Showing posts with label bhanumathi. Show all posts
Showing posts with label bhanumathi. Show all posts

Saturday, April 26, 2014

Telugu Cinema After Independence

1947 తర్వాత తెలుగు సినిమా
ఈ శతాబ్దంలో దేశంలోనే అత్యంత ప్రాచుర్యం పొందిన, జనరంజకమైన మాధ్యమంగా సినిమా ఖ్యాతికెక్కింది. తొలినాళ్లలో అది ఓ కళా ప్రక్రియ అయితే ఇవాళ అది పక్కా వ్యాపార పరిశ్రమగా మారిపోయింది. స్వాతంత్ర్యానంతరం ఈ యాభైయ్యేళ్ల తెలుగు చలనచిత్ర రంగాన్ని ఓసారి పరిశీలిస్తే కళాఖండాలనదగ్గ చిత్రాలు పదికంటే ఎక్కువ కనిపించవు. తెలుగు సినిమా గురించి గొప్పగా చెప్పుకోవడానికి పనికొచ్చేది నిర్మాణమవుతున్న చిత్రాల సంఖ్య గురించే. హిందీ చిత్రాలకంటే అధిక సంఖ్యలో ప్రతి యేటా తెలుగులో సినిమాలు నిర్మితమవుతున్నాయి. వాటిలో విమర్శకి నిల్చునేవి అసలు ఉండటం లేదు. అయితే దేశం గర్వించదగ్గ నటులు, దర్శకులు మనకి ఉన్నారని చెప్పుకునే భాగ్యం మనకి లభించింది. దర్శకుల్లో ఎల్వీ ప్రసాద్, బి.ఎన్. రెడ్డి, నటుల్లో అక్కినేని నాగేశ్వరరావు సినిమా రంగంలో దేశానికి సంబంధించిన అత్యున్నత పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్నారు. చిత్తూరు నాగయ్య, ఎస్వీ రంగారావు, ఎన్టీ రామారావు వంటి మహానటులూ, రేలంగి, రమణారెడ్డి వంటి మహా కమెడియన్లూ, కాంచనమాల, కన్నాంబ, భానుమతి, సావిత్రి, సూర్యకాంతం వంటి మహా నటీమణులూ, గూడవల్లి రామబ్రహ్మం, సి. పుల్లయ్య, వేదాంతం రాఘవయ్య, కె.వి. రెడ్డి, కమలాకర కామేశ్వరరావు, ఆదుర్తి సుబ్బారావు, కె. విశ్వనాథ్ వంటి దిగ్దర్శకులూ మనకి లభించారు.
మొదట్లో - అంటే ఆరవ దశకం వరకు తెలుగులో పౌరాణిక చిత్రాలు, మాయా మంత్రతంత్రాల జానపద చిత్రాలే రాజ్యం చేశాయి. సామాజిక స్పృహతో తీసిన చిత్రాలు బహు తక్కువ. గూడవల్లి రామబ్రహ్మం తీసిన 'మాలపిల్ల', 'రైతుబిడ్డ' వంటివి అందుకు మినహాయింపు. అయితే 'దేవదాసు', 'పాతాళభైరవి', 'మాయాబజార్', 'మహాకవి కాళిదాసు' వంటి కళాఖండాలనదగ్గ చిత్రాలు వచ్చాయి. రామారావు, నాగేశ్వరరావు అగ్ర కథానాయకులుగా నిలిచారు. నటీమణుల్లో భానుమతి, సావిత్రి అగ్ర స్థాయికి చేరుకున్నారు. 1953లోనే 'చండీరాణి'కి దర్శకత్వం వహించిన భానుమతి తెలుగులో తొలి దర్శకురాలయ్యారు. 1951లో కె.వి. రెడ్డి దర్శకత్వంలో వచ్చిన 'పాతాళ భైరవి' బాక్సాఫీసు రికార్డుల్ని బద్దలు కొట్టి చరిత్ర సృష్టించింది. ఆ తర్వాత 1955లో తాపీ చాణక్య దర్శకత్వం వహించిన సామాజిక ప్రయోజనాత్మక చిత్రం 'రోజులు మారాయి' అఖండ విజయం సాధించి ఆ తరహా సినిమాలకు తలమానికంగా నిలిచింది.
స్వాతంత్ర్యానికి పూర్వం వ్యాపారాత్మక దృష్టితో తీసిన సినిమాలు మనకు కనిపించవు. 1950లో వచ్చిన విజయా వారి సినిమా 'షావుకారు'తో ఈ వ్యాపార పోకడలు మొదలయ్యాయని చెప్పుకోవచ్చు. ఈ సినిమాతో నటిగా పరిచయమైన జానకి, దానితోటే 'షావుకారు జానకి'గా మారిపోయారు. 1963లో తొలి తెలుగు వర్ణ చిత్రం 'లవకుశ' వచ్చింది. దీనికి పి. పుల్లయ్య దర్శకుడు. అప్పట్లో టిక్కెట్ ధరలు 25 పైసలు నుంచి ఒక రూపాయి ఉన్న కాలంలో ఈ సినిమా ఒక కోటి రూపాయలు వసూలు చేసి, ఆ ఘనత సాధించిన మొదటి తెలుగు సినిమాగా చరిత్ర పుటల్లో శాశ్వత స్థానం పొందింది. ఇదే ఏడాది రూపొందిన 'నర్తనశాల' అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన మొదటి తెలుగు చిత్రంగా పేరు తెచ్చుకుంది. జకార్తాలో జరిగి ఆఫ్రో ఏషియన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శితమైన ఈ సినిమాలో కీచకునిగా ఎస్వీ రంగారావు చూపించిన అభినయం ఆ ఫెస్టివల్ జ్యూరీ సభ్యుల్ని అమితంగా ఆకట్టుకుంది. అలా ఒక అంతర్జాతీయ సినిమా వేదికపై ఉత్తమ నటుడిగా అవార్డు పొందిన తొలి తెలుగు నటుడిగా చరిత్రలో నిలిచిపోయారు ఎస్వీఆర్.
తొలి సాంఘిక వర్ణ చిత్రం 1965లో వచ్చింది. అందరూ కొత్త తారలతో ఆదుర్తి సుబ్బారావు రూపొందించిన ఆ చిత్రం 'తేనె మనసులు'. అదివరకు 'పదండి ముందుకు'లో చిన్న పాత్రలో కనిపించిన కృష్ణ హీరోగా పరిచయమయ్యింది దానితోటే. అంతదాకా జానపద, పౌరాణిక, కుటుంబ కథా చిత్రాలు రాజ్యం చేస్తూ ఉంటే 'గూఢచారి 116'తో యాక్షన్ సినిమాల ట్రెండ్ మొదలైంది. కృష్ణ నటించిన ఈ సినిమా భారత చలన చిత్రసీమలోనే తొలి జేమ్స్‌బాండ్ తరహా సినిమాగా రికార్డులకెక్కింది. ఈ చిత్రకథ ఆరుద్ర కలం నుంచి వెలువడటం మరో విశేషం. ఆ తర్వాత కాలంలో ప్రేమకథా చిత్రాలు, యాక్షన్ సినిమాలు సమాన ఆదరణ పొందుతూ వచ్చాయి. ఏడవ దశకంలో వీటి జోరు ఎక్కువగా కొనసాగుతుండగానే పాశ్చాత్య సినిమా ప్రభావం తెలుగు సీమకీ సోకింది. దాంతో పగ, ప్రతీకారం అంశాలతో సినిమాలు తీయడం మొదలై, అవే సినిమాకి తప్పనిసరి వస్తువుల కింద మారిపోయాయి. అయినప్పటికీ 'కాలం మారింది' (1972), 'చలిచీమలు' (1978) వంటి అభ్యుదయ చిత్రాలూ, 'తూర్పు వెళ్లే రైలు' (1979), 'నీడ' (1979) వంటి ప్రయోగాత్మక చిత్రాలూ కొన్ని వచ్చాయి. మొట్టమొదటి కౌబాయ్ సినిమా 'మోసగాళ్లకి మోసగాడు' (1971) వచ్చింది. యాదృచ్ఛికంగా ఈ సినిమాకి రచన చేసింది కూడా ఆరుద్రే. ఇందులో హీరోగా నటించిన కృష్ణ 1974లో సొంత నిర్మాణ సంస్థ పద్మాలయా స్టూడియోస్ పతాకంపై 'అల్లూరి సీతారామరాజు' చిత్రాన్ని నిర్మించి ఆ పాత్రలో తానే నటించించాడు. ఇది తెలుగులో పూర్తిస్థాయి తొలి సినిమా స్కోప్ సినిమాగా చరిత్రకెక్కింది. స్వాతంత్ర్య పోరాట నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద ఘన విజయం సాధించింది.
ఈ దశకంలోనూ కొన్ని పౌరాణిక చిత్రాలు వచ్చాయి. ఎన్టీ రామారావు స్వయంగా దర్శకత్వం వహించి మూడు పాత్రల్లో (కర్ణుడు, కృష్ణుడు, దుర్యోధనుడు) నటించిన 'దాన వీర శూర కర్ణ' (1977) కలెక్షన్ల వర్షంలో తడిసింది. కేవలం రూ. 10 లక్షల వ్యయంతో నిర్మించిన ఈ సినిమా ఏకంగా రూ. కోటి వసూలు చేసిందంటే ఈ చిత్రానిది ఏ స్థాయి విజయమో గ్రహించవచ్చు. మహా భారతంలో దుష్ట పాత్రలుగా చిత్రీకరణకు గురైన కర్ణ, దుర్యోధన పాత్రలను కొత్త కోణంలో చూపించి, ఆ పాత్రలకి హీరో ఇమేజ్ తెచ్చిన ఘనత నిస్సందేహంగా ఎన్టీఆర్‌దే.
ఇక ఎనిమిదో దశకంలో తెలుగు సినిమా పూర్తిగా వాణిజ్యమయమై పోయింది. డాన్సులూ, ఫైట్లూ లేకపోతే సినిమా జనంలోకి పోదన్న అభిప్రాయానికి వచ్చారు నిర్మాతలూ, దర్శకులూ. బూతు మాటలు, శృంగార సన్నివేశాలు ఉన్న సినిమాలు తామరతంపరగా వచ్చాయి. క్లబ్ డాన్సు అనేది సినిమాకి తప్పనిసరి అంశమైంది.
ఏడవ దశకం ద్వితీయార్ధంలో నటుడిగా రంగ ప్రవేశం చేసిన చిరంజీవి హీరోగా మారి నిలదొక్కుకుంటున్న సమయంలో 'ఖైదీ' (1983) అతడి స్థాయిని అనూహ్యంగా పెంచేసింది. యాక్షన్ సినిమాల్లో 'ఖైదీ' సరికొత్త ధోరణికి తెరతీసింది. హీరోల పరంగా నృత్యాలకు అక్కినేని ఆద్యుడైనా, వాటికి ఎక్కువ ప్రాచుర్యం వచ్చింది చిరంజీవి వల్లనే. ఓ వైపు యాక్షన్ సినిమాలు వెల్లువగా వస్తుంటే, మరోవైపు కొద్ది సంఖ్యలోనైనా కళాత్మక విలువలున్న సినిమాలు వచ్చాయి. కె. విశ్వనాథ్ 'శంకరాభరణం' (1980) తెలుగు చిత్రసీమకి ఏనాటికైనా గర్వంగా చెప్పుకోదగ్గ కళాఖండంగా చరిత్రలో నిలిచింది. శాస్త్రీయ సంగీతమే హీరోగా తీసిన ఈ సినిమాలో ఒక సదాచార బ్రాహ్మణ సంగీత విద్వాంసునికీ, ఒక కళావంతుల కుటుంబానికి చెందిన స్త్రీకీ మధ్య అమలిన అనుబంధాన్ని విశ్వనాథ్ చూపించిన తీరు దేశ విదేశాల్లో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అక్కినేనితో దాసరి నారాయణరావు తీసిన 'మేఘసందేశం' (1982) కూడా ఈ కోవలోకే వస్తుంది. ఈ దశకంలోనే 'యువతరం కదిలింది' (1980), 'ఎర్రమల్లెలు' (1981), 'విప్లవ శంఖం' (1982) వంటి విప్లవ కథాంశ చిత్రాలు కూడా వచ్చాయి. అభ్యుదయ చిత్రాల సృష్టికర్తగా టి. కృష్ణ 'నేటి భారతం', 'దేశంలో దొంగలు పడ్డారు', 'దేవాలయం', 'వందేమాతరం', 'ప్రతిఘటన', 'రేపటి పౌరులు' అనే ఆరు చిత్రాలే తీసినా శాశ్వత కీర్తిని సముపార్జించుకున్నాడు.
ఎన్టీఆర్ వారసునిగా అంతకుముందే హీరోగా బాలకృష్ణ ప్రవేశిస్తే 80లలో మరింతమంది తండ్రులకి వారసులుగా చిత్రరంగ ప్రవేశం చేశారు. నాగేశ్వరరావు కొడుకు నాగార్జున, కృష్ణ కొడుకులు రమేశ్, మహేశ్, అగ్ర నిర్మాతల్లో రామానాయుడి కుమారుడు వెంకటేశ్, వి.బి. రాజేంద్రప్రసాద్ తనయుడు జగపతిబాబు హీరోలుగా అడుగుపెట్టారు. తెలుగు సినిమా చరిత్రలో తనపేరిట ఓ యుగాన్ని సృష్టించుకున్న ఎన్టీఆర్ రాజకీయాల్లో అడుగుపెట్టి తెలుగుదేశం పార్టీని స్థాపించి, అతి స్వల్ప కాలంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని కూడా అధిష్టించారు. ఆ తర్వాత కూడా ఆయన మూడు సినిమాల్లో నటించారు. తెలుగులో మొదటి 70 ఎం.ఎం. సినిమా 'సింహాసనం' (1986) కూడా ఈ దశకంలోనే వచ్చింది.
ఆ తర్వాత తెలుగులో కొత్త రక్తం మొదలైంది. ఎంతోమంది నవ యువ దర్శకులు తమ ప్రతిభని ప్రదర్శించడంతో పాత తరం దర్శకులు చాలమంది రిటైరయ్యే పరిస్థితి వచ్చింది. వస్తూనే భారీ సంచలనం సృష్టించాడు రాంగోపాల్ వర్మ. అతడి దర్శకత్వంలో వచ్చిన తొలి సినిమా 'శివ' కలెక్షన్ల వర్షం కురిపించడమే కాకుండా సాంకేతిక విలువల్లో కొత్త అధ్యాయానికి నాంది పలికింది. అయితే ఆ సినిమా యువతపై చేదు ప్రభావాన్ని కలిగించిందనే విమర్శలు ఉన్నాయి. 'శివ'తో వయొలెన్స్ కొత్తపుంతలు తొక్కింది. వరుసబెట్టి హింసాత్మక కథలతో సినిమాలు వచ్చిపడ్డాయి. కథకంటే కథనానికి ప్రాముఖ్యం హెచ్చింది. టెక్నికల్ అంశాలపై శ్రద్ధ పెరిగింది. కథల విషయంలో అప్పటికీ ఇప్పటికీ స్పష్టమైన తేడా ఉంటోంది. అప్పట్లో ఏదైనా కథని సినిమాగా తీయాలంటే దర్శకులు, నటులు, రచయితలు అందరూ కలిసి సమావేశమై చర్చించుకొని అందరూ కలిసే కథని నిర్ణయించేవాళ్లు. ఇప్పుడా వాతావరణం మచ్చుకి కూడా కనిపించదు. ఎనిమిదో దశకం నుంచే హీరోనిబట్టి కథలు తయారుచెయ్యడం మొదలైంది. ఇప్పటికీ అదే స్థితి. గతంలో సినిమా ఫెయిల్యూర్ అయితే దానికి కారణం సమష్టి లోపమేనని ఒప్పుకునేవాళ్లు. ఇప్పుడైతే సినిమా ఫ్లాప్ అయ్యిందంటే దర్శకుడి మీదకో, నటుల మీదకో, అదీ కాదంటే సంగీతం మీదకో నెపం నెట్టేస్తున్నారు.
ఇతర భాషా చిత్రాలతో పోలిస్తే వాసి విషయంలో మనం చాలా వెనుకంజలో ఉన్నామన్నది నిజం. మన పొరుగునే ఉన్న మలయాళ సినిమాలు దేశంలో అత్యుత్తమ చిత్రాలుగా ఎక్కువ భాగం ప్రశంసలకి నోచుకుంటున్నాయి. తమిళంలోనూ ఇటీవలి కాలంలో మంచి మంచి సినిమాలు వస్తున్నాయి. తెలుగు సినిమానే దుస్థితిలో ఉన్నట్లు కనిపిస్తోంది. ఇటీవల 'పెళ్లి' నేపథ్యంలో వచ్చిన ఓ సినిమా మంచి హిట్టవడంతో అదే మూసలో చిత్రాలు వస్తున్నాయి. ఒక విప్లవ కథాచిత్రం బాగా ఆడితే అదే తరహా చిత్రాల్ని తీస్తున్నారు. ఇదంతా ట్రెండుని క్యాష్ చేసుకోవడం తప్ప వాటితో చిత్రాలు తీసేవారికి చిత్తశుద్ధి ఉందంటే నమ్మలేం. ఓ దశాబ్దం నుంచి వస్తున్న చిత్రాల్లో మానవతా విలువలు చాలా అరుదుగా కనిపిస్తున్నాయి. వికారమైన చేష్టలు, జుగుప్స కలిగించే డాన్సులు, రౌడీలు, గూండాలు హీరోలుగా చలామణీ అవడం ఇప్పటి ఫ్యాషన్. మిగతా అన్ని రంగాలతో పోలిస్తే పురుషాధిక్యం ఎక్కువగా రాజ్యమేలుతున్న చిత్రసీమలో హీరోయిన్ల స్థితి మరీ తీసికట్టుగా తయారైంది. వ్యాంప్ కేరక్టర్ల అవసరం లేకుండా హీరోయిన్లతోనే వ్యాంప్ చేసే చేష్టలన్నీ చేయిస్తున్నారు దర్శకులు. పాటల్లో హీరో హీరోయిన్ల నడుము  కదలికలు చూస్తుంటే మనం దాన్ని ఆస్వాదించాలో, అసహ్యించుకోవాలో అర్థం కాదు. అట్లాంటి సన్నివేశాలకే థియేటర్లో ఈలలు, చప్పట్లు! మన అభిరుచి స్థాయి అలా ఉంది మరి. వీటినే ఆశీర్వచనాలుగా నమ్ముతున్న నిర్మాతలు అట్లాంటి చిత్రాల నిర్మాణానికే మొగ్గు చూపుతున్నారు. ఆధునిక ధోరణుల్నీ, వేగాన్నీ ఇష్టపడుతున్న ఇప్పటి యువతకి ఇట్లాంటి సినిమాలు కావలసినంత వినోదాన్ని ఇస్తున్నప్పటికీ మంచి కంటే చెడే త్వరగా ఆదరణ పొందుతుందనే సత్యాన్ని సినీ పరిశ్రమకారులు విస్మరించకూడదు. ఆడవాళ్లని ఏడ్పించడమే మగవాడి జన్మహక్కుగా చిత్రించడం, ఎంత ఏడ్పించినా ఏమీ అనని హీరోయిన్లనీ, భర్త ఎంత హింసించినా సహించే భార్యల్నీ మంచివాళ్లుగా చిత్రిస్తూ సినిమాలు తీస్తున్నారు. ఇది సాంస్కృతిక వినాశనానికి దారితీసే ప్రమాదం ఉంది.
అట్లా అని తెలుగు సినిమా పూర్తిగా దిగజారిపోలేదు. కొద్దిమంది అయినా యువతరం దర్శకులు వాస్తవిక అంశాలతో చిత్రాలు తీస్తూ ప్రశంసలందుకుంటున్నారు. ఆధునిక సాంకేతిక విజ్ఞానం తెలుగు చిత్ర రంగాన్ని మార్పుకు గురిచేస్తోంది. ఈ స్వాతంత్ర్య స్వర్ణోత్సవ సమయంలోనైనా సినిమా కేవలం వినోదాన్ని అందించే రంగంగానే కాకుండా ఆలోచింపజేసే మీడియా అనే ధోరణి చిత్రసీమలో వ్యాపించాల్సి ఉంది. అప్పుడే విమర్శకి నిల్చే స్థాయికి తెలుగు సినిమా చేరుకునే వీలుంటుంది.
- స్వాతంత్ర్య స్వర్ణోత్సవం సందర్భంగా 
ఆంధ్రభూమి 'వెన్నెల' 15 ఆగస్ట్ 1997

Friday, May 4, 2012

అలనాటి ఆణిముత్యం: వర విక్రయం (1939)


నటిగా భానుమతి పరిచయమైన చిత్రం 'వర విక్రయం'. కవితా కళానిధిగా ప్రసిద్ధులైన బలిజేపల్లి లక్ష్మీకాంత కవి నటునిగా తెరపై కనిపించిన తొలి సినిమా కూడా ఇదే. అంతే కాదు అనంతర కాలంలో గొప్ప కమెడియన్‌గా రాణించిన కస్తూరి శివరావు ఓ చిన్నపాత్ర ద్వారా ఈ సినిమాతోటే తెరంగేట్రం చేశారు.'చింతామణి', 'మధుసేవ' వంటి గొప్ప నాటకాల్ని రాసిన కాళ్లకూరి నారాయణరావు కలం నుంచి జాలువారిన మరో గొప్ప నాటకం 'వర విక్రయం'. వరకట్న పిశాచానికి వ్యతిరేకంగా రాసిన ఈ నాటకం ఆధారంగానే అదే పేరుతో ఈ సినిమా రూపొందింది. 
ఇందులోని కాళింది పాత్రకు బాగా పాడగల నటికోసం దర్శకుడు సి. పుల్లయ్య అన్వేషిస్తున్నప్పుడు భానుమతి గురించి ఆయనకు తెలిపారు గోవిందరాజుల సుబ్బారావు. భానుమతి తండ్రి బొమ్మరాజు వెంకటశేషయ్య, గోవిందరాజుల మంచి స్నేహితులు. స్క్రీన్ టెస్ట్ ద్వారా భానుమతిని తీసుకున్నారు పుల్లయ్య. అయితే తన కూతుర్ని ఏ పురుష నటుడూ స్పృశించకూడదనే నిబంధనతో ఇందులో భానుమతి నటించేందుకు శేషయ్య అంగీకరించారు. అలా ఓ గొప్ప నటి ఈ సినిమా ద్వారా తెలుగులోకి అడుగుపెట్టింది.
కథాంశం: రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ అయిన పుణ్యమూర్తుల పురుషోత్తమరావు (దైతా గోపాలం) గాంధేయవాది. ఆయన భార్య భ్రమరాంబ (సీనియర్ శ్రీరంజని), కూతుళ్లు కాళింది (భానుమతి), కమల (పుష్పవల్లి). వరకట్నానికి పురుషోత్తమరావు వ్యతిరేకి. కానీ తన పెద్ద కూతురు కాళిందిని సింగరాజు లింగరాజు (బలిజేపల్లి లక్ష్మీకాంత కవి) దత్తపుత్రుడు బసవరాజు (కొచ్చర్లకోట సత్యనారాయణ)కు ఇచ్చి పెళ్లి చేయడానికి వరకట్నం నిమిత్తం తన పదెకరాల వరిపొలాన్ని అమ్మక తప్పని స్థితి ఎదురయింది. లింగరాజు పక్షం వహించిన పెళ్లిళ్ల పేరయ్య (పేరి రామచంద్రమూర్తి), వివాహాల వీరయ్య (జె. సత్యనారాయణ) వల్ల పెళ్లికాక ముందే కట్నం ఇచ్చేస్తాడు పురుషోత్తమరావు. తన పెళ్లి కారణంగా తల్లిదండ్రులు దరిద్రులై పోతున్నారని ఆవేదన చెందిన కాళింది నూతిలో దూకి ఆత్మహత్య చేసుకుంటుంది.
పెళ్లి జరగకపోయినా కట్నం సొమ్ము ఇవ్వడానికి నిరాకరిస్తాడు లింగరాజు. దాంతో అతనికి గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకుంటుంది కమల. తన తండ్రి అభిమతానికి విరుద్ధంగా బసవరాజుతో పెళ్లికి ఒప్పుకుంటుంది. పెళ్లయ్యాక అత్తగారింటికి వెళ్లేందుకు నిరాకరించిన కమల తాను కట్నమిచ్చి వరుణ్ణి కొనుక్కున్నాననీ, అందువల్ల బసవరాజే తమ ఇంటికి రావాలని డిమాండ్ చేస్తుంది. కొడుకు పేరుతో కమలని కోర్టుకు లాగుతాడు లింగరాజు. జడ్జి కమలకి అనుకూలంగా తీర్పు చెబుతాడు. తండ్రి చేష్టలకి విసుగెత్తిపోయిన బసవరాజు భార్యతో కలిసి జీవిస్తానంటాడు. తన తప్పు తెలుసుకున్న లింగరాజు క్షమించాల్సిందిగా పురుషోత్తమరావును అర్థిస్తాడు.
తారాగణం: బలిజేపల్లి లక్ష్మీకాంత కవి, దైతా గోపాలం, సీనియర్ శ్రీరంజని, భానుమతి, పుష్పవల్లి, కొచ్చర్లకోట సత్యనారాయణ, తుంగల చలపతిరావు, పేరి రామచంద్రమూర్తి, జె. సత్యనారాయణ, అడ్డాల నారాయణరావు, ఎ.వి. సుబ్బారావు, ఎల్. సత్యనారాయణ, రేలంగి వెంకట్రామయ్య, కోటిరత్నం, సుభద్ర, కస్తూరి శివరావు
కథ: కాళ్లకూరి నారాయణరావు
మాటలు: బలిజేపల్లి లక్ష్మీకాంత కవి
సంగీతం: ప్రభల సత్యనారాయణ
నేపథ్య సంగీతం: దుర్గాసేన్
ఛాయాగ్రహణం: బీరేన్ డే
సౌండ్: సి.ఎస్. నిగం
కూర్పు: ధరం వీర్
కళ: బాటూసేన్
మేకప్: ఈదు
దర్శకుడు: చిత్తజల్లు పుల్లయ్య
బేనర్: ఈస్ట్ ఇండియా ఫిల్మ్ కంపెనీ

Tuesday, December 20, 2011

బిగ్ స్టోరీ: ఆరు పదుల వెన్నెల సౌరభం మల్లీశ్వరి

మల్లీశ్వరి... తెలుగు సినీ జగత్తులో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ కళాఖండం. దర్శకుడిగా బి.ఎన్. రెడ్డినీ, గేయ రచయితగా కృష్ణశాస్త్రినీ, సంగీత దర్శకుడిగా సాలూరు రాజేశ్వరరావునీ చిరస్మరణీయం చేసిన అజరామర చిత్రం. అనేక అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శితమై సెట్టింగులు, వస్త్రాలంకరణ పరంగా ప్రఖ్యాత 'మొఘల్-ఎ-ఆజమ్'కు ఏమాత్రం తీసిపోదని విమర్శకుల అభినందనల్ని అందుకున్న ఆణిముత్యం. అందుకే విడుదలై అరవై సంవత్సరాలైనా 'మల్లీశ్వరి' నిత్యనూతనం.
మిగతా దర్శకులతో పోలిస్తే బి.ఎన్. రెడ్డి భిన్నంగా కనిపిస్తారు. ఆయన తీసిన ప్రతి చిత్రమూ కళాఖండమన్న పేరు ఆర్జించింది. కేవలం పదకొండు చిత్రాలతో తెలుగు సినిమా ఖ్యాతిని పెంచారు. అన్నిట్లోనూ 'మల్లీశ్వరి' పెద్ద ఖ్యాతిని తెచ్చుకుంది. భారతి మాసపత్రిక 1944 మే సంచికలో ప్రసిద్ధ రచయిత బుచ్చిబాబు రాసిన 'రాయల కరుణకృత్యం' అనే నాటిక ఆ తర్వాత రేడియోలో ప్రసారమైంది. దాన్ని విన్న బి.ఎన్. రెడ్డి దాని ఆధారంగా సినిమా తీయాలనుకున్నారు. అలాగే ఆ సమయంలోనే ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా ఆంగ్ల పత్రికలో దివాన్ షరార్ రాసిన 'ది ఎంపరర్ అండ్ ద స్లేవ్ గర్ల్' కథ కూడా ఆయనకు నచ్చింది. ఆ నాటికనూ, ఈ కథనూ మేళవించి ఆయన 'మల్లీశ్వరి' కథను తయారు చేయించారు. ఈ సినిమా కోసం బి.ఎన్. అహోరాత్రాలూ పడిన క్షోభ ఓ తపస్సు. అందుకే ఆయనతో పనిచేసిన వారంతా - ఈ మాట ఆయన 'రాయించు'కున్నారు, ఈ పాట ఆయన 'చేయించు'కున్నారు, 'పాడించు'కున్నారు - అనే అంటారు గౌరవ పురస్సరంగా.
కథాంశం
ఈ చిత్ర కథాంశాన్ని ఓసారి మననం చేసుకుందాం. హంపీ విజయనగర సామ్రాజ్యంలోని వీరాపుర గ్రామంలో బావామరదళ్లయిన నాగరాజు, మల్లీశ్వరికి ఒకరంటే ఒకరికి వల్లమాలిన ప్రేమ. ఆర్థికంగా కాస్త పైచేయి అయిన మల్లి తల్లి నాగమ్మకు వారి పెళ్లి ఇష్టంలేదు. దాంతో డబ్బు సంపాదించడానికి నగరానికి వెళ్తాడు నాగరాజు. ఒక వర్షపు రాత్రి సత్రంలో మల్లి నాట్యాన్ని మారువేషంలో తిలకించిన శ్రీకృష్ణదేవరాయలు ఆమె ఇంటికి పల్లకీ పంపించి రాణివాసానికి రప్పిస్తాడు. రాణివాసంలోని స్త్రీలను పరపురుషులెవరూ చూడరాదనేది నియమం. డబ్బు సంపాదించి వచ్చిన నాగరాజుకు మల్లి రాణివాసానికి వెళ్లిపోయిన సంగతి తెలిసి పిచ్చివాడైపోతాడు. ఆమె రూపాన్ని శిల్పాలుగా చెక్కుతాడు. నాగరాజు పనితనం చూసి ఆస్థాన శిల్పాచారి అతణ్ణి నందనోద్యానవనంలో శిల్పాల్ని చెక్కేందుకు నియమిస్తాడు. అనుకోకుండా ఒకరోజు తోటలో కలుసుకున్న నాగరాజు, మల్లి అక్కణ్ణించి పారిపోవాలనుకుంటారు. అదే సమయానికి ఉషా పరిణయం నృత్యగానంలో మల్లి పాల్గొనాల్సి వస్తుంది. సాహసంతో అంతఃపుర ప్రవేశం చేసిన నాగరాజును సైనికులు బంధించి ఖైదుచేస్తారు. విచారణ జరిపిన మహారాజు ప్రేమికులిద్దర్నీ ఒకటిచేసి, వారికి స్వేచ్ఛాజీవితం ప్రసాదిస్తాడు.
అందరూ అపురూప తారలే
నాగరాజు, మల్లీశ్వరి పాత్రల్లో ఎన్టీ రామారావు, భానుమతి అపూర్వ అభినయం ప్రదర్శించి ప్రేక్షక హృదయాల్లో చెరగని ముద్రవేశారు. వారి చిన్నప్పటి పాత్రలు వేసింది వెంకటరమణ, మల్లిక. ఈ వెంకటరమణ సుప్రసిద్ధ చిత్రకారుడు, దర్శకుడు బాపుకు స్వయాన బావమరిది. నిజానికి మల్లి పాత్రకు మొదట ఎవరైనా కొత్త తారను తీసుకుందామని రేవతి అనే అమ్మాయిని ఎంపిక చేసుకుని కూడా, బరువైన ఆ పాత్రకి ఆమె న్యాయం చేయలేదని భావించారు బి.ఎన్. అప్పటికే దక్షిణాదిలో అగ్రతారగా వెలుగొందుతున్న భానుమతి వైపు మొగ్గుచూపారు. ఆయన నమ్మకాన్ని భానుమతి ఈ స్థాయిలో నిలబెట్టారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అదివరకు 'షావుకారు'లో జానకి తండ్రిగా వేసిన శ్రీవత్స ఇందులో శ్రీకృష్ణదేవరాయలు పాత్రలో గంభీరంగా నటించారు. మల్లి తండ్రి నారప్పగా దొరస్వామి, మల్లి మావయ్య హనుమంతప్పగా వంగర వెంకటసుబ్బయ్య, మల్లి తల్లి నాగమ్మగా ఋష్యేంద్రమణి, నాగరాజు తల్లి గోవిందమ్మగా వెంకుమాంబ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేకూర్చారు. రేడియోలో వచ్చిన 'రాయల కరుణకృత్యం' నాటికలో మల్లీశ్వరిగా నటించిన టి.జి. కమలాదేవి 'మల్లీశ్వరి'లో భానుమతి నెచ్చెలి జలజ పాత్ర చేయడం విశేషం. అప్పట్లో రేడియోలో బాగా పాపులర్ అయిన 'బాలానందం' కార్యక్రమాన్ని నిర్వహించే 'బాలన్నయ్య' న్యాపతి రాఘవరావు ఇందులో రాయల ఆస్థానకవి పాత్రలో నటించారు. అదివరకు వాహినీ సంస్థ తీసిన ప్రతి చిత్రంలోనూ నటించిన చిత్తూరు నాగయ్య ఇందులో కనిపించరు. ఈ సినిమా షూటింగయ్యాక ఇందులో తను నటించలేదనే బాధను నాగయ్య వ్యక్తం చేయడంతో బి.ఎన్. ఆయన్ను మరో రకంగా సంతృప్తిపరిచారు. సినిమా ఆరంభంలో వచ్చే నేపథ్య వ్యాఖ్యానం చెప్పింది నాగయ్యే.

పోటీపడ్డ సాహిత్యం, సంగీతం
తొలిసారిగా ఈ చిత్రానికి మాటలు, పాటలు రాశారు దేవులపల్లి వేంకట కృష్ణశాస్త్రి. ఆయన సినీ జీవితంలో మాటలు రాసిన ఒకే ఒక చిత్రమిది. 'మల్లీశ్వరి' విడుదలైనప్పుడు ఆ చిత్రాన్ని ప్రజామిత్ర పత్రికలో సమీక్షిస్తూ "ఈ చిత్రంలో పాటలకు సాహిత్య గౌరవం లభించింది'' అని ప్రశంసించారు ప్రసిద్ధ రచయిత తాపీ ధర్మారావు. నిజమే. అప్పటిదాకా వచ్చిన సినిమా పాటలకంటే భిన్నంగా 'మల్లీశ్వరి' పాటల్ని సాహితీ సౌరభంతో ప్రబంధ శృంగార సారాన్ని సినీ సాహిత్యపరంగా మలిచిన విశిష్ట రచయిత దేవులపల్లి వేంకట కృష్ణశాస్త్రి. ఇందులోని గీతాలు ప్రణయ భావపరంపరకు పట్టంగట్టిన నిత్యనూతన సౌరభాల్ని వెదజల్లిన మల్లెల మాలికలు. కృష్ణశాస్త్రి రాసిన పాటలకు సాలూరు రాజేశ్వరరావు బాణీలు కట్టారు. మ్యూజిక్ కంపోజింగ్‌కు ఆయన ఆరు నెలల సమయం తీసుకున్నారు. బాణీలు సాలూరువి అయితే, ఆర్కెస్ట్రా నిర్వహించింది అద్దేపల్లి రామారావు. అందుకే టైటిల్స్‌లో సంగీత దర్శకులుగా ఇద్దరి పేర్లూ ఉంటాయి. సాలూరు తన కెరీర్ మొత్తం మీద అపురూపంగా చెప్పుకున్న చిత్రాలు రెండే. ఒకటి 'చంద్రలేఖ', రెండు 'మల్లీశ్వరి'. హంపీ విజయనగర సామ్రాజ్య వైభవానికి అద్దంపట్టే ఈ చిత్రంలో అసలు కథానాయిక సంగీతమేనంటే అతిశయోక్తి కాదు. 'మనసున మల్లెల మాలలూగెనే', 'కోతీ బావకు పెళ్లంట', 'పరుగులు తీయాలి గిత్తలు ఉరకలు వేయాలి', 'ఆకాశ వీధిలో హాయిగా ఎగిరేవు', 'నెల రాజా వెన్నెల రాజా', 'ఎందుకే నీకింత తొందర' వంటి పాటలన్నీ అపురూప రాగ హారాలే. కాఫీ రాగంలో భానుమతి ఆలపించిన 'పిలచిన బిగువటరా..' తెలుగు సినిమా పాటల్లో చిరస్థాయిని సాధించింది. మల్లీశ్వరిని రాణివాసానికి పంపే ఘట్టం తెలుగు సినిమా చరిత్రలోనే గుండెలు బరువెక్కించే అద్భుత కరుణ రసాత్మక భాష్పగంగా మణికర్ణికా ఘట్టం. దాన్ని అలా చిత్రించిన బి.ఎన్. రెడ్డినీ, ఆ ఘట్టంలో అభినయించిన దొరస్వామి, ఋష్యేంద్రమణి, భానుమతి, వెంకుమాంబనీ, ఆ సెట్‌ని రూపొందించిన ఎ.కె. శేఖర్‌నీ, అన్నింటికీ మించి హంపీ విజయనగర శిల్పవీణలు ఆ సన్నివేశాలకి నేపథ్యంగా మూర్ఛనలు చేస్తున్నాయా అనిపించే నేపథ్య సంగీతం, అందులో రాజేశ్వరరావు చూపిన ప్రతిభ, చరిత్ర జ్ఞానం తెలుగువారు మరవలేనివి. సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన ఆది ఎం. ఇరానీ పక్షవాతంతో కెమెరాని హ్యాండిల్ చేసే స్థితిలో లేకపోవడంతో ఆపరేటివ్ కెమెరామన్‌గా బి.ఎన్. సోదరుడు కొండారెడ్డి అద్భుత పనితీరు కనపర్చారు.
ఈ చిత్ర నిర్మాణానికి అయిన వ్యయం రూ. ఆరు లక్షలు. అప్పట్లో అది అత్యంత భారీ బడ్జెట్. 1951 డిసెంబర్ 20న తొలిసారి విడుదలై ఒక్క విజయవాడలో మాత్రమే వంద రోజులు ఆడిన ఈ సినిమా మూడేళ్ల తర్వాత రెండో విడుదలలో మరింత విజయం సాధించింది. ఆంధ్రదేశంలో కంటే తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో 'మల్లీశ్వరి'కి ఎక్కువ ఆదరణ లభించింది. బీజింగ్‌లో జరిగిన తూర్పు ఆసియా చలనచిత్రోత్సవంలో ప్రదర్శితమై ప్రశంసలు పొందిన ఈ చిత్రం 1953 మార్చి 14న చైనీస్ సబ్ టైటిల్స్‌తో 15 ప్రింట్లతో చైనాలో విడుదలై ఆ ఘనత సాధించిన తొలి చిత్రంగా రికార్డు పుటల్లో నిలిచింది.
-ఆంధ్రజ్యోతి డైలీ, డిసెంబర్ 20, 2011

Thursday, December 9, 2010

ఫోకస్: 1947 తర్వాత తెలుగు సినిమా

ఈ శతాబ్ద కాలంలో దేశంలోనే అత్యంత ప్రాచుర్యం పొందిన, జనరంజకమైన మీడియాగా సినిమా ఖ్యాతికెక్కింది. తొలినాళ్లలో అది ఓ కళా ప్రక్రియ అయితే ఇవాళ అది పక్కా వ్యాపార పరిశ్రమగా మారిపోయింది. స్వాతంత్ర్యానంతరం ఈ అరవై ఏళ్ల పైచిలుకు కాలపు తెలుగు చలనచిత్ర రంగాన్ని ఓసారి పరిశీలించి చూస్తే కళాఖండాలనదగ్గ చిత్రాలు పదికంటే ఎక్కువ కనిపించవు. తెలుగు సినిమా గురించి గొప్పగా చెప్పుకోవడానికి పనికివచ్చేది నిర్మాణమవుతోన్న చిత్రాల సంఖ్య గురించే. హిందీ చిత్రాలకంటే అధిక సంఖ్యలో ప్రతియేటా తెలుగులో సినిమాలు నిర్మాణవుతున్నాయి. వాటిలో విమర్శకి నిల్చునేవి అతి స్వల్పం. ఐతే దేశం గర్వించదగ్గ నటులు, దర్శకులు మనకి ఉన్నారని చెప్పుకునే భాగ్యం లభించింది. దర్శకుల్లో ఎల్వీ ప్రసాద్, బీఎన్ రెడ్డి, నిర్మాతల్లో బి. నాగిరెడ్డి, డి. రామానాయుడు, నటుల్లో అక్కినేని నాగేశ్వరరావు సినిమా రంగంలో దేశానికి సంబంధించిన అత్యున్నత పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్నారు. ఎస్వీ రంగారావు, చిత్తూరు నాగయ్య, ఎన్‌టీ రామారావు వంటి నటులు; రేలంగి, రమణారెడ్డి వంటి మహా కమెడియన్లు, కన్నాంబ, భానుమతి, సావిత్రి, సూర్యకాంతం వంటి గొప్ప నటీమణులూ; గూడవల్లి రామబ్రహ్మం, కేవీ రెడ్డి, పి. పుల్లయ్య, వేదాంతం రాఘవయ్య, కమలాకర కామేశ్వరరావు, ఆదుర్తి సుబ్బారావు, కె. విశ్వనాథ్, బాపు, దాసరి నారాయణరావు, కె. రాఘవేంద్రరావు వంటి దిగ్దర్శకులు మనకి లభించారు.
మొదట్లో- అంటే 60వ దశకం వరకు తెలుగులో పౌరాణిక చిత్రాలు, మాయా మంత్రతంత్రాల జానపద చిత్రాలే రాజ్యం చేశాయి. సామాజిక స్పృహతో తీసిన చిత్రాలు చాలా తక్కువ. అయితే 'దేవదాసు', 'మాయాబజార్', మహాకవి కాళిదాసు' వంటి కళాఖండాలనదగ్గ సినిమాలు అప్పుడు వచ్చాయి. రామారావు, నాగేశ్వరరావు అగ్ర హీరోలుగా నిలిచారు. తారల్లో భానుమతి, సావిత్రి అగ్రస్థాయికి చేరుకున్నారు. 1953లోనే 'చండీరాణి'కి దర్శకత్వం వహించి తెలుగులో తొలి దర్శకురాలయ్యారు భానుమతి. 1954 వరకు వచ్చిన చిత్రాల్లో ఏ ఒక్కటీ వంద రోజులదాకా ఆడలేదు. 1955లో తాపీ చాణక్య దర్శకత్వం వహించిన 'రోజులు మారాయి' చిత్రం తొలిసారిగా వంద రోజులు ప్రదర్శితమైన చిత్రంగా నిలిచింది. ఇది సామాజిక దృష్టితో తీసిన చిత్రం కావడం విశేషమే. స్వాతంత్ర్యానికి ముందు కమర్షియల్ దృష్టితో తీసిన సినిమాలు కనిపించవు. ఆ తర్వాతే 1950లో విజయా సంస్థ తీసిన 'షావుకారు' చిత్రంతో ఈ వాణిజ్య పోకడలు కనిపిస్తాయి. ఈ చిత్రంతోనే జానకి నటిగా తెరంగేట్రం చేశారు. 1964లో తొలి తెలుగు వర్ణ చిత్రం 'లవకుశ' వచ్చింది. దీనికి పి. పుల్లయ్య దర్శకుడు. అంజలీదేవి, ఎన్‌టీ రామారావు సీతారాములుగా నటించిన ఈ సినిమా అప్పట్లో కలెక్షన్ల పరంగా అనేక కొత్త రికార్డుల్ని నెలకొల్పింది. ఈ యేడాదే ఓ తెలుగు నటుడికి అంతర్జాతీయ గౌరవం దక్కింది. ఆ నటుడు ఎస్వీ రంగారావు. జకార్తాలో ఆఫ్రో ఏషియన్ అంతర్జాతీయ చిత్రోత్సవంలో ప్రదర్శించిన 'నర్తనశాల'లో కీచకుడి పాత్రకి గాను ఆ పురస్కారం లభించింది.
తొలి సాంఘిక రంగుల చిత్రం 1965లో వచ్చింది. అందరూ కొత్త తారలతో దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు రూపొందించిన ఆ చిత్రం 'తేనె మనసులు'. హీరో కృష్ణ పరిచయమయ్యింది ఈ సినిమాతోనే. (ఇంకావుంది)

Wednesday, August 25, 2010

Nostalgia: LV Prasad replaced Gopichand


ఎల్.వి. ప్రసాద్ దర్శకత్వంలో 1945లో విడుదలైన 'గృహప్రవేశం' సినిమాని నిజానికి డైరెక్ట్ చేయాల్సింది ప్రఖ్యాత రచయిత త్రిపురనేని గోపీచంద్. 'లక్ష్మమ్మ' సినిమాని డైరెక్ట్ చేయాడానికి ముందే 'పెంకి పిల్ల' అనే స్క్రిప్ట్ రెడీ చేసుకున్నారు గోపీచంద్. మరో డైరెక్టర్ కె.ఎస్. ప్రకాశరావు ఈ సినిమాని నిర్మించారు. అయితే సారథి స్టూడియోస్ భాగస్వామ్యంలో నిర్మించడం వల్ల ఆ బానరునే ఉపయోగించారు. ఈ సినిమా పెట్టుబడి రు. 60 వేలు. ఇందులో సగం సారథి వాళ్లు పెడితే, మిగతా సొమ్ముని ప్రకాశరావు, గోపీచంద్, ఎం.ఎస్. చౌదరి కలిసి పెట్టారు. దర్శకత్వ బాధ్యతలు గోపీచంద్ తీసుకున్నారు. తనకు డైరెక్షన్ చాన్స్ ఇస్తేనే హీరోగా నటిస్తానని ఎల్.వి. ప్రసాద్ తేల్చిచెప్పడంతో గోపీచంద్ ని ఒప్పించి ప్రసాద్ కి డైరెక్షన్ చాన్స్ ఇచ్చారు ప్రకాశరావు. 'పెంకి పిల్ల' పేరుని 'గృహప్రవేశం'గా మార్చింది ప్రసాదే. ఈ సినిమాలో భానుమతి హీరోయిన్. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో దర్శకుడిగా బిజీ అయ్యారు ప్రసాద్.