Thursday, August 18, 2011

న్యూస్: 'ఇట్స్ మై లవ్‌స్టోరీ'తో ఆశ నెరవేరుతుందా?

లగడపాటి శ్రీధర్ నిర్మించిన 'స్నేహ గీతం'తో దర్శకుడిగా పరిచయమైన 'మధుర' శ్రీధర్‌రెడ్డి త్వరలో 'ఇట్స్ మై లవ్‌స్టోరీ' అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కొత్త తారలతో అతను రూపొందించిన 'స్నేహ గీతం' పబ్లిసిటీ ఇచ్చిన స్థాయిలో ఆడకపోయినా డైరెక్టర్‌గా శ్రీధర్‌రెడ్డి ఫర్వాలేదనిపించాడు. ఆ సినిమా తర్వాత పెద్ద హీరోలతో కాకపోయినా ఓ మాదిరి హీరోల నుంచైనా తనకి కాల్స్ వస్తాయని అతను ఊహించాడు. అలాగే నిర్మాతల నుంచి ఆఫర్లు వస్తాయనుకున్నాడు. అవేవీ జరగకపోవడంతో తిరిగి కొత్త తారలతోటే సినిమా తీయడానికి సిద్ధమైపోయాడు. నిర్మాతగా ఓ ఎన్నారైని దొరకబుచ్చుకున్నాడు. అలా 'ఇట్స్ మై లవ్‌స్టోరీ'ని తీశాడు. ఈ సినిమా ద్వారా అరవింద్‌కృష్ణ హీరోగా పరిచయమవుతున్నాడు. అతను ఈ సినిమాకి ముందు డి. రామానాయుడు నిర్మించిన ఫ్లాప్ ఫిల్మ్ 'ఆలస్యం అమృతం'లో నటించాడు (హీరోగా కాదు). ఇక హీరోయిన్ నిఖితకు ఇదే తొలి చిత్రం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్‌లో ఉన్న 'ఇట్స్ మై లవ్‌స్టోరీ' సెప్టెంబరులో రిలీజ్ కానున్నది. చాలా కాలం తర్వాత వెటరన్ యాక్టర్లు జయసుధ, శరత్‌బాబు కలిసి ఇందులో నటించారు. ఇందులో జయసుధ హీరో తల్లిగా, శరత్‌బాబు హీరోయిన్ తండ్రిగా నటించారు. హైదరాబాద్‌కు చెందిన ఓ గేం డిజైనర్ (అరవింద్‌కృష్ణ)కీ, వైజాగ్‌కి చెందిన ఓ ఫ్యాషన్ డిజైనర్ (నిఖిత)కీ మధ్య చిగురించే ప్రేమకథ ఎలాంటి మలుపులు తిరిగిందీ, చివరికి ఎలా సుఖాంతమయ్యిందీ అన్నది ఈ సినిమా కథ. ఈ లవ్‌స్టోరీతో డైరెక్టర్‌గా తనకి మరింత పేరు వస్తుందనీ, తద్వారా క్రేజీ ఆఫర్లు రావడం ఖాయమనీ శ్రీధర్‌రెడ్డి ఆశిస్తున్నాడు. అతని ఆశ నెరవేరుతుందా?

No comments: