Saturday, December 8, 2012

బండోడు గుండమ్మ (1980) - సమీక్ష


ఓ అమాయకుల్లో అమాయకుడి కథతో దాసరి నారాయణరావు రూపొందించిన సినిమా 'బండోడు గుండమ్మ'. అమాయకుడైన ఆంజనేయులుకి చెల్లెలంటే ప్రాణం. చిన్న పిల్లలతో కలిసి ఆడుకునే అతను వారి ప్రోద్బలం మీద గుండమ్మను ప్రేమిస్తాడు. క్రమంగా గుండమ్మ కూడా అతడికి మనసిస్తుంది. దశరథరామయ్య కొడుకు డాక్టర్ ప్రసాద్‌తో తన చెల్లెలి పెళ్లి జరగాలంటే  25 వేల రూపాయలు కట్నం కింద ఇవ్వాలంటారు. డబ్బు సంపాదన కోసం పట్నం వెళ్లిన ఆంజనేయులుకు రాఘవరావు తారసపడతాడు. అతను అచ్చం ఆంజనేయులు మాదిరిగానే ఉంటాడు. కానీ రాఘవరావు దోపిడీలు, హత్యలు చేసి డబ్బు సంపాదిస్తుంటాడు. తన స్థానంలో ఆంజనేయుల్ని ప్రవేశపెట్టి పోలీసుల బారి నుంచి తప్పించుకోవాలనుకున్న రాఘవరావు ఓ కారు ప్రమాదంలో గాయపడతాడు. ఆంజనేయుల్ని వెతుక్కుంటూ పట్నం వచ్చిన గుండమ్మ అతడే అనుకొని రాఘవరావును ఊరికి తీసుకుపోతుంది. మరోవైపు రాఘవరావు స్థానంలో అతనింటికి వెళ్తాడు ఆంజనేయులు. ఆ తర్వాత కథ ఎలా నడిచిందనేది ఆసక్తికరం.
కథ, మాటలు, స్క్రీన్‌ప్లేతో పాటు కొన్ని పాటలు కూడా రాసిన దర్శకుడు దాసరి నారాయణరావు ఈ కథను ప్రేక్షకుల్ని అలరించేలా చిత్రీకరించడంలో సఫలమయ్యాడు. ఆంజనేయులు తన చెల్లెలికి సంబంధం మాట్లాడటానికి వెళ్లిన సన్నివేశాల్లో రచయితగా, దర్శకుడిగా ఆయన ప్రతిభ కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి. అలాగే ఆంజనేయుల్ని రాఘవరావు తన ఇంటికి తెచ్చినప్పుడు రాఘవ భార్య తన చిన్నారి కొడుక్కి పులి, ఆవు కథను చెప్పే సన్నివేశం ఆయన ఇమాజినేషన్‌కు నిదర్శనం.
ఇటు ఆంజనేయులు, అటు రాఘవరావు పాత్రల్లో కృష్ణ వైవిధ్యభరితమైన నటన ప్రదర్శించాడు. ఆంజనేయులు పాత్రలో ఆయన చూపిన అమాయకత్వం, హావభావాలు ఆకట్టుకుంటాయి. గుండమ్మగా జయప్రద బాగా రాణించగా, రాఘవరావు భార్యగా ప్రభ సరిగ్గా సరిపోయింది. చక్రవర్తి బాణీలు కూర్చిన పాటల్లో 'సిరిపురపు సిన్నోడా', 'ఊరు నిదురపోతోంది.. గాలి నిదురపోతోంది' పాటలు శ్రావ్యంగా ఉన్నాయి. కన్నప్ప ఛాయాగ్రహణం సినిమాకి ఎస్సెట్.

Friday, December 7, 2012

మాధవపెద్ది వెంకటరామయ్య (1898-1951)


రంగస్థలంపై ఉదాత్త నటనకు భాష్యం చెప్పిన మాధవపెద్ది వెంకటరామయ్యకు శివాజీ, దుర్యోధనుడు, రంగారాయుడు పాత్రలు ఎంతో పేరు తెచ్చాయి. దుర్యోధనుడిని అభిజాత్యం ఉన్న శౌర్యవంతునిగా, శాస్త్ర విషయ సంపన్నుడిగా, స్వశక్తి మీద నమ్మకం ఉన్న రారాజుగా తొలిసారి రంగస్థలం మీద మలిచింది మాధవపెద్దే. 'ప్రతాపరుద్రీయం'లో విద్యానాథుని పాత్రను ధరించి ఆ పాత్రకు కూడా అజరామరత్వం కల్పించారు.
మాధవపెద్ది సినిమాల్లోనూ రాణించారు. 'ద్రౌపదీ మాన సంరక్షణము' (1936)లో శిశుపాలుడు, 'సతీ తులసి' (1936)లో శివుడు, 'విజయదశమి' (1937)లో కీచకుడు, 'నల దమయంతి' (1938)లో నలుడు, 'పార్వతీ కల్యాణం' (1939)లో శివుడు, 'చంద్రహాస' (1941)లో దుష్టబుద్ధి వంటి పాత్రల్ని గొప్పగా పోషించారు.
ఆయన గుంటూరు జిల్లా బ్రాహ్మణ కోడూరులో 1898లో జన్మించారు. 1951 మార్చి 19న తెనాలిలో మరణించారు.

Saturday, December 1, 2012

అగ్నిపూలు (1981) - సమీక్ష


అత్యంత ప్రజాదరణ పొందిన యద్దనపూడి సులోచనారాణి నవల 'అగ్నిపూలు' ఆధారంగా అదే పేరుతో డి. రామానాయుడు నిర్మించిన సినిమాలో కృష్ణంరాజు, జయసుధ, జయప్రద ప్రధాన పాత్రలు పోషించారు. కె. బాపయ్య దర్శకుడు. 'అగ్నిపూలు' కథలో భిన్న దృక్పథాలు, భిన్న వ్యక్తిత్వాలు ఉన్న పాత్రలెన్నో ఉన్నాయి. అన్ని పాత్రలకీ ప్రాముఖ్యం ఉంది. ఏ ఒక్క పాత్ర ఔచిత్యం దెబ్బతినకుండా రెండున్నర గంటల సినిమాగా దీన్ని తీర్చిదిద్దడంలో ఎంతో నేర్పు ప్రదర్శించాడు బాపయ్య.
రాజులు, రాజ్యాలు పోయినా దర్పం వదలని జమీందారు గోవింద వల్లభరాజా. ఆయన కుమారుడు శివప్రసాద్ అమెరికాలో ఉంటూ అక్కడే మేరీ అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. వారికి జానీ, బాబీ అనే ఇద్దరు పిల్లలు. భార్యా పిల్లలతో కలిసి తన ఇంటికి కొడుకు వస్తున్నాడని తెలిసి ఉగ్రుడైన వల్లభరాజా అతడికీ, తనకీ ఎలాంటి సంబంధం లేదని ప్రకటిస్తాడు. ఆయన ఆస్తి మీద కన్నేసిన అల్లుడు విరూపాక్షి రాజా, కూతురు రాజేశ్వరి అగ్నికి ఆజ్యం పోస్తారు. ఇంటికి వచ్చిన శివప్రసాద్, మేరీలను ఔట్‌హౌస్‌లో ఉంచి అవమానిస్తారు. వల్లభరాజా చనిపోతే అతని మృతదేహాన్ని చూసేందుకు కూడా అనుమతించరు.
కాలం గడిచి, విరూపాక్షి రాజా కూడా చనిపోతాడు. అతని కొడుకు కృష్ణ చైతన్య జమీందారీకి అధిపతి అవుతాడు. రుక్మిణి అనే అందాల భామను పెళ్లాడతాడు. ఒక ప్రమాదంలో రుక్మిణి అవిటిదవుతుంది. వల్లభరాజా భార్య అన్నపూర్ణ అభ్యర్థనపై శివప్రసాద్ పిల్లలు జానీ, బాబీలను ఇంటికి తీసుకొస్తారు. తన తల్లిదండ్రుల దారుణ మరణానికి కారకులైన విరూపాక్షి రాజా కుటుంబం మీద, ముఖ్యంగా కృష్ణ చైతన్య మీద పగ తీర్చుకోవాలని చూస్తుంది జానీ. ఆమె చేష్టలు శాంత స్వభావుడైన కృష్ణ చైతన్యకు అర్థం కావు. జానీ దాచుకున్న డైరీ అతడికి దొరుకుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందన్నది పతాక సన్నివేశాల్లో తెలుస్తుంది.
భిన్న దృక్పథాలు కలిగిని విరూపాక్షి రాజా, కృష్ణ చైతన్య పాత్రలు రెండింటినీ కృష్ణంరాజు ప్రశంసనీయంగా పోషించారు. ముఖ్యంగా విరూపాక్షి రాజాగా ఆయన నటన బాగా ఆకట్టుకుంటుంది. పగతో రగిలిపోయే జానీ పాత్రలో జయసుధ మరోసారి తన నటనా ప్రతిభను ప్రదర్శించింది. అవిటిదైన రుక్మిణిగా జయప్రద సమర్థవంతంగా నటించింది. ఆమె చేసిన సర్ప నృత్యం సినిమాకే హైలైట్. రాజేశ్వరిగా జయంతి పాత్ర పరిధి మేరకు బాగా చేసింది. సుధాకర్, నిర్మల, శ్రీధర్, గుమ్మడి, సత్యనారాయణ, సుమలత, సుభాషిణి, దిల్‌జిత్ వీర్ ఇతర పాత్రలు పోషించారు. శరత్‌బాబుకు మరికొన్ని డైలాగులు పెడితే బాగుండేది. అల్లు రామలింగయ్యపై చిత్రీకరించిన సన్నివేశాల ప్రయోజనం స్వల్పం.
జంధ్యాల మాటలు, ఆత్రేయ పాటలు, మహదేవన్ సంగీతం, వెంకట్ ఛాయాగ్రహణం సినిమాకి నిండుదనం తెచ్చాయి. మైసూరు లలితమహల్‌ను దర్శకుడు బాపయ్య చక్కగా వినియోగించుకున్నాడు. మొత్తానికి చక్కని నవలా చిత్రాన్ని చూసిన భావన ప్రేక్షకులకు కలుగుతుంది.

Saturday, November 24, 2012

ఆడది గడప దాటితే (1980) - సమీక్ష


మన సమాజంలో పురుషునికి లేకుండా స్త్రీకి మాత్రమే కొన్ని కట్టుబాట్లు నిర్దేశించారు. గడప దాటిన స్త్రీకి అగచాట్లు, నగుబాట్లు తప్పవని చెప్పే కథలు ఎన్నో ప్రచారంలో ఉన్నాయి. గడప దాటిన స్త్రీని సమాజం ఎంతగా హింసిస్తుందో చలం సైతం తన రచనల్లో ఎంతో సహజంగా చిత్రించాడు. ఫలానా అమ్మాయి ఇంట్లోంచి వెళ్లిపోయిందని హేళన చేయడం తేలికే. కానీ అలా వెళ్లిందంటే దాని వెనక ఎంతటి బలీయమైన కారణం ఉండి ఉంటుందని ఆలోచించేవాళ్లు బహు అరుదు. ఇదే పాయింటుతో దర్శకుడు బి.ఎస్. నారాయణ రూపొందించిన సినిమా 'ఆడది గడప దాటితే'.
కోటీశ్వరుడు రఘునందనరావు ఏకైక కుమార్తె కరుణ. రాహుల్ అనే యువకుడు, కరుణ గాఢంగా ప్రేమించుకుంటారు. కరుణ వెనకున్న ఆస్తిని చూసే ఆమెని రాహుల్ ప్రేమిస్తున్నాడనేది రఘునందనరావు నమ్మకం. రాహుల్‌ను ఇంటికి పిలిపించి అవమానిస్తాడు. అయినా కరుణ, రాహుల్ జంకరు. రిజిస్టర్ మ్యారేజ్ కోసం తేదీ నిర్ణయించుకుంటారు. ఇంట్లోంచి వచ్చేసిన కరుణకు చిల్లిగవ్వ ఆస్తి రాదని తెలిసిన రాహుల్ మాయమైపోతాడు. రోడ్డునపడిన కరుణను ఇన్‌స్పెక్టర్ కృష్ణ ఆదుకుంటాడు. ఆమెని నమ్మించి గుళ్లో పెళ్లి చేసుకుంటాడు. కరుణకు నెలలు నిండిన సందర్భంలో కృష్ణకు అదివరకే పెళ్లయిందనే సంగతి తెలుస్తుంది. కరుణను ఆస్పత్రిలో చేర్పించి, ఆ ఊరినుంచి బదిలీ చేయించుకుని వెళ్లిపోతాడు కృష్ణ. మగబిడ్డను కన్న కరుణకు ఆర్టిస్ట్ మధుబాబు ఆశ్రయమిస్తాడు. తన చిత్రాలకు ఆమెను మోడల్‌గా తీసుకుంటాడు. ఆమెపై అతను ప్రేమ పెంచుకుంటున్న సమయంలోనే అతని స్నేహితుడు, కోటీశ్వరుడు ఆయిన ఆనంద్ రావడంతో కథ మరో మలుపు తీసుకుంటుంది. ఆ తర్వాత ఏమైందన్నది పతాక సన్నివేశం.
కరుణగా కన్నడ మంజుల సమర్థవంతంగా నటించింది. రాహుల్‌గా నరసింహరాజు, మధుబాబుగా మురళీమోహన్, ఆనంద్‌గా శ్రీధర్ రాణించారు. జగ్గయ్య, శరత్‌బాబు, రాజేంద్రప్రసాద్ ఇతర ప్రధాన పాత్రధారులు. యండమూరి వీరేంద్రనాథ్ మాటలు రాయగా, దాశరథి, సినారె, కోపల్లె పాటలు రాశారు. ఎం.బి. శ్రీనివాస్ కూర్చిన బాణీలు శ్రవణానందకరం. చక్కటి డ్రామాతో బి.ఎస్. నారాయణ ఆద్యంతం ఆసక్తికరంగా చిత్రాన్ని మలిచారు. శ్రీ శ్రీనివాస పద్మావతి ప్రొడక్షన్స్ పతాకంపై బి. రామచంద్రరావు, ఎం.ఎం. రాజా, సి. సుబ్బారాయుడు ఈ సినిమా నిర్మించారు.

Saturday, November 17, 2012

ఆకలి రాజ్యం (1981) - సమీక్ష


దేశంలో నిరుద్యోగం తాండవిస్తున్న కాలంలో కె. బాలచందర్ రూపొందించిన గొప్ప చిత్రం 'ఆకలి రాజ్యం'. ఆనాటి యువతరం ఈ సినిమాని తమ సొంతం చేసుకుంది. కథలోకి వస్తే - రంగా తన కాళ్ల మీద తను నిల్చోవాలనుకునే ఆదర్శ యువకుడు. ఆత్మాభిమాని. ఆవేశపరుడు. అందుకే ఉద్యోగం కోసం ఎక్కడకు వెళ్లినా నిరాశే ఎదురవుతుంది. ఆ నిరాశ ఆవేశంగా మారి శ్రీశ్రీ మాటల్ని ఉటంకిస్తుంటాడు. అతడికి నాటకాలు వేసే దేవి పరిచయమవుతుంది. క్లైమాక్స్‌లో రంగా క్షౌరశాలలో పనిచేస్తుండగా అతడి తండ్రి గడ్డం గీయించుకోడానికి వస్తాడు. తనని చూసి దిగ్భ్రాంతికి గురైన తండ్రికి ఆత్మ గౌరవంతో చేసే ఏ పనయినా మంచిదేననీ, దేశంలో నిరుద్యోగం పోవాలంటే అదొక్కటే మార్గమనీ చెబుతాడు రంగా. ఈ సన్నివేశం హృదయాల్ని కదిల్చి వేస్తుంది. ఈ కథను దర్శకుడు చెప్పిన తీరు, మధ్య మధ్య రంగా బృందం చేష్టలు, రంగా, దేవి మధ్య డ్యూయెట్లు ప్రేక్షకుల్ని సమ్మోహితుల్ని చేస్తాయి. 'హ్యాట్స్ ఆఫ్ టు బాలచందర్' అనిపిస్తాయి. రంగా పాత్రలో కమల్ జీవించాడు. దేవిగా శ్రీదేవి ఉత్తమ నటన ప్రదర్శించింది. గణేశ్ పాత్రో సంభాషణలు సినిమాకి ఆయువుపట్టు. అవి అడుగడుగునా ఆలోచింపజేస్తాయి. ఎమ్మెస్ విశ్వనాథన్ బాణీలు వినసొంపుగా ఉండి, పాటల్ని మళ్లీ మళ్లీ వినాలనిపించేట్లు చేస్తాయి. ఆత్రేయ, శ్రీశ్రీ అందించిన సాహిత్యానికి అందులో ప్రధాన భాగముంది. లోకనాథన్ సినిమాటోగ్రఫీ దర్శకుడి అంతరంగాన్ని అర్థం చేసుకుని పనిచేసింది.

Wednesday, July 18, 2012

నిర్మాత దిల్ రాజుతో ఇంటర్వ్యూ

అవి కనెక్టయితే 'తూనీగ తూనీగ' సూపర్ హిట్టే
"హీరోకి సంగీతమంటే పిచ్చి. హీరోయిన్‌కి జంతువులంటే ప్రేమ. వారి అభిరుచులు కథలో కీలక పాత్ర పోషిస్తాయి. ప్రేక్షకులకి అవి కనెక్టయితే సినిమా సూపర్ డూపర్ హిట్టవడం ఖాయం" అని చెప్పారు దిల్ రాజు. పద్మిని ఆర్ట్స్ పతాకంపై మాగంటి రాంజీ నిర్మించిన్న 'తూనీగ తూనీగ' సినిమాని ఆయన సమర్పిస్తున్నారు. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన ఎమ్మెస్ రాజు కుమారుడు సుమంత్ అశ్విన్ హీరోగా పరిచయమవుతున్నారు. ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా గురించీ, మరికొన్ని ఆసక్తికర అంశాల గురించీ దిల్ రాజు చెప్పిన సంగతులు ఆయన మాటల్లోనే...
మేకర్‌గా ఎమ్మెస్ రాజు ప్రతిభ ఏమిటో తెలుసు. వాళ్ల అబ్బాయినే హీరోగా పరిచయం చేస్తున్నారు కాబట్టి కచ్చితంగా బాగుంటుందనే ఉద్దేశంతో మాగంటి రాంజీతో పాటు నిర్మాణంలో నేనూ పాలు పంచుకున్నా. నా సొంత సినిమాకి ఎలాగైతే అన్ని విషయాలూ చూసుకుంటానో అలాగే ఈ సినిమాకీ చేయాలని నిర్ణయించుకుని 70 శాతం షూటింగ్ అయ్యాక రషెస్ చూపించమన్నా. అప్పటికి క్లైమాక్స్, కొన్ని కీలక సన్నివేశాలు తియ్యలేదు. అందులో పొరబాట్లుగా నాకు అనిపించినవీ, నాకు కలిగిన సందేహాలనూ చెప్పాను. రచయితలు పరుచూరి బ్రదర్స్‌తో చర్చించా. ఈ సినిమాని సూపర్‌హిట్ చెయ్యాలంటే ఏం చెయ్యొచ్చో వాటిని అందరినీ కూర్చోపెట్టి చర్చించాను. అప్పటివరకు జరిగిన షూటింగ్‌లో ఎక్కడ మార్పులు చెయ్యాలో, తర్వాత కథ ఎలా ఉండాలో అందరం కలిసి నిర్ణయించుకున్నాం. రాజుగారు కూడా కన్విన్స్ అయ్యారు. దానికి తగ్గట్లే సినిమా తీశారు.

అంచనాలకు తగ్గ సినిమా
ఎమ్మెస్ రాజు, దిల్ రాజు కలిసి చేస్తున్న సినిమా అంటే ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు ఉంటాయో, దానికి తగ్గట్లే ఈ సినిమా ఉంటుంది. ఇది లవ్, ఎంటర్‌టైన్‌మెంట్, ఫ్యామిలీ డ్రామా మేళవించిన సినిమా. నిర్మాణ విలువలు, కథ, సంగీతం సినిమాకి ప్లస్ పాయింట్స్. హీరో హీరోయిన్లది చూడ ముచ్చటైన జంట. ఇళయరాజా గారబ్బాయి కార్తీక్‌రాజా చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు.
సుమంత్ భలే చేశాడు
హీరో సుమంత్ అశ్విన్ చాలా అందంగా ఉన్నాడు. తన కేరక్టర్‌ను సూపర్బ్‌గా చేశాడు. కథని మరో లెవల్‌కి తీసుకెళ్లాడు. హీరో సరిగా నటించకపోతే ఎంత మంచి కథయినా కిందికి పడిపోతుంది. సుమంత్ వల్ల ఈ సినిమా పై స్థాయికి వెళ్లిందని గట్టిగా చెప్పగలను. థియేటర్ నుంచి బయటకు వచ్చేవాళ్లు 'సినిమా భలే ఉంది, అబ్బాయి భలే ఉన్నాడు' అంటారు. సుమంత్ రెండో సినిమా మా బేనర్‌లో ఉంటుంది. నా వద్ద ఉన్న రెండు స్క్రిప్టులకు అతను సరిపోతాడు. 'తూనీగ తూనీగ' ఏ స్థాయిలో సక్సెస్ అవుతుందో చూసి, అప్పుడు స్క్రిప్టు ఎంచుకుంటా.
సినిమా హిట్టవ్వాలంటే...
మన జనాభాలో థియేటర్‌కు వచ్చి సినిమాలు చూసేది కేవలం 10 శాతం లోపే. 40 శాతం మంది టీవీలు చూస్తుంటే, మిగతా 50 శాతం మందికి సినిమా అంటేనే అవగాహన లేదు. టీవీల్ని దాటి థియేటర్‌కు జనం వచ్చేలా చేస్తేనే సక్సెస్. 'ఈగ'లో ఏం ఉందని అంతమంది చూస్తున్నారు. 'బొమ్మరిల్లు', 'దూకుడు', 'గబ్బర్‌సింగ్' సినిమాల్ని ఎందుకు అంతమంది చూశారు. వాటిలో విషయం ఉంది కాబట్టి. ఓ సినిమా హిట్టవ్వాలంటే నా దృష్టిలో మూడు విషయాలు కీలకం. కంటెంట్ (కథాంశం), కాస్టింగ్ (తారాగణం), టెక్నీషియన్స్ (సాంకేతిక నిపుణులు). 'తూనీగ తూనీగ'లో కంటెంట్, కాస్టింగ్, టెక్నీషియన్స్ పర్‌ఫెక్ట్. తమ ప్రేమకు ఎదురైన అడ్డంకుల్ని హీరో హీరోయిన్లు ఎలా అధిగమించి ఒక్కటయ్యారనేదే కథ. దాన్ని ఎంత ఇంటరెస్టింగ్‌గా రాజుగారు మలిచారన్నది తెరమీద చూడాల్సిందే.
కౌన్సిలింగ్‌కి రెడీ
ప్రతి నెలా రెండో ఆదివారం కొత్త నిర్మాతలకి కౌన్సిలింగ్ ఇస్తే ప్రయోజనం ఉంటుందని ప్రొడ్యూసర్స్ కౌన్సిల్‌లో నేను ప్రపోజల్ పెట్టాను కానీ ఎందుకనో దాన్ని పట్టించుకోలేదు. సినిమా ఎలా తియ్యాలనే విషయంలో కొత్త నిర్మాతలకి కౌన్సిలింగ్ ఇవ్వడానికి నేను రెడీ. ప్రేక్షకులకి ఎలాంటి సినిమాలు నచ్చుతాయనే విషయంలో నిర్మాతలకి జడ్జిమెంట్ ఉండాలి. కథ విన్నాక తన సినిమా ఎలా ఉంటుందో అనే విజన్ ఉండాలి. సినిమా మేకింగ్ పట్ల తపన, ఇన్‌వాల్వ్‌మెంట్ ఉండాలి. మిగతా వ్యాపారాలతో పోలిస్తే ఇక్కడ ఆదాయం తక్కువనే విజ్ఞత ఉండాలి. లాభం సంగతి తర్వాత, పెట్టుబడి వస్తుందనే గ్యారంటీ లేదనే సంగతి గ్రహించాలి. వీటిలో అవగాహన ఉంటే సక్సెస్ రేట్ కచ్చితంగా పెరుగుతుంది. నేను ఇప్పుడు తీస్తున్న సినిమాలకి పెట్టిన పెట్టుబడి వేరే వ్యాపారాల మీద పెడితే గ్యారంటీగా లాభాలు ఎక్కువే ఉంటాయి. కానీ సినిమా అంటే ఉన్న ప్యాషన్‌తోనే ఇక్కడ ఉన్నా.
అంజలి నటన అసాధారణం
వచ్చే దసరా సెలవులకు 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' విడుదలవుతుంది. డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల చాలా బాగా తీస్తున్నాడు. రాజమండ్రి, తణుకు, భద్రాచలంలో రెండో షెడ్యూల్ చేశాం. ఆగస్టు 7 నుంచి హైదరాబాద్‌లో మూడో షెడ్యూల్ చేస్తాం. సెప్టెంబర్ 5 నాటికి షూటింగ్ మొత్తం పూర్తి చేయాలనేది ప్లాన్. సినిమాలో మొత్తం తొమ్మిది పాటలున్నాయి. సినిమాకి మిక్కీ జె. మేయర్ మ్యూజిక్ ఎస్సెట్. 'సీతమ్మ వాకిట్లో..'కీ, బాలీవుడ్ హిట్ ఫిల్మ్ 'కభీ ఖుషి కభీ ఘమ్'కీ ఎలాంటి పోలికా లేదు. 'సీతమ్మ వాకిట్లో' అంటే భారతదేశం, 'సిరిమల్లె చెట్టు' అంటే ఓ కుటుంబం. భారతదేశంలోని ఓ అందమైన కుటుంబం కథ ఈ సినిమా. వెంకటేశ్ సరసన అంజలి, మహేశ్ జోడీగా సమంత నటిస్తున్నారు. నిజానికి వెంకటేశ్‌కి జోడీగా త్రిషను కానీ, అనుష్కను కానీ తీసుకోవాలనుకున్నాం. కానీ పాత్ర కంటే మహేశ్‌కి వదినగా నటించాలనే అంశం హైలైట్ అవడంతో వారు వెనుకంజ వేశారు. చివరకు అంజలిని తీసుకున్నాం. ఆమె అసాధారణంగా నటిస్తోంది. ఈ సినిమా కథ ప్రధానంగా వెంకటేశ్, మహేశ్, అంజలి పాత్రల చుట్టూ నడుస్తుంది. ఈ సినిమా తర్వాత అంజలి తెలుగులో పెద్ద రేంజ్ హీరోయిన్ అవుతుంది.

Saturday, July 14, 2012

'ఆకాశంలో సగం' యండమూరి 'అనైతికం'


యండమూరి వీరేంద్రనాథ్ నవల 'అనైతికం' ఆధారంగా 'ఆకాశంలో సగం' అనే సినిమా రూపొందుతోంది. రవిబాబు, ఆశా షైనీ జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని నంది ప్రొడక్షన్స్ పతాకంపై మల్కాపురం శివకుమార్ నిర్మిస్తున్నారు. 'నగరంలో నిద్రపోతున్న వేళ' ఫేమ్ ప్రేమరాజ్ దర్శకుడు.
రచయిత, నటుడు పరుచూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ "అందరూ దర్శకులే నటిస్తున్న ఈ చిత్రం నిజంగా ప్రయోగాత్మక చిత్రం. యండమూరి అద్భుతంగా రాసిన 'అనైతికం'ను ప్రేమరాజ్ చక్కగా తెరమీదకు తీసుకొస్తున్నాడు'' అన్నారు. రవిబాబు మాట్లాడుతూ "ప్రేమరాజ్ నా సినిమాలకూ పనిచేశాడు. నేను చదివిన తొలి తెలుగు నవల 'అనైతికం'. ఆ కథలో ప్రధాన వేషం నేను వెయ్యడం చాలా గర్వంగా ఉంది'' అని చెప్పారు. 'అనైతికం'ను సినిమాగా తీయాలనే ప్రేమరాజ్ ధైర్యాన్ని మెచ్చుకుంటున్నాననీ, ఇది హిట్టయితే ఇండస్ట్రీలో కొత్త ధోరణి మొదలవుతుందనీ యండమూరి అన్నారు. ఇంతమంది దర్శకులు నటిస్తున్న సినిమాని నిర్మించడం తన అదృష్టమని శివకుమార్ చెప్పారు. దర్శకుడు ప్రేమరాజ్ మాట్లాడుతూ "చాలా కాలం క్రితం 'అనైతికం' చదివినప్పుడు సినిమాగా తీస్తే బాగుంటుందనుకున్నా. జనానికి ఓ మంచి సినిమా అందించాలనే తపనతో అందరూ ఈ సినిమాకి పనిచేస్తున్నారు. ఆశా షైనీకి ఇది జీవితకాల పాత్ర అవుతుంది. ఈ నెలాఖరుతో షూటింగ్ పూర్తవుతుంది'' అన్నారు.
రేవా, ఎన్. శంకర్, వి.ఎన్. ఆదిత్య, కాశీ విశ్వనాథ్, చంద్రమహేశ్, సాగర్, రాంప్రసాద్, మద్దినేని రమేశ్, దేవీప్రసాద్, కామేశ్వరరావు, కాదంబరి కిరణ్, కాకినాడ శ్యామల తారాగణమైన ఈ చిత్రానికి మాటలు: పరుచూరి బ్రదర్స్, పాటలు: సుద్దాల అశోక్‌తేజ, సంగీతం: యశోకృష్ణ, ఛాయాగ్రహణం: కల్యాణ్ సమీ, కళ: రాజీవ్ నాయర్, సహ నిర్మాత: టి. వెంకటేశ్ యాదవ్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ప్రేమరాజ్.

Thursday, July 5, 2012

దాసరి ఆచరణలోకి దిగాలి

దాసరి నారాయణరావు మాటలు ఆపేసి, ఆచరణలోకి దిగాలని సీనియర్ నిర్మాత, పంపిణీదారుడు చదలవాడ శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. చిన్న సినిమాలకు థియేటర్లు దొరకడం లేదనీ, లీజుదార్లపై తిరుగుబాటుకు తాను కంకణం కట్టుకుంటున్నాననీ ఆదివారం సీనియర్ దర్శకుడు దాసరి ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన చదలవాడ "చిన్న సినిమాల విషయంలో ఆదివారం దాసరిగారు చేసిన వ్యాఖ్యల విషయంలో వంద శాతం నేను ఏకీభవిస్తున్నా. అయితే ఆయన చాలా కాలం నుంచే ఈ మాటల్ని చెబుతూ వస్తున్నారు. కేవలం ప్రకటనలకే ఆయన పరిమితవుతున్నారు. అలా కాకుండా ఆయన తన మాటల్ని ఆచరణలో చూపిస్తే చిన్న నిర్మాతలు నిజంగానే సంతోషిస్తారు. ఆయన ఆచరణలో దిగితే చిన్న సినిమాలకు మేలు జరగడమనేది పది నిమిషాల పని. దళారుల వల్ల మహా మహా నిర్మాతలే సినిమా నిర్మాణాన్ని మానేసుకుని వేరే వ్యాపారాల్లోకి వెళ్లిపోతున్నారు. సీనియర్ నిర్మాతలు ఇవాళ ఎంతమంది సినిమాలు తీస్తున్నారో గమనిస్తే అర్థమైపోతుంది, పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో. నిర్మాతల పెట్టుబడిని దళారులు కాజేస్తున్నారు. చాలామంది వ్యక్తులు తమకు దాసరి వంటివాళ్లు అండగా ఉంటారని భావించి మోసపోతున్నారు. అలాంటి ఎంతోమంది చిన్న సినిమాల నిర్మాతలకు మేలు జరగాలంటే వెంటనే దాసరిగారు కార్యాచరణ చేపట్టాలి'' అని చెప్పారు.

దసరాకు 'లక్కీ'


శ్రీకాంత్, మేఘన జంటగా నటిస్తున్న చిత్రం 'లక్కీ'. జ్యోత్సారెడ్డి సమర్పిస్తున్నారు. రాజరాజేశ్వరి పిక్చర్స్ పతాకంపై తెరకెక్కుతోంది. హరి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. రాజరాజేశ్వరి శ్రీనివాస్‌రెడ్డి నిర్మిస్తున్నారు. నిర్మాత మాట్లాడుతూ "చిత్ర ప్రధాన తారాగణమంతా పాల్గొనగా కథానాయకుడు శ్రీకాంత్ ఇంటికి సంబంధించిన సన్నివేశాలను తెరకెక్కించాం. తదుపరి షెడ్యూల్ జూలై 6నుంచి 20 వరకు జరుగుతుంది. దసరాకు చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందన్న నమ్మకం ఉంది'' అని అన్నారు.
బ్రహ్మానందం, అలీ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఏవీయస్, ఎం.ఎస్.నారాయణ, చలపతిరావు, చిట్టిబాబు, రఘుబాబు, కృష్ణభగవాన్, తిరుపతి ప్రకాష్, నల్లవేణు, తాగుబోతు రమేష్, సుమన్ శెట్టి, ధన్‌రాజ్, జయసుధ, రోజా, సన, గీతాసింగ్, హేమ, రత్నాసాగర్, రమ్య, శ్రీలలిత తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి మాటలు: పడాల శివసుబ్రహ్మణ్యం, సంగీతం: సాయి కార్తీక్, పాటలు: భాస్కరభట్ల, కెమెరా: వి.శ్రీనివాసరెడ్డి, కూర్పు: నాగిరెడ్డి, ఫైట్స్: నందు, కళ: కె.వి.రమణ, కొరియోగ్రఫీ: భానోదయ, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ముదిగొండ వెంకటేష్.

Monday, July 2, 2012

ఎవరైనా చిన్న సినిమా అంటే నరికేస్తా


"ఎవరైనా చిన్న సినిమా అంటే నరికేస్తాను. ఎవరిది పెద్ద సినిమా? ఎవరు పెద్ద? సక్సెస్ ఈజ్ ద బిగ్. సక్సెస్ కంటే పెద్ద సినిమా మరోటి లేదు'' అని వ్యాఖ్యానించారు నూట యాభై చిత్రాల దర్శకుడు డాక్టర్ దాసరి నారాయణరావు. ఆదివారం ప్రసాద్ ల్యాబ్స్ ప్రివ్యూ థియేటర్‌లో జరిగిన 'ఈ రోజుల్లో' వంద రోజుల వేడుకలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. "నాకు తెలిసి ఈ ఆరేడు సంవత్సరాల్లో నా మనసుకు నచ్చినవి మూడే మూడు సినిమాలు. ఒకటి 'బొమ్మరిల్లు', తర్వాత 'అలా మొదలైంది', ఇప్పుడు 'ఈ రోజుల్లో'. ఈ సినిమా కోసం ఒక్క వారానికే థియేటర్లు బుక్ చేశారు. 'ఇది వంద రోజులు ఆడుతుంది, ఆ ఫంక్షన్‌కి నేనొస్తాన'ని చెప్పాను. సినిమాని నేను ప్రేక్షకుడిగానే చూస్తా. సినిమాలో ఏడుపు సీన్లుంటే నా కళ్లవెంట నీళ్లొస్తాయి. నవ్వు సీన్లొస్తే చంటి పిల్లాడిలా నవ్వుతాను. నేను బడ్జెట్ గురించి మాట్లాడటం లేదు. ఆ రోజుల్లో కేవలం రూ. లక్షతో పాటలు లేకుండా, అక్కడక్కడా తప్పితే మాటలు కూడా లేకుండా తీసిన 'నీడ' పెద్ద సినిమానా? చిన్న సినిమానా? 110 రోజులాడింది. ప్రేక్షకులు ఏ సినిమాని ఆదరిస్తారో అదే పెద్ద సినిమా. ఎక్కువ డబ్బు ఖర్చుపెట్టి తీసిన సినిమానో, అమెరికాలో షూటింగ్ చేసిన సినిమానో పెద్ద సినిమా కాదు. 'ప్రేమాభిషేకం' కంటే పెద్ద హిట్టు లేదు. దానికి ఊటీ కూడా వెళ్లలేదు. పాటలన్నీ విజయా గార్డెన్స్‌లోనే తీశాను. వాటికంటే గొప్ప సాంగ్స్ ఉన్నాయా, ఈ మధ్య వచ్చే సినిమాల్లో. ఈ రోజు కోట్లు గురించి మాట్లాడుతున్నారు. 'ఒసేయ్ రాములమ్మా' సినిమా నేల టిక్కెట్టు రూ. రెండు, పై టిక్కెట్లు రూ. 10 ఉన్న రోజుల్లో రూ. 22.5 కోట్లు వసూలు చేసింది. ఇవాళ రేట్ల ప్రకారం లెక్కేస్తే రూ. 220 కోట్లు అవుతాయి. రికార్డుల గురించి కాదు మాట్లాడుకోవాల్సింది, సినిమాల గురించి. 'ఈ రోజుల్లో' సినిమాలో కథలేదు. నిత్య జీవిత సత్యాలున్నాయి. ఒక అబ్బాయిని ఒక అమ్మాయి ఎలా వాడేసుకుంటుంది, ఎలా తీసి అవతల పారేస్తుంది, ఎలా నాకేస్తుంది.. ఇదీ ఇందులో ఉంది. ఇవాళ ఏదైతే యూత్‌లో నడుస్తుందో, సమ సమాజంలో ఏం జరుగుతోందో.. దాన్ని వడపోసి, చక్కని స్క్రీన్‌ప్లేతో తీశాడు మారుతి. 'ఈ రోజుల్లో' వంటివి పది సినిమాలు వస్తే చాలు'' అని ఆయన చెప్పారు.
దిల్ రాజు మాట్లాడుతూ "చిన్న సినిమాలు తీసేవాళ్లకి ఇన్‌స్పిరేషన్ 'ఈ రోజుల్లో'. ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్ అవడానికి రాష్ట్రవ్యాప్తంగా ఎక్కువ థియేటర్లలో విడుదలయ్యేలా చేసి సహకారం అందించాను. అన్ని తరగతుల ప్రేక్షకులు చూస్తే ఇంకా ఎక్కువగా రెవెన్యూ సాధించాల్సిన సినిమా'' అన్నారు. కేవలం 'ఈ రోజుల్లో' సక్సెస్‌ని మాత్రమే కాక దాని వెనుక ఉన్న ప్లానింగ్, కృషిని కూడా ఇన్‌స్పిరేషన్‌గా తీసుకోవాలని నిర్మాత కె. అచ్చిరెడ్డి సూచించారు. ఈ సినిమాకి పెట్టిన ఖర్చునీ, వచ్చిన కలెక్షన్లనూ చూస్తే ఇండస్ట్రీ రికార్డ్ అని చెప్పాలని నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్నకుమార్ చెప్పారు.
నిర్మాతల్లో ఒకరైన ఎస్.కె.ఎన్. మాట్లాడుతూ "రచయిత స్వామిని దర్శకుడిగా పరిచయం చేస్తూ రెండో సినిమా తియ్యబోతున్నాం. మేం తెలుగు ఆర్టిస్టులు, టెక్నీషియన్లతోనే సినిమాలు తీస్తాం'' అన్నారు. దర్శకుడు మారుతి మాట్లాడుతూ "డబ్బులున్నంత మాత్రాన సినిమాలు తియ్యకూడదు. సినిమాని ప్రేమించి తియ్యాలి. అప్పుడే సక్సెస్ వస్తుంది. దాసరిగారి చేతులమీదుగా వంద రోజుల షీల్డు అందుకోవడం నా జీవితంలో జరిగిన అద్భుతం. ఇప్పుడు నా కథని నమ్మి బెల్లంకొండ సురేశ్ 'బస్‌స్టాప్' నిర్మిస్తున్నారు. అది పెద్దలు, పిల్లలు కూడా చూసి ఆనందించే పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రం'' అని చెప్పారు.
ఈ సందర్భంగా ఈ సినిమా యూనిట్ సభ్యులు, డిస్ట్రిబ్యూటర్లకు దాసరి నారాయణరావు, తమ్మారెడ్డి భరద్వాజ్ వంద రోజులు షీల్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు బెల్లకొండ సురేశ్, ఎం.ఎల్. కుమార్‌చౌదరి, బి.ఎ. రాజు, సురేశ్ కొండేటి, దర్శకుడు రవికుమార్‌చౌదరి, రచయిత సంజీవి, మల్టీడైమన్షన్ ఎంటర్‌టైన్‌మెంట్ వాసు, డాక్టర్ దశరథరామిరెడ్డి, హీరోలు శ్రీ, సాయి, హీరోయిన్ రేష్మా, నిర్మాత శ్రీనివాస్, సినిమాటోగ్రాఫర్ ప్రభాకరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మూడు దశాబ్దాల మోహన్‌బాబు నిర్మాణ సంస్థ


తెలుగు చలనచిత్ర పరిశ్రమలో డా. మోహన్‌బాబుది ప్రత్యేకమైన బాణీ. నటనలో విలక్షణత ఆయన ప్రత్యేకత. ఒడిదుడుకులతో ప్రారంభమైన సినీ జీవితం సాఫీగా మారి, ఉన్నత స్థాయికి చేరుకోవడానికి ఆయన చేసిన కృషి ప్రశంసనీయం. హీరోగా సినీరంగ ప్రవేశం చేసిన ఆయన తరువాత విలన్ అయ్యారు, కామెడీ విలన్‌గా నటించారు, మళ్లీ హీరోగా మారిన ఆయన ప్రస్తుతం హీరోగానే కొనసాగుతున్నారు. నటుడుగా 500 చిత్రాల్లో నటించి, నిర్మాతగా 56 సినిమాలు నిర్మించిన మోహన్‌బాబు గురించి, ఆయన విలక్షణ వ్యక్తిత్వం గురించి ఎంతయినా చెప్పవచ్చు. అయితే ఈ రోజున ఆయన గురించి ప్రత్యకంగా చెప్పాల్సిన అంశం ఒకటుంది.
అదేమిటంటే.. 'స్వర్గం-నరకం' చిత్రంతో నటుడిగా ఆయనకు సినీ జన్మ ప్రసాదించిన డాక్టర్ దాసరి నారాయణరావు 'కేటుగాడు' సినిమాతో సోలో హీరోని చేశారు. ఆ సినిమా తరువాత ఇక హీరోగానే కొనసాగాలనే సంకల్పంతో ఆరు నెలల పాటు ఏ ఆఫర్లు అంగీకరించకుండా సొంతంగా చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్ ను నెలకొల్పి, తొలి సారిగా 'ప్రతిజ్ఙ' చిత్రం నిర్మించారు మోహన్‌బాబు. ఆ సినిమా విడుదలై నేటికి సరిగ్గా 30 ఏళ్లు.
ఈ సందర్భంగా ఆ చిత్ర విశేషాలు.... ఆర్టిస్టు అయిన ఏడేళ్లకే సొంతంగా చిత్ర నిర్మాణసంస్థను నెలకొల్పడం నిజంగా ఆ రోజుల్లో ఒక సాహసమే. అందుకే ఈ విషయమై తన గురువు దాసరిని కలిసి ఆయన సలహా అడిగారు మోహన్‌బాబు. 'ఆరి ్టస్ట్‌గా బిజీగా ఉన్నావు.. పేరు తెచ్చుకుంటున్నావు.. ఇలాంటి సమయంలో నీకు చిత్రనిర్మాణం అవసరమా?' అని ఆయన అన్నారు. అయితే పక్కనే ఉన్న దాసరి పద్మ మాత్రం దానికి అంగీకరించలేదు. 'నీకెందుకు నేనున్నాను.. ధైర్యంగా అడుగు ముందుకు వెయ్యి.. ఆల్ ది బెస్ట్' అని ఆవిడ ప్రోత్సహించడంతో ముందడుగు వేశారు మోహన్‌బాబు. ఆ రోజుల్లో ఎం.డి. సుందరం ప్రముఖ కథార చయిత. కన్నడంలో, తమిళంలో చాలా చిత్రాలకు కథలు అందించారు. తెలుగులో కూడా కొన్ని చిత్రాలకు కథారచయితగా పనిచేశారు. ఆయన చెప్పిన ఓ కథ మోహన్‌బాబుకి బాగా నచ్చడంతో దాన్ని సినిమాగా తీయడానికి నిర్ణయించుకున్నారు. అప్పటికి దర్శకుడు ఎవరనేది ఇంకా ఫైనలైజ్ అవలేదు.
ఆ తరుణంలో ఆర్టిస్ట్ ప్రభాకరరెడ్డి దర్శకుడు బోయిన సుబ్బారావు పేరు సజెస్ట్ చేసి, ' నీ టెంపర్‌మెంట్‌కి తగిన దర్శకుడతను' అని చెప్పడంతో తన సినిమా దర్శకత్వ బాధ్యతలు ఆయనకి అప్పగించారు మోహన్‌బాబు. హీరోయిన్‌గా కవితను, మిగిలిన పాత్రలకు సత్యనారాయణ, గిరిబాబు, త్యాగరాజు, సాక్షి రంగారావు తదితరుల్ని ఎంపిక చేసి షూటింగ్‌కు ప్రొసీడ్ అయ్యారు. టెక్నీషియన్ల విషయంలో కూడా రాజీ పడకుండా ఆ నాడు అగ్ర స్థానంలో ఉన్న సంగీత దర్శకుడు సత్యంను, ఛాయాగ్రాహకుడు పుష్పాల గోపీకృష్ణని, ఎడిటర్ కె.ఎ.మార్తాండ్‌ని ఎన్నుకొన్నారు.
ఎన్టీఆర్ ఆశీస్సులు చెన్నయ్ వాహినీ స్టూడియోలో ఉదయం ఏడు గంటలకు జరిగిన పాటల రికార్డింగ్‌కు ఎన్టీఆర్ హాజరై ఆశీస్సులు అందచేశారు. ఆ రోజు చెన్నయ్‌కి దూరంగా ఓ లొకేషన్‌లో 'బొబ్బిలిపులి' షూటింగ్ ఉంది. అందుకే మేకప్‌తో అక్కడి వెళుతూ మార్గ మధ్యంలో మోహన్‌బాబు రికార్డింగ్‌కు ఎన్టీఆర్ హాజరై కొబ్బరి కాయ కొట్టారు. 'ఈ సినిమా హిట్ అవుతుంది.. నువ్వు పెద్ద హీరోవవుతావు' అని ఆశీర్వదించారు. దాసరి పద్మ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఇక 'ప్రతిజ్ఞ' చిత్రం షూటింగ్ తిరుపతికి సమీపంలో ఉన్న కొటాల గ్రామంలో ప్రారంభమైంది. అప్పట్లో సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు కెమెరా స్విచాన్ చేయగా, దాసరి పద్మ క్లాప్ ఇచ్చారు. 27 రోజుల్లో షూటింగ్ పూర్తయింది. సినిమా తొలి కాపీ వచ్చిన తరువాత హీరో కృష్ణ తల్లితండ్రులకు సినిమా చూపించి అభిప్రాయం అడిగారు మోహన్‌బాబు. సినిమా బాగుందని వాళ్లు మంచి రిపోర్ట్ ఇచ్చారు. మంచి టాక్ స్ప్రెడ్ కావడంతో వైజాగ్ ప్రాంతానికి చెందిన ధనరెడ్డి అనే ఆయన సినిమా కొని రాష్ట్రమంతా విడుదల చేశారు. ఘన విజయం సాధించిన ఈ చిత్రం ఐదు కేంద్రాల్లో వంద రోజులు పూర్తి చేసుకుంది. చెన్నయ్ మ్యూజిక్ అకాడెమీ హాలులో జరిగిన శతదినోత్సవానికి అక్కినేని నాగేశ్వరరావు, శివాజీ గణేశన్, దాసరి నారాయణరావు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.
అలా 30 ఏళ్ల క్రితం నిర్మాతగా కూడా తన ప్రస్థానం ప్రారంభించిన మోహన్‌బాబు ఇంతవరకూ 56 చిత్రాలు నిర్మించి శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్ సంస్థ ను ఉన్నత స్థానంలో నిలబెట్టారు. ఈ సంస్థ నిర్మిస్తున్న మూడు చిత్రాలు ప్రస్తుతం నిర్మాణదశలో ఉన్నాయి.

తెలుగు సినిమా దార్శనికుడు కె.వి.రెడ్డి శతజయంతి



తెలుగువారు గర్వంగా తలెత్తుకునే రీతిలో చిత్రాలను రూపొందించిన దర్శకుడు కె.వి.రెడ్డి. ఆయన పూర్తి పేరు కదిరి వెంకటరెడ్డి. తక్కువ సినిమాలే చేసినా ఒక్కో సినిమా ఒక పాఠ్యగ్రంధంలా మిగిలింది. ఆయన పౌరాణికాలు తీశారు, జానపదాలు రూపొందించారు. భక్తి రస చిత్రాలు, సాంఘికాలు తీశారు. ఏ సినిమా తీసినా అందులో ఆయన ముద్ర స్పష్టంగా కనిపించేది. ఎందరికో మార్గదర్శకంగా నిలిచిన కె.వి.రెడ్డి శత జయంతి (జూలై 1) సందర్భంగా ఈ ప్రత్యేక వ్యాసం.
తను దర్శకుడు కావడానికి ముందు వాహినీ పిక్చర్స్ నిర్మించిన చిత్రాలకు క్యాషియర్‌గా పని చేసి ఉండటంతో చిత్రం బడ్జెట్ గురించి ఒక స్పష్టమైన అవగాహన ఉండేదాయనకు. తాను అనుకున్న బడ్జెట్‌లో సినిమా తీయడమే కాకుండా పక్కాగా షాట్ డివిజన్ చేసుకుని, నిడివిని ముందే నోట్ చేసుకుని, దానికి ఏ మాత్రం పెరగకుండా తీయగలగడం కె.వి. రెడ్డి ప్రత్యేకత. ఏ సినిమాకైనా స్క్రీన్‌ప్లే ప్రాణం.
కెవి రెడ్డి తయారు చేసుకున్న స్క్రీన్‌ప్లే ఎంత పకడ్బందీగా ఉండేదంటే మొత్తం స్క్రిప్ట్, షాట్స్‌తో సహా రాసి సిద్ధం చేస్తే చిత్ర నిర్మాణం పట్ల ఎటువంటి అవగాహన లేని వ్యక్తయినా దాన్ని ఫాలో అవుతూ అద్భుతంగా సినిమా తీయగలడని చెప్పేవారు. 'మాయాబజార్' చిత్రం విషయమే తీసుకుంటే అంత పెద్ద కథని, అన్ని కేరెక్టర్లతో ఎటువంటి గందరగోళం లేకుండా మనసుకి హత్తుకొనే విధంగా కె.వి. చిత్రీకరించగలిగారంటే దానికి కారణం ఆయన తయారు చేసుకున్న స్క్రీన్‌ప్లే. అందుకే తర్వాత కాలంలో ఎడిటింగ్ రూమ్‌లలో అనేకమంది కె.వి.రెడ్డి ఫొటోలు పెట్టుకున్నారు.
దర్శకత్వంలో కెవిది ఒక ప్రత్యేకమైన స్కూల్. దర్శకునికి స్క్రిప్టే ప్రధానం అని ఆయన నమ్మేవారు. ఒక కథను ఎన్నుకున్న తరువాత స్క్రిప్ట్ సంతృప్తికరంగా తయారయ్యేవరకూ ఎంతకాలమైనా నిరీక్షించాలని అనేవారు. ఒక సారి బౌండ్ స్క్రిప్ట్ తయారైన తరువాత సెట్‌లో స్పాంటేనియస్‌గా స్క్రిప్ట్‌లో మార్పులు, చేర్పులు చేయడానికి ఆయన అంగీకరించేవారు కాదు. కెవి రెడ్డి స్కూల్‌లో శిక్షణ పొంది అగ్రకథానాయకునిగా ఎదిగిన ఎన్టీఆర్ దర్శకునిగా మారినప్పుడు తన గురువు స్కూల్‌నే ఫాలో అయ్యారు.
షూటింగ్ సమయంలో కెవి అనుసరించిన విధానమే వేరు. ఆర్టిస్టులకు నటించి చూపడం, ఇలా చెయ్యండి అని చెప్పడం ఆయనకు అలవాటు లేదు. ఆర్టిస్టుల్నే నటించమనే వారు. అది తనకి కావాల్సిన రీతిలో లేకపోతే ఇంకోలా చెయ్యమని చెప్పి, తనకి నచ్చిన షాట్‌ని ఫైనలైజ్ చేసేవారు. మరో విషయం ఏమిటంటే షాట్‌లో ఆరుగురు ఆర్టిస్టులుంటే , డైలాగ్ చెప్పే ఆర్టిస్ట్ ఒకరే అయినా ఆరు ఫైనల్ రిహార్సల్స్ చేయించేవారు. ప్రతి రిహార్సల్‌లో ఆర్టిస్టుల రియాక్షన్ గమనించేవారు.
ఎక్కువతక్కువలుంటే సరిదిద్దేవారు. మేకప్ టచప్, లైటింగ్, కెమేరా పొజిషన్.. అన్నీ చూసుకున్న తరువాత టేక్ తీసేవారు. ఆయన ఏనాడు షాట్ అయ్యాక 'ఓ.కె.' అనేవారు కాదని, 'పాస్' అని మాత్రమే అనేవారని ఆయన దర్శకత్వంలో నటించిన వారు చెప్పేమాట. కె.వి. దర్శకత్వంలో ఎన్నో మంచి పాత్రలు పోషించి పేరు తెచ్చుకున్న హాస్య నటుడు రేలంగి ఓ సందర్భంలో మాట్లాడుతూ 'రెడ్డిగారు పాస్ మార్కులే మాకు ఇచ్చేవారు కానీ నూటికి నూరు మార్కులు ఇవ్వడం మేమెరుగం' అని చెప్పారు. కె,వి.రెడ్డి సెట్‌లో ఉంటే ఆర్టిస్టులకు ఫ్రీడమ్ ఉండేది. అలాగే వాళ్ల మీద ఆయనకు కంట్రోల్ ఉండేది.
ఆయన సెట్‌లో ఉంటే చాలు వాతావరణం చాలా సైలెంట్‌గా ఉండేది. ఎవరు మాట్లాడినా.. ఆఖరికి నిర్మాతయినా ఆయన సహించేవారు కాదు. సెట్ బయటకు వెళ్లి మాట్లాడుకోమని చెప్పడానికి సందేహించేవారు కాదు. అలాగే తన షూటింగ్స్‌కి విజిటర్స్‌ని అనుమతించేవారు కాదు. అయితే మరీ కావాల్సిన వాళ్లు వచ్చినప్పుడు మాత్రం ముగ్గురికో, నలుగురికో అనుమతి ఇచ్చేవారు. అది కూడా వాళ్లు పది, పదిహేను నిముషాల్లో పని ముగించుకుని వెళ్లి పోవాలి.
షాట్ డివిజన్, డైలాగ్ వెర్షన్ పూర్తయిన తరువాత షాట్ ఎంత నిడివి ఉండాలన్నది స్టాప్ వ్యాచ్ దగ్గర పెట్టుకుని నిర్ణయించేవారు. అసిస్టెంట్ డైరెక్టర్‌తో ఆ డైలాగ్ చదివించి పుటేజ్ నోట్ చేసుకోవడం ఆయనకు అలవాటు. 'గుణసుందరి కథ' చిత్రనిర్మాణ సమయంలో ఒకసారి ఇలి పుటేజ్ నోట్ చేసుకుంటూ 'ఆ షాట్ ఎంత వచ్చింది' అని అడిగారు కె.వి. 'రెండు నిముషాలు' అని అసిస్టెంట్ డైరెక్టర్ చెప్పగానే 'కాదు.. మరో అరనిముషం పెరుగుతుంది. ఎందుకంటే ఆ డైలాగ్ చెప్పేది గోవిందరాజుల సుబ్బారావు. ఆయన డైలాగులు తాపీగా చెబుతారు కనుక ఆయన ఉన్న ప్రతి దృశ్యానికి మనం కొంత టైమ్ అదనంగా కలుపుకోవాలి' అన్నారట కె.వి. అంత దూరాలోచన చేసేవారాయన.
అలాగే 'జగదేకవీరుని కథ' చిత్రనిర్మాణ సమయంలోనూ ఇటువంటి సంఘటనే జరిగింది. షాట్ డివిజన్ చేస్తూ ఈత కొలనులో తీయాల్సిన షాట్స్ నోట్ చేస్తూ , ఆ సన్నివేశాలను డిసెంబర్ నెలలో చిత్రీకరిస్తారు కనుక వేడి నీళ్లు సిద్ధంగా ఉంచాలని ఆరు నెలలకు ముందే సీన్ పేపర్‌లో పేర్కొనడం ఆయన దూరదృష్టికి నిదర్శనం. సామాన్య ప్రేక్షకుడిని దృష్టిలో పెట్టుకుని కె.వి.రెడ్డి చిత్రాలు రూపొందించినా అవి అన్ని వర్గాల వారిని ఆకట్టుకున్నాయి. తెలుగు సినిమాకు కమర్షియల్ బాట ఏర్పరచిన ఈ దిగ్ధర్శకుడు తెరస్మరణీయుడు, చిరస్మరణీయుడు.
కె.వి.రెడ్డి దర్శకత్వం వహించిన చిత్రాలు
1. భక్తపోతన -7:1:1943 వాహిని వారి నాగయ్య, మాలతి, గౌరినాధశాస్త్రి 177 రోజులు
2. యోగివేమన -10:4:1947 వాహిని వారి నాగయ్య, రాజమ్మ- 50రోజులు
3. గుణసుందరి కథ -29:12:1949- వాహిని వారి శ్రీరంజని, శివరావు 162 రోజులు
4. పాతాళభైరవి - 15: 3:1951- - విజయావారి ఎన్టీఆర్, మాలతి, ఎస్వీఆర్ 365 రోజులు
5. పెద్దమనుషులు - 11:3: 1954 - వాహినీ వారి గౌరీనాథశాస్త్రి, రేలంగి 100 రోజులు
6. దొంగరాముడు -1:10:1955... అన్నపూర్ణా వారి... అక్కినేని, సావిత్రి.... 100 రోజులు
7.మాయాబజార్ -27: 3: 1957.. విజయా వారి.. ఎన్టీఆర్, అక్కినేని, సావిత్రి, ఎస్వీఆర్.. 175 రోజులు
8. పెళ్లినాటి ప్రమాణాలు -17:12: 1958 .. జయంతి వారి.. అక్కినేని, జమున.. 50 రోజులు
9. జగదేకవీరుని కథ - 9:8: 1961... విజయా వారి. ఎన్టీఆర్, బి.సరోజాదేవి... 175 రోజులు
10. శ్రీకృష్ణార్జున యుద్ధం -9:1: 1963... జయంతీ వారి.. ఎన్టీఆర్, అక్కినేని, బి.సరోజాదేవి.. 147 రోజులు
11. సత్య హరిశ్చంద్ర - 22: 4: 1965.. విజయావారి.. ఎన్టీఆర్, ఎస్. వరలక్ష్మి... 63 రోజుల
12. ఉమాచండీగౌరీశంకరుల కథ - 11:1: 1968.. విజయావారి.. ఎన్టీఆర్, బి.సరోజాదేవి... 50 రోజులు
13. భాగ్యచక్రం - 13:9: 1968... జయంతి వారి.. ఎన్టీఆర్, బి.సరోజాదేవి.. 42 రోజులు.
14. శ్రీకృష్ణసత్య -24: 12: 1971.. ఆర్.కె.బ్రదర్స్.. ఎన్టీఆర్, జయలలిత... 100 రోజులు
తమిళం 
15. -పాతాళభైరవి - 17: 5:1951- - విజయావారి- ఎన్టీఆర్, మాలతి, ఎస్వీఆర్ 175 రోజులు
16 మాయాబజార్ .. -14: 4: 1957.. విజయా వారి.. ఎన్టీఆర్, జెమినీ గణేశన్, సావిత్రి, ఎస్వీఆర్.. 150 రోజులు
17. వాళ్ కై ఒప్పందం .. -4:9: 1959.. జయంతి వారి.. అక్కినేని, జమున.. 50 రోజులు
హిందీ 
18. పాతాళభైరవి.. -ఏప్రిల్ 1952 .. జెమినీ వారి.. ఎన్టీఆర్, మాలతి.. 175 రోజులు

'లింగడు రామలింగడు' గా కృష్ణుడు


కృష్ణుడు హీరోగా నటిస్తున్న చిత్రం 'లింగడు-రామలింగడు'. వేగా ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై. లిమిటెడ్ సమర్పిస్తోంది. పాలాక్షుని ఫిలిమ్స్ పతాకంపై అశోక్‌రావు దర్శకత్వం వహిస్తున్నారు. లక్ష్మీనారాయణ నిర్మాత. షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. నిర్మాత చెబుతూ "ఈ చిత్రం ఇప్పటి వరకు వచ్చిన కృష్ణుడు చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉంటుంది. చక్కని కథ, కథనాలతో ఆద్యంతం వినోదాన్ని పంచుతుంది. ఓ యువకుడు తను ప్రేమించిన అమ్మాయిని దక్కించుకోవడం కోసం అతని మామ పెట్టే కండిషన్లు, టెన్షన్లు ఎలా భరించాడు? అనేదే కథ. కృష్ణుడు ద్విపాత్రాభినయం చేశారు. జూలై రెండో వారంలో పాటల్ని, నెలాఖరున చిత్రాన్ని విడుదల చేస్తాం'' అని అన్నారు.
భానుశ్రీ మెహ్రా, రాజీవ్ కనకాల, కృష్ణభగవాన్, కొండవలస, నరసింహరాజు, కవిత, విజయభాస్కర్, జెన్నీ తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి మాటలు: నండూరి వీరేష్, పాటలు-సంగీతం-నృత్యాలు: స్టైల్ మధు, కెమెరా: నర్సింగ్‌రావు, నిర్మాత: లక్ష్మీ నారాయణ, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: అశోక్‌రావు.