Saturday, March 26, 2011

కథ: పదహారేళ్ల తర్వాత (రెండో భాగం)

"ఏం సారూ! మీరీడికొచ్చి శానా కాలమైనట్టుందే?" అడిగాడు రిక్షావాలా.
"అవును. పదహారేళ్లయింది. నా ఫ్రెండుని చూడటం కోసం వచ్చా ఇప్పుడు" చెప్పాడు.
"నాయినపల్లిలో ఎ స్నేయితుడు? నేనుండేది కూడా అక్కణ్ణే. అంతా నాకు తెల్సినోళ్లే. నా పేరు కోటయ్య" అన్నాడు రిక్షావాలా.
"అవునా కోటయ్యా! వాడి పేరు సుదర్శన్". 
టక్కున బ్రేక్ వేశాడు కోటయ్య. చైను కిర్రుమని చప్పుడు చేస్తుండగా ఆగింది రిక్షా. అది ఊహించని పద్మాకర్ కంట్రోల్ చేసుకోలేక కాస్త ముందుకు తూలాడు. చివరి నిమిషంలో చేత్తో రిక్షాని గట్టిగా పట్టుకున్నాడు. లేదంటే పడిపోయేవాడే.
"ఏంటి కోటయ్యా! ఎందుకు సడన్‌గా రిక్షా ఆపావ్?" కాస్త అసహనంగా అడిగాడు పద్మాకర్.
"శమించండి బాబూ. మీరు సుదర్శన్ బాబనేసరికి ఏదో అయినట్టయ్యింది బాబూ. అయితే ఆఖరి చూపుకు వొత్తున్నారన్న మాట!" అన్నాడు కోటయ్య.
'ఆఖరి చూపుకు..' అన్న మాట వినగానే ఉలిక్కిపడ్డాడు పద్మాకర్.
"ఏంటి కోటయ్యా నువ్వంటున్నది? ఆఖరి చూపేమిటి?" అడిగాడు.
కోటయ్య కాస్త ఆశ్చర్యంగా చూశాడు పద్మాకర్ వైపు. రిక్షా ఇంకా ఆగే ఉంది రోడ్డుకి ఓ పక్కగా.
"ఏంటి బాబుగోరూ మీరొత్తుంది సుదర్శన్‌బాబు అంతిక్రియలకే కదా!" అన్నాడు. 
షాక్ కొట్టినట్లు కాసేపు కోటయ్య వంక చూసి "నువ్వు చెబుతోంది లీడర్ సుదర్శన్ గురించి కాదనుకుంటా, వేరే అతను అయివుంటాడు" అన్నాడు పద్మాకర్ తనని తాను సంభాళించుకుంటూ.
"నాకు తెల్సిన సుదర్శన్‌బాబు వొక్కరేనయ్యా. ఆ మాటకొత్తే నాయినపల్లిలోనే కాదు, యేటపాలెం మొత్తమ్మీద సుదర్శన్‌బాబంటే అందరికీ తెల్సింది ఆ బాబొక్కడే" గట్టిగా చెప్పాడు కోటయ్య.
తన మిత్రుడికేమీ కాదని ఎక్కడనో మిణుకు మిణుకుమంటున్న ఆశ, ధైర్యం చల్లారిపోయాయి పద్మాకర్‌లో. గుండె ఒక్కసారిగా బరువెక్కింది. గొంతు పూడుకుపోయింది. 
కళ్లు తడవుతున్నాయి.
"ఎలా.. ఎలా జరిగింది? ఇంత హఠాత్తుగా ఎలా పోయాడు? వారం రోజులు కాలేదే నేను వాడితో మాట్లాడి" అన్నాడు బలహీనమైన గొంతుతో. 
తిరిగి రిక్షా తొక్కుతూ చెప్పడం మొదలుపెట్టాడు కోటయ్య.
"నాల్రోజుల కింద నెక్లెసు నూక్కెళ్లాడనిజెప్పి ఓ కుర్రాణ్ని పోలీస్ స్టేషన్లో పెట్టి కుమ్మేశారు బాబూ. కానీ ఆ నెక్లెసు ఆ కుర్రాడు పనిచేసే ఆసామి ఇంట్లోనే దొరికింది. ఆ ఆసామి పెళ్లాం ఏదో పేరంటామికెళ్తా ఆ నెక్లెస్‌ని యాడో పెట్టి మర్సిపోయింది. ఆ కుర్రాణ్ని దొంగన్నారు. పోలీసులు ఆడొళ్లు ఊనంసేసి పారేశారు.
ఎస్సయ్యి బూటుకాలితో కొట్టిన దెబ్బకి ఆడి కాలొకటి ఇరిగిపోయింది. ఈ సంగతి బయట చెబ్తే పేణాలు తీత్తామని బెదరగొట్టి ఆడ్ని వొదిలేశారు. కానీ అట్లాంటి సంగతులు దాగుతయ్యా? సుదర్శన్‌బాబుకి తెల్సిపోయింది. కొంతమంది కుర్రోళ్లని ఎంటేసుకొని పోలీసోళ్ల మీద ఉద్దెమం లేవదీశాడు.
కొత్త కాల్వ బ్రిడ్జికాడ నాలుగ్గంటల్సేపు రాస్తారోకో సేసారు. అప్పుడు సూడాలి బాబూ.. అటు ఒంగోల్నించి వొత్తున్న బళ్లు, ఇటు సీరాల్నించి ఎళ్తున్న బళ్లు ఎంత దూరం ఆగిపోయినాయో! యేటపాలెం సెరిత్రలోనే అట్టాంటి ఉద్దెమం నేను సూళ్లేదు బాబూ. అప్పుడు సీరాల్నించి సీఐ వొచ్చి బెదిరిచ్చాడు. ఎవురూ లెక్కసెయ్యలా. ఆ తర్వాత డీఎస్పీ బాబే వొచ్చాడు. గదిమాడు. అరెస్టు జేత్తానని బెదిరిచ్చాడు. సుదర్శన్‌బాబోళ్లు అదర్లా, బెదర్లా. "సేతనైతే సేస్కోండి" అన్నాడు.
రోసమొచ్చి డీఎస్పీ అరెస్టు చెయ్యబోయాడు. ఉన్నపళాన జనం తిరగబడ్డారు. ఆళ్లలో నేనూ ఉన్నందుకు చాలా గర్వమనిపిత్తుంది బాబూ ఇయాల. జనాన్ని చూసి డీఎస్పీ పళ్లు పటపటమంటా కొరికి పోలీసుల్తోటి 'శార్జ'నో ఏందో అన్నాడు బాబూ. ముందు ఆయనే లాఠీ తీసుకుని కుర్రాళ్ల మీద పడ్డాడు. ఆయన్ని చూసి అక్కడున్న పోలీసులంతా లాఠీల్తోటి ఇరగతన్నారు బాబూ జనాన్ని.
సుదర్శన్‌బాబు ఇది సూళ్లేక డీఎస్పీకి అడ్డం పడ్డాడు. అంతలోకే ఆయన తలమీన లాఠీ దెబ్బ పడిందయ్యా. ఆ డీఎస్పీనే కొట్టాడో, ఇంకెవరు కొట్టారో అట్టానే కుప్పకూలిపోయాడు. దాంతోటి జనం ఇంకా రెచ్చిపొయ్యారు.
ఎవుర్ని ఎవురు కొడ్తన్నారో తెలీలా. ఎవురు ఎవుర్ని తొక్కేత్తన్నారో తెలీలా. గొడవ సల్లార్నాక జూత్తే ఏముందయ్యా.. నెత్తుటి మడుగులో ఉన్నాడు సుదర్శన్‌బాబు.
ఆస్పెత్రికి తీస్కపోదామంటే ట్రాఫిక్‌జామయ్యే. రెండు గంటలు పైనే పట్టింది ఆస్పెత్రికి ఎళ్ళేతలికి. అప్పటికే ఆ బాబు కోమాలోకి ఎల్లిపోయాడు. కొనూపిర్తో వున్నాడు.
రెండ్రోజులు సావుతో యుద్ధం జేశాడు. మా కోసం సేసిన యుద్ధాలు ఇంక సాలనుకున్నాడో ఏందో నిన్ననే ఊపిరి వొదిలేశాడు బాబూ".
కోటయ్య గొంతు పూడుకుపోయింది బాధతో. అప్పటికే పద్మాకర్ గుండె బరువెక్కింది. పదహారేళ్లుగా దూరమైపోయి, తిరిగి కలవాలని ఎంతో ఆశతో వస్తుంటే.. సెలవంటూ వెళ్లిపోయావా నేస్తం? ఈ మిత్రుడి మొహం చూడకూడదనుకున్నావా? టపటపమంటూ రెండు నీటి చుక్కలు కళ్లనుండి జారి తొడల మీద పడ్డాయి.
కోటయ్యే మాట్లాడాడు మళ్లీ. "నిన్న సాయంకాలమే పోట్టుమాట్టం సేసి శవాన్ని ఇంటికి పంపిచ్చారు. సుదర్శన్‌బాబు పోయాడని తెలియంగాల్నే ఆస్పెత్రికాడికి వొచ్చారు సూడయ్యా.. ఎంత జనమని! నేం కూడా ఎల్లాలే. పోలీసు నాయాళ్లు కూడా శానా మందున్నారు. ఏదైనా గొడవ జరుగుద్దేమోనని ముందుగాల్నే వంద మందికి తక్కువ కాకుండా ఆళ్లని పెట్టారు. కానీ జనం గొడవ సెయ్యలా! ఎందుకనంటే అప్పటికే ఆ డీఎస్పీని ఆఫీసర్లు సస్పెండు సేసేశారు".
రిక్షా ఆగింది. పద్మాకర్ దిగాడు. వీధి పొడుగూతా జనమే.
"జరగండి.. జరగండి" అని కాస్త గట్టిగా అరుస్తూ ముందుకు పోతున్నాడు కోటయ్య. వెనకే పద్మాకర్.
కాళ్లు వొణుకుతున్నాయి. గుండె కొట్టుకునే వేగం అమాంతం పెరిగింది. ఎదురుగా నేలమీద పాడె, దాని మీద శవం. పద్మాకర్‌కి మొదటగా కనిపించింది తాడుతో బొటనవేళ్లు కలిపి కట్టిన రెండు పాదాలు. బాధ పొగిలి పొగిలి వచ్చింది గుండెల్లోంచి. దగ్గరగా వెళ్లాడు. 
"అమ్మా. బాబు సావాసగాడంట. కలకత్తా నుంచి వొచ్చాడంట" చెప్పాడు కోటయ్య.
సుదర్శన్ భార్య తలెత్తి పద్మాకర్ వైపు చూసి చీరకొంగుని నోట్లో కుక్కుకుంది దుఃఖాన్ని అదిమి పెట్టడానికి. 
"అంకుల్! మీరొస్తున్నారని వారం రోజుల కింద నాన్న ఎంత సంబరంగా చెప్పాడో. పదహారేళ్ల తర్వాత ఫ్రెండుని కలవబోతున్నానని ఎంత ఆనందపడ్డాడో. ఇప్పుడిట్టా కలుసుకున్నారు.." అని వెక్కివెక్కి ఏడ్చింది సుదర్శన్ పదకొండేళ్ల కూతురు. ఆ అమ్మాయి తలని గుండెలకి అదుముకుని సుదర్శన్ మొహం వంక చూశాడు పద్మాకర్. అదే స్ఫురద్రూపం. ఏమాత్రం మారలేదు. కాకపోతే ఇప్పుడు కళ్లు మూసుకుని ఉన్నాయి. ముక్కు రంధ్రాల్లో దూది పెట్టి ఉంది.
సుదర్శన్ చెంపని తడిమాడు పద్మాకర్. దుఃఖాన్ని అదిమిపెట్టడం కష్టమైంది.
"ఏరా! ఇలా చూసేందుకా నేను వచ్చింది?" అంతకుమించి గొంతులోంచి మాటలు రాలేదు. కళ్లలోంచి నీళ్లు రాలుతున్నాయి.
తట్టుకోలేక ఇవతలకి వచ్చేశాడు.
సరిగ్గా అప్పుడే అతడి సెల్‌ఫోన్ రింగయ్యింది. కళ్లు తుడుచుకుని చూశాడు. 
ఏదో తెలీని నెంబరు. కాల్ రిసీవ్ చేసుకున్నాడు. 
"హలో సార్. నేను లక్ష్మణ్‌ని. ఇందాక ట్రైన్‌లో కలిసి జర్నీ చేశాం కదా. సార్ మీ ఫ్రెండుని కలిశారా? ఈ పాటికి కలిసే ఉంటారనిపించి ఆగలేక ఫోన్ చేశా సార్".
కొద్ది క్షణాల నిశ్శబ్దం తర్వాత ఫోన్‌లో పద్మాకర్ ఏడుపు గట్టిగా వినిపించింది లక్ష్మణ్‌కి.
(అయిపోయింది)

Saturday, March 19, 2011

హిట్.. హిట్.. హుర్రే..!: మనసంతా నువ్వే-2

చిన్ననాటి స్నేహితులు పెద్దవాళ్లయ్యాక ప్రేమికులు కావడం చాలా సినిమాల్లో చూశాం. చిన్నతనంలో స్నేహితులుగా విడిపోయిన ఓ అబ్బాయి, అమ్మాయి పెద్దయ్యాక ఒకర్నొకరు చూసుకోకపోయినా ఒకరిపట్ల మరొకరు విపరీతమైన ఆరాధనా భావాన్ని పెంచుకోవడం, తమ ఉనికి తెలీకుండా తమ పట్ల ఎదుటివాళ్లకి ప్రేమ ఉందో లేదో తెలుసుకోవాలని అనుకోవడం వైవిధ్యమైన పాయింట్. 'మనసంతా నువ్వే' ఘన విజయానికి దోహదం చేసిన ప్రధానాంశం ఇదే. నిర్మాత ఎమ్మెస్ రాజు ఇచ్చిన లైన్‌ని దర్శకుడు వి.ఎన్. ఆదిత్య, స్క్రిప్టు సహాయకుడు వీరు పోట్ల కలిసి డెవలప్ చేసి, కల్పించిన సన్నివేశాలూ, ఆ సన్నివేశాలకి పరుచూరి సోదరులు కూర్చిన సంభాషణలూ ఓ సున్నితమైన, భావోద్వేగపూరితమైన ప్రేమకథని సృజించాయి.
ఈ మధ్య కాలంలో వస్తున్న చాలా సినిమాల్లో బలవంతపు ప్రేమలే ఎక్కువ. హీరోనో, హీరోయినో 'నువ్వు నన్ను ప్రేమించకపోతే చంపేస్తా', 'నన్ను కాకుండా ఇంకొకర్ని చూశావా?' అనే బెదిరింపులే కనిపిస్తాయి. ఆ బెదిరింపులతోటే ప్రేమలు పుట్టినట్లు ఆ సినిమాల్లో చూపిస్తారు. అట్లా ప్రేమ స్థాయిని దిగజార్చిన సినిమాలు వస్తున్న కాలంలో ఒకరిపట్ల మరొకరు గుండె నిండా ప్రేమ నింపుకొని, వేరే ఇంకే ఆకర్షణకీ లొంగని ప్రేమికుల కథ వస్తే, గుండెల మీద పన్నీటి జల్లు కురిసినట్లే కదా!
మ్యూజికల్ వాచ్‌తో మ్యాజిక్
చిన్నతనంలో అనుకి జ్వరం తగిలినప్పుడు చంటి గుళ్లోని ఆంజనేయస్వామి విగ్రహం తెచ్చి అను వద్ద పెడతాడు. "నువ్వు గుడికి రాలేవు కదా. అందుకని దేవుణ్ణే నీ దగ్గరకు తీసుకొచ్చా" అన్న చంటి మాటల్లోని అమాయకత్వం, నిజాయితీకి ముచ్చటపడని వాళ్లెవరు? ఆ పిల్లల స్నేహం మనసుకి హత్తుకుంటే, ఆ ఇద్దరూ విడిపోయే సన్నివేశం బాధ కలిగిస్తుంది. ఆ సన్నివేశాన్ని కల్పించిన కథకుడూ, వాటిని కదిలించేలా చిత్రీకరించిన దర్శకుడూ.. ఇద్దరూ అభినందనీయులే. విడిపోయిన ఇద్దరూ పెరిగి పెద్దవాళ్లయ్యాక తిరిగి కలవాలంటే ఏదో ఒక 'సంధాన కర్త' ఉండాలి. అది ఓ జ్ఞాపకం కావచ్చు, ఓ వస్తువు కావచ్చు, ఓ వ్యక్తి కావచ్చు. ఈ సినిమాలో అలాంటి 'సంధానకర్త'గా కనిపించేది ఓ మ్యూజికల్ వాచ్. ఎమ్మార్వోగా పనిచేసే తన తండ్రికి బదిలీ కావడంతో చంటి నుంచి విడిపోక తప్పని స్థితిలో అను అతనికి ఆ మ్యూజికల్ వాచ్ ఇచ్చి, తను జ్ఞాపకం వచ్చినప్పుడల్లా దానితో ఆడుకొమ్మని చెబుతుంది. ఆ తర్వాత ఆ గడియారం కథలో ఓ మలుపుకి కారణమవుతుంది. ఆ గడియారాన్ని శ్రుతి (తనూరాయ్) వద్ద చూసి, ఆమె చెప్పిన మాటలు విని, చంటి అలియాస్ వేణు (ఉదయ్ కిరణ్)ని అపార్థం చేసుకుంటుంది అను. అలాగే ప్రీ క్లైమాక్స్‌లోనూ ఆ గడియారం తన వంతు పాత్ర పోషిస్తుంది. ఎంపీ కొడుకుతో అను పెళ్లి జరిగితేనే నీ చెల్లెలి పెళ్లి అనుకున్న ప్రకారం జరుగుతుందని అను తండ్రి వేణుని హెచ్చరిస్తే, చెల్లెలి కోసం తన ప్రేమని త్యాగం చేయాలనుకుంటాడు వేణు. అందుకే 'మనసంతా నువ్వే' సీరియల్ రచయిత్రి రేణు, తను ప్రేమించిన అను.. ఇద్దరూ ఒక్కరే అని తెలుసుకున్న తర్వాత కూడా ఆ సంగతి ఆమెకి చెప్పకుండా "ఇప్పుడు నాకు ఆ అమ్మాయే (అను) గుర్తురావడం లేదు. అసలు ఉందో, లేదో తెలీని అమ్మాయి మీద ప్రేమేంటండీ రేణు గారూ. నా మనసంతా మీరే ఉన్నారండీ..." అంటాడు వేణు.
"అనూయే మీకు గుర్తు లేనప్పుడు తనిచ్చిన గడియారం మీ దగ్గర ఎందుకుంది?" అనడుగుతుంది అను. నిజమే కదా అంటూ ఆ గడియారాన్ని సముద్రంలోకి విసిరేస్తాడు వేణు. అప్పుడు అతడి చెంప చెళ్లుమనిపించి, "యు ఆర్ ఎ చీట్. ఐ హేట్ యు" అంటా వెళ్లిపోతుంది అను. వేణు కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి. వాన కూడా మొదలవుతుంది. సరిగ్గా ఆ సమయంలోనే స్నేహితుణ్ణి వెతుక్కుంటూ వచ్చిన సునీల్ ఒడ్డున నీళ్లలో కనిపిస్తున్న గడియారాన్ని తీసుకుని వేణు వద్దకొస్తాడు. అతణ్ణి చూసి లేని నవ్వుని మొహంలోకి తెచ్చుకుంటూ ఇప్పటిదాకా అను, తను కలిసి మాట్లాడుకున్నామనీ, తను చాలా హ్యాపీగా ఫీలయ్యిందనీ అంటాడు వేణు.
గడియారాన్ని వేణు చేతిలో పెట్టిన సునీల్ "రేయ్. అప్పుడప్పుడు వర్షం కూడా మనకి చాలా మేలు చేస్తుందిరా. మన కన్నీళ్లని ఎదుటివాళ్లకి కనిపించకుండా దాచేస్తుంది. నువ్వు ఆ అమ్మాయికి ఏ కన్నీళ్లు మిగిల్చావో భగవంతుడు నీకు ఆ కన్నీళ్లే మిగిల్చాడురా. ఏడవరా. వర్షం వెలిసిపోయేలోపు కడుపారా ఏడువ్" అంటాడు ఉద్వేగంగా. దాంతో సునీల్‌ని గట్టిగా వాటేసుకుని ఏడ్చేస్తాడు వేణు.
ఇట్లా ఆ మ్యూజికల్ వాచ్‌ని ఈ ప్రేమకథలోని మలుపులకు ఉపయోగించుకున్నారు. గమనించాల్సిన అంశమేమంటే ఓసారి అపార్థానికి కారణమైన ఆ గడియారం ఇంకోసారి ప్రేమికులిద్దరూ విడిపోవడానికి కారణమైంది. ఈ రెండో సన్నివేశం ప్రేక్షకుల్ని అమితంగా కదిలిస్తుంది. ముఖ్యంగా సునీల్ డైలాగులతో వేణు పాత్ర పట్ల సానుభూతి పెల్లుబుకుతుంది. చెల్లెలి కోసం ప్రేయసికి తనంతట తానుగా దూరమయ్యే అతని పరిస్థితి ఎవర్ని మాత్రం కదిలించదు! ఆ సన్నివేశంలో వానపడటం, ఆ వానలో సునీల్ వద్ద కన్నీళ్లని దాచుకోవాలని వేణు ప్రయత్నించడం, దాన్ని గమనించిన సునీల్ మన కన్నీళ్లని ఎదుటివాళ్లకు కనిపించకుండా వర్షం దాచేస్తుందని అనడం.. రచయిత సన్నివేశ కల్పనా చాతుర్యానికి ఓ చక్కని ఉదాహరణ.
కీలకం చర్చావేదిక సన్నివేశం
ఇవన్నీ ఒక ఎత్తయితే ఆ రోజుల్లో టెలివిజన్లో పాపులర్ అయిన 'ప్రజావేదిక' కార్యక్రమం తరహాలో ఈ సినిమాలో 'స్నేహం-ప్రేమ' అనే అంశంపై పెట్టిన చర్చావేదిక సన్నివేశం ఒక్కటీ ఒక ఎత్తు. సినిమా మొత్తానికీ కీలకమైంది ఈ ఎపిసోడే. కథ ప్రధానమైన మలుపు తిరిగేది ఆ ఎపిసోడ్‌లోనే. సాధారణంగా సినిమాలో చర్చావేదిక అంటే సగటు ప్రేక్షకుడి దృష్టిలో విసుగు పుట్టించే వ్యవహారం. కానీ దాన్ని జనరంజకం ఎలా చేయొచ్చో ఈ సినిమా చూపించింది. ఆ చర్చావేదికలో పాల్గొన్న అను ఒక్కసారి ఆడది మనసిస్తే జీవితాంతం అతని కోసం ఎదురుచూస్తుందంటూ ఆవేశంగా మాట్లాడుతుంది. వేణు, శ్రుతి ప్రేమించుకుంటున్నారనే అపోహే ఆమె ఆవేశానికి మూలం. ఆ తర్వాత తన చిన్ననాటి నేస్తం గురించీ, ఆమె మీద ప్రేమ గురించీ ఆ కార్యక్రమంలో చెప్పిన వేణు.. ఆ స్నేహితురాలు కలిస్తే తనెవరో చెప్పకుండా ఆమె మనసులో ఏముందో తెలుసుకుంటాననీ చెబుతాడు. 'తూనీగా తూనీగా' పాట పాడతాడు. దాంతో అనుకి అతడి పట్ల ఉన్న అపోహ పటాపంచలవుతుంది. తన పట్ల అతడికి ఉన్న ప్రేమ సంగతి తెలుసుకుని ఆనందంతో ఉప్పొంగిపోతుంది. తను ఎదురైతే అతను ఏం చేయదలచుకున్నాడో అదే ప్రయోగాన్ని అతడి మీద తనే చేయాలని నిర్ణయించుకుంటుంది. అప్పట్నించీ తనెవరో చెప్పకుండా వేణుకి ఆమె దగ్గరయ్యే విధానం, అతడితో ఆమె ఆడే దాగుడుమూతలు ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్నాయి. తన చిన్ననాటి నేస్తాన్ని తెలుసుకోవడం కోసం రేణు పేరుతో 'మనసంతా నువ్వే' అనే సీరియల్ని అను రాయడం మరో ఆసక్తికర అంశం. ఇది రంగనాయకమ్మ 'రచయిత్రి' నవలని గుర్తు చేస్తుంది. ఆ నవలలో అనూరాధ అనే కలం పేరుతో రచనలు చేస్తుంది కథానాయిక విజయ. తన భార్యే అనూరాధ అనే సంగతి ఆమె భర్తకి తర్వాత తెలుస్తుంది. చిత్రమేమంటే 'రచయిత్రి' నవలా నాయిక కలం పేరు 'మనసంతా నువ్వే'లో నాయిక అసలు పేరు కావడం. కాకపోతే అ కథ వేరు, ఈ కథ వేరు.
సమష్టి కృషి ఫలితం
కథాకథనాలు రెండూ చక్కగా అమరడమే ఈ చిత్ర ఘన విజయానికి ప్రధాన కారణం. ఆ క్రెడిట్ కథా రచయిత ఎమ్మెస్ రాజు, సంభాషణల రచయితలు పరుచూరి సోదరులు, దర్శకుడు వి.ఎన్. ఆదిత్యకు దక్కుతుంది. తొలి సినిమా కావడం వల్లనేమో ఆదిత్యలోని 'ఫైర్' ప్రతి సన్నివేశ చిత్రణలోనూ కనిపిస్తుంది. ప్రధాన పాత్రలతో పాటు సపోర్టింగ్ కేరెక్టర్లనీ దర్శకుడు చక్కగా ఉపయోగించుకున్నాడు. హీరో స్నేహితుడిగా చేసిన సునీల్ పాత్ర, వీక్లీ ఎడిటర్ కూతురు శ్రుతి పాత్ర, అను తండ్రి గంగాధరం పాత్ర కథకి మంచి 'సపోర్ట్'నిచ్చాయి. ఆ పాత్రల్లో సునీల్, తనూరాయ్, తనికెళ్ల భరణి సరిగ్గా ఇమిడిపోయారు. ఇక హీరో వేణు పాత్రకి అతికినట్లు సరిపోయాడు ఉదయ్ కిరణ్. పాత్రలోని అమాయకత్వానికి మన పక్కింటబ్బాయిలా కనిపించే అతని ముఖం అచ్చుగుద్దినట్లు సరిపోయింది. అప్పటికే అతడికొచ్చిన లవర్ బాయ్ ఇమేజ్ దీనికి మరింత వన్నె అద్దింది. నిజానికి అనూరాధ పాత్రకి రీమాసేన్ ఛాయిస్ కాదు. హీరో పాత్రలో ఉన్న భావోద్వేగాలన్నీ ఆ పాత్రలోనూ ఉన్నాయి. ముఖ్యంగా హీరోకి తన ఐడెంటిటీ తెలీకుండా నటించే సన్నివేశాల్లో 'అండర్‌ప్లే' అవసరం. ఆ విషయంలో రీమాసేన్ ఓ మోస్తరుగానే నటించింది. అయినా ఆమెని ఆ పాత్రలో ప్రేక్షకులు ఆమోదించడానికి కారణం, ఆ పాత్రలోని బలమే. ఇక ప్రత్యేక పాత్రలో సీతారామశాస్త్రి కనిపించేది స్వల్ప సమయమే అయినా తమవైన డైలాగులతో, 'వాయిస్'తో బలమైన ముద్ర వేశారు. చంద్రమోహన్, సిజ్జు వంటివాళ్లు పాత్రల పరిధుల మేరకు రాణించారు.
సినిమాకి సగం బలం సంగీతమే అనేది నానుడి. ఈ సినిమాకి సంబంధించి అది అక్షరాలా నిజం. అప్పుడే ఎగిసిన సంగీత కెరటం ఆర్పీ పట్నాయక్ ఈ సినిమా పాటలకి వినసొంపైన, ఆహ్లాదకరమైన బాణీలనిస్తే, పదాలతో ఆడుకునే సీతారామశాస్త్రి చక్కని సాహిత్యాన్నందించారు. 'తూనీగ తూనీగ ఎందాక పరిగెడతావే రావే నా వంకా', 'చెప్పనా ప్రేమా చెలిమి చిరునామా' (టైటిల్ సాంగ్) పాటలు ఇప్పటికీ జనం నోళ్లలో నానుతూనే వుంటే, 'కిటకిట తలుపులు తెరిచిన కనులకు సూర్యోదయం', 'చెప్పవే ప్రేమా చెలిమి చిరునామా', 'ఆకాశానా ఎగిరే మైనా నీతో రానా' పాటలు మంచి హిట్టయ్యాయి. ఆర్పీ కూర్చిన నేపథ్య సంగీతమూ ప్రభావవంతమైందే. మిగతా సాంకేతిక నిపుణులూ తమ వంతు బాధ్యతల్ని సమర్థంగా నిర్వర్తించారు. ముఖ్యంగా ఎస్. గోపార్‌రెడ్డి కెమెరా అత్యుత్తమ స్థాయి పనితనాన్ని ప్రదర్శించింది. ఆరంభ సన్నివేశాల్లో, సముద్రం ఒడ్డున సన్నివేశాల్లో, పాటల్లో అది ఎలా హొయలు పోయిందో చూసి తీరాల్సిందే. అరకు అందాల్ని లాఘవంగా ఒడిసిపట్టింది ఆ కెమెరా. దర్శకుడు ఆదిత్య చెప్పినట్లు కె.వి. కృష్ణారెడ్డి ఎడిటింగ్ ప్రతిభ ఈ సినిమా కథనానికి బిగువుని చేకూర్చిపెట్టింది. 'మనసంతా నువ్వే' అందరి మనసుల్నీ దోచుకుని, పెట్టుబడికి ఐదు రెట్ల ఆదాయాన్ని అందించిందంటే అది సమష్టి పనితనం వల్లే.
(వచ్చే వారం ఎన్‌టీఆర్ 'ఆది' చిత్ర విశేషాలు)

Saturday, March 12, 2011

కథ: పదహారేళ్ల తర్వాత...

కృష్ణా ఎక్స్‌ప్రెస్ వేగంగా పరుగెత్తుతోంది. పద్మాకర్‌ని ఆనందం, ఉద్వేగం కలగలసిన భావం ఊపేస్తోంది. అది మొహంలో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది ఎదుటివాళ్లకి.
"ఏం సార్ మీలో మీరే నవ్వుకుంటున్నారు?" ఎదురుగా విండో పక్కన కూర్చున్న లక్ష్మణ్ అడిగాడు. అతనో ఇంజినీరింగ్ స్టూడెంట్. అప్పటికే ఇద్దరికీ పరిచయమయ్యింది.
"ఇంకో అరగంటలో వేటపాలెం వచ్చేస్తుంది. పదహారేళ్ల తర్వాత నా స్నేహితుణ్ణి కలవబోతున్నా!" పద్మాకర్ గొంతులో ఉద్వేగం దాగలేదు.
"పదహారేళ్ల తర్వాత మీ ఫ్రెండుని కలవబోతున్నారా! అబ్బా.. చాలా థ్రిల్లింగ్‌గా ఉండి ఉంటుంది మీకు. అవునా?" అడిగాడు లక్ష్మణ్.
"మామూలు థ్రిల్లింగ్ కాదు. వాడు నా ప్రాణమిత్రుడు. కాలేజీలో మూడేళ్లు కలిసి చదువుకున్నాం. మా క్లోజ్‌నెస్ చూసి మిగతా స్టూడెంట్స్, లెక్చరర్స్ తెగ ఆశ్చర్యపోయేవాళ్లు. మమ్మల్ని విడదీయాలని చూసిన వాళ్లు సక్సెస్ కాలేకపోయారు."
"మరి ఎలా విడిపోయారు?"
"బీఎస్సీ ఫైనలియర్‌లో ఉండగానే మా నాన్నకు ప్రమోషన్ మీద కలకత్తాకు ట్రాన్స్‌ఫర్ అయ్యింది. ఆయన అప్పుడు స్టేట్ బ్యాంకు మేనేజర్. ఎగ్జాంస్ అయ్యేలోగా నాలుగు నెలలు సుదర్శన్ వాళ్లింట్లోనే ఉన్నా. ఆ తర్వాత కలకత్తాకు వెళ్లిపోయా. మళ్లీ ఇప్పుడే రావడం."
"అప్పణ్ణుంచీ ఇద్దరి మధ్యా కమ్యూనికేషన్ లేదా?"
రైలు వేగం తగ్గింది.
"నేను కలకత్తాకి వెళ్లిన కొత్తలో రెండు మూడు ఉత్తరాలు రాసుకున్నాం. ఆ తర్వాత నేను ఎంబీఏ చదవడానికి వెళ్లిపోయా. చదువులో పడి నేను వాడికి ఉత్తరాలు రాయడం నిర్లక్ష్యం చేశా. అట్లా మా మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది. నెల రోజుల క్రితమే వాడితో మళ్లీ మాట్లాడా ఫోనులో. అప్పట్నించీ వాడెలాగ ఉన్నాడో చూడాలనే ఆరాటం. అందుకే ఈ ప్రయాణం."
రైలు బాపట్ల స్టేషనులో ఆగింది. దిగేవాళ్లు దిగుతుంటే, ఎక్కేవాళ్లు ఎక్కుతున్నారు.
"గుగ్గిళ్లోయ్.. గుగ్గిళ్లూ" అంటూ తిరుగుతున్న ఓ కుర్రాడిని పిలిచాడు పద్మాకర్. ఐదేసి రూపాయలకు రెండు పొట్లాలు తీసుకుని ఒకటి లక్ష్మణ్‌కిచ్చాడు. అతను మొహమాటపడుతూ తీసుకున్నాడు.
"గుగ్గిళ్లంటే సుదర్శన్‌కీ, నాకూ చాలా ఇష్టం. కాలేజీ దగ్గరకి ఓ ముసలామెతో పాటు ఇద్దరు ముగ్గురు గుగ్గిళ్లు తెచ్చేవాళ్లు. మేం మాత్రం రోజూ ఆ ముసలామె దగ్గరే కొనేవాళ్లం. ఒకసారి ఆమె ఆ గుగ్గిళ్లు అమ్ముతూనే గుండెపోటు వచ్చి చనిపోయింది" జ్ఞాపకం చేసుకున్నాడు పద్మాకర్.
"అసలు అన్నేళ్ల తర్వాత మీ ఫ్రెండ్ ఫోన్‌లో ఎలా దొరికాడు" అడిగాడు లక్ష్మణ్.
"ఫోన్ చేసింది నేను కాదు, వాడే. ఢిల్లీలో ఆ ఊరతను ఒకాయన పరిచయమయ్యాడు. అప్పుడు సుదర్శన్ గురించి అతనికేమన్నా తెలుసేమో అడిగాను. అతనేమన్నాడో తెలుసా? 'సుదర్శన్‌గారి గురించి తెలీకపోతే ఆ ఊరతను కానట్టే' అని. అయితే వాడి ఫోన్ నెంబర్ తెలీదనీ, వాడి పేరు, ఊరి పేరు రాస్తే చాలు లెటర్ వాడికి చేరుతుందనీ చెప్పాడు. అతను చెప్పినట్లే లెటర్ రాశా. అందులో నా ఫోన్ నెంబరు ఇచ్చా. నాలుగు రోజుల తర్వాత వాడు ఫోన్ చేశాడు" ఉత్సాహంగా చెప్పాడు పద్మాకర్.
రైలు కదిలింది.
"మీ ఫ్రెండ్ అక్కడ అంత ఫేమస్ ఫిగరా?" లక్ష్మణ్ గొంతుకలో కుతూహలం.
"అవును. ఆ ఊళ్లోనే కాదు, ఆ చుట్టుపక్కల ఊళ్ల వాళ్లకీ వాడు తెలుసంట! ఎందుకంటే ఆ ప్రాంతంలో అందరికంటే ఎక్కువసార్లు అరెస్ట్ అయ్యిందీ, జైలుకి వెళ్లిందీ వాడేనంట!" అని పద్మాకర్ చెప్పగానే గుగ్గిళ్లు తింటున్న వాడల్లా నోరెళ్లబెట్టాడు లక్ష్మణ్.
"జైలుకి వెళ్తుంటాడా? అంటే.." అని ఆగిపోయాడు.
"నీ ఉద్దేశం అతడు నేరాలు చేస్తూ జైలుకి వెళ్తుంటాడా? అని కదూ!.. కాదు. మామూలుగానైతే జైలుకి వెళ్లేది నేరాలు చేసేవాళ్లే. కానీ నా ఫ్రెండు అలాంటివాడు కాదు. అన్నిసార్లూ ఇతరుల కోసమే, వారి కోసం చేసిన పోరాటాల వల్లే జైలుకి వెళ్లాడు. పేదవాళ్లకి అన్యాయం జరిగితే కాళ్లూ చేతులూ ముడుచుకుని, నోరు మూసుకుని ఇంట్లో కూర్చోవడం వాడికి చేతకాదు. అందుకే అన్నిసార్లు జైలుకెళ్లాడు. ఇంకెన్నిసార్లు వెళతాడో! ఢిల్లీలో ఈ సంగతి చెప్పిన ఆ వ్యక్తి తనూ ఆ ఊరివాడైనందుకు గర్విస్తున్నానని చెప్పినప్పుడు నేను నిజంగా గర్వపడ్డాను, సుదర్శన్‌కి నేను మిత్రుడనైనందుకు. అలాంటి గొప్ప లీడర్ని వెంటనే చూడాలని మనసు కొట్టుకుపోయింది. అందుకే ఈ ప్రయాణం" చెబుతుంటే పద్మాకర్ గొంతు ఉద్వేగంతో పూడుకుపోయింది. వొళ్లు వణికింది. విండోలొంచి బయటకు చూశాడు. రైలుకట్ట పొడవూతా వరిచేలు పచ్చగా. అప్పుడే కోతలు మొదలు పెడుతున్నట్లుంది. గోచీలు బిగించి ఆడవాళ్లు కొడవళ్లతో పైరు కోస్తుంటే, మగాళ్లు వాటిని కుప్పలు పెడుతున్నారు.
అంతట్లోనే నూలు డయ్యింగులు ప్రత్యక్షమయ్యాయి. బొంగుల మీద ఎండకు ఆరబెట్టిన రంగురంగుల నూలు. ఈపూరుపాలెం స్టేషను దాటింది రైలు. అక్కడ ప్యాసింజర్లు మాత్రమే ఆగుతాయి. రైలు వేగం తగ్గుతోంది. చీరాల స్టేషన్ దగ్గరవుతోంది.
"ఇంకో పది నిమిషాల్లో వేటపాలెం వచ్చేస్తుంది" అన్నాడు లక్ష్మణ్ విండోలోంచి బయటకి చూస్తూ.
పద్మాకర్ తలూపాడు.
"మీరు చెబుతుంటే మీ ఫ్రెండుని చూడాలని నాకూ ఆరాటంగా ఉందండీ. ఆయన గురించీ, ఆయన పనుల గురించీ ఇంకా తెల్సుకోవాలన్న కోరిక కలుగుతోంది. అలాంటివాళ్లే నాకు స్ఫూర్తి. నేను మా కాలేజీ స్టూడెంట్ యూనియన్ లీడర్ని. కానీ నేను తప్పకుండా గూడూరుకి వెళ్లాలి. అమ్మకి ఆరోగ్యం బాలేదు" అన్నాడు లక్ష్మణ్ కాస్త విచారంగా.
"ఏంటి ప్రాబ్లెం అమ్మకి?" అడిగాడు పద్మాకర్.
చీరాల్లో ఆగింది రైలు.
"రెండ్రోజుల క్రితం ఇల్లు కడుగుతూ జారి గడప మీద పడిపోయిందంట! మడమ దగ్గర ఫ్రాక్చరంట! అసలే అమ్మకు సుగర్" చెప్పాడు అమ్మని జ్ఞాపకం చేసుకుంటూ లక్ష్మణ్.
"అరే.. అవునా! అమ్మ ఆరోగ్యం ముఖ్యం. నిన్ను చూశాక అమ్మకు కాస్త ధైర్యం రావచ్చు. ఇష్టమైన వాళ్లు దగ్గరుంటే మనిషిలో హుషారు వస్తుంది" చెప్పాడు పద్మాకర్. రైలు కదిలింది. పద్మాకర్ లేచి సీటుకింద పెట్టిన ఎయిర్‌బ్యాగ్‌ను లాగి సీటు మీద పెట్టాడు. తనలో కలుగుతున్న ఉద్వేగానికి ఆశ్చర్యపడ్డాడు. తనకి ఊహ తెలిశాక ఇటువంటి ఉద్వేగాన్ని ఎన్నడూ ఎరుగడు. ఎంబీఏలో టాపర్‌గా నిలిచినప్పుడు గానీ, ప్రతిష్ఠాత్మక ఢిల్లీ బిజినెస్ స్కూల్లో ఉద్యోగం వచ్చినప్పుడు గానీ ఇంతటి ఉద్వేగం కలగలేదు.
అంతలోనే రైలు స్పీడు తగ్గింది. వేటపాలెం స్టేషన్ వచ్చేస్తోంది. కిర్రుమని చప్పుడు చేస్తూ ఆగింది రైలు.
పద్మాకర్ దిగుతుంటే "మీ ఫ్రెండుని అడిగినట్లు చెప్పండి సార్. బై.." చెప్పాడు లక్ష్మణ్.
నవ్వి "బై" అంటూ రైల్లోంచి ఫ్లాట్‌ఫాం మీదకి అడుగుపెట్టాడు. స్టేషన్ కాస్త మారింది. ఇదివరకు ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు లేవు. అవతలివైపు ఫ్లాట్‌ఫాంకి షెల్టర్లు లేవు. ఇప్పుడు వచ్చాయి. స్టేషన్ బయటకొచ్చాడు. అక్కడ పెద్ద మార్పు కనిపించలేదు. మూడు నాలుగు రిక్షాలు, రెండు ఆటోలు ఉన్నాయి.
"సార్! ఆటో కావాలా? ఎక్కడికి?" అంటూ వచ్చాడు ఒక ఆటోవాలా.
త్వరగా సుదర్శన్‌ని చూడాలని ఉన్నా, రిక్షాలో వెళ్లాలని అనుకున్నాడు పద్మాకర్. రిక్షాలో అయితే ఊరు చూస్తూ వెళ్లొచ్చు.
అతణ్ణి పంపించేసి ఒక రిక్షా ఎక్కి "నాయనపల్లికి పోనీయ్" అని కూర్చున్నాడు.
రిక్షా పోతుంటే అటూ ఇటూ ఆశ్చర్యంగా చూస్తున్నాడు. జింఖానా క్లబ్, పోలీస్ స్టేషన్, గరల్స్ హైస్కూలు దాటింది రిక్షా.
"అరే ఇక్కడ సరస్వతీ పిక్చర్ ప్యాలెస్ ఉండాలే. విజయదుర్గా థియేటర్ అని మార్చారన్న మాట!" అన్నాడు రూపురేఖలు మారిపోయిన సినిమా హాలును చూస్తూ.
(మిగతా వచ్చే వారం) 

Friday, March 11, 2011

హిట్.. హిట్.. హుర్రే!: మనసంతా నువ్వే

తారాగణం: ఉదయ్ కిరణ్, రీమాసేన్, సిజ్జు, తనూరాయ్, చంద్రమోహన్, తనికెళ్ల భరణి, సునీల్, పరుచూరి వెంకటేశ్వరరావు, సిరివెన్నెల సీతారామశాస్త్రి, దేవదాస్ కనకాల, సుధ, రజిత, శివారెడ్డి, శివపార్వతి, కృష్ణవేణి, మాస్టర్ ఆనంద్ వర్ధన్, బేబీ జీబా, రఘునాథరెడ్డి, పావలా శ్యామల, శిరీష
కథ: ఎమ్మెస్ రాజు
స్క్రీన్‌ప్లే, రచన: పరుచూరి బ్రదర్స్
రచనా సహకారం: వీరు పోట్ల
పాటలు: సీతారామశాస్త్రి
ఛాయాగ్రహణం: ఎస్. గోపాల్‌రెడ్డి
కూర్పు: కె.వి. కృష్ణారెడ్డి
డాన్స్: సుచిత్రా చంద్రబోస్
కళ: రాజేశ్
డి.టి.ఎస్. మిక్సింగ్: డి. మధుసూదన్‌రెడ్డి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: బి. భాస్కరరాజు
నిర్మాత: ఎమ్మెస్ రాజు
దర్శకత్వం: వి.ఎన్. ఆదిత్య
బేనర్: సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్
నిడివి: 2 గంటల 37 నిమిషాలు
విడుదల తేది: 19 అక్టోబర్ 2001

గ్రాఫిక్స్‌ని నమ్ముకుని భారీ బడ్జెట్‌తో నిర్మించిన 'దేవీ పుత్రుడు' చిత్రం బాక్సాఫీస్ వద్ద కుదేలవడంతో సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ అధినేత ఎమ్మెస్ రాజు బాణీ మార్చాలనుకున్నారు. అందమైన ప్రేమకథని తెరకెక్కించాలని సంకల్పించారు. ఆ సమయంలో వి.ఎన్. ఆదిత్య అనే కుర్రాడి గురించి విన్నారు. డైరెక్టర్ జయంత్ సి. పరాంజీ వద్ద వరుసగా మూడు సినిమాలకి డైరెక్షన్ డిపార్ట్‌మెంట్లో పనిచేశాడు ఆదిత్య. అప్పటికే అతను తన స్నేహితుడైన త్రివిక్రం కథతో డైరెక్టర్ కావాలని ప్రణాళికలు వేస్తున్నాడు.
"ఎమ్మెస్ రాజు గారు కబురు పంపించిన వారం రోజులకి వెళ్లి కలిశా. ఆయనే ఓ లైన్ చెప్పారు. 'ఇది ప్రేమించుకుందాం రా సినిమా లైన్ సర్' అని చెప్పా. ఆయన నన్ను మెచ్చుకుని, అప్పుడు తన మనసులోని లైన్ చెప్పారు. ఆ తర్వాత పదిహేను రోజుల పాటు ఇద్దరం చాలా సినిమాల గురించి క్యాజువల్‌గా డిస్కస్ చేసుకుంటూ వచ్చాం. అంతాకా హీరో ప్రేమ విషయం స్నేహితులకి తెలియదన్నట్లుగా చూపించే సినిమాలే ఎక్కువగా వచ్చాయ్. కానీ ఎవరైనా తన ప్రేమని మొదటగా చెప్పుకునేది స్నేహితులకేననీ, సినిమాలో ఆ కోణం పెడితే బాగుంటుందనీ చెప్పా. ఆయన నన్ను హత్తుకుని 'నువ్వే నా డైరెక్టర్‌వి' అన్నారు. అడ్వాన్స్ ఇచ్చారు" అని ఆ రోజులు జ్ఞాపకం చేసుకున్నారు ఆదిత్య.
అలా ఎమ్మెస్ రాజు కథతో, పరుచూరి సోదరుల స్క్రీన్‌ప్లేతో, ఆదిత్య దర్శకత్వంలో తయారైన ప్రేమ కథాచిత్రం 'మనసంతా నువ్వే' 45 ప్రింట్లతో విడుదలై ఘన విజయం సాధించింది. కేవలం మూడు కోట్ల రూపాయలతో నిర్మించిన సినిమా దానికి ఐదు రెట్లు అంటే 15 కోట్ల రూపాయల్ని వసూలుచేసి పెట్టింది. 'దేవీపుత్రుడు' కారణంగా ఎంతో డబ్బు పోగొట్టుకున్న ఎమ్మెస్ రాజు ఎంతో నమ్మకంతో సొంతంగా రిలీజ్ చేసి, అనూహ్యమైన ఫలితాన్ని పొందారు. అప్పటికే 'చిత్రం', 'నువ్వు నేను' వంటి వరుస హిట్లు సాధించి, యువతలో క్రేజ్ సంపాదించుకున్న ఉదయ్ కిరణ్ 'మనసంతా నువ్వే'తో హ్యాట్రిక్ సాధించాడు. 'లవర్ బాయ్' ఇమేజ్‌ని సొంతం చేసుకున్నాడు. 'చిత్రం'లో హీరో హీరోయిన్లుగా పరిచయమైన ఉదయ్ కిరణ్, రీమాసేన్ జోడీ ఈ సినిమాతో రెండో సూపర్ హిట్ కొట్టింది. అప్పట్లో ఎక్కడ విన్నా 'తూనీగా.. తూనీగా' పాటే. ఆ పాటతోటే 'పాడుతా తీయగా' ఫేం ఉష సినీ గాయనిగా తళుక్కున మెరిసిపోయింది. అలాగే టైటిల్ సాంగ్ 'చెప్పనా ప్రేమా చెలిమి చిరునామా' కూడా హిట్.
ఈ సినిమాకి సంబంధించి ఆసక్తికరమైన విశేషం మరోటుంది. ఇందులో పనిచేసిన సాంకేతిక నిపుణుల్లో ఏడుగురు తదనంతర కాలంలో దర్శకులయ్యారు. కథా రచయిత అయిన నిర్మాత ఎమ్మెస్ రాజు 'వాన'తో, సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ 'అందమైన మనసులో'తో, సినిమాటోగ్రాఫర్ ఎస్. గోపాల్‌రెడ్డి 'నా ఆటోగ్రాఫ్'తో, కొరియోగ్రాఫర్ సుచిత్రా చంద్రబోస్ 'పల్లకిలో పెళ్లికూతురు'తో, కో-డైరెక్టర్ శంకర్ కె. మార్తాండ్ 'ఎవరైనా ఎపుడైనా'తో, పబ్లిసిటీ డిజైనర్ రమేశ్‌వర్మ 'ఒక ఊరిలో'తో, రచనా సహకారం అందించిన వీరు పోట్ల 'బిందాస్'తో దర్శకులుగా పరిచయమయ్యారు.

కథా సంగ్రహం:
అరకులో చంటి, అనూరాధ ఇరుగుపొరుగు వాళ్లు. చంటివాళ్లు కడు బీదలైతే, అను తండ్రి గంగాధరం ఎమ్మార్వో. అంతస్తులు వాళ్ల దోస్తీకి అడ్డుకాలేదు. తండ్రికి ట్రాన్స్‌ఫర్ కావడంతో అను వెళ్లిపోతుంది. వెళ్లేప్పుడు చంటికి తన జ్ఞాపకంగా ఓ మ్యూజిక వాచ్ ఇచ్చి వచ్చే ఏడాది తన పుట్టినరోజున అక్కడి ఆంజనేయస్వామి గుడివద్ద కలుసుకుందామని చెబుతుంది అను. తల్లిదండ్రులిద్దరూ చనిపోయి అనాథ అయిన చంటి రైల్వే స్టెషన్లో ఇడ్లీలు అమ్ముకుని బతుకుతుంటాడు. ఓ రోజు రైలెక్కుతున్న ఓ పాప బంగారు గోలుసు జారి కిందపడిపోతే, దాన్ని తీసుకెళ్లి ఆ పాప తండ్రి మోహన్ (చంద్రమోహన్)కి ఇస్తాడు. చంటి అనాథ అని తెలుసుకుని ఆ కుటుంబం అతన్ని తమతోపాటు తీసుకువెళ్తుంది. చంటికి వేణు అని పేరు పెడతారు.
వేణు (ఉదయ్ కిరణ్)కి 22 యేళ్లు వస్తాయి. అతనికి సునీల్ (సునీల్) మంచి ఫ్రెండ్. పన్నెండేళ్ల నుంచీ ప్రతి ఏడాదీ అరకులోని ఆంజనేయస్వామి గుడికి వెళ్తూనే వుంటాడు వేణు. కానీ ఇంతవరకు అను తారసపడలేదు. చెల్లెలు రేఖ (శిరీష)ని కాలేజీ వద్ద ఎంపీ కొడుకు స్నేహితుడు అల్లరి పెడుతుంటే వాణ్ణి కొడతాడు వేణు. అతను ఓ సూపర్‌మార్కెట్లో దూరితే వెంటపడి కొట్టే క్రమంలో పొరపాట్న అతడి దెబ్బ ఆ సూపర్ మార్కెట్ ఓనర్‌కి తగులుతుంది. పోలీసులు వేణుని తీసుకుపోబోతుంటే కొట్లాట సంఘటనని షూట్ చేసిన ఓ టీవీ చానల్ ప్రతినిధి శ్రుతి (తనూరాయ్) నిజంచెప్పి అతణ్ణి విడిపిస్తుంది. అదివరకే వేణు, 'స్వాతి' ఎడిటర్ కూతురైన శ్రుతి స్నేహితులవుతారు. మలేషియాలో మేనమామ వద్ద ఉన్న అను (రీమాసేన్) చదువు పూర్తికాగానే ఇండియాకి తిరిగొస్తుంది.
తన చిన్నటి జ్ఞాపకాలతో స్వాతి వీక్లీలో 'మనసంతా నువ్వే' అనే సీరియల్ రాయడం ప్రారంభిస్తుంది అను. అది చూసి చంటి వస్తాడనేది ఆమె ఆశ. అతి తక్కువ కాలంలోనే ఆ సీరియల్ పాపులర్ అవుతుంది. వేణు చెల్లెలు రేఖకి పెళ్లిచూపులు జరుగుతాయి. ఆ పెళ్లికొడుకు తండ్రి ఎవరో కాదు. ఇదివరలో వేణువల్ల పొరపాట్న దెబ్బతిన్న సూపర్‌మార్కెట్ ఓనర్. వేణుని చూసి అతను ఆగ్రహంతో ఊగిపోయి, ఆ సంబంధం ఒద్దనుకుని వెళ్లిపోబోతాడు. అప్పుడు పొరబాట్న కొట్టాననీ, దయచేసి పెళ్లి ఆపకండనీ, తానసలు వాళ్ల కొడుకునే కాదనీ బ్రతిమలాడుతూ క్షమాపణలు కోరతాడు వేణు. అయితే వేణుని అవమానించినందుకు మోహన్ పెళ్లివాళ్లని తిట్టి పంపేస్తాడు. బాధలో ఉన్న వేణుని బార్‌కి తీసుకెళ్లి తనతో పాటు మందు తాగిస్తాడు మోహన్. డబ్బులు తక్కువవుతాయి. శ్రుతికి ఫోన్ చేస్తాడు వేణు. ఆమె వచ్చి డబ్బు కడుతుంది. మత్తులో ఆమెకి మ్యూజికల్ వాచ్ ఇస్తాడు వేణు. మరుసటిరోజు ఆ వాచ్‌ని గమనించి, దాని గురించి శ్రుతిని ఆరా తీస్తుంది అను. అది తన బాయ్‌ఫ్రెండ్ వేణు ఇచ్చాడని చెబుతుంది శ్రుతి. నిర్ఘాంతపోతుంది అను. వేణుని తప్పుగా అర్థం చేసుకుంటుంది. శ్రుతికి వాచ్ ఇచ్చాననన్న సంగతి జ్ఞాపకమొచ్చి ఆమె ఇంటికి వెళ్లి, ఆ వాచ్ తనకు చిన్ననాటి స్నేహితురాలు అను ఇచ్చిన సంగతి చెప్పి, తిరిగి తీసుకుంటాడు. టీవీ చానల్లో జరుగుతున్న 'స్నేహం-ప్రేమ' చర్చా కార్యక్రమంలో అను, వేణు పాల్గొంటారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి సంధానకర్తగా వ్యవహరించే ఆ చర్చలో ప్రేమ సక్సెస్ అయినా, ఫెయిలైనా అందులో ఆడా, మగా ఇద్దరికీ సమాన పాత్ర ఉందంటూ, తన చిన్ననాటి స్నేహం గురించి చెబుతాడు వేణు. తన నేస్తం కలిస్తే తనెవరో చెప్పననీ, ఆమె మనసులో ఏముందో మొదట తెలుసుకుంటాననీ అంటాడు. అది విని అతడి మనసులో తనకున్న స్థానం అర్థమై ఆనందంతో ఉప్పొంగిపోతుంది అను. తన మీద అతడు చేయాలనుకున్న ప్రయోగాన్ని అతడిమీద తనే చేస్తుంది. తనెవరో చెప్పకుండా వేణుతో స్నేహం పెంచుకుంటుంది. వేణు కుటుంబానికీ సన్నిహితమవుతుంది. వేణు చెల్లెలికి మరో సంబంధం కుదురుతుంది.
అయితే అనుకోని రీతిలో తనతో వియ్యమందమంటూ ఎమ్మార్వోతో పెళ్లి ప్రపోజల్ పెడతాడు ఎంపీ (దేవదాస్ కనకాల). వియ్యమందితే వచ్చే 500 కోట్ల రూపాయల రైల్వే కాంట్రాక్టుకి ఆశపడి అనుని ఎంపీ కొడుక్కిచ్చి చేయడానికి ఆనందంగా ఒప్పుకుంటాడు గంగాధరం. తండ్రికి చంటితో తన ప్రేమ గురించి చెబుతుంది అను. 'మనసంతా నువ్వే' సీరియల్లో జరుగుతున్న సంఘటనలు చదివి రేణు, అను ఒక్కరే అని తెలుసుకుంటాడు వేణు. అనుని కలవడానికి తహతహలాడుతున్న వేణుని గంగాధరం కలిసి, నీ చెల్లి పెళ్లి జరగాలంటే ఎంపీ కొడుకుతో తన కూతురి పెళ్లి జరగాలనీ అంటాడు. ఇప్పటికే ఓసారి పెళ్లి ఆగిందనీ, ఈ పెళ్లి కూడా ఆగితే నీ తండ్రి గుండె ఆగిపోతుందనీ బెదిరిస్తాడు. చెల్లి కోసం తన ప్రేమని త్యాగం చెయ్యడానికి సిద్ధపడతాడు వేణు. ఆ తర్వాత ఏమయ్యింది? అను, వేణు ఎలా ఒక్కటయ్యారు? అనేది క్లైమాక్స్.

నేను దాన్ని పట్టుకోలేకపోయా
-వి.ఎన్. ఆదిత్య
అప్పట్లో పరుచూరి బ్రదర్స్ వద్ద వీరు పోట్ల అసిస్టెంట్‌గా ఉన్నాడు. నేను, వీరు స్క్రిప్ట్ వర్క్ చేశాం. మేం చేసిన వర్క్‌ని ఎప్పటికప్పుడు రాజు గారు చెక్‌చేసి, మమ్మల్ని సరైన ట్రాకులో పెడుతూ వచ్చారు. మరోవైపు గోపాలకృష్ణ గారు డైలాగ్ వెర్షన్ రాస్తూ వచ్చారు. స్క్రిప్టు పూర్తయ్యాక 'మహేశ్‌తో చేద్దామా?' అనడిగారు రాజు గారు. అది మహేశ్ వంటి మాస్ హీరోకి సరిపోదనీ, అప్పుడే లవర్ బాయ్ ఇమేజ్ తెచ్చుకుంటున్న ఉదయ్ కిరణ్ అయితే బాగుంటుందనీ చేప్పా. అలా అతను ఈ ప్రాజెక్టులోకి వచ్చాడు. చంటి పాత్రలోని అమాయకత్వానికి మన పక్కింటబ్బాయిలా కనిపించే అతని ముఖం అచ్చుగుద్దినట్లు సరిపోయింది.
ఆ రోజుల్లో టీవీలో గొల్లపూడి మారుతీరావు గారి 'ప్రజావేదిక' కార్యక్రమం సూపర్‌హిట్. సినిమాలో మేం పెట్టిన 'ప్రేమ-స్నేహం' చర్చావేదికకి ప్రేరణ అదే. మా ప్రేమకథకి కీలకమైంది ఆ ప్రజావేదిక సన్నివేశమే. అందులో ప్రయోక్తగా వ్యవహరించే పాత్రకి మారుతీరావు గారినే తీసుకోవాలనుకున్నాం. చివరికి సీతారామశాస్త్రి గారు దాన్ని అమోఘంగా చేశారు. ఆ సీనులో తను చెప్పే డైలాగ్స్‌తో పాటు ఉదయ్ డైలాగ్స్‌ని రాసింది ఆయనే. సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్‌లో రీషూట్ లేని ఏకైక చిత్రం 'మనసంతా నువ్వే'. మీకో సంగతి చెప్పాలి. నేను పోస్ట్ ప్రొడక్షన్స్‌లో ఉంటే, 'చెప్పవే ప్రేమా చెలిమి చిరునామా' పాటలో కొంత భాగాన్ని రాజు గారే చిత్రీకరించారు. రీమాసేన్, సిజ్జు మధ్య ఎయిర్‌పోర్ట్ సీనుని తీసిందీ ఆయనే.
సినిమా విడుదలయ్యాక మారుతీరావు గారి నుంచి ఫోన్ వచ్చింది. సినిమాలోని ప్రతి షాట్ గురించీ ఆయన విశ్లేషిస్తూ, ప్రశంసిస్తూ మాట్లాడారు.
కృష్ణారెడ్డి ఎడిటింగ్ గురించి కూడా చెప్పాలి. ఎడిటింగ్ రూములో ఉన్నప్పుడు చివరలో ఎమోషన్స్ మిస్సయ్యాయని రాజు గారు, గోపాలకృష్ణ గారు భావించారు. అప్పుడు 'నీ స్నేహం..' పాటని మరో చోట కూడా 'కట్.. పేస్ట్' చేశారు కృష్ణారెడ్డి. దాంతో ఎమోషన్స్ బ్రహ్మాండంగా క్యారీ అయ్యాయి. నేను దాన్ని పట్టుకోలేకపోయా. రీ రికార్డింగ్‌తో ఆ సీన్ బాగా పండింది. ఆ సినిమా రిలీజ్ అయ్యాక 'నీ స్నేహం' సినిమా కోసం అందులో నటిస్తున్న కె. విశ్వనాథ్ గారు రాజు గారి ఆఫీసుకి వచ్చారు. 'ఏడయ్యా. నీ డైరెక్టర్ని పరిచయం చెయ్యవా?' అనడిగారు రాజు గార్ని. నన్ను పరిచయం చెయ్యగానే 'ఇంత చిన్నవాడివా. యాన్ యంగ్‌స్టర్ విత్ గుడ్ టేస్ట్' అని మెచ్చుకున్నారు. అలాగే ఓసారి చిరంజీవి గారింటికి నేను వెళ్లిన సమయంలో ఆయన 'మనసంతా నువ్వే'ని డీవీడీలో చూస్తున్నారు. స్క్రీన్‌ప్లే గురించి మాట్లాడి మెచ్చుకున్నారు. ఇలా చాలామంది పెద్దవాళ్ల నుంచి మంచి మంచి ప్రశంసలు అందుకున్నా.
(వచ్చే వారం 'మనసంతా నువ్వే' విజయానికి దోహదం చేసిన అంశాలు)

Friday, March 4, 2011

హిట్.. హిట్.. హుర్రే!: నువ్వు నాకు నచ్చావ్-2

ఒకరితో నిశ్చితార్థం జరిగిన అమ్మాయి, తనకు తెలీకుండానే మరొకర్ని ప్రేమిస్తే.. ఆ అమ్మాయి ఎవర్ని పెళ్లి చేసుకోవాలి? ఆమె ప్రేమని పొందిన యువకుడూ ఆమెని అమితంగా ప్రేమించి, పెద్దల్ని కష్టపెట్టకూడదనే ఒకే కారణంతో మౌనంగా ఉండిపోవడం ఎంతవరకు సమంజసం? ఇంతకీ పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకోవాలా, మనసుకి నచ్చిన వాళ్లని మనువాడాలా? ఎన్ని ప్రశ్నలు! ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం 'నువ్వు నాకు నచ్చావ్' చిత్రం!! మనసులు కలవని అమెరికా సంబంధం కంటే మనసుకి నచ్చిన మనూరబ్బాయే ఎంతో మేలని చెప్పిన ఈ చిత్రాన్ని తిరుగులేని విధంగా దీవించారు ప్రేక్షకులు. చేసిన వ్యాయానికి రెట్టింపు పైగా ఆదాయాన్ని సమకూర్చిపెట్టారు. ఈ సీరియస్ విషయాన్ని సీరియస్‌గా కాక, వినోదాల విందుగా చిత్రించిన దానికి దక్కిన ప్రయోజనం ఇది.
'కథ తక్కువ కథనం ఎక్కువ' తరహాకి చెందిన 'నువ్వు నాకు నచ్చావ్' చిత్రం మూడు గంటలపైగా నిడివి ఉన్నా బోర్ కొట్టకపోవడానికీ, ఆద్యంతం ఆహ్లాదాన్ని పంచడానికీ కారణం చకచకా పరుగులెత్తిన సన్నివేశాలూ, జరజరా ఉరకలెత్తిన సంభాషణలూ. చిత్రంలోని దాదాపు అన్ని సన్నివేశాలూ సహజంగానే తోస్తాయి. ఏ సన్నివేశాన్ని తీసుకున్నా 'అవును. నిజంగా కూడా ఇలాగే కదా జరిగేది' అనిపించడమే ఈ చిత్రం ప్రత్యేకత.
చాలా సినిమాల్లో కనిపించినట్లు ఈ సినిమాలో నందిని, వెంకీలది 'లవ్ ఎట్ ఫస్ట్ సైట్' కాదు. ఏ బాధలూ లేకుండా సరదాగా జీవితాన్ని గడిపే కుర్రాడు వెంకీ అయితే ఇంకో రెండు నెలల్లో పెళ్లి చేసుకుని అమెరికా వెళ్లే స్థితిలో ఉన్న చక్కని చుక్క నందిని. ఆమె తన తండ్రి స్నేహితుని కూతురనీ, మరొకరితే నిశ్చితార్థం జరిగిందనీ వెంకీకి తెలుసు. అందుకే ఆమెని మొదట మరోభావంతో అతను చూడలేదు. ఉడుకు వయసు కారణంగా ఇద్దరూ ఒకర్నొకరు ఆటపట్టించుకుంటూ ఉంటారు. మొదట అతడంటే చులకన భావం ఉన్న నందు అతడి మనసెంత స్వచ్ఛమైందో గ్రహించాక తనకు తెలీకుండానే క్రమంగా అతడి పట్ల ఆకర్షితురాలవుతుంది. ఇక్కడ్నించీ ఇద్దరి మనసుల్లోని సంఘర్షణని దర్శకుడు ఎంతో నేర్పుగా సెల్యులాయిడ్ మీద చిత్రించాడు.
భారతీయ సంప్రదాయం ప్రకారం మనసు ఎవరి మీదున్నా మనువాడిన వాడే స్త్రీకి సర్వస్వం. నిశ్చితార్థం అంటే సగం పెళ్లయిపోయినట్లే. కాబోయే వరుడి మీదే అమ్మాయి దృష్టంతా లగ్నం కావాలి. ఆ నిశ్చితార్థం అయ్యాక మరో మగాడు ఆమె జీవితంలో ప్రవేశించడమన్నది మన సెంటిమెంట్‌కి విరుద్ధమైన సంగతి. ఆ యాంటీ సెంటిమెంట్ వ్యవహారాన్ని అందరిచేతా ఔననిపించాలి. ఇక్కడ కథనం ఏమాత్రం బేలెన్స్ తప్పినా అభాసవుతుంది. రచయిత, దర్శకుడి పనితనం ఎలాంటిదో బయటపడేది ఇలాంటి సున్నిత సందర్భాల్లోనే. ఆ విషయంలో విజయభాస్కర్, త్రివిక్రం జంటగా విజయం సాధించారు.
తన మనసు బయటపెట్టినా, ఎంతగా ప్రయత్నిస్తున్నా వెంకీ నుంచి ఆశించిన స్పందన రానందుకు బాధపడుతూ 'ఒక్కసారీ చెప్పలేవా నువ్వు నచ్చావనీ..' అని పాడుతుంది నందు. దానికి సమాధానమిస్తూ పాట చివరలో నందూని దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకోబోయి తమాయించుకుని వొదిలేస్తాడు వెంకీ.
"ఎందుకిలా చేస్తున్నావ్ నువ్వు? ఒక్క క్షణం చాలా దగ్గరగా ఉన్నట్లు అనిపిస్తావ్. ఒక్క క్షణం అస్సలు పరిచయం లేనట్లు దూరంగా ఉండిపోతావ్. ఒక్కోసారి నీతో ఏదైనా మాట్లాడాలనిపిస్తుంది. ఒక్కోసారి ఏం మాట్లాడాలన్నా భయమేస్తుంది. ఎందుకు? నువ్వే బాధపడతావ్. నువ్వే ఓదారుస్తావ్. ఒక్కోసారి నవ్విస్తావ్. ఒక్కోసారి ఏడిపిస్తావ్. నన్నెందుకిలా హింసిస్తున్నావ్? ఎందుకు నన్ను పిచ్చిదాన్ని చేస్తున్నావ్? అసలు నా లైఫ్‌లోకి ఎందుకొచ్చావ్? వై వెంకీ? ఎందుకిలా చేస్తున్నావ్? చెప్పు" అని అతడి గుండెల మీద తలపెట్టి ఏడుస్తుంది నందు.
ఒక అబ్బాయిని పిచ్చిగా ప్రేమించిన అమ్మాయి అతడు తనకు కాసేపు దగ్గరగా, మరికాసేపు దూరదూరంగా ఉండటాన్ని తట్టుకోలేక వేసిన ఈ ప్రశ్నలు ప్రేక్షకుల గుండెని తడి చేయకుండా ఉంటాయా? జీవితంలో ప్రేమలో పడిన ఎవరైనా ఆ పాత్రలతో, ఆ సన్నివేశాలతో సహానుభూతి చెందకుండా ఉంటారా? అంతదాకా ఆ పాత్రలు తెరనిండా చేసిన అల్లరిలో, చిలిపి చేష్టల్లో తమని తాము చూసుకున్న ప్రేక్షకులు ఈ ఆర్ద్రమైన సన్నివేశాన్ని కూడా సొంతం చేసుకున్నారు. నవ్వుల్లో ముంచెత్తే సన్నివేశాల్నే కాదు, హృదయాన్ని తడిచేసే సన్నివేశాల్నీ కల్పించగలనని త్రివిక్రం నిరూపిస్తే, ఆ సన్నివేశాల్ని అంతే హృద్యంగా తీయగలనని విజయభాస్కర్ నిరూపించాడు.
ఇక ఈ సినిమాలో వినోదాన్ని పంచే సన్నివేశాలకు కొదవ లేదు. వెంకటేశ్, సునీల్ కాంబినేషన్‌లో వచ్చే ప్రతి సన్నివేశమూ నవ్వులు పూయిస్తుంది. అన్నిటికీ మించి ప్రధానమైన హీరో అల్లరివాడైతే ఎంత వినోదం! ఎంత అహ్లాదం!! చక్కని కామెడీ టైమింగ్ ఉన్న హీరోల్లో మొదటి వరుసలో నిలిచే వెంకటేశ్‌కి అల్లరి పాత్ర లభిస్తే చెడుగుడు ఆడకుండా ఉంటాడా? వెంకీ పాత్రలో విపరీతమైన అల్లరి చేశాడు. తెరనిండా నవ్వుల జడివాన కురిపించాడు. నలభయ్యో పడిలో పడినా పదిహేడేళ్ల పరువాల చిన్నది ఆర్తీ సరసన పాతికేళ్ల కుర్రాడిలానే కనిపించి మెప్పించాడు. త్రివిక్రంలోని హాస్యప్రియుడు యమ సీరియస్‌గా ప్రవర్తించే మూర్తి (ప్రకాశ్‌రాజ్) పాత్రతో కూడా ఓ సందర్భంలో ఆపుకోలేని నవ్వుని సృష్టించాడు. హాలీవుడ్ సినిమా 'మీట్ ద పేరెంట్స్' ప్రేరణతో అతను కల్పించిన డైనింగ్ టేబుల్ సీన్ ఇప్పటికీ కళ్లముందు మెదిలి పెదాలపై నవ్వులు మొలిపిస్తుందన్నది నిజం. అమ్మ మీద ప్రేమ ఉన్న మూర్తి ఆమె మీద కవిత చదువుతుంటే వెంకటేశ్ ప్రదర్శించే హావభావాలు చూడాల్సిందే.
ఈ సినిమా విజయంలో ఆర్తీ అగర్వాల్‌దీ కీలక భాగస్వామ్యమే. నందిని పాత్రలో ముగ్ధమోహనంగా కనిపించడమే కాక, ఆ పాత్రలో మమేకమై నటించి, సగటు ప్రేక్షకుణ్ణి సమ్మోహితుణ్ణి చేసింది. వెంకటేశ్ కంటే వయసులో ఐదేళ్లు చిన్నవాడైన ప్రకాశ్‌రాజ్ హీరోయిన్ తండ్రిగా నడివయసు పాత్రలో బాగా రాణించాడు. ఎమ్మెస్ నారాయణ, చంద్రమోహన్, తనికెళ్ల భరణి, సుదీప, ఆషా సైనీ, పృథ్వీ తమ పాత్రలకు న్యాయం చేశారు.
రెండు మూడు సన్నివేశాల్లోనే కనిపించినా సుహాసిని పాత్రని ఉపయోగించుకున్న తీరు కూడా ముచ్చట వేస్తుంది. నందు మేనత్త అంటే మూర్తి చెల్లెలి పాత్ర వేసింది సుహాసిని. తన నిశ్చితార్థానికి కాకుండా తర్వాతెప్పుడో వచ్చిన మేనత్తని నందు ప్రశ్నిస్తే "పెళ్లయిన రోజు నుంచి మనం కలలు కనే హక్కుని కోల్పోతాం. కేవలం పిల్లల్ని కంటానికి మాత్రమే పనికొస్తాం. పెళ్లయ్యాక ఆడపిల్ల ఇల్లు మారుతుంది. ఊరు మారుతుంది. ఇంటిపేరు మారుతుంది. కానీ మనసెందుకు మారదు?.. మనం ఆడుకున్న బొమ్మలు, మనం పెంచుకున్న మొక్కలు, మనవాళ్లతో చెప్పుకున్న కబుర్లు, ఆ జ్ఞాపకాలు.. మనల్నెందుకు వెంటాడాలి? మనల్నెందుకు ఏడ్పించాలి? ఈ పెళ్లిళ్లెందుకవ్వాలి? మనం అసలు ఆడపిల్లలుగా ఎందుకు పుట్టాలి?" అని ఆవేదన చెందే సుహాసినితో మహిళా ప్రేక్షకులు బాగా సహానుభూతి చెందారు.
ఇక ఈ చిత్రంలోని పాటలు మనసుకి ఎంత ఉల్లాసాన్నిచ్చాయో చాలామందికి తెలిసిన సంగతే. కోటి అందించిన స్వరాలకు సీతారామశాస్త్రి సాహిత్యం తోడై పాటలన్నీ హిట్టయ్యాయి. 'ఆకాశం దిగివచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి', 'నా చూపే నిను వెతికినది నీ వైపే నను తరిమినది', 'ఉన్నమాట చెప్పనీవు ఊరుకుంటే ఒప్పుకోవు ఇంకెలాగే సత్యభామా', 'నా చెలియ పాదాలు హంసలకే పాఠాలు', 'ఒక్కసారీ.. చెప్పలేవా నువ్వు నచ్చావనీ' పాటల్లో ఏది జనం నోళ్లలో నానలేదని చెబుతాం! భువనచంద్ర రాసిన ఒకే పాట 'ఆ నీలి గగనాన మెరిసేటి ఓ దివ్యతారా'ది కూడా అదే బాణీ. చిత్రీకరణ విషయంలోనూ ఈ పాటలది అగ్ర తాంబూలమే. రవీంద్రబాబు కెమెరా కళ్లు పాటలన్నింటినీ అందంగా చిత్రించాయి. ఆయా సన్నివేశాలు బాగా పండటానికి అతను తీసిన క్లోజప్ షాట్స్ దోహదం చేశాయి. కొత్తమ్మాయి ఆర్తీ అభినయ సామర్థ్యాన్ని ఆ క్లోజప్సే పట్టించాయి. ఈ సినిమాకి నేపథ్య సంగీతమూ ఒక ప్లస్సే. మూడు గంటల నాలుగు నిమిషాల ఈ సినిమా ప్రేక్షకులకి విసుగు పుట్టించకుండా నవ్వుల నావలా సాగడంలో తోడ్పడిన మరో అంశం అత్యంత ప్రతిభావంతులైన ఎడిటర్లలో ఒకరైన శ్రీకరప్రసాద్ ఎడిటింగ్ నేర్పు. సినిమా అంతా 'కలర్‌ఫుల్'గా భాసించడానికి పేకేటి రంగా కళా నైపుణ్యమూ కారణమే. ఇలా అన్ని విభాగాలూ చక్కగా పనిచేసినందునే 113 ప్రింట్లతో విడుదలైన 'నువ్వు నాకు నచ్చావ్' 93 కేంద్రాల్లో యాభై రోజులు, 57 కేంద్రాల్లో వంద రోజులు నడిచింది. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరులో సిల్వర్ జూబ్లీ జరుపుకుంది.

కాలేజీ రోజుల్లో అలాగే ఉండేవాణ్ణి
-వెంకటేశ్
సినిమాలో ఈచ్ అండ్ ఎవ్విరి సీన్ నన్ను బాగా ఆకట్టుకుంది. త్రివిక్రం ఈ కథని రెండున్నర గంటల సేపు చెప్పాడు. ఏ కథకీ వెంటనే ఓకే చెప్పని నేను 'నువ్వు నాకు నచ్చావ్' కథ వినగానే ఇమ్మీడియేట్‌గా చేసేద్దామన్నా. ఈ సినిమాలో నేనెంత అల్లరి చేశానో చూశారు కదా. కాలేజీ రోజుల్లో నేనలాగే ఉండేవాణ్ణి. పరీక్షల్లో కాపీ కొట్టడం, అమ్మాయిల్ని కామెంట్ చేయడం.. ఇప్పుడవన్నీ ఎందుకులెండి. అప్పటికీ, ఇప్పటికీ నాలో మార్పు చూసుకుంటే చాలా ఆశ్చర్యమనిపిస్తుంటుంది.
ఈ సినిమా రిలీజయ్యాక మొదట డివైడ్ టాక్ వచ్చింది. 'ఈ ఒక్క సెంటర్లోనే ఆడుతోంది. మిగిలిన సెంటర్లలో కలెక్షన్లు అస్సలు లేవు' అంటూ మాట్లాడేవాళ్లు ఎప్పుడూ చాలామందే ఉంటారు. హిట్టయిన 90 శాతం సినిమాలకు ఇలాంటి టాకే. తర్వాత 'నువ్వు నాకు నచ్చావ్' ఎంత పెద్ద హిట్టయ్యిందో అందరికీ తెలిసిందే. ఇట్స్ ఎ క్లీన్ ఎంటర్‌టైనర్. చూస్తున్నంతసేపూ అందులో ఇన్వాల్వ్ అయిపోయే వాళ్లే ఎక్కువ.
అప్పట్లో చాలామంది హీరోల పరిచయ సన్నివేశాల్ని చూపించాలంటే.. చేతిని కళ్లకు అడ్డంగా పోనిచ్చి ఫేస్ చూపించడం, కట్ చేస్తే నలభైమంది డాన్సర్లతో డాన్స్ చేయించడం.. ఇది ఓ ఫ్యాషన్‌గా ఉండేది. ఈ పద్ధతిని మార్చాలనుకున్నా. అదే విషయాన్ని దర్శకుడు విజయభాస్కర్‌కి చెప్పా. అలా సికిందరాబాద్‌లో దిగాల్సి ఉండగా నాంపల్లి వద్దే ట్రైన్ దిగటాన్ని నా ఓపెనింగ్ సీన్‌గా చిత్రీకరించి, నా పాత్ర స్వభావాన్ని తెలిపేశాడు.
(వచ్చే వారం 'మనసంతా నువ్వే' ముచ్చట్లు) 

Friday, February 25, 2011

హిట్.. హిట్.. హుర్రే...!: నువ్వు నాకు నచ్చావ్

తారాగణం: వెంకటేశ్, ఆర్తీ అగర్వాల్, ప్రకాశ్‌రాజ్, చంద్రమోహన్, సుహాసిని, సుధ, ఎమ్మెస్ నారాయణ, హేమ, సునీల్, తనికెళ్ల భరణి, సిజ్జు, సుదీప, గణేశ్, ఆషా సైనీ, పృథ్వీ, బ్రహ్మానందం, బాబూమోహన్, మల్లికార్జునరావు, చిట్టిబాబు, కల్పనారాయ్
కథ, మాటలు: త్రివిక్రం
పాటలు: సీతారామశాస్త్రి, భువనచంద్ర
సంగీతం: కోటి
గానం: ఎస్పీ బాలు, కుమార్ సాను, చిత్ర, హరిణి, శ్రీరాం ప్రభు, టిప్పు
ఛాయాగ్రహణం: కె. రవీంద్రబాబు
కూర్పు: ఎ. శ్రీకరప్రసాద్
కళ: పేకేటి రంగా
నృత్యాలు: సుచిత్రా చంద్రబోస్, సరోజ్‌ఖాన్, రాజశేఖర్
సమర్పణ: సురేశ్ ప్రొడక్షన్స్
నిర్మాత: స్రవంతి రవికిశోర్
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: విజయభాస్కర్
బేనర్: శ్రీ స్రవంతి మూవీస్
విడుదల తేది: 6 సెప్టెంబర్ 2001

పదేళ్ల క్రితం అమెరికాలో ఉద్యోగమన్నా, అమెరికా అల్లుడన్నా మహా క్రేజ్. ఈ పరిణామం మన సమాజంలో తలెత్తడానికి కారణమైంది సాఫ్ట్‌వేర్ బూం. దాన్ని దృష్టిలో ఉంచుకుని 'అమెరికా' వెంపర్లాట కూడదనీ, ప్రేమానుబంధాలే ముఖ్యమనీ చెబుతూ వచ్చిన ఓ సినిమా తెలుగు ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకుని, అంతకుమించిన ఆహ్లాదాన్ని పంచి, బాక్సాఫీసు వద్ద విజయ బావుటా ఎగరేసింది. ఆ సినిమా 'నువ్వు నాకు నచ్చావ్'. ఇమేజ్‌ని పట్టించుకోకుండా ప్రతి చిత్రంలోనూ కొత్తదనం కోసం తపించే కథానాయకుడు వెంకటేశ్ ఒక్క ఫైటూలేని ఈ సినిమా చేసి, అందర్నీ ఆశ్చర్యపరచారు. విడుదలకు ముందు ఈ సినిమాకి అంచనాలెన్నో. కారణం కాంబినేషన్! దీనికి ముందు ఏడాది క్రితం కొత్త తారలు నటించగా వచ్చిన 'నువ్వే కావాలి' అనే సినిమా ఓ ప్రభంజనాన్నే సృష్టించిది. దానికి దర్శకుడు కె. విజయభాస్కర్, రచయిత త్రివిక్రం. ఆ ఇద్దరితో కలిసి వెంకటేశ్ చేసిన సినిమా కావడమే 'నువ్వు నాకు నచ్చావ్'కి క్రేజ్‌ని తీసుకొచ్చింది. పైగా 'నువ్వే కావాలి' ఫేం స్రవంతి రవికిశోర్ దీనికీ నిర్మాత. ఇది 3 గంటల 9 నిమిషాల నిడివి సినిమా. అందువల్ల ఓ అరగంట నిడివినైనా తగ్గించి, విడుదల చేయమని చాలామంది శ్రేయోభిలాషులు చెప్పారు. కానీ విజయభాస్కర్ తెరమీదకు తెచ్చిన సినిమా మీద సమర్పకుడు సురేశ్‌బాబు, నిర్మాత రవికిశోర్ పూర్తి నమ్మకాన్ని ఉంచారు. నిడివి తగ్గించకుండా రిలీజ్ చేశారు. విజయం సాధించారు. నిర్మాత నుంచి ఎగ్జిబిటర్ దాకా అందరికీ మంచి లాభాలు తీసుకొచ్చి 2001 సూపర్‌హిట్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది 'నువ్వు నాకు నచ్చావ్'. సుమారు 7 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ సినిమా 16 కోట్ల రూపాయల్ని వసూలు చేసింది.  
అనంతర కాలంలో నెంబర్‌వన్ స్థాయికి ఎదిగిన ఆర్తీ అగర్వాల్ పరిచయమయ్యింది ఈ చిత్రంతోటే. వెంకటేశ్ సరసన రూపలావణ్యాలతోటే కాక, అభినయంతోనూ ఆర్తీ తెలుగు ప్రేక్షకుల హృదయాలకు గాలం వేసింది. "హీరోయిన్ నందిని పాత్రకి కొత్తమ్మాయిని పరిచయం చేయాలనుకున్నాం. సినిమాలో నందిని మాత్రమే కనిపించాలి కానీ, హీరోయిన్ కనిపించకూడదు. చాలామంది అమ్మాయిల్ని చూశాం. అప్పుడే బాలీవుడ్ సినిమా 'పాగల్‌పన్'లో హీరోయిన్‌గా కనిపించిన కొత్తమ్మాయి మా దృష్టికి వచ్చింది. న్యూజెర్సీలో తల్లిదండ్రులతో పాటు ఉంటున్న ఆమె ఆ సినిమా చేసి, మళ్లీ అక్కడకి వెళ్లిపోయిందని తెలిసింది. ఆమెని పిలిపించాం. ఇక నందిని ఆమే అని డిసైడ్ అయిపోయాం. అలా ఆర్తీ అగర్వాల్ తెలుగు సినిమాల్లోకి అడుగుపెట్టింది" అని చెప్పారు నిర్మాత రవికిశోర్.
సినిమాలో కీలకమైన నందిని తండ్రి మూర్తి పాత విషయంలో చెప్పుకోదగ్గ సంగతొకటుంది. ఆ పాత్రని ప్రకాశ్‌రాజ్‌తోటే చేయించాలని నిర్మాత, దర్శకుడు సంకల్పించారు. సరిగ్గా అదే టైంలో ప్రకాశ్‌రాజ్ మీద 'మా' (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) నిషేధం నడుస్తోంది. దాంతో అతని బదులు మరొకర్ని తీసుకోక తప్పని స్ఠితి. "మేం మాత్రం ఆయన కాకుండా మరొకర్ని మూర్తి పాత్రలో ఊహించలేకపోయాం. అందుకని ఆయన పాత్ర వచ్చే సీన్లు మినహా మిగతా సినిమా అంతా తీసేశాం. నిషేధం ఎత్తేశాక 17 రోజుల కాల్షీట్‌తో తన పోర్షన్ పూర్తిచేశాడు ప్రకాశ్‌రాజ్" అని అప్పటి విశేషాన్ని జ్ఞాపకం చేసుకున్నారు రవికిశోర్.
కేవలం ప్రేక్షకుల రివార్డులతోటే సరిపెట్టలేదు ఈ సినిమా. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఐదు నందులు ఈ సినిమా ఖాతాలో చేరాయి. కుటుంబ సమేతంగా చూడదగ్గ ఉత్తమ వినోదాత్మక చిత్రంతో పాటు సుచిత్రకు ఉత్తక కొరియోగ్రాఫర్‌గా, సుహాసినికి ఉత్తమ సపోర్టింగ్ ఆర్టిస్ట్‌గా, త్రివిక్రంకు ఉత్తమ సంభాషణల రచయితగా, సవితారెడ్డికి ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్టుగా నందులు దక్కాయి. సమకాలీన చిత్రాల్లో టీవీలో ఎక్కువసార్లు ప్రసారమయ్యిందీ, అత్యధిక శాతం వీక్షించిందీ ఈ సినిమానే అనడంలో అతిశయోక్తి లేదు. 'స్వీట్ అండ్ క్యూట్ ఫిల్మ్'గా పేర్కొనదగ్గ ఈ సినిమా ఎన్నిసార్లు చూసినా మనసుకి ఆహ్లాదమే ఆహ్లాదం.

కథా సంగ్రహం:
నందిని అలియాస్ నందు (ఆర్తీ అగర్వాల్)కి పెళ్ళి నిశ్చితార్థం ఏర్పాటు చేస్తాడు తండ్రి మూర్తి (ప్రకాశ్‌రాజ్). ఆ సమయంలోనే అక్కడకి ఆయన సన్నిహిత మిత్రుడైన శేఖరం (చంద్రమోహన్) కొడుకు వెంకటేశ్వర్లు అలియాస్ వెంకీ (వెంకటేశ్) ఉద్యోగార్థం వస్తాడు. ప్రసాద్ (సిజ్జు)తో నందు నిశ్చితార్థం జరుగుతుంది. రెండు నెలల తర్వాత పెళ్లని ముహూర్తం ఖాయం చేసుకుంటారు. మూర్తి వాళ్ల ఔట్‌హౌస్‌లో దిగుతాడు వెంకీ. అతనూ, నందూ ఒకర్నొకరు ఆటపట్టించుకుంటూ ఉంటారు. వెంకీకి ఉద్యోగం వస్తుంది. రోజులు గడుస్తున్న కొద్దీ నందు మనసులో వెంకీ చోటు చేసుకుంటాడు. ఓసారి ఇంట్లోని ఆడవాళ్లంతా గుడికి వెళ్తుంటే తోడుగా వెంకీ కూడా వెళతాడు. అక్కడ 'నువ్వంటే నాకిష్టం. నువ్వు నాకు నచ్చావ్' అని చెబుతుంది నందు. బిత్తరపోతాడు వెంకీ. ఇక్కడికి వచ్చేప్పుడు తండ్రి "వాడి స్నేహం పోతే భరించలేనురా. నువ్వక్కడకు వెళ్లి బాగుపడకపోయినా ఫర్వాలేదు. కానీ నీ వల్ల మా స్నేహం పాడవకుండా ఉంటే అంతే చాలు" అంటూ చెప్పిన మాటలు జ్ఞాపకమొస్తాయి. నందుకి దూరంగా ఉండటమే మంచిదనుకుని బ్యాగ్ సర్దుకుని వెళతాడు. రైల్వే స్టేషనులో మూర్తి ప్రత్యక్షమై అతణ్ని ఇంటికి తీసుకొస్తాడు.
ఊటీలో జరుగుతున్న నందు స్నేహితురాలు ఆషా (ఆషా సైనీ) పెళ్లికి వెంకీని తీసుకువెళ్తారు నందు, ఆమె బాబాయి కూతురు పింకీ. ఆషా పెళ్లవుతుంది. అక్కడ వాటర్ వరల్డ్ బాగుంటుందనీ, వెళ్లమనీ ఆషా చెబితే ముగ్గురూ వెళతారు. మధ్యలో కారు చెడిపోయిన బ్రహ్మానందం వాళ్ల కారెక్కుతాడు. వాటర్ వరల్డ్ దగ్గర చేయీ చేయీ కలిపి పట్టుకున్న వెంకీ నందూల ఫోటో తీస్తాడు బ్రహ్మానందం. నందుకి వెంకీ మరింత సన్నిహితమవుతాడు. నందు పెళ్లి దగ్గర పడుతుంది. మగపెళ్లివారు వచ్చేస్తారు. వెంకీ గదిలోకి వస్తుంది నందు. అతను ఆశ్చర్యపోతే "వెంకీ.. నేననే నీకిష్టమా, కాదా? నిజం చెప్పు" అనడుగుతుంది. "నీకు ప్రేమ కావాలి. మీ నాన్నకి పరువు కావాలి. మా నాన్నకి మీరు కావాలి. అంటే ఈ పెళ్లి జరగాలి. నువ్వెళ్లిపోవాలి. నన్ను మర్చిపోవాలి" అంటాడు వెంకీ.
మగపెళ్లివారి చేతుల్లో వెంకీ, నందూ కలిసి ఉన్న ఫోటో పడుతుంది. అది ఊటీలో బ్రహ్మానందం తీసిన ఫోటో. అది చూసి ఈ పెళ్లి చేసుకోనంటాడు ప్రసాద్. అయితే ఇది మంచి సంబంధమనీ, దీన్నడ్డం పెట్టుకుని ఇంకో కోటి రూపాయలు మూర్తి నుంచి వసూలు చేసుకోవచ్చనీ చెబుతాడు తండ్రి (తనికెళ్ల భరణి). అతని బంధువులు ఆ ఫోటోని మూర్తి చేతిలో పెడతారు. వాళ్లని తిడతాడు మూర్తి. దాంతో వారు వెళ్లిపోతారు. సంగతి తెలిసి రైల్వే స్టేషన్‌కి వెళ్లి ఆ ఫోటో అబద్ధమనీ, తనకీ నందూకీ ఏ సంబంధమూ లేదనీ చెబుతాడు వెంకీ. నందూ దేవత అనీ, ఈ పెళ్లిని జరిపించనీ వాళ్ల కాళ్లు పట్టుకోబోతాడు.
"ఈ పెళ్లే కాదు. దానికసలు పెళ్లే జరగదు. జరగనివ్వను. అదొక మహా పతివ్రత" అంటా ప్రసాద్ తండ్రి అతణ్ని నెట్టేస్తాడు. పెళ్లివారి ప్రవర్తననీ, వెంకీ వాళ్లని బతిమలాడటాన్ని చూసిన మూర్తి వెంకీని ఆగమంటాడు. పెళ్లికొడుకుని తన ఇంటి వాచ్‌మన్‌గా కూడా పనికిరాడంటూ వాళ్లని పొమ్మంటాడు. "ఐ యాం ఎ ఫూల్. నా అల్లుడు అమెరికాలో ఉన్నాడో, లేదోనని చూశాను కానీ, నా కూతురి మనసులో ఉన్నాడా, లేదా అని చూడలేదు. ఇలాంటివాణ్ని పక్కనపెట్టుకుని ఎక్కడెక్కడో వెతికా. ఐయాం సారీ వెంకీ" అని అతణ్ని కావలించుకుంటాడు. వెంకీ, నందూ ఒక్కటవుతారు.

ఆ రెండు పాయింట్లతో ఈ సినిమా తీశాం
-స్రవంతి రవికిశోర్
కథ ఎక్కువగా ఒక ఇంట్లోనే జరుగుతుంది. అందువల్ల ఔట్‌డోర్‌లోనూ కొంత కథ జరిగేటట్లు చూస్తే బాగుంటుందని సురేశ్‌బాబు సూచించారు. అప్పుడు ఊటీ ఎపిసోడ్ వచ్చి చేరింది. ఆషాసైనీ పెళ్లి తతంగం, బ్రహ్మానందం ఎపిసోడ్ అలా వచ్చి చేరాయి. న్యూజిలాండ్‌లో పాటలు తీసేప్పుడు 104 డిగ్రీల జ్వరంలో ఉండికూడా స్టెప్పులేశారు వెంకటేశ్. అలాగే క్లైమాక్స్ సీన్ చేసేప్పుడు ఆర్తీకి కూడా బాగా జ్వరం. అయినా ఎంతో నిబద్ధతతో పనిచేసింది. సినిమాకి కోటి మ్యూజిక్ ఎస్సెట్. పాటలన్నీ హిట్టే. రీరికార్డింగ్‌కి 26 రోజుల టైం తీసుకున్నారు కోటి. టీవీలో ఎన్ని వందలసార్లు వచ్చినా ఇంకా ఎంజాయ్ చేస్తున్నారంటే, ఆ సినిమా ఇచ్చే ఆహ్లాదం వల్లనే.
ప్రధానంగా రెండు పాయింట్ల మీద ఈ సినిమా చేశాం. అప్పట్లో అమెరికా క్రేజ్ బాగా ఎక్కువ. దాన్ని దృష్టిలో ఉంచుకుని అమ్మాయికి అమెరికా సంబంధం తేవడం కంటే, మనసుకి నచ్చినవాణ్ని తీసుకొస్తే ఆమె సుఖపడుతుందని చెప్పడం ఒక పాయింటైతే, తల్లిదండ్రులకు దూరంగా ఉండంటం కంటే సొంతూళ్లో ఏదో ఒక పని చేసుకుంటూ వాళ్లవద్ద ఉండటమే ఆనందకరమని చెప్పడం రెండో పాయింట్.
త్రివిక్రం, విజయభాస్కర్ కాంబినేషన్ గొప్పగా వర్కవుట్ అయిన సినిమాల్లో ఇదొకటి. సన్నివేశాల చిత్రణలో విజయభాస్కర్ టైమింగ్‌ని తక్కువ చెయ్యలేం. దానికి మేకింగ్ వాల్యూస్ తోడయ్యాయి.
'ఈ నీలి గగనాన' పాటను భువనచంద్ర రాస్తే, మిగతా అన్ని పాటల్నీ సీతారామశాస్త్రి రాశారు. 'ఒక్కసారి చెప్పలేవా' పాటను ఆయన రాసిన తీరు అమోఘం. అందులో ఎంత అర్థముంది! ఏ పాటనైనా అలవోకగా రాసే ఆయన ఆ ఒక్కపాటకు ఆరు రాత్రులు కష్టపడ్డారు. ఇప్పటి రచయితల్లో కథని ఆయన జీర్ణించుకున్నట్లు ఎవరూ జీర్ణించుకోరు. ఆయన పాటలు కథతో ట్రావెల్ చేస్తాయి. ఆయనతో పనిచేయడమన్నది గ్రేట్ ఎక్స్‌పీరియెన్స్.
(వచ్చే వారం 'నువ్వు నాకు నచ్చావ్' విజయానికి దోహదం చేసిన అంశాలు) 

Thursday, February 17, 2011

కథ: మిలట్రీ నరసింహులు (రెండో భాగం)

పదెకరాల తోట. అక్కడక్కడా జీడిమామిడి చెట్లు కూడా ఉన్నాయి లోపల. వాటి కొమ్మలు నేలకి సమాంతరంగా, దగ్గరగా ఉండటంతో పిల్లలు వాటి కొమ్మల మీద ఆడుకుంటున్నారు చిలకల్లా, సీతాకోక చిలకల్లా. ఫిబ్రవరి తొలి రోజులు కావటాన మామిడిచెట్లు అప్పుడే పచ్చటి పూతతో నిగనిగలాడుతున్నాయి. అక్కడక్కడా పిందెలు వేస్తున్నాయి. ఆ పిందెల్ని కోయకుండా ఆడుకోమన్నాడు తోటమాలి.
పిల్లలు కోతికొమ్మచ్చి ఆడుతుంటే తనూ పిల్లాడిలా మారిపోయి వాళ్లతో ఆడాడు నరసింహులు. పిల్లలు మామిడి పిందెలు కోయబోతుంటే తోటమాలి రాక్షసుడనీ, చూశాడంటే మింగేస్తాడనీ భయపెట్టాడు.
పిల్లలు కథ చెప్పమని మారాం చేశారు. విశాలమైన పెద్ద మామిడి చెట్టు కింద నేల శుభ్రంచేసి, పిల్లలకి 'పాతాళ భైరవి' కథ చెప్పాడు నరసింహులు. కజ్జికాయలు, మినమ్ముద్దలు తింటా ఆ కథలో నాయకుడైన తోటరాముడు చేసే సాహసాల్నీ, నేపాళ మాంత్రికుణ్ణి అతడు ఎదుర్కొనే వైనాన్నీ ఆశ్చర్యపోతూ విన్నారు పిల్లలు. కథవిని, కాస్సేపు తాము స్కూల్లో చేసిన సాహసాల్ని పిల్లలు కబుర్లుగా చెబుతుంటే నరసింహులు నవ్వుతా విన్నాడు.
ఆ తర్వాత 'డిప్పాట' ఆడతామని పిల్లలు గోలపెట్టారు. అప్పటికే సూర్యుడు కిందికి పోతున్నాడు. "ఇంక చాలు పిల్లలూ. చీకటి పడబోతోంది. ఇంటికాడ మీ అమ్మానాన్నలు ఎదురు చూస్తుంటారు. కావాల్నంటే ఇంకోసారి వొద్దురుగానీలే" అని చెప్పాడు నరసింహులు, సముదాయింపుగా.
"ఒక్క పది నిమిషాలే తాతా. ఆడుకుని యెళ్దాం" అన్నారు పిల్లలు. సరేననక తప్పలేదు నరసింహులుకి. పిల్లలు డిప్పాట ఆడుతుంటే చుట్ట వెలిగించి తోటలో తిరుగుతున్నాడు. ఒకచోట దొరువు కనిపిస్తే దానిలోకి దిగాడు. చల్లగా వున్నాయి నీళ్లు. చుట్ట ఆర్పి మొహం కడుక్కుంటున్నాడు. అతడు నిల్చున్నచోట పాచిపట్టి ఉంది. అతడు చూసుకోలేదు. సర్రున జారి దొరువులో పడిపోయాడు. రెండు అడుగుల లోతుకంటే ఎక్కువ లేవు నీళ్లు. అయినా నడుం పట్టేసినట్లయ్యింది. బట్టలన్నీ తడిసిపోయాయి. నొప్పి పెడుతుంటే నడుం పట్టుకుని వొంగిపోయి, నెమ్మదిగా దొరువులోంచి బయటకు వొస్తున్నాడు. అప్పుడే డిప్పాటలో దొంగ పాత్ర పోషిస్తున్న ఏడేళ్ల పాప మిగతా వాళ్లని కనిపెట్టడం కోసం అటేపువొచ్చింది. దొరువులోంచి మెల్లమెల్లగా నల్లటి ఆకారం పైకి వొస్తుండటం చూసింది ఆ పాప. తల్లోంచి నీళ్లుకారుతూ, బవిరిగడ్డమేసుకుని, ఒక కన్ను దాదాపు మూసుకుపోయి, వికృతంగా కనిపించిన ఆ ఆకారాన్ని చూసి దడుసుకుంది. దెయ్యమో, 'పాతాళ భైరవి'లోని నేపాళ మాంత్రికుడో వొచ్చాడనుకుంది. భయంతో నోరు తెరచి, అట్లానే వెనక్కి విరుచుకుపడిపోయింది పాప.
నరసింహులు చూశాడు. ఆ అమ్మాయి ఎందుకలా పడిపోయిందో అర్థంకాలేదు. ఆందోళనగా పాప దగ్గరికెళ్లి "పాపా.. పాపా" అని కేకవేశాడు, కుదుపుతా. పాప ఉలకలేదు, పలకలేదు. దాంతో పాప గుండెమీద చెవిపెట్టాడు. బలహీనంగా కొట్టుకుంటోంది. 'అమ్మయ్య' అనుకుని తలపైకెత్తాడు. గుండె గుభేల్మంది. ఎప్పుడు వొచ్చారో మిగతా పిల్లలంతా ఎదురుగా నిల్చొని, భయంభయంగా అతడి వొంకా, కింద ఉన్న పాప వొంకా చూస్తున్నారు. పిడచకట్టుకుపొయ్యింది నరసింహులు నాలుక. సరిగ్గా అప్పుడే తోటమాలి వొచ్చాడు అక్కడకి.
"నేనేం చెయ్యలేదు. ఎందుకో పాప ఉన్నట్టుండి యెనక్కి యిరుచుకుని పడిపోయింది" అన్నాడు నరసింహులు, బలహీనమైన గొంతుతో.
***
ఆసామి ఇంట్లో ఆ రాత్రి వొకటే గొల్లున ఏడ్పులు.
"మేం చూసేసరికి పాపమీద పడుకుని ఉన్నాడు తాతయ్య" అని చెప్పారు పిల్లలు, వాళ్లు చూసింది అదే కాబట్టి.
"నువ్వు మనిషివా, పశువ్వా. పసిపాపని పట్టుకుని.." అని శాపనార్థాలు పెట్టారు ఆడోళ్లు. అతడి మొహాన ఉమ్మేశారు. ఆసామి, అతని ఇద్దరు తమ్ముళ్లు పిడికిళ్లు బిగించి నరసింహుల్ని ఎక్కడపడితే అక్కడ కొట్టారు. నరసింహులు మొహం పచ్చడైంది. నోరు, ముక్కూ కలిసిపోయాయి, నెత్తురు కారుతూ. నరసింహుల్ని ఇంటిముందున్న వేపచెట్టుకి కట్టేశారు.
"నిన్ను ఊరికే వొదిలిపెట్టకూడదురా పశువా. అన్నెంపున్నెం ఎరగని పసిదాని మీద అఘాయిత్యం చేస్తావా ముసలి కుక్కా. నీకు ఉచ్ఛం నీచం తెలీదంట్రా దొంగనా కొడకా. నువ్వు బతక్కూడదురా" అంటా కర్రలతో మళ్లీ చావబాదారు.
ఈ మధ్యలో నరసింహులు నోరెత్తడానికి లేకపోయింది. తనేమిటి? పాప మీద అఘాయిత్యం చేయడమేమిటి? ఈ నిందతో అతని మెదడు మొద్దుబారిపోయింది. ఒళ్లంతా నెత్తురోడుతున్నా అతను అరవలేదు. ఏడవలేదు. విషయం తెలిసి పోలీసులొచ్చారు. నరసింహుల్ని పట్టుకుపోయారు. వొళ్లంతా పచ్చిపుండై పోలీస్ స్టేషన్లో జీవచ్ఛవంలా పడివున్నాడు. రెండ్రోజుల తర్వాత రాత్రివేళ "ఇక నువ్వెళ్లొచ్చు పెద్దాయనా" అన్నారు పోలీసులు అతని విడిచిపెట్టేస్తా. నరసింహులుకి ఏమీ అర్థంకాలా. జైల్లోపెట్టకుండా తనని ఎందుకు వొదిలేస్తున్నట్లు? అదే అడిగాడు.
"ఆ పాప బతికింది. తనని నువ్వేమీ చెయ్యలేదని చెప్పిందిలే" చెప్పారు పోలీసులు.
అప్పుడు తెలిసింది నొప్పి. వొళ్లంతా భరించలేని నొప్పి. ఆ చీకట్లో పరుగుపరుగున ఇంటికొచ్చాడు నరసింహులు. యానాదమ్మ ఒళ్లో తలపెట్టుకుని యెక్కెక్కి ఏడ్చాడు. అసలే ఆమె జబ్బు మనిషి. రెండు రోజుల్నించీ ఆమెకి తిండి లేదు. మొగుడి మీద బెంగతో. నరసింహులు ఎలాంటివాడో ఆమెకి తెలుసుకదా! ఈ వయసులో అతని మీద పడ్డ అపవాదు, పోలీసులు తీసుకుపొయ్యారన్న బాధ ఆమెని కుంగతీశాయి. నరసింహులుతో పాటు ఆమె కూడా ఏడ్చింది.
తెల్లారింది. రాత్రికి రాత్రే నరసింహులు ఇల్లు ఖాళీ చేసి ఎక్కడికో వెళ్లిపోయాడని అంతా అనుకున్నారు. అక్కడ మాయమైన మనిషి పందిళ్లపల్లిలో తేలాడు. అదీ ఊరికి దూరంగా. ఇరవై ఏళ్లయ్యింది ఇక్కడికొచ్చి. ఇప్పుడు నరసింహులుకి డెబ్భై రెండేళ్లు. అయినా తొంభై ఏళ్ల వాడిలా కనిపిస్తున్నాడు. ఆర్మీనుంచి పెన్షను రావడం పర్చూరు నుంచి వొచ్చేశాక ఆగిపోయింది.
ఇరవై ఏళ్ల క్రితం జీవితంలో ఎదురైన భయానక అనుభవం అతణ్ణి మానసికంగా, శారీరకంగా కుంగదీసింది. దాంతో డ్రైవరుగానే కాదు వాచ్‌మన్‌గానూ పనికిరాకుండా పోయాడు. కూతుళ్లతో సంబంధాలూ తెగిపోయాయి. తనని తనే పోషించుకోలేని దీన స్థితి. మళ్లీ తన మెడకో డోలులాంటి యానాదమ్మ. నరసింహులు బిక్షగాడిగా మారిపోయాడు. అప్పట్నించీ ఇప్పటిదాకా పందిళ్లపల్లి వీధుల్లో 'అమ్మా కాస్త అన్నంపెట్టు తల్లీ', 'బాబూ ఒక్క పావలా ఉంటే ధర్మం చెయ్యి బాబూ' అన్న నరసింహులు గొంతు ప్రతిధ్వనిస్తూనే ఉంది.
***
"అరే పెద్దాయనా చస్తావ్. కాస్త చుట్టుపక్కల చూస్కో" అని చేయిపట్టుకు లాగాడు రాజేంద్ర. దాదాపు నరసింహుల్ని రాసుకుంటున్నట్లుగా పోయింది ఓ లారీ.
"నువ్వా బాబూ, ఇందాక కనపడకపోయేతలికి ఊళ్లో లేవేమోననుకున్నా" అన్నాడు నరసింహులు, కాస్త ఊరట చెందిన మనసుతో.
ఎందుకనో తెలీదు నరసింహులంటే రాజేంద్రకి జాలి. కనిపించినప్పుడల్లా ఐదు లేదంటే పది రూపాయల నోటు ఇస్తుంటాడు. ఇప్పుడూ ఇచ్చాడు పది రూపాయలు.
"పిల్లాపాపల్తో సల్లంగ ఉండు కొడుకా" అన్నాడు నరసింహులు అక్కడే తలుపులు వేసున్న ఓ ఇంటి అరుగుమీద కూలబడతా.
రాజేంద్ర నవ్వి "చీకటి పడింది. ఇంటికెళ్లు. ముసలామె నీకోసం ఎదురు చూస్తుంటుంది" అంటా వెళ్లిపోయాడు.
"అవునవును. వొచ్చేప్పుడు మసల్ది బిళ్లలు తెమ్మంది" అని తనలో తనే గొణుక్కుంటున్నట్లు అంటా మెడికల్ షాపుకేసి నడిచాడు మిలట్రీ నరసింహులు.
(అయిపోయింది)
-ఆంధ్రభూమి డైలీ, 30 మే 2010

Saturday, February 12, 2011

హిట్.. హిట్.. హుర్రే..!: ఖుషి-2

శ్రద్ధగా చదువుకుంటోన్న మధు వద్దకొచ్చి పలకరించాడు సిద్ధు. 'డోంట్ డిస్టర్బ్. చదువుకుంటున్నా' అంది మధు. సరేనంటూ అవతలకి వెళ్లి కూర్చుని, తానూ పుస్తకం తెరిచాడు సిద్ధు. చూపు పుస్తకం మీద నిలవనంటోంది. ఆమె వంక చూశాడు. అప్పుడే గాలికి పైట తొలగి తెల్లని, అందమైన మధు నడుము, పొట్ట మధ్యలో చిన్న నాభి కనిపించాయి. అసలే నల్లని చీర కావడంతో ఆచ్ఛాదన లేని ఆమె నడుము భాగం మరింత తెల్లగా కనిపించింది. చూపు తిప్పుకోలేకపోయాడు. ఎందుకో అతడివంక చూసింది మధు. చప్పున తల తిప్పేసుకున్నాడు. ఆమె మళ్లీ పుస్తకం వేపు దృష్టి పెట్టింది. గాలి వీస్తూనే ఉంది. మధు నడుము అనాచ్ఛాదితంగా కనిపిస్తూనే ఉంది. అతడి చూపులు అటువేపు పోతూనే వున్నాయి. అతడి గొంతు తడారిపోతోంది. గుటకలు మింగుతున్నాడు. నాలుగైదు సార్లు అతడి చూపులు గమనించాక, అప్పుడు అర్థమైంది, అతడు ఎక్కడ, ఏం చూస్తున్నాడో.
"సిద్ధు.. ఇదేం బాలేదు" కోపంగా అంది.
"ఏంటీ?" అడిగాడు సిద్ధు ఏం ఎరగనట్లు.
"నువ్వు చేసే పని"
"నేనేం చేశాను?"
"నీ చూపు గురించి మాట్లాడుతున్నా"
"నేనేం చూశాను?"
"నువ్వు నా నడుం చూశావు"
"లేదు"
"నువ్వు చూశావు. నువ్వు చూసింది నేను చూశాను"
"లేదు. చూడలేదు"
"చూశావు. పదిసార్లన్నా చూసుంటావు"
ఇద్దరూ గొడవపడ్డారు. ప్రతిసారీ తనని అపార్థం చేసుకుంటున్నావని అనాడు సిద్ధు. 'పెద్ద అందగత్తెవని పెద్ద ఫీలింగ్' అని కూడా అన్నాడు. బలవంతాన కోపం అణచుకుంటూ, పళ్లు బిగించి "నువ్వు నడుం చూశావా లేదా?" అని మళ్లీ గటిగా అడిగింది మధు. దానికి సమాధానం చెప్పకుండా "నువ్వు నన్ను లవ్ చేశావా, లేదా?" అడిగాడు సిద్ధు. "లేదు" అంది మధు. "నేనూ నీ నడుం చూడలేదు" అని జవాబిచ్చాడు సిద్ధు. మళ్లీ పోట్లాట. "అసలిలాంటి అమ్మాయితో ఫ్రెండ్‌షిప్ చేయను. ఒకవేళ చేసినా అది లవ్ దాకా రాదు. వచ్చినా మ్యారేజ్ దాకా వెళ్లదు. ఖర్మకాలి నన్ను బలవంతంగా పెళ్లికి దింపినా కానీ, 'ఇలాంటమ్మాయి వొద్దు' అని లెటర్ రాసి పారిపోతా" అన్నాడు సిద్ధు. దాంతో ఏడుస్తూ "సిద్ధు అనేవాణ్ణి లైఫ్‌లో కలవలేదనే అనుకుంటా. మనమధ్య ఏమీ లేదు. నథింగ్ బిట్వీన్ యు అండ్ మి" అని అక్కణ్ణించి విసవిసా వెళ్లిపోయింది మధు.
'ఇగో' (అహం) అనేది ఇద్దరు యువతీ యువకుల మధ్య ఎలాంటి యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తుందనే దానికి చక్కని ఉదాహరణ ఈ సన్నివేశం. 'ఖుషి' చిత్రం మొత్తానికీ కీలకమైన సన్నివేశం ఇది. మిగతా సినిమా అంతా ఆధారపడింది ఈ సన్నివేశం మీదే. ఈ సన్నివేశం వల్లే మధు, సిద్ధు ఎడమొహం పెడమొహం అయ్యారు. ఆ తర్వాత ఆ ఇద్దరూ ఎలా ఒకటయ్యారనేదే మిగతా కథ.
ఈ సన్నివేశాన్ని రాసిన తీరూ, తెరమీద దాన్ని చిత్రీకరించిన తీరూ ఉన్నత స్థాయికి చెందుతాయి. అప్పటివరకూ వచ్చిన చిత్రాల్లో నాయికా నాయకుల మధ్య గొడవలకు ఇతరేతర గొడవలెన్నో కారణంగా కనిపిస్తూ వచ్చాయి. హీరోయిన్ 'బెత్తెడంత నడుము'ని హీరో చూసినందువల్ల గొడవ వచ్చి, వాళ్లు దూరమవడమనేది కొత్త. లాజికల్‌గా చూస్తే, హీరో మీద ప్రేమవున్న (నోరుతెరచి చెప్పకపోయినా) నాయిక తన నడుముని నాయకుడు చూశాడని కోప్పడి, అతడికి దూరమవ్వాలనుకోవడం హాస్యాస్పదం అనిపిస్తుంది. అయితే అలాంటి భావన సగటు ప్రేక్షకుడికి కలగకపోవడమే ఈ సినిమా సాధించిన విజయం. అందుకు దోహదం చేసినవి బిగువైన స్క్రీన్‌ప్లే, ఉలాసభరితమైన సన్నివేశాల కల్పన. ఆ ఘనత స్క్రీన్‌ప్లేనీ సమకూర్చిన దర్శకుడు ఎస్.జె. సూర్యదే. అంతేకాదు, ఆ సన్నివేశం ఏమాత్రం అసభ్యకరంగా లేకుండా 'క్యూట్'గా రావడానికి కారణం, పి.సి. శ్రీరాం ఛాయాగ్రహణ ప్రతిభ. ఆ సన్నివేశంతో పాటు ఆద్యంతం తన కెమెరా పనితనంతో చిత్రాన్ని 'విజువల్ ఫీస్ట్'గా తయారుచేశాడు శ్రీరాం. ఆయా సన్నివేశాల్లో సందర్భానుసారం చక్కగా అమరిన సంభాషణలనీ తక్కువ చేయలేం. రాజేంద్రకుమార్ రాసిన సంభాషణలు కథనంలో కావలసినంత 'టెంపో'ని తీసుకొచ్చాయి.
ఇక సిద్ధు, మధు మధ్య దూరం మరింత పెరిగే సన్నివేశంలో పవన్ కల్యాణ్ నోటివెంట పలికే డైలాగుల్ని ప్రేక్షకులు ఎంతగా అస్వాదించారో! గుడుంబా ప్యాకెట్ల కోసం మోషే (అలీ) బయటకు వెళితే అప్పటికే గుడుంబా మత్తులో ఉన్న సిద్ధు గోడమీది బొమ్మలో మధుని చూస్తూ "ఏంటి చూస్తున్నావ్ చెప్పు. నాకు చెప్పాల్సిందే. బాగా.. పెద్ద పెద్ద రెండు గుడ్లగూబల్లాంటి కళ్లు పెట్టుకుని ఎందుకలా చూస్తున్నావో చెప్పవే. (నడుము సైజు చేతితో కొలుస్తూ) బెత్తెడంత చోటు లేదు. దీన్ని మేం చూశామంట. నువ్వు పెద్ద అందగత్తెవి. పిడతంత ముఖం, చుంచులాంటి ముక్కు, గండుచీమ కుట్టి వాచినట్లుండే చిన్ని పెదిం. ఆ.. ఏదో.. చూడాలనిపించే చిన్ని నడుం. నల్ల చీర కట్టుకుని ఒళ్లంతా కప్పుకుని కూర్చున్నప్పుడు ఎర్రగా నిమ్మపండు రంగులో.. ఓ.. నిమ్మపండు పసుపురంగులో ఉంటుంది కదూ. ఓ.. ఎరుపు, పసుపు మిక్సయిపోయి చిన్ని రొమాంటిక్ కలర్లో.. చిన్ని ఏరియా కనిపించినప్పుడు కళ్లు ఆటోమేటిగ్గా చూస్తాయి. అది దాని ('అవి వాటి' అని వుండాలి) నైజం. అది నువ్వు చూపించకుండా వుండాల్సింది. ముఖం నీ వొంట్లో భాగమే. నడుం నీ వొంట్లో భాగమే. ముఖం చూస్తే కోపం రాలేదు. నడుం చూస్తే కోపం వచ్చింది. ఎందుకు? ఎందుకని నేను ప్రశ్నిస్తున్నానంతే. ఇప్పుడు నీ నడుమే కాదు. నీ ఫుల్ బాడీ చూస్తాను. అసలు నువ్వు నా పక్కన నిల్చునే అర్హత కోల్పోయావ్' అని మధు బొమ్మని చింపేస్తాడు. దాన్ని మధు చూసి కోపంతో వెళ్తున్నప్పుడే మెళ్లో గుడుంబా పాకెట్ల దండ వేసుకుని ఎదురు వస్తుంటాడు మోషే.
"ఓరి బాబూ మోషయ్యో. కుత్తే. నా బతుకును బుగ్గిపాలు చేశావు కదరా నీయయ్య. నా ప్రేమను బుగ్గిపాలు చేశావు కదరా.. రాయ్యా రారా.. ఈ సచ్చినోడు కలకత్తా నుంచి నా ప్రేమను పాడు చేయడానికొచ్చాడు సచ్చినోడు.. నీ జిమ్మడిపోను.." అంటూ బాధపడతాడు సిద్ధు. ఈ సన్నివేశాన్నీ, సిద్ధు పాత్ర పలికే డైలాగుల్నీ, ఆ డైలాగుల్ని కృష్ణా జిల్లా యాసలో పవన్ కల్యాణ్ చెప్పే తీరునీ ఆస్వాదించని వాళ్లెవరు? ప్రేక్షకుల్ని బాగా అలరించిన సన్నివేశాల్లో ఇది ముఖ్యమైన సన్నివేశం. కథ అత్యధిక భాగం సిద్ధు, మధు పాత్రల చుట్టూనే తిరుగుతుంది. ఆ పాత్రల్లో పవన్ కల్యాణ్, భూమిక అలవోకగా ఇమిడిపోయారు. నిజమైన ప్రేమికులే గొడవ పడుతున్నంత సహజంగా పాత్ర పోషణ చేశారు ఆ ఇద్దరూ. కల్యాణ్‌కి సిద్ధు పాత్రలాగా అంత బాగా అమరిన పాత్ర 'ఖుషి'కి ముందు కానీ, తర్వాత కానీ మరొకటి లేదు. మధు పాత్రలో భూమిక కూడా అంతే. అందుకే 'క్యూట్ పెయిర్' అనిపించుకుంది ఆ జంట.
ఇక సినిమా విజయంలో కీలక పాత్ర పోషించిన మరో అంశం సంగీతం. మణిశర్మ బాణీలు అందించిన ఆరు పాటలూ ఇప్పటికీ ప్రేక్షకుల పెదాలపై ఆడుతూనే ఉన్నాయి. 'యే మేరా జహా యే మేరా ఘర్ మేరా ఆషియా', 'ప్రేమంటే సులువు కాదురా అది నీవు గెలవలేవురా', 'అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా', 'ఆడువారి మాటలకు అర్థాలే వేరులే', 'చెలియ చెలియా చిరుకోపమా', 'గజ్జె ఘల్లుమన్నాదిరో గుండె ఝల్లుమన్నాదిరో' పాటలు ఒకదాన్ని మించి మరొకటి సూపర్ హిట్. వీటిలో పింగళి పాట 'ఆడువారి మాటలకు అర్థాలే'తో పాటు తొలి రెండు పాటల కాన్సెప్టు కల్యాణ్‌దే. ఇక సన్నివేశాలకి ఇచ్చిన నేపథ్య సంగీతాన్నీ ప్రశంసించకుండా ఉండలేం. హీరో హీరోయిన్లతో పాటు మిగతా నటుల హావభావాలతో సైతం బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కచ్చితంగా సింక్ అవడం ముచ్చటగా అనిపిస్తుంది. ఇన్ని అంశాలు పక్కాగా కుదిరినందునే కుర్రకారుని అంతగా ఆకట్టుకుంది 'ఖుషి'. చివరకు ముసలాళ్లు కూడా ఈ సినిమా చూస్తూ తమ కాలేజీ రోజుల్లోకి వెళ్లిపోయి, కుర్రాళ్ల మాదిరిగా ఆస్వాదించారన్నది నిజం.

అది అద్భుతమైన సీన్
-రాజేంద్రకుమార్
తమిళంలో ఈ సినిమా చేసేప్పుడే నన్ను పిలిపించారు. సెట్స్ మీదే సూర్య నాతో చర్చించేవారు. సంభాషణల్లో తెలుగుదనం ఉట్టిపడాలని చెప్పేవారు. తెలుగు నుడికారంతో మాటలు రాయగలిగా. క్లుప్తమైన సంభాషణలు బాగా వర్కవుట్ అయ్యాయి. కథనాన్ని సూర్య అద్భుతంగా నడిపారు. చిన్న చిన్న ఎక్స్‌ప్రెషన్స్‌కి కూడా ప్రాధాన్యతనివ్వడం చిత్రానికి జీవాన్ని తెచ్చింది. దానికి కాంప్రమైజ్ కాని నిర్మాణం తోడైంది.
'తొలిప్రేమ', 'తమ్ముడు', 'బద్రి' చేసిన పవన్ కల్యాణ్‌కి యూత్‌లో గొప్ప ఇమేజ్ వచ్చింది. ఆ ఇమేజ్ 'ఖుషి'కి బాగా హెల్పయ్యింది. ఫైట్స్, సాంగ్స్ అతనే కంపోజ్ చేశాడు. ఒరిజినల్ తమిళ సినిమాలో కోల్‌కతా ఎపిసోడ్ లేదు. తెలుగులో దాన్ని తెచ్చింది కల్యాణ్. గుళ్లో దీపం ఆరిపోతుంటే హీరో హీరోయిన్లు ఒకేసారి వచ్చి దాన్ని ఆపే ప్రయత్నం అద్భుతమైన సీన్. అలాగే భూమిక నడుముని కల్యాణ్ చూసే సన్నివేశం ఎలాంటి అసభ్యతకి తావులేకుండా సున్నితంగా తీయడం గొప్ప విషయం. ఇలాంటి స్క్రిప్టు అంతదాకా రాలేదు. రీ-రికార్డింగ్ కూడా అద్భుతం. చివరలో ట్రైన్‌లో వెళ్లేప్పుడు రాజ్‌కపూర్ 'మేరా నాం జోకర్'లోని మ్యూజికల్ బిట్‌ని ఉపయోగించారు. అది బాగా కుదిరింది.
రైటర్‌గా నేను చెప్పుకోదగ్గ సినిమా. ఈ సినిమాకి భాగస్వామిని కావడం నా అదృష్టం.

నా పాట గ్రాండ్ హిట్
-సుద్దాల అశోక్‌తేజ
ఓ పాట కోసం నిర్మాత రత్నం చెన్నైకి పిలిపించారు. అక్కడే దర్శకుడు సూర్యనీ కలిశా. సందర్భం చెప్పి పాట ఎరోటిగ్గా ఉండాలన్నారు సూర్య. ఓ పాట రాసిచ్చి వచ్చేశా. దాన్ని హీరో పవన్ కల్యాణ్ విని, మళ్లీ చెన్నై పిలిపించారు. బాగుందని చెబుతూనే 'మొదలు నుంచి చివరి దాకా అమ్మాయి శరీరాన్ని ఎక్కడా మీ 'నిబ్' టచ్ చేయకుండా పాట రాయగలరా? ఆ ఊపు, కవ్వింపు మాత్రం తప్పనిసరిగా ఉండాలి' అన్నారు. దాంతో పాటు ఏదైనా హిట్ సాంగ్ తీసుకుని దాన్ని అనుసరించి రాయమన్నారు. అప్పుడు మళ్లీ రాశా. 'హోలి.. హోలిలో రంగ హోలీ.. చమకేళిల హోలీ' అనే జానపద పాట పల్లవిని తీసుకుని 'ఏకవీర', 'రోషనార' వంటి పదాలు మధ్యమధ్యలో ఉపయోగిస్తూ 'గజ్జె ఘల్లుమన్నాదిరో.. గుండె ఝల్లుమన్నాదిరో' అంటూ రాశా. గ్రాండ్ హిట్. దాని చిత్రీకరణ కూడా అంత బాగానూ వచ్చింది. కల్యాణ్ సినిమాకి నేను రాసిన తొలిపాట ఇదే. ఇప్పటి దాకా మళ్లీ రాయలేదు.
(వచ్చేవారం 'నువ్వు నాకు నచ్చావ్' విశేషాలు) 

Tuesday, February 8, 2011

కథ: మిలట్రీ నరసింహులు

చూరు తగలకుండా కిందికి వొంగి గుడిసెలోంచి బయటకు వొచ్చాడు నున్నా నరసింహులు. తలకి రెండు రెట్లు పెద్దదిగా ఉన్న పెద్ద తలపాగా, వెండి దారప్పోగుల్లా మెరుస్తున్న తెల్లటి బుర్ర మీసాలు, ఆ మీసాల కింద గుప్పున పొగ వొదులుతూ పొడవాటి చుట్ట. వొంటిమీద మరకలతో దుమ్ముకొట్టుకుని ఖాకీ చొక్కా, ఆ చొక్కా కింద మురికిమురిగ్గా పాతబడిపోయిన తెల్ల పంచె, కుడి భుజాన అతుకులు వేసిన పురాతన కాలంనాటి నూలు సంచి, ఎడమ చేతిలో కర్ర.. ఇదీ నరసింహులు వేషం.
"వొచ్చేప్పుడు మర్సిపోకుండా బిళ్లలు తేయ్యా" అని లోపల్నించి బలహీనమైన గొంతు వినిపించింది. అది అతడి భార్య యానాదమ్మది. ఆయాసం, దగ్గుతో బాధపడుతూ తెగిపోతున్న నులక మంచం మీద పడుకుని వుంది. ఆమె నడవలేదు కూడా.
"తెత్తాలెయ్యే" అంటా బాట మీదికొచ్చాడు నరసింహులు. ఆ బాట అవతల నేల కనిపించడంలేదు. ఎటు చూసినా విరగ్గాసిన మొక్కజొన్న కంకులే. అప్పుడే ఒక ఎడ్లబండి ఆ చేల మధ్యలోంచి బాట మీదికొచ్చింది. ఆ బండినిండా పొత్తులు. బండెనక నలుగురు పిల్లకాయలు కూర్చుని చేతుల్లో వున్న మొక్కజొన్న పొత్తుల మీది మట్టల్ని వొలుస్తా కబుర్లాడతా వున్నారు. మధ్యమధ్యలో పెద్దపెద్దగా నవ్వుతున్నారు.
ఎడ్లబండి నరసింహుల్ని దాటింది. అతన్ని చూడంగాల్నే "ఇగో మీసాల్తాతా. నీ టోపీ ఇత్తావా. ఇదిత్తా" అని ఓ పిల్లాడు ఎకసెక్కం చేశాడు చేతిలోని పొత్తుని వూపుతా. మిగతా పిల్లకాయలు బిగ్గరగా నవ్వారు.
నరసింహులు చేయి టక్కున తలపాగా మీదికెళ్లింది. గట్టిగా దాన్ని అదిమి పట్టుకున్నాడు.
"పోండిరా భడవల్లారా. ఈ మూసలాణ్ణి చూత్తంటే ఎగతాళిగా ఉంటంది మీకు. మిలట్రీలో పనిచేసినోణ్ణిరా. నాతో పెట్టుకోకండ్రోయ్" అన్నాడు కర్రని వాళ్లకేసి ఊపుతా.
"అబ్బో మిలట్రీ తాత మనల్ని కొట్టేట్టున్నాడ్రోయ్. పారిపోదాం పదండి" అని ఇంకో పిల్లకాయ్ అనేసరికి, మిగతావాళ్లు మళ్లా పెద్దగా నవ్వారు.
"రేయ్ ఆపండ్రా పరాచికాలు. ఆ ముసలోడితో మీకెందుకు" అని కసురుకున్నాడు బండి తోలుతున్నతను. దాంతో పిల్లకాయల నోళ్లు మూతపడ్డాయి.
ఎద్దుల గిట్టల బలానికి లేచిన దుమ్ము ఎడమ కంట్లో పడింది. కన్ను నులుముకున్నాడు నున్నా నరసింహులు. అతడి కుడి కన్ను దాదాపుగా పాడైపోయింది. ఎప్పుడూ పుసులు కారుతూ ఉంటుంది. ఆ కంట్లో ఏం పడినా అతడికి తెలీదు.
నడుస్తున్నాడు నరసింహులు. పందిళ్లపల్లిలో ఊరి చివర గుడిసెలో ఇరవై ఏళ్లుగా ఉంటున్నాడు. అయినా అయినవాళ్లెవరూ అతని దగ్గిర లేరు. ఒక్క రాజేంద్ర మాత్రమే నరసింహులుతో దయగా మాట్లాడుతుంటాడు. అతను రైసుమిల్లు ఓనరు పట్టాభి కొడుకు. సాయంత్రం పూట నరసింహులు గుడిసె మీదుగా తమ పొలానికి వెళ్తుంటాడు రాజేంద్ర. ఆ రోజు నరసింహులుకి అతను కనిపించలేదు.
ఊళ్లోకి వచ్చాడు. కాస్త దర్జాగా కనిపించినోళ్లనల్లా "ఒక్క పావలా ధర్మం చెయ్యండి బాబయ్యా" అని అడుక్కోవడం మొదలుపెట్టాడు భుజానికి తగిలించుకున్న సంచిని తెరిచిపెట్టి. కొంతమంది పావలో, అర్థరూపాయో వేస్తుంటే, కొంతమంది చీదరించుకుని అవతలకి పోతున్నారు. ఇంకొంతమంది "చిల్లర లేదు పో.. పో.." అని చీత్కరిస్తున్నారు. అప్పుడు నరసింహులు పెద్ద గొంతుతో ఎవరినో ఉద్దేశించి తిడుతూ "బాంచెత్. మీవొల్లనే కదంట్రా నాకిట్లాంటి గతి పట్టింది. మీరు పురుగులుపట్టి పోతారా దొంగనాయాళ్లార్రా.." అంటూ ఏడ్పు మొదలుపెట్టాడు.
"నాకేం తెల్వదు.. నాకేం పాపం తెలీదు. అయినా గానీ నామీద నింద మోపారు కదర్రా" అన్నాడు ఏడుస్తూనే. కొత్తవాళ్లు నరసింహులు మాటలు విని, అవి అర్థమయ్యీ అవక, అతను తమని ఉద్దేశించి ఆ మాటలంటున్నాడా అని సందేహపడ్తున్నారు. నరసింహులు గురించి ఏ కాస్తో తెలిసినోళ్లు "ఆ ముసలాడంతే. అడుక్కుంటూ ఎవర్నో తిడుతుంటాడు. ఒకప్పుడు మిలట్రీలో పనిచేశాడంట. పాపం ఇప్పుడు అడుక్కుంటున్నాడు గతిలేక" అని పక్కవాళ్లకి చెబుతున్నారు.
* * *
నున్నా నరసింహులు ఒకప్పుడు ఓ మోస్తరుగానే బతికాడు. మద్రాస్ ఇంజినీరింగ్ గ్రూప్ కింద ఆర్మీలో పనిచేశాడు. 1952లో సైన్యంలో డ్రైవరుగా చేరిన అతను బర్మా, ఇటలీ, నేపాల్, ఇరాన్ వంటి దేశాలు తిరిగాడు ఉద్యోగంలో భాగంగా. పదిహేడు సంవత్సరాల తర్వాత 1969లో రిటైరయ్యాడు. అతని కుడికన్ను దెబ్బతినడమే అందుకు కారణం. ఆ తర్వాత జీవన భృతి కోసం అతను డ్రైవరుగా, వాచ్‌మన్‌గా ఉద్యోగాలు చేశాడు.
ఆర్మీనుంచి వొచ్చాక నెలకు 350 రూపాయలు పెన్షను కింద వొచ్చేవి. దీంతో నరసింహులు జీవితం సాఫీగానే నడిచేది. ఇద్దరు కూతుళ్లకు పెళ్లిళ్లు చేసి అత్తారింటికి పంపేశాడు. ఇక ఇంట్లో ఉండేది అతనూ, భార్య యానాదమ్మే.
బుర్ర మీసాలు, దెబ్బతిన్న కంటితో నరసింహులు చూడ్డానికి కాస్త భీకరంగా అవుపించినా, మనిషి వెన్నలాంటివాడు.
సైన్యంలో పనిచేసినా అతని మాటల్లో, చేతల్లో కరకుదనం కనిపించదు. అందుకే చిన్నపిల్లలకి అతడు 'మీసాల తాతయ్య' అయిపోయాడు. మంచి మంచి కథలు చెబుతుంటాడు కాబట్టి 'కథల తాతయ్య'గానూ చేరువయ్యాడు. అదే అతనికి తర్వాత కాలంలో చేటు తీసుకొచ్చింది.
*  *  *
పర్చూరులో ఒక పెద్ద ఆసామి ఇంట్లో డ్రైవరుగా పనిచేస్తున్నాడు అప్పట్లో. ఆ ఇంట్లో చాలామంది మనుషులు. వాళ్లకి చాలామంది పిల్లలు. వీలు దొరికినప్పుడల్లా ఆ పిల్లలకి కథలు చెబుతున్నాడు నరసింహులు. వాటిలో పౌరాణికాలు, జానపదాలు ఎక్కువ. మళ్లీ వాటిలో వీరరసం ఎక్కువ. సహజంగానే ఆ కథలు పిల్లల్ని బాగా ఆకట్టుకునేవి. అలరించేవి. కథ చెప్పేప్పుడు ఎవరన్నా నరసింహులుని పిలిచి, పనిచెబితే ఆ పిల్లలు తెగ బాధపడేవాళ్లు.
'తాతయ్య కథ చెబుతున్నాడు. కాసేపు ఆగమ'ని పెద్దల్ని బతిమిలాడేవాళ్లు. దాంతో "ఇదిగో నరసింహులూ, ఈ కథలూ, కాకరకాయలూ అంటా పిల్లల్ని చెడగొట్టమాక" అని విసుక్కునేవోళ్లు పెద్దలు. నరసింహులు నవ్వి ఊరుకునేవోడు. "మళ్లీ వొచ్చాక చెబుతాలే" అని పిల్లల్ని ఊరడించి, కారు తియ్యడానికి వెళ్లేవోడు. అట్లా అతడి కథలకి ఎడిక్ట్ అయిపోయారు పిల్లలు. సెలవు వొచ్చిందంటే కథల తాతయ్య కోసం వెతుక్కునేవోళ్లు. కథ చెప్పడంలో అంత మహత్తుంది నరసింహుల్లో. పిల్లలే కాదు, అతడు కథ చెబుతుంటే విన్నారా పెద్దలు, వాళ్లు కూడా కథ అయిపోయేదాకా అట్లా వింటూ వుండి పోవాల్సిందే.
అప్పుడు జరిగింది ఆ విషాదకర సంఘటన. ఆ రోజు సెలవు కావడంతో తమ మామిడి తోటల్ని చూడాలని పిల్లలు గొడవ గొడవ చేశారు. దాంతో ఆ పిల్లల్ని తీసుకెళ్లే బాధ్యత నరసింహులు మీద పడింది. మధ్యలో ఆకలైతే తినడం కోసం మినమ్ముద్దలు, కజ్జికాయలు ఒక టిపినులో పెట్టిచ్చారు ఆ ఇంటి ఆడోళ్లు. ఎనిమిది మంది పిల్లల్ని తీసుకుని రెండు మైళ్ల దూరంలో జాగర్లమూడి దగ్గరున్న మామిడి తోటకి వెళ్లాడు నరసింహులు.
(ఇంకావుంది) 

Saturday, February 5, 2011

హిట్.. హిట్.. హుర్రే...!: ఖుషి

తారాగణం: పవన్‌కల్యాణ్, భూమిక, అలీ, సుధాకర్, శివాజీ, విజయ్‌కుమార్, నాజర్, రాజన్ పి. దేవ్, సుధ, ముంతాజ్, జానకి, డింపుల్, ఎస్.జె. సూర్య (అతిథి పాత్ర)
మాటలు: రాజేంద్ర కుమార్
పాటలు: పింగళి, ఎ.ఎం. రత్నం, చంద్రబోస్, సుద్దాల అశోక్‌తేజ, అబ్బాస్ టైర్‌వాలా
సాంగ్స్ కాన్సెప్ట్: పవన్‌కల్యాణ్
సంగీతం: మణిశర్మ
ఛాయాగ్రహణం: పి.సి. శ్రీరాం
కూర్పు: బి. లెనిన్, వి.టి. విజయన్, కోలా భాస్కర్
యాక్షన్: విజయ్
యాక్షన్ సీక్వెన్సెస్ రూపకల్పన: పవన్‌కల్యాణ్
కొరియోగ్రఫీ: బృంద, హరీశ్‌పాయ్
ఆడియోగ్రఫీ: హెచ్. శ్రీధర్
ఆర్ట్: ఆనంద్‌సాయి
పబ్లిసిటీ డిజైనర్: లంక భాస్కర్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అళహరి రఘురాం
నిర్మాత: ఎ.ఎం. రత్నం
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎస్.జె. సూర్య
బేనర్: శ్రీ సూర్యా మూవీస్
విడుదల తేది: 27 ఏప్రిల్, 2001

చిరంజీవికి అసలు సిసలు వారసుడు వచ్చాడు.. అందరినోటా ఈ మాట అనిపించేట్లు చేసిన సినిమా 'ఖుషి'. అప్పటికే  'తొలిప్రేమ', 'తమ్ముడు', 'బద్రి' చిత్రాల విజయాలతో మంచి జోష్ మీదున్న పవన్‌కల్యాణ్ ఇమేజ్‌ని అమాంతం శిఖరం మీద నిలిపిన చిత్రం 'ఖుషి'. ఈ సినిమాతో యువతరంలో తిరుగులేని ఆరాధ్యతారగా రాపుదాల్చాడు పవన్‌కల్యాణ్.  
నిజం చెప్పాలంటే మెగాస్టార్‌గా నెంబర్‌వన్ హోదాని అనుభవిస్తోన్న చిరంజీవినే సవాలుచేసే స్థాయికి ఆయన్ని చేర్చింది ఈ సినిమా. 79 కేంద్రాల్లో వంద రోజులు ఆడిన 'ఖుషి', ఐదు కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ జరుపుకుంది. వాణిజ్యపరంగా కానీ, అభినయపరంగా కానీ కల్యాణ్ కెరీర్‌లో ఇప్పటివరకు అత్యుత్తమ చిత్రం ఇదే. పైగా ఇది ఆయనలోని సృజనాత్మక ప్రతిభని కూడా బయటపెట్టిన తొలి సినిమా. ఇందులోని యాక్షన్ సన్నివేశాలన్నింటినీ డిజైన్ చేసింది ఆయనే. అంతేనా, ఆరింటిలో మూడు పాటల కాన్సెప్ట్ ఆయనదే. మామూలుగా మనం చూసే ఫైట్లకీ, పాటలకీ అవి ఎంత భిన్నంగా ఉన్నాయో, అంత బాగానూ అవి ఆకట్టుకున్నాయి. అలరించాయి. ఇక పవన్‌కల్యాణ్, భూమిక జోడీ 'క్యూట్ పెయిర్'గా పేరు తెచ్చుకుని యువతలో అపూర్వమైన క్రేజ్ సంపాదించుకోవడం మనలో చాలామందికి తెలిసిందే. అలాగే ఆ రోజుల్లో ఎక్కడ విన్నా 'ఖుషి' పాటలే. ఆరుకి ఆరూ సూపర్ హిట్. 'మిస్సమ్మ'లోని 'ఆడువారి మాటలకు అర్థాలే వేరులే' పాట రీమిక్స్ సైతం ఇన్‌స్టంట్ హిట్. 
అలాంటి ఈ సినిమా రీమేక్ కావడం గమనార్హం. దీని మాతృక తమిళంలో విజయ్, జ్యోతిక జంటగా నటించగా 2000 సంవత్సరంలో విడుదలై ఘనవిజయం సాధించిన 'ఖుషి' చిత్రం. చెప్పుకోదగ్గ విశేషమేమంటే ఒరిజినల్ సాధించిన విజయన్ని మించి తెలుగు రీమేక్ మరింత పెద్ద విజయం సాధించడం. మాతృకని రూపొందించిన ఎస్.జె. సూర్య ఈ రీమేక్‌నీ డైరెక్ట్ చేశాడు. శ్రీ సూర్యా మూవీస్ బేనర్‌పై ఎన్నో ప్రతిష్ఠాత్మక చిత్రాల్ని అందించిన ఎ.ఎం. రత్నం ఈ సినిమాకి నిర్మాత. సినిమా ఆద్యంతం 'రిచ్'గా కనిపించిందంటే - అందుకు కారణం సూర్య దర్శకత్వ ప్రతిభకి రత్నం ఉన్నతస్థాయి నిర్మాణ విలువలు తోడవడమే. పేరుకి రీమేక్ అయినా మాతృకని మించిన 'నవ్యత' తెలుగు 'ఖుషి'లో అడుగడుగునా గోచరిస్తుంది. ఫైట్లు, పాటల విషయంలోనే కాక సన్నివేశాల కల్పనకూ ఇది వర్తిస్తుంది. అందుకే "ఇది తమిళ వెర్షన్‌ని మక్కీకి మక్కీ కాపీ చేసిన సినిమా కాదు. తమిళం కంటే తెలుగు సినిమా మరింత సృజనాత్మకంగా, మరింత వైవిధ్యంగా ఉంటుంది" అని చెప్పారు పవన్‌కల్యాణ్. చాలామందికి తెలీని సంగతి ఇంకోటుంది. సంభాషణల రచయిత రాజేంద్రకుమార్ మాటల్లో చెప్పాలంటే "తమిళ వెర్షన్‌లో కోల్‌కతా ఎపిసోడ్ లేదు. అక్కడ ఆ ఎపిసోడ్ వేరేవిధంగా ఉంటుంది. కోల్‌కతా నేపథ్యంలో ఆ ఎపిసోడ్ తెచ్చింది కల్యాణే".
'ఖుషి' యువతరాన్ని ఇంత గొప్పగా ఆకట్టుకోవడానికి కారణమేంటి? కథ పరంగా చూస్తే చెప్పుకోడానికి ఏమీలేదు. అతి సన్నని లైను మీద అల్లుకున్న సన్నివేశాల సమాహారం మాత్రమే. ఏమిటా లైను. మాస్టర్స్ డిగ్రీ చేస్తున్న ఇద్దరు యువతీ యువకుల మధ్య సున్నితంగా నడిచే ప్రేమ వ్యవహారం. అదీ కూడా చివరి రీలులో తప్ప ఇద్దరూ తమ ప్రేమని ఎదుటివాళ్ల వద్ద వ్యక్తం చేయరు. ఎప్పుడూ 'అహం' (ఇగో) ప్రదర్శిస్తూ గొడవపడుతూనే ఉంటారు. అయినా ఒకరంటే ఒకరికి ఎనలేని అనురాగం. అలాంటి ఓ అమ్మాయి, అబ్బాయి మధ్య సున్నితంగా సాగే రొమాన్స్‌ని ఇంకెంత సున్నితంగా నడపాలి! పాత 'మిస్సమ్మ' గుర్తుంది కదా. ఎన్‌టీఆర్, సావిత్రి పాత్రలు గుర్తున్నాయి కదా. అందులో ఆ ఇద్దరికీ ఒకరంటే ఒకరికి చెప్పలేనంత అనురాగం. కానీ దాన్ని బయటపెట్టడానికి ఇద్దరికీ 'అహం' అడ్డు వస్తుంటుంది. ఒక రకంగా చెప్పాలంటే 'ఖుషి'లో పవన్‌కల్యాణ్, భూమిక పోషించిన సిద్ధార్థ్‌రాయ్, మధుమతి పాత్రలు వాటికి కొనసాగింపు. నాటి పాత్రల స్వభావాన్ని అందిపుచ్చుకుని నేటి పాత్రల్ని మలచాడు సూర్య. అదీ, అత్యంత ఆకర్షణీయంగా. అందుకే ఆ పాత్రల్లో తమని తాము చూసుకున్నారు కాలేజీ యువత. ఆ పాత్రలతో సహానుభూతి చెందారు. 'ఖుషి' చేసుకున్నారు. వాళ్లని అంతగా ఆకట్టుకున్న సిద్ధార్థ్‌రాయ్, మధుమతి కథేమిటో ఓసారి చూద్దాం. 

కథాసంగ్రహం:
కోల్‌కతాలో సిద్ధార్థ్‌రాయ్ అలియాస్ సిద్ధు (పవన్‌కల్యాణ్), కైకలూరులో మధుమతి అలియాస్ మధు (భూమిక) దాదాపు ఒకే సమయంలో పుడతారు. కాలేజీలో సిద్ధుకి బెంగాల్ టైగర్ అని పేరు. అతని తండ్రి తెలుగువాడైతే, తల్లి బెంగాలీ. మాస్టర్స్ డిగ్రీ కోసం కెనడాకి వెళ్లాలనేది సిద్ధు కోరిక. తల్లికి ఇష్టముండదు. ఎమ్మెస్ చదవాలనేది మధు లక్ష్యం. తండ్రి బాపిరాజు (విజయ్‌కుమార్) ఒప్పుకోడు. 'మా అమ్మాయి పెళ్లికి ఒప్పుకోవాలి' అంటూ గుడిచుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న తండ్రిని చూసి పెళ్లికి సరేనంటుంది మధు. పెళ్లిరోజు 'ఇంతకు ముందే నేనో అమ్మాయిని ప్రేమించా. ఆమె ఆత్మహత్యకు సిద్ధపడింది. ఆమె వద్దకి వెళ్తున్నా. నన్ను క్షమించండి' అంటూ ఆ కనిపించని వరుడు ఉత్తరం రాసి వెళ్లిపోతాడు.
కెనడాకని కారులో ఎయిర్‌పోర్ట్‌కి వెళ్తున్న సిద్ధు రోడ్డు మీద సిగ్నల్స్ వద్ద అడ్డం వచ్చిన ఓ యువకుణ్ణి (ఎస్.జె. సూర్య) తప్పించబోయి, ఇంకో కారుని గుద్దేస్తాడు. హాస్పిటల్లో తేలతాడు. రెండు నెల్లు బెడ్ రెస్ట్ తప్పదంటారు డాక్టర్లు. పెళ్లి తప్పిన మధు, కెనడా ప్రయాణం ఆగిన సిద్ధు హైదరాబాద్ నిజాం కాలేజీలో అడుగుపెడతారు. అక్కడ సిద్ధుకి స్నేహితుడైన బాబు (శివాజీ), మధుకి ఫ్రెండయిన శాంతి (డిపుల్) ప్రేమలో పడతారు. బాబు అనాథ అయితే శాంతి పేరుపొందిన గూండా గుడుంబా సత్తి (రాజన్ పి. దేవ్) కూతురు. ఆ ఇద్దరికీ సిద్ధు, మధు సాయపడుతుంటారు. ఆ రకంగా ఇద్దరూ ఒకరికొకరు సన్నిహితమవుతారు. ఓసారి చదువుకుంటున్న మధు వద్దకు వచ్చి పలకరిస్తాడు సిద్ధు. 'డోంట్ డిస్టర్బ్. చదువుకుంటున్నా' అంటుంది మధు. కొద్ది దూరంలో కూర్చుని సిద్ధు ఆమె వంక చూస్తే గాలికి పైట తొలగి అనాచ్చాదితమైన ఆమె నడుము, నాభి.. చూపు తిప్పుకోలేకపోతాడు. మధు తనవైపు చూడగానే తల తిప్పుకుంటాడు. ఇలా మూడు నాలుగుసార్లు జరగడంతో సిద్ధు ఏం చూస్తున్నాడో అర్థమై అతడితో గొడవపెట్టుకుంటుంది మధు. 'నువ్వు నా నడుం చూశావు' అని మధు అంటే 'లేదు' అంటాడు సిద్ధు. ఇద్దరి మధ్యా వాదన జరుగుతుంది. "అసలిలాంటి అమ్మాయితో ఫ్రెండ్‌షిప్ చెయ్యను. ఒకవేళ చేసినా అది లవ్‌దాకా రాదు. వచ్చినా అది మ్యారేజ్ దాకా వెళ్లదు. ఖర్మకాలి నన్ను బలవంతంగా పెళ్లికి దింపినా కానీ, ఇలాంటమ్మాయి వొద్దని లెటర్‌రాసి పారిపోతా" అనికూడా అంటాడు. దాంతో ఏడుస్తూ "సిద్ధు అనేవాణ్ణి లైఫ్‌లో కలవలేదనే అనుకుంటా. నథింగ్ బిట్వీన్ యు అండ్ మి" అంటా వెళ్లిపోతుంది మధు. 
బాబు, శాంతికి సిద్ధు సాయపడుతుండటంతో అతడిమీద సత్తి మనుషులు ఎటాక్ చేస్తారు. ఒకడు సిద్ధుని కత్తితో పొడవబోవడం చూసిన మధు ఆ కత్తిని చేతితో గట్టిగా పట్టుకుని గాయపడుతుంది. ఆమెని హాస్పిటల్లో చేరుస్తాడు సిద్ధు. ఇద్దరూ మళ్లీ దగ్గరవుతున్నట్లే వుంటారు కానీ ఇగోలు తగ్గవు. శాంతికి పెళ్లి నిశ్చయం చేస్తాడు సత్తి. దాంతో శాంతి, బాబుకు గుళ్లో పెళ్లి ఏర్పాట్లు చేస్తాడు సిద్ధు. సత్తి, అతని అనుచరులు అక్కడికి వస్తుంటే మధ్యలో అటకాయించి, వాళకి తన కత్తి పదును రుచి చూపిస్తాడు. స్నేహితులమైన మేమే వాళ్ల పెళ్లికి సాయపడుతుంటే, తండ్రివైన నీవెందుకు వాళ్ల పెళ్లిని అడ్డుకుంటున్నావని అడుగుతాడు సత్తిని. అతని మంచి మాటలతో రియలైజ్ అయిన సత్తి మంచివాడిగా మారిపోయి, వధూవరుల మీద అక్షింతలు చల్లుతాడు. ఎవరిదారిన వాళ్లు ఆనందంగా వెళ్లిపోతారు. చదువులు అయిపోతాయి. విడిపోవాల్సిన సమయం వచ్చేసింది. సూట్‌కేసులు సర్దుకుంటుంటే మధు, సిద్ధు హృదయాలు ఆవేదనాభరితం అవుతాయి. ఒకరి మనసులోని భావం మరొకరికి చెప్పుకోవాలనుకుంటారు. కుదరదు. సిద్ధు ఫలక్‌నామా ఎక్స్‌ప్రెస్‌కి వెళ్తున్నాడని మధుకీ, మధు గౌతమి ఎక్స్‌ప్రెస్‌లో వెళ్లబోతున్నదని సిద్ధుకీ తెలుస్తుంది. స్టేషన్‌లో మధు కోసం గౌతమిలో సిద్ధు, అతని కోసం ఫలక్‌నామాలో మధు వెతుకుతారు. కనిపించకపోయేసరికి మధుకివ్వమని సిద్ధు, సిద్ధుకివ్వమని మధు పక్క సీట్లలో ఉన్నవారికి ఓ లెటర్ ఇచ్చి వాళ్లు వచ్చాక ఇవ్వమంటారు. రైలుబళ్లు కదులుతాయి. ఉత్తరాలు అందుతాయి. 'ఐ లవ్ యు మధు' అని సిద్ధు, 'ఐ లవ్ యు సిద్ధు' అని మధు రాసుకుంటారు. 'నన్ను ప్రేమించడానికీ, నాతో గొడవపడ్డానికీ నువ్వు కావాలి సిద్ధూ' అని కూడా రాస్తుంది మధు.

తెలుగు 'ఖుషి' మరింత సృజనాత్మకం
-పవన్‌కల్యాణ్
రీమేక్ అంటే రీమేకే. కథ విషయానికి వస్తే 'ఖుషి' ఒరిజినల్ కాకపోవచ్చు. కానీ చాలా సన్నివేశాల్లో, ఫ్రేముల్లో ఒరిజినాలిటీ ఉంది. పాటలు, ఫైట్లు కొత్తగా డిజైన్ చేశాం. రెండు భాషల్లోనూ 'ఖుషి' చూస్తే ఆ సంగతి మీకు అర్థమవుతుంది. అంటే తమిళ మాతృకని మేం మక్కీకి మక్కీ కాపీ చేయలేదు. సృజనాత్మకత పరంగా చూస్తే చిత్రంలో చాలా కొత్త ఐడియాలు ప్రవేశపెట్టాం. మాతృక కంటే తెలుగు వెర్షన్ మరింత సృజనాత్మకంగా, మరింత వైవిధ్యంగా ఉంటుందనే సంగతి తెలుస్తుంది.
దర్శకుడు సూర్యలో ఏదైనా కొత్తగా చేయాలనే తపన అధికం. నేనూ అలాంటి నావెల్టీనే కోరుకుంటా కాబట్టి మామధ్య మంచి అండర్‌స్టాండింగ్ కుదిరింది. అందువల్లే ఫైట్స్‌నీ, కొన్ని పాటల్నీ నేను డిజైన్ చేశా. కొన్ని సన్నివేశాల్నీ సమన్వయంతో చేసుకుపోయాం. ఈ సినిమాకి రత్నం నిర్మాత కావడం పెద్ద ప్లస్ పాయింట్. దేనికీ ఆయన 'నో' చెప్పలేదు. 

(వచ్చేవారం 'ఖుషి' ఘనవిజయానికి దోహదం చేసిన అంశాలు) 

Saturday, January 29, 2011

హిట్.. హిట్.. హుర్రే...!: నరసింహనాయుడు (రెండో భాగం)

'నరసింహనాయుడు' నిర్మాణ వ్యయం దాదాపు 8 కోట్ల రూపాయలు. పదేళ్ల క్రితం అంత బడ్జెట్ అంటే చాలా ఎక్కువే. ఈ సినిమాలో భారీ సంఖ్యలో టాటా సుమోలు కనిపిస్తాయి. విలన్, హీరో గ్రూపులకు ఇలా అధిక మొత్తంలో సుమోలను ఉపయోగించడం దర్శకుడు గోపాల్ ప్రారంభించిన ధోరణే. భావోద్వేగ సన్నివేశాల సందర్భాల్లో అలా బారులు బారులుగా తెల్లటి సుమోలు కనిపిస్తుంటే ప్రేక్షకుడి రోమాలు నిక్కబొడుచుకునేవి ఆ రోజుల్లో. ఆ తర్వాత రోజుల్లో సందర్భం ఉన్నా, లేకున్నా అధిక సంఖ్యలో సుమోలు వాడటం విపరీత ధోరణిగా మారి, ప్రేక్షకులకి మొహం మొత్తడం వేరే సంగతి. 'నరసింహనాయుడు'లో టాటా సుమోల సన్నివేశాలన్నీ ఉద్వేగభరిత సన్నివేశాల్లో వచ్చేవే. అందుకే అవి కథలో అంతర్భాగంగా ఇమిడిపోయాయి. ఆయా సన్నివేశాల్ని పండించాయి. వాటితో పాటు రైలుబండి వద్ద యాక్షన్ సన్నివేశాలు, హెలికాప్టర్‌ని వినియోగించడం వంటివి ఈ సినిమా వ్యయాన్ని బాగా పెంచాయి. అంత వ్యయమంటే అప్పట్లో చాలా రిస్కే. చిన్నికృష్ణ కథనీ, గోపాల్ దర్శకత్వ సామర్థ్యాన్నీ నమ్మినందునే నిర్మాత మురళీకృష్ణ అంత మొత్తాన్ని వెచ్చించారు. "ఎందుకు, ఏమిటి అనకుండా అడిగిందల్లా సమకూర్చిపెట్టారు నిర్మాత మురళీకృష్ణ గారు. ఎప్పుడూ 'ఇదొద్దు' అనలేదు. సూట్‌కేసులతో డబ్బులు కుమ్మరించారు. ఆయనకి హేట్సాఫ్ చెప్పాలి" అని కృతజ్ఞత వ్యక్తం చేస్తారు దర్శకుడు గోపాల్. బడ్జెట్ విషయంలో తీసుకున్న రిస్కుకి తగ్గట్లుగానే అనూహ్యమైన ఫలితం దక్కింది. ఖర్చుకి రెండు రెట్లకి మించి 21 కోట్ల రూపాయల్ని వసూలు చేసింది ఈ చిత్రం. ఆ విధంగా 20 కోట్ల రూపాయల వసూళ్లు సాధించిన తొలి సినిమాగా ఇది రికార్డులకెక్కింది. ఈ ఫలితాన్ని ఊహించింది ఒకే ఒక్కడు. అతను చిన్నికృష్ణ. తను రాసిన స్క్రిప్టు చివరి పేజీలోనే ఆయన 'ఈ సినిమా 20 కోట్ల రూపాయల్ని వసూలు చేస్తుంది' అనే మాట కూడా రాశాడు. అది నూటికి నూరు శాతమూ నిజమవడం విశేషమే.
మరి ఇంతటి విజయాన్ని సాధించిన 'నరసింహనాయుడు' బలం ఎక్కడుంది? ఏయే అంశాలు ఆ సినిమాకి అంతటి విజయాన్ని చేకూర్చిపెట్టాయి? ఈ సినిమాలో లోపాలే లేవా? ఎందుకు లేవు! నరసింహనాయుడు పెద్దవాడై మనకి కనిపించడమే నాట్యాచార్యునిగా కనిపిస్తాడు. అయితే చిన్నతనంలోనే కర్రసాము, కత్తిసాము నేర్చుకుని తర్వాత ప్రత్యర్థుల పీచమణూస్తూ వచ్చిన నరసింహనాయుడు ఎప్పుడు నాట్యం నేర్చుకున్నాడు? నేర్చుకున్నా అంత తొందరగా నాట్యాచార్యుడు ఎలా అయ్యాడు? అనేవి సమాధానం లభించని ప్రశ్నలు. అలాగే 'సర్వకాల సర్వావస్థల్లోనూ నీ తోడుగా, నీడగా ఉంటాను' అని ప్రమాణం చేసి పెళ్లి చేసుకున్న భార్యను అన్నావదినల్ని తూలనాడిందనే కారణంతో కనీసం ఆమె వాదన కూడా వినకుండా పుట్టింటికి పంపేయడం ధీరోదాత్త నాయకుని లక్షణం కాదు. నరసింహనాయుడు ఆ పని చేశాడు. భార్య పట్ల చాలా కఠినంగా వ్యవహరించి, ఆమెని వ్యధకు గురిచేశాడు. అంటే కథలో శ్రావణి పాత్రకు అన్యాయం జరిగింది.
అయితే మామాలు ప్రేక్షకుడికి ఇవేవీ పట్టలేదు. కారణం, వాటిని గుర్తించని రీతిలో అమరిన స్క్రీన్‌ప్లే. ఆరంభం నుంచి శుభం దాకా కుర్చీల్లో కదలనివ్వని కథాగమనం 'నరసింహనాయుడు'కి పెద్ద బలం. ఆ పాత్రని ప్రేక్షకులు అంతగా ప్రేమించడానికి దోహదం చేసింది అదే. ఇంటర్వెల్ వచ్చినప్పుడు సాధారణంగా ప్రేక్షకుడు రిలీఫ్ పొందడానికి కుర్చీలోంచి లేస్తాడు. కానీ ఎప్పుడు ఇంటర్వెల్ టైం అయిపోతుందా, ఎప్పుడు సెకండాఫ్ మొదలవుతుందా.. అనే క్యూరియాసిటీని కలిగించింది ఈ చిత్రం. అంతదాకా అజ్ఞాతంలో ఉన్న నరసింహనాయుడు ఉనికి తెలిపే ట్రైన్ ఎపిసోడ్ కచ్చితమైన ఇంటర్వెల్ బ్యాంగ్. ప్రత్యర్థులకు మొదట వీపు చూపించి, 'స్లో మోషన్'లో నరసింహనాయుడు మొహాన్ని చూపిస్తుంటే, ఆ రూపాన్ని చూసీ చూడగానే ఠారెత్తి ఆ ప్రత్యర్థులు ఆయుధాలు అక్కడే పడేసి పరుగులు తీస్తుంటే, 'మాస్' ప్రేక్షకుడికి అంతకంటే ఉద్వేగభరిత సన్నివేశం ఇంకేముంటుంది! అంతకుముందు దాకా సాఫ్ట్‌గా కనిపించి, సింహాచలం నాయుడు తమ్ముళ్లని చితగ్గొట్టినా నరసింహనాయుడులోని హీరోయిజాన్ని ఒకేసారి వెయ్యి రెట్లు పెంచేసిన సన్నివేశం అది. నరసింహనాయుడు వంటి బలమైన పాత్రలు అరుదుగా వస్తుంటాయి. అది త్యాగం, పౌరుషం సమపాళ్లలో రంగరించిన పాత్ర. ఆ పాత్ర జనానికి అంతగా ఎందుకు నచ్చింది? "అతను (నరసింహనాయుడు) ఊరికోసం ప్రత్యర్థిని చంపుతాడు. కుటుంబం కోసం చదువుసంధ్యలు వదిలేశాడు. అన్నయ్యలను తూలనాడింది అన్ని కట్టుకున్న భార్యను వదిలేస్తాడు. సోదరుల కోసం ప్రాణాలను త్యాగం చేయడానికి సిద్ధపడతాడు. వాళ్లను రక్షించుకునే సమయంలో భార్యను పోగొట్టుకుంటాడు. కొడుకు వేరే కథానాయికలో అమ్మను వెతుక్కుంటే అంగీకరించడు. కానీ తండ్రి 'ఇంతమందికి ఇన్ని చేశావు, ఆ పసివాడికి అమ్మను తెచ్చిపెట్టలేవురా' అంటే వెళ్లి తీసుకొస్తాడు. విచిత్రం ఏమిటంటే ఏదీ తనకోసం చేయడు. తనవారికోసమే చేస్తాడు. అందుకే అందరికీ నచ్చిందా పాత్ర" అని వివరిస్తారు పరుచూరి కోపాలకృష్ణ.
అలాంటి పాత్రను తనదైన శైలితో రక్తి కట్టించారు బాలకృష్ణ. సెంటిమెంట్ సన్నివేశాల్లో ఎంతటి సాత్త్వికాభినయం చేశారో, భావోద్వేగ సన్నివేశాల్లో అంతటి గాంభీర్యాన్ని ప్రదర్శించారు. పోరాట సన్నివేశాల్లో ఎంతటి పరాక్రమాన్ని చూపించారో, సరదా సన్నివేశాల్లోనూ, పాటల్లోనూ అంతటి హుషారు కనపరిచారు. అలా 'నరసింహనాయుడు'కి ప్రాణ ప్రతిష్ఠ చేశారు బాలకృష్ణ. అందుకే ఆ పాత్రని నెత్తికెత్తుకున్నారు జనం. అందుకే ఆ పాత్రకి 'ఉత్తమ నటుడు'గా నంది అవార్డు అందుకున్నారు బాలకృష్ణ.
ఆయనకు దీటుగా శ్రావణి పాత్రలో సిమ్రాన్ ప్రదర్శించిన అభినయం కూడా ప్రేక్షకుల మనసుల్లో హత్తుకుపోయింది. భర్తను అతని అన్నావదినలు ఇష్టం వచ్చినట్లు తూలనాడుతుంటే తట్టుకోలేక వారిమీద ఆమె తిరగబడే సన్నివేశం 'నరసింహనాయుడు' పాత్రౌచిత్యాన్ని పరిపుష్ఠం చేసింది. ఇక తండ్రి పాత్రలో కాశీనాథుని విశ్వనాథ్ ప్రదర్శించిన హుందాతనం, ప్రతినాయకునిగా ముఖేష్‌రుషి చూపించిన క్రూరత్వం జనాన్ని మెప్పించాయి. మిగతా తారలంతా తమకి అప్పగించిన పాత్రల్ని సమర్థంగా చేసుకుంటూ వెళ్లారు.
బి. గోపాల్ దర్శకత్వ ప్రతిభ ప్రతి ఫ్రేములోనూ కనిపించే ఈ సినిమా విజయానికి దోహదం చేసిన అంశాల్లో ప్రముఖమైంది మణిశర్మ కూర్చిన సంగీతం. బాలకృష్ణ, ఆషా సైనీపై చిత్రీకరించిన 'లక్స్ పాప లక్స్ పాప లంచ్‌కొస్తావా' పాట మాస్‌ని ఓ ఊపు ఊపింది. 'కొక్కో కోమలి కొరుక్కుతిన్నది కోలాటంలో', 'చిలకపచ్చ కోక పెట్టినాది కేక', 'మొన్నా కుట్టేసినాది నిన్నా కుట్టేసినాది' పాటలు జనంలోకి బాగా వెళ్లాయి. ఇక సన్నివేశాలకు బలం చేకూర్చిన నేపథ్య సంగీతాన్నీ విస్మరించలేం. చిన్నికృష్ణ స్క్రీన్‌ప్లేకి మరింత బలాన్నిచ్చినవి పరుచూరి సోదరుల సంభాషణలు. బావోద్వేగ సంభాషణలకు పెట్టింది పేరైన వారు 'కత్తులతో కాదురా కంటిచూపుతో చంపేస్తా' తరహా డైలాగులతో చెడుగుడు ఆడుకున్నారు. తన బావలు, తోడికోడళ్ల వద్ద ఆవేశభరితంగా శ్రావణి నోట పలికే ఇంగ్లీషు డైలాగులకు చప్పట్లు పడ్డాయంటే ఆ క్రెడిట్ వాళ్లదే. సినిమాకి మంచి 'లుక్' రావడంలో కీలకమైంది వి.ఎస్.ఆర్. స్వామి సినిమాటోగ్రఫీ. చేజింగ్ సీన్లలో ఆయన కెమెరా ఎక్కడా షేక్ కాలేదు. భావోద్వేగ సన్నివేశాల్లో ఆయన కెమెరా యాంగిల్స్ అత్యుత్తమ స్థాయిలో ఉన్నాయి. అలాగే పోరాట సన్నివేశాల్ని గొప్పగా రూపొందించి 'నరసింహనాయుడు' విజయంలో తనదీ ప్రముఖ పాత్రేనని చాటిచెప్పారు స్టంట్ మాస్టర్ విక్రం ధర్మా. ఇవన్నీ తెరమీద ఇలా పండాయంటే అందుకు ఎడిటింగ్ నిర్వహించే పాత్ర చాలా ఎక్కువ. ఆ పనిని అత్యంత సమర్థంగా నిర్వహించారు కోటగిరి వెంకటేశ్వరరావు.
ఇలా ఇందరి సమష్టి కృషి వల్లే 'నరసింహనాయుడు' చిత్రం గొప్ప విజయాన్ని సాధించింది. మునుపటి బాక్సాఫీసు వసూళ్ల చరిత్రని తిరగరాసింది. 105 కేంద్రాల్లో శతదినోత్సవం, 17 కేంద్రల్లో రజతోత్సవం జరుపుకుంది. ఏలూరులో 275 రోజులు ఆడింది. 'సమరసింహారెడ్డి' తర్వాత బాలకృష్ణ - బి. గోపాల్ ద్వయానికి మరో సంచలన చిత్రంగా నిలిచింది.

'నన్ను మళ్లీ ట్రాక్‌లో నిలిపిన సినిమా' 
-బి. గోపాల్
చిన్నికృష్ణ 'సమరసింహారెడ్డి' టైంలోనే కలిసేవాడు. కథలు చెప్పేవాడు. అప్పుడు ఆ కథలు వర్కవుట్ కాలేదు. తర్వాత నేనే పిలిపించా. ఈ కథ చెప్పాడు. ఇంటర్వెల్ వరకు చెప్పాడు. బాగుంది. నిర్మాతకీ, బాలకృష్ణకీ నచ్చింది. మొదట సెకండాఫ్‌లో హీరో ఐపీఎస్ ఆఫీసర్‌గా కనిపిస్తాడని చెప్పాడు. నాకు ఐపీఎస్ ఆఫీసర్ అనే పాయింట్ నచ్చలేదు. అప్పటికే బాలయ్యతో 'రౌడీ ఇన్‌స్పెక్టర్' చేసివున్నా. నాలుగు రోజుల్లో బాలయ్యకు సెకండాఫ్ చెప్పాలి. పోలీసాఫీసర్ గెటప్ లేకుండా చెప్పమన్నా. చిన్ని కొంత అప్సెట్ అయ్యాడు. దాంతో పరుచూరి బ్రదర్స్‌తో చిన్నికి మీటింగ్ ఏర్పాటు చేయించా. అప్పుడు ఇంటికొక్కడు బలిదానమయ్యే పాయింట్ చెప్పాడు చిన్ని. నేను డౌట్‌పడ్డా. గోపాలకృష్ణ బాగుందన్నారు. ఆ తర్వాత సీనార్డర్ వేసుకొచ్చాడు చిన్ని. అది అందరికీ నచ్చింది. 'నరసింహనాయుడు' పాత్ర చెబుతుంటేనే బాలయ్య ఎగ్జయిట్ అయ్యారు. వెంటనే 'ఈ సబ్జెక్టుతో సినిమా చేస్తున్నాం' అన్నారు. స్క్రీన్‌ప్లే గొప్పగా చేశాడు చిన్ని. షూటింగ్ మొదలైన ఆరు నెలల్లో సినిమాని విడుదల చేశాం. వేస్టేజ్ లేకుండా రీజనబుల్ బడ్జెట్‌లో సినిమా చేశాం. నిర్మాత ధైర్యంగా కొన్ని ఏరియాలు అమ్మకుండా ఉంచుకున్నారు. పెద్ద హిట్టవడంతో బాగా డబ్బు వచ్చింది.
బాలయ్య పర్ఫార్మెన్స్ ఎక్స్‌ట్రార్డినరీ. మొదట సాఫ్ట్‌గా, తర్వాత ఎమోషనల్ మేన్‌గా గొప్పగా నటించాడు. లుక్స్‌తోనే పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. స్క్రిప్టుకు తగ్గట్టు వంద శాతం కాదు వెయ్యి శాతం న్యాయం చేశాడు.
'సమరసింహారెడ్డి' తర్వాత నేను చేసిన సినిమాలు సరిగా రాలేదు. ఈ సినిమా నన్ను మళ్లీ ట్రాక్‌లో నిలబెట్టింది. టెక్నీషియన్లకి ఇక సక్సెస్ వస్తే చెప్పలేని ఆనందం. ఆయుష్షు పెంచినంత బలాన్నిస్తుంది. ఇంకా మంచి సినిమా చెయ్యాలన్న ఉత్సాహాన్నిస్తుంది.

'నా అంచనా తప్పలేదు' 
-చిన్నికృష్ణ
ఉత్తర భారతంలో దేశభక్తి ఎక్కువ. దక్షిణ భారతంలో వ్యక్తుల్ని పూజిస్తే, పంజాబ్‌లాంటి చోట్ల దేశాన్ని పూజిస్తారు. అందుకే ఆర్మీలో నార్త్‌వాళ్లు ఎక్కువ. అక్కడ కొన్ని గ్రామాల్లో ప్రతి ఇంటికీ ఒక్కో కొడుకు దేశ రక్షణలో ఉన్నాడు. నేను అలాంటి గ్రామాల్ని ప్రత్యక్షంగా చూశా. దానికి ఎంతో ఇన్‌స్పైర్ అయ్యా.
మన ఊరి సమస్యని కాపాడ్డానికి లా అండ్ ఆర్డర్ ఫెయిలయినప్పుడు ఒక్కో ఇంట్లో ఒక్కొక్కణ్ణి బలిదేవుడి (వారియర్)గా ఇస్తే వాళ్లు తమ ఊర్ని కాపాడుకుంటారనే ఐడియా అలా వచ్చింది. అట్లాంటి యోధులకి పెళ్లి సంబంధాలు రావు. ఒకవేళ పెళ్లయితే ఆ భార్యకి ఎన్నో కష్టాలుంటాయి. ఈ అంశాలు నా స్క్రిప్టులో 'బై-ప్రొడక్ట్స్'గా బాగా వర్కవుట్ అయ్యాయి.
నిజానికి నా మైండ్‌లో పోలీస్ కేరక్టర్ లేదు. మొదట సినిమా పోలీస్ అనుకుని మొదలుపెట్టినందునే అలా చెప్పా. తర్వాత గోపాల్ పోలీస్ ఆఫీసర్ కాకుండా చెప్పమన్నారు. నా మైండులో ఉన్న అసలు కథ అప్పుడు చెప్పా. 'లక్ష్మీనరసింహస్వామి' అనే థాట్ క్రియేట్‌చేసి తొలిగా చెప్పింది నేనే. నేను సృష్టించిన నరసింహనాయుడు కేరెక్టర్ ఇప్పటికీ కంటిన్యూ అవుతుండటం సంతోషకరం.
తమ ఇంట్లో ఈ స్క్రిప్టు వినగానే లోపలికి వెళ్లి స్వీట్ పాకెట్, పళ్లు తెచ్చిచ్చి, 'ఈ అబ్బాయి గొప్ప రైటర్ అవుతాడు' అని ఆశీర్వదించారు బాలకృష్ణ. ఆయన మిగతా హీరోలందరికంటే ఎంతో గొప్పవారు. సినిమా సక్సెస్ అవగానే కొన్ని లక్షల రూపాయలు విలువచేసే పురాతన పచ్చల పతకం, పట్టుబట్టలు ఇచ్చి, కారుదాకా మమ్మల్ని తీసుకువచ్చి పంపిన గొప్పవారు. నా 'నరసింహనాయుడు' పాత్రకి వంద శాతం జస్టిఫై చేశారు బాలకృష్ణ. చిన్నపిల్లాడిగా విని, పెద్ద నటునిగా చేశారు. విశ్వరూపాన్ని ప్రదర్శించారు కాబట్టే అంత పెద్ద హిట్టు.
ఈ సినిమా స్క్రిప్టు ఎ టు జడ్ నాదే. నా స్క్రిప్టు ఆఖరి పేజీలో '20 కోట్లు వస్తాయి' అని రాశా. బడ్జెట్ 8 కోట్లయితే, 21 కోట్లు వచ్చాయి. ప్రతి సినిమాకీ అలాగే రాస్తుంటా. అది అహంకారమనుకోండి, ఆత్మవిశ్వాసం అనుకోండి. ఇంతవరకు నా అంచనా తప్పలేదు. ఉత్తమ నటునిగా నంది అవార్డు అందుకుంటూ 'సాక్షాత్తూ లక్ష్మీనరసింహస్వామి చిన్నికృష్ణ రూపంలో మా ఇంటికి వచ్చి ఈ కథ చెప్పాడు' అన్నారు బాలకృష్ణ. అంతకుమించిన కాంప్లిమెంట్ నాకు ఇంకేముంటుంది! మళ్లీ ఆయనా, నేనూ కలుస్తాం. అది చరిత్ర అవుతుంది. అదే 'నందీశ్వరుడు'. తెలుగు చలనచిత్ర పరిశ్రమలోని సినిమాలన్నీ అదే రోజు రిలీజైనా నేను రెడీ. 'నందీశ్వరుడు' మీద అంత గట్టి నమ్మకం.

(వచ్చే వారం 'ఖుషి' సినిమా కబుర్లు) 

Tuesday, January 25, 2011

మాస్ అంటే అంత చులకనా?

ఈ మధ్య మన సినిమావాళ్లకి - ముఖ్యంగా దర్శకులకీ, కథకులకీ - మాస్‌ని తక్కువ అంచనా వెయ్యడం ఎక్కువయ్యింది. మతిమాలిన హింస అన్నివేళలా వర్కవుట్ కాదని స్పష్టం కావడంతో బూతు హాస్యాలు, జుగుప్సాకర దృశ్యాల్ని ఆశ్రయించడం మొదలుపెట్టారు. మాస్‌కి ఇట్లాంటి సీన్లయితేనే నచ్చుతాయనే భ్రమలు పెరిగాయి. మేధావుల మెప్పుకోసం ఎవరూ కమర్షియల్ సినిమాలు తీయరనే సంగతి అందరూ ఒప్పుకుంటారు. అయినా మనకున్న పారలల్ సినిమాల సంఖ్య ఒక్క శాతం కంటే మించింది ఎప్పుడని? కానీ అధిక శాతం ప్రజల్ని ఆకర్షించడానికి చవకబారు, ముతక హాస్య సన్నివేశాల మీద ఆధారపడ్డం ఏమాత్రం సమర్థనీయం కాదు. పెద్ద దర్శకులమని అనిపించుకుంటున్న వాళ్లు సైతం ఇట్లాంటి దిగజారుడు దృశ్యాల్ని చిత్రీకరించడానికి ఉత్సాహం చూపిస్తూ తమ బాధ్యతని విస్మరిస్తున్నారు.
'పెళ్లిచేసి చూడు', 'మిస్సమ్మ', 'గుండమ్మ కథ', 'ఇల్లరికం', 'అహ నా పెళ్లంట', 'కొబ్బరి బోండాం', 'యమలీల' వంటి అమలిన హాస్య చిత్రాల్ని చూసిన కళ్లతోటే 'అల్లుడా మజాకా', 'అల్లరి మొగుడు', 'చిత్రం', 'టైంపాస్' వంటి అసభ్య, ముతక హాస్య చిత్రాల్ని చూడాల్సి రావడం బాధాకరం. వీటిలో కొన్ని విజయవంతం అయితే అవ్వొచ్చుగాక. మనిషిలో అంతర్గతంగా ఉండే ఇన్‌స్టింక్ట్స్‌ని రేపెట్టి వాటిని కేష్ చేసుకోవడంలో తాత్కాలికంగా సఫలమైనా చరిత్రలో వాటికి దక్కేది అట్టడుగు స్థానమే.
మనది ఎట్లాంటి సమాజం? ఒక భర్తకి ఒక భార్య, ఒక భార్యకి ఒక భర్త అనే సామాజికి సూత్రానికి అత్యంత విలువనిచ్చే సమాజం. ఇందులో మగవాడికి మినహాయింపులు ఇచ్చినట్లు అగుపించినా, భార్యతో కాక మరో స్త్రీతో సంబంధం పెట్టుకునే మగవాణ్ణి ఈ సమాజం గౌరవ దృష్టితో చూడదు. స్త్రీ విషయంలో అయితే ఇది మరీ ఘోరంగా ఉంటుంది. అట్లాంటిది ఒక గుడ్డివాణ్ణి చేసుకుంటే ఎంచక్కా ఇంకో మగాడితో రంకుతనం ఎట్లా సాగించవచ్చో 'టైంపాస్' చిత్రంలో కథకుడు కళ్లకు కట్టినట్లు చూపడం ఎంతైనా గర్హనీయం. కథకుడు ఈ రంకుతనాన్ని హైలైట్‌చేసి రంకుతనానికి వచ్చిన ఆటంకాల్ని సులువుగా తప్పించేస్తుంటాడు. చిత్రం ఆఖర్లో సైతం దానికి అడ్డుకట్ట వెయ్యకపోవడం చూస్తే మాస్‌ని కథకుడు కానీ, దర్శకుడు కానీ ఎంత తక్కువగా అంచనా వేశారో అర్థమవుతుంది. ఈ బాగోతం గురించి పిల్లలు తమ తల్లిదండ్రుల్ని అడిగితే వాళ్లేం సమాధానం చెప్పాలి? పైగా తనికెళ్ల భరణి, ఎమ్మెస్ నారాయణ, ఎల్బీ శ్రీరాం వంటీ పెద్ద హాస్యనటులు ఈ అసభ్య, అశ్లీల హాస్యాన్ని పోషించడం మనసుకి చాలా కష్టంగా తోస్తుంది. 'అల్లుడా మజాకా'లో చిరంజీవి అంతటివాడు చేయగా లేనిది మేం చేస్తే తప్పేంటి అని వాళ్లంటే మనం మాత్రం ఏం చేస్తాం?
హాస్య సన్నివేశాల్లోనే కాకుండా ఇతరత్రా కూడా కొన్ని పాత్రల చేత అసభ్యకర మాటల్ని పలికించడంలో కూడా మనవాళ్లు అత్యుత్సాహం చూపుతుంటారు. 'వైఫ్' చిత్రంలో కాలేజీ అమ్మాయిల చేత పలికించిన మాటలు వినడానికి సరదాగానూ, చూడ్డానికి వినోదంగానూ ఉంటే ఉండొచ్చుకానీ మాస్‌లో అవి ఎట్లాంటి ప్రభావాన్ని కలిగిస్తాయో యొచించనవసరం లేదా? కడుపుబ్బ నవ్వించే చిత్రమంటూ 'జాక్‌పాట్'కి తెగ పబ్లిసిటీ ఇచ్చారు. ఫక్తు కామెడీ చిత్రమని భావించి వెళ్లిన మహిళా ప్రేక్షకులు ఆ చిత్రంలోని వెకిలి, అశ్లీల హాస్యాన్నీ, సంభాషణల్నీ భరించలేక ఇంటర్వెల్‌లోనే బయటకి వెళ్లడానికి ఇష్టం చూపారు. ఇందులోని సంభాషణలు సెన్సార్ కత్తెరకి చిక్కకపోవడం విడ్డూరంగా అనిపిస్తుంది. ఒక్కో సినిమాలో కొన్ని సన్నివేశాల్నే ఎందుకు కట్‌చేస్తారో తెలీని సెన్సార్ వాళ్లకి 'జాక్‌పాట్'లోని డైలాగులు బాగా వినోదాన్ని అందిచాయేమో వాటికి కట్ చెప్పడం మర్చిపోయారు.
'ఎదురులేని మనిషి'లో కొత్త నటి షెహనాజ్, ఎల్బీ శ్రీరాంల మధ్య నడిచే డైలాగులు ముతక హాస్యానికి అసలు సిసలు నమూనాగా నిలుస్తాయి. పరమ జుగుప్సాకరంగా తోస్తాయి. బహుశా రచయిత తన ఒరిజినల్ మెంటాలిటీని ఆ సంభాషణల ద్వారా వ్యక్తం చేశాడేమో! హిట్ ముద్రని వేసుకున్న 'బ్యాచిలర్స్', '6 టీన్స్' చిత్రాల్లోనూ బూతు జోకులూ, జుగుప్సాకర డైలాగులూ, సన్నివేశాలూ మోతాదు మించాయి. వీటిని చూసి సినిమా హిట్టవడానికి అట్లాంటి డైలాగులూ, దృశ్యాలూ వుండాలనే అపోహలో పడిపోయి వాటినే నమ్ముకుని చిత్రాలు తీస్తూ చాలామంది బోల్తాకొడుతున్నారు.
వాస్తవానికి ఏ చిత్రమూ ముతక హాస్యంవల్ల, అశ్లీల సన్నివేశాలవల్ల విజయం సాధించలేదు. టెక్నిక్, కథనంవల్లనే ఆయా చిత్రాలు హిట్టయ్యాయన్న సంగతి గ్రహించాలి. ఇప్పటి చిత్రాల్లో ఆరోగ్యకరమైన హాస్యం ఉండటంలేదని వ్యక్తిగతంగా ప్రతివొక్కరూ బాధని వ్యక్థం చేస్తుంటారు. పత్రికా ఇంటర్వ్యూలలో, దృశ్యమాధ్యమంలోనూ మంచి హాస్యం రావాలని ఆకాంక్షని ప్రదర్శిస్తుంటారు. అయితే తమ వంతు బాధ్యతగా ఏం చేశారో, ఏం చేస్తున్నారో మాత్రం చెప్పరు. పైగా ఆ తర్వాత కూడా అట్లాంటి డైలాగులు సినిమాల్లో యధేచ్చగా వల్లిస్తూనే ఉంటారు. ఈ 'ద్వంద్వ' రీతిని ముందు ఉద్ధండ హాస్యనటులు వదిలించుకోవాలి. మాస్‌కి వాళ్లు చేయగల మేలు అదే.
అశ్లీల హాస్యం పెచ్చుమీరిపోతున్నదని ఒక పక్క బాధపడుతుంటే ఇప్పుడు ఇంకోరకం బాధ జనాల్ని వేధించడానికి ముందుకొస్తున్నది. ఈ కొత్త హాస్యం జనాల్ని మరీ తక్కువగా అంచనా వేస్తోంది. వాళ్లకి 'చెవిలో పువ్వు' పెట్టడానికి ప్రయత్నిస్తోంది. అందులో 'థాంక్యూ సుబ్బారావ్'లోలా 'మాట్లాడే కుక్క', 'అమ్మో బొమ్మ'లోలా 'దయ్యం బొమ్మ' పాలు పంచుకుంటున్నాయి. ఇలాంటి చిత్రాలు ఇంకా వస్తున్నాయంటే మన మాస్ స్టాండర్డ్‌ని సినిమావాళ్లు ఎంత గొప్పగా భావిస్తున్నారో అన్నదానికి నిదర్శనం. అమలిన చిత్రాల రోజులు రావాలంటే ఈ 'మలిన' చిత్రాల్నీ, హాస్యాల్నీ చీత్కరించి డబ్బాలు వెంటనే వెనక్కి వెళ్లిపోయేలా చేయడమే పరిష్కారం.
-ఆంధ్రభూమి, 19 అక్టోబర్ 2001 

Saturday, January 22, 2011

హిట్.. హిట్.. హుర్రే...!: నరసింహనాయుడు (2001)

తారాగణం: బాలకృష్ణ, సిమ్రాన్, ప్రీతి జంగియాని, కె. విశ్వనాథ్, ముఖేష్ రుషి, మోహన్‌రాజ్, ఆశా షైనీ, జయప్రకాశ్‌రెడ్డి, సత్యప్రకాశ్, హేమంత్ రావణ్, రాఖీ, తెలంగాణ శకుంతల, బ్రహ్మానందం, గుండు హనుమంతరావు, చలపతిరావు, తనికెళ్ల భరణి, శివాజీరాజా, ముక్కురాజు, నర్రా వెంకటేశ్వరరావు
కథ, స్క్రీన్-ప్లే: చిన్నికృష్ణ
సంభాషణలు: పరుచూరి బ్రదర్స్
సంగీతం: మణిశర్మ
ఛాయాగ్రహణం: వి.ఎస్.ఆర్. స్వామి
కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు
కళ: రాజు
ఫైట్స్: విక్రం ధర్మా
డాన్స్: రాఘవేంద్ర లారెన్స్, బృంద, శ్రీను
నిర్మాత: మేడికొండ మురళీకృష్ణ
దర్శకత్వం: బి. గోపాల్
బేనర్: శ్రీ వెంకటరమణ ప్రొడక్షన్స్
విడుదల తేది: 11 జనవరి, 2001

'కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేస్తా'.. సుమారు పదేళ్ల క్రితం సంచలనం సృష్టించిన ఈ డైలాగ్‌ని జనం నేటికీ మరచిపోలేదు. ఆ తర్వాత దానికి ఎన్నో పేరడీలు వచ్చాయి. అంతగా జనం నోళ్లలో నానిన, నానుతోన్న డైలాగ్ 'నరసింహనాయుడు' చిత్రంలోనిది. అది చెప్పింది కథానాయకుడు నందమూరి బాలకృష్ణ. 2001లో అతిపెద్ద విజయాన్ని సాధించిన ఈ సినిమా అంతకు మునుపటి డెబ్భై ఏళ్ల తెలుగు చలనచిత్ర బాక్సాఫీసు కలెక్షన్ల రికార్డుని తిరగరాసింది. అంతేకాదు. నేటివరకు బాలకృష్ణ కెరీర్‌లోనూ అతిపెద్ద హిట్టు 'నరసింహనాయుడు'. ఆ స్థాయిలో ప్రేక్షకులు ఆ సినిమాకి విజయాన్ని చేకూర్చి పెట్టారంటే, అందులో అప్పటివరకు కనిపించని కొత్తదనమేదన్నా వాళ్లకి కనిపించిందా? లేదు. ఈ సినిమాలో అసాధారణ కథ లేదు. ఫార్ములాకి భిన్నమైన కథ కూడా కాదు. పోనీ కథనంలో ఏమన్నా కొత్తదనం వుందా అంటే - అదీ లేదు. మరెందుకు అంత సంచలనాత్మక విజయాన్ని 'నరసింహనాయుడు' సాధించాడు?
సినిమా అనేది సమష్టి కృషి. సినిమా విజయానికి ఎన్నో అంశాలు దోహదం చేస్తాయి. విజయం సాధించే సినిమాకి అన్ని అంశాలూ కలిసొస్తాయి. 'నరసింహనాయుడు' విషయంలో జరిగింది అదే. అయితే ఈ విజయంలో మొదటగా చెప్పుకోవాలసింది నిస్సందేహంగా 'నరసింహనాయుడు' పాత్రనీ, ఆ పాత్రని బాలకృష్ణ పోషించిన తీరునీ. ఆ చిత్ర సంభాషణల రచయితలు పరుచూరి సోదరుల్లో ఒకరైన గోపాలకృష్ణ తమ 'తెలుగు సినిమా సాహిత్యం' పుస్తకంలో 'నరసింహనాయుడు చిత్రం ఏడు దశాబ్దాల చలనచిత్ర రికార్డులన్నింటినీ బద్దలు కొట్టడానికి కారణం నరసింహనాయుడి పాత్రను తీర్చిదిద్దిన తీరే' అని చెబుతారు. ఆ పాత్రని అలా మలిచిందెవరు? కథా రచయిత చిన్నికృష్ణ. కథతో పాటు సినిమాకి ప్రాణమైన స్క్రీన్‌ప్లేనీ ఆయనే సమకూర్చాడు. తెలుగులో చిన్నికృష్ణకి ఇదే తొలి చిత్రం. అంటే తన మొదటి సినిమాతోటే రికార్డులు సొంతం చేసుకున్నాడు చిన్నికృష్ణ. అదివరకు రజనీకాంత్ సూపర్‌హిట్ తమిళ సినిమా 'పడయప్పా' (తెలుగులో 'నరసింహా') స్క్రిప్టు రచయితల్లో ఒకడిగా ఆయన వెలుగులోకి వచ్చాడు. 'నరసింహనాయుడు' అవకాశాన్ని కల్పించింది అదే. నిజానికి ఆ అవకాశం అనుకోని రీతిలో ఆయనకి వచ్చింది. అప్పటికే పోసాని కృష్ణమురళి కథతో సినిమాని ప్రారంభించారు దర్శకుడు గోపాల్, నిర్మాత మేడికొండ మురళీకృష్ణ. ఆ కథలో బాలకృష్ణ పోలీసాఫీసర్. అదే గెటప్‌తో ఆయన మీద తీసిన తొలి సన్నివేశానికి అక్కినేని నాగేశ్వరరావు క్లాప్‌నిచ్చారు.
అయితే తర్వాత ఎందుకనో గోపాల్‌కి ఆ కథ నచ్చలేదు. కారణం ఆయన అప్పటికే బాలకృష్ణతో 'రౌడీ ఇన్‌స్పెక్టర్' తీసి ఉన్నాడు. అది పెద్ద హిట్టు కూడా. దానికంటే ఆ కథ గొప్పగా లేదనిపించింది. అప్పుడు 'సమరసింహారెడ్డి' కాలంలోనే తనకి పరిచయమైన చిన్నికృష్ణని పిలిపించాడు గోపాల్. హైదరాబాద్‌లోని ఫిలించాంబర్‌లో చర్చలు మొదలయ్యాయి. అప్పుడే చిన్నికృష్ణకు ఓ సంగతి తెలిసింది. "అప్పటికే చాంబర్ బిల్డింగ్‌లోని గెస్ట్‌హౌస్‌లో ప్రసిద్ధ రచయితలు విజయేంద్రప్రసాద్, ఆంజనేయ పుష్పానంద్, ఈరోడ్ సుందర్ ('పెదరాయుడు' కథారచయిత), పోసాని కృష్ణమురళి ఒక్కో గదిలో ఉండి కథలు చెబుతున్నారు. అందరికంటే నేనే చిన్నవాణ్ణి. అప్పుడు నా వయసు 32 యేళ్లు. నేను గోపాల్‌గారికి ఒకే స్క్రిప్టు చెప్పా. ఆయన పరుచూరి గోపాలకృష్ణగార్ని పిలిపించారు. కథ విన్న ఆయనకి ఓపెనింగ్ సీన్ బాగా నచ్చింది. హీరో ఓ నాట్యాశ్రమాన్ని నడుపుతూ కొడుకుతో పాటు అజ్ఞాతంలో ఉంటూ ప్రశాంత జీవితం గడపడమనే పాయింట్ కొత్తగా ఉందని చెప్పి, నా కథని ఓకే చేశారు. ఆ తర్వాత బాలకృష్ణగారికీ వినిపిస్తే, ఆయన వెంటనే గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేశారు. 'నరసింహనాయుడు'తో నేను తెలుగు పరిశ్రమకి పరిచయమయ్యానంటే సగం ఘనత గోపాల్ గారిదీ, సగం ఘనత గోపాలకృష్ణ గారిదీ" అని చెప్పారు చిన్నికృష్ణ. అలా పోసాని కృష్ణమురళి కథ స్థానంలో చిన్నికృష్ణ కథ వచ్చింది.
కథా సంగ్రహం:
రాయలసీమ కర్నూలు జిల్లాలోని రెండు గ్రామాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఒక గ్రామానికి పెద్ద రఘుపతినాయుడు (కె. విశ్వనాథ్) అయితే ఇంకో గ్రామం అప్పల్నాయుడు (మోహన్‌రాజ్), అతని బావమరిది కుప్పుస్వామినాయుడు (ముఖేష్‌రుషి) అజమాయిషీలో ఉంటుంది. వాళ్లనుంచి తమ గ్రామాన్ని కాపాడుకోడానికి ఒక సైన్యాన్ని తయారుచేయడం కోసం ఊళ్లోవాళ్లందర్నీ ఇంటికొక బిడ్డని బలిదానం చేయమంటాడు రఘుపతినాయుడు. తన వంతుగా నలుగురు కొడుకుల్లో చిన్నవాడైన నరసింహనాయుణ్ణి దానం చేస్తాడు.
సంవత్సరాలు గడుస్తాయి. నాట్యాచార్యుని అవతారమెత్తిన నరసింహ (బాలకృష్ణ) ఓ నాట్యాశ్రమాన్ని నడుపుతుంటాడు. అదే ఊళ్లో కుప్పుస్వామినాయుడు కూతురు అంజలి (ప్రీతి జంగియాని) మేనమామ సింహాచలంనాయుడు (జయప్రకాశ్‌రెడ్డి) ఇంట్లో ఉండి చదువుకుంటూ నరసింహని ప్రేమిస్తుంది.
అంజలిని మేనల్లుడైన దివాకర్ (హేమంత్ రావణ్)కిచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు కుప్పుస్వామి. కట్నంగా నరసింహనాయుడు తల కావాలన్న అక్క నాగమణి (తెలంగాణ శకుంతల)కి అలాగేనని వాగ్ధానం చేస్తాడు. అయితే నరసింహనాయుణ్ణి అంజలి ఇష్టపడ్తున్న సంగతి తెలిసి, ఊరువిడిచి వెళ్లమని నరసింహనాయుణ్ణి హెచ్చరించిన సింహాచలంనాయుడు తమ్ముళ్లు, పసివాడైన అతని కొడుకుని పైకి విసిరేస్తారు. దాంతో కొడుకుని రక్షించుకుని, వాళ్లందర్నీ చితగ్గొడతాడు నరసింహనాయుడు. అక్కణ్ణించి వెళ్లిపోవాలని ఆశ్రమం ఖాళీచేస్తాడు. బావతో పెళ్లి ఇష్టంలేని అంజలి కూడా నరసింహ వెళ్తున్న రైలుబండిలోనే ఎక్కుతుంది. ఇద్దరూ కలిసే వెళ్తున్నారనుకున్న దివాకర్ బృందం రైలుని ఆపేస్తారు. రైలు దిగుతాడు నరసింహనాయుడు. అంతే! అతన్ని చూసీ చూడగానే దివాకర్ బృందం ఆయుధాలు పారేసి, భయంతో పరుగులు తీస్తారు.
అదిచూసి ఆశ్చర్యపోయిన అంజలికి తన గతం చెబుతాడు నరసింహనాయుడు. ఆ గతం.. తండ్రిమీద దౌర్జన్యం చేసిన అప్పల్నాయుణ్ణి హతమారుస్తాడు నరసింహ. అతని కొడుకుల్ని చావగొడతాడు. చేతులూ, కాళ్లూ విరిగిన వాళ్లు తండ్రి చితికి కొరివి పెట్టలేని స్థిలో వుంటే బావమరిది కుప్పుస్వామి వచ్చి కొరివి పెడతాడు. నరసింహ చితి మండేదాకా తాళి, బొట్టు తీయొద్దని అక్క నాగమణితో ఆవేశంతో చెబుతాడు. శ్రావణి (సిమ్రాన్)ని పెళ్లిచేసుకుంటాడు నరసింహ. విదేశాల్లో వున్న అన్నలు పెళ్లికి రాకపోవడంతో వాళ్ల ఫోటోని ఎదురుగా పెట్టుకుని మరీ చేసుకుంటాడు. గుడివద్ద నరసింహ, కుప్పుస్వామి ఒకరికొకరు తారసపడతారు. అంతుచూస్తానన్న కుప్పుస్వామితో "ప్లేస్ నువ్వు చెప్పినా సరే నన్ను చెప్పమన్నా సరే/టైం నువ్వు చెప్పినా సరే నన్ను చెప్పమన్నా సరే/ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే/కత్తులతో కాదురా కంటిచూపుతో చంపేస్తా" అంటాడు నరసింహ.
'నీ మొగుడు నా మొగుణ్ణి చంపాడు' అని నాగమణి చెప్పడంతో భర్త వాస్తవ జీవితం తెలుస్తుంది శ్రావణికి. విదేశాల నుంచి వచ్చిన నరసింహ అన్నావదినల వల్ల ఎదురైన అవమానాలకు తట్టుకోలేక వారికి ఎదురుతిరిగి మాట్లాడుతుంది శ్రావణి. ఇంటికొచ్చిన నరసింహకి ఆమెమీద పితూరీలు చెబుతారు అన్నావదినలు. దాంతో మనస్తాపం చెందిన నరసింహ వాళ్లకే విలువనిచ్చి శ్రావణిని పుట్టింటికి పంపేస్తాడు. అప్పటికే నిండు చూలాలైన శ్రావణి పుట్టింట్లోనే కొడుకుని కంటుంది. నరసింహ మీద అలిగిన అన్నలు విదేశాలకు వెళ్లేందుకు సిద్ధమవుతారు. కుప్పుస్వామి వల్ల ప్రమాదం వుండటంతో పోలీసుల సాయంతో వెళ్తారు. మరోవైపు మనవణ్ణి చూడాలనుకున్న రఘుపతి తనకు రక్షణగా కొడుకుని రమ్మంటాడు. నరసింహ అన్నలమీద కుప్పుస్వామి మనుషులు దాడిచేస్తారు. విషయం తెలిసి నరసింహ అక్కడికి వచ్చి, తాను గొడ్డలి దెబ్బ తిని కూడా అన్నావదినల్ని కాపాడతాడు. ఈలోగా నరసింహ కొడుకుని చంపాలనుకుని శ్రావణి వద్దకు వెళ్లిన కుప్పుస్వామికి పసివాడు కనిపించడు. కొడుకుని దాచి, తాను కుప్పుస్వామి చేతిలో బలైపోతుంది శ్రావణి. ఆ తర్వాత నరసింహ చేతుల్లో తుదిశ్వాస విడుస్తూ కొడుకుని అతని చేతుల్లో పెట్టి కొట్లాటలకు దూరంగా వుండమని ఒట్టు వేయించుకుంటుంది. తండ్రి కూడా చెప్పడంతో భార్యకిచ్చిన మాటకోసం కొడుకుని తీసుకుని దూరంగా వెళ్లిపోతాడు నరసింహ. ఇదీ గతం.
వర్తమానానికొస్తే విషయం తెలిసి నరసింహని చంపడానికి అతనింటికి వచ్చిన కుప్పుస్వామికి అంజలినిచ్చి పంపిస్తాడు నరసింహ. అంజలిని 'అమ్మా' అని పిలుస్తున్న అతని కొడుకుని చూసి, ఆ పసిబిడ్డకు అమ్మనివ్వమని నరసింహని వేడుకుంటాడు రఘుపతి. సరేనని కుప్పుస్వామి ఇంటికొచ్చి 'రేపు ఉదయం 10 గంటలకి నాకూ, అంజలికీ వివాహం' అని చెబుతాడు. మరుసటి రోజు చెప్పినట్లే అంజలిని తీసుకెళ్లడానికి వస్తాడు. నరసింహకీ, కుప్పుస్వామికీ ముఖాముఖి పోరు జరుగుతుంది. నరసింహ చేతిలో చావుదెబ్బలు తింటాడు కుప్పుస్వామి. అంజలి హాస్పిటల్లో ఉందని తెలిసి అందరూ అక్కడకు వెళతారు. నరసింహ కొడుకు కోసం తనకి పిల్లలు పుట్టకుండా అంజలి ఆపరేషన్ చేయించుకోవడం చూసి కుప్పుస్వామి పశ్చాత్తాపపడతాడు. అందరూ ఒక్కటవుతారు.
(వచ్చేవారం 'నరసింహనాయుడు' విజయానికి దోహదం చేసిన అంశాలు)
-నవ్య వీక్లి, జనవరి 12, 2011