Sunday, August 7, 2011

న్యూస్: తండ్రి తమిళంలో.. తనయ తెలుగులో!

కమల్‌హాసన్ ముద్దుల తనయ శ్రుతి హాసన్ ఇప్పుడు తెలుగులో హాట్ హీరోయిన్. 'అనగనగా ఓ ధీరుడు' చిత్రంలో కళ్లు చెదిరే రూప లావణ్యాలతో కనిపించిన ఆమెని చూసి ప్రేక్షకుల కంటే ఎక్కువగా ఫ్లాటైపోయారు మన హీరోలు. అందుకే ఆమెని తమ సరసన బుక్ చేసుకోవడానికి తాపత్రయపడుతున్నారు. అయితే శ్రుతి మాత్రం అంత ఆరాటం చూపడం లేదు. పాత్రలు, సినిమాల విషయంలో చాలా సెలక్టివ్‌గా వ్యవహరిస్తూ వస్తోంది. ప్రస్తుతం ఆమె రెండు సినిమాలు చేస్తోంది. వాటిలో ఒకటి తన ప్రియుడు సిద్ధార్థ్ సరసన చేస్తున్న 'ఓ మై ఫ్రెండ్' కాగా, మరొకటి ఎన్టీఆర్ సరసన చేస్తున్న ఇంకా పేరుపెట్టని సినిమా. వీటిలో మొదటి సినిమాని దిల్ రాజు నిర్మిస్తుండగా, వేణు శ్రీరాం దర్శకునిగా పరిచయమవుతున్నాడు. ఈ సినిమాలో మరో బ్యూటీ హన్సికతో కలిసి స్క్రీన్ పంచుకుంటోంది శ్రుతి. నిజానికి ఈ పాత్ర మొదట వచ్చింది తనకేననీ, అయితే సిద్ధార్థ్ రికమెండ్ చేసి మరీ శ్రుతిని రప్పించుకున్నాడనీ నిత్యమీనన్ బాంబు పేల్చింది. ఇక ఎన్టీఆర్ సినిమాని డైరెక్ట్ చేస్తోంది ఓటమి ఎరుగని బోయపాటి శ్రీను. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాత. ఈ రెండు సినిమాలతో పాటు త్వరలో ప్రారంభం కానున్న పవన్ కల్యాణ్ సినిమా 'గబ్బర్‌సింగ్'లోనూ ఆమె నటించనున్నదని ప్రచారం జరుగుతోంది. అయితే ఆ సినిమా ఇంకా కన్ఫర్మ్ కావాల్సి ఉంది. ఏదేమైనా తండ్రి తమిళనాట టాప్ యాక్టర్ కాగా, తనయ అక్కడ కంటే తెలుగులోనే క్రేజ్ తెచ్చుకోవడం చిత్రమే!

No comments: