Tuesday, April 11, 2017

Powerful Film Publicity

పవర్‌ఫుల్‌ పబ్లిసిటీ! 



ప్రభాస్‌ టైటిల్‌ రోల్‌ పోషించగా, యస్‌.యస్‌. రాజమౌళి రూపొందించిన ‘బాహుబలి: ద కన్‌క్లూజన్’ ట్రైలర్‌ వంద మిలియన్ వ్యూస్‌ మార్క్‌ను దాటిన తొలి భారతీయ సినిమాగా సరికొత్త చరిత్రను లిఖించింది. తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ భాషలను కలుపుకొని ఈ రికార్డును సాధించింది. అంటే పది కోట్ల మంది ఆ ట్రైలర్‌ను వీక్షించారన్న మాట! మార్చి 16న విడుదలైన ఈ ప్రచార చిత్రాన్ని తొలి 24 గంటల్లోనే 5 కోట్ల మంది వీక్షించడం కూడా రికార్డే. ‘బాహుబలి’ పేరుకు ఎలాంటి క్రేజ్‌, ఇమేజ్‌ ఉందో చెప్పేందుకు ఈ లెక్కలే నిదర్శనం! ఇక్కడ గుర్తించాల్సిన మరో విషయం.. ట్రైలర్‌తో ఆ సినిమాకు మరింత ప్రాచుర్యం లభించడం, దానిపై మరింత మోజు పెరగడం!! 

సినిమాకు ప్రాణం పబ్లిసిటీనే. లోపలి సరుకు అటు ఇటుగా ఉన్నా పబ్లిసిటీ కారణంగానే సినిమాలు జనాదరణ పొందిన దాఖలాలు ఎన్నెన్నో. అంతటి పవర్‌ఫుల్‌ అయిన సినిమా పబ్లిసిటీ కొత్త పుంతలు తొక్కుతోంది. ‘స్టార్‌’ పవర్‌ ఉన్న సినిమాకు పైసా ఖర్చు లేకుండా సోషల్‌ మీడియా మరింత ప్రచారాన్ని కల్పిస్తోంది. ఒకవైపు ప్రింట్‌, ఎలకా్ట్రనిక్‌, వెబ్‌ మీడియాలో పబ్లిసిటీకి భారీగా ఖర్చు చేస్తూనే, మరోవైపు అభిమానులకు, సినీ ప్రియులకు మరింత చేరువ కావడానికి సోషల్‌ మీడియాను విస్తృతంగా వాడుకుంటున్నాయి నిర్మాణ సంస్థలు.

గోడమీది బొమ్మ

ఒకప్పుడు గోడమీద పోస్టర్లు మాట్లాడేవి. కమ్మని కథలు చెప్పేవి. కవ్వించి, నవ్వించి మనల్ని ఆకర్షించేవి, అలరించేవి. వాటితో పాటు నిలువెత్తు కటౌట్లు సమ్మోహనపరిచేవి. పోస్టర్లది పంచ వన్నెల భాషైతే, కటౌట్లది ఇంద్రజాల భాష. వాటికి సగటు సినీ అభిమాని దాసోహమయ్యేవాడు. ఆ పోస్టర్లను పట్టుకొని ఊరేగేవాడు. కటౌట్లకు పాలాభిషేకం చేసేవాడు. తొమ్మిదో దశకం వరకూ కూడా పల్లెల్లో, పట్టణాల్లో ఏ వీధి మలుపు తిరిగినా గోడమీద పోస్టర్‌ దర్శనమిచ్చేది. నిలబెట్టేది. ఇక దినపత్రికల్లో వచ్చే ప్రకటనల మీద నుంచి అభిమాని దృష్టి అంత త్వరగా మరో పేజీ వైపు మరలేది కాదు. అప్పట్లో సినిమా పబ్లిసిటీకి ఆ పోస్టర్లు, ప్రకటనలు, మౌత పబ్లిసిటీనే ఆధారం.

ప్రచారాన్ని మోసిన చానళ్లు

కాలం మారింది. ప్రేక్షకుల ఆలోచనా ధోరణీ మారింది. దానికి తగ్గట్లు సినిమా పబ్లిసిటీలోనూ మార్పులు చోటు చేసుకుంటూ వచ్చాయి, వస్తున్నాయి. రోడ్లపై తిరిగే ఆటోలు, ఆర్టీసీ బస్సులు కూడా ప్రచార సాధనాలయ్యాయి. వాల్‌ పోస్టర్‌కి ‘వాల్‌ రైటింగ్‌’ కూడా తోడయ్యింది. తొలినాళ్లలో దర్శకుడు తేజ.. ఈ వాల్‌ రైటింగ్‌తో తన సినిమాలను బాగా ప్రమోట్‌ చేసుకున్నారు. ఆ తర్వాత గోడమీద బొమ్మలు, రాతలపై నిషేధం రావడంతో పోస్టర్‌ హవా కాస్త తగ్గింది. రూపం మార్చుకుంది. వినైల్స్‌ వచ్చాయి. ఎలక్ట్రానిక్‌ మీడియా హవా మొదలయ్యాక, సినిమాకు టీవీ పెద్ద దెబ్బగా మారాక, ఆ టీవీనే ప్రచార సాధనంగా మలచుకున్నాయి నిర్మాణ సంస్థలు. స్పెషల్‌ ప్రోగ్రామ్స్‌, పాటల ప్రదర్శనలు, ట్రైలర్లతో చానళ్లు సినిమా పబ్లిసిటీని మోస్తూ వచ్చాయి. ఒక దశాబ్దం పాటు టీవీలు సినిమా పబ్లిసిటీని మోశాయి.

సోషల్‌ పబ్లిసిటీ ఫ్రీ 

కలెక్షన్లను తీవ్రంగా ప్రభావితం చేస్తున్న పైరసీ భూతాన్ని ఎదుర్కొంటూనే ‘ప్రింట్‌’ నుంచి ‘డిజిటల్‌’గా రూపాంతరం చెందింది సినిమా. దాంతో సోషల్‌ మీడియాకు ఎనలేని ప్రాధాన్యం ఏర్పడింది. సినీ ప్రేమికులతో, ప్రేక్షకులు కాబోయే వారితో అనుసంధానం కావడానికి నిర్మాణ సంస్థలకు, నటులకు, సాంకేతిక నిపుణులకు ఫేస్‌బుక్‌ అతిపెద్ద వేదికగా మారింది. దీనివల్ల సినిమాకు సంబంధించిన సమాచారం అతి వేగంగా లక్షలాదిమందికి చేరుతోంది. సోషల్‌ మీడియాకు జనం అడిక్ట్‌ కావడంతో, సినిమాకు సంబంధించిన ఆసక్తికర సమాచారాన్ని అందిస్తూ వారికి చేరువయ్యేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఫ్యాన్సతో నేరుగా అనుసంధానమై తమ సినిమాని ప్రమోట్‌ చేయడానికి స్టార్స్‌ కూడా ఉత్సాహం చూపిస్తున్నారు. టీజర్‌ లేదా ట్రైలర్‌ను అభిమానులు విపరీతంగా ఆదరిస్తుండటంతో సహజంగానే పబ్లిసిటీలో వాటికి ప్రాధాన్యం పెరిగింది. అందుకే ఇటీవలి కాలంలో ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ వంటి సోషల్‌ నెట్‌వర్క్‌ ద్వారానో లేదంటే యూట్యూబ్‌ వంటి ఆనలైన చానల్‌ ద్వారానో వాటిని విడుదల చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ట్రైలర్‌ కంటే టీజర్‌ ఎక్కువ ప్రాచుర్యం పొందడాన్ని గమనించవచ్చు. ఉదాహరణకు ‘కాటమరాయుడు’, ‘ఖైదీ నంబర్‌ 150’ సినిమాల ట్రైలర్‌ల కంటే టీజర్‌లే యూట్యూబ్‌లో ఎక్కువ ఆదరణ పొందాయి. తాజాగా జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపికైన ‘పెళ్లి చూపులు’ వంటి లో-బడ్జెట్‌ సినిమా పెద్ద విజయం సాధించడానికి బాగా దోహదం చేసింది సోషల్‌ మీడియానే. థియేటర్లలో విడుదలకు ముందు ‘హృదయ కాలేయం’ ట్రైలర్‌ యూట్యూబ్‌లో చేసిన హల్‌చల్‌ కారణంగానే సంపూర్ణేశబాబు వంటి నటుడు హీరోగా ప్రేక్షకుల్ని అలరించాడు. యూట్యూబ్‌ చానల్‌లో ఆదరణ పొందిన టీజర్‌, ట్రైలర్‌, మేకింగ్‌ వీడియోస్‌, సాంగ్స్‌ వంటి వాటికి ఆదాయం కూడా సమకూరుతుండటం అదనపు ప్రయోజనం!

చిత్రోత్సవాలూ ప్రచార సాధనాలే!

రాష్ట్ర సరిహద్దులు దాటి, ఇతర రాషా్ట్రల్లోకీ, అక్కడ్నించి అమెరికా, యూరప్‌, గల్ఫ్‌ తదితర ప్రాంతాల్లోకీ తెలుగు సినిమా విస్తరిస్తూ పోవడంతో ‘గ్లోబల్‌ సినిమా’గా తెలుగు సినిమాను ప్రమోట్‌ చేయడానికి పబ్లిసిటీలోనూ కొత్త పోకడలు పోతున్నారు. ‘బాహుబలి’ వంటి వందల కోట్ల బడ్జెట్‌ సినిమాకు డబ్బులు రావాలంటే కేవలం తెలుగు మార్కెట్‌ ఒక్కటే సరిపోదు. దాని ‘రీచ’ పెరగాలి. అందుకే హిందీ, తమిళ, మలయాళ భాషల్లోనూ విడుదల చేశారు. దాని కోసం ప్రచారానికి ఎన్ని మార్గాలున్నాయో అన్నింటినీ ఉపయోగించారు. ఇప్పుడు రెండో భాగం సినిమాకూ మరింత విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. గ్లోబల్‌ పబ్లిసిటీకి చలన చిత్రోత్సవాలు బాగా ఉపకరిస్తున్నాయి. ఇంట గెలిచిన ‘బాహుబలి’, రచ్చ గెలిచేందుకు దోహదం చేసింది ఈ చిత్రోత్సవాలే. కాన్స, బుసాన, హవాయ్‌, బ్రస్సెల్స్‌, బ్రిక్స్‌, ఇఫీ తదితర పదిహేను అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శితమవడం వల్ల ఈ సినిమాకు గ్లోబల్‌ ఇమేజ్‌ వచ్చింది. ఈ ఫెస్టివల్‌లో పాల్గొన్న జర్నలిస్టుల వ్యాసాల కారణంగా కూడా ఈ సినిమాకు అంతర్జాతీయంగా మంచి పేరు లభించింది.

‘కంటెంట్‌’ కాస్తయినా ఉండాలి

ఒక సినిమాకు ప్రచారం ద్వారా లాభాలు ఆర్జించవచ్చనే గ్యారంటీ ఏమీ లేదు. స్టార్‌ హీరోల సినిమాల నిర్మాణ వ్యయంతో పాటు పబ్లిసిటీ వ్యయం కూడా అంచనాలకు మించి పెరిగిపోవడంతో సంప్రదాయ నిర్మాణ సంస్థలు కుదేలవుతూ వచ్చాయి. కానీ ఇంటర్నెట్‌ యుగానికి తగ్గట్లు పబ్లిసిటీ తీరును మార్చుకుంటూ వస్తున్న ఆధునిక నిర్మాణ సంస్థలు నిలదొక్కుకుంటున్నాయి. ఎంత విస్తృతంగా కొత్త తరహాలో ప్రచారం చేసినా, సినిమాలో ‘విషయం’ లేకపోతే చేసిన ప్రచారమంతా వృథా అవుతుందనేది నిరూపిత సత్యం. సినిమాలో ఏ కొంచెం ‘విషయం’ ఉన్నా, ఆకట్టుకొనే ప్రచారంతో ఆ సినిమాని నిలబెట్టొచ్చనేది కూడా అంతే నిజం. ‘సమ్‌థింగ్‌ ఈజ్‌ బెటర్‌ దేన నథింగ్‌’ కదా!

- బుద్ధి యజ్ఞమూర్తి


చిన్న సినిమాలకు కొన్నిసార్లు బడ్జెట్‌ను మించి పబ్లిసిటీకి ఖర్చుపెట్టిన సందర్భాలున్నాయి. ఉదాహరణకు పీవీపీ సంస్థ తీసిన ‘క్షణం’ నిర్మాణ వ్యయం రూ. 1.10 కోట్లయితే, ప్రచార వ్యయం రూ. 1.50 కోట్లు! టీవీ, వెబ్‌ మీడియాలో ఈ సినిమా ప్రచారానికి బాగా ఖర్చు పెట్టారు. అయితేనేం.. ఖర్చు పెట్టిన రూపాయికి రెండు రూపాయల లాభం వచ్చింది. అయితే అన్ని సినిమాలకూ ఇది వర్తించదు. ప్రచారానికి ఉపయోగించే ‘విషయం’ ఇందులో కీలకమనేది గుర్తించాలి. ఆసక్తికరంగా ట్రైలర్‌నూ, ప్రకటనలనూ రూపొందిస్తే.. సినిమాకు మేలు చేకూరుతుందని ‘క్షణం’, ‘హృదయ కాలేయం’ వంటి సినిమాలు నిరూపించాయి.

యూట్యూబ్‌లో అత్యధిక ఆదరణ పొందినవి.. 
‘బాహుబలి 2’ (హిందీ) ట్రైలర్‌: 42.35 మిలియన్ వ్యూస్‌
‘బాహుబలి 2’ (తెలుగు) ట్రైలర్‌: 39.95 మిలియన్ (తమిళ, మలయాళంలో కలుపుకొని నాలుగు భాషల్లో 100 మిలియన్ వ్యూస్‌ దాటాయి)
‘డీజే.. దువ్వాడ జగన్నాథమ్‌’ టీజర్‌: 12.12 మిలియన్
‘కాటమరాయుడు’ టీజర్‌: 11.50 మిలియన్
‘ఖైదీ నంబర్‌ 150’ టీజర్‌: 7.86 మిలియన్
‘ధృవ’ ట్రైలర్‌: 7.83 మిలియన్
‘గౌతమి పుత్ర శాతకర్ణి’ ట్రైలర్‌: 7.79 మిలియన్
‘ఖైదీ నంబర్‌ 150’ ట్రైలర్‌: 7.17 మిలియన్
‘జనతా గ్యారేజ్‌’ ట్రైలర్‌: 6.58 మిలియన్
‘కాటమరాయుడు’ ట్రైలర్‌: 6.51 మిలియన్

పబ్లిసిటీ ప్లాన్
ప్రేక్షకులే సినిమాకి వ్యాపారం. ప్రేక్షకులు లేకపోతే ఆ వ్యాపారం లేదు. అందుకే ప్రేక్షకులను ఆకట్టుకొనే ప్రచార ప్రణాళిక ముఖ్యం.
టార్గెట్‌ ఆడియెన్స్ ఎవరనేది నిర్ధారించుకోవాలి.
ప్రేక్షకులకు చేరువ కావడానికి ఏ తరహా పబ్లిసిటీ ఇవ్వాలో ప్లాన్ చేసుకోవాలి.
సినిమా కంటెంట్‌లోని ఆసక్తికర అంశాలతో బులెటిన్లు విడుదల చేస్తుండాలి.
సినిమాల విషయంలో ఆదరణ ఉండే పత్రికలు, చానళ్ల ద్వారా ప్రచారం చేస్తుండాలి.
మిగతా మీడియాలలో తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రచారం ఎలా ఇవ్వాలో అన్వేషించాలి.
ప్రేక్షకులను ఆకర్షించే తీరులో టీజర్‌, ట్రైలర్‌ను రూపొందించాలి.
సోషల్‌ నెట్‌వర్కింగ్‌ ద్వారా వీలైనంత మందికి అనుసంధానం కావాలి.

- ఆంధ్రజ్యోతి డైలీ, 9 ఏప్రిల్ 2017

Monday, February 20, 2017

Short Story: Bathikipo

బతికిపో

భళ్లుమంటా తలుపులు తెర్సుకునేతలికి ఆమైనే ఉలిక్కిపడతా చూశాడు కుమార్సామి. ఎదురుంగా అపర ఈరబద్రుళ్లా కొడవలి పట్టుకు కనిపిచ్చాడు ఓబులు. ఆ ముసలోడి కళ్లు నిప్పుకణికల మాదిరి ఎర్రెర్రగా మండిపోతన్నాయి. వడ్డీ లెక్కలు రాసుకుంటన్న కుమార్సామి కదలక మెదలక కొయ్యమాదిరి అట్టాగే కూకుండిపొయ్యాడు.
“రేయ్. పీనుగుల్ని పీక్కతినే లమ్డీకొడకా. ఇయ్యాళ నా సేతుల్లో నీకు మూడిందిరో” అంటా ఒక్క దూకు దూకాడు, ఇంకో ఏడుపోతే ఎనభై నిండే ఓబులు. ముసలోడే ఐనా ఇంకా బలంతగ్గని చేతిలో టెంకాయల్ని కసక్కన తెగనరికే కొడవలి మాత్రం అప్పుడే సానబెట్టినట్టు తళతళమంటా మెరుత్తా ఉంది. తల విదుల్చుకుంటా తెలివి తెచ్చుకున్నాడు కుమార్సామి.
“ఏయ్ ముసలోడా ఏం.. ఏం.. జేత్తన్నావ్? సేతిలో ఆ.. కొ..డ..వ..లి ఏంది?” అన్నాడు భయంతోటి గడగడా వొణుకుతా. ‘ఓబులుకీ, నాకూ మజ్జ ఏదైనా అడ్డం ఉంటే బావుణ్ణు’ అనుకున్నాడు. కానీ ఆ గెదిలో చిట్టీలెక్కల పుస్తకాలు, ఆ పుస్తకాలు పెట్టి రాస్కునే డెస్కు తప్పితే ఇంకేం లేవు.
“కనిపియ్యడం లేదురా కొజ్జా నాయాలా. నీ నెత్తురు కళ్లజూడందే వొదలన్రా. ఇయ్యాళ్టితో ఈడ జనానికి నీ పీడ వొదిలిపోద్ది. చావరా జనం నెత్తురు తాగే రాచ్చసుడా” అని కొడవలితో ఒక్కేటు యెయ్యబోయాడు ఓబులు.
చప్పున ఓబులు కాళ్లని ఎవరో గట్టిగా పట్టుకున్నారు. అరచ్చణం ఆలిస్యమైనా కుమార్సామి తలకాయ టెంకాయలా తెగిపడేదే. చూశాడు. దీనంగా చూత్తా కుమార్సామి పెళ్లాం రామలచ్చిమి.
‘నా మొగుణ్ణి చంపి నాకూ, నా బిడ్డలకీ అన్నేయం సెయ్యమాకు’ అంటున్నాయి నీళ్లతో మెరుత్తున్న ఆమె కళ్లు.
“ఏమ్మా. నీ మొగుడు ఊళ్లో ఎంతమెంది ఆడాళ్ల ఉసురు పోసుకుంటన్నాడో తెల్వదా. సోద్దెం చూత్తా ఊరుకుంటివే. నాకు తలకొరివి పెట్టాల్సిన మా పెద్దోడు సాంబుగాణ్ణి పొట్టన బెట్టుకుంది ఈ నీచపు ముండాకొడుకే. ఈ నాయాల్ని నరుకుదామనొత్తే అడ్డం పడ్తన్నావ్. నీ మొగుడి పేణం నీకెట్టానో, ఊళ్లో ఆడాళ్లకి ఆళ్ల మొగుళ్ల పేణాలూ అంతేగా. ఇయ్యాళ నా కొడుకు సావుతో అన్నేయమైపోయిన ఆడి పెళ్లాం పిల్లల గతేంది. దానికి జవాబు సెప్పు తల్లీ. అప్పుడు వొదుల్తాను ఈ పుండాకోరునాయాల్ని” – పళ్లు పటపటా కొరికాడు ఓబులు.
మొగుడి సంగతి తెల్సిందే గాబట్టి ఏం చెప్పాల్నో తెలీక ఓబులు వొంక అట్టాగే దీనంగా చూసిందామె.
“ఏం.. ఏంది బెదిరిత్తన్నావ్. నిజ్జంగా సంపుతావేందీ.. అంత తేలిగ్గా ఉందా, సంపడమంటే. నేనేం జేశాను. బాకీ డబ్బులు టయ్యానికి ఇయ్యకపోడం ఆళ్ల తప్పు. సామ్మూర్తి.. అదే నీ కొడుకూ.. అంతేగా. నోటులో రాసుకున్నట్టు బాకీ కట్టాల్నా, లేదా.. అదేగా నేనడిగిందీ.. నేనేమన్నా సావమన్నానా ఏందీ. తీసుకున్న బాకీ డబ్బులు కట్టడం సేతకాక పిరికోడులా ఉరేస్కుంటే దానికి నాదా బాద్దెత?” – కుమార్సామి, దైర్నం తెచ్చుకుంటా.
“రేయ్.. ఏం కూశావ్‌రా. సాంబుగాడు సచ్చింది బాకీ కట్టలేననే బాత్తో కాదురా. ఈదిలో నువ్‌జేసిన అల్లరికీ, నువ్వన్న ఛండాలపు మాటలకీ రా. పరువుగా, గుట్టుగా ఇంతకాలం సంసారం జేసుకుంటా వొత్తున్న నా కొడుకు అందర్లోనూ అవమానం జెయ్యడాన్ని తట్టుకోలేక మనసులో కుంగిపొయ్యి ఉరేసుకున్నాడ్రా. మాటల్తోటే మనుషుల్ని పీక్కతినే పచ్చి రాచ్చసుడివిరా నువ్వు. నిన్నొక్కణ్ణి యేసేత్తే నేతగాళ్లంతా మనశ్శాంతిగా బతుకుతార్రా” – కొడవలి పైకెత్తాడు ఓబులు.
దాంతోటి కుమార్సామి పైపేణాలు పైనే పొయ్యాయి. వొళ్లంతా సెమట్లు పట్టేశాయి. గుండెకాడ నెప్పి మొదలయ్యింది. ‘చివరికి ఈ ముసలోడి సేతిలో సావు రాసిపెట్టుందా?’ అనుకోంగాల్నే, నాలికి పొడిబారింది. మామూలుగా ఐతే తిరగబడేవోడే. యాభయ్యేళ్ల తనముందు ఎనభయ్యేళ్ల ముసలోడు ఓ లెక్కా. కానీ తను ఉత్త సేతుల్తో ఉన్నాడాయె. పైగా కూకొని ఉన్నాడు. ఓబులు సేతిలో జూత్తే అప్పుడే సానబెట్టిన కొడవలుంది. పైగా నించోనున్నాడు. తను లేచేపాటికి ఒక్కేటుగానీ యేశాడా.. తన తలకాయ పుచ్చకాయలా తెగిపడుద్ది. భయంతో గొంతు పిడచకట్టుకుపొయ్యింది కుమార్సామికి.
*    *    *
ఆ పేట మొత్తమ్మీద కుమార్సామే పెద్ద వొడ్డీ యాపారి. ఓ పక్క చిట్టీపాటలు, ఇంకోపక్క వొడ్డీ యాపారంతో శానా తక్కువ రోజుల్లోనే కోట్లు సంపాదిచ్చాడు. బంగాళాపెంకుల ఇంటిని పడేసి రెండంతస్తుల మేడ బ్రెమ్మాండంగా కట్టాడు. మెట్ట, మాగాణి కలిపి యాభై ఎకరాల పైనే ఉంటుందని పేటలో సెప్పుకుంటా ఉంటారు. ఆటిలో బాకీ కట్టలేనోళ్లు జమచేసిన పొలాలు పదెకరాల దాకా ఉంటాయి. అట్టాగే ఓ పెంకుటిల్లునీ, ఏడు సెంట్ల ఖాళీ స్తలాన్నీ కూడా బలవంతాన లాగేసుకున్నాడు కుమార్సామి. ఆటి యజమానులు ఆయబ్బి కాడ జేసిన బాకీని కట్టాల్సిన టైముకి కట్టకపోడమే దానిక్కారణం. పేటలోని నేతగాళ్లే కాదు, శానామంది షావుకార్లు (మాస్టర్ వీవర్లు) కూడా ఆయబ్బితో ఇబ్బందులు పడతన్నారు. మనసులో ఆయబ్బి మీద ఎంత కోపమున్నా, కసున్నా ఏం జెయ్యలేని పరిస్తితిలో ఉన్నారు. ఎందుకంటే అవసరానికి ఎంతంటే అంత డబ్బు అప్పిచ్చేది ఆయబ్బే కాబట్టి.
ఓబులు కొడుకు సాంబమూర్తి శానా రోజుల్నించే కుమార్సామి కాడ చిట్టీపాటలు కడ్తన్నాడు. పౌర్ణం రోజు వొచ్చిందంటే కుమార్సామి ఇల్లు పాటలు కట్టేవోళ్లతోటి కిటకిటలాడిపోద్ది. మామూలుగా పౌర్ణం రోజు నేతగాళ్లందరికీ ఊరట. అంటే సెలవురోజు. మగ్గం చప్పుడు వినిపిచ్చని రోజు. షావుకార్ల కొట్లు నేతగాళ్లతో కళకళలాడే రోజు. ఆ రోజే నేతగాళ్లంతా తాము ఏ షావుకారికి నేత్తున్నారో ఆ షావుకారు కాడికి నేసిన గుడ్డల తానులు తీసకపొయ్యి కొత్త ‘ఎంట్లు’ (పడుగు, పేక నూలు, పాగళ్లు) తెచ్చుకుంటారు. ఆటితో పాటే ఆటి తాలూకా కూలీ డబ్బులు కూడా. అంటే ఉజ్జోగం చేసేవాళ్లకి జీతాలొచ్చే రోజు ఎట్టాగో నేతగాడికి పౌర్ణం రోజు అట్టాగా. ఆ రోజంతా నేతగాళ్ల ఇళ్లల్లో పండగ సందడే. నేతగాళ్ల కాడ డబ్బులాడేది అప్పుడ్నే కాబట్టి కుమార్సామి చిట్టీ పాటలు పెట్టేది అప్పుడ్నే.
పాటలు పాడుకోడానికి వొచ్చినోళ్లతోటీ, బాకీ చెయ్యడానికి వొచ్చినోళ్లతోటీ కుమార్సామికి అయ్యాళ చెణం తీరికుండదు. ఎవరైనా పాట డబ్బులు కట్టడం ఒక్క రోజు ఆలస్యమైనా ఆయబ్బి ఊరుకోడు. ఆ తెల్లారే ఆ కట్టనాళ్లింటికాడికి పొయ్యి నానా యాగీచేసి, డబ్బులు వసూలు చేస్కుంటాడు. ఏదైనా అవసరానికి పనికొత్తాయి కదా అని నేతగాళ్లంతా కుమార్సామి కాడ చిట్టీపాటలు కడ్తుంటారు.
శానా యేళ్లనుంచీ ఆయబ్బి కాడ పాటలు కడ్తన్నాడు సామ్మూర్తి. ఎప్పుడైనా పౌర్ణం రోజు పాట డబ్బులు కట్లేకపోతే ముందుగాల్నే ఆ సంగజ్జెప్పి, గడువడిగి, ఆ లోపల కట్టేసేవోడు. అట్టాంటి నమ్మకమైన మనిషైన సామ్మూర్తి ఆమజ్జ కుమార్సామి కాడ యాభయ్యేలు అప్పుజేశాడు. పెద్ద కూతురి పెళ్లిని ఎట్టాగో ఎవరికాడా బాకీ పడకుండా జేశాడు కానీ రెండో కూతురి పెళ్లికి అప్పుజెయ్యక తప్పలేదు. అబ్బాయి ఆర్టీసీ కండట్టరుగా గవర్మెంటు ఉజ్జోగం జేత్తుంటం వల్ల, కూతురికి బవిష్యెత్తులో నేతనేసే పని తప్పుతుందనే ఆశతోటీ, వొచ్చిన మంచి సంబంధాన్ని సేతులారా వొదులుకోవడం ఎందుకనే ఉద్దేశంతో సేతిలో డబ్బులు అంతగా లేకపోయినా బాకీచేసి ఆ పెళ్లి జేశాడు.
వొందకి రెండ్రూపాయల వొడ్డీ లెక్కన ఆ అప్పు తీసుకున్నాడు సామ్మూర్తి. మూడేళ్లలో అసలు, వొడ్డీ కలిపి బాకీ మొత్తం తీరుత్తానని ఆయబ్బి చేత నోటు రాయించుకున్నాడు కుమార్సామి. అంటే మూడేళ్లలో వొడ్డీతో కలిపి ఎనభై యేలు కట్టాలన్న మాట. ఒకేళ ముందుగాల్నే కట్టేత్తే వొడ్డీ తగ్గుద్ది. అయితే నేతగాడికి అంత డబ్బు చెల్లిచ్చాలంటే అయ్యే పనేనా?
ఇంట్లో నేతనేసేది సామ్మూర్తి వొక్కడే. షుగరొచ్చి ఆయబ్బి పెళ్లాం జెయమ్మ శానా కాలం నుంచీ పైపనులు మాత్రమే జేత్తంది. కొడుకు కాలేజీలో సదూకుంటన్నాడు. ఓ పక్క కొడుకుని సదివిత్తా, ఇంకోపక్క పెళ్లాం రోగానికి డబ్బులు ఖర్చుపెడతా ఉంటే బాకీ డబ్బు చెల్లిచ్చడం ఎంత కనాకష్టమో సామ్మూర్తికి తెలవంది కాదు. మనసులో బయం రోజురోజుకీ పెరుగుతున్నా, వొంటి గురించి పట్టిచ్చుకోకుండా రేయింబవళ్లూ కష్టపడ్తా వొచ్చాడు. నిద్రలేచాక ఆరింటి కాణ్ణించీ మగ్గం గుంటలోనే సామ్మూర్తి జీవితం. మజ్జలో అన్నాలు తింటానికీ, బయటేమన్నా పన్లుంటే యెళ్లిరావడానికీ తప్పితే రేత్రి తొమ్మిది, పదింటిదాకా గుంటలోనే ఉంటన్నాడు.
“ఇట్టా అదేపనిగా నేత్తే నీ వొళ్లు పాడవుద్దయ్యా” అని దిగులు పడ్తుంటుంది జెయమ్మ.
“నాకేందే.. నాది ఉక్కొళ్లు” అని నవ్వుతా అంటాడే గానీ తనొళ్లు ఇంతకు ముందులా తన మాట వింటంలేదనే యిష్యం ఆయబ్బికి తెలుత్తానే ఉంది. నలబై ఐదేళ్లనుంచీ అదేమైనుగా మగ్గం గుంటని అంటిపెట్టుకొన్న బతుకు ఆయబ్బిది. నిన్న మొన్నటిదాకా పేట మొత్తమ్మీద స్పీడుగానే గాకుండా శానా అందంగా నేసే నేతగాడని అందరూ అనేవోళ్లు. వొయసులో ఉన్నప్పుడు ఓబులు కూడా తన కొడుకులా నేసినోడు కాదు.
కాలం గిర్రున తిరుక్కుంటా పోతంది. సామ్మూర్తి కొడుకు ఇప్పుడు బీయస్సీ మూడో యేడు సదూతున్నాడు. ఆ మజ్జలో రెండో కూతురు పురుడు కోసమని పుట్టింటికొచ్చింది. కాన్పు మామూలుగా అయిపోతందనుకుంటే ఆఖర్లో బిడ్డ అడ్డం తిరిగిందనీ, ఉమ్మ నీరు పోతన్నదనీ జెప్పి పొట్టకోసి బిడ్డను బయటకి తీసింది డాక్టరు. ఆ ఆపరేషన్‌కీ, ఇంకొన్ని ఖర్చులకీ పదేల దాకా ఐపోయాయి. కూతురు కదా తప్పదయ్యే. ఇట్టాంటియ్యే మజ్జమజ్జలో ఎయ్యో ఖర్చులు రావడం, అప్పటిదాకా దాచుకున్న డబ్బు ఖాళీ ఐపోడంతో కుమార్సామి కాడ చేసిన బాకీకి వొడ్డీ తప్పితే అసలు చెల్లిచ్చలేకపొయ్యాడు సామ్మూర్తి. కుమార్సామి సంగతి తెల్సు కాబట్టి మనసులో పీకుతానే ఉంది సామ్మూర్తికి, ఏం గొడవ జేత్తాడోనని. మూడేళ్లైపొయ్యాయి. వొడ్డీ ఇద్దామని యెళ్లిన ఆయబ్బిని నానా కూతలూ కూశాడు కుమార్సామి. వొడ్డీ తీసుకుని అసలు కూడా అప్పటికప్పుడు చెల్లిచ్చాల్సిందేనని పట్టుబట్టాడు.
“ఏంది సామీ. నా సంగతి నీకు తెల్వదా. ఎన్నేళ్లబట్టి నీకు పాటలు కడ్తన్నాను. ఎప్పుడైనా నావొల్ల తేడా వొచ్చిందా? ఇప్పుడంటే రెండో దాని పెళ్లి తర్వాతనే కదా కాత్త ఇబ్బంది పడ్తన్నా. అబ్బాయి సదూకోసమనీ, ఇంటిదాని వైజ్జం కోసమనీ ఖర్చవుతా ఉంది. వొడ్డీ అయితే ఆపకుండా ఇచ్చేత్తన్నా కదా. అబ్బాయి సదువైపోతే ఆడికి ఏదో వొక ఉజ్జోగం రాకపోదు. అప్పుడు నాకింత కష్టం ఉండదు. నీ బాకీ అణాపైసల్తో తీర్చేత్తా. మళ్లా నోటు రాయి” అని బతిమాలాడు సామ్మూర్తి. అప్పు తీసుకున్నోళ్ల బాధల్ని ఇని దయచూపితే ఆయబ్బి కుమార్సామి ఎట్టా అవుతాడు? ఆస్తులు ఎట్టా పోగేసుకుంటాడు?
“నాకీ కతలన్నీ చెప్పమాక సామ్మూర్తీ. టయ్యానికి బాకీ కట్టని పెతోడూ నీ మాదిరి కతలు చెప్పేవోడే. అయ్యన్నీ ఇనుకుంటే నేను యాపారం జేసినట్టే. నువ్వేం తిప్పలు పడ్తావో, ఏ ఇంటికి కన్నం యేత్తావో నాకు తెల్వదు. పది రోజులు టైమిత్తన్నా. నా బాకీ కడితే సరే. లేదంటే బజారుకీడుత్తా” అని కచ్చితంగా చెప్పేశాడు.
ఇదంతా ఓబులికి తెల్సినా కొడుక్కి ఏం సాయం చెయ్యలేని ఇదిలో ఉన్నాడు. కొద్ది రోజులు పెద్దకొడుకు కాడా, కొద్ది రోజులు చిన్నకొడుకు కాడా రోజులు నెట్టకొత్తున్నాడు. పైపనుల్లో సాయం తప్పితే ఆయబ్బి పోగేసుకున్నదేం లేదు.
కుమార్సామి ఎంత గట్టిగా జెప్పినా, ఆయబ్బి యెట్టాంటోడో ఎరిగినా మంచోడిగా, పరువు  మర్యాదలు ఉన్నోడిగా తనకున్న పేరువల్ల కొంత దయ సూపుతాడేమోనని ఆశపడ్డాడు సామ్మూర్తి. పైగా ఎన్నో ఏళ్లబట్టి తను ఆయబ్బి కాడ పాటలు ఆగకుండా కడతా వొత్తున్నాడాయె.
పది రోజులెళ్లిపొయ్యాయి. కుమార్సామి ఇంటిమీదికి వొత్తాడేమోనని మనసులో బితుకుబితుకుమంటన్నా పైకి నిబ్బరంగా ఉంటానికి పెయత్నిత్తున్నాడు సామ్మూర్తి.
ఆ రోజు మజ్జాన్నం మొగుడూ పెళ్లాలు అన్నాల కాడ కూకోబోతన్నారు.
“ఏవయ్యా సామ్మూర్తీ” అన్న కేక, ఇంటి బయట్నించి. అది మామూలు కేక కాదు. అది మామూలు గొంతూ కాదు. బీరకాయ కూరతో అన్నం కలుపుకొని, ముద్ద జేత్తన్నాడు సామ్మూర్తి. ఇంకా ఒక్క ముద్ద కూడా పెట్టుకోలేదు నోట్లో.
Bathiki ....Po (600x435)
“సరిగ్గా టయ్యానికి వొచ్చేశాడే దొంగనాయాలూ” అని, “నేను మాట్టాడొత్తా. నువ్వు తింటుండు” పెళ్లాంతో చెప్పి కంచం కాణ్ణించి లేచాడు.
“ఈ మడిసికి యేళాపాళా ఉండదా. నువ్వు కూకో. కాసేపాగి రమ్మని సెప్పొత్తా” అంటా లేవబోయింది జెయమ్మ.
“ఏం జేత్తన్నావ్ పెద్ద మనిషీ.. లోనా” అంటా పంచాలోకి వొచ్చాడు కుమార్సామి.
“ఇప్పుడే అన్నానికి కూకుంటన్నాం సామీ. వొత్తన్నానుండు” అంటా గబగబా దొడ్లోకి పొయ్యి చేతులు కడక్కొచ్చాడు సామ్మూర్తి.
“ఎట్టా తినబుద్దేత్తందయ్యా కూడు. నాకియ్యాల్సిన బాకీ డబ్బులు ఇయ్యకుండా కూడెట్టా సయిత్తందనీ. నిద్రెట్టా పడతందీ అంటా?” గట్టిగా అరిచాడు కుమార్సామి. ఆయబ్బి కేకలు చుట్టుపక్కలాళ్లకి ఇనిపిత్తన్నాయి. ఇనిపిచ్చాలనే అట్టా అరవడం కుమార్సామికున్న గుడిసేటి గుణం. ఊహ తెలిసినాక ఎప్పుడూ ఎవరికాడా ఇట్టాంటి మాటలు పడని సామ్మూర్తికి ఇది శానా అవుమానంగా అనిపిత్తంది. కుమార్సామి మాటలు బరిసెల మాదిరిగా గుండెల్లో గుచ్చుకున్నాయి.
“సామీ ఎందుకట్టాగా నోరు పారేసుకుంటన్నావ్. నేను బాకీ డబ్బులు కట్టనని సెప్పానా. నా ఇబ్బంది సెప్పుకుని, మళ్లా నోటు రాయిమన్నా కదా. నేనెట్టాంటోణ్ణో నీకు తెల్వదా. ఎంత కాలం నించి నీకు పాటలు కడ్తన్నానో తెల్వదా. వొడ్డీ డబ్బులు ఆపకుండా కడ్తానే వొత్తున్నాగా. ఆమాత్రం ఆగలేవా?” కొంచెం గట్టిగానే మొదలుపెట్టి, చివరికొచ్చేతలికి బతిమిలాడతన్నట్టు అడిగాడు సామ్మూర్తి.
“ఏందోయ్ మాటలు రేగుతున్నాయే. నేను నీకు బాకీ పడ్డానా. నువ్వు నాకు బాకీపడ్డావా? నేను నోరు పారేసుకుంటన్నానా? కడుపుకి కూడు తింటన్నావా, గడ్డి తింటన్నావా? అంత రోషమున్నోడివి టయ్యానికి నా బాకీ డబ్బులు  కట్టెయ్యాలి గదా. ఇత్తే నేను నీ ఇంటిదాకా ఎందుకొత్తాను? నా టైమెందుకు వేస్టు జేసుకుంటాను? వొడ్డీ డబ్బులు కట్టేత్తే అయిపోద్దా. అసలు డబ్బుల సంగతేంది? మీ అయ్యిత్తాడా?” పెద్దగొంతుతో రంకెలేశాడు కుమార్సామి.
సామ్మూర్తికి నోట్టోంచి మాటలు పెగల్లేదు. ఆ యబ్బికి సిగ్గుగా ఉంది. అవమానంగా ఉంది. చుట్టుపక్కల జనాలు ఇళ్లలోంచి బయటకొచ్చి సోద్దెం సూత్తనేతలికి ఆయబ్బికి తల కొట్టేసినట్టుగా ఉంది. తలెత్తి అట్టా ఇట్టా సూడ్డానికి కూడా ఇబ్బందిగా ఉంది.
సామ్మూర్తి మౌనంచూసి మరీ రెచ్చిపొయ్యాడు కుమార్సామి. “కూతుళ్ల పెళ్లిచెయ్యగానే సంబడం కాదు. బాకీ కట్టాలన్న ఇంగిత గేనం కూడా ఉండాలి” అన్నాడు. సామ్మూర్తి వంశాన్నంతా తిట్టాడు. మజ్జమజ్జలో బూతులు కూడా. ఆడ జెయమ్మ కూడా ముద్ద నోట్లో పెట్టుకోలేకపొయ్యింది.
“ఆకర్సారి సెబ్తున్నా. వొచ్చే నెల్లోగా బాకీ మొత్తం కట్టేత్తే సరి. లేపోతే నీ ఇంటి కాయితాలు నాకాడ పెట్టుకుంటా” అని గర్జించి యెళ్లిపొయ్యాడు కుమార్సామి.
ఆయబ్బి యెళ్లిపొయ్యినా సామ్మూర్తి తలొంచుకొని కదలకుండా మెదలకుండా కొయ్యలా అట్టాగే నిల్చుండిపొయ్యాడు. తల్లో సుత్తుల్తో కొడతన్నంత బాధ. గుండెల్లో బరిసెలు గుచ్చుతున్నంత నెప్పి. జెయమ్మ వొచ్చి “ఏందయ్యా అట్టా రాయిలా నించున్నావ్” అని కుదిపి కదిపేదాకా అట్టాగే ఉన్నాడు.
పెళ్లాంవొంక జూశాడు సామ్మూర్తి. ఆయబ్బి మొహంలోని ఆలోచనలూ, కళ్లల్లోని నీళ్లూ ఆమెకి తెలిశాయి. మొగుణ్ణెప్పుడూ అట్టా సూడలేదామె.
“ఊరుకోయ్యా. ఆ సామి సంగతి తెలీందా. దా. బువ్వ తిందూగానీ” అంది బుజంమీద సెయ్యేత్తా.
‘ఆకలి సచ్చిపొయ్యిందే’ అందామనుకున్నాడు. ఆమె కూడా బువ్వ తినని సంగతి గేపకమొచ్చింది. మూగోళ్లా యెల్లి కంచంముందు కూకున్నాడు. నాలుగు మెతుకులు గెతికాడు.
ఆ రోజంతా యెట్టానో గడిచింది ఆ ఇద్దరికీ. మొగుడికి దైర్నం సెప్పాలని సూసింది జెయమ్మ. సామ్మూర్తి “ఆ.. ఊ..” అంటన్నాడే గానీ మనసెక్కడ్నో ఉంది. మగ్గాలోకెళ్లి ‘వాటు’ యేత్తన్నాడే గానీ అందులో ఉషారు లేదు. నాడి తగులుకొని పోగులు తెగుతున్నాయి.
“ఈ పూటకి లేచిరాయ్యా. మనసు బావోలేనట్టుంది” అంది జెయమ్మ. లోసొచ్చి నులకమంచం మీద పడుకున్నాడు.
పెద్దకొడుకు ఇంటిమీదికొచ్చి కుమార్సామి గొడవ జేసెళ్లాడని చిన్నకొడుకు కాడున్న ఓబులుకి తెలిసింది. వొచ్చాడు. మజ్జింటో నులకమంచం మీద కళ్లు మూసుకొని పడుకోనున్న కొడుకుని సూశాడు.
కుమార్సామి ఎన్ని మాటలన్నాడో, ఏం కూతలు కూశాడో సెప్పింది కోడలు.
“వొరే సాంబూ. ఆ కుమార్సాంగాడు ఏవేవో అంటంటాడు. ఆడి సంగతి మనకు తెలీందేముంది. నువ్వు దిగులు పెట్టుకోమాక. ఏదో ఓటి సేద్దాంలే” అని దైర్నం సెప్పాలని సూశాడు ఓబులు.
ఏదో గొణిగాడు సామ్మూర్తి. ఓబులుకి అదేందో సరిగా ఇనిపించలేదు. అయినా ఇనిపించినట్టే ఏందని అడగలేదు. ఆ రేత్రి మామూలు రేత్రిలా లేదు. ఆ సంగతి జెయమ్మకి కూడా బాగా తెలుత్తోంది. పక్కన నులకమంచం కిర్రుకిర్రుమంటా సప్పుడు సేత్తంది మాటిమాటికీ. అంటే మొగుడు నిద్రపట్టక అటూ ఇటూ పొర్లుతున్నాడన్న మాట. ఆమె మనసులో దిగులూ, భయమూ.. రెండూ ముసురుకున్నాయి. ఎందుకో గుండెలో గిలిగా ఉంది. దడగా ఉంది. ఆమెకు ఏ అర్ధరేత్రో నిద్రపట్టింది.
తెల్లారింది. రోజూ తెల్లారినట్లు లేదు ఆ తెల్లారడం. భయంకరంగా తెల్లారింది. భీతిపుట్టేలా తెల్లారింది. ఐదున్నరకి లేచింది జెయమ్మ. పక్కన మొగుడు లేడు. ఐదింటికే లేచి, తలుపు దెగ్గిరగా యేసి, చెంబు తీసుకొని రైలుకట్టకాడికి పోతాడు కాబట్టి అట్టాగే పొయ్యాడనుకుంది.
జుట్టు ముడేసుకుంటా దొడ్డి తలుపు తీసింది. ఆమైనే ఒక్కసారిగా ఒళ్ళు జలదరిచ్చిపొయ్యింది. ఎదురుగా ఏదో నల్లగా ఆకారం, గాల్లో యేళ్లాడతా ఉంది. ఇంకా యెల్తురు పూర్తిగా రాలేదు. జెయమ్మ కళ్లు నులుంకుంటా సూసి గావుకేక పెట్టింది. ఆ కేక ఉంత భయానకంగా ఉందో! యేపసెట్టుకి యేలాడ్తన్న ఆ ఆకారం సామ్మూర్తిది. కంటిగుడ్లు పైకి పొడసకొచ్చి, నాలికి బయటకొచ్చి…
*     *     *
“నిన్నిట్టా ఊరకే వొదిలేత్తే ఇంకెంతమంది పేణాలు తీత్తావో, యెంతమంది ఉసురు పొసుకుంటావో. నువ్వు పోతేగానీ ఈ పేటకి పట్టిన శనీద్రం పోదురా కుక్కా” అంటా కుమార్సామి జుట్టు పట్టుకున్నాడు ఓబులు.
గడగడా వొణికిపొయ్యాడు కుమార్సామి.
‘ఐపోయింది. ఈ ముసలాడి సేతిలో నాకు మూడింది’ అంది ఆయబ్బి మనసు.
“అయ్యా. మా ఆయన్ని ఏం సెయ్యమాకు. ఆయన సెడ్డోడు నిజిమే. ఇకనుంచీ దుర్మార్గం పనులు సెయ్యకుండా నే సూస్కుంటాగా. నన్నూ, నా పిల్లల్నీ అన్నేయం సెయ్యమాకు. నీకు దణ్ణం పెడ్తన్నా. నీ కాళ్లు మొక్కుతన్నా” అని కాళ్లు పట్టేసుకుంది కుమార్సామి పెళ్లాం.
ఆమొంక సూశాడు ఓబులు. తడిగా ఉన్న ఆయమ్మి కళ్లూ.. భయమూ, దిగులూ కలిసిన మొహమూ.. ఆయబ్బిలోని జాలిపేగుని కదిలిచ్చాయి. సప్పున ఓబులు గుండెలో దయ మొలకలెత్తింది.
“రేయ్ సామిగా. నిజ్జింగా నిన్ను నరికి పోగులుపెట్టి మన పేటకి దాపురిచ్చిన పీడని వొదిలిద్దామనే వొచ్చాన్రా. కానీ నీ పెళ్ళాం పిల్లల్ని సూసి వొదిలేత్తన్నా. ఆడదాని వొల్ల బతికిపొయ్యావ్ పోరా కొడకా. రేయ్. ఒక్కటి మాత్రం గేపకం పెట్టుకో. ఈసారి ఎవురింటి మీదకైనా వొచ్చి గోలసేసినట్టు తెల్సిందా.. అక్కడ్నే పాతేత్తా నాయాలా. ఇదుగోమ్మా.. నీక్కూడా సెబ్తున్నా. నువ్ సెప్పిన మాట నిలబెట్టుకోకపొయ్యావో.. ఇంకోసారి.. నీకిట్టా బతిమాలుకొనే అవకాశం కూడా ఇయ్యను. ఛీ.. నీదీ వొక బతుకేనట్రా” అని ఖాండ్రించి కుమార్సామి మొహాన ఉమ్మేశాడు ఓబులు.
-బుద్ధి యజ్ఞమూర్తి
NOVEMBER 13, 2014, సారంగ వెబ్ వారపత్రిక

Thursday, November 3, 2016

Monday, August 22, 2016

Sunday, July 3, 2016

Poetry: Handloom

మగ్గం ఆడుతుంటే...

రోజంతా మగ్గం ఆడుతున్న చప్పుడు వింటాను
ఆ బక్కపలుచని చెక్కల నిర్మాణం ఎంత సుందరం!
నిలువుగా రెండు.. అడ్డంగా రెండు..
ఉక్కు కండల చేతులూ కాళ్లలా.. చెక్కలు!!
ఒక చేత్తో పలక, ఇంతో చేత్తో పిడి..
మగ్గంలో కూర్చున్న నాన్నని అపురూపంగా చూస్తుంటాను
లయబద్ధంగా నాట్యం చేస్తున్న నటరాజే జ్ఞాపకమొస్తాడు
పోగు పక్కన ఇంకో పోగు - పడుగు
పోగు మీద ఇంకో పోగు - పేక
సొరుగుల్లోంచి చకచకా అట్నించి ఇటు తిరిగే నాడి
వడివడిగా దూసుకొచ్చే జలతారు పోగులు
ఒక పావుచెక్క కిందికి దిగితే
ఇంకో పావుచెక్క పైకి లేస్తుంది
అచ్చులో సగం పోగులు కిందికీ
ఇంకో సగం పోగులు పైకీ
పోగులు చిక్కుబడకుండా
కచ్చిబద్దలు కాపలా కాస్తుంటాయి సైనికుల్లాగా
బట్ట బిగువు సడలిపోకుండా
చేళ్లు చేతులు చాపి పట్టుకుంటాయి రక్షకుల్లాగా
బుటా తర్వాత ఇంకో జరీ బుటా
సెల్ఫు తర్వాత ఇంకో పూల సెల్ఫు
పడుగు పైన పట్టు పాగళ్లు
గుడ్డమీద రంగుల సీతాకోకలవుతుంటాయి
నెమ్మదిగా చీకటి చిక్కనవుతుంటే
కిరసనాయిలు బుడ్డీలు
మగ్గం రెండుపక్కలా వెలుగుతాయి
మగ్గం చప్పుడు ఆగదు
పడుగు-పేక పరిమళాలు వదలవు
పదకొండు కొట్టేదాకా మగ్గం విశ్రమించదు
ఒక దోనె ఖాళీ అవుతుంటే
ఇంకో దోనె నిండు కుండవుతుంటుంది
ఒక తాను పుట్టాక
ఇంకో తాను పురుడు పోసుకోవడం మొదలవుతుంది!
టకటకమనే పలక చప్పుడులో
చెమట చుక్కల పాట సమ్మగా వినిపిస్తుంటుంది!!

-ఆంధ్రజ్యోతి 'వివిధ', 4 అక్టోబర్ 2010

Thursday, June 30, 2016

Profile of Director K. Pratyagatma

Born: 31 October 1924
Birth Place: Mudunur (Krishna District)
Parents: Kolli Kotayya, Annapurna
Wife: Satyavathi
Son: K. Vasu (director)
Magazine Editor: Jwala
First Film as a Writer: 'Nirupedalu' (1953)
First Film as a Director: Bharya Bharthalu (1961)
Last Film as a Director: Nayakudu VinayakuDu
Artists Introduced: Jayalalitha (Manushulu Mamathalu), Krishnam Raju (Chilaka Gorinka), Ramaprabha (Chilaka Gorinka), Tyagaraju (Manchi Manishi), Sarath Babu (Stree), Rallapalli (Stree)
Dead: 8 June 2001

Saturday, June 4, 2016

Interview of actress Samantha

అతనెవరో నేనే చెబుతా!

‘త్వరలోనే సమంత పెళ్లంట. పేరు చెప్పకపోయినా ఓ తెలుగు హీరోను పెళ్లి చేసుకోబోతోందట’.. కొద్ది రోజులుగా సినీ ప్రేమికుల మధ్య నలుగుతున్న మాటలివి. ‘ఎవరా హీరో?’ అనే దానిపై ఎవరికి తోచినట్లు వాళ్లు నిర్ధారణకు వస్తున్నారు. పెళ్లి గురించి అడిగితే నవ్వుతూ తన ప్రతినిధి ఆ విషయం చెబుతారని దాటవేస్తోంది సమంత. అయితే పెళ్లి తర్వాత కూడా నటిస్తానని స్పష్టం చేస్తోంది. త్రివిక్రమ్‌ దర్శకత్వం వహించిన ‘అ ఆ’ చిత్రంలో నాయికగా నటించిన ఆమె.. తనను నడిపిస్తోంది తన అమ్మే అంటోంది. సమంత చెప్పిన ముచ్చట్లు ఆమె మాటల్లోనే..

ఈ వేసవికి విడుదలవుతున్న నా చివరి చిత్రం ‘అ ఆ’. నేను చేసిన ముఖ్యమైన సినిమాల్లో ఇదొకటి. ఇప్పటిదాకా సీరియస్‌ సినిమాలు, ఇంటెన్స్, రొమాన్స్ ఉన్న సినిమాలు చేశాను. కామెడీ చెయ్యలేదు. మొదటిసారి నేను కామెడీ చేసిన సినిమా ఇది. కమెడియ న్స్అంటే నాకు చాలా గౌరవం. కామెడీ పండించడం చాలా క్లిష్టమైన వ్యవహారం. ప్రేక్షకులకు నవ్వు రాలేదంటే, అది అపహాస్యమైనట్లే. ఆ రిస్క్‌ను నేను తీసుకున్నా. నాకు అలాంటి పాత్ర ఇచ్చినందుకు కచ్చితంగా త్రివిక్రమ్‌గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నా. వృత్తిపరంగానే కాక, వ్యక్తిగతంగానూ త్రివిక్రమ్‌గారి ప్రభావం నాపై ఉంది. ఆయన చాలా నాలెడ్జ్‌ ఉన్న వ్యక్తి. ఆయన్నుంచి ఎంతో నేర్చుకోవచ్చు. నాలోని కొన్ని అభద్రతాభావనలను ఆయన వల్ల అధిగమించాను. ఆయనకు సెన్సాఫ్‌ హ్యూమర్‌ ఎక్కువ. ఆయన నాకు పాత్ర గురించి చెబుతుంటే, ఆయనను నేను ఇమిటేట్‌ చేశానంతే. నేనేమిటో ఆయనకు బాగా తెలుసు. అందుకే అనసూయ పాత్రకు న్యాయం చేశానని నమ్ముతున్నా. ఈ సినిమాతో నటిగా మరింత ఎదిగాననుకుంటున్నా.

అప్పుడు జీరో కెమిస్ట్రీ

నేను వ్యక్తుల్ని బట్టి సినిమా చెయ్యను. స్క్రిప్టును బట్టే చేస్తాను. ఇప్పటివరకూ స్క్రిప్ట్ విని, కన్విన్స్ అయ్యాకే సినిమా చేస్తూ వచ్చా. ఏ స్క్రిప్టూ వినకుండా సంతకం చెయ్యలేదు. ఇప్పటి సినిమాల్లో హీరోయిన్‌కు తక్కువ ప్రాముఖ్యమే ఉంటోందన్నది నిజం. పది సినిమాల్లో ఒక్క సినిమాలోనే హీరోయిన్‌కు మంచి పాత్ర దొరుకుతోంది. ఇలాంటి రోజుల్లో ‘అ ఆ’ స్క్రిప్ట్ నాకు చాలా ముఖ్యమైంది. ఇందులో హీరో హీరోయిన్‌లకు సమాన ప్రాధాన్యం ఉంది. సినిమా మొత్తం హీరోయిన్‌ దృక్కోణంతో నడుస్తుంది. నిజ జీవితంలో నేనేమిటో ఆ పాత్ర కూడా అంతే. కొంచెం అల్లరి, వేగంగా నిర్ణయాలు తీసుకొనే తత్వం ఉన్న పాత్ర. నితిన్‌కూ, నాకూ, త్రివిక్రమ్‌గారికీ కూడా ఈ సినిమా ఓ మేకోవర్‌ లాంటిది. ఇప్పటివరకూ నితిన్‌ చేసిన ఉత్తమమైన అభినయాల్లో ఇందులోని ఆనంద్‌ విహారి పాత్ర ఒకటి. ఈ సినిమా చెయ్యకముందు నుంచీ నితిన్‌ నాకు మంచి ఫ్రెండ్‌. అందువల్ల ఈ సినిమా చేసేప్పుడు చాలా ఒత్తిడి ఫీలయ్యాను. మొదటి రెండు రోజులూ రొమాంటిక్‌ సీన్లు చేయడం చాలా కష్టమైపోయింది. సెట్స్‌పై మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ జీరో. ‘‘మీ ఇద్దర్ని పెట్టి నేను తప్పు చేశానా?’’ అని కూడా అనేశారు త్రివిక్రమ్‌. ఆ తర్వాత మేం కుదురుకున్నాం.

అందుకే డబ్బింగ్‌ చెప్పలేదు

‘ఇది చాలా కొత్త కథ.. ఇలాంటి ప్రేమకథ ఇంతదాకా రాలేదు..’ ఇలాంటి మాటలు ‘అ ఆ’ గురించి చెప్పను. సినిమా చూస్తున్నంతసేపూ మన ముఖాలపై చిన్న నవ్వు ఉంటుంది. నేను సినిమా చూశాను. ఆ మరుసటి రోజే నాకు మళ్లీ ఇంకోసారి చూడాలనిపించింది. చాలా రోజుల తర్వాత చాలా సింపుల్‌ సినిమా, అందమైన సినిమా వస్తోంది. ఇది హీరోయిన్ చెప్పే కథ అయినా, కథలో ప్రతి పాత్రకూ ప్రాధాన్యం ఉంటుంది. ఈ సినిమాకు నేను డబ్బింగ్‌ చెప్పే పనైతే ఈ ఏడాది జూన్‌కు కాకుండా, వచ్చే ఏడాది జూన్‌కు వస్తుందేమో. ఎందుకంటే ఈ సినిమాలో డైలాగులతో పాటు వాయిస్‌ ఓవర్‌ కూడా ఎక్కువే. దాన్ని నేను హ్యాండిల్‌ చెయ్యగలనని అనుకోలేదు. అందుకే డబ్బింగ్‌ చెప్పలేదు.

ఫ్లాప్‌కు బాధపడతా

నేను అబద్ధం చెప్పను. హిట్లు వస్తే సంతోషిస్తాను. ఫ్లాపులొస్తే బాధపడతాను. ‘బ్రహ్మోత్సవం’ విషయంలోనూ అంతే. జయాపజయాలనేవి ప్రేక్షకుల చేతుల్లో ఉన్నాయి. మనం చేసే ప్రతి సినిమా హిట్టవ్వాలని లేదు. ఒక్కోసారి స్క్రిప్టుపరంగా బాగా ఉందనుకున్నది తెరమీద అంత బాగా రాకపోవచ్చు. బ్యాడ్‌ ఫిల్మ్‌ చెయ్యాలని ఎవరూ కోరుకోరు. సినిమా విజయానికి అదృష్టం కూడా తోడవ్వాలి.

పెళ్లి తర్వాతా నటిస్తా

పొద్దున్నే నిద్రలేచి.. ‘ఈ రోజు బాగుంటుందిలే’ అనుకుంటే, ఏదో ఓ పేపర్‌లో ‘సమంతకు పెళ్లి.. ఎవరితో పెళ్లి?’ అంటూ ఎవరెవరివో ఐదు పేర్లు రాసేసిన న్యూస్‌ కనిపిస్తుంది. ‘అమ్మబాబోయ్‌.. ఇతనితో నేను మాట్లాడి రెండు సంవత్సరాలైపోయిందే.. అతనితో నాకు పెళ్లా?’ అని నవ్వుకుంటాను. నేనెవర్ని, ఎప్పుడు పెళ్లి చేసుకుంటాననే విషయం నేనే చెబుతాను. పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో నటిస్తా.

వివక్షపై ఫిర్యాదు లేదు

ఓ స్త్రీగా నన్ను పురుషులతో పోల్చుకొని వివక్షకు గురైనట్లుగా నేనెప్పుడూ భావించుకోలేదు. జీవితమంటేనే పోరాటం. పోటీ అనేది పురుషులతో కావచ్చు, స్త్రీలతో కావచ్చు. లింగ వివక్షపై నాకెప్పుడూ దృఢమైన అభిప్రాయం లేదు. పురుషులతో పాటు స్త్రీలనూ సమానంగా చూడ్డం మొదలైంది. బాలీవుడ్‌లో ఇప్పటికే స్త్రీ ప్రధాన చిత్రాలు పెరుగుతున్నాయి. తెలుగులోనూ ఆ వాతావరణం వస్తుంది. నేనైతే ఈ విషయమై ఎవరిపైనా ఫిర్యాదు చెయ్యదలచుకోలేదు.

వీలైనంతమందికి గుండె ఆపరేషన్లు

మా ‘ప్రత్యూష సపోర్ట్‌’ ఫౌండేషన్ కోసం నిధుల సమీకరణ చేస్తున్నాను. దాని కోసమే జూలైలో అమెరికా వెళ్తున్నాను. అక్కడి ఓ ఫౌండేషన్ వాళ్లు ఆహ్వానించారు. ఇవాళ గుండె ఆపరేషన్ చేయించుకోవాలంటే చాలా ఖర్చవుతోంది. ఆ ఆపరేషన్ల కోసం మా వద్దకు చాలామంది వస్తున్నారు. వారిలో నిజంగా ఎవరికి ఆపరేషన్ అవసరమనేది మా బృందంలోని డాక్టర్‌ మంజుల చూసుకుంటారు. ఈ విషయంలో వీలైనంత మందికి సాయం చెయ్యాలనేది నా సంకల్పం. ఇప్పటివరకూ నిధుల సమీకరణకై ఎవరి సాయమూ తీసుకోలేదు.

అది తప్పంటాను

నిర్భయ తరహా దుర్ఘటనల వార్తలు విన్నప్పుడు చాలా బాధ కలుగుతుంది. ఇవాళ దేశంలోని చాలామంది మహిళలు ఎదుర్కొంటున్న దారుణమైన సమస్య అది. సో టెర్రిబుల్‌. ఈ ప్రపంచంలో మంచి విషయాలే జరగాలని కోరుకునే మనస్తత్వం నాది. ప్రభుత్వాలు చెయ్యాల్సిన పనులు చేస్తున్నాయి. ఇలాంటి దారుణాల్ని ఎలా ఆపాలో నాకు తెలీదు. కానీ ఏదైనా చెయ్యమంటే నా వంతుగా చెయ్యడానికి సిద్ధంగా ఉంటాను. నిర్భయ కేసులో నిందితులు రెండేళ్లలో విడుదలయ్యారు. మైనర్‌ అనే కారణంతో వాళ్లను విడుదల చేయడాన్ని నేనంగీకరించను. అది తప్పంటాను. వాళ్లను తిరిగి జైలులో పెట్టాలనేవాళ్లకు నేను మద్దతిస్తాను.

అమ్మ నన్ను కాపాడింది

మా కుటుంబంలోని అందరిలోకీ అమ్మతోటే ఎక్కువ అనుబంధం నాకు. నాన్న చాలా చాలా స్ట్రిక్టు. ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడరు. చిన్నప్పట్నించీ నాతోనూ అంతే. అమ్మ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ‘షి సేవ్డ్‌ మి’ అంటాను. నా చిన్నతనంలో మా కుటుంబం ఆర్థికంగా చాలా కష్టాలు పడింది. ఆ టైమ్‌లో అమ్మే అందరికీ ధైర్యం చెబుతూ వచ్చింది. నాన్నకు కోపమెక్కువ. అమ్మకు ఓర్పెక్కువ. ఆ ఓర్పుతోటే కుటుంబాన్నీ, నన్నూ నడిపించింది. ఇప్పటికీ నా వెనకాల అమ్మ ఉందనే ధైర్యంతో కెరీర్‌లో ముందుకు వెళ్తున్నాను.

- ఆంధ్రజ్యోతి డైలీ, 31 మే 2016.

Saturday, May 21, 2016

Profile of Director K.S.R. Das

Original Name: Konda Subba Rama Dasu
Born: 5 January 1936
Birth Place: Venkatagiri, Nellore District.
Parents: Seshamma and Chenchu Ramaiah
First Job: Bookin Clerk at Krishna Mahal Theatre at Guntur
First Job in Film Industry: Apprentice in Editing Dept. for the film BANDA RAMUDU
First film as a Director: Loguttu Perumallakeruka (1966)
Last film as a Director: Nagulamma (2000)
Trendsetter film as a Director: Mosagallaku Mosagadu (1971)
Died: 8 June 2012

Thursday, May 19, 2016

Short Story: Samskarana (Reform)


సంస్కరణ

మంచి సంబంధం ఒకటి వచ్చిందనీ, అమ్మాయిని చూసేందుకు రమ్మనీ, వచ్చే ముందు ఉత్తరం రాయమనీ తండ్రి జగన్నాథం నుంచి ఉత్తరం వచ్చింది వసంత్‌కి. శ్వేతకు చూపించాడు దాన్ని. చదివి నవ్వింది.
"చూసి రాపో."
"వేళాకోళమా" నెత్తిమీద మొట్టికాయ వేశాడు.
నాలుగు నెలల మూడు వారాల నుంచీ ఇద్దరూ కలిసి ఉంటున్నారు. "ఆడా, మగా కలిసి జీవించడానికి పెళ్లి అవసరమా?" అంటాడు వసంత్.
"పెళ్లి కాకుండా ఎట్లా సాధ్యమవుతుంది?" అంది మొదట్లో శ్వేత. అయితే ఆమెకు నాలుగు నిమిషాల్లాగే గడిచిపోయాయి ఈ నాలుగు నెలలు. ప్రేమలో ఉండే మాధుర్యం రుచి చూస్తున్నారు, సెక్స్ తప్పించి. శ్వేత ఇంకా స్టూడెంటే.
ఒక రాత్రి బాగా టెంప్టయ్యి సెక్స్ కావాలన్నాడు వసంత్.
"తప్పదా. కనీసం పరీక్షలయిన దాకా అయినా ఆగుతావనుకున్నా" అంది అతడి అవేశానికీ, బాధకీ చలిస్తూ. ఆమె మొహం వంక చూసి కంట్రోల్ చేసుకున్నాడు.
"పరీక్షలయ్యేంత వరకూ దీనితోనే తృప్తి పడతాను" అని పెదాల మీద ముద్దు పెట్టుకున్నాడు.
రక్తం పోరు పెడుతుంది. నరాలు గిలగిలా కొట్టుకుంటాయి. దేహాలు ఏదో కావాలంటాయి. కళ్లు ఏమేమో చెప్పుకుంటాయి. అయినా ఏదో అడ్డు తగుల్తుంటుంది. ఆగిపోతారు. కావలింతలతో, ముద్దులతో తృప్తి పడుతున్నారు. ఆమె ఫైనలియర్‌లో ఉంది. ఎం.ఏ. సోషియాలజీ చేస్తోంది. ఇంకెంతకాలమనీ. రెండు నెలలు ఓపిక పడితే చాలు. కానీ ఆ రెండు నెలలు తనకు రెండు యుగాలుగా ఉంటుందనుకుంటున్నాడు వసంత్.
పెళ్లి కాకుండా ఓ ఆడదీ - ఓ మగాడూ కలిసి ఉంటున్నారంటే లోకానికి ఆ జంట పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. అందులో దిగ్భ్రాంతి పాలు ఎక్కువ. ఎక్కువవుతున్నారు వాళ్లని గమనించేవాళ్లు. ఎవర్నీ లక్ష్యపెట్టకుండా గొప్ప సంతోషంతో రోజులు గడుపుతున్నారు ఇద్దరూ.
ఇప్పుడు జగన్నాథం నుంచి ఉత్తరం.
రెండు రోజులు డ్యూటికి సెలవుపెట్టి ఊరెళ్లాడు. దాపరికం ఇష్టంలేదు. తల్లి వరలక్ష్మితో చెప్పాడు శ్వేత అనే అమ్మాయీ, తనూ కలిసి ఉంటున్నట్లు.
వరలక్ష్మి బిత్తరపోయింది. కంగారు పడిపోయింది. లోకం సంగతి జ్ఞాపకం వచ్చి భయపడింది. ఏవేవో ఆలోచనలు వచ్చాయి. ఆ అమ్మాయిది ఏ కులమో? తమ కులమైతే కొంతలో కొంత నయం. కలిసి ఉంటున్నారంటే ఆ పిల్ల తనకేమవుతుంది? కోడలనొచ్చా? పెళ్లయితేనే కదా కోడలయ్యేది. ఓవేళ ఆ పిల్ల ఇక్కడకొస్తే చుట్టుపక్కల అమ్మలక్కలకు ఏమని పరిచయం చేస్తుంది? కొడుక్కి ఏమవుతుందని చెప్పాలి? స్నేహితురాలనా, ప్రియురాలనా? అదేంది.. ఆ.. రూమ్మేట్ అనా?
కొడుకుపై ఆమెకు కోపం వచ్చింది పీకల దాకా. ఎట్లా ప్రదర్శించాలో తెలీలేదు చప్పున. రోజులు మారిపోతున్నాయి. తరానికీ తరానికీ మార్పు వస్తోంది, వేగంగా. స్పీడు ఎక్కువవుతోంది జీవనంలో. ఒక్కటొక్కటే తెగిపోతున్నాయి కట్టుబాట్ల సంకెళ్లు. ఇవేవీ అర్థం చేసుకోగల పరిజ్ఞానం లేదు వరలక్ష్మికి.
"పెళ్లి కాకుండా ఎవరో అమ్మాయితో కలిసి ఉండటమేమిట్రా?" అంది వరలక్ష్మి.
"మేం ప్రేమించుకున్నామమ్మా. కలిసి ఉండాలని నిర్ణయించుకున్నాం."
"ఆ పిల్లకి ఎవరూ లేరా?"
"ఎందుకు లేరు? అమ్మా, నాన్నా.. అంతా ఉన్నారు."
"మరా పిల్ల ఇట్లాంటి పనిచేస్తే ఊరుకున్నారా?"
"ఇట్లాంటి పనంటే - ఇది ఘోరమైన పనా. వాళ్లు ఊరుకున్నారో లేదో అక్కడికి వచ్చి శ్వేతనే అడుగు."
"తప్పు కదరా అట్లా ఉండటం. నలుగురూ ఏమనుకుంటారు. ఎంత ఎగతాళి అయిపోతాం అందరిలో. గౌరవం, మర్యాదా ఉంటాయా మనకి."
"గౌరవం, మర్యాదా అనేవి మనం ఊహించుకునే దాన్నిబట్టి ఉంటాయమ్మా. నా దృష్టిలో మేం చేసిన పని ఎంత మాత్రమూ తప్పుకాదు. మా ఇద్దరికీ అది ఇష్టమైన పని ఐనప్పుడు ఇంకొకరు మా విషయంలో ఎందుకు తలదూర్చాలి?" అన్నాడు ప్రశాంతంగానే.
అప్పుడే వచ్చాడు జగన్నాథం ఇంట్లోకి. సాధారణంగా చాలా తక్కువగా మాట్లాడతాడతను.
"విన్నారా.. వీడూ, ఇంకో అమ్మాయీ కలిసి ఉంటున్నారట" చెప్పింది వరలక్ష్మి.
"నిజమా! ఏరా, అద్దె కలిసి వస్తుందనా?"
వచ్చే నవ్వును ఆపుకున్నాడు వసంత్. "లేదు మేం ప్రేమించుకున్నాం."
"అదేంట్రా. నేను ఉత్తరం రాశాను కదా సంబంధం వచ్చిందనీ, అమ్మాయిని చూసేందుకు రమ్మనీ. అందలేదా?"
"అందింది. అందుకే అట్లాంటి ప్రయత్నాలేవీ అవసరం లేదని చెప్పేందుకే వచ్చాను."
"ఏవిటీ? ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోబోతున్నావా?"
"ఇంకా మేం పెళ్లి గురించి ఏం అనుకోలేదు."
బిత్తరపోయాడు జగన్నాథం. నోటెంట వెంటనే మాట రాలేదు. కలిసి ఉంటున్నామని చెప్తున్నాడు. మళ్లీ పెళ్లి మాట మాత్రం అనుకోలేదంటున్నాడు. ఈ రెంటికీ లంకె ఎట్లా కుదురుతుంది?
"నువ్వంటే మగాడివి. ఎట్లా చేసినా చెల్లుతుంది. పాపం ఆడపిల్ల. ఆ అమ్మాయి బతుకుతో ఆటలాడాలనుకుంటున్నావా?" - బాగా అడిగాననుకున్నాడు.
"ఎవరం ఎవరితో ఆటలాడుకోటం లేదు. ఇద్దరం ప్రేమించుకున్నాం. కలిసి ఉండాలనుకున్నాం. నాలుగు నెల్ల నుంచీ ఉంటున్నాం."
"పెళ్లి చేసుకోకుండా కలిసి ఉండేదేంట్రా. ఫలానా జగన్నాథం కొడుకు హైద్రాబాద్‌లో ఎవరో పిల్లని పెట్టుకొని ఉంటున్నాడని జనం అనుకుంటే మనకి ఎంత అప్రతిష్ఠగా ఉంటుందో ఆలోచించావా?"
"ఇందులో ఆలోచించడానికేమీ లేదు నాన్నా. నేను మీతో గొడవ పెట్టుకునేందుకు రాలేదు. ఉత్తరంలోనే రాసేవాడిని ఈ సంగతి. స్వయంగా చెబితేనే బాగుంటుందని శ్వేత అంటే వచ్చాను."
మళ్లీ గట్టిగా వసంత్‌ని అనేందుకు జంకాడు జగన్నాథం. గొణుక్కుంటూ ఉండిపోయాడు. కొడుకుతో మాట్లాడేందుకు మనస్కరించలేదు వరలక్ష్మికి కూడా. కొడుకు ఘోరమైన తప్పుపని చేశాడని ఆమె నమ్ముతోంది. బరితెగించినవాళ్లు తప్ప ఇట్లాంటి పనులు చేయరని ఆమె అభిప్రాయం.
మరో రోజు సెలవు ఉన్నా, ఉండబుద్ధికాక వసంత్ ఆ రోజు రాత్రే బయలుదేరి వచ్చేశాడు హైద్రాబాద్.
* * *
బాత్‌రూంలోకి పోబోతూ ఇంటి ముందు ఆటో శబ్దం వినపడ్డంతో ఆగి చూశాడు వసంత్. ముందు జగన్నాథం, తర్వాత వరలక్షీ దిగారు ఆటోలోంచి. ఆశ్చర్యపడ్తూ అమ్మానాన్నలకు ఎదురువెళ్లాడు. ఆటోవాడికి డబ్బులిచ్చి ఇంట్లోకి వచ్చారు.
"నువ్వు అట్లా వచ్చేశాక ఉండబట్టలేక మేం వచ్చేశాం" చెప్పింది వరలక్ష్మి. ఇంట్లోకి అడుగుపెడ్తూనే చుట్టూ కలియజూసింది. గతంలో తను వచ్చినప్పటికీ, ఇప్పటికీ చాలా మార్పు కనిపించింది.
కొత్త మనుషుల్ని చూడ్డంతోటే వాళ్లెవరై ఉంటారో ఊహించింది శ్వేత.
"మా అమ్మా నాన్నా.. ఈమే శ్వేత" - పరిచయం చేశాడు వసంత్. అప్పటిదాకా మనసులో ఎంతో కోపం ఉన్నా, అందమైన శ్వేత నవ్వూ, చొరవగా వచ్చి తన చేతులు పట్టుకోవడం.. వరలక్ష్మి కోపం తగ్గించాయి.
"నీకు టైమవుతోంది వసంత్. స్నానానికి వెళ్లిరా" అంది శ్వేత, కళ్లతోనే ఏం ఫర్వాలేదని చెప్తూ.
'వసంత్‌ని అట్లా పేరుపెట్టి పిలుస్తోందేమిటి ఈ పిల్ల, బొత్తిగా మర్యాద లేకుండా. రోజులిట్లా తయారవుతున్నాయేమిటో?' అనుకుంది వరలక్ష్మి.
"మీరు కూర్చోండి. టీ కలుపుకొని తెస్తాను" అని వంటగదిలోకి వెళ్లింది శ్వేత. తనూ వెళ్లింది వెనకాలే - వరలక్ష్మి.
"నువ్వు కాలేజీకి వెళ్తున్నావంట గదమ్మా. అబ్బాయి చెప్పాడు."
"అవునండి. నన్ను కాలేజీ వద్ద దింపి తను ఆఫీసుకి వెళ్తాడు."
"అమ్మాయ్. నాకు తెలీకడుగుతాను. పెళ్లి చేసుకోకుండా ఇట్లా ఒకే ఇంట్లో ఉండటం ఏవన్నా బాగుందా?"
"ఒక ఆడా, మగా ప్రేమించుకొని కలిసి ఉండాలని దృఢంగా నిశ్చయించుకున్నప్పుడు పెళ్లి అవసరం లేదని వసంత్ అభిప్రాయం. మీలాగే మొదట్లో నాకూ అది కష్టమనిపించింది. ఇప్పుడయితే నా అభిప్రాయం మార్చుకున్నాను."
"మా కుటుంబాల్లో ఏ ఒక్క మగాడికీ ఇట్లాంటి ఆలోచనలు లేవు. వీడికే ఇట్లాంటివి ఎందుకు వస్తాయో అర్థం కాదు. చిన్నప్పట్నించీ అంతే. పాలచెట్టు పేరు ఎప్పుడన్నా విన్నావమ్మాయ్. మా ఇంటిపక్క ఉండేది ఓ చెట్టు. చాలా రుచిగా ఉంటాయ్ పాలపళ్లు. ఆ స్థలం కలవాళ్లు వాళ్లవసరం కోసం చెట్టు కొట్టేస్తుంటే అక్కడున్న పిల్లలంతా సంతోషంగా కొమ్మలకి ఉన్న పళ్లు తెంపుకు తింటుంటే వీడు భోరున ఏడ్చేశాడు చెట్టు కొట్టేస్తున్నారని. పైగా చెట్టు కొట్టేస్తున్నవాళ్లతో పోట్లాట పెట్టుకున్నాడు. వీడు ఏడుస్తూ అడిగే మాటలకి వాళ్లు తెల్లముఖం వేశారనుకో. అట్లా ఉంటుంది వీడి వరస. సరే, ఇంతకీ మీది ఏ కులం అమ్మాయ్?"
ఆమె నోటినుంచి ఈ ప్రశ్న తప్పకుండా వస్తుందని ముందే గ్రహించింది శ్వేత. తనేం చెప్పినా ఆమె అర్థం చేసుకోగలదన్న నమ్మకం లేదు. తరతరాలుగా కొనసాగుతూ వస్తున్న కుల వ్యవస్థ తాలూకు జీవం నరనరాన ప్రవహిస్తున్న వరలక్ష్మి తన మాటల్ని అర్థం చేసుకుంటుందా?
"కులం గురించి మీకంత పట్టింపు ఎందుకో తెలుసుకోవచ్చా?"
శ్వేత ప్రశ్నకి విసురుగా చూసింది వరలక్ష్మి. 'ఇంత పెద్దదాన్ని పట్టుకొని తన్నే ఎదురు ప్రశ్న వేస్తుందా ఈ బుడత, బొత్తిగా గౌరవం లేకుండా' అన్నట్లు చూసింది.
"అదేంటమ్మాయ్. ఏ కులం వాళ్లకైనా ఆ కులం గురించి పట్టింపు ఉండదా. మన పెద్దవాళ్లు పెట్టిన కట్టుబాట్లని కాదనడానికి మనమెవరం? వాళ్లు పిచ్చివాళ్లా?". వరలక్ష్మి అన్నదానికి నవ్వుతూ చూసింది శ్వేత.
"అసలు కులం ఎందుకు పుట్టిందో తెలిసి ఉంటే మీరిలా అనేవాళ్లు కాదండీ. కులాలు ఏర్పడక ముందు సమాజంలో వర్ణ వ్యవస్థ ఉండేది. బుద్ధుణ్ణి మీరు గొప్పవాడని ఒప్పుకుంటారు కదా. ఆయనే ఈ వర్ణ వ్యవస్థని వ్యతిరేకించాడు."
"కులాలు తెలుసు కానీ వర్ణ వ్యవస్థేమిటి?"
"వర్ణాలంటే - బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులని అప్పుడు నాలుగు వర్ణాల వాళ్లుండేవాళ్లు. మిగతా మూడు వర్ణాలవాళ్లూ శూద్రుల్ని హీనంగా చూసేవాళ్లు - ఇప్పుడు హిందువులు దళితుల్ని చూస్తున్నట్లు. ఎవరు ఏ వర్ణానికి చెందుతారనేది పుట్టుకనిబట్టి నిర్ణయించే ఈ వర్ణ వ్యవస్థని బుద్ధుడు ఖండించాడు. అయితే అందుకు విరుద్ధంగా బ్రాహ్మణులు వర్ణ వ్యవస్థని జనంలో ప్రచారంలోకి తెచ్చారు."
"బుద్ధుడు ఒప్పుకోకపోతే ఆయన్ని దేవుడిగా కొలిచే జనం మాత్రం ఎందుకు ఈ వర్ణాల్ని పట్టుకున్నారు?" అడిగింది వరలక్ష్మి, ఈ ప్రశ్నకి జవాబు ఉందా? అని చూస్తూ.
"దానికి పెద్ద చరిత్రే ఉందండీ. కొద్ది మాటల్లో చెప్తాను. ఆ రోజుల్లో సమాజంలో స్వయంపోషక గ్రామీణ వ్యవస్థ అనేది ఒకటి ఏర్పడింది. దీనివల్ల అంతదాకా సాగుతూ వచ్చిన దూరప్రాంత వర్తకం దెబ్బతింది. స్వయంపోషక గ్రామీణ వ్యవస్థ అంటే తమ అవసరాల్ని తామే తీర్చుకొనే వ్యవస్థ అన్నమాట. అందుచేత ఈ వర్తకంతో ముడిపడివున్న బౌద్ధ విహారాలనేవి క్షీణించిపోయాయి. బౌద్ధ మతానికి ఉన్న సామాజిక పునాది కూడా పోయింది. ఇక వర్ణాలనేవి స్వయంపోషక గ్రామీణ వ్యవస్థకి అతికాయి కాబట్టే వర్ణ వ్యవస్థ వేళ్లూనుకుపోయింది."
"వర్ణాల గురించి చెబుతున్నావే కానీ కులాల సంగతి చెప్పవేం?"
"వాటి దగ్గరకే వస్తున్నాను. కాలక్రమంలో వర్ణాల స్థానంలోనే కులాలు వచ్చాయి. నాలుగు వర్ణాల మధ్య వర్గ సంకరం జరిగినందువల్ల కులాలన్ని ఏర్పడ్డాయని మనువు అనే ఆయన ఒక కల్పన చేశాడు. ఆయన కల్పనని తర్వాత బ్రాహ్మణులు ఓ శాస్త్రంగా కొనసాగించారు. ఫలితంగా ఇప్పుడున్న కుల వ్యవస్థ సాగుతూ వస్తోంది" చెప్పి టీ కలిపింది శ్వేత.
ఆమె చెప్పినదంతా ఆశ్చర్యంగా వింది వరలక్ష్మి. ఆమెకి కొంత అర్థమైంది, కొంత కాలేదు. అయినా ఇంత చిన్న వయసులో ఈ సంగతులన్నీ ఎట్లా తెలిశాయి ఈ పిల్లకి? అదే అడిగింది.
"చదువుకోవడం చేత" చెప్పింది శ్వేత.
నిజమే. తను చదువుకోలేదు. అందుకే ఈ సంగతులేవీ తెలీదు. అయితే చదువుకున్న వాళ్లందరికీ ఈ సంగతులు తెలుసు కదా. ఈ కులాల్లో మంచంటూ లేకపోతే వాళ్లెందుకు ఊరుకుంటున్నారు? కులాల మధ్య పోట్లాటలు ఎందుకు సాగుతున్నాయి? తమ ఊళ్లోనే రెండు కులాల మధ్య గొడవలు వచ్చి ఒకళ్లనొకళ్లు కత్తులతోటీ, కటార్లతోటీ పొడిచి చంపుకోడం తనకు తెలుసు. మరెందుకు ఇవన్నీ జరుగుతున్నాయి?
ఆమె సందేహం తెలుసుకొని "ముందు టీ తీసుకోండి" అని ఆమెకో కప్పు ఇచ్చి, ముందుగదిలోకి వచ్చి జగన్నాథానికో కప్పు ఇచ్చింది.
వసంత్ స్నానం చేసి బట్టలేసుకు వచ్చాడు.
"నువ్వు కూడా రెడీకా" అన్నాడు శ్వేతను ఉద్దేశించి.
"ఈ రోజు నేను సెలవు పెడుతున్నాను."
శ్వేత వంక ఆశ్చర్యంగా చూశాడు వసంత్. కళ్లతోనే సందేహ నివృత్తి చేసింది.
"అబ్బాయికి కూడా టీ ఇవ్వమ్మా" అంది వరలక్ష్మి.
"లేదండీ. తను ముందు టిఫిన్ చేశాకే" చెప్పింది శ్వేత.
ఈ పిల్ల అప్పుడే వసంత్ మీద పెత్తనం చేస్తోందా అన్నట్లు చూసింది వరలక్ష్మి. ఆమె తన గురించి ఏమనుకుంటుందో గ్రహించుకొని చిన్నగా నవ్వుకుంది శ్వేత.
వసంత్ ఆఫీసుకు వెళ్లిపోయాడు. జగన్నాథం టాయిలెట్‌లోకి వెళ్లాడు. అప్పుడు వరలక్ష్మితో అంది శ్వేత - "మీరిందాక ఓ ప్రశ్న అడిగారు కదా. చెప్తాను. ప్రతి కులం వారూ తమ కులం మీద విపరీతమైన అభిమానం పెంచుకున్నారు. తరతరాలుగా ఇది కొనసాగుతూ వస్తోంది. వాళ్లలో చదువుకున్న వాళ్లకు కులాలు ఎందుకు పుట్టాయో తెలుసు. అయినా తెలీనట్లే ఉంటారు. అహంభావం అనేది వాళ్లనట్లా చేస్తుంది. 'ముందు ఎదుటివాడ్ని సంస్కరణకు ఒప్పుకోమను. అప్పుడు నేనూ ఒప్పుకుంటాను' అనే మనస్తత్వం మనది. ఇక కుల నిర్మూలన ఎట్లా సాధ్యమవుతుంది? ప్రభుత్వాలు కూడా కులాన్ని పెంచి పోషిస్తున్నప్పుడు ఇక అది అసాధ్యమనే అనుకోవాలి."
చెప్పి వరలక్ష్మి ముఖంలోకి చూసింది. తాను చెప్పింది ఆమెకు కొంచెం కూడా అర్థమై ఉండదని అనిపించింది. ఆమెతో ఇట్లా సంభాషించడం వృథా అని తోచింది.
"ఏమోనమ్మాయ్. నువ్వెనయినా చెప్పు. మా ఆయన కంటే నీకెక్కువ తెలుసుంటుందని నేననుకోను. ఎందుకొచ్చిన తగలాటం. పరువుపోవడం తప్ప. మీరిట్లా ఉండటం ఏం బావుంటుంది? మావాడంటే మూర్ఖుడు. మగాడు కాబట్టి వాడికొచ్చే నష్టంతో పోల్చుకుంటే నీకొచ్చే తిప్పలు చాలా ఎక్కువ. శుభ్రంగా మీ వాళ్ల దగ్గరకి వెళ్లిపో. అందరికీ బావుంటుంది."
వచ్చే కోపాన్ని బలవంతాన అదిమిపెట్టింది శ్వేత.
"ఎ మాటే వసంత్ వచ్చాక అతనితో చెప్పండి" అంది.
* * *
కొద్దికాలం గడిచాక జగన్నాథం నుంచి ఇంకో ఉత్తరం వచ్చింది వసంత్‌కి.
"ఒరేయ్. నువ్వు చేసిన పనికి ఇక్కడందరూ ఉమ్మేస్తున్నారు. మా పెంపకం సరిగాలేదు కాబట్టే నువ్విట్లా తయారయ్యావంటున్నారు మీ బాబాయిలూ, మీ మావయ్యలూ. తెలిసిన ప్రతివాడూ వచ్చి 'మీవాడు హైద్రాబాద్‌లో ఎవతెనో ఉంచుకున్నాడంటగా' అంటుంటే నా నెత్తురు ఎట్లా మరుగుతుంటుందో అర్థం చేసుకో. వాళ్ల తాకిడికి బయటకి వెళ్లాలంటేనే దడగా ఉంటోంది. నువ్వు చేసిన వెధవ పని మీ బావకీ తెలిసి నీ చెల్లెల్ని నానా మాటలూ అంటూ, మన వంశాన్నంతా తిడుతూ కొడుతూ ఉంటే భరించలేక అది పుట్టింటికి చేరింది. ఎట్లాగో నచ్చెజెప్పి మళ్లీ అత్తగారింటికి తీసుకుపోతే అల్లుడు నన్ను కూడా ఇష్టమొచ్చినట్లు మాట్లాడాడు. ఈ జన్మలో మొదటిసారిగా ఒకరి కాళ్లు పట్టుకోవాల్సొచ్చింది.
దయచేసి నువ్వు ఈ ఛాయలకి రామాకు. ఏ కూస్తో ఉన్న శాంతి కూడా పోతుంది. నువ్వు పాటిస్తావన్న నమ్మకం లేకపోయినా నాదో సలహా. 'ఎవతెనో ఉంచుకున్నాడు' అనే మాట నీకు బాగానే ఉంటుందేమో కానీ జనానికి ఎబ్బెట్టుగా ఉంటుంది. కాబట్టి కనీసం ఆ పిల్లని పెళ్లయినా చేసుకుంటే కొంత నయంగా ఉంటుంది.
నీ దయవల్ల మీ అమ్మకి అదే నా భార్యకి అనారోగ్యం అమోఘంగా ఉంటోంది.
- ఇట్లు, జగన్నాథం."


- ఆంధ్రభూమి ఆదివారం, 27 ఏప్రిల్ 1997



Tuesday, May 10, 2016

Poetry: Break

విరామం

ఒక్కో షిఫ్టులో మాకు రెండు అరగంట బ్రేకులుంటాయి
పెడళ్లను తొక్కడం మేం ఆపగానే అంతంత భారీ యంత్రాలు
గోలపెట్టడం ఆపి నిశ్శబ్దమవుతాయి
మా చేతుల్లోనే అక్కడి లోహపు గొలుసులు పురుడు పోసుకుంటాయి
వాటిని వొంచుతాం, వొత్తుతాం, వెల్డింగ్ చేస్తాం,
సైజుల వారీగా ట్రిమ్మింగ్ చేస్తాం
యంత్రాల వేగంతో మా చేతులు పోటీపడుతుంటాయి
గొలుసు పుట్టాక నాణ్యతను పరీక్షిస్తాం
ప్యాకింగ్ చేసి ఫ్యాక్టరీ నుంచి సాగనంపుతాం
మా ఎమ్డీ విశాలమైన ఏసీ ఆఫీస్ పక్కనే
ఇరుకు కాంక్రీట్ నడవాలోంచి కిందుగా ఉండే గదికి
ఒకర్నొకరం నెట్టుకుంటూ పోతాం
మేం మనస్ఫూర్తిగా యంత్రాల్ని తాకాలనుకొనేది అక్కడే
మా కోసమే అవి ఎదురు చూస్తుంటాయి, కూనిరాగాలు ఆలపిస్తుంటాయి
ఆ యంత్రాలు మా వేళ్లను తెగ్గొట్టాలనుకోవు, నలగ్గొట్టాలనుకోవు
అక్కడి యంత్రాలు మాకు నీళ్లనిస్తాయి,
చాయ్ సమోసా బిస్కెట్‌నిస్తాయి
మా జేబుల్లోని వేడి వేడి నాణేల్ని మార్చుకోవడంలో
మా చేతులు తగిలి ఆ ఇత్తడి చక్రాలు మురికవుతాయి
లంచ్ బెల్ మోగిందంటే కాస్త ఊపిరి సలుపుతుంది
కొన్నిసార్లు మేం ఫ్యాక్టరీలోని వేడి, మడ్డి, జిడ్డుకు దూరంగా
తింటానికీ, 'టీ'కీ బయటకు వెళ్తుంటాం
టీ తాగి, తాజా చార్మినార్ సిగరెట్ దమ్ములు లాగి
మరి కొన్ని గంటల పాటు పని చెయ్యడానికి శక్తి నింపుకుంటాం
మళ్లీ రణగొణ ధ్వనుల ఫ్యాక్టరీకొచ్చేస్తాం
మా మెదడులేని శరీరాలు ఎప్పట్లాగే ఒకే రకమైన పని చేస్తుంటాయి
మోటార్ సైకిళ్ల గొలుసులు, భారీ యంత్రాల గొలుసులు పుట్టిస్తుంటాయి
మరుసటి రోజూ అదే పని మా కోసం ఎదురుచూస్తుంటే
మేం మొదటి బ్రేక్ కోసం ఎదురుచూస్తుంటాం.

- కవి సంగమం, 5 ఏప్రిల్ 2016.

Thursday, May 5, 2016

Profile of actress Devika

Original Name: Mohana Krishna
First Screen Name: Mohana Krishna (Puttillu and Pakkinti Ammayi)
Second Screen Name: Prameela (with Rechukka)
Third Screen Name: Devika (with Tamil film Mudhalali)
Last film as heroine: Rajakota Rahasyam (1971)
Film film as a character artiste after heroine: Pandanti Kapuram
Husband: Devadas (Tamil director)
As a producer: Tamil film Vengulippen (1971)
Died: 2 May 2002