Monday, August 29, 2011

న్యూస్: జీవా సినిమాలొస్తున్నాయ్!

కొత్తగా ఓ నటుడి సినిమా హిట్టయితే అతను అంతకు ముందు నటించిన సినిమాలూ, ఆ తర్వాత నటించే సినిమాలూ వరుసపెట్టి రావడం తెలుగు చిత్రసీమలో జరిగే ఓ విశేషం. నిన్నటికి నిన్న 'వైశాలి' బాగా ఆడటంతో ఆది పినిశెట్టి తమిళంలో నటించిన సినిమాలన్నీ తెలుగులో దిగుమతి అయిపోతున్నాయ్. ఇప్పుడు ఆ వంతు జీవాది. ఆర్.బి. చౌదరి కుమారుడైన జీవా నటించిన 'ఈ' సినిమా కొంత కాలం క్రితం తెలుగులో వచ్చినా తెలుగు ప్రేక్షకులు ఏమంత పట్టించుకోలేదు. ఇప్పుడు అతడి 'రంగం' సినిమా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద విజయకేతనం ఎగురవేయడంతో అతడి తమిళ సినిమాలన్నిట్నీ తెలుగులో తీసుకు రావడానికి డబ్బింగ్ సినిమాల నిర్మాతలు పోటీపడుతున్నారు. ఇప్పటికే అతని 'రౌతిరం' సినిమాని ఆర్.బి. చౌదరి స్వయంగా 'రౌద్రం' పేరుతో తెలుగులోకి తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తాజాగా జీవా మరో రెండు సినిమాలు తెలుగులో డబ్బవుతున్నాయి. వాటిలో 'సింగం పులి' సినిమా 'సింహం పులి' పేరుతోనూ, పోస్ట్ ప్రొడక్షన్‌లో ఉన్న 'వందాన్ వెండ్రాన్' సినిమా 'వచ్చాడు గెలిచాడు' పేరుతోనూ రాబోతున్నాయి. జీవా డ్యూయల్ రోల్ పోషించిన 'సింగం పులి' తమిళంలో 2011 మార్చిలో విడుదలై ఓ మోస్తరుగా ఆడింది. ఇందులో అతని సరసన రమ్య, హనీరాజ్ హీరోయిన్లుగా నటించారు. ఇక 'వచ్చాడు గెలిచాడు' సినిమాని ఆర్. కణ్ణన్ డైరెక్ట్ చేయగా తాప్సీ హీరోయిన్‌గా నటించింది. అటు తమిళం, ఇటు తెలుగులో ఒకేసారి సెప్టెంబరులో ఈ సినిమా విడుదల కానున్నది. ఈ సినిమాలతో జీవా మరింతగా తెలుగు ప్రేక్షకుల ఆదరణ పొందుతాడేమో చూడాలి.

No comments: