నది.

Sunday, August 7, 2011

న్యూస్: తండ్రి తమిళంలో.. తనయ తెలుగులో!

కమల్‌హాసన్ ముద్దుల తనయ శ్రుతి హాసన్ ఇప్పుడు తెలుగులో హాట్ హీరోయిన్. 'అనగనగా ఓ ధీరుడు' చిత్రంలో కళ్లు చెదిరే రూప లావణ్యాలతో కనిపించిన ఆమెని చూసి ప్రేక్షకుల కంటే ఎక్కువగా ఫ్లాటైపోయారు మన హీరోలు. అందుకే ఆమెని తమ సరసన బుక్ చేసుకోవడానికి తాపత్రయపడుతున్నారు. అయితే శ్రుతి మాత్రం అంత ఆరాటం చూపడం లేదు. పాత్రలు, సినిమాల విషయంలో చాలా సెలక్టివ్‌గా వ్యవహరిస్తూ వస్తోంది. ప్రస్తుతం ఆమె రెండు సినిమాలు చేస్తోంది. వాటిలో ఒకటి తన ప్రియుడు సిద్ధార్థ్ సరసన చేస్తున్న 'ఓ మై ఫ్రెండ్' కాగా, మరొకటి ఎన్టీఆర్ సరసన చేస్తున్న ఇంకా పేరుపెట్టని సినిమా. వీటిలో మొదటి సినిమాని దిల్ రాజు నిర్మిస్తుండగా, వేణు శ్రీరాం దర్శకునిగా పరిచయమవుతున్నాడు. ఈ సినిమాలో మరో బ్యూటీ హన్సికతో కలిసి స్క్రీన్ పంచుకుంటోంది శ్రుతి. నిజానికి ఈ పాత్ర మొదట వచ్చింది తనకేననీ, అయితే సిద్ధార్థ్ రికమెండ్ చేసి మరీ శ్రుతిని రప్పించుకున్నాడనీ నిత్యమీనన్ బాంబు పేల్చింది. ఇక ఎన్టీఆర్ సినిమాని డైరెక్ట్ చేస్తోంది ఓటమి ఎరుగని బోయపాటి శ్రీను. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాత. ఈ రెండు సినిమాలతో పాటు త్వరలో ప్రారంభం కానున్న పవన్ కల్యాణ్ సినిమా 'గబ్బర్‌సింగ్'లోనూ ఆమె నటించనున్నదని ప్రచారం జరుగుతోంది. అయితే ఆ సినిమా ఇంకా కన్ఫర్మ్ కావాల్సి ఉంది. ఏదేమైనా తండ్రి తమిళనాట టాప్ యాక్టర్ కాగా, తనయ అక్కడ కంటే తెలుగులోనే క్రేజ్ తెచ్చుకోవడం చిత్రమే!

Friday, July 8, 2011

న్యూస్: ఆ రెండింటితో ఎన్టీఆర్ టాప్ హీరో అయ్యేనా?

కొడాలి నాని తెలంగాణ వ్యతిరేక వ్యాఖ్యల కారణంగా 'అదుర్స్' సినిమా నైజాంలో నష్టపోవడం, దిల్ రాజు చెప్పిన రేంజిలో 'బృందావనం' హిట్టు కాకపోవడం, ఇక ఈ యేడాది విడుదలైన 'శక్తి' డిజాస్టర్ కావడంతో చిన్న ఎన్‌టీఆర్ మాంచి కసి మీదున్నాడు. ఎలాగైనా ఈసారి భారీ హిట్ కొట్టాలని తపిస్తున్నాడు. ప్రస్తుతం అతను రెండు సినిమాలు చేస్తున్నాడు. వాటిలో ఒకటి సురేందర్‌రెడ్డి డైరెక్షన్‌లో చేస్తున్న 'ఊసరవెళ్లి' కాగా, మరోటి బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో చేస్తున్న పేరుపెట్టని చిత్రం. 'ఊసరవెళ్లి' షూటింగ్ యమ స్పీడుగా జరుగుతోంది. ఎలాగైనా దసరా సెలవులకి, అంటే సెప్టేంబర్ చివరకి 'ఊసరవెల్లి'ని ప్రేక్షకుల మధ్యకి తీసుకు రావాలని నిర్మాతలు కృషి చేస్తున్నారు. ఇందులో ఎన్‌టీఆర్ జోడీగా నేటి క్రేజీ హీరోయిన్ తమన్నా నటిస్తోంది. 'కిక్' వంటి హిట్ తర్వాత సురేందర్‌రెడ్డి తీస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక ఇంతకంటే ఎక్స్‌పెక్టేషన్స్ ఎక్కువ ఉన్న సినిమా క్రియేటివ్ కమర్షియల్స్ నిర్మిస్తున్న సినిమా. కారణం వరుసగా మూడు హిట్ సినిమాల్ని (భద్ర, తులసి, సింహా) డైరెక్ట్ చేసిన బోయపాటి శ్రీను దీనికి దర్శకుడు కావడం. పైగా ఇందులో హీరోయిన్ శృతీహాసన్. ఈ రెండు క్రేజీ ప్రాజెక్టులతో తను టాప్ లీగ్‌లోకి మళ్లీ వస్తాననే నమ్మకం ఎన్‌టీఆర్‌లో నిండుగా కనిపిస్తోంది.

Monday, May 16, 2011

న్యూస్: 'చరణ్-అర్జున్' గురించి రాయకండి

ఈరోజు ఆంధ్రజ్యోతిలో 'చరణ్, అర్జున్ కాంబినేషన్' అంటూ ఓ న్యూస్ వచ్చింది. రెండు రోజుల క్రితం 'ఈనాడు'లో దీనికి సంబంధించి ఓ న్యూస్ వేశారు. అందులో రాంచరణ్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో గంటా శ్రీనివాస రావు (పీఆర్పీ ఎమ్మెల్యే) సినిమా తీయబోతున్నాడని రాశారు. దాంతో దిల్ రాజు పీఆర్వో కాల్ చేసి ఈనాడు వాళ్లు ఒక్క నిర్మాత పేరే రాశారనీ, దిల్ రాజు కూడా మరో నిర్మాతనీ చెప్పి, ఆయన చెప్పినట్లుగా కాకుండా మాకు తెలిసిందన్నట్లు రాయమన్నాడు. మేం ఓ రోజు గ్యాప్ తీసుకుని ఆ న్యూస్ కేరీ చేశాం. అదనంగా వచ్చే ఆగస్టులో అది మొదలవుతుందన్నాం. పోయినేడాదే గీతా ఆర్ట్స్ బేనర్ 'చరణ్-అర్జున్' అనే టైటిల్ రిజిస్టర్ చేసిన సంగతీ తెలిపాం. ఈ రోజు ఆ న్యూస్ వచ్చాక గీతా ఆర్ట్స్ పీఆర్వో నుంచి ఎస్సెమ్మెస్ వచ్చింది. తాము చెప్పేదాకా 'చరణ్-అర్జున్' సినిమా గురించి ఏమీ రాయవద్దనీ, దయచేసి సహకరించమనీ దాని సారాంశం.

Thursday, November 25, 2010

ఫోకస్: నిలిచే తార ఎవరు? (చివరి భాగం)

'దేవదాసు'తో ఇలియానా పేరు ఎలా మారుమోగిందో, అలాగే 'ఝుమ్మంది నాదం'తో తాప్సీ పేరు ప్రచార మాధ్యమాల్లో మోగిపోయింది. సహజంగానే ఆమెతో సినిమాలు చేసేందుకు నిర్మాతలు బారులు తీరారు. ప్రస్తుతానికైతే ఆమె మూడు సినిమాలు చేస్తోంది. ఒకటి ప్రభాస్‌తో దిల్ రాజు నిర్మిస్తోన్న సినిమా, రెండోది విష్ణుతో మోహన్‌బాబు నిర్మిస్తోన్న 'వస్తాడు నారాజు', మూడోది రవితేజ సినిమా 'వీర'. వచ్చే ఏడాది ఆమె డైరీలో ఖాళీ లేదనేది సమాచారం.
ఈ ఇద్దరితో పాటు మరో తార కూడా నేను సైతం అంటూ ముందుకొస్తోంది. ఆమె శేఖర్ కమ్ముల రూపొందించిన 'లీడర్' ద్వారా నాయికగా పరిచయమైన బెంగాలీ భామ రిచా గంగోపాధ్యాయ్. గతంలో శేఖరే పరిచయం చేసిన 'ఆనంద్'తో పరిచయమైన మరో బెంగాలీ తార కమలినీ ముఖర్జీ ఆ సినిమా తర్వాత అనుకున్న మేర రాణించని నేపథ్యంలో రిచా ఎలా నెగ్గుకొస్తుందో చూడాలి. 'లీడర్'లో ఫర్వాలేదనిపించిన ఆమె, రెండో సినిమాలోనే రవితేజ వంటి స్టార్ హీరోతో నటించే అవకాశం దక్కించుకుంది. ఆ సినిమా పేరు 'మిరపకాయ్'. హరీశ్ శంకర్ దర్శకుడు. కొత్త తారల్లో అందంతో పాటు కొద్దో గొప్పో అభినయ సామర్థ్యం వున్న తార మధురిమ. 'ఆ ఒక్కడు' అనే సినిమాలో తన నటనతో మెప్పించిన ఆమె ఇటీవల వంశీ సినిమా 'సరదాగా కాసేపు'లో నరేశ్‌కి జోడీగా ఆకట్టుకుంది. అయితే ఆమెకి చిత్రసీమ ఏమేరకు అవకాశాలు కల్పిస్తుందనే దానిపైనే ఆమె భవితవ్యం ఆధారపడి వుంది.
ఇక తెలుగు తారల సంగతికొస్తే, వారిలో ఏ ఒక్కరూ కొన్నాళ్లపాటైనా ప్రేక్షకుల్లో ఆదరణ నిలుపుకుంటారని చెప్పలేని స్థితి. 'నచ్చావులే'తో మెరిసిన మాధవీలత ఇమేజ్ ఆ తర్వాత ఒక్కసారిగా మసకబారిపోయింది. ఇప్పుడామెని తలచుకుంటున్నవాళ్లే లేరు. 'అష్టాచమ్మా'లో ముద్దు ముద్దు మాటలతో ఆకట్టుకున్న స్వాతికి స్టార్ ఇమేజ్ రావడం కష్టమే. 'ఆవకాయ్ బిర్యానీ' చేదుగా మారినా, 'బంపర్ ఆఫర్'తో ఓ మోస్తరుగా రాణించిన బిందుమాధవికి సరైన అవకాశాలు లేవు. మిగతావాళ్లకి ఆ మాత్రం పేరు కూడా లేదు. ఏదేమైనా హీరోతో పాటు హీరోయిన్ పాత్రకీ కథలో ప్రాధాన్యత ఉంటేనే నాయికలు ఎక్కువకాలం పరిశ్రమలో నిలుస్తారు. అందుకు హీరోలు, దర్శకులు, రచయితలు పెద్ద మనసు చేసుకోవాలి. (అయిపోయింది)

Sunday, November 14, 2010

సినిమా: 'రెడీ' తర్వాత రాం ఎక్కడ?

'రెడీ' తర్వాత రాంకి ఇంతదాకా హిట్టులేదు. ఇప్పటివరకు ఆరు సినిమాలు చేసిన అతడికి దక్కింది రెండు హిట్లే. వాటిలో ఒకటి తొలి సినిమా 'దేవదాసు' అయితే, ఇంకోటి శ్రీను వైట్ల డైరెక్ట్ చేసిన 'రెడీ'. ఈ రెంటి మధ్యలో వచ్చిన 'జగడం'తో పాటు 'రెడీ' తర్వాత వచ్చిన 'మస్కా', 'గణేష్', 'రామరామ కృష్ణకృష్ణ' సినిమాలు ఫ్లాపయ్యాయి. ఈ ఫ్లాపయిన సినిమాలన్నీ పేరుపొందిన వాళ్లు తీసినవే కావడం గమనించాలి.
'జగడం'ని డైరెక్ట్ చేసింది 'ఆర్య' ఫేం సుకుమార్. 'మస్కా'ని నిర్మింది ఎమ్మెస్ రాజు అయితే, డైరెక్త్ చేసింది బి. గోపాల్. 'గణేష్' ప్రొడ్యూసర్ స్రవంతి రవికిశోర్ కాగా, 'రామరామ కృష్ణకృష్ణ' నిర్మాత దిల్ రాజు. ఈ క్రేజీ ప్రాజెక్టులన్నీ బోల్తా కొట్టడంతో 'రెడీ' టైంలో ఆకాశంలోకి చూసిన రాం నేలమీదికి దిగొచ్చాడు. సినీ రంగంలో జయాపజయాలకి ఎవరూ అతీతులు కాదనే సంగతి అనుభవంలోకి వచ్చాక అతని ప్రవర్తనలో కాస్త మార్పు వచ్చింది. 'రెడీ' మత్తులో ఉన్నంత కాలం ఎదుటివాళ్లతో అతడు ఎలా ప్రవర్తించిందీ చాలామందికి అనుభవమే. ఇప్పుడు అతడు కాస్త పరిణతితో వ్యవహరిస్తున్నాడని చెప్పుకుంటున్నారు. సబ్జెక్టుల విషయంలో అలాంటి పరిణతితో వ్యవహరిస్తే మళ్లీ అతడు హిట్ల బాటలోకి వస్తాడనేది చాలామంది అభిప్రాయం.
ప్రస్తుతం అతడు 'కందిరీగ' అనే సినిమా చేస్తున్నాడు. బెల్లంకొండ సురేశ్ నిర్మిస్తోన్న ఈ సినిమా ద్వారా సినిమాటోగ్రాఫర్ సంతోష్ శ్రీనివాస్ డైరెక్టర్‌గా పరిచయమవుతున్నాడు. అతను 'ఖతర్నాక్', 'రెయిన్‌బో', 'నీ నవ్వే చాలు' వంటి ఫ్లాప్ సినిమాలకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశాడు. 'కందిరీగ'ని అతడెలా హ్యాండిల్ చేస్తాడో చూడాలి. ఇందులో హన్సిక హీరోయిన్. 'మస్కా' తర్వాత రాం, హన్సిక కలిసి చేస్తున్న సినిమా ఇది. 'కందిరీగ'తోనైనా రాం కెరీర్ గాడిన పడుతుందా?

Saturday, November 13, 2010

సినిమా: 'బృందావనం' హిట్టేనా?

ఎన్.టి.ఆర్. హీరోగా నటించిన 'బృందావనం' హిట్టేనా? హిట్టయ్యిందని అందరూ అనుకునేలా చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయా? పరిశీలనగాచూస్తే రెండోదే నిజమనిపిస్తోంది. విడుదలైనప్పుడు ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది. 'కొమరం పులి', 'ఖలేజా' సినిమాలు ఫ్లాప్ కావడంతో 'రోబో' ప్రభంజనాన్ని 'బృందావనం' అడ్డుకుంటుందని విశ్లేషకులు భావించారు. చిత్రంగా ఆశించిన రీతిలో ఓపెనింగ్స్‌ని రాబట్టడంలో 'బృందావనం' విఫలమైంది. దాంతో నిర్మాత దిల్ రాజు సినిమా ప్రమోషన్ మీద ఎక్కువ దృష్టిపెట్టి ఊకదంపుడు ప్రచారం సాగిస్తూ వచ్చారు. ఏ చానల్ చూసినా ఈ సినిమా గురించిన ప్రకటనలూ, ప్రచారమే. ఈ యేడాది 'టాప్ 3' సినిమాల్లో 'బృందావనం' ఉంటుందని తానన్న మాటల్ని నిజం చేయాలనే తాపత్రయమే ఆయనలో కనిపిస్తూ వచ్చింది.
నిన్నటికి నిన్న ఈ సినిమా ఆడియో ట్రిపుల్ ప్లాటినం డిస్క్ ఫంక్షన్లో "ఈ సినిమా ఈ యేడాది టాప్ 3లో నిలిచింది' అని చెప్పడం దీన్నే సూచిస్తోంది. అలాగే నైజాంలో టాప్ 5గా నిలిచిందని కూడా ఆయనన్నారు. పైరసీ లేకుండా ఉన్నట్లయితే టాప్ 1గా నిలిచేదని ఆయన ఆక్రోశించారు.
కానీ అదే పైరసీని తట్టుకొని 'రోబో' సూపర్ కలెక్షన్లని సాధించిన సంగతిని ఆయన కావాలనే విస్మరించారు. ఏదేమైనా నైజాం, వైజాగ్ మినహాయించి మిగతా ఏరియాలకి ఈ సినిమాని కొన్న బయ్యర్లు అంత హ్యాపీగా లేరని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. లాభాల సంగతలా వుంచి నష్టాలు రాకుంటే అంతే చాలని వాళ్లు కోరుకుంటున్నారు.

Thursday, November 11, 2010

సినిమా: ప్రమాదంలో వరుణ్ సందేశ్ కెరీర్!

'హ్యాపీడేస్'తో ఘనంగా తెరంగేట్రం చేసి, 'కొత్త బంగారులోకం'తో తెలుగు చిత్రసీమలో బంగారు సోపానం వేసుకున్నట్లు కనిపించిన బక్క కుర్రాడు వరుణ్ సందేశ్ కెరీర్ అప్పుడే ప్రమాదంలో పడిపోయింది. తొలి రెండు సినిమాల తర్వాత అతను చేసిన నాలుగు సినిమాలు బాక్సాఫీసు వద్ద ఫట్‌మనడమే దీనికి కారణం. ఆ నాలుగు.. 'ఎవరైనా ఎపుడైనా', 'కుర్రాడు', 'మరో చరిత్ర', 'హ్యాపీ హ్యాపీగా'.
వీటిలో 'ఎవరైనా ఎపుడైనా' సినిమాని నిర్మించింది ప్రతిష్టాత్మక సంస్థ ఏవీఎం ప్రొడక్షన్స్. 'కుర్రాడు' తీసింది హిట్ సినిమాల నిర్మాణ సంస్థగా పేరొందిన ఆనంది ఆర్ట్ క్రియేషన్స్. 'మరో చరిత్ర'ని నిర్మించింది తాను పట్టిందల్లా బంగారమనే పేరు తెచ్చుకున్న దిల్ రాజు. వీటిలో 'మరో చరిత్ర' సినిమా మరీ దారుణంగా ఫ్లాపయ్యింది. 'హ్యాపీ హ్యాపీగా' సినిమాతో కచ్చితంగా హిట్టు కొడతానని ఎంతో కాన్ఫిడెన్సుతో వరుణ్ చెప్పిన మాటలు నిజంకాలేదు. ఆ సినిమాని కూడా ప్రేక్షకులు మరో ఆలోచన లేకుండా తిప్పికొట్టారు.
'హ్యాపీడేస్'తో యువత ఆరాధ్య తారగా మారిన అతని కెరీరు అంతలోనే ఇలా ప్రమాదంలో పడటం చిత్రమే. కొండంత ఆశతో చదువుని కూడా పణంగా పెట్టి అమెరికానుంచి వచ్చేసిన అతనికి తోడుగా అతని తండ్రి సైతం మంచి ఉద్యోగాన్ని వదులుకుని కొడుకు కోసం హైదరాబాద్ వచ్చేశాడు. వరుణ్ చేసే సినిమాల విషయంలో ఆయనదే ప్రముఖ పాత్ర. కానీ తన కొడుకు కెరీరుకి ఎలాంటి సినిమాలు పనికొస్తాయనే విషయంలో ఆయన జడ్జిమెంట్ సరిగా ఉండటం లేదనీ, అందుకే వరుణ్ క్రేజ్ వేగంగా మసకబారుతున్నదనీ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఈనెల 12న వస్తున్న 'ఏమైంది ఈవేళ' సినిమా మీదే అతని భవితవ్యం ఆధారపడి ఉంది. కాజల్ చెల్లెలు నిషా అగర్వాల్ నాయికగా నటించిన ఈ సినిమా ద్వారా సంపత్ నంది దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ సినిమా ఆడితేనే వరుణ్ మరికొంత కాలమైనా హీరోగా అవకాశాలు పొందుతాడు. లేదంటే.. చెప్పేదేముంది!

Thursday, November 4, 2010

ఫోకస్: 2010 ముగింపైనా సంతోషాన్నిస్తుందా? (మొదటి భాగం)

విజయాల కోసం మొహం వాచిపోతున్న తెలుగు చిత్ర పరిశ్రమ ఈ ఏడాది చివరినైనా సంతృప్తికరంగా ముగిస్తుందా? అనే ప్రశ్న అందరిలోనూ తలెత్తుతోంది. పేలవమైన ఆరంభాన్నిచ్చిన 2010లో ఇప్పటివరకు 'సింహా', 'డార్లింగ్', 'మర్యాదరామన్న', 'ఏమాయ చేసావె', 'వేదం', 'బిందాస్' వంటి అతికొద్ది సినిమాలు మాత్రమే ప్రేక్షకాదరణ పొందాయి. తాజాగా పరిటాల రవి జీవితంపై రాంగోపాల్ వర్మ రూపొందించిన 'రక్త చరిత్ర' విడుదలైన ఐదు రోజుల్లోనే రాష్ట్రవ్యాప్తంగా ఐదు కోట్ల రూపాయలకు మించి వసూలుచేసి, హిట్టుగా నిలిచింది. రజనీకాంత్ 'రోబో' సూపర్ డూపర్ హిట్టయినా అది మన సినిమా కాదు. ఈ పరిస్థితుల్లో నవంబర్, డిసెంబర్ నెలల్లో రానున్న కొన్ని సినిమాలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. వీటిలో సగమైనా విజయాలను సాధిస్తే చిత్రసీమ కాస్తంతయినా సంతోషాన్ని పొందుతుంది. ఆ ఆసక్తికర సినిమాలేమిటో చర్చించడమే ఈ వ్యాసం ముఖ్యోద్దేశం.
'ఆరెంజ్' మీదే అందరి చూపు
సందేహం అవసరం లేదు. ఈ రెండు నెలల్లో రాబోతోన్న సినిమాలన్నింటిలోకీ అత్యధిక శాతం ప్రేక్షకుల్లో ఎక్కువ ఆసక్తిని రేకెత్తిస్తోన్న చిత్రం 'ఆరెంజ్'. సంచలనాల 'మగధీర' తర్వాత రాంచరణ్ హీరోగా నటించిన సినిమా కావడంతో సహజంగానే ఈ సినిమా విషయంలో అటు ట్రేడ్ వర్గాల్లో, ఇటు సాధారణ ప్రేక్షకుల్లో అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన విశేషాల్లో ముఖ్యమైనవి.. దీన్ని భాస్కర్ డైరెక్ట్ చేయడం, నాయికగా జెనీలియా నటించడం, తొలిసారి రాంచరణ్ లవర్ బాయ్ గా కనిపించబోవడం. పైగా ఈ చిత్రాన్ని నిర్మించింది చిరంజీవి సొంత బేనర్ అయిన అంజనా ప్రొడక్షన్స్. ఈ సినిమా హిట్టయితే భాస్కర్ కి హ్యాట్రిక్ లభించినట్లవుతుంది. అతని మునుపటి సినిమాలు రెండు.. 'బొమ్మరిల్లు', 'పరుగు' విజయాల్ని సాధించాయి. అయితే లవ్ స్టోరీతో తయారైన 'ఆరెంజ్'కి నిర్మాణ వ్యయం అదుపుతప్పి పోయిందని వినిపిస్తోంది. గ్రాఫిక్స్ ప్రధానంగా భారీతనంతో నిర్మాణమైన 'మగధీర' చిత్రానికే 38 కోట్ల రూపాయలు ఖర్చయితే, సాఫ్ట్ లవ్ స్టోరీతో తీసిన 'ఆరెంజ్'కి దాదాపు 35 కోట్ల రూపాయలు ఖర్చయ్యిందని సమాచారం. మలేషియా, ఆస్ట్రేలియాల్లో ఎక్కువ భాగం షూటింగ్ జరగడం, పలు సన్నివేశాల్ని రీ షూట్ చేయడం వ్యయం అదుపు తప్పడానికి కారణమని తెలుస్తోంది. హారిస్ జయరాజ్ సంగీతం సమకూర్చగా ఇటీవలే విడుదలైన ఈ సినిమా పాటలు ప్రజాదరణ పొందాయి. నవంబర్ ప్రథమార్థంలో ప్రేక్షకుల ముందుకు వస్తోన్న ఈ చిత్రం ద్వారా షాజన్ పదంసీ అనే మోడల్ సెకండ్ హీరోయినుగా పరిచయమవుతోంది.
'గగనం'లో 'రగడ'
డిసెంబర్ మాసమంటే సీనియర్ స్టార్ హీరో నాగార్జునకి ఎంతో ఇష్టం. ఎందుకంటే ఆ నెలలో విడుదలైన ఆయన సినిమాలు అధిక శాతం విజయాన్నే చవిచూశాయి. 'మన్మథుడు', 'మాస్', 'కింగ్' వంటి సినిమాలు వాటిలో కొన్ని. ఆ సెంటిమెంట్ తోటే ఆయన సినిమా 'రగడ' డిసెంబర్ ద్వితీయార్థంలో విడుదలయ్యేందుకు సన్నద్ధమవుతోంది. మంచు మనోజ్ కి 'బిందాస్' రూపంలో తొలి విజయాన్ని అందించిన వీరు పోట్ల ఈ చిత్రానికి దర్శకుడు. 'సూపర్', 'డాన్' సినిమాల తర్వాత నాగార్జున సరసన ముచ్చటగా మూడోసారి అనుష్క నాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో రెండో నాయిక పాత్రని ప్రియమణి చేస్తోంది. కామాక్షి కళామూవీస్ పతాకంపై డి. శివప్రసాద్ రెడ్డి నిర్మిస్తోన్న ఈ చిత్రంలో నాగార్జున ఇటు వినోదం, అటు యాక్షన్ మేళవించిన పాత్రని చేస్తున్నారు. మునుపటి సినిమా 'కేడి' అట్టర్ ఫ్లాపవడంతో ఈ సినిమాని ఆయన ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. అయితే దీనికంటే ముందుగా ఆయన నటించిన మరో సినిమా నవంబరులోనే విడుదల కాబోతోంది. ఆ చిత్రం 'గగనం'. చెప్పాలంటే తెలుగులో ఇదో ప్రయోగాత్మక చిత్రం. 1999లో జరిగిన కాందహార్ హైజాక్ సంఘటన ఆధారంగా తయారుచేసిన కథతో ఈ సినిమాని డైరెక్టర్ రాధామోహన్ రూపొందించాడు. ఎయిర్ కమాండరుగా నాగార్జున నటించిన ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్, బ్రహ్మానందం కీలక పాత్రలు చేశారు. పాటలు లేని ఈ సినిమాలో నాగార్జున సరసన హీరోయిన్ కూడా కనిపించదు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రాబోతోంది. (ఇంకావుంది)