Saturday, June 15, 2013

సినిమాకి కీలకం కథ, సంభాషణలు

ప్రతి కథనీ సినిమా తీసి చూపించడం సులువే. కానీ చూసేవాళ్లని మెప్పించడం మాత్రం సులువు కాదు. అందుచేతే సినిమా కథ ఎలా వుండాలనే ఓ పెద్ద ప్రశ్న ప్రతి నిర్మాత బుర్రనీ తినేస్తోంది. సినిమా కథ ఇలా వుండాలని ఇదమిత్థంగా నిరూపించడం ఎవరి తరం? నిర్మాతా మంచి కథనే కోరుతాడు, కథకుడూ మంచి కథ రాయడానికే ప్రయత్నిస్తాడు. తీరా ఆ కథ తెరకెక్కాక ప్రేక్షకులు పెదవి విరిచి "అబ్బే.. ఏం సినిమా?" అనేస్తారు. "ఎప్రిషియేట్ చెయ్యలేని యెదవ జనం" అని నిర్మాతా, దర్శకుడూ (సాధారణంగా అతనే కథకుడుగానూ ఉంటాడు కాబట్టి) తిట్టుకుంటారు. రచయిత రాసింది నిజంగా మంచి కథే కావచ్చు. కాని జనానికి నచ్చనినాడు అది పనికిరాని కథకిందే లెక్క. ఇన్నేళ్ల పరిశీలన తర్వాత కథల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ప్రేక్షకుల్ని మెప్పించవచ్చని నా అభిప్రాయం.
పాత్రలు
కథకి ముఖ్యమైనవి పాత్రలు. ప్రతి పాత్రకీ తనదైన 'పర్పస్' ఉండి తీరాలి. అనవసర పాత్రలు జనానికి విసుగు పుట్టించడమే కాకుండా, ప్రొడక్షన్ కాస్ట్ కూడా పెంచుతాయి. పర్పస్‌తో పాటు పాత్రోచితమైన 'డిగ్నిటీ' చాలా అవసరం. కథ నడకతో పాటు పాత్ర పోషణ (కేరక్టర్ డెవలప్‌మెంట్) విషయంలోనూ ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. అలా సృజించిన పాత్రల్ని చివరకు నట్టడవిలో వదిలేయకుండా  సముచితంగానూ, సమంజసం అనిపించేట్లు గానూ ముగించాలి. ఎలాంటి సన్నివేశాల్లోనూ పాత్రల్లో ఏమాత్రం కృత్రిమత్వం కనిపించకూడదు. కనిపించిందంటే ప్రేక్షకుల్ని దూరం చేసుకున్నట్లే.
సంభాషణలు
కథలో పాత్రల తర్వాత, ముఖ్యంగా జనాకర్షణకి తోడ్పడేవి సంభాషణలు. పాత్రలకి ప్రాణం ఈ సంభాషణలే. కథలో పటుత్వం ఏమీ లేకపోయినా కేవలం సంభాషణల మీద ఆధరపడి సక్సెసయిన సినిమాలెన్నో ఉన్నాయి. కథకి మంచి సంభాషణలు ఎంత ముఖ్యమో వాటిని రాయడం అంత కష్టం. గొప్ప కథలు సృష్టించిన వాళ్లంతా గొప్పగా సంభాషణలు రాయలేరు. మన తెలుగులో రచయితలకి ఇవ్వాల్సినంత గుర్తింపూ, గౌరవం ఇవ్వకపోవడం వల్లే అడపాదడపా తప్ప గొప్ప కథలు కానీ, సందర్భోచితమైన చక్కని డైలాగులు కానీ సినిమాల్లో కనిపించడం లేదు. అందుకే నిర్మాతలు కేవలం పెట్టుబడి పెట్టడమే తమ పని అనుకోకుండా, క్రేజీ కాంబినేషన్లని సంపాదించడమే తమ పని అనుకోకుండా, మంచి కథ సంపాదించే విషయంలో చాలా శ్రద్ధ చూపాలి. అవసరమనుకుంటే ఒక్కరితోనే కాకుండా ఇద్దరు ముగ్గురిని కలిపి కథ రాయించాలి. దాన్ని మరో ఇద్దరిచేత 'అడాప్ట్' చేయించాలి. ఈ మధ్య మన పేరుపొందిన కొంతమంది దర్శకులు ఇలా తమ వద్ద పనిచేసే రచయితల చేత ఈ పనులన్నీ చేయించుకుని టైటిల్స్‌లో వారికి క్రెడిట్ ఇవ్వకుండా కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం అని తమ ఒక్కరిపేరే వేయించుకుంటూ ఆ రచయితలకు అన్యాయం చేస్తున్నారు. ఈ విషయంలో యస్.యస్. రాజమౌళి అభినందనీయుడు. కథ, సంభాషణల క్రెడిట్‌ను ఆయా రచయితలకు ఇచ్చేస్తుంటాడు. ఈ విషయంలో ఆయన్ని అనుసరిస్తే రచయితలు మరింతమంది వెలుగు చూస్తారు. మంచి కథలు రాసే ఉత్సాహం వారిలో కలుగుతుంది.
ప్రేక్షకులకి ఇంటరెస్ట్ కలిగించకుండా కొంతవరకు సినిమా నడిచినా ఒక్క సన్నివేశంతో వాళ్లని గొల్లుమని నవ్వించేట్లు చేసి, సినిమాని రక్తి కట్టించవచ్చు. ఇటీవలి 'ప్రేమకథాచిత్రం', 'సంథింగ్ సంథింగ్' సినిమాలు ఇందుకు చక్కని ఉదాహరణలు. సంభాషణల్లో సాధ్యమైనంతవరకూ సున్నితమైన హాస్యం, భావ గాంభీర్యం, సమయస్ఫూర్తి కలిగిన 'రిపార్టీ' ఉండాలి. చెప్పవలసినదెంత పెద్ద విషయమైనా వీలైనంత క్లుప్తంగా చెబితేనే బోర్‌కొట్టకుండా ఉంటుంది. డైలాగ్స్ పేలవంగా ఉన్న సినిమా దెబ్బతిన్నదన్న మాటే. భాష ఎంత పొంకంగా ఉంటే అంత మంచిది. పొల్లు మాటలు లేకుండా ఉంటే మరీ మంచిది.
పాత్రలమీద ప్రేక్షకులకి కలిగే ఇంటరెస్టంతా సంభాషణల మీదే ఆధరపడి ఉంటుంది కాబట్టి, వాటిని రాయడంలో ఎంత జాగ్రత్త తీసుకుంటే అంత మంచిది. కొంతమంది రచయితలు కథ నడపడం చేతకాక, మాటలతో కథ చెబుతారు. అలా చెయ్యడం చాలా తప్పు. జరగబోయే కథని ముందే మాటల్లో తెలియజేయడమంటే, సినిమాని చేతులార ఖూనీ చేయడమే. రాబోయే కథని సస్పెన్సులో పెట్టి, ముందేం జరుగుతుందో అని జనం అనుకునేట్లు చేయాలి. కథ నడుస్తున్న కొద్దీ, ఇంటరెస్టు, స్పీడు పెరిగేట్లు చేయాలి. అన్నింటికంటే ముఖ్యం - కథారంభాన్ని ఆకర్షణీయంగా ఎత్తుకొని, ముగింపు ప్రేక్షక హృదయాల్లో నిల్చిపోయేటట్లు చూడాలి.

Thursday, May 9, 2013

'ఆడబొమ్మ' (1988) - రివ్యూ


తారాగణం: సాగరిక, జీవా, హరిప్రసాద్, గుమ్మడి, పి.ఎల్. నారాయణ, ప్రసాద్‌బాబు, త్యాగరాజు, రాజ్యలక్ష్మి, నిర్మలమ్మ
సంభాషణలు: పూసల
సంగీతం: చంద్రశేఖర్
నిర్మాత: ఆర్. కేతినేని
దర్శకుడు: సత్యానాయుడు
విడుదల తేది: 29 ఏప్రిల్
జూదానికి బానిసైన ఓ పెద్దాయన తన ఆస్తినంతటినీ కోల్పోవడమే కాకుండా, కన్న కూతుర్నీ పణంగా పెట్టి ఓడిపోతాడు. ఆ బాధ భరించలేక ఆత్మహత్య చేసుకుంటాడు. తండ్రి మాట ప్రకారం ఆయన శవం వద్దే గ్రామస్తులందరి సమక్షంలో రూపేశ్‌ను పెళ్లి చేసుకుంటుంది లౌక్య. ఆ రాత్రి ఆమెని అనుభవిస్తాడు  రూపేశ్. మరుసటి రోజే డబ్బు కోసం ఆమెను మరొక వ్యక్తితో తార్చాలని చూస్తాడు. లౌక్య ఎదురు తిరుగుతుంది. దాంతో ఆమెని క్యాబరే డాన్సర్‌గా మార్చి డబ్బు సంపాదిస్తుంటాడు రూపేశ్. పోలీసులు అరెస్ట్ చేయడంతో క్యాబరే మానేస్తుంది లౌక్య. ఒక హత్య కేసులో భర్తకు వ్యతిరేకంగా సాక్ష్యం చెబుతుంది. దాంతో రూపేశ్‌కు జైలు శిక్ష పడుతుంది.
నాలుగిళ్లలో అంట్లు తోముకుంటూ బతుకు సాగిస్తుంటుంది లౌక్య. జైలు నుంచి బయటికొచ్చిన రూపేశ్ ఆమెని డబ్బు కోసం వేధించడమే కాకుండా తమకి పుట్టిన కూతురు ఎక్కడుందో చెప్పమని గొడవపడతాడు. కూతుర్ని కూడా క్యాబరే డాన్సర్‌గా మార్చాలని అతని ఆలోచన. కూతుర్ని రహస్యంగా వేరో వూర్లో చదివిస్తున్న లౌక్య ఆమెకి ప్రమాదం ఏర్పడిందని భావించి పెళ్లి ఏర్పాట్లు చేస్తుంది. పెళ్లి వేదికపై లౌక్య క్యాబరే చేస్తున్న ఫొటోలు చూపించి తాళి కట్టే సమయానికి ఆ పెళ్లి ఆగిపోయేలా చేస్తాడు రూపేశ్. ఆఖరుకి కన్న కూతురి మెడలోనే తాళి కట్టేందుకు సిద్ధమైన రూపేశ్‌ని లౌక్య ఏం చేసిందన్నది పతాక సన్నివేశం.
లౌక్యగా సాగరిక, రూపేశ్‌గా జీవా, లౌక్య బావగా హరిప్రసాద్, లౌక్య తండ్రిగా గుమ్మడి, ఎస్.ఐ.గా రాజ్యలక్ష్మి తమ పాత్రల్ని సమర్థవంతంగా పోషించిన ఈ సినిమాని ఆర్. కేతినేని నిర్మించగా, సత్యానాయుడు డైరెక్ట్ చేశారు. సన్నివేశాల కల్పన, కథనం బలంగా ఉండినట్లయితే ఈ సినిమా ఆకర్షణీయంగా ఉండేది. ఈ సినిమాలోని ప్రధాన లోపం అదే.

Sunday, April 28, 2013

బంగారు మనసులు (1973)- రివ్యూ


విధి వక్రిస్తే, అంతవరకు అనుకూలించినవి కూడా అవరోధాలుగా మారి లేనిపోని అనర్థాలకూ, అవమానాలకూ దారితీస్తాయనీ, ఎదురీదడానికి ఎంత యత్నించినా, ఫలితం శూన్యమనీ, నీతికీ, నిజాయితీకీ కట్టుబడి కష్టాల్ని ఓర్పుతో స్వీకరిస్తే ఒకనాటికి మంచి జరుగుతుందనీ తెలిపే సినిమా 'బంగారు మనసులు'.
చిక్కటి సంఘటనలు నిండిన చక్కటి కథ రాసిన కృష్ణమోహన్ సంభాషణల్నీ ప్రతిభావంతంగా రాశారు. 'కొరడా రాణి' దర్శకుడూ, 'బంగారు మనసులు' దర్శకుడూ ఒక్కరే అంటే నమ్మబుద్ధి కాదు. కథను సాఫీగా నడిపించి, తికమకలు లేకుండా చిత్రాన్ని రూపొందించారు కె.ఎస్. రెడ్డి. సత్యం సంగీతం, కన్నప్ప ఛాయ ఆకట్టుకుంటాయి.
కథానాయకిగా జమున ఆద్యంతం డామినేట్ చేసింది. పరికిణీ పిల్లగా ఆమె చాలా అందంగా కనిపించింది. ఉత్తమ పాత్రపోషణ కూడా ఆమెదే. కృష్ణకుమారి గెస్టుగా నటించింది. అంతవరకు విలన్, క్యారెక్టర్ రోల్స్ వేస్తూ వచ్చిన సత్యనారాయణ సానుభూతి పొందే కథానాయకుడి పాత్రని కూడా చక్కగా చేయగలడని ఈ సినిమాతో నిరూపించుకున్నాడు. సహాయ భూమికలు చేసిన వారంతా పరిధుల మేరకు రాణించారు.

Wednesday, April 17, 2013

తల్లీబిడ్డలు (1963) - రివ్యూ


దురాశకు లోనైన మనిషి ఎంతటి నీచానికైనా పాల్పడతాడు. జంకు, గొంకు లేకుండా ఎన్ని ఘోర కృత్యాలైనా చేస్తాడు. పచ్చని కాపురంలో నిప్పులు పోస్తాడు. దురాశ అతడిలోని మానవత్వాన్ని హరించివేసి, కిరాతకునిగా మార్చేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే అతడి అంతరాత్మ నశిస్తుంది. దీనిని ఆధారం చేసుకొని పి.ఎస్. శ్రీనివాసరావు రూపొందించిన చిత్రం 'తల్లీబిడ్డలు'.
జమీందార్ కేశవరావు (నాగయ్య)కు సకల సంపదలు ఉన్నా, సంతానం లేదు. దాంతో ఆయనా, ఆయన భార్యా తీరని వ్యధకు లోనవుతారు. ఈ సంగతి గ్రహించిన కారు డ్రైవర్ వెంకన్న (లింగమూర్తి)కి దురాశ కలుగుతుంది. భార్య లక్ష్మి (హేమలత) కంటికీ మంటికీ ఏకధారగా విలపిస్తున్నా లెక్కచెయ్యక దిక్కులేనివాడని అబద్ధం చెప్పి తన ఒక్కగానొక్క కొడుకును కేశవరావుకు అప్పగిస్తాడు. కొద్ది రోజుల్లోనే కేశవరావు భార్య గర్భవతై మగ పిల్లాణ్ణి కంటుంది. తన పథకం విఫలమవడంతో రాక్షసుడిగా మారతాడు వెంకన్న. ఒక రాత్రివేళ్ల పురిటిబిడ్డను ఎత్తుకుపోయి చంపేందుకు ప్రయత్నిస్తాడు. అతడికి అడ్డు తగిలి లక్ష్మి ఆ పసివాడితో సహా ఇల్లు వదిలి వెళ్లిపోతుంది. లేకలేక కలిగిన బాబు మాయమవడంతో కేశవరావు భార్య మనోవ్యధతో మరణిస్తుంది. జమీందార్ ఇంట్లో పెరిగిన వెంకన్న కొడుకు కుమార్ (హరనాథ్) పోకిరిగానూ, లక్ష్మి పెంపకంలో పెరిగిన ప్రకాశ్ (బాలయ్య) బుద్ధిమంతుడిగానూ తయారవుతారు.
పోలీస్ ఇన్‌స్పెక్టర్ ఉద్యోగంలో చేరడానికి పట్నానికి వెళ్తున్న ప్రకాశ్‌కు గీత (కృష్ణకుమారి) పరిచయమవుతుంది. కుమార్ వ్యసనాలు హద్దుమీరుతాయి. పుష్ప (రాజశ్రీ)తో అతడికి సంబంధం ఏర్పడుతుంది. అతణ్ణి మంచిదారిలో పెట్టడానికి పెళ్లి చెయ్యడమొక్కటే మార్గమని కేశవరావుకు నచ్చజెబుతాడు వెంకన్న. కుమార్ ఆస్తి మీద కన్నేసిన పుష్ప ఒక రాత్రివేళ అతడికి మత్తు మందు ఇచ్చి తెల్ల కాగితం మీద సంతకం చేయించుకుంటుంది. ఆ రాత్రే ఆమె హత్యకు గురవుతుంది. కుమార్ మీద హత్యానేరం పడుతుంది. అతణ్ణి రక్షించడానికి ఆ నేరం తానే చేసినట్లు చెప్పి అరెస్టవుతాడు కేశవరావు. దీంతో పశ్చాత్తాపానికి గురైన వెంకన్న మొదట్నించీ తాను చేసిన ఘోరాల్ని బయటపెట్టి, పుష్పని హత్య చేసింది తానేనని ఒప్పుకుంటాడు. లక్ష్మికి కుమార్, కేశవరావుకు ప్రకాశ్ దక్కుతారు. గీతా ప్రకాశ్‌లకు పెళ్లవుతుంది.
కథనంలో మరికొంత శ్రద్ధ చూపినట్లయితే సినిమా ఇంకా బాగుండేదనిపిస్తుంది. రిలీఫ్ కోసమంటూ అక్కడక్కడా కావాలని హాస్యం చొప్పించడం రాణించలేదు. పుష్ప హత్యానంతరం కథలో మలుపు వచ్చింది. అలాంటి సందర్భంలో శివరావు, మీనాకుమారి మధ్య హాస్య సన్నివేశం రిలీఫ్ నివ్వకపోగా విసుగు కలిగించింది. జమీందార్ ఇంటికి లక్ష్మి వెళ్లినప్పుడు గీత అక్కడ ఎందుకుందో అర్థం కాదు. ఇలాంటివే ఒకట్రెండు సన్నివేశాలు అసందర్భంగా కనిపించినా మొత్తం మీద సినిమా ఫర్వాలేదనిపిస్తుంది.
నటులలో అందరికంటే ఎక్కువ మార్కులు లింగమూర్తి, హేమలతకే పడతాయి. నాగయ్య, బాలయ్య, హరనాథ్, కృష్ణకుమారి పాత్రోచితంగా నటించారు. చేసింది చిన్న పాత్రే అయినా ఉన్నంతలో రాజశ్రీ చక్కగా నటించింది. శివరావునూ, పేకేటినీ సరిగ్గా ఉపయోగించుకోలేదు. కె.ఎస్. ప్రసాద్ ఛాయాగ్రహణం నయనానందకరం. ఈ చిత్రంతో పరిచయమైన శంకరరావు సంగీతం రెండు మూడు పాటల్లో వినసొంపుగానే ఉంది.

Thursday, April 11, 2013

Chittajallu Pullaiah Filmography

1. Sati Savitri                                  (1933)
2. Lava Kusa                                  (1934)
3. Anasuya                                     (1935)
4. Sri Krishna Thulabharam             (1935)
5. Sati Anasuya                               (1936)
6. Dhuruva Vijayam                        (1936)
7. Mohini Bhasmasura                     (1938)
8. Sri Satyanarayana Swamy            (1938)
9. Vara Vikrayam                            (1939)
10. Malathi Madhavam                     (1940)
11. Bala Nagamma                           (1942)
12. Gollabhama                                (1947)
13. Vindya Rani                                (1948)
14. Apoorva Sahodarulu                   (1950)
15. Sankranthi                                   (1952)
16. Pakkinti Ammayi                         (1953)
17. Devantakudu                               (1960)
18. Lava Kusa                                  (1963)
19. Paramanandayya Sishyula Katha  (1966)
20. Bhama Vijayam                           (1967)
21. Bhuvana Sundari Katha               (1967)

HM Reddy Filmography

1. Bhakta Prahlada      (1931) as a director
2. Grihalakshmi           (1938)    "
3. Mathru Bhoomi       (1939)    "
4. Bondam Pelli           (1940)    "
5. Tenali Ramakrishna (1941)    "
6. Gharana Donga       (1942)    "

Thursday, April 4, 2013

'స్త్రీ' (1973) రివ్యూ


ఆస్తులు, అంతస్థులు, అయినవాళ్లని కాదని ఆత్మీయత, అప్యాయత నిండిన మనసు కలిగిన ఓ ఆదర్శ వ్యక్తిని వివాహమాడి, జీవితంలో ఎలాంటి ప్రతికూలతలు వచ్చినా ఎదురీదిన ఓ ధీరవనిత గాథ 'స్త్రీ'. కె. ప్రత్యగాత్మ రూపొందించిన ఈ చిత్రాన్ని శ్రీ పూర్ణా మూవీస్ బేనర్‌పై అట్లూరి పూర్ణచంద్రరావు, ఎం. చంద్రశేఖర్ సంయుక్తంగా నిర్మిచారు.
ఈ సినిమాలో తల్లీ కూతుళ్లుగా చంద్రకళ ద్విపాత్రాభినయం హైలైట్. ఆడంబరం, అహంకారం లేని ఉత్తమురాలు తల్లి అయితే, అవే కూతురి లక్షణాలు. సమాజ శ్రేయస్సే తన శ్రేయస్సుగా తల్లి భావిస్తే, సొంత కోరికలు తీర్చుకోవడమే తన ధ్యేయంగా కనిపిస్తుంది కూతురు. ఈ రెండు పాత్రల్లోన్ని వ్యత్యాసాన్ని ప్రతి సన్నివేశంలో ప్రతిభావంతంగా ప్రదర్శించింది చంద్రకళ. చదువు, సంస్కారం ఉన్న ఉత్తమునిగా, నలుగురి కోసం పాటుపడే కార్మిక నాయకునిగా, తనను నమ్ముకొని వచ్చిన స్త్రీని చేరదీసి, అర్ధాంగిగా స్వీకరించిన గుణవంతునిగా కృష్ణంరాజు మంచి నటనని ప్రదర్శించాడు.
ధూళిపాళ, చంద్రమోహన్, రమణారెడ్డి, మాడా, వల్లం నరసింహారావు, కె.కె. శర్మ, వై.వి. రావు, రాళ్లపల్లి, శరత్‌బాబు, విజయభాను, సాయికుమారి, మమత, బేబీ గౌరి తమ పాత్రల పరిధి మేరకు నటించారు.
నిజానికి ఈ సినిమాకి అసలైన హీరో దర్శకుడు ప్రత్యగాత్మ. సన్నివేశాల కల్పన, వాటి చిత్రీకరణ, కథనం వంటి విషయాల్లో ఆయన పనితనం అడుగడుగునా గోచరిస్తుంది. మహదేవన్ సంగీతం, రావిశాస్త్రి సంభాషణలు, శేఖర్-సింగ్ సినిమాటోగ్రఫీ, బి.ఎన్. కృష్ణ కళా దర్శకత్వం ఈ సినిమాకి మంచి ఆకర్షణని తీసుకొచ్చాయి. అయితే దీనికి 'ఎ' సర్టిఫికెట్ ఎందుకు ఇచ్చారనేది అర్థం కాదు.

Tuesday, April 2, 2013

'చట్టానికి వేయికళ్లు' రివ్యూ


మనిషికీ, కోరికలకీ ఉన్న సంబంధం ఎలాంటిదో, సమాజానికీ, చట్టాలకీ ఉన్న సంబంధం కూడా అలాంటిదే. కోరికలని అదుపులో పెట్టగలిగిన వ్యక్తి జీవితం, చట్టాల్ని చక్కగా పాటించే సమాజం సాఫీగా సాగిపోతాయి. కానీ వాస్తవం ఇందుకు భిన్నంగా ఉంటుంది కాబట్టే సమాజంలో రకరకాల అవాంఛనీయ సంఘటనలు, సంఘర్షణలు తటస్థిస్తుంటాయి. వాటి ద్వారా పాఠాలు నేర్చుకోవాలని చెప్పే సినిమా 'చట్టానికి వేయికళ్లు'.
విజయనిర్మల దర్శకత్వంలో రంజిత్ ఆర్ట్స్ బేనర్‌పై కానూరి రంజిత్‌కుమార్ నిర్మించిన ఈ సినిమాలో ద్విపాత్రల్లో కృష్ణ నటన, పరుచూరి బ్రదర్స్ సంభాషణలు, ఆదుర్తి హరనాథ్ ఎడిటింగ్ చెప్పుకోదగ్గ అంశాలు. కథలోకి వెళ్తే... పోలీస్ కమీషనర్ అయిన ప్రతాప్‌కుమార్, సావిత్రి ప్రేమించుకుంటారు. గురునాథం అనే కామాంధుని కాటుకి సావిత్రి బలవుతుంది. ఆమె శీలానికి వెల కడుతుంది సమాజం. నలిగిన పువ్వును ఆఘ్రాణించలేని ప్రతాప్ హృదయం కుంగిపోతుంది. ఆమెతో పెళ్లి తలంపుని విరమిస్తాడు. తల్లికీ, పోలీస్ ఇన్‌స్పెక్టర్ అయిన తమ్ముడు ఆనంద్‌కుమార్‌కీ, చెల్లికీ దూరమైపోతాడు కానీ పోలీసు అధికారిగా తన కర్తవ్యాన్ని మరచిపోడు. ప్రతాప్, ఆనంద్‌లపై రెండు దొంగల ముఠాలు పగబడతాయి. ఈ ముఠాలు జరిపే అత్యాచారాలకు ఎన్నో నిండు ప్రాణాలు బలైపోతుంటాయి. గురునాథం మృతితో కథ కొత్త మలుపు తిరుగుతుంది. ప్రతాప్, ఆనంద్ మధ్య సంఘర్షణ చెలరేగుతుంది. ప్రతాప్ ప్రాణాలు కాపాడేందుకు సావిత్రి తన జీవితానికి తానే ముగింపు పలుకుతుంది. ప్రతాప్ విధి నిర్వహణలో ప్రాణాల్ని త్యాగం చేస్తాడు.
ప్రతాప్, ఆనంద్ పాత్రల్ని కృష్ణ, సావిత్రిగా జయసుధ ప్రతిభావంతమైన అబినయాన్ని ప్రదర్శించారు. జర్నలిస్టుగా మాధవి, కె.డి. స్వామిగా రావుగోపాలరావు తమ పాత్రలకి న్యాయం చేకూర్చారు. చక్రవర్తి సంగీతం ఆకట్టుకుంటుంది.

Saturday, March 30, 2013

'రెండుజెళ్ల సీత' రివ్యూ


రచయిత జంధ్యాల అల్లిన పసందైన కథ, దర్శకుడు జంధ్యాల నడిపిన హుషారైన కథనం, సంగీత దర్శకుడు రమేశ్‌నాయుడు కూర్చిన వినసొంపైన బాణీలు, ఛాయాగ్రాహకుడు ఎస్. గోపాలరెడ్డి కెమెరా పనితనం కలిపి 'రెండుజెళ్ల సీత'ను ముగ్ధమోహనంగా తయారుచేశాయి. ఆబాల గోపాలానికి నచ్చేట్టు చేశాయి. ఈ సినిమాలో కథ చాలా సింపుల్. గోపి, కృష్ణ, మోహన్, మూర్తి అనే నలుగురు ఆకతాయి అబ్బాయిలు ఓ అందమైన అమ్మాయిని ప్రేమించేయాలనుకుంటారు. అందమైన అమ్మాయి ఉండే కుటుంబానికి తమ భవనంలో ఓ వాటని అద్దెకు ఇవ్వాలని భావిస్తారు. దీని కోసం సుబ్బారావు అనే అమాయకుణ్ణి ఆటపట్టించి ఓ వాటాని ఖాళీ చేయిస్తారు. ఆ వాటాలో సీత అనే అమ్మాయి తన అమ్మా నాన్నలతో ఆ వాటాలో దిగుతుంది. నలుగురు కుర్రాళ్లూ అమాంతం ఆమెని ప్రేమించేసి, బోలెడు కలలు కంటారు. తన్నులు కూడా తింటారు. రాజీకి వచ్చి "మా నలుగురిలో ఎవరంటే నీకిష్టం" అని సూటిగా సీతనే అడుగుతారు. "నాకు మధు అంటే ఇష్టం" అని చెబుతుంది సీత. ఆ మధు ఎవరన్నది సినిమాలోనే చూడాలి.
ఈ కథలోని సన్నివేశాలకు జంధ్యాల రాసిన సంభాషణలు, ఆ సన్నివేశాల్ని ఆయన చిత్రీకరించిన తీరు వల్ల ఆద్యంతం ఆహ్లాదం కలుగుతుంది. సీత కోసం అబ్బాయిలు పడే పాట్లు, వారి చేతుల్లో సుబ్బారావు పడే అగచాట్లు బాగా నవ్వింపజేస్తాయి. ఈ నవ్వుల మధ్య హృదయాన్ని బరువెక్కించే సన్నివేశాలూ ఉన్నాయి. వరకట్న దురాచారం కష్ట నష్టాల్ని సైతం ఇందులో చూపించారు జంధ్యాల. రమేశ్‌నాయుడు కూర్చిన బాణీల్లో 'లేడి వేటా లేడీ వేటా', 'రెండు జెళ్ల సీతా తీపి గుండె కోతా', 'మందారంలో ఘుమఘుమనై', 'కొబ్బరి నీళ్లా జలకాలాడి' పాటలు మళ్లీ మళ్లీ వినాలనిపిస్తాయి. విశాఖ సముద్ర తీర ప్రాంతంలోనూ, అరకు లోయలోనూ ఈ పాటల్ని నయనానందకరంగా చిత్రించాడు గోపాలరెడ్డి.
రెండుజెళ్ల సీతగా కొత్తమ్మాయి మహాలక్ష్మి చక్కగా నవ్వుతూ నిజంగానే యువతకు 'తీపి గుండెకోత' పెట్టించింది. ఆమె తల్లి పుష్పలత ఇందులోనూ ఆమెకి తల్లిగానే నటించారు. నలుగురు అబ్బాయిలుగా నరేశ్, ప్రదీప్, రాజేశ్, శుభాకర్ హుషారుగా నటించారు. సుబ్బారావుగా సుత్తివేలు నటన, ఆయన డైలాగులు స్పెషల్ ఎట్రాక్షన్. శ్రీలక్ష్మి నవ్వులు పంచుతుంది. ఇది జంధ్యాలకు మరింత పేరు తెచ్చిన సినిమా.

Saturday, March 23, 2013

రమేశ్‌బాబు 'ప్రేమ చరిత్ర' ఏమైంది?

తమిళ డైరెక్టర్ టి. రాజేందర్ అంటే మనకి మొదట గుర్తొచ్చే సినిమా 'ప్రేమ సాగరం'. తెలుగులో అది యేడాది పైగా ఆడింది. ఇప్పుడు ఆయన నేరుగా తెలుగులో 'ప్రేమదాసు' అనే సినిమా తీస్తున్నారు. టైటిల్ రోల్ ఆయనే చేస్తున్నారు. గతంలోనే ఆయన తెలుగులో ఓ సినిమా ప్రారంభించారు కానీ మధ్యలోనే ఆపేశారు. అందులో హీరో ఎవరో తెలుసా? కృష్ణ పెద్ద కుమారుడు రమేశ్‌బాబు. ఆ సినిమా పేరు 'ప్రేమ చరిత్ర'. పాతికేళ్ల క్రితం... అంటే 1988 మార్చి 14న మద్రాస్ బొటానికల్ గార్డెన్స్‌లొ షూటింగ్ మొదలైంది. రమేశ్‌బాబు సరసన శ్రీభారతి అనే అమ్మాయిని హీరోయిన్‌గా తీసుకున్నారు. సూపర్‌స్టార్ కృష్ణ తొలి షాట్‌కు క్లాప్ కొట్టారు. ఇది మామూలు ప్రేమకథ కాదనీ, అసాధారణ ప్రేమకథనీ రాజేందర్ చెప్పారు. మాటల రచయితగా మహారథినీ, పాటల రచయితగా సీతారామశాస్త్రినీ తీసుకున్నారు. కథ, స్క్రీన్‌ప్లే, ఛాయాగ్రహణం, సంగీతం, దర్శకత్వాల్ని రాజేందర్ నిర్వహిస్తున్నట్లు ప్రెస్‌నోట్‌లో పేర్కొన్నారు. సుధాలయా పిక్చర్స్ బేనర్‌పై శాఖమూరి రాంబాబు, శాఖమూరి సూరిబాబు ఈ సినిమా నిర్మాతలు. కానీ తర్వాత ఈ సినిమా షూటింగ్ అటకెక్కింది. రమేశ్‌బాబు 'ప్రేమ చరిత్ర' వెలుగు చూడలేదు.