Saturday, August 30, 2014

Short Story: Sarangi Vadyagadu Maa Mavayya

కథ: 

సారంగి వాద్యగాడు మా మావయ్య

మా మావయ్య సారంగి మా గొప్పగా వాయిస్తాడు. మావయ్యంటే మా అమ్మకి అన్న. మావయ్యకు సంగీతమంటే ప్రాణం. ఉద్యోగం నిమిత్తం ఉత్తరప్రదేశ్‌కి పోయినప్పుడు జహీర్‌ఖాన్ అనే ఆయన దగ్గర సారంగి వాద్యం నేర్చుకొన్నాడు. సారంగి మీద వయొలిన్ స్వరాలు కూడా పలికించే మొనగాడు మా మావయ్య. ఆయనకు ఇద్దరు కూతుళ్లు. నేనింకా హైస్కూలుకు వెళ్లకముందే మా అత్తయ్య చనిపోయింది. దాంతో కూతుళ్లిద్దర్నీ తనే తల్లీ తండ్రీ అయ్యి ఏ లోటూ లేకుండా పెంచాడు మావయ్య. బాగా చదువు చెప్పించాడు. అయితే చీరాల్లో పనిచేస్తున్నప్పుడు ఆయన పెద్ద కూతురు వినీల ఇంట్లోంచి వెళ్లిపోయింది. వెళ్లిపోయిందంటే మనవాళ్లు సాధారణంగా అంటుంటారే.. 'లేచిపోయింది' అనీ.. అలా అన్నమాట. చీరాల్లోనే ఉండే ఒక డబ్బున అబ్బాయి ప్రేమలో పడి, పెద్దవాళ్లకు చెప్పా పెట్టకుండా గుళ్లో పెళ్లిచేసుకొని అతనితో వెళ్లిపోయింది. అప్పుడు మావయ్య ఎంత బాధపడ్డాడో. తన ప్రాణం పోయినట్లే విలవిల్లాడాడు. కొద్ది రోజులు ఎవరితోనూ.. అఖరుకి తన చిన్న కూతురు భావనతోనూ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు. పలకరించడానికి వెళ్లిన మా అమ్మతో "అదేంది అట్లా చేసింది? తల్లిలేని పిల్లలు కదా అన్జెప్పి వాళ్లని ఎండకి కందకుండా ఎట్లా పెంచాను. నా పరువిట్లా తీసుద్దని అనుకోలేదు" అన్నాడు.
అమ్మ "దానికి నువ్వేం చేస్తావులే అన్నయ్యా. నీ మీద గౌరవం ఉంటే అది ఈ పని ఎందుకు చేసుద్ది? నువ్వు దిగులు పెట్టుకోమాక" అని సముదాయించబోతే, "ఆడెవడో దానికి మాయమాటలు చెప్పి తీసకపొయ్యాడు. అది తప్పకుండా ఎప్పటికైనా వొచ్చుద్ది చూడు" అన్నాడు కూతుర్ని వెనకేసుకొస్తా. అమ్మ బిత్తరపొయ్యింది. ఆ తర్వాత చాలా మంది మావయ్యతో వినీల చాలా సంతోషంగా ఉందనీ, ఆమె మాంగారు బాగా ఉన్నోళ్లనీ, మీ అల్లుడు శానా మంచోడనీ చెప్పేతలికి "మంచోడైతే నాకు చెప్పి పెళ్లి చేసుకుంటాడు కానీ ఇట్టా లేవదీసుకపోతాడా" అని పైకని, లోపల్లోపల చాలా సంతోషపడ్డాడు. వినీల సంగతి వాళ్లు ఒకటి చెబితే, ఇంకో రెండు సంగతులడిగి, గోడకి తగిలించిన మా అత్తయ్య పటం ముందు నిల్చొని "ఏమనుకోమాక. అప్పుడది అట్టాంటి పన్జేసిందని తిట్టా. ఇప్పుడది సుఖంగా ఉందని తెలిశాక కూడా తిడ్తానా. దాన్సుఖమే కదా నాకు కావాల్సింది. నీకు సంతోషమే కదా" అన్నాడు.
కొన్ని నెలలు గడిచిపొయ్యాయి. ఒకరోజు మా అమ్మతో "పెద్దదాని బాధ్యత తీరిపోయింది. అది సుఖంగా ఉంది అంతే చాలు. రెండో దానికి ఓ మంచి సంబంధం చూసి చేస్తే ఇంక నాకే దిగులూ ఉండదు" అన్నాడు మావయ్య. ఆ సంగతి నాకు చెప్పిందమ్మ. ఆ తర్వాత రోజే ఆదివారం రావడంతో నేను మావయ్య వాళ్లింటికెళ్లా. నన్న్ను చూడ్డంతోటే భావన కళ్లు మెరిశాయి. నాకు తెలుసు భావనకి నేనంటే ఎంతిష్టమో. "మావయ్యా, నేను భావనని పెళ్లి చేసుకుంటా" అని చెప్పేశా. మామూలుగా అయితే ఎవర్నన్నా మధ్యవర్తుల్ని పంపించి సంబంధం అడిగిస్తుంటారు. సొంత బంధువులైనా సరే. నాకట్లా చెయ్యడం ఇష్టం లేదు. అందుకే డైరెక్టుగా చెప్పేశా. అప్పుడు మావయ్య కళ్లు వెలిగాయి.
"ఏరా రాఘవా. నిజంగానే అంటున్నావా, తమాషా చేస్తున్నావా?" అనడిగాడు మావయ్య. ఎందుకంటే ఇప్పుడు ఆయనకంటే మాకు ఆస్తులెక్కువ. మా నాన్న బట్టల వ్యాపారంలో బాగా సంపాదించాడు. చీరాల్లో మాకు రెండు బట్టల దుకాణాలున్నాయి. వాటిలో ఓ షాపుని నన్ను చూసుకొమ్మని నాన్న చెప్పాడు కానీ, నాకు ఇష్టం లేక రైల్వేలో ఉద్యోగం చేస్తున్నా.
"పెళ్లి విషంలో కూడా తమాషా చేస్తానా మావయ్యా. నాకు భావన అంటే ఇష్టం. తనకీ ఇష్టమైతే చేసుకుంటా" అన్నా, అక్కడే ఉన్న భావన వంక ఆరాధనగా చూస్తా. మావయ్య భావన వంక చూశాడు. అప్పుడు భావన "రాఘవని చేసుకోవడం నాకిష్టమే" అంది, కొంచెం సిగ్గుపడతా. మావయ్య మా పెళ్లిని మా గొప్పగా చెయ్యాలని నిర్ణయించుకొన్నాడు. పెద్ద కూతురి పెళ్లి తానెలాగూ చెయ్యలేకపోయాడు కాబట్టి ఈ చివరి పెళ్లినైనా ఘనంగా చెయ్యాలనేది ఆయన కోరిక. నాకేమో సింపుల్‌గా చేసుకోవాలనుంది. కానీ మావయ్య పడనియ్యలేదు.
"పెళ్లనేది జీవితంలో ఒక్కసారే కదరా వొచ్చేది. నాకు ఈ పెళ్లి తప్ప వేరే ఖర్చేముంది? మీ అంత లేకపోయినా నేను సంపాదించింది కూతుళ్లకి గాక ఎవరికియ్యను? దీనికి మాత్రం అడ్డు చెప్పకురా" అన్నాడు బతిమాలుతున్నట్లు.
దాంతో సరేననక తప్పలేదు. చీరాల ఏరియాలోనే ఖరీదైన కల్యాణ మండపాన్ని మాట్లాడాడు మావయ్య. ఇంకొద్ది రోజుల్లో పెళ్లనంగా ఓ మధ్యాహ్నం పూట మావయ్య, భావన బలవంతపెడితే వాళ్లతో పాటు భోజనం చేస్తున్నా. అప్పుడే తలుపు దగ్గిర ఎవరో వచ్చిన అలికిడి.
"ఎవరూ, లోపలికి రండి" అని కేకేశాడు మావయ్య. ఒక స్త్రీ లోపలికొచ్చింది. ముగ్గురం తినడం ఆపి ఆశ్చర్యంగా నోరెళ్లబెట్టాం. ఆ వొచ్చింది వినీల!
"నాన్నా" అని మావయ్య దగ్గరకొచ్చింది. ఆయనకి నోటెంట మాట రావడం లేదు. చాలాకాలం తర్వాత పెద్దకూతురు కనిపించేటప్పటికి ఏం చేయాలో, ఏం మాట్లాడాలో తోచనట్లు కట్టెలా ఉండిపోయాడు.
నేనే "మావయ్య ఏంటట్లా మాట్లాడకుండా చూస్తున్నావ్, వినీల వొస్తే" అన్నా ఉండబట్టలేక. అయినా ఆయన్లో ఉలుకూ పలుకూ లేదు. అట్లానే చూస్తున్నాడు వినీల వొంక. భావన "అక్కా, ఎంతకాలమైందే నిన్ను చూసి. యెట్టా ఉన్నావే" అని ఓ చేత్తో వాటేసుకుంది.
అప్పుడు చూడాలి మావయ్య మొహం. ఆనందంతో కళ్లెమ్మట నీళ్లు. "ఇన్నాళ్లకు నాన్నని చూడాలనిపించిందా బంగారు తల్లీ" అని వినీలని దగ్గరకు తీసుకున్నాడు. ఇట్లాంటి ఎమోషనల్ సీన్లని సినిమాల్లో చూడ్డమే కానీ నిజ్జంగా చూడ్డం అప్పుడే నాకు.
నిజం చెప్పొద్దూ.. అప్పుడా తండ్రీకూతుళ్ల సీను చూస్తుంటే నాక్కూడా ఏడుపొచ్చింది కానీ బలవంతాన అపుకున్నా.
"సారీ నాన్నా.. సారీ నాన్నా..." అంతకంటే మాట్లాడలేకపోయింది వినీల. మాతో పాటు తను కూడా తృప్తిగా భోంచేసింది. మా పెళ్లి సంగతి తెలిసి రాకుండా ఉండలేకపోయానంది. భావన, నేను పెళ్లి చేసుకోవడం తనకు చాలా సంతోషంగా ఉందని చెప్పింది.
మా పెళ్లికి ముహూర్తాలు పెట్టారు. మాఘమాసంలో చివరి సోమవారం భావన మెళ్లో మూడు ముళ్లూ వేశా. ఆ పెళ్లికి వినీల, వాళ్లాయనా, ఆమె అత్తామామలు కూడా వొచ్చారు. అప్పుడు మావయ్య ఆనందం అంతా ఇంతా కాదు. వినీల వాళ్లాయన పేరు చంద్రశేఖర్. అతను వినీలను అంటిపెట్టుకునే తిరుగుతున్నాడు. వాళ్లను చూసి "చూడముచ్చటైన జంట" అంది మావయ్యతో అమ్మ. అప్పుడు మావయ్య కళ్లు తృప్తిగా మెరిశాయి. వినీల వాళ్లను చూసి కొంతమంది చాటుమాటుగా చెవులు  కొరుక్కుంటున్న సంగతి చూసి కూడా ఆయన పట్టించుకోలేదు. 'అల్లుడి కులమేదైతేనేం, కూతురు సుఖంగా ఉంది. అంతే చాలు' అన్నాడు.
పెళ్లయి పదహార్రోజుల పండగ అయినాక మా అందర్నీ భోజనానికి పిలిచాడు చంద్రశేఖర్. ఆ ఆలోచన వినీలదేనని మా అందరికీ తెలుసు. మావయ్య వెళ్లాలా, వొద్దా అని వొకటే మల్లగుల్లాలు పడ్డాడు. "వెళ్లకపోతే అక్క బాధపడుద్ది నాన్నా. వెళ్దాం" అని పట్టుబట్టింది భావన. నేనూ, అమ్మ కూడా తనను సపోర్ట్ చేశాం.
వినీల వాళ్లింటి దగ్గిర ఊహించనంత మర్యాదలు జరిగాయి. వినీల అత్తామామలు మాపై చూపిన ఆదరంతో మావయ్య అనుమానాలన్నీ పటాపంచలైపోయాయి. అంతదాకా బాగా డుబ్బున్నోళ్లకు తలపొగరు ఉంటుందనీ, తమకంటే తక్కువ స్థాయివాళ్లను చులకనగా చూస్తారనీ నాకూ ఓ అభిప్రాయం ఉండేది. వాళ్లను చూశాక నా అభిప్రాయం సవరించుకున్నా, బాగా ఆస్తిపరుల్లోనూ కొంతమంది మంచివాళ్లుంటారని.
ఆ ఇంట్లోని ప్రతిగదినీ దగ్గరుండి చూపించింది వినీల. అంతసేపూ భావన చేయిపట్టుకునే ఉంది. అన్నీ విశాలమైన గదులు. హాలు సంగతైతే చెప్పనక్కరలేదు. అంత పెద్ద ఇల్లు కూడా పరిశుభ్రంగా ఉండటాన్ని మేం గమనించాం. డైనింగ్ హాల్లోకి వెళ్లాక ఆశ్చర్యపోయాం. అక్కడ పదిమంది కూర్చునేంత పెద్ద టేబుల్ ఉంది. అప్పటికే వాటిపై భోజన ఏర్పాట్లు చేసున్నాయి. పెద్దవాళ్లంతా.. వినీల అత్తామామలు, మా అమ్మానాన్నలు, మావయ్య ఒకేపు కూర్చుంటే, కుర్రాళ్లం.. వినీల, చంద్రశేఖర్, భావన, నేను.. ఇంకోయేపు ఎదురెదురుగా కూర్చున్నాం.
ఆ ఇంట్లో పనివాళ్లయిన ఇద్దరు మొగుడూ పెళ్లాలున్నారు. వాళ్లు ముందుగానే టేబుల్ మీద తొమ్మిది వెడల్పాటి అరిటాకులు వేసి, గాజు గ్లాసులో మంచినీళ్లు పోసి ఉంచారు. భోజన పదార్థాలన్నీ టేబుల్ మధ్యలో ఉంచిన పాత్రల్లో పొగలు కక్కుతున్నాయి, వేడివేడిగా. వినీలే స్వయంగా అందరికీ వడ్డిస్తుంటే చంద్రశేఖర్ ఆమెకు అవీ ఇవీ అందిస్తూ వచ్చాడు. మేం తృప్తిగా, సుష్టుగా భోంచేశాం. భోజనాలయ్యాక అందరం ఇంటిముందున్న చెట్లకింద నీడలో వేసిన కుర్చీల్లో కూర్చున్నాం. కొద్దిసేపటి దాకా అక్కడ వాతావరణం నిశ్శబ్దంగా ఉంది. కొత్త ప్రదేశం, కొత్త మనుషులు కావడం వల్ల కావచ్చు మేం కలివిడిగా ఉండలేకపోతున్నాం. గాలి చల్లగా వీస్తున్నా.. ఏదో అసౌకర్యం.
అప్పుడే వినీలకు చంద్రశేఖర్ దేనికోసమో సైగచేయడం గమనించా. లోపలికి వెళ్లిన వినీల తెచ్చిన వస్తువును చూసి అందరం ఆశ్చర్యపోయాం. అది సారంగి! మావయ్యయితే వెడల్పయిన కళ్లతోటి దానివొంక చూశాడు. ఆ సారంగి కొత్తదని దాని మెరుపు చెబుతోంది. వినీల దాన్ని చంద్రశేఖర్‌కిచ్చింది. వినీల వొంక నవ్వుతా చూసి సారంగి తీగను మీటాడు చంద్రశేఖర్. అది శ్రావ్యంగా మోగింది. మావయ్య ఆశ్చర్యంలో మునిగితేలుతుండగా యమునా రాగంలో ఒక పాత సినిమా పాట పాడుతూ సారంగి వాయిస్తున్నాడు చంద్రశేఖర్. అది మావయ్యకు ఎంతో ఇష్టమైన పాట. ఒక పల్లవీ, ఒక చరణం పూర్తయ్యాయి. ఆ పాట, ఆ వాద్యం తప్ప మరే చప్పుడూ అక్కడ లేదు.
మేం పరిసరాల్ని మర్చిపోయి అతడి పాటనీ, మధురమైన సారంగి వాద్యాన్నీ ఆస్వాదిస్తున్నాం, ఆ ఎండలో నీడపట్టున. అంతలో ఏదో అపశృతి. పాటకూ, వాద్యానికీ లంకెలేకుండా. సంగీత జ్ఞానం లేని మాకు కూడా అది తెలిసిపోయింది. చప్పున మావయ్య "తాళం తప్పింది అల్లుడుగారూ" అన్నాడు అప్రయత్నంగా. చంద్రశేఖర్ చేతిలోని సారంగి ఆగిపోయింది. "మీ వాద్యం వినాలని ఉంది మావయ్యగారూ" అన్నాడు. నాకెందుకో అతను కావాలనే తాళం తప్పాడనీ, మావయ్యచేత సారంగి వాయించడానికి అలా చేశాడనీ అనిపించింది.
"కానియ్ నాన్నా" అంది వినీల మావయ్య బెరుకును పోగొట్టాలని. అప్పుడు మావయ్య ఆ పాటలోని రెండో చరణాన్నీ, పల్లవినీ సారంగి వాయిస్తూ అద్భుతంగా పాడాడు. సారంగి వాద్యంలోని తీయదనాన్ని మాకందరికీ పంచాడు. "సూపర్.. సూపర్‌గా పాడారు మావయ్యగారూ" అని చంద్రశేఖర్ చప్పట్లు కొడితే, మిగతా అందరం అతనితో జత కలిశాం. దాంతో మావయ్య కాస్త సిగ్గుపడ్డాడు. సారంగిని చూస్తూ దాని తీగలు సవరించాడు. చంద్రశేఖర్‌కు దాన్ని తిరిగివ్వబోయాడు. అతను "మీ వద్దే ఉంచండి మావయ్యా. ఇది మీకు నా గిఫ్ట్" అన్నాడు. మావయ్యకు ఆశ్చర్యమూ, ఆనందమూ.. రెండూ కలిగాయి.
"మీరు నాకు కానుక ఇవ్వడమేమిటి అల్లుడుగారూ.. నేనే మీకివ్వాలి. ఇంత గొప్పింటికి నా కూతురు కోడలైనా మీకేమీ ఇవ్వలేకపోయా" అన్నాడు  మావయ్య కృతజ్ఞత నిండిన గొంతుతో.
"ఎందుకివ్వలేదు మీరు. పెద్ద కానుకే ఇచ్చారుగా" అన్న చంద్రశేఖర్ మాటలకు అందరం అతనివొంక ఆసక్తిగా చూశాం. అతను వినీల చేయిపట్టుకొని "ఇదుగో ఆ కానుక" అన్నాడు. అతని మంచి మనసుకు మావయ్యతో పాటు మేం కూడా చాలా చాలా సంతోషించాం.
"అవునూ.. మీకు సారంగి ఎలా వొచ్చు?" అడిగా కుతూహలం ఆపుకోలేక.
"నేను ఉస్మానియా యూనివర్శిటీలో చదివేప్పుడు జాహెద్ అనే అతను నాకు మంచి ఫ్రెండ్. వాడిది ఉత్తరప్రదేశ్. వాడి దగ్గర సారంగి ఉండేది. బాగా వాయిస్తాడు. వాడివద్దే ఏదో కొద్దిగా నేర్చుకున్నా. పెళ్లయ్యాక వినీల చెప్పింది, మావయ్యకు సారంగి అంటే బాగా ఇష్టమని. జాహెద్‌కు ఫోన్‌చేశా. ఇది పంపించాడు" చెప్పాడు చంద్రశేఖర్. అప్పుడు మావయ్య కళ్లు చెమర్చకుండా ఉండలేకపోయాయి. చంద్రశేఖర్ రెండు చేతులూ పట్టుకొని "సారీ బాబూ" అన్నాడు.
"ఎందుకు మావయ్యాగారూ?"
"మా అమ్మాయిని నాకు తెలీకుండా, చెప్పకుండా పెళ్లిచేసుకొని తీసుకుపొయ్యావని నిన్ను ఎన్ని మాటలన్నానో. నీ మంచి మనసు చూశాక, నేనెంత తప్పు చేశానో అర్థమైంది."
"లేదు మావయ్యాగారూ. మా ప్రేమ సంగతి మీకు చెప్పకుండా నిజంగా తప్పుచేసింది నేనూ, వినీలా. మీరు మా పెళ్లికి ఒప్పుకోరనే సందేహంతోటే మీకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నాం. తనను మా ఇంటికి తీసుకుపోయా. అప్పుడు ఓ తండ్రిగా మీరెంత బాధపడి ఉంటారో. మీరే మమ్మల్ని క్షమించాలి."
అదరి హృదయాలూ తేలికైపోయాయి.
ఇప్పుడు మావయ్య మా పిల్లల్నీ, వినీల పిల్లల్నీ దగ్గర కూర్చోబెట్టుకొని ఆ సారంగి వాయిస్తూ, వాళ్లకు నేర్పిస్తూ కాలక్షేపం చేస్తున్నాడు హాయిగా.

- 4 ఏప్రిల్ 2010, ఆదివారం ఆంధ్రప్రభ

Wednesday, July 2, 2014

Cinema: Interview with Actor Venkat

తెలుగు చిత్రసీమను బాగు చెయ్యాలి: వెంకట్

"ప్రజలకు మంచి చేయడానికి ఎలా రాజకీయాల్లోకి వచ్చారో, అలాగే తెలుగు చిత్రసీమను బాగు చెయ్యడానికి పవన్‌కల్యాణ్ నడుం బిగించాలని కోరుకుంటున్నా. ఆయనొక్కరే ఏమైనా చెయ్యగలరనిపిస్తోంది. ఈ విషయంపై మాట్లాడేందుకు ఆయన్ని కలవాలనుకుంటున్నా'' అని చెప్పారు వెంకట్. 'శ్రీ సీతారాముల కల్యాణం చూతము రారండీ' వంటి హిట్ సినిమాతో హీరోగా కెరీర్ మొదలుపెట్టిన ఆయన చక్కని నటునిగా పేరు తెచ్చుకున్నప్పటికీ, కొంతకాలంగా ఆయనకు సరైన అవకాశాలు లేకుండా పోయాయి. కొంత విరామంతో ఇప్పుడు ప్రేమ్ మూవీస్ పతాకంపై ప్రేమ్‌కుమార్ పట్రా సమర్పిస్తోన్న 'ఆ ఐదుగురు' చిత్రంలో ఐపీఎస్ ఆఫీసర్‌గా శక్తిమంతమైన పాత్రతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అనిల్ జేసన్ గూడూరు దర్శకత్వం వహించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలవుతున్న సందర్భంగా పత్రికలవారితో వెంకట్ చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే...

ఒక ఐపీఎస్ ఆఫీసర్ ముఖ్యమంత్రయి, సమాజాన్ని మార్చడానికి ఏం చేశాడనేది 'ఆ ఐదుగురు'లోని ప్రధానాంశం. ముఖ్యమంత్రయ్యాక ఆయన నెక్స్‌ట్ జనరేషన్ ఫోర్స్ (ఎన్.జి.ఎఫ్.) అనే ఓ దళాన్ని ఏర్పాటుచేస్తాడు. నలభైమంది సభ్యుల ఆ బృందానికి శిక్షణనిచ్చే ఐపీఎస్ ఆఫీసర్‌గా నేను నటించాను. సీఎంగా వాసు అనే కొత్త నటుడు చేశారు. నలభై మంది బృందంలోని వాళ్లే 'ఆ ఐదుగురు'. మిగతా 35 మంది పాత్రలను నిజమైన పోలీసులే చేశారు. ఈ సినిమాలో నటించడానికి 'అప్పా' (ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ)లో రెండు నెలలపాటు శిక్షణ పొందాను. కాగా ఇందులోని డాక్టర్ పైపుల అనే పాత్రలో చిత్ర సమర్పకులు ప్రేమ్‌కుమార్ పట్రా కామెడీని పంచబోతున్నారు. ఇది యువతకు మార్గదర్శకం చూపించే సినిమా. మంచి సినిమాలు రావట్లేదని ఎప్పుడూ వాపోతూ ఉంటాం. కానీ మంచి సినిమాలు వచ్చినప్పుడు చూస్తున్నామా? ఇది కచ్చితంగా మంచి సినిమా. కమర్షియల్ అంశాలు మేళవించిన మంచి సినిమా.

ఆశాభావంతో ఉన్నా

పోలీసాఫీసర్‌గా నటించడం నాకిదే మొదటిసారి. ఇప్పటివరకు నేను చేసిన పాత్రలతో పోలిస్తే ఇందులో నా లుక్ డిఫరెంట్. నిజ జీవితంలో ఐపీఎస్ ఆఫీసర్ ఎలా ఉంటారో నా పాత్రను అలా చూపించారు. హైదరాబాద్‌లో జరిగిన ఓ అందాల పోటీకి నేను, అస్మితా సూద్ జడ్జీలుగా వెళ్లాం. అందులో మమ్మల్ని చూసిన ప్రేమ్‌కుమార్ గారు ఈ సినిమాలోని కీలక పాత్రలు మేం సరిపోతామని భావించి, మాకు ఈ కేరక్టర్స్‌ని ఇచ్చారు. నా శాయశక్తులా ఆ పాత్రకు న్యాయం చేయడానికి కృషి చేశా. నా శరీరాకృతిని దృఢంగా మలచుకున్నా. స్టంట్స్‌ని డూప్‌లేకుండా చేసే క్రమంలో పై నుంచి కిందపడ్డాను. వెన్నెముక గాయంతో మూడు నెలలు విశ్రాంతి తీసుకున్నా. ఫలితంగా సినిమా షూటింగ్‌కు అంతరాయం కలిగింది. నా కోసం నిర్మాత ఓపిక వహించారు. 'ఆ ఐదుగురు' విడుదల కోసం ఎదురు చూస్తున్నా. విడుదలయ్యాక నాకు మంచి ఆఫర్లు వస్తాయనే ఆశాభావంతో ఉన్నా. సోలో హీరో కంటే ఇద్దరు, ముగ్గురు హీరోలుంటే సినిమాలు చెయ్యాలనుకుంటున్నా. ఇదివరకు నేను చేసిన అలాంటి సినిమాలు మంచి హిట్టయ్యాయి.

ప్రొడక్షన్ అంటేనే భయం

ప్రస్తుతం తెలుగు చిత్రసీమలో పరిస్థితి బాగా లేదు. నిర్మాతలకు మేలు చేకూర్చే వాతావరణం ఇవాళ ఇండస్ట్రీలో అసలు లేదు. సినిమాలు తీసినా డిస్ట్రిబ్యూషన్ చాలా కష్టమైపోతోంది. గతంలో నేను ఓ సినిమాని ప్రొడ్యూస్ చేశాను. ఇవాళ ప్రొడక్షన్ అంటేనే భయమేస్తోంది. కొత్త నిర్మాతలు వస్తున్నా నిజాయితీగా సినిమాలు తీసే నిర్మాతలు తక్కువ. సినిమా నిర్మాణంలో ప్రొఫెషనలిజం తక్కువగా కనిపిస్తోంది. మోజు కోసమో, గ్లామర్ కోసమో వచ్చేవాళ్లే ఎక్కువ కనిపిస్తున్నారు. అలాగే మన సూపర్‌స్టార్ల సినిమాలను కూడా తమిళనాడులో ఎందుకు చూడరో, వాళ్ల సినిమాలను మనమెందుకు చూస్తున్నామో ఆలోచించాలి.

విలన్‌గా చేస్తా

నేను ప్రయోగాలకు సిద్ధంగా ఉన్నా. నెగటివ్ కేరక్టర్లూ చేస్తా. అయితే 'ఈగ'లో సుదీప్ చేసినటువంటి విలన్ కేరక్టర్ అయితేనే. అంటే కథకు ఆ పాత్ర కీలకంగా ఉండాలి.

- ఆంధ్రజ్యోతి డైలీ, 2 జూలై 2014

Saturday, June 28, 2014

Cinema: Extraordinary Writer Mullapudi Venkata Ramana

ఆయన మాట రమణీయం

నాటకంలో విజువల్ కన్నా శబ్దానికి ప్రాధాన్యం ఎక్కువ. కారణం సినిమాలోలా దూరంగా ఉన్నవాళ్లకు రంగస్థలం మీద నటులు సరిగా కనిపించరు. అందుకని సంభాషణలు ఎక్కువ ఉండాలి. అదే సినిమా విషయానికి వస్తే ఒక విజువల్‌తో వంద మాటలు పలికించవచ్చు. అంటే ఒక బొమ్మ వంద మాటల పెట్టు. దీన్ని దృష్టిలో పెట్టుకొని సంభాషణలు రాసినవాళ్లు చరిత్రలో గొప్ప రచయితలుగా నిలిచారు. అలాంటి అరుదైన సినీ రచయిత ముళ్లపూడి వెంకటరమణ. 'అందరికీ నచ్చే స్థాయిలో, అందరికీ అర్థమయ్యే రీతిలో ఉంటేనే అది మంచి స్క్రిప్టు' అని ఆయనే ఒకచోట చెప్పారు. అలాంటి మంచి స్క్రిప్టులు ఆయన కలం నుంచె అనేకం జాలువారాయి.

"నేను డైలాగ్ రైటర్ అయినప్పటికీ మొదట మనసులో బొమ్మ గీసుకుని దానికెంత కావాలో అంతే డైలాగులు రాస్తాను'' అని రమణ చెప్పుకున్నారు. బాపుతో జట్టు కట్టకముందే ఆయన పలు ఉత్తమ చిత్రాలకు కథ, సంభాషణలు సమకూర్చారు. 'సాక్షి' నుంచి 'శ్రీరామరాజ్యం' వరకు ఆయన బాపుతో ప్రయాణించారు. ఎన్నో కళాఖండాల రూపకల్పనలో బాపు సగమైతే, తను మరో సగమయ్యారు. రమణ స్క్రిప్టులో స్పష్టంగా కనిపించే అంశం ఎక్కడ మాట అవసరమో అక్కడే డైలాగ్ రావడం. ఆయన రచన చేసిన సినిమాల్లో హీరోల కంటే విలన్లే ఎక్కువగా మాట్లాడతారు. ఉదాహరణకు 'ముత్యాల ముగ్గు' తీసుకోండి. అందులో హీరో హీరోయిన్లు శ్రీధర్, సంగీత ఎక్కువగా మాట్లాడరు. విలన్ రావు గోపాలరావు తెగ మాట్లాడేస్తుంటాడు. ఆ పాత్రకు మాటే ఊపిరి. అయినప్పటికీ ఆ పాత్ర 'ఆకాశంలో మర్డర్ జరిగినట్టు లేదూ' అంటూ విజువల్‌తోనే పరిచయమవుతుంది. అప్పటివరకు రావు గోపాలరావు వేరు. 'ముత్యాల ముగ్గు' నుంచి రావు గోపాలరావు వేరు. ఆ సినిమా కంటే ముందు మరో సినిమాలో ఇదే తరహా విలన్ కేరక్టర్ మనకు కనిపిస్తుంది. ఆ సినిమా 'బుద్ధిమంతుడు' కాగా, ఆ విలన్ నాగభూషణం. ఆయన వేసిన పాత్రపేరు ప్రెసిడెంట్ శేషాద్రి. చేసేవి తప్పుడు పనులు కావడంతో, వాటిని కప్పిపుచ్చడానికి అబద్ధాలనూ, మోసాన్నీ ఆశ్రయిస్తూ తెగ వాగేస్తూ ఉంటాడు. ఆ పాత్రను నాగభూషణం అభినయించిన తీరు అనితర సాధ్యం.

గుడికీ, బడికీ మధ్య పోటీ

బాపు-రమణ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రాల్లో 'బుద్ధిమంతుడు'ది విశిష్ట స్థానం. ఈ చిత్రానికి రమణ కథ, మాటలు రచిస్తే, బాపు దర్శకత్వంతో పాటు స్క్రీన్‌ప్లే సమకూర్చారు. ఈ కథలో రమణ ఆస్తికతకూ, నాస్తికతకూ మధ్య, గుడీకీ, బడికీ మధ్య పోటీ పెట్టారు. ఆస్తికతకు, నాస్తికతకు ప్రతీకలుగా నిలిచిన ఇద్దరు అన్నదమ్ములు - మాధవయ్య, గోపి (నాగేశ్వరరావు ద్విపాత్రాభినయం) పాత్రలను సృష్టించారు. ఈ రెండింటిలో ఆయన ఏ పాత్రవైపు మొగ్గారనేది ఆసక్తికరం. ఆస్తికుడైన మాధవయ్యను అమాయకుడిగా మలిచిన రమణ నాస్తికుడైన గోపిని మొదట నీతి నిజాయితీలు కలిగిన వాడైనప్పటికీ జల్సారాయుడిగా మలిచారు. 'భూమ్మీద సుఖపడితే తప్పులేదురా.. బులపాటం తీర్చుకుంటే తప్పులేదురా' అంటూ సావాసగాళ్లతో ఖుషీఖుషీగా తిరిగే అతను అన్యాయాన్ని సహించలేడు. నిజాయితీని వదలడు. నాయిక పాత్ర రాధ (విజయనిర్మల)తో ప్రణయం కారణంగా జల్సాలకు స్వస్తి చెప్పి 'బుద్ధిమంతుని'గా మారతాడు గోపి. ఆ తర్వాతే అతనికి కష్టాలు మొదలవుతాయి. అపార్థంతో రాధ దూరమవుతుంది. అన్న మాధవయ్య "వాళ్ల కులమేమిటి? మన కులమేమిటి? వర్ణ సంకరం చేస్తావా? మన గౌరవ మర్యాదలు మంట గలుపుతావా?'' అని తమ్ముడి మీద కేకలేస్తాడు. అన్న కాళ్లమీద పడి క్షమాపణలు చెప్పమంటుంది తల్లి. "అమ్మా. నేను తప్పులు చేస్తూ విచ్చలవిడిగా తిరుగుతున్నంత కాలం నన్ను హెచ్చరించడానికి కూడా ఎవరికీ ధైర్యం లేకపోయింది. ఇప్పుడు తప్పులు దిద్దుకుని బుద్ధిమంతుడనై మంచి దారిన నడవబోతే అందరూ తలో రాయీ వేస్తున్నారు. నేనెవరికి క్షమాపణ చెప్పుకోవాలమ్మా. దేనికోసం క్షమాపణ చెప్పుకోవాలి. ఆనాడు తప్పులు చేసినందుకా? ఈనాడు బుద్ధిగా ఉన్నందుకా? చెప్పమ్మా'' అంటాడు గోపి ఆవేదనగా.

నిజం రాణిస్తుంది

తన వద్దకు వచ్చిన రాధ, దేవుని నగలను తనే దొంగిలించాన్నట్లు మాట్లాడితే "నీటిబొట్టు ఇసుకలో పడితే ఇంకిపోతుంది. సముద్రంలో పడితే ఆనవాలు లేకుండా పోతుంది. అదే ముత్యపు చిప్పలో పడితే ముత్యమై ప్రకాశిస్తుంది. నిజం కూడా అంతే. సమయం, సందర్భాన్ని బట్టి రాణిస్తుంది'' అని బాధపడతాడు గోపి. దేవుడు ఉన్నాడని నిరూపించడానికి మాధవయ్య "సరిగ్గా ఈ రాత్రి పన్నెండు గంటలకు గుడి గోపురం మీదున్న కలశం పైకి లేస్తుంది. నా స్వామి అసత్యం కాదు. మహిమ ముమ్మాటికీ జరుగుతుంది. అలా జరగని పక్షంలో నా స్వామి పాదాలపై నా ప్రాణం విడుస్తాను" అని భీకర ప్రతిజ్ఞ చేస్తాడు. అన్నయ్య చనిపోకూడదనీ, భక్తుల విశ్వాసం వమ్ము కాకూడదనీ, గుడి వెనుకనుంచి పైకెక్కి, గోపురం కలశాన్ని పైకి లేపి, దించుతాడు గోపి. దీనిని చూసిన మాధవయ్య దేవుణ్ణీ, తననూ, భక్తుల నమ్మకాన్నీ అవమానించావని తమ్ముణ్ణి తూలనాడతాడు. "అన్నయ్యా. నేను మనిషిని. చదువు సంస్కారం లేని సామాన్యుణ్ణి. దేవుడు ఉన్నాడో, లేడో అని విమర్శించే శక్తిలేని వాణ్ణి. నాకు తెలిసిన దేవుడు నా అన్నయ్యే. నా అన్నయ్యను దక్కించుకోవాలనుకున్నాను అంతే. ఇది మోసమే అయితే, అపచారమే అయితే, దైవ ధిక్కారమే అయితే నీ ఇష్టమొచ్చిన శిక్ష విధించు'' అంటాడు. ఇలా గోపి పాత్రను ఆదర్శవంతంగా, అదే సమయంలో శక్తిమంతంగా మలచారు రమణ.

మానవసేవే మాధవసేవ

ఆస్తికులంతా మంచివాళ్లు కారు, నాస్తికులంతా చెడ్డవాళ్లు కారు అని రమణ ఈ కథతో నిరూపించే ప్రయత్నం చేశారనిపిస్తుంది. గుడికీ, బడికీ మధ్య పోటీ పెట్టినా ఊరికి రెండూ కావాలనిపిస్తారు. అందుకు తగ్గట్లే పరమభక్తితో, అమాయకత్వంతో మూఢునిలా వ్యవహరించిన మాధవయ్యలో పరివర్తన కలిగేట్లు ఆ పాత్రను మలిచారు. తన ముందు ప్రత్యక్షమైన కృష్ణునితో తన తమ్ముడు భ్రష్టుడైపోయాడనీ, వర్ణ సంకరానికి కూడా ఒడిగట్టాడనీ ఆవేదన చెందుతాడు మాధవయ్య. 'మరైతే నువ్వు వర్ణ సంకరం చెయ్యడం లేదా?' అని ప్రశ్నించిన కృష్ణుడు (శోభన్‌బాబు) "నేను క్షత్రియుల ఇంటి పుట్టాననీ, గోపాలుర ఇంట పెరిగాననీ నువ్వెరుగవా?'' అనడుగుతాడు. మాధవయ్యకు జ్ఞానోదయం కలుగుతుంది. "సర్వాంతర్యామివి. నా అజ్ఞానాన్ని మన్నించు. అన్ని జీవుల్లోనూ, అన్ని జాతుల్లోనూ నీవేనని, అంతా ఒక్కటేననీ నాకు తెలియజెప్పావు. ఈ క్షణం నుంచీ సర్వ కులాలనూ, సర్వ మతాలనూ సమానంగా గౌరవిస్తాను'' అంటాడు. తమ్ముడితో "మానవసేవే మాధవసేవ. మానవ కోటి సుఖ సంతోషాలే భగవంతునికి నిజమైన ఆనందం'' అని చెబుతాడు. కథకు ప్రయోజనం ఉండాలని నమ్మే రచయిత కాబట్టే రమణ తన కథల్లో మంచికి పెద్దపీట వేసి, మంచి విషయాలను చెప్పే ప్రయత్నం చేస్తారు. సందర్భానికి తగ్గట్లుగా ఈ చిత్రంలో ఆయన రాసిన సంభాషణలు గొప్పగా రాణించాయి. నటీనటులు కూడా తమ పాత్ర పరిధుల మేరకు వాటిని పలికి, సంభాషణలు రక్తికట్టేలా చేశారు.

'ఆమ్యామ్యా' ఇందులోనిదే

ఈ సినిమాలో రామలింగం (అల్లు రామలింగయ్య) లంచం ఆశిస్తూ చెప్పే 'ఆమ్యామ్యా' అనే మాట నేటికీ లంచానికి పర్యాయపదంగా మారిన సంగతి తెలిసిందే. అయితే ఆ పదం సృష్టికర్త తాను కాననీ, సినిమాలో ఆ మాట పలికిన అల్లు రామలింగయ్యదేననీ రమణ చెప్పారు. "ఆ మాట నా ఎక్కౌంటులో పడిపోయింది. నాకు పేరొచ్చేసింది'' అని ఆయన రాసుకున్నారు. నేడు ఆయన మన మధ్య లేకపోయినా రమణీయమైన ఆయన మాటలు మన హృదయాల్లో ఎన్నటికీ నిలిచే ఉంటాయి. మాధవయ్య, గోపి పాత్రల్లో అక్కినేని నాగేశ్వరరావు, శేషాద్రిగా నాగభూషణం ప్రదర్శించిన అభినయం, రమణ సంభాషణలు, బాపు దర్శకత్వ ప్రతిభ, మిగతా సాంకేతిక నిపుణుల సామర్థ్యం కలిసి 'బుద్ధిమంతుడు'ను వంద రోజుల సినిమాగా నిలబెట్టాయి. విడుదలై నెల తిరక్కుండానే 60 వేలు ఓవర్‌ఫ్లో వచ్చిందంటే 1969లో అది చాలా పెద్ద మొత్తమే.

- ఆంధ్రజ్యోతి డైలీ, జూన్ 28, 2014

Tuesday, June 24, 2014

Cinema: The Evergreen Item Girl Jyothi Lakshmi

ఎవర్‌గ్రీన్ ఐటం గాళ్

ముప్పై అయిదేళ్ల క్రితం.. అంటే 1973లో శోభన్‌బాబు హీరోగా వచ్చిన 'ఇదా లోకం' సినిమాలోని 'గుడి ఎనక నా సామి గుర్రమెక్కి కూకున్నాడు..' పాట ఆంధ్ర ప్రేక్షక లోకాన్ని ఉర్రూతలూగించింది. ఆ పాటకు నర్తించింది.. అప్పటి మేటి శృంగార తార జ్యోతిలక్ష్మి. ఇన్నేళ్ల తర్వాత ఆ పాట 'కుబేరులు' అనే సినిమాలో రీమిక్స్ అవుతోంది. పల్లవిని యథాతథంగా ఉంచి, చరణాలు మార్చి భాస్కరభట్ల రవికుమార్ రాసిన ఆ పాటకు నర్తించింది.. వేరెవరో కాదు.. మళ్లీ జ్యోతిలక్ష్మే. 'అదెలా సాధ్యం!' అని చాలామంది ఆశ్చర్యపోవచ్చు. పాతికేళ్ల వయసులోని అప్పటి జ్యోతిలక్ష్మి ఇప్పుడు ఆరు పదుల వయసులోనూ వొంటి విరుపులతోనూ, నాట్య విలాసంతోనూ ఆ పాటకు నర్తించింది. ముంబైకి చెందిన తస్లీమా షేక్ అనే అందమైన డాన్సర్‌తో ఈ పాటకు ఆమె నర్తిస్తుంటే సెట్స్ మీద ఉన్నవాళ్లంతా చప్పట్లు కొట్టకుండా ఉండలేకపోయారు. కొంత కాలం గ్యాప్ తర్వాత తెలుగు సినిమాల్లోకి వచ్చిన ఆ స్టార్ డాన్సర్ తన అంతరంగాన్ని ప్రత్యేక ఇంటర్వ్యూలో 'నవ్య' ఎదుట ఆవిష్కరించింది. ఆసక్తికరమైన ఆ విశేషాలు...

నేను తమిళ అయ్యంగార్ల కుటుంబంలో పుట్టా. మా అమ్మా నాన్నలకు మొత్తం ఎనిమిది మంది సంతానం. నేనే పెద్దదాన్ని. అందరికంటే జయమాలిని చిన్నది. ఎనిమిది మందిలో ఐదుగురం ఆడపిల్లలం. చిన్నతనంలోనే నన్ను మా మేనత్త ఎస్.పి.ఎల్. ధనలక్ష్మి పెంపకం తీసుకుంది. ఆమె వద్దే పెరిగా. ఆమె అప్పటికే మంచి హీరోయిన్. ఆ తర్వాతే జ్యోతిని కాస్తా జ్యోతిలక్ష్మినయ్యా. పేరుపొందిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ టి.ఆర్. రామన్న మా అన్నయ్యే (పెద్దమ్మ కొడుకు). నేను ఐదేళ్ల వయసులో ఉన్నప్పుడు ఆయనే ఎంజీఅర్ సినిమా.. పేరు గుర్తులేదు.. అందులో ఒక పాటలో డ్యాన్స్ చేయించాడు. ఎనిమిదేళ్లప్పుడు శివాజీ గణేశన్ సినిమా 'కార్తవరాయన్ కథ'లో డ్యాన్స్ చేశా. ఆ తర్వాత పెద్దయ్యాక 1963లో విడుదలైన తమిళ చిత్రం 'పెరియ యిడత్తు పెణ్'తో మళ్లీ సినిమాల్లోకి వచ్చా. ఆ సినిమాలో ఎంజి రామచంద్రన్ హీరో. అందులో నగేశ్ సరసన వల్లి అనే పాత్ర చేశా. అది కామెడీ రోల్. ఆ పాత్ర నాకు బాగానే గుర్తింపు తెచ్చింది. నాకు గుర్తున్నంత వరకు తెలుగులో చేసిన తొలి సినిమా 'పెద్దక్కయ్య'. అది 1967లో వచ్చింది. అందులో డ్యాన్సర్‌గా చేశా. చిన్నప్పుడే నేను రామయ్య పిళ్లె దగ్గర భరతనాట్యం నేర్చుకున్నా. అందువల్ల సినిమా డ్యాన్సులు నాకు కష్టమనిపించలేదు. వాటికోసం ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకోకపోయినా భరతనాట్యమే అందుకు ఉపకరించింది. అందుకే ఎటువంటి క్లిష్టమైన డ్యాన్స్‌నైనా చేయగలిగా.

నాకు పోటీ నా చెల్లెలే

ఇప్పటివరకు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో వెయ్యికి మించి పాటల్లో నర్తించా. వీటిలో హీరోయిన్‌గా చేసిన సినిమాలు ఇరవై వరకు ఉంటాయి. తమిళంలో హీరోయిన్‌గా పది సినిమాల వరకు చేశా. ఎంజీఆర్‌తో 'తలైవా'లో జయలలితతో పాటు హీరోయిన్‌గా చేశా. అలాగే శివజీ గణేశన్‌తో సెకండ్ హీరోయిన్‌గా నటించా. తెలుగులో కృష్ణ గారితో 'మొనగాడొస్తున్నాడు జాగ్రత్త', 'హంతకులు దేవాంతకులు' సినిమాల్లో హీరోయిన్‌గా నటించే అవకాశం వచ్చింది. హరనాథ్‌తో 'పుణ్యవతి', రామకృష్ణతో 'పిల్లా? పిడుగా?' వంటి సినిమాల్లో హీరోయిన్‌గా నటించా. సంఖ్యాపరంగా చూసుకుంటే ఎక్కువగా కృష్ణగారి సినిమాల్లో చేశాను. డైరెక్టర్ల విషయానికి వస్తే ఎక్కువగా కె.ఎస్.ఆర్. దాస్ దర్శకత్వంలో నటించా. అప్పట్లో ఫైటింగ్ సినిమాలంటే నేను తప్పకుండా ఉండేదాన్ని. ఫైటింగ్ సీన్లలో నేనే స్వయంగా నటించేదాన్ని. డూప్‌ని ఎప్పుడోగానీ ఉపయోగించేవాళ్లు కాదు. విజయలలిత, హలం వంటి వాళ్లున్నా నాకు ప్రధాన పోటీ నా చెల్లెలు జయామాలినియే. అప్పట్లో నేను గర్భవతిగా ఉండి, కొద్ది రోజులు సినిమాలకు దూరమయ్యా. ఆ టైంలోనే జయమాలిని సినిమాల్లోకి వచ్చి సక్సెసయ్యింది. అందం తనకు ప్లస్ పాయింట్. కొన్ని నెలలకు నేను తిరిగి సినిమాల్లోకి వచ్చేశా. అప్పట్నించీ మా మధ్య పోటీ ఉండేది. అయితే ఈ విషయంలో మేమిద్దరమూ ఒకరి పట్ల ఒకరం అసూయ చెందింది లేదు. చాలా సినిమాల్లో కలిసే డాన్సులు చేశాం. ఒకర్ని మించి ఒకరం బాగా డాన్స్ చేయాలని తపన పడేవాళ్లం. అందుకే మా పాటలు అంతగా పాపులర్ అయ్యాయి. మా డాన్సులు అంతగా పేరు తెచ్చుకున్నాయి. నేనింకా సినిమాల్లో కొనసాగుతున్నా, తను మాత్రం ఇక సినిమాల్లో నటించకూడదని నిర్ణయం తీసుకుంది. పెళ్లి చేసుకొని చెన్నైలోనే ఉంటోంది. సమయాన్నంతా కుటుంబానికే కేటాయిస్తోంది. తనకు ఒక మనవడున్నాడు.

ఎక్స్‌పోజింగ్‌కు ఇబ్బంది పడలేదు

నా కూతురు జ్యోతిమీనా కూడా జయ బాటే పట్టింది. నా వారసురాలిగా డాన్సర్‌గా అడుగు పెట్టినప్పటికీ, మీనాకు ఈ ఫీల్డ్ అంతగా నచ్చలేదు. అందుకే తనకు పెళ్లి చేసేశా. హాయిగా కాపురం చేసుకుంటోంది. తనకు ఒక పాప. ఇటీవలి కాలంలో నాకు తెలుగులో గ్యాప్ వచ్చిందన్నది నిజం. అయితే తమిళంలో అడపాదడపా చేస్తూనే ఉన్నా. తమిళ టీవీ సీరియల్స్‌తో పాటు తెలుగులో 'మా ఇంటి మహాలక్ష్మి', 'ఓం నమో వెంకటేశాయ' వంటి సీరియల్స్ చేశా. రాజశేఖర్ హీరోగా నటించిన 'శేషు' తర్వాత మళ్లీ తెలుగులో నటించడం ఇదే. నేను డాన్స్ చేసిన పాటలన్నీ నాకిష్టమైనవే కానీ, ఎన్టీఆర్ సినిమా 'సర్దార్ పాపారాయుడు'లోని 'జ్యోతిలక్ష్మి చీర కట్టింది.. ఆ చీరకే సిగ్గేసింది' పాటంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఆ రోజుల్లో నేను చీరకట్టడమనేది ఒక సెన్సేషన్. ఆ పాట అప్పట్లో బాగా పాపులర్. ఏ మూలకు వెళ్లినా ఆ పాట చాలా కాలం వినిపించింది. "ఐటం సాంగ్స్ అంటే ఎక్స్‌పోజింగ్ తప్పనిసరి కదా.. ఇన్ని పాటలు ఎలా చేయగలిగారు?" అని మీతో పాటు ఒకరిద్దరు నన్నడిగారు. డాన్సర్‌గా చేయడమంటే ఎక్స్‌పోజింగ్ తప్పదని తెలుసు. మొదటే ప్రిపేరయ్యాను కాబట్టే తొలినాళ్ల నుంచీ ఇప్పటిదాకా ఎక్స్‌పోజింగ్‌కు కానీ, కురచ దుస్తులు వేసుకోవడానికి కానీ నేనెన్నడూ ఇబ్బంది పడలేదు. ఎందుకంటే డాన్సింగ్‌ని నేను వృత్తిగా, పనిగా భావించాను కాబట్టి. అందుకే నాలుగు దశాబ్దాలుగా కెరీర్ కొనసాగించగలిగా. అదే హీరోయిన్‌గా అయితే ఇప్పుడు మీకు కనిపించేదాన్నా!

అదే నా ఆరోగ్య రహస్యం

ఆ రోజుల్లోని ట్రెండు ప్రకారం ఆ క్లబ్ సాంగ్స్ ఎలా బాగుండేవో, ఇప్పటి ట్రెండు ప్రకారం ఈ ఐటం సాంగ్సూ బాగుంటున్నాయి.  మధ్యలో కొంత కాలం ఐటం సాంగ్స్ వెనుకపట్టు పట్టినా, మళ్లీ ఇప్పుడు వాటికి మంచి రోజులు నడుస్తున్నాయి. అందుకే నాకు మళ్లీ అవకాశాలొస్తున్నాయి. 'ఈ వయసులోనూ ఎందుకు ఈ డాన్సులు చెయ్యడం?' అని మీరడగవచ్చు. చేసే ఓపిక ఉంది కాబట్టే చేస్తున్నా. చేస్తూనే ఉంటా. ఓపిక లేనప్పుడు మానేస్తా. అదెప్పుడనేది చెప్పలేను. హీరోయిన్ సహా అన్ని రకాల పాత్రలూ చేశా. హీరో మాదిరిగా ఫైట్లు, డాన్సులు చేశా. వచ్చిన ప్రతి అవకాశాన్ని కాదనకుండా చేశా. అందువల్ల ఫలానా రకం పాత్ర చేయలేదనే అసంతృప్తి నాలో లేదు. ఆహారాన్ని మితంగా తీసుకోవడమే నా ఆరోగ్యం వెనుక ఉన్న రహస్యమంటాను. ఇంటి పనులు నేనే చేసుకుంటా. అందుకే ఒంటిని ఇప్పటికీ కాపాడుకోగలుగుతున్నా. రాజా హీరోగా నటిస్తున్న 'జగన్మోహిని'లో నమిత తల్లిగా నటిస్తున్నా. నమిత జగన్మోహిని అన్నమాట. ఈ సినిమా తెలుగు, తమిళం.. రెండు భాషల్లోనూ తయారవుతోంది. అలాగే శ్రీనివాసరెడ్డి డైరెక్ట్ చేస్తున్న 'కుబేరులు'లో ఐటం సాంగ్ చేశా. ఒకప్పుడు నేను 'ఇదా లోకం' సినిమాలో డాన్స్ చేయగా, బ్రహ్మాండంగా పాపులర్ అయిన 'గుడి యెనక నా సామి గుర్రమెక్కి పోతున్నాడు'కు ఇది రీమిక్స్ సాంగ్. ముప్పై ఐదేళ్ల తర్వాత అదే పాటకు మళ్లీ నేనే డాన్స్ చెయ్యడం కొత్తగానూ, ఆనందంగానూ ఉంది. అలాగే దాసరి నారాయణరావుగారి సినిమా 'మేస్త్రి'లో హీరో బామ్మగా నటిస్తున్నా.
ఇప్పటి తరానికి నా గురించి పెద్దగా తెలిసి ఉండకపోవచ్చు. కానీ ఒకప్పుడు రెండు దశాబ్దాల పైగా నా ఆట పాటతో దక్షిణాది ప్రేక్షకుల్ని మురిపించాను, మైమరపింపజేశాననే తృప్తి ఉంది. 'ఆ సినిమాలో జ్యోతిలక్ష్మి పాట ఉందా?' అని మగవాళ్లు అడిగేవాళ్లంటే.. అంతకంటే ఒక సినిమా డాన్సర్‌గా నాకు కావలసిందేముంది! ఈ తరం ప్రేక్షకుల హృదయాల్లోనూ స్థానం పొందాలనేది ఇప్పటి నా లక్ష్యం.

- నవ్య వీక్లీ, డిసెంబర్ 3, 2008

Wednesday, June 18, 2014

Cinema: Ram Gopal Varma.. The Experimental Technician

ప్రయోగాలకు వెరవని టెక్నీషియన్

ట్రెండ్‌సెట్టర్లకే ట్రెండ్‌సెట్టర్‌గా నిలిచి నాగార్జున, జగపతిబాబు, జె.డి. చక్రవర్తి వంటి నటులకు స్టార్‌డం కల్పించిన దర్శకుడు రాంగోపాల్‌వర్మ ఇవాళ హిందీ చిత్రసీమకే అంకితమవడం విచారకరం. ఆరు పాటలు, ఐదు ఫైట్లు, వెగటు పుట్టించే ముతక హాస్య సన్నివేశాలు, ద్వంద్వార్థాల సంభాషణలు - ఇవే తెలుగు సినిమా అంటే.. అనే స్థితి నుంచి ఒక్కసారిగా సాంకేతిక అంశాలవైపు దృష్టి మరలింపజేసి తెలుగు ప్రేక్షకులకు కొత్తదనాన్ని చూపించినవాడు వర్మ. కథ కంటే కథనానికే ఎక్కువ ప్రాధాన్యాన్నిచ్చి సూటిగా ప్రేక్షకుల హృదయాల్ని తాకేట్లుగా సన్నివేశాల్ని మలచడంలో వర్మ నిష్ణాతుడు. ఇందుకు మంచి ఉదాహరణ - 'క్షణ క్షణం'. కథగా చెప్పుకోడానికి ఏమీలేని ఈ సినిమాని కేవలం కథనంతో, సహజమని భ్రమింపజేసే సన్నివేశాలతో ఆద్యంతం ఆసక్తికరంగా రూపొందించాడు. పాటల చిత్రీకరణలో కూడా వర్మ ప్రత్యేకత కనిపిస్తుంది. పాటల్లో నేపథ్యం (బ్యాక్‌గ్రౌండ్) ఎలా ఉండాలో కూడా ఈ సినిమాలో చూపించాడు వర్మ.
ఒక్క 'శివ' చిత్రంతోటే వర్మ అగ్రశ్రేణి దర్శకుల జాబితాలో చేరిపోయాడు. పైగా అది మొదటి చిత్రం కూడా. ఆ సినిమా నాగార్జునకు స్టార్‌డం కల్పించి చిరంజీవి తర్వాత రెండో స్థానాన్ని సాధించిపెట్టింది. యువతలో 'శివ' సృస్టించిన అలజడి అంతా ఇంతా కాదు. ఆ సినిమా వల్ల యువత చెడిపోతున్నదని అప్పుడంతా గోలపెట్టినవాళ్లే. కాలేజీ కేంపస్‌లలో 'శివ' తరహాలో జరిగిన అల్లర్లు దీనికి మద్దతుగా నిలిచాయి. మొత్తానికి ఆ సినిమాతో వర్మ, నాగార్జున - ఇద్దరూ పరస్పర ప్రయోజనం పొందారు. ఐనా వర్మ సంతృప్తి చెందలేదు. అతడిలోని టెక్నీషియన్ నిరంతర శోధనలోనే ఉండేవాడు. 'క్షణ క్షణం' ఆ టెక్నీషియన్‌కు మరింత పదునుపెట్టింది. కాగా ఆ సినిమాలోని కొన్ని సన్నివేశాలకు స్ఫూర్తి రాజ్‌కపూర్ 'చోరీ చోరీ' అనిపిస్తుంది.
ప్రయోగాత్మక చిత్రాలకు ఎప్పుడో కానీ ఆదరణ చూపని తెలుగు ప్రేక్షకులను ఒప్పించే లక్ష్యంతో వర్మ 'రాత్రి', 'దెయ్యం' సినిమాలను తీశాడు. మనిషిలో అంతర్లీనంగా ఉండే భయాందోళనలు ఆ మనిషిని ఎలా కల్లోలపరుస్తాయో ఆ రెండు చిత్రాల్లో చూపించేందుకు ప్రయత్నించాడు వర్మ. 'దెయ్యం' విడుదలకు ముందు ప్రకటనల విషయంలోనూ కొత్త పుంతలు తొక్కాడు. ఐతే ఇవి రెండూ బాక్సాఫీస్ వద్ద నిలదొక్కుకోలేక పోయాయి.
అంతకు ముందు జగపతిబాబు హీరోగా 'గాయం' చిత్రాన్ని తీసి సక్సెస్ సాధించాడు వర్మ. సరైన సక్సెస్ లేక డౌన్ స్టేజ్‌కి చేరువవుతున్న సమయంలో జగపతిబాబుకు 'గాయం' ఊరటనివ్వడమే కాకుండా చిత్రసీమలో మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. రాంగోపాల్‌వర్మ డైరెక్షన్‌లో ఇది ఊర్మిళకు రెండో సినిమా. తొలి సినిమా 'అంతం' ఘోరంగా ఫ్లాపైంది. మచ్చుకైనా తెలుగుతనం కనిపించకపోవడం, హాలీవుడ్ స్టయిల్లో రూపొందించాలనే తాపత్రయంతో కథని పూర్తిగా నిర్లక్ష్యం చేసి, కథనాన్ని సైతం చికాకు పరిచేలా తయారుచేయడం 'అంతం' బాక్సులన్నీ తిరుగుటపా కట్టడానికి కారణం. అయినా వర్మ పరాజయానికి కుంగిపోయే రకం కాదు. 'ప్రయోగాలకు స్వస్తిచెప్పి సాధారణ స్థాయిలో సినిమాలు తీసుకుందాం' అనుకొనే సాధారణ దర్శకుడు కాదు. అందుకనే తెలుగువాళ్లకే కాదు, దేశంలోని కోట్లాది ప్రజానీకానికి ఇలవేల్పు అయిన వెంకటేశ్వరస్వామి మీదే ప్రయోగం చేయాలనుకొని 'గోవిందా గోవిందా'ని తలపెట్టాడు. చిత్రం నిర్మాణంలో ఉన్నప్పుడే విమర్శలు వచ్చాయి. అయినా వెరవక చిత్రాన్ని పూర్తిచేశాడు. జయాపజయాల మాటెలా ఉన్నా చిత్రంలోని సన్నివేశాలు, పాటల చిత్రీకరణ వర్మలోని దర్శకత్వ ప్రతిభను చాటిచెప్పాయి. సెన్సార్ వాళ్లు ఈ సినిమాకు చేసిన 'కట్స్' వల్ల వర్మకి తెలుగు సెన్సార్ బోర్డు మీద కోపం వచ్చి "ఇక తెలుగు సినిమాలు చేయను" అని స్టేట్‌మెంట్ ఇచ్చాడు. అయితే తర్వాత జె.డి. చక్రవర్తి, ఊర్మిళ జంటగా 'అనగనగా ఒక రోజు' అనే సినిమా మొదలుపెట్టాడు. "తెలుగు సినిమాలను తీయనన్నారుగా" అనడిగితే "ఆ స్టేట్‌మెంట్ ఇవ్వకముందే ఈ సినిమా మొదలైపోయింది" అన్నాడు. 'అనగనగా ఒక రోజు'తో బ్రహ్మానందం ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు. సినిమా కూడా జనానికి నచ్చింది. అదే ఆఖరు - తెలుగు సినిమాకు వర్మ దర్శకత్వం వహించడం.
ముంబైకి వెళ్లి తీసిన తొలి సినిమా పెద్ద సంచలనం రేపింది. అది 'రంగీలా'. సినిమా రంగానికి వెళ్లిన ఓ సాధారణ యువతి స్టార్ అయినా కూడా సామాన్యుడైన తన పూర్వ స్నేహితుణ్ణే పెళ్లాడాలని నిర్ణయించుకోవడం ఈ సినిమా ఇతివృత్తం. 'రంగీలా ఆయిరే' పాట అప్పట్లో యువతని ఓ ఊపు ఊపింది. ఊర్మిళతోనే ఎక్కువగా సినిమాలు తీస్తుంటే ఇద్దరిమీదా గాసిప్స్ మొదలయ్యాయి. ఇలాంటివేమీ పట్టించుకొనే ఘటం కాదు కాబట్టి ఆ తర్వాత కూడా ఊర్మిళతో సినిమాలు తీస్తూనే వచ్చాడు వర్మ. 'కౌన్', 'సత్య', 'మస్త్', ఇప్పుడు 'జంగిల్' - వీటన్నింటిలోనూ ఊర్మిళనే హీరోయిన్. రెండే పాత్రలతో తీసిన మరో ప్రయోగాత్మక చిత్రం 'కౌన్' సక్సెస్ కాలేదు. దీంట్లో నటించిన మజోన్ బాజ్‌పేయి అంతకుముందు 'సత్య'తో వెలుగులోకి వచ్చాడు. మనోజ్ హీరోగా ఓ చిత్రాన్ని తీస్తానని చెప్పిన వర్మ చెప్పినట్లుగానే 'శూల్' తీశాడు. అయితే తాను నిర్మాతగా మాత్రమే ఉండి శిష్యుడైన నివాస్‌కు దర్శకత్వం అప్పజెప్పాడు. సినీ జగత్తు నేపథ్యంతోనే వర్మ తీసిన 'మస్త్' కూడా ఫ్లాపయింది. త్వరలో 'జంగిల్' సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు. ఇందులో ఫిరోజ్‌ఖాన్ కొడుకు ఫర్దీన్‌ఖాన్‌ని హీరోగా పరిచయం చేస్తున్నాడు. వర్మ స్థాయిలోనే టెక్నికల్ వాల్యూస్‌తో ఈ చిత్రం వస్తుందని అందరూ భావిస్తున్నారు.
తన సినిమాలతో కొంతమందికి స్టార్‌డంనీ, మరికొంతమంది కొత్తవాళ్లకి గుర్తింపునీ తీసుకువచ్చిన వర్మ చిత్రంలో నటించడానికి ఆరాటపడని వాళ్లుండరు. జె.డి. చక్రవర్తి, మనోజ్ బాజ్‌పేయి, అఫ్తాబ్ శివ్‌దాసాని, ఫర్దీన్‌ఖాన్ వంటి వాళ్లని తెరకి పరిచయం చేసినా కొంతమంది మంచి టెక్నీషియన్స్‌ని కూడా చిత్రసీమకు అందించాడు. అతడి శిష్యుడైన కృష్ణవంశీ ఇవాళ అగ్రశ్రేణి దర్శకుల్లో ఒకడు. ఏమైనా హిందీ చిత్రసీమకే పూర్తిగా అంకితమైపోకుండా మాతృసీమ అయిన తెలుగు చిత్రసీమకూ సేవ అందించాలనీ, వర్మ తెలుగు చిత్రాలు తీస్తే బాగుండుననీ కొంతమందైనా అనుకుంటున్నారు.

- ఆంధ్రభూమి 'వెన్నెల', 26 మే, 2000