Friday, August 19, 2011

న్యూస్: 2012లో హీరోగా పరిచయం కానున్న వరుణ్‌తేజ్

రాంచరణ్, జెనీలియా జంటగా భాస్కర్ డైరెక్షన్‌లో తీసిన 'ఆరెంజ్' సినిమా షాక్ నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారు అంజనా ప్రొడక్షన్స్ అధినేత నాగబాబు. డిజాస్టర్ కావడంతో ఆ సినిమాకి పెట్టిన డబ్బంతా బూడిదలో పోసినట్లయ్యింది. ఈ సినిమా అనుభవం తర్వాత అతని అన్నదమ్ములైన చిరంజీవి, పవన్ కల్యాణ్ అతనికి సపోర్ట్‌గా నిలిచారు. తనకైనా, కల్యాణ్‌కైనా ఇప్పుడు చిరంజీవే తండ్రిలాంటివాడని తండ్రిని కోల్పోయిన ఆయన భావిస్తున్నారు.
త్వరలో నాగబాబు కుమారుడు వరుణ్‌తేజ్ హీరోగా తెరమీదకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. "2012లో వాడు హీరోగా పరిచయమయ్యే సినిమా మొదలవుతుంది. ఈలోగా హీరోకి అవసరమైన అన్ని అంశాల్లోనూ వాడు తర్ఫీదు అవుతున్నాడు. అశ్వనీదత్ వాణ్ణి హీరోగా పరిచయం చేస్తారు. ఆ తర్వాత అల్లు అరవింద్ గారి గీతా ఆర్ట్స్‌లో నటిస్తాడు" అని ఆయన చెప్పారు. వరుణ్ భవిష్యత్ గురించి మాట్లాడుతూ "వాడికి మేం ప్లాట్‌ఫాం మాత్రం అమరుస్తాం. వాడు సక్సెస్ అయ్యేదీ, లేనిదీ వాడి ప్రతిభా పాటవాల మీదే ఆధారపడి ఉంటుంది. స్టార్ల కుటుంబం నుంచి వస్తున్నందువల్ల వాడి మీద ఆ వత్తిడి సహజంగానే ఉంటుంది. దాన్ని వాడు అధిగమించ గలగాలి" అని నిర్మొహమాటంగా ఆయన చెప్పారు.

No comments: