Thursday, June 9, 2011

ఇంటర్వ్యూ: చిన్నికృష్ణ

"ఇది బాగా పులిసిపోయిన పాత చింతకాయ పచ్చడి తరహా కథ కాదు. నాకు తెలిసి భారతదేశంలోని ఏ భాషలోనూ ఇంతవరకు ఈ కథలోని 'సంఘర్షణ' (కాన్‌ఫ్లిక్ట్)తో సినిమా రాలేదు'' అని 'బద్రినాథ్' గురించి చెప్పారు కథా రచయిత చిన్నికృష్ణ. అల్లు అర్జున్, తమన్నా జంటగా వి.వి. వినాయక్ రూపొందించిన చిత్రం 'బద్రినాథ్'. గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా ఆ కథ తన మనసులో ఎలా పుట్టిందనే సంగతితో పాటు ఆ సినిమాకి సంబంధించిన అనేక అంశాల గురించీ తన కార్యాలయంలో ప్రత్యేకంగా సంభాషించారు చిన్నికృష్ణ. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే...
'ఇంద్ర' తర్వాత మొక్కు తీర్చుకునేందుకు కాశీకి నన్ను కూడా తీసుకెళ్లారు నిర్మాత అశ్వనీదత్‌గారు. అప్పుడు గంగని చూసిన ఆనందంలో పుట్టిన కథే 'గంగోత్రి'. పెట్టుబడికి నాలుగు రెట్లు వసూలు చేసింది. ఆ సినిమా ద్వారా పరిచయమైన అల్లు అర్జున్ ఈ రోజు స్టార్‌గా ఎదగడం హ్యాపీ. ఆ సినిమా సాధించిన విజయంతో గంగమ్మ తల్లి రుణం తీర్చుకోవాలని గంగోత్రి వెళ్లా. అక్కణ్ణించి తిరుగు ప్రయాణమైనప్పుడు తల్లిని వదిలేసి వస్తున్న బాధ కలిగింది. ఆ ప్రయాణంలో అనుకోకుండా 'బద్రినాథ్' అనే పుస్తకం చదివా. హిమాలయాల్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బద్రినాథ్‌కి సంబంధించిన పుస్తకం అది. అందులోని ఓ విశేషం నన్ను విపరీతంగా ఆకర్షించింది. అదేమంటే అక్కడ గుడిని ఆర్నెల్లు తెరచి, ఇంకో ఆర్నెల్లు మూసి ఉంచుతారు. మూసేప్పుడు వెలిగించిన జ్యోతి తిరిగి గుడి తెరిచే దాకా ఎలాంటి ప్రయత్నమూ లేకుండానే ఆర్నెల్ల పాటు నిరంతరాయంగా వెలుగుతుంటుంది. ఈ ప్రపంచంలో ఎక్కడాలేని అద్భుతమైన వింత! దాంట్లో నిజమెంతో తెలుసుకోవాలని తోచింది. బద్రినాథ్ వెళ్లా. ఆ గుడి మూసే సమయంలోనూ, ఆర్నెల్ల తర్వాత మళ్లీ తెరిచే సమయంలోనూ వెళ్లా. జ్యోతి వెలుగుతూ ఉంది. నిజం! అప్పుడు తట్టిన ఆలోచనతో పుట్టిన కథే 'బద్రినాథ్'.
స్వచ్ఛమైన ప్రేమకథ
హీరో బద్రినాథ్‌కి ఎందుకెళ్లాడు, హీరోయిన్ ఎందుకెళ్లింది అన్నది కథలోని భాగం. అందరూ భావిస్తున్నట్లు ఇది యాక్షన్ సినిమానో, రెండు వర్గాల మధ్య గొడవల కథనో, పక్కా మాస్ సినిమానో కాదు. ఇది అందమైన, స్వచ్ఛమైన ప్రేమకథ. ఆ ప్రేమకథలో మాస్ ఎలిమెంట్స్, ఎమోషనల్ సీన్లు, యాక్షన్ ఎపిసోడ్స్ అన్నీ అవసరం మేరకు ఉంటాయి. 'నమ్మకం' అనే ఎమోషన్‌ని ప్రధానం చేసుకుని అల్లిన కథ ఇది. నేను మొదట స్క్రిప్టులోని చివరి పేజీ రాసి, చివరగా మొదటి పేజీ రాస్తా. స్క్రిప్టు రచనలో ఇదో పద్ధతి. మొదట కేరక్టర్ అనుకుని, ఆ కేరక్టర్ చుట్టూ సన్నివేశాలల్లడం నాకు తెలీదు. మొదట విషయం నిర్ణయించుకుని, ఆ తర్వాత పాత్రల్ని సృష్టిస్తా.
వినాయక్ సరైన దర్శకుడు
నిజానికి ఈ కథ రెండు, మూడు ఆఫీసులకెళ్లి తిరిగొచ్చింది. ఒకప్పుడు నా దర్శకత్వంలోనే దీన్ని తీయాలనుకున్నా. వీలు పడలేదు. దాంతో నేను దర్శకత్వం చేయడం ముఖ్యం కాదనీ, 'బద్రినాథ్' కథ త్వరగా జనంలోకి వెళ్లడమే ముఖ్యమనీ రియలైజ్ అయ్యా. అలా వినాయక్ దర్శకత్వంలో ఇప్పుడు జనంలోకి వస్తోంది. ఇప్పటికే ఈ సినిమాని మూడు సార్లు చూశా. వినాయక్ తీసినంత బాగా నేను తీసేవాణ్ణి కాదేమోననీ, వినాయక్ సరైన డైరెక్టర్ అనీ అనిపించింది. ప్రేక్షకుడికి ఓ సినిమా చూస్తున్న ఫీలింగ్ కాక, బద్రినాథ్‌లో ఉన్న ఫీలింగే కలుగుతుంది. అంత బ్రహ్మాండంగా తీశాడు.
అర్జున్‌కి ఆకాశమే హద్దు
అర్జున్ హీరో కావడంలో చిన్నికృష్ణ పాత్ర ఎంతో ఉందని 'గంగోత్రి'ని దృష్టిలో పెట్టుకుని అంటుంటారు అల్లు అరవింద్. అర్జున్‌కి అన్ని భాషల్లోనూ స్నేహితులైన హీరోలున్నారు. ఈ సినిమా చూస్తే, వాళ్లంతా అతన్ని విపరీతంగా మెచ్చుకుంటారు. సిక్స్ ప్యాక్ శరీరాన్ని ప్రదర్శించడమే కాదు, సంకట స్థితుల్లో, భావోద్వేగ సన్నివేశాల్లో, త్యాగాన్ని ప్రదర్శించే సందర్భాల్లో, యాక్షన్ సీన్లలో 'ఆకాశమే హద్దు' అన్నట్లు చెలరేగిపోయాడు అర్జున్. పతాక సన్నివేశాల్లో అలకనంద పాత్రలో తమన్నా చేసిన అభినయం అపూర్వం. ఇప్పుడున్న వాళ్లలో ఆ పాత్రకి సరిగ్గా సరిపోయే నటి ఆమె మాత్రమే.
సమస్యా, పరిష్కారమూ...
ఇది బాగా పులిసిపోయిన పాత చింతకాయ పచ్చడి తరహా కథ కాదు. నాకు తెలిసి భారతదేశంలోని ఏ భాషలోనూ ఇంతవరకు ఈ కథలోని 'సంఘర్షణ' (కాన్‌ఫ్లిక్ట్)తో సినిమా రాలేదు. అయితే ఆ సంఘర్షణ కూడా అంతర్లీనంగానే ఉంటుంది. అంతర్జాతీయ చిత్రానువాద పద్ధతులకి (ఇంటర్నేషనల్ స్క్రీన్‌ప్లే మెథడ్స్) తగ్గట్లు నేను, వినాయక్ కలిసి స్క్రీన్‌ప్లే చేశాం. సన్నివేశాలన్నీ కొత్తగా ఉంటాయి. ఓ కొత్త సమస్యా, దానికి పరిష్కారమూ ఈ సినిమాలో ఉంటాయి. ప్రేక్షకులు స్క్రిప్టుతో పాటు ప్రయాణిస్తారా, లేదా.. అన్న సంగతిని దృష్టిలో పెట్టుకుని దీన్ని తయారుచేశాం.
ఎన్నెన్నో విశేషాలు
ఇందులో ఎన్నో విశేషాలున్నాయి. వాటిలో ఒకటి సరస్వతి నదిని చిత్రీకరించడం. మిగతా నదులన్నీ ఎంతో దూరం నేలమీద పారుతుంటాయి. కానీ సరస్వతి నది మాత్రం భూగర్భంలో పారుతూ, భూ ఉపరితలం మీదికొచ్చి, కొద్ది దూరం తర్వాత మళ్లీ భూగర్భంలోకి వెళ్లిపోతుంది. ఈ సినిమా ఇంత గొప్పగా రావడంలో అరవింద్ బాగా ఎఫర్ట్ పెట్టారు. ఈ సినిమా ఎట్లాగైనా చెయ్యాల్సిందేనని గట్టిగా పట్టుబట్టిన వ్యక్తి మాత్రం (ఠాగూర్) మధు. స్క్రిప్టుని గట్టిగా నమ్మి ఖర్చు పెట్టారు. పెట్టిన డబ్బంతా వస్తుందనే నమ్మకం ఉంది.
దర్శకత్వం మీద దృష్టి లేదు
'నందీశ్వరుడు' నా డ్రీమ్ ప్రాజెక్టు. దాన్ని బాలకృష్ణ చెయ్యాలనేది నా కోరిక. దాన్ని నేను డైరెక్ట్ చెయ్యాలని అనుకోవట్లేదు. ఇప్పుడు నా దృష్టి డైరెక్షన్ మీద లేదు. కథలు ఇవ్వడం మీదే. 'జీనియస్' పూర్తి స్క్రిప్టుని దర్శక నిర్మాతలకి అప్పగించా. ఎప్పుడు తీస్తారనేది వాళ్ల చేతుల్లో ఉంది.

Monday, June 6, 2011

ట్రైలర్: బుడ్డా హోగా తేరా బాప్

వ్యక్తిత్వం: డి. రామానాయుడు

అవిశ్రాంత సినీ శ్రామికుడు
నిజం. ఆయన అవిశ్రాంత సినీ శ్రామికుడు. డెబ్భై ఐదేళ్ల నవ యవ్వనుడు. చిత్ర నిర్మాతగా ఎన్నడో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు పొంది, నలభై ఎనిమిదేళ్లుగా సినిమాలు నిర్మిస్తూ, నేటి తెలుగు చిత్రసీమ మూలస్తంభాల్లో ఒకరుగా పేరుపొందిన మూవీ మొఘల్. ఆయనే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత డాక్టర్ దగ్గుబాటి రామానాయుడు. నలభై ఏడేళ్ల క్రితం ఆయన నెలకొల్పిన సురేశ్ మూవీస్ తెలుగు చిత్ర నిర్మాణ సంస్థల్లో నేటికీ అగ్రగామిగా వెలుగొందుతుండటం అసాధారణం.
ప్రకాశం జిల్లా కారంచేడు నుంచి మద్రాసు వెళ్లి 'అనురాగం' చిత్రాన్ని భాగస్వామితో కలిసి నిర్మించడం ద్వారా 1963లో చిత్రసీమలో అడుగుపెట్టిన ఆయన ఆ మరుసటి ఏడాదే సోలోగా ఎన్టీఆర్‌తో 'రాముడు భీముడు' నిర్మించి, సంచలన నిర్మాతగా మారిన సంగతి ఓ చరిత్ర. ఆరేళ్ల తర్వాత కష్టాల కడలి ఈదుతూ ఇక సినిమాలకు 'రాం రాం' చెప్పక తప్పదనుకునే పరిస్థితిని ఎదుర్కొని, అక్కినేని-వాణిశ్రీ జంటగా నిర్మించిన 'ప్రేమనగర్'తో పడిలేచిన కెరటమైన ఆయన, ఇక వెనుతిరిగిందే లేదు. శ్రీకృష్ణ తులాభారం, చక్రవాకం, సోగ్గాడు, సెక్రటరీ, సావాసగాళ్లు, మండే గుండెలు, దేవత, ముందడుగు, ప్రతిధ్వని, అహ నా పెళ్లంట, ఇంద్రుడు చంద్రుడు, బొబ్బిలి రాజా, కలిసుందాం రా, మల్లీశ్వరి వంటి ఎన్నో సినిమాలు ఆయన నిర్మాణ దక్షతకు నిదర్శనాలు.
పెద్ద కుమారుడు సురేశ్‌ని తన వారసుడిగా నిర్మాతని చేసిన ఆయన చిన్న కుమారుడు వెంకటేశ్‌ని 'కలియుగ పాండవులు'తో హీరోని చేశారు. ఇవాళ ఆ ఇద్దరూ తమ తమ రంగాల్లో అగ్ర స్థాయిని ఆస్వాదిస్తుండటం తెలిసిందే.
ఓ నిర్మాతగా ఎంతోమంది తారల్నీ, సాంకేతిక నిపుణుల్నీ పరిచయం చేసిన ఆయన తన సేవల్ని నిర్మాణ రంగం బయట కూడా విస్తరింపజేశారు. సినిమా షూటింగుల కోసం రామానాయుడు స్టూడియోస్‌ని నెలకొల్పిన ఆయన అందులో సినిమా పోస్ట్ ప్రొడక్షన్ సౌకర్యాల్నీ ఏర్పాటు చేశారు. ఇక డిస్ట్రిబ్యూషన్, ఎగ్జిబిషన్ రంగంలోనూ ఆయన అగ్రగామిగా వెలుగొందుతున్నారు.

హైదరాబాద్‌తో పాటు వైజాగ్‌నీ సినీ హబ్ చేయాలనే సంకల్పంలో భాగంగా పాతికెకరాల సువిశాల స్థలంలో సముద్రానికి అతి దగ్గరగా ఆయన నెలకొల్పిన రామానాయుడు స్టూడియోస్ ఇప్పుడు ఎంతోమంది నిర్మాతల్ని ఆకర్షిస్తోంది. నటుడిగానూ ఆయన కొన్ని సినిమాల్లో కనిపించారు. ఇటీవలి కాలంలోనే 'హోప్' అనే సినిమాలో ప్రధాన భూమిక ధరించి, ఉత్తమ నటనని ప్రదర్శించి, విమర్శకుల ప్రశంసల్పి సైతం అందుకున్న ప్రజ్ఞాశాలి రామానాయుడు. ప్రస్తుతం రాజకీయ రంగానికి దూరంగా ఉన్నప్పటికీ ఉన్న కొద్ది సంవత్సరాల్లో ఆ రంగంలోనూ తనదైన ముద్ర వేసిన సేవాతత్పురుడు. బాపట్ల పార్లమెంటు సభ్యునిగా పదవిలో ఉన్న కాలంలో ఆయన చేపట్టిన ప్రజా సేవా కార్యక్రమాలు నిరుపమానం. ఇందుకోసం ఆయన ఎంపీ నిధుల్నే కాక సొంత డబ్బునీ ఖర్చు చేసి తన సేవా నిరతిని చాటుకున్నారు.
అటువంటి ఆ నిరంతర సినీ పథికుడు ప్రస్తుతం మరో సినీ నిర్మాణంలో తలమునకలై ఉన్నారు. నవదీప్, శ్రీనివాస్ అవసరాల, రాహుల్ హీరోలుగా వి.ఎన్. ఆదిత్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన అన్ని వ్యవహారాల్నీ చురుగ్గా దగ్గరుండి చూసుకుంటున్నారు. ఆద్యంతం వినోదభరితంగా తయారవుతున్న ఈ సినిమాతో నిర్మాతగా మరో విజయాన్ని సాధించేందుకు సిద్ధమవుతున్న రామానాయుడు సోమవారం తన 76వ పుట్టిన రోజును బ్యాంకాక్‌లో అదే సినిమా సెట్స్‌పై జరుపుకోబోతున్నారు. 
(నేడు డాక్టర్ రామానాయుడు పుట్టిన రోజు)

Wednesday, May 25, 2011

న్యూస్: ఆగస్టు నుంచి వినాయక్ - రాంచరణ్ సినిమా

చిరంజీవితో 'ఠాగూర్' వంటి సూపర్ హిట్‌ని అందించిన దర్శకుడు వి.వి. వినాయక్, 'మగధీర' వంటి రికార్డుల చిత్రంలో నటించిన రాంచరణ్ కాంబినేషన్‌లో ఓ చిత్రం రూపొందబోతోంది. ఆగస్టులో సెట్స్ మీదకెళ్లే ఈ చిత్రాన్ని డి.వి.వి. దానయ్య నిర్మించనున్నారు. వినాయక్ చెప్పిన కథ సూపర్‌గా ఉందని రాంచరణ్ తెలపగా, రాంచరణ్ ఇంతవరకు చెయ్యని పాత్రని ఇందులో చెయ్యబోతున్నారనీ, ఆయన కెరీర్‌లో ఇది మరో బిగ్గెస్ట్ హిట్‌గా నిలుస్తుందనీ వినాయక్ చెప్పారు. "ఈ ఇద్దరి కాంబినేషన్ సినిమా మా బేనర్ మీద తెరకెక్కబోవడం సంతోషంగా ఉంది. ఈ చిత్రం తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎన్నో అద్భుతాలు సృష్టించనున్నది. పక్కా కమర్షియల్ సినిమాగా తయారయ్యే ఇందులో ఓ ప్రముఖ కథానాయిక నటించబోతోంది. ఆమె ఎవరనే సంగతితో పాటు, టెక్నీషియన్ల వివరాలూ త్వరలో తెలియజేస్తాం'' అని దానయ్య తెలిపారు.
జూన్‌లో 'రచ్చ' మొదలు
రాంచరణ్ హీరోగా 'ఏమైంది ఈ వేళ' ఫేమ్ సంపత్ నంది దర్శకత్వం వహించే 'రచ్చ' చిత్రం షూటింగ్ జూన్‌లో ప్రారంభం కానున్నది. "ఈ సినిమా మెగా అభిమానుల అంచనాలను వంద శాతం అందుకుంటుంది. రాంచరణ్ ఓ విభిన్న పాత్రలో ఇందులో కనిపిస్తారు. పక్కా ప్లానింగ్‌తో అనుకున్న వర్కింగ్ డేస్‌లోనే ఈ చిత్రాన్ని పూర్తి చెయ్యాలని నిర్మాతలు సంకల్పించారు. నాణ్యత విషయంలో ఏమాత్రం రాజీ పడకుండా ఈ చిత్రాన్ని తీయనున్నాం'' అని సంపత్ తెలిపారు. తమన్నా హీరోయిన్‌గా నటించే ఈ చిత్రానికి మణిశర్మ సంగీత దర్శకుడు.

'బెజవాడ రౌడీలు' ఆగిపోలేదు: రాంగోపాల్‌వర్మ

విజయవాడలో షూటింగ్ చేయడానికి పోలీసులు అనుమతి ఇవ్వని కారణంగా 'బెజవాడ రౌడీలు' షూటింగ్ ఆగిపోయిందని వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆ చిత్ర నిర్మాత రాంగోపాల్‌వర్మ స్పష్టం చేశారు. ముందుగా ప్లాన్ చేసినట్లే విజయవాడ షెడ్యూలుని పూర్తి చేసుకుని, ప్రస్తుతం హైదరాబాద్‌లో షెడ్యూలు కొనసాగిస్తున్నామన్నారు. "ఆగస్టు వరకు జరిగే మరో మూడు షెడ్యూళ్లతో సినిమా పూర్తవుతుంది. విజయదశమికి ఈ చిత్రాన్ని విడుదల చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నాం'' అని ఆయన చెప్పారు.
నాగచైతన్య హీరోగా శ్రేయ ప్రొడక్షన్స్ పతాకంపై రాంగోపాల్‌వర్మ, కిరణ్‌కుమార్ కోనేరు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వివేక్‌కృష్ణ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. నాగచైతన్య సరసన ఓ పేరున్న నాయిక నటించే ఈ చిత్రంలో కోట శ్రీనివాసరావు, అభిమన్యుసింగ్, ఆహుతి ప్రసాద్, శుభలేఖ సుధాకర్, ముకుల్‌దేవ్, అజయ్, అశోక్‌కుమార్, ఫణి, భరత్, శ్రావణ్ తారాగణం.
వందిత కోనేరు సమర్పిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అమర్ మోహ్లే, ప్రేమ్, ధరమ్ సందీప్, విశాల్, ఫైట్స్: ఇజాజ్, జావేద్, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: వివేక్‌కృష్ణ.

Tuesday, May 24, 2011

ఇంటర్వ్యూ: పోసాని కృష్ణమురళి

"జనం కోసం నాయకులు బతకాలని చెబుతూ 'దుశ్శాసన'లో హీరో ఓ సిస్టమ్ పెడతాడు. ఇప్పటి వ్యవస్థ ప్రక్షాళనకి ఈ సినిమాలో నేను పరిష్కారం చూపించా. ఓ మాటలో చెప్పాలంటే 'దుశ్శాసన' నా ఆత్మ'' అని చెప్పారు. పోసాని కృష్ణమురళి. శ్రీకాంత్, సంజన జంటగా లాఫింగ్ లార్డ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మురళీకృష్ణ నిర్మించిన 'దుశ్శాసన' చిత్రానికి ఆయన దర్శకత్వం వహించారు. ఈ నెల 27న ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా ఆ సినిమా గురించీ, అందులోని రాజకీయ అంశాల గురించీ విపులంగా మాట్లాడారు పోసాని. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే...

రాజకీయ నాయకుల్లో ఎవరైతే ప్రజాస్వామ్య విలువల్ని వలువల్లా లాగేస్తున్నారో వారే నా సినిమాలో 'దుశ్శాసన'. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు వంటి రాజకీయ నాయకులకి ఉండే సౌకర్యాలేవీ సామాన్య జనానికి ఉండవు. ఏ మంత్రి లేదా ఎమ్మెల్యే ఇంట్లో కరెంటు సమస్య కానీ, నీటి సమస్య కానీ, పారిశుద్ధ్య సమస్య కానీ ఉండదు. ఇవన్నీ జనానికి ఉంటాయి. దీన్ని ప్రశ్నించి, "మీకు ఉండే సౌకర్యాలన్నీ మాకూ ఇవ్వండిరా'' అని డిమాండ్ చేసే ఓ కామన్ మ్యాన్ కథ ఈ సినిమా. ఏ పనులు చేస్తామని పదవులు చేపట్టారో ఆ పనులు ఎందుకు చెయ్యడం లేదని అడిగే పాత్రలో శ్రీకాంత్ బాగా చేశాడు. అర్జెంటీనా ఉద్యమకారుడు చేగువేరా అంటే నీతికీ, నిజాయితీకీ, పోరాటానికీ, ధైర్యానికీ ప్రతీక. అందుకే శ్రీకాంత్ పాత్రకి ఆ లుక్ ఇచ్చా. అంతకుమించి చేగువేరాకీ, నా సినిమాకీ ఎలాంటి సంబంధమూ లేదు.
అందుకే పాలిటిక్స్ 
నా ఉద్దేశంలో జనజీవన స్రవంతిలో కలవాల్సింది మావోయిస్టులు కాదు. రాజకీయ నాయకులే. మావోయిస్టులు అన్ని సౌకర్యాల్నీ వదులుకుని అడవుల్లో జనం కోసం బతుకుతున్నారు. జనం మధ్య ఉంటూనే జనానికి దూరంగా బతుకుతోంది ఈ రాజకీయ నాయకులే. నక్సలైట్లు ఊరికే పుట్టడం లేదు. ఈ రాజకీయ వ్యవస్థవల్లే పుడుతున్నారు. చెప్పీ చెప్పీ ఏమీ ప్రయోజనం ఉండకపోవడంతో విసిగిపోయి నక్సలైట్లుగా మారుతున్నారు. అందుకే పాలిటిక్స్ గురించి ఎంత ఎక్కువ చెబితే అంత మంచిదనే ఉద్దేశంతో నా సినిమాల్లో రాజకీయ అంశాల్ని ప్రస్తావిస్తూ వస్తున్నా
వ్యక్తిగత విషయాల్లోకి వెళ్లను 
ఇవాళ రాజకీయ నాయకులు ఎంతకైనా దిగజారుతున్నారు. తమకి అడ్డు వచ్చినవాళ్లని అడ్డు తొలగించుకోడానికి వెనుకాడటం లేదు. ఇలా అడుగుతున్నానని నన్ను ఎవరైనా ఎప్పుడైనా ఏమైనా చేయొచ్చు. ఈ సంగతి మా కుటుంబానికి కూడా చెప్పా. నేను తప్పు చెయ్యనని మా వాళ్ల నమ్మకం. అందుకే వాళ్లు నాకు అడ్డురారు. నేను ఎవరి వ్యక్తిగత విషయాల జోలికీ వెళ్లను. వ్యక్తిగతంగా వాళ్లేం చేసినా నాకు అభ్యంతరం లేదు. కానీ జనంలోకి వస్తేనే అడుగుతా. 'దుశ్శాసన'లో జనం కోసం నాయకులు బతకాలని చెబుతూ హీరో ఓ సిస్టమ్ పెడతాడు. ఇప్పటి వ్యవస్థ ప్రక్షాళనకి ఈ సినిమాలో నేను పరిష్కారం చూపించా. ఓ మాటలో చెప్పాలంటే 'దుశ్శాసన' నా ఆత్మ.
బిజినెస్ సమస్య లేదు 
పోసాని వల్ల ఏ నిర్మాతా నాశనం కాడు. పోసాని సినిమా అంటే కొనేవాళ్లు ఇంకా ఉన్నారు. నేను తీసేది తక్కువ బడ్జెట్‌తో కావడం వల్ల బిజినెస్ సమస్య నా సినిమాలకు లేదు. 'దుశ్శాసన' అన్ని ప్రాంతాలకూ అమ్ముడుపోయింది.
జేపీ నీతిమంతుడే కానీ... 
రాజకీయాల్లో స్థిరమైన నిర్ణయాలు ఉండవు. జనం ఎప్పుడూ ఏదో ఒక పార్టీకే ఎందుకు ఓట్లేయడం లేదు. ఒకసారి ఓ పార్టీని గెలిపించే వారు ఆ పార్టీ ప్రభుత్వం బాగా పనిచేస్తేనే మళ్లీ దానికి ఓటేస్తారు. లేదంటే వేరే పార్టీని ఎన్నుకుంటారు. నేను కూడా అంతే. ఏ నాయకుడైనా బాగా చేస్తుంటే మెచ్చుకుంటా. పొరపాట్లు చేస్తే తిడతా. మొన్న చంద్రబాబునీ, నిన్న చిరంజీవినీ అలాగే మెచ్చుకున్నా, తర్వాత తిట్టా. ఇవాళ రాజకీయ నాయకుల్లో 99 శాతం అవినీతిపరులే. అవినీతికి పాల్పడని రాజకీయ నాయకుల్ని ఓ ముగ్గుర్ని చూపించండి. నేటి ప్రజాస్వామ్య వ్యవస్థలో అవినీతి అనివార్యమైపోయింది. రాజకీయ నాయకులతో పాటు ప్రజలూ అవినీతి గురించి మాట్లాడే హక్కు కోల్పోయారు. లోక్‌సత్తా నేత జయప్రకాశ్ నారాయణ నీతిమంతుడు. అయితే ఇవాళ నీతి ఒక్కటే సరిపోదు. దానితో పాటు సమర్థతా, బలమూ కావాలి. జె.పి.కి ఆ బలం లేదు. ఉన్నవాళ్లలో సమర్థుడు అనిపించబట్టే వై.ఎస్. జగన్మోహనరెడ్డికి మద్దతు పలుకుతున్నా.

క్రేజీ కాంబినేషన్: ముగ్గురు మిత్రుల 'నిప్పు'

మద్రాసులో ఒకే ఇంట్లో ఉన్న ముగ్గురు కుర్రాళ్లు అనంతర కాలంలో తెలుగు చిత్రసీమలో తమకంటూ ప్రత్యేకమైన పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. ఆ ముగ్గురు... గుణశేఖర్, వై.వి.ఎస్. చౌదరి, రవితేజ. వీరిలో మొదటి ఇద్దరూ దర్శకులుగా రాణిస్తుండగా, మూడో వ్యక్తి స్టార్ హీరో హోదాని ఆస్వాదిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ ముగ్గురూ కలిసి ఓ సినిమాకి పనిచేయబోతున్నారు.ఆ సినిమా పేరు 'నిప్పు'. రవితేజ హీరోగా నటించే ఈ సినిమాకి గుణశేఖర్ దర్శకత్వం వహిస్తుండగా, బొమ్మరిల్లు పతాకంపై వైవీఎస్ చౌదరి నిర్మిస్తున్నారు. ఈ సంగతిని చౌదరి ప్రకటించారు.
"అప్పట్లో నటి అనూరాధ తల్లి సరోజ గారింట్లో గుణశేఖర్ కింది రూములో ఉంటే, రవితేజ, నేను పై రూములో ఉండేవాళ్లం. అప్పట్లో చిత్రసీమలో అవకాశాల కోసం ఎదురుచూస్తూ ఒకే ఇంట్లో ఉన్న మేం ముగ్గురం ఈ రోజు ఒకే సినిమాకి కలిసి పనిచేస్తుండటం ఆనందదాయకం. ఇది నాకు లభించిన అదృష్టంగా భావిస్తున్నా'' అని చెప్పారు. బొమ్మరిల్లు పతాకంపై తన దర్శకత్వంలో ఓ సినిమా, పేరు పొందిన దర్శకులతో ఓ సినిమా, కొత్త దర్శకులతో ఓ సినిమా.. ఇలా నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నానన్నారు. "మా బేనర్‌లో భిన్న భిన్న కథలతో ఇతర దర్శకులతో సినిమాలు చేయాలనే నిర్ణయంతో కొత్త ఒరవడికి శ్రీకారం చుడుతున్నా. నేనభిమానించే దర్శకులతో, వారికి పూర్తి స్వేచ్ఛనిస్తూ సినిమాలు నిర్మిస్తా''అని చెప్పారు. అందులో భాగంగా గుణశేఖర్ దర్శకత్వంలో 'నిప్పు' తీస్తున్నాననన్నారు.
"గుణశేఖర్‌లో రెండు పార్శ్వాలున్నాయి. అతి తక్కువ బడ్జెట్‌తో 'సొగసు చూడతరమా' వంటి సినిమాలు, భారీ బడ్జెట్‌తో 'ఒక్కడు' వంటి సినిమాలు తీయగలరు. నాకు సినిమా చేసి పెట్టమని ఆయన్ని అడిగా. చేస్తానని వెంటనే మాటిచ్చారు. తొమ్మిది నెలలు టైమ్ తీసుకుని 'నిప్పు' స్క్రిప్టు పని పూర్తి చేశారు. ఎంటర్‌టైన్‌మెంట్ ప్రధానంగా నడిచే ఈ సినిమాలో రవితేజ కొత్త డైమన్షన్‌లో కనిపిస్తాడు. ఎన్టీఆర్ జయంతి రోజు ఈ నెల 28న 'నిప్పు' షూటింగ్ ప్రారంభిస్తున్నాం'' అని తెలిపారు వైవీఎస్.
ఈ చిత్రానికి ఆయన బావమరిది కిశోర్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తారు. కాగా తన భార్య గీతకి ఏప్రిల్ 27న రెండో పాప పుట్టిందనీ, పాపకు ఏక్తా అని నామకరణం చేశామనీ, సహ నిర్మాతలుగా తన ఇద్దరు కుమార్తెలు యుక్త, ఏక్తా పేర్లు ఉంటాయని వైవీఎస్ చెప్పారు.

Monday, May 23, 2011

అక్కినేని నాగార్జున: రజతోత్సవ కథానాయకుడు

సినీ కథానాయకునిగా అక్కినేని నాగార్జున పాతికేళ్ల కాలం పూర్తి చేసుకున్నారు. నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు వారసునిగా చిత్రసీమలో కాలిడినా, సొంత ప్రతిభావ్యుత్పత్తులతో అగ్ర కథానాయకుల్లో ఒకరిగా ఎదిగారు. హీరోగా ఆయన నటించిన తొలి చిత్రం 'విక్రమ్' 1986లో విడుదలైంది ఈ రోజే (మే 23). బాలీవుడ్ సూపర్ హిట్ ఫిల్మ్ 'హీరో'కి రీమేక్‌గా వచ్చిన ఈ సినిమా పెద్ద మ్యూజికల్ హిట్టయ్యి, నాగార్జున సినీ జీవితానికి చక్కని పునాది వేసింది.
యాక్షన్, సెంటిమెంట్, లవ్, ఎంటర్‌టైన్‌మెంట్ ప్రధానాంశాలుగా వచ్చిన ఈ చిత్రంలోని పాటలు కొన్నాళ్ల వరకు మారుమోగుతూనే ఉన్నాయి. మొదట్లో అభినయం, వాచకం విషయాల్లో విమర్శల్ని ఎదుర్కొన్న నాగార్జున పట్టుదలతో వాటిలో పరిణతి సాధించారు. సినిమా సినిమాకీ నటునిగా ఎదుగుతూ వచ్చారు. తొలి సినిమా వచ్చిన ఏడాదికే దాసరి నారాయణరావు దర్శకత్వంలో ఆయన నటించిన 'మజ్ను' చిత్రం ఆయన కెరీర్‌కి బ్రహ్మాండమైన ఊతాన్నిచ్చింది. ఆ సినిమా నుంచీ నటునిగా ఆయన ఏవిధంగా పరిణతి సాధిస్తూ వచ్చిందీ మనం చూశాం.
ఆ సినిమాతో తెలుగు సినిమా గతే మారిపోయిందన్నది అందరూ ఒప్పుకునే నిజం. ఆడియోగ్రఫీ, రీరికార్డింగ్ అనే వాటికి అధిక ప్రాధాన్యం వచ్చింది ఈ సినిమా నుంచే. చిత్రమేమంటే ఆ సినిమాకి ఆర్నెల్ల ముందు అదే ఏడాది వచ్చిన 'గీతాంజలి'లో పూర్తి భిన్నమైన ప్రేమికుని పాత్రలో నాగార్జున అభినయం విమర్శకుల్ని సైతం మెప్పించింది. అప్పట్నించీ కెరీర్‌లో వెనుతిరగని ఆయన అన్ని రకాల పాత్రలతో ఇటు క్లాస్, అటు 'మాస్' ప్రేక్షకుల్ని సమానంగా అలరిస్తూ వస్తున్నారు.
'లార్జర్ దేన్ లైఫ్' పాత్రలైన 'అన్నమయ్య', 'శ్రీరామదాసు'గా అద్భుతంగా అభినయించి సమకాలీన కథానాయకుల్లో తనకంటూ ప్రత్యేకతని నిలుపుకున్నారు. ప్రస్తుతం 'శిరిడీసాయి'గా నటించేందుకు ఉద్యుక్తులవుతున్నారు. భవిష్యత్తులో ఈ అగ్ర నటుడు మరిన్ని మైలురాళ్లను అందుకోవడం ఖాయం.

Sunday, May 22, 2011

ఫ్లాష్‌బ్యాక్: 'మహాకవి కాళిదాసు'కు జాతీయ అవార్డు

'మహాకవి కాళిదాసు' చిత్రం 1961 మార్చి 31న న్యూఢిల్లీలో 1960లో విడుదలైన తెలుగు చిత్రాల్లో ఉత్తమమైందిగా రాష్ట్రపతి రజత పతకం పొందింది. నిర్మాత సూరిబాబుకు రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ బహుమతి అందజేశారు. ఆయన తమ భవనానికి దర్శకుడు కమలాకర కామేశ్వరరావునూ, ఇతర బృందాన్నీ ఆహ్వానించి ఉదయం పూట తాము వినేందుకు కాళిదాసు శ్లోకాల రికార్డును వేయించారు. ఉత్తమ నటిగా జూనియర్ శ్రీరంజనికి వెండి ప్లేటు బహూకరించారు.