Saturday, August 6, 2011

న్యూస్: నాగార్జున, శివప్రసాదరెడ్డి కాంబినేషన్‌లో 11వ సినిమా!

కామాక్షి ఎంటర్‌ప్రైజెస్ అధినేత డి. శివప్రసాద్‌రెడ్డితో మరో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు అక్కినేని నాగార్జున. 'రగడ' వంటి హిట్ తర్వాత ఈ సినిమా తయారు కాబోతోంది. ఇప్పటివరకు ఆ ఇద్దరి కాంబినేషన్‌లో పది సినిమాలొచ్చాయి. వాటిలో విక్కీ దాదా, అల్లరి అల్లుడు, సీతారామరాజు, నేనున్నాను, కింగ్, రగడ హిట్టయ్యాయి. ఆటో డ్రైవర్, ఎదురులేని మనిషి, బాస్, కేడి ఫ్లాపయ్యాయి. అయితే హిట్లు, ఫ్లాపులతో నిమిత్తం లేకుండా వారి అనుబంధం కొనసాగుతుండటం విశేషమనే చెప్పాలి. ఒకప్పుడు అక్కినేని నాగేశ్వరరావు - దుక్కిపాటి మధుసూదనరావు, కృష్ణ-డూండీ కాంబినేషన్ తరహాలో వీరి కాంబినేషన్ తయారయ్యింది. స్టార్లు యేడాదికి ఒకటి, రెండు సినిమాలు కంటే ఎక్కువ చేయని ఈ రోజుల్లో ఒక హీరో ఒకే నిర్మాతతో పది సినిమాలు చేయడం వారి అనుబంధానికి నిదర్శనం. 1988లో 'విక్కీ దాదా'తో ప్రారంభమైన వీరి అనుబంధం 23 సంవత్సరాలుగా అప్రతిహతంగా కొనసాగుతోంది. 'ఆటో డ్రైవర్' ఫ్లాపయ్యాక శివప్రసాద్‌రెడ్డి బాగా డిప్రెస్ అయ్యారు. "ఫైనాన్షియల్‌గా, మెంటల్‌గా నేను పూర్తి నిరాశలో ఉన్న టైంలో నన్ను పిలిచి సినిమా ప్లాన్ చేసుకోండని చెప్పారు నాగార్జున. అలా 'సీతారామరాజు' వచ్చి మళ్లీ నన్ను నిలబెట్టింది. ఫ్లాప్ ఇచ్చినప్పుడు కూడా నన్ను తన నిర్మాతగా భావించిన నాగార్జున సంస్కారం వల్లే మా కాంబినేషన్‌కు ఇంత గుర్తింపు వచ్చింది" అని చెప్పారు శివప్రసాద్‌రెడ్డి. అలాంటి ఈ హీరో, నిర్మాతల 11వ సినిమా 2012 జనవరిలో ప్రారంభం కాబోతోంది. దీని డైరెక్టర్ ఎవరనే సంగతి కొద్ది రోజుల్లో వెల్లడి కానున్నది.

No comments: