Thursday, December 31, 2015

Actress Santha Kumari Filmography

1. Maya Bazaar (1936)
2. Rukmini Kalyanam (1937) (Rukmini)
3. Sarangadhara (1937) (Chitrangi)
4. Bhakta Jayadeva (1938)
5. Balaji (1939)
6. Parvathi Kalyanam (1941)
7. Dharmapatni (1941) (Radha)

contd...

Wednesday, December 30, 2015

Bay of Bengal: Anonymity of Telugu People

బంగాళాఖాతం - ఆంధ్రుల అనామకత్వం

ఆంధ్ర రాష్ట్ర సమీపాన ఉన్న తూర్పు సముద్రాన్ని ఇప్పటికీ మనం 'బంగాళాఖాతం' అనే పిలుస్తున్నాం. ఈ సముద్రానికి ఈ పేరును తెలుగువాళ్లెవరూ పెట్టలేదు. పోనీ వంగీయులైనా ఈ పేరును పెట్టారా.. అంటీ అదీ కాదు. ఆ పేరు వాడటానికి వాళ్లెప్పుడూ ఆంధ్ర రాష్ట్రాన్ని కానీ, దాని పరిసర సముద్ర తీరాల్ని కానీ జయించలేదు. ఈ తూర్పు సముద్రం బర్మా (మయన్మార్), బంగ్లాదేశ్, శ్రీలంక దేశాలను, మన దేశంలో పశ్చిమ బెంగాల్, ఒడిషా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలనూ, అండమాన్ నికోబార్ దీవులనూ ఆనుకొని ఉంది. అలాంటి ఈ సముద్రానికి ఈస్ట్ ఇండియా కంపెనీవాళ్లు 'బే ఆఫ్ బెంగాల్' అనే పేరు పెట్టారు. మనం దాన్ని 'బంగాళాఖాతం' అని అనువదించుకొని ఆ పేరుతోనే పిలుస్తున్నాం. దీనివల్ల బెంగాలీలకు ప్రాముఖ్యం పెరిగి, మిగిలిన రాష్ట్రాలవాళ్లు అనామకులయ్యారు. ఈ అనామకత్వాన్ని వదిలించుకోవాలంటే ఆంధ్రులు ఏం చెయ్యాలో ఆలోచించండి.

Actor Ram Interview

- ఆంధ్రజ్యోతి డైలీ, 30 డిసెంబర్ 2015

Tuesday, December 29, 2015

Actress Bezawada Rajaratnam Filmography

1. Seetha Kalyanam (1934)
2. Bhakta Kuchela (1935)
3. Vande Matharam (1939)
4. Malli Pelli (1939) (Kamala)
5. Vishwa Mohini (1940)
6. Sumangali (1940)
7. Dakshayagnam (1941) (Prasuthi)
8. Devatha (1941) (Vimala)
9. Bhakta Potana (1942)
10. Jeevanmukthi (1942)

contd...

Saturday, December 26, 2015

Society: Drought and Our Responsibility

కరువు - మన బాధ్యత

రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధర చెల్లించడానికి ప్రభుత్వాలు మీనమేషాలు లెక్కిస్తున్నాయి. సందట్లో సడేమియాలా బ్లాక్ మార్కెట్ విశృంఖలమవుతోంది. దీంతో ఆహార పదార్థాల ధరలు కూలీలు, పేదలు కొనలేని స్థితికి పెరిగిపోతున్నాయి. దీనికి పూర్తి బాధ్యత ప్రభుత్వాలే వహించాలి. ఈ కరువుకు ఆహుతయ్యేది, గ్రామాల్లో, బస్తీల్లో ఉండే పేదలే. గ్రామీణ పేదలైతే కరువుకు అల్లాడుతూ చేయడానికి పనిలేక ఇతర ప్రాంతాలకు వలస పోతున్నారు. వీళ్ల దిక్కూ మొక్కూ ఆలోచించేవాడే లేడు. ఇలాంటి దారుణ స్థితిలోనూ ప్రభుత్వోద్యోగులు తమ జేబులు నింపుకునేందుకు ఉత్సాహం చూపిస్తున్నారే కానీ ఏమాత్రం బాధ్యతను గుర్తించడం లేదు. అందువల్ల ప్రభుత్వం ఏదో చేస్తుందనేది ఒట్టి భ్రమే. పైగా పరిపాలన సాగేది ప్రజా విశ్వాసం కోల్పోయిన ఉద్యోగ వర్గంతోనే. కాబట్టి కరువు సమస్యను ఎక్కువ బాధ్యత తీసుకొని మనమే పరిష్కరించుకోవాలి. మూడు పూటలా సుష్టుగా భోంచేసేవాళ్లు తిండి తగ్గించుకోవాలి. కరువుబారిన పడిన గ్రామాల ప్రజలకు సాయం చేయడానికి నడుం బిగించాలి. లేకపోతే గ్రామాల సాంఘిక జీవితం విచ్ఛిన్నమవడమే కాకుండా దోపిడీలు యథేచ్ఛగా సాగుతాయి.

Beginning Days: Kanchana

తొలి రోజుల్లో: కాంచన

విజయవాడలో పుట్టిన కాంచన మద్రాసులో పెరిగింది. ఆమె తండ్రి రామకృష్ణశాస్త్రి పేరుపొందిన ఇంజనీర్. చిన్నప్పట్నించీ కాంచనకు సంగీతమంటే ఇష్టం. రేడియోలో వచ్చే పాటల్ని శ్రద్ధగా వింటూ ఆ గాయకుల గొంతులతో పాటు తన గొంతూ కలిపి పాడుతూ ఆనందిస్తుండేది. పాటకు తగ్గట్లు గంతులు కూడా వేస్తుండేది. కూతుర్లోని ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు ఆమెకు తొమ్మిదో యేట నుంచే నాట్యంలో శిక్షణనిప్పించారు. వడయూర్ రామయ్య పిళ్లే వద్ద నృత్యంలో వివిధ రీతుల్ని వంటపట్టించుకుంది. హైస్కూల్ అయ్యాక ఇంటర్మీడియెట్ కోసం యతిరాజ్ కాలేజీలో చేరింది. ఆ కాలంలో చాలా నాటకాల్లో వేషాలు వేసి తరచూ బహుమతులందుకొంటూ ఉండేది. ఇంటర్మీడియెట్ అయ్యాక చదువు మానేసింది.
ఇంట్లో ఖాళీగా కూర్చుంటే ఉబుసుపోక పేపర్లో కనిపించిన ఓ ఎయిర్ హోస్టెస్ ఉద్యోగానికి దరఖాస్తు చేసింది. ఇంటర్వ్యూలో ఎంపికై ఎయిర్ హోస్టెస్‌గా మారింది. రెండేళ్లు సరదాగా గడిచిన తర్వాత ఆ ఉద్యోగం ఆమెకు విసుగు పుట్టించింది. అయినా అందులోనే కాలం నెట్టుకొస్తున్న సందర్భంలో తమిళ నిర్మాత కోవై చెళియన్ విమాన ప్రయాణంలో ఆమెను చూసి, తన మిత్రుడైన డైరెక్టర్ శ్రీధర్‌కు ఆమె గురించి చెప్పాడు. అప్పట్లో శ్రీధర్ 'కాదలిక్క నేరమిల్లై' చిత్రాన్ని రంగుల్లో తియ్యాలని కొత్త తారల కోసం అన్వేషిస్తున్నాడు. అలా కాంచనను శ్రీధర్‌కు పరిచయం చేశారు కోవై చెళియన్. కాంచన మొహంలో కనిపించిన సజీవ హావభావాలు శ్రీధర్‌కు బాగా నచ్చాయి. అందుకే తన సినిమాలో ఆమెను కథానాయికగా తీసుకున్నాడు. వెంటనే ఎయిర్ హోస్టెస్ ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి సినీ రంగంలో అడుగుపెట్టింది కాంచన. 'కాదలిక్క నేరమిల్లై' విడుదలైంది. తమిళనాట ఆ సినిమా రికార్డ్ కలెక్షన్లను సాధించింది. ఒకే ఒక్క సినిమాతో కాంచన పేరు మారుమోగింది. పలువురు నిర్మాతలు, దర్శకుల దృష్టిలో పడింది.
రాజలక్ష్మీ ప్రొడక్షన్స్ వాళ్ల 'వీరాభిమన్యు' చిత్రంతో తెలుగువాళ్ల అభిమాన నటి అయ్యింది కాంచన. ఆ తర్వాత వచ్చిన అన్నపూర్ణా పిక్చర్స్ వారి 'ఆత్మగౌరవం', పద్మశ్రీ వారి 'ప్రేమించి చూడు' మొదలుకొని 'నేనంటే నేనే', 'తల్లి ప్రేమ', 'భలే మాస్టారు'  వంటి చిత్రాల్లో విభిన్న పాత్రల్లో రాణించింది. తెలుగులో బిజీ తారగా మారింది. తమిళంలోనూ ఆమెకు మంచి గిరాకీ ఏర్పడింది. అదే సమయంలో హిందీలో 'ఫర్జ్' సినిమా చేసింది.
అన్నట్లు కాంచన అసలు పేరు వసుంధర. కాలేజీ చదువు ముగియగానే 'భట్టి విక్రమార్క'లో కాళికాదేవిగా నటించింది. కానీ తర్వాత అవకాశాలు రాకపోవడంతో ఎయిర్ హోస్టెస్‌గా మారింది. తిరిగి శ్రీధర్ పుణ్యమా అని చిత్రసీమలో నిలబడింది.

Friday, December 25, 2015

Actress Pushpavalli Filmography

1. Dasavatharamulu (1937)
2. Mohini Bhasmasura (1938) (Mohini)
3. Vara Vikrayam (1939)
4. Malathi Madhavam (1940)
5. Choodamani (1941)
6. Satyabhama (1942) (Satyabhama)
7. Bala Nagamma (1942)

contd...

Synopsis of the movie VAGDANAM (1961)

'వాగ్దానం' (1961) చిత్ర కథాంశం

జమీందారు విశ్వనాథం, దివాన్ రంగనాథం (గుమ్మడి), పరిస్థితుల వల్ల తాగుబోతుగా మారిన జగన్నాథం బాల్య మిత్రులు. జగన్నాథాన్ని విశ్వనాథం ప్రాణంగా చూసుకుంటుంటే, రంగనాథం దురాలోచన, దూరాలోచనతో జగన్నాథాన్ని ద్వేషిస్తుంటాదు. కులంలేని స్త్రీని పెళ్లి చేసుకున్నాడని వెలివేయబడిన జగన్నాథం కొడుకు సూర్యానికి విదేశాల్లో డాక్టర్ కోర్సు చెప్పించడమే కాకుండా తన కూతుర్ని అతనికిచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు విశ్వనాథం. ఆయన ఏకైక పుత్రిక విజయను తన కొడుకు చంద్రం (చలం)కు ఇచ్చి పెళ్లిచేసి జమీందారు ఆస్తిని కాజేయాలని చూస్తుంటాడు రంగనాథం. ఇంతలో జగన్నాథం చనిపోవడంతో, విశ్వనాథం కూడా సానుభూతితో మరణిస్తాడు.
చదువు పూర్తిచేసుకొని పల్లెకు వచ్చిన సూర్యం (అక్కినేని నాగేశ్వరరావు) డాక్టరుగా మంచి పేరు తెచ్చుకుంటాడు. సునాయాసంగా విజయ (కృష్ణకుమారి) ప్రేమను  పొందుతాడు. కానీ రంగనాథం చెడుబుర్ర కారణాన అనేక అవాంతరాలొస్తాయి. వాటిని తొలగించడంలో సూర్యం సఫలమవడంతో విజయ అతనికే దక్కుతుంది. జగన్నాథానికి విశ్వనాథం ఇచ్చిన వాగ్దానం నిలబడుతుంది.

తారాగణం: అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణకుమారి, గుమ్మడి, రేలంగి, చలం, సూర్యకాంతం, గిరిజ, పద్మనాభం, కె. వెంకటేశ్వరరావు, మల్లాది, మద్దాలి, సురభి కమలాబాయి
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
నిర్మాతలు: కె. సత్యనారాయణ, డి. శ్రీరామమూర్తి
దర్శకత్వం: ఆత్రేయ
బేనర్: కవితా చిత్ర
విడుదల తేదీ: 5 అక్టోబర్ 1961

Society: People need heroes

ప్రజా నాయకులు రావాలి

నేడు దేశంలో అధిక లాభార్జనపరులు, అక్రమ నిల్వదారులు, బ్లాక్ మార్కెటీర్లు, కల్తీదారులు, దురాశాపరులైన వడ్డీ వ్యాపారులు, పచ్చి నిరంకుశులైన భూస్వాములు, అవినీతిపరులైన అధికారులు, స్వప్రయోజనాల కోసం ఎంతటి నీచానికైనా ఒడికట్టే రాజకీయ నాయకులు విశృంఖలంగా స్వైర విహారం సాగిస్తూ ప్రజా జీవితాన్ని దుర్భరం చేస్తున్నారు.
నేటి దోపిడీదారి వ్యవస్థకు ఎప్పుడు కాలం చెల్లుతుందో తెలీకుండా ఉంది. ప్రజల్లో అసంతృప్తి తీవ్రస్థాయిలో ఉన్నా, దాన్నుంచి విముక్తి చెందాలనే కాంక్ష బలంగా ఉన్నా దిశా నిర్దేశం చేసి, వాళ్లకు నాయకత్వం వహించే ధైర్యవంతులే లేకుండా పోయారు. దోపిడీదారులకు ఒక న్యాయం, వాళ్లను ఎదిరించి పోరాడుతూ ప్రజల పక్షాన నిలిచిన వాళ్లకు మరొక న్యాయం జరుగుతూ వస్తుండటం వల్ల ప్రజా నాయకుల్లో ఒక రకమైన స్తబ్దత ఏర్పడినట్లు కనిపిస్తోంది.
అయినా అక్రమంతో, నిరంకుశత్వంతో రాజీపడటం, సహించి ఊరుకోవడం ప్రజలపై చూపించే ఘోర అపచారమే అవుతుంది. రాజీలేని పోరాట మార్గాన్ని అనుసరిస్తూ అరాచక శక్తుల దౌర్జన్యాల్ని ఎదుర్కోగల నాయకులు ప్రజల నుంచి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Thursday, December 24, 2015

Actress Lakhmi Rajyam Filmography

1. Sri Krishna Thulabharam (1935)
2. Sri Krishna Leelalu (1935)
3. Chitra Naleeyam (1938)
4. Amma (1939)
5. Kalachakram (1940) (Santha)
6. Illalu (1940)
7. Apavadu (1941) (Kamala)

contd...

Show respect on Actress

'తార' అంటే చులకనెందుకు?

సినీ తారల్ని, అందులోనూ హీరోయిన్‌లను వాళ్ల హవా నడిచినంత కాలం బ్రహ్మాండంగా పొగుడుతూ ఆకాశానికెత్తేస్తారు. వాళ్ల ప్రాభవం తగ్గుతున్నప్పుడు నిర్దాక్షిణ్యంగా విమర్శించి అవతలకి విసిరేస్తారు. అలా ఓ వైపు ప్రశంసలూ, మరోవైపు విమర్శలతో కూడుకున్న వాళ్ల జీవితాలు కులాసాగా ఉంటాయనీ, వాళ్లు సులభంగా డబ్బు సంపాదిస్తూ జల్సాగా పబ్బులకూ, పార్టీలకూ తిరుగుతుంటారనీ సాధారణంగా ప్రజల్లో ఉన్న అభిప్రాయం. అయితే అది కేవలం అపోహ అని చెప్పాలి.
హీరో పాత్ర చుట్టూ ఎంత తిరిగినా నాయిక పాత్ర లేకపోతే ఆ సినిమా రస విహీనంగా ఉంటుందనేది నిజం. సినీ తార తన నేర్పునూ, చాకచక్యాన్నీ ప్రదర్శించి తన పాత్రలకు జీవం పోస్తోంది. ప్రతిభావంతులైన తారలు మహత్తరమైన స్త్రీ పాత్రలు - సీత, ద్రౌపది, రుద్రమదేవి, రాములమ్మ వంటివి - పోషించారు. మన పురాణాలు, చరిత్రల్లోని వీర నారీమణుల్ని సజీవంగా కళ్లముందుంచింది నటీమణులే. పాశ్చాత్య వ్యామోహంలో పడి మన పురాణ (పుక్కిటి పురాణలైనా అవి మన వారసత్వ సంపద), చారిత్రక గాథల్ని మర్చిపోయే స్థితిలోకి వచ్చాం. ముందు తరాలవాళ్లకు ఈ గొప్ప గాథలూ, పాత్రలూ కనిపించకుండా పోతాయనే దుస్థితికి దిగజారిపోయాం. ఇటీవలే 'రుద్రమదేవి'గా నటించిన అనుష్క ఆ వీరనారిని మరోసారి ప్రజలకు పరిచయం చేసింది. ప్రజల్లోని సాంఘిక దురాచారాల్ని అనేక స్త్రీపాత్రలు యెత్తి చూపించాయి. ఏ ఇతర మాధ్యమంలోనూ ఇలాంటి మహత్తర సంచలనం ప్రజల్లో తీసుకురావడం కష్టం. 'ఒసేయ్ రాములమ్మా'లో నాయిక భూస్వాముల్నీ, దొరల్నీ ఎదిరించి వారి పీచమణచి ప్రజలకు విముక్తి కలిగించడం చూశాం. ప్రజలకు కంటకంగా మారిన దుష్టశక్తిని అంతమొందించిన 'అరుంధతి'కి జేజేలు పలికాం.
సినిమాలు అభివృద్ధి చెందటంతో పాటు పాటలకూ ప్రాధాన్యం పెరిగింది. మధురంగా పాడుతున్న గాయనీమణుల గాత్రం సామాన్య ప్రజల్ని సైతం ఆకర్షించి ఆనందింపజేస్తోంది. లయ, సంగీతం ప్రజల హృదయాల్లో నాటుకుపోయేట్లు నేటి గాయకురాళ్లు తమ ప్రతిభాపాటవాల్ని ప్రదర్శిస్తున్నారు. ఇంటిపనులతో అలసిన స్త్రీలకు వాళ్ల పాటలు హాయినిస్తున్నాయి. సంగీతమనేది కేవలం విద్వాంసుల సొత్తేననీ, అది సాధించడం కష్టతరమనీ సాధారణంగా ఉండే అభిప్రాయం తప్పని ఇవాళ అనేకమంది గాయకురాళ్లు నిరూపిస్తున్నారు. టీవీలో వచ్చే పాటల కార్యక్రమాలు ఎంత ఆదరణ పొందుతున్నదీ చూస్తున్నాం. వీటివల్ల ఎంతోమంది గాయనీమణులకు అవకాశాలు ఏర్పడ్డాయి.
నిజంగా ఇలాంటి అభివృద్ధి కలగడానికి ఎక్కువగా తోడ్పడింది సినిమాలే అని చెప్పక తప్పదు. సినిమాల్లో ప్రోత్సాహం లేకపోతే భరతనాట్యం, కథకళి, మణిపురి, కథక్, కూచిపూడి వంటి నాట్యరీతులు ఎక్కడ పుట్టాయో అక్కడే ఉండేవి కానీ, ఇవాళున్నంతగా వృద్ధిచెందేవి కావు. ఈ నాట్యాలన్నీ భారతీయ సంస్కృతిలో ఓ భాగంగా గుర్తింపుకు నోచుకోవడం మనమంతా గర్వించాల్సిన విషయం. సినిమాల ద్వారా సినీనటి ఈ నాట్యరీతులన్నింటినీ ప్రజలకు అందించిందనేది ఒప్పుకుని తీరాలి.
దేశంలో స్త్రీల సాంఘిక జీవితంలో గొప్ప మార్పుల్ని తేగలిగింది సినీతార. సౌందర్యం విషయమైనా, హక్కుల విషయంలోనైనా తనను తాను తెలుసుకొనేటట్లు చేసింది నటి. ఒకప్పటి భారతీయ స్త్రీకీ, నేటి స్త్రీకీ నడకలో, అలంకరణల్లో హస్తిమశకాంతర భేదం కనిపించడంలో సినీనటి పాత్ర ఎంతో ఉంది. ఫలానా వాణిశ్రీలా నేనూ కనిపించాలి, ఫలానా సౌందర్యలా నేనూ చీర కట్టుకోవాలి, ఫలానా అనుష్కలా లావణ్యంగా కనిపించాలనే కోరిక స్త్రీలలో ఉండటం గమనిస్తూనే ఉన్నాం. దుస్తుల్లో, తలకట్టులో, కాలిజోళ్లలో మార్పులు బాహ్య రూపాన్ని మార్చివేస్తే, స్త్రీ తన కాళ్లపై తను నిలబడగలదనే ధైర్యాన్ని ఇవ్వడంలో పలు సినిమాల్లో సినీతారలు పోషించిన పాత్రలు కూడా దోహదం చేశాయి.
ఆర్థిక పరిస్థితులు చాలా కష్టంగా ఉన్న రోజుల్లో స్త్రీలు  తమంత తాము స్వతంత్రంగా బతకడానికీ లేదా కుటుంబానికి ఆసరాగా ఉండటానికీ సినీ నటి ఒక నూతన మార్గం చూపించిందనాలి. ఏ ఇతర సంస్థల్లోనూ కనిపించని ఆదాయం సినీ రంగంలో కనిపిస్తుంది. తెలివైన స్త్రీలకు ఈ రంగంలో పైకి రావడానికి అనేక అవకాశాలున్నాయి. కేవలం నటే కానవసరం లేదు. ఇందులో స్త్రీలు పనిచేసే అనేక ఇతర శాఖలున్నాయి. దర్శకురాళ్లుగా, సినిమాటోగ్రాఫర్లుగా, సంగీత దర్శకురాళ్లుగా, నృత్య దర్శకురాళ్లుగా, రచయిత్రులుగా తమను తాము నిరూపించుకోవచ్చు.
ఎక్కడ ఏ కష్టం కలిగినా, ఏదేనా సంస్థకు ఆర్థిక సాయం కావాల్సినా తారలే ముందుంటున్నారు. ఇవాళ చాలమంది తారలు ఎంజీవోలకు మద్దతుగా నిలుస్తున్నారు. లేదంటే అలాంటి సంస్థలు నడుపుతున్నారు. విరాళాల సేకరణలో అలనాటి ఎమ్మెస్ సుబ్బులక్ష్మి నుంచి నేటి సమంత దాకా ఎంతోమంది తమవంతు  కృషి చేస్తూనే ఉన్నారు.
ప్రభుత్వానికి జమయ్యే వినోదపన్నులో సినిమాల ద్వారా, తారల ద్వారా, చిత్ర పరిశ్రమ ద్వారా వచ్చేదే అధికం. అలాంటి ఈ పరిశ్రమలో నటిది చాలా ముఖ్యమైన పాత్ర. ఈ పరిశ్రమకే మూలాధారం నటి. దీని అభివృద్ధికై ఆమె చేసే సేవ చాలా గొప్పది. చిత్రంగా సంఘం దృష్టిలో ఆమె స్థానం అధమం. ఎక్కడ చూసినా ఆమె కేరక్టర్‌ను తక్కువ చేసి మాట్లాడేవాళ్లే. అయినా అదేమీ లక్ష్యపెట్టకుండా పరిశ్రమలోని అందరితో కలిసి దాని అభివృద్ధికి ఆమె పాటుపడుతూనే ఉంది. దాని కోసం ఆమె ఎప్పుడూ సంసిద్ధమే.

Wednesday, December 23, 2015

Utilize the Self Energy

స్వయం శక్తిని ఉపయోగపెట్టేదెప్పుడు?

మనం స్వతంత్రంగా వ్యవహరిస్తే తగినంత విదేశీ సహాయం మనకు లభించదు. విదేశీ సహాయంపై ఆధారపడిన రోజు స్వతంత్రంగా వ్యవహరించడానికి తగిన శక్తి మనకుండదు. విదేశీ సహాయం వల్ల జరిగే అభివృద్ధి విదేశాల ప్రయోజనాలకు భంగం కలగని విధానంలో జరుగుతుంది కానీ మన ఆర్థిక పరాధీనత మాత్రం తొలగదు. మనకు కావాల్సినత అంగబలం, అర్థ బలం ఉంది. సరైన ఆర్థిక విధానం ద్వారా ఈ అంగబలాన్ని అర్థబలంతో సమన్వయం చేస్తే ఒకరిపై ఆధారపడాల్సిన అవసరం మనకు ఉండదు. ప్రజలకు పని కల్పించని, దేశంలోని అర్థబలాన్ని సమీకరించడానికి పూనుకోని ప్రణాళికలు తమ ప్రయోజనాన్ని సాధించలేవు.
విదేశీ సంస్థలు లాభాలుగా గడించిన కోట్లాది రూపాయలు దేశంనుంచి బయటకు వెళ్లిపోతున్నాయి. మనదేశంలోని పారిశ్రామిక సంస్థలు సంపాదించిన అధిక లాభాల్లో తగినంత భాగం తిరిగి ఉత్పత్తిని అభివృద్ధి చేసేందుకు వినియోగపడ్డం లేదు. దేశాభివృద్ధికి ఉపయోగపడకుండా వ్యర్థమవుతున్న ఈ అర్థబలం కొంతభాగమైనా ప్రణాళికా నిర్వహణకు సేకరించగలిగినప్పుడే ఏదైనా సాధించేందుకు వీలవుతుంది. కొనుగోలు శక్తి క్షీణించి ఇప్పటి ఉత్పత్తినే అనుభవించలేని స్థితిలో ప్రజలు ఉన్నప్పుడు ధరలు పెరిగితే వాళ్ల జీవన స్థాయి ఇంకా తగ్గుతుంది. ధరల్ని అదుపులో పెట్టడానికి తగిన పరిపాలనా సౌష్టవం మనకులేదనే సంగతి పప్పు ధాన్యాలు, ఉల్లిపాయలు, బియ్యం వంటి ఆహార పదార్థాల విషయంలో మనకు అనుభవమే. ప్రభుత్వం వడ్డీలకు రుణాల్ని తెస్తూ రకరకాల పన్నుల రూపంలో ప్రజల నుంచి వాటిని వసూలు చేస్తోంది. ఉన్నవాళ్ల సంపదను పెంచి, లేనివాళ్ల లేమిని పెంచే ఈ విధానం లోపభూయిస్థంగా ఉందనేది నిశ్చయం.
ప్రజల ఆదాయం పెరగాలంటే వ్యవసాయం వృద్ధి చెందాలి. నిరుద్యోగం పోవాలి. కానీ మనవద్ద ఈ రెండూ జరగడం లేదు. వ్యవసాయం లాభసాటి వృత్తిగా మారడం అటుంచి, రుణాల ఊబిలో చిక్కుకుపోతూ మన తెలుగు రాష్ట్రాల్లోనే ఏటా వందలాది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘోరాన్ని చూస్తున్నాం. ఇక మనవద్ద ఉపాధి ఆశించిన మేరకు కనిపించకపోవడంతో ప్రతిభావంతులైన సాఫ్ట్‌వేర్, ఆర్థిక రంగ నిపుణులు ఇతర దేశాలకు తరలిపోతుండం మనకు ప్రత్యక్ష అనుభవం. సామాన్య ప్రజల వద్ద ఉన్నది శ్రమశక్తి మాత్రమే. దాన్నయినా వినియోగించుకోడానికి ప్రభుత్వం ప్రయత్నించాలి. శ్రమశక్తిని సంపదగా ప్రభుత్వం మార్చుకోగలిగితే, ఆ సంపదలో కొంతభాగం తిరిగి జాతీయాభివృద్ధికి ఉపయోగపడుతుంది. ప్రభుత్వం ఈ వాస్తవాన్ని గుర్తించాలి.

Tuesday, December 22, 2015

Writer and Actor Kasi Viswanath Filmography

As a Dialogue Writer
Ashala Sandadi (1999)
Premaku Padi Sutralu (1995)
Parugo Parugu (1994)
Nannagaru (1994)
Akka Pettanam Chelleli Kapuram (1993)
Pellaniki Premalekha Priyuraliki Subhalekha (1992)
Golmaal Govindam (1992)
Samsarala Mechanic (1992)
Edurinti Mogudu Pakkinti Pellam (1991)
Iddaru Pellala Muddula Police (1991)
Sreevari Chindulu (1991)
Mama Alludu (1990)
Mahajananiki Maradalu Pilla (1990)
Idem Pellam Baboi (1990)
Sumangali (1989)
Zoo Lakataka (1989)
Prema Kireetam (1988)
Thodallullu (1988)
Maharajasri Mayagadu (1988)
Garjinchina Ganga (1988)
Bava Marudula Saval (1988)
Donga Kollu (1988)
Chandramama Raave (1987)
Kaboye Alludu (1987)
Ratation Chakravarthi (1987)
Prema Samrat (1987)
Nakoo Pellam Kavali (1987)
Alludu Kosam (1987)
Ee Charitra Inkennallu (1987)
Dorabidda (1986)
Krishna Garadi (1986)
Magadheerudu (1986)
Police Officer (1986)
Poojaku Panikirani Puvvu (1986)
Samajamlo Stree (1986)
Illalu Vardhillu (1985)
Asadhyudu (1985)
Kongumudi (1985)
Ragile Gundelu (1985)
Vintha Mogudu (1985)
Kurra Cheshtalu (1984)
Dopidi Dongalu (1984)
Danavudu (1984)
Hero (1984)
Kalalu Kane Kallu (1984)
Nirdoshi (1984)
Kotikokkadu (1983)
Pandanti Kapuraniki 12 Sutralu (1983)
Seetha Puttina Desam (1983)
Iddaru Kiladeelu (1983)
Maga Maharaju (1983)
Amayaka Chakravarthy (1983)
Evandoi Srimathi Garu (1982)
Korukunna Mogudu (1982)
Ragam Tanam Pallavi (1982)
Patnam Vachina Patrivratalu (1982)
Tingu Rangadu (1982)
Maa Pelli Katha (1981)
Nenu Maa Avida (1981)
Taxi Driver (1981)
Gadasari Atta Sogasari Kodalu (1981)
Gharana Gangulu (1981)
Jeevitha Ratham (1981)
Bangaru Bava (1980)
Pelli Gola (1980)
Ramayanamlo Pidakala Veta (1980)

As a Story Writer
Edurinti Mogudu Pakkinti Pellam (1991)
Iddaru Pellala Muddula Police (1991)
Prema Samrat (1987)
Alludu Kosam (1987)
Kutumba Gowravam (1985)
Kurra Cheshtalu (1984)
Pandanti Kapuraniki 12 Sutralu (1983)

As an Actor
Mangatayaru Tiffin Centre (2008)
Ammo Alludu (1996)
Ketu Duplicatu (1995)
Premaku Padi Sutralu (1995)
Nannagaru (1994)
Pellaniki Premalekha Priyuraliki Subhalekha (1992)
Golmaal Govindam (1992)
Subbarayudi Pelli (1992)
420 (1991)
Edurinti Mogudu Pakkinti Pellam (1991)
Sreevari Chindulu (1991)
Mama Alludu (1990)
Idem Pellam Baboi (1990)
Bava Marudula Saval (1988)
Donga Kollu (1988)
Garjinchina Ganga (1988)
Prema Kireetam (1988)
Sankellu (1988)
Kaboye Alludu (1987)
Rotation Chakravarthy (1987)
Thayaramma Thandava Krishna (1987)
Samajamlo Stree (1986)
Garjana (1985)
Illalu Vardhillu (1985)
Kongumudi (1985)
Adigo Alladigo (1984)
Danavudu (1984)
Hero (1984)
Amayaka Chakravarthy (1983)
Balidaanam (1983)
Ramayanamlo Pidakala Veta (1980)

Facts in Mahabharatham

భారతంలో పంటికింది రాళ్లు

భారతం ప్రకారం అంబిక, అంబాలికలు వితంతువులు. వాళ్లను తల్లులను చేసిన వ్యాసుని తల్లీ పతివ్రత కాదు. వ్యాసుని కొడుకు పాండురాజు. పాండురాజు కొడుకులమనే పాండవులకు ఐదుగురు తండ్రులు. కర్ణుడి తండ్రి సూర్యుడు. పాండవుల ఐదుగురికి ద్రౌపది ఒక్కతే భార్య. ద్రౌపది అత్తగారు కుంతీదేవి. అత్తకు అధికారికంగా ఒకరు, అనధికారికంగా ఐదుగురు.. మొత్తం ఆరుగురు భర్తలు. కోడలికి అధికారికంగానే ఐదుగురు భర్తలు.
ఇవాళ్టి సమాజ నియమాల ప్రకారం ఇవన్నీ తప్పులు, శిక్షార్హమైన నేరాలు.

Monday, December 21, 2015

NTR's Sting Operation

తెహెల్కా డాట్ కామ్ చేసిన స్టింగ్ ఆపరేషన్ హిట్టయ్యాక మన దేశంలో రహస్య కెమెరాల వినియోగం పెరిగింది. అయితే దివంగత ఎన్టీఆర్ చాలా కాలం క్రితమే ఈ స్టింగ్ ఆపరేషన్‌ను నిర్వహించారు. ఇది నిజంగా నిజం. 1983లో ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజక వర్గం నుంచి ఎన్నికైన మాధవరం రామచంద్రరావు కార్మిక శాఖ చేపట్టారు. ఆయన ఇప్పటి టిఆర్ఎస్ నాయకుడు సుదర్శనరావు తండ్రి. సంచలనాలు కోరుకునే ఎన్టీఆర్ తన మంత్రివర్గ సహచరుడి మీదనే స్టింగ్ ఆపరేషన్ తలపెట్టారు. ఒక పోలీసు అధికారి స్వయంగా మారువేషంలో వెళ్లి పది వేల రూపాయలు లంచం ఇచ్చి తనకో పని చేసి పెట్టాలని కోరాడు. వెంటనే అవినీతికి పాల్పడ్డారంటూ రామచంద్రరావును రామారావు బర్తరఫ్ చేశారు. ఇందులో ప్రయోజనాల కంటే సంచలనమే ఎక్కువ కనిపించిందని అప్పట్లో చెప్పుకున్నారు.

Actress C. Krishnaveni Filmography

1. Sati Anasuya (1936)
2. Mohini Rukmangada (1937) (Sandhyavali)
3. Kacha Devayani (1938) (Devayani)
4. Malli Pelli (1939) (Annapurnamma)
5. Mahananda (1939)
6. Jeevana Jyothi (1940)
7. Daksha Yagnam (1941) (Sati)

contd...

Sunday, December 20, 2015

History of Telugu People - 1

మన చరిత్ర - 1

వర్తకం పేరుతో మన దేశానికి వచ్చిన ఈస్టిండియా కంపెనీ క్రమేణా తన రాజ్య విస్తరణకు పూనుకుంది. స్వదేశీ సంస్థానాధీశుల రక్షణ పేరుతో, తమ సైన్యాల్ని ఉంచి, వాటికయ్యే ఖర్చునంతట్నీ ఆయా ప్రాంతాల రాజుల నుంచి రాబట్టే పద్ధతిని అమల్లోకి తెచ్చారు. ఈ విధానంతో స్వదేశీ రాజులు బ్రిటీష్‌వాళ్లకు కీలుబొమ్మలుగా మారారు. ఆఖరుకు భారతదేశం మొత్తంమీద బ్రిటీష్ సామ్రాజ్యవాదులకు సార్వభౌమాధికారం లభించింది. సైన్య సహకార పద్ధతిని అంగీకరించిన నిజాం రాజు, కోస్తాంధ్ర జిల్లాల్ని బ్రిటీష్ ప్రతినిథి క్లైవ్‌కు 1766లో జాగీరుగా ఇచ్చాడు. ఇదేరకంగా 1788లో గుంటూరు జిల్లాను ఇచ్చేశాడు. బ్రిటీష్ సైన్య పోషణ ఖర్చుల నిమిత్తం బళ్లారి, కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల్ని 1800లో బ్రిటీష్ వాళ్లకు దఖలుపరిచాడు. ఇక నెల్లూరు జిల్లాను ఆర్కాట్ నవాబు నుండి 1801లో బ్రిటీషర్లు కాజేశారు. అప్పట్లో వీటిని దత్త మండలాలని పిలుస్తుండేవాళ్లు. రాయలేలిన సీమ కాబట్టి తర్వాత కాలంలో అవి రాయలసీమగా వాడుకలోకి వచ్చాయి.
ఇలా స్వాధీనం చేసుకున్న తెలుగు ప్రాంతాన్ని మద్రాసు రాజధానిలో కలిపి తమ పరిపాలన కిందకు తెచ్చుకున్నారు బ్రిటీష్‌వాళ్లు. హైదరాబాద్, దక్కన్ ప్రాంతం స్వదేశీ సంస్థానంగా ఉండిపోయింది. దీన్నిబట్టి శతాబ్దాలుగా ఒకటిగా కలిసివున్న తెలుగుజాతిని విచ్ఛిన్నం చేసింది నిజానికి అసఫ్‌జాహీ నవాబులేనని మరచిపోకూడదు. వాళ్లు ఇక్కడ తెలుగు భాషను, సంస్కృతిని అణచివేశారు. వాక్ స్వతంత్రం వంటి పౌరహక్కుల్ని కాలరాశారు. నిజాం రాజ్య పాలనలో ఇతర భాషల్ని తొక్కిపెట్టి ఉర్దూకు పట్టంగట్టారు. మతతత్వాన్ని రేకెత్తించి, ప్రజలపై నిరంకుశ పాలన సాగించారు.

Saturday, December 19, 2015

Synopsis of the movie KALASI UNTE KALADU SUKHAM (1961)

'కలసివుంటే కలదు సుఖం' (1961) చిత్ర కథాంశం


రామలక్ష్మణులకు ప్రతిరూపాలు అన్నదమ్ములైన పట్టాభిరామయ్య, సుందరరామయ్య. పట్టాభిరామయ్య భార్య సౌభాగ్యం. కానీ ఆమె తన పాలిట దౌర్భాగ్యమని పబ్లిగ్గాన్నే పిలుస్తుంటాడు. అంత గయ్యాళి సౌభాగ్యం. సుందరరామయ్య భార్య రమణమ్మ హృదయం వెన్నకన్నా మెత్తన. ఆమె ఎంత మంచిదంటే సంతలో కనిపించిన అనాథ యువతి రాధను తీసుకువచ్చి, తర్వాత తన పెద్ద కోడల్ని చేసుకుంటుంది.
రమణమ్మకు ఇద్దరు కొడుకులు. పెద్దవాడు కిష్టయ్యకు ఏడో యేట ఎలక్ట్రిక్ షాక్ తగిలి ఒక కాలు, ఒక చేయి వంకరతిరిగిపోతాయి. చిన్నవాడు రఘు పట్నంలో పాఠాలతో పాటు ప్రేమపాఠాలూ వల్లె వేస్తుంటాడు. అమ్మలాగే కిష్టయ్య హృదయం చాలా మంచిది. పదిమందికి పనికివచ్చే మంచి తనకు చెడు అయినా అతనికి సంతోషమే. రఘుకూడా మంచివాడే కానీ ఉడుకురక్తంతో మంచీ చెడూ తెలుసుకోలేని స్థితిలో కొట్టుకులాడుతుంటాడు.
ఇంట్లో తాను తప్ప అందరూ మంచివాళ్లయిపోవడంతో, ఆఖరికి కట్టుకున్న మొగుడు కూడా ఎగస్పార్టీ అవడంతో సౌభాగ్యానికి దిక్కు తోచదు. కానీ రోజులన్నీ ఒక్కలాగే ఉండవు కదా. ఆమెకీ రోజులొచ్చాయి. ఆమె మేనల్లుడు రంగూన్ రాజా, అతని చెల్లెలు జానకి వాళ్లింట్లో దిగారు. సిద్ధాంతి జోస్యం చెబుతూ 'శని ఇంట్లో అడుగు పెడ్తున్నాడయ్యా' అని అంటుంటే, 'పెట్టడమేం ఖర్మ.. పెట్టేశాడు' అని నిట్టూరుస్తాడు పట్టాభిరామయ్య. రంగూన్ రాజా దీపావళి టపాకాయలు టెన్ థౌశండ్ వాలా పేల్చినట్లు అదేపనిగా వాగేస్తుంటాడు. అతని నాలుకతో పాటు బుద్ధీ పదునైనదే. ఆ వాడి బుర్రలోంచి వేడివేడి ఐడియాలు వస్తుంటాయి. గిరీశానికి ఒక ఆకు ఎక్కువే.
వాడు ఆ ఇంటికి వస్తూనే ఆటబొమ్మలు తెచ్చాడు. వాటిని మించి మేనత్తను ఆడించేశాడు. పాచిక వేసి, విషం నూరి, ఆమె గొంతులో తియ్యగా పోశాడు. సౌభాగ్యం చిన్న బుర్ర పెద్ద పెద్ద ఆలోచనలతో ఉక్కిరిబిక్కిరైపోయింది. చిందులు తొక్కింది. భర్తతో వేరు పడాల్సిందేనంది. ఆయన గోల పెట్టాడు. బతిమిలాడాడు. చివరకు అందరిముందే ఏడ్చాడు. అయినా సౌభాగ్యం తగ్గలేదు. మరింత బిగుసుకుపోయింది. ఫలితం.. అనందమ్ములు విడిపోయారు. రెండు వాటాల మధ్య గోడలేచింది.
మనుషులు వేరయ్యారు. కానీ మనసులు వేరవలేదు. రఘు మినహా సుందరరామయ్య కుంటుంబం పడరాని అవమానాలు పడింది. కృష్ణయ్య మరీనూ. అన్నింటినీ చాలా ఓర్పుతో భరించారు. ఈలోగా సెలవలకు ఇంటికి వచ్చిన రఘు, ఆ వెంటనే జానకిని ప్రేమించేసి ఆమెను అందుకోడానికి రాజాకు దగ్గరయ్యాడు. అటేపే వెళ్లిపోయాడు. తను కూడా యధాశక్తి అన్ననీ, అమ్మానాన్నల్నీ అవమానించి, అది చాలదన్నట్లుగా తండ్రి చావు బతుకుల్లో ఉంటే, అన్నకంటే ముందుగా జానకిని పెళ్లి చేసుకున్నాడు.
కృష్ణయ్య మనిషి అవుడైనా, మనసు చాలా మంచిదని గ్రహించిన రాధ అతను అడక్కుండానే తన మనసును అతనికిచ్చేసింది. సమయం చూసుకొని ఆ సంగతి తనే బయటపెట్టి, అతనితో మూడు ముళ్లూ వేయించుకుంటుంది. తొడికోడళ్లిద్దరూ పోటీలుపడి చెరో మగపిల్లాణ్ణీ కంటారు. ఆలస్యంగా పెళ్లయినా జానకి కంటే ముందే కంటుంది రాధ. ఓర్వలేనివాళ్లు అవిటివాడికి అవిటి పిల్లాడే పుడ్తాడని దీవించినా, మంచి పిల్లాడే పుడతాడు. హైదరాబాద్‌లో ఉద్యోగం రావడంతో అక్కడకు భార్యా పిల్లల్తో వెళ్లిపోతాడు రఘు.
ఈలోగా సౌభాగ్యం దగ్గరున్న భాగ్యాన్ని తన పరం చేసుకొని హైదరాబాద్ మకాం మారుస్తాడు రాజా. అక్కడ గతంలో బందర్ బజార్లో బజ్జీలు అమ్మే మంజువాణి కూతురు అనార్కలితో కలిసి నాట్యాలూ, సర్కసులూ నడుపుతుంటాడు. రఘుచేత ఆఫీసు డబ్బు ఇరవై వేలు కాజేయించి అనార్కలికి అర్పణం చేస్తాడు. అదే సమయంలో భర్త కాలూ చెయ్యీ బాగు చేయించడానికి రాధ హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చేర్పిస్తుంది. సర్కస్‌లో ఏనుగు చేత ఫీట్లు చేయించడానికని ఆమె బిడ్డను ఎత్తుకుపోతాడు రాజా. అయితే రఘు బుద్ధి తెచ్చుకొని రాజాని నాలుగు వాయిస్తాడు. దాంతో మంజువాణి బృందం డబ్బుతో బొంబాయ్ పారిపోతుంది. ముసలాళ్లంతా పల్లె నుంచి హైదరాబాద్ చేరుకుంటారు. కిష్టయ్య ఆస్పత్రి నుంచి పారిపోయి సర్కస్ డేరాలో కరంట్ షాక్ తిని బాగైపోయి ఏనుగు నుంచి పిల్లవాణ్ణి రక్షిస్తాడు.
పారిపోయిన మంజువాణినీ, అనార్కలినీ, పారిపోబోతున్న రాజానీ పోలీసులు పట్టుకుంటారు. కిష్టయ్య మంచితనంతో రాజా బయటపడతాడు. అత్తా చెల్లెళ్లతో పాటు తనూ బుద్ధి తెచ్చుకుంటాడు. ఇంట్లో కట్టిన అడ్డుగోడని నలుగురూ కలిసి పగులకొట్టి 'కలసి ఉంటే కలదు సుఖం' అని నిరూపిస్తారు.

తారాగణం:  ఎన్టీ రామారావు, సావిత్రి, ఎస్వీ రంగారావు, హరనాథ్, రేలంగి, సూర్యకాంతం, హేమలత, గిరిజ, పెరుమాళ్లు
సంగీతం: మాస్టర్ వేణు
నిర్మాతలు: సీవీఆర్ ప్రసాద్, వై. రామకృష్ణప్రసాద్
దర్శకత్వం: తాపీ చాణక్య
బేనర్: శ్రీ సారథీ స్టూడియోస్
విడుదల తేదీ: 8 సెప్టెంబర్

Friday, December 18, 2015

Actress Kannamba Filmography

1. Harischandra (1935) (Chandramathi)
2. Draupadi Vastrapaharanam (1936) (Draupadi)
3. Kanaka Thara (1937) (Kamala)
4. Grihalakshmi (1938) (Radha)
5. Mahananda (1939)
6. Bhoja Kalidasa (1940)
7. Chandika (1940)
8. Talli Prema (1941)
9. Sumathi (1942)

contd...

Thursday, December 17, 2015

Poetry: That is what we

మేమింతే!


అక్కడ బొమ్మరిల్లులో కూర్చున్నాం
తనూ నేనూ
శిశిరమూ హేమంతమూ వెళ్లిపోయాయి

బొమ్మరిల్లు కాలి నుసిగా మారి
మట్టిలో కలిసిపోయింది
తనూ నేనూ
మట్టిని తిరగేసినా దొరకలేదేమీ

బూడిదైపోయిన విశ్వాసాన్ని
తను తిరిగి పొందలేదు
చ్యుతిపొందిన ఆనందాన్ని
నేనూ మళ్లీ పొందలేదు
ఇక మేమింతే!

Tuesday, December 15, 2015

Poetry: Where is my village?

ఏదీ నా పల్లె?

దేశ సౌభాగ్యానికే మూలమనే 
నా పల్లె అందమేమైపోయింది?

తొలికోడి కూతతో తెలతెలవారుతుంటే
పొలాల్లో రైతులు కనిపించరేమి?
పడుచుపిల్లలు కడవలు చేతబట్టి
పాకాల బావిని చేరే దృశ్యమేదీ?

బర్రెల మందలు గొర్రెల మందలు
మేతకు పోవడం కనిపించదేమి?
ఆవుల అంబాలు  మేకల మేమేలు
మేళవించెడి పాట వినపడదేమి?

జలజలా పారే సెలయేటి నీళ్లలో
ఆడేపాడే పిల్లలేరీ?
లోతు నూతుల్లో ఏతాము తోడే
రైతు కుర్రాళ్ల రీతి ఏదీ?

మర్రె ఊడల్ని పట్టుకొని విర్రవీగుతూ
ఉయ్యాలలూగే పిల్లలెక్కడ?
బర్రెల వీపుపై గర్వంతో ఎక్కి
కుర్రకారు చేసే స్వారి కనిపించదేమి?

కంచాలు చేసి గెంతుతూ గోళీలాట ఆడే
చిట్టితండ్రుల సంబరమేదీ?
కొమ్మ కొమ్మలు దాటి కోతికొమ్మచ్చులాడే
వేడుక కనిపించదేమి?

కొండ కిందకుపోయి నిండుగా
కట్టెలని కొట్టే సన్నివేశమెక్కడ?
పొన్నచెట్టుపైన పొందుగా పాడే
చిన్నిగొల్ల మురళి వినిపించదేమి?

Monday, December 14, 2015

Film Writer G. Satya Murthy Filmography

Pelli (1997) - dialogues
Ammadongaa (1995) - story
Palletoori mogudu (1994) - director
Rowdy annayya (1993) - story, screenplay, dialogues
Bangaru bullodu (1993) - screenplay, dialogues
Public rowdy (1992) - story
Chanti (1992) - dialogues
Stuvartpuram dongalu (1991) - dialogues
Satruvu (1991) - story, dialogues
Nari nari naduma murari (1990) - dialogues
Jagadeka veerudu atiloka sundari (1990) - script associate
Mutyamanta muddu (1989) - dialogues
Bhale donga (1989) - story and dialogues
Neram naadi kadu (1989) - story, screenplay, dialogues
Nyayam kosam (1988) - dialogues
Khaidi no. 786 (1988) - dialogues
Bazaru rowdy (1988) - dialogues
Srinivasa kalyanam (1987) - story, dialogues
Chaitanyam (1987) - director
Iddaru mithrulu (1986) - dialogues
Dampatyam (1985) - dialogues
Kirathakudu (1986) - dialogues
Suvarna sundari (1985) - dialogues
Jwala (1985) - dialogues
Kanchu kagada (1984) - lyrics
Challenge (1984) - dialogues
Srimathi kavali (1984) - dialogues, lyrics

Sunday, December 13, 2015

What is INDRA DHANUSSU?

'ఇంద్ర'ధనుస్సు

వర్షం కురిసే సందర్భంలో ఆకాశంపై అందంగా ఇంద్రధనుస్సు సప్తవర్ణాలతో కనిపిస్తుంది. ఆకాశానికీ, వర్షానికీ ఇంద్రుడు దేవత అనుకునే రోజుల్లో ధనుస్సు  ఆకారం కలిగిన ఆ దృశ్యాన్ని ఇంద్రుడికి ఆపాదించి, దాన్ని 'ఇంద్రధనుస్సు' అనేవాళ్లు. ఆ పేరు ఈ రోజుకీ చలామణిలో ఉంది. కానీ వాస్తవ దృష్టితో చూస్తే - ఇంద్రుడు ఉన్నాడనుకోవడం, అది ఇంద్రుని ధనుస్సు అనుకోవడం కల్పిత కథగానూ, కవితా ఊహగానూ తెలుస్తాయి. అయితే ఇంద్రధనుస్సు అనేది మనకు కనిపిస్తున్నది కదా, అదేమిటనే ప్రశ్న వస్తుంది. నిజానికి ఇంద్రధనుస్సు అనేది సూర్యరశ్మికీ, నీటి తుప్పరకూ సంబంధించినది. ఎండా వానా కలిసి ఉంటేనే ఇంద్రధనుస్సు ఏర్పడుతుంది. కారుమబ్బులు కమ్ముకొని, సూర్యకాంతి పైకి రానప్పుడు ఇంద్రధనుస్సు ఉండదు వర్షపు నీటి బిందువుల మీద సూర్యకిరణాలు పడితే, అవి వంగి, వాటిలో రంగులు విడిపోతాయి. ఆ రంగులే ఇంద్రధనుస్సుగా మనకి కనిపిస్తాయి. ఇంకో విషయం ఏమంటే.. ఇంద్రధనుస్సు ఎప్పుడూ సూర్యుడికి ఎదురుగా ఉంటుంది. అంటే ఉదయం పూట ఇంద్రధనుస్సు పడమరవేపు ఉంటే, సాయంత్రం పూట తూర్పువేపు ఉంటుంది. అంతేకానీ ఉత్తర, దక్షిణాల్లో ఇంద్రధనుస్సు ఏర్పడదు. అలాగే ఒకవేపు ఎండలేనిదే ఇంద్రధనుస్సు కనిపించదు.

Actress Kanchanamala Filmography

1. Sri Krishna Thulabharam (1935)
2. Veera Abhimanyu (1936)
3. Vipra Narayana (1937) (Devadevi)
4. Mala Pilla (1938) (Shampalatha)
5. Grihalakshmi (1938) (Madhuri)
6. Vande Matharam (1939) (Janaki)
7. Malli Pelli (1939) (Lalitha)
8. Mairavana (1940) (Chandrasena)
9. Illalu (1940)

contd...

Poetry: Rain Coming

వాన వచ్చె


గగన చుంబిత ప్రాసాదాగ్రములపై తరుణ అరుణుడు
కావికాంతుల దరహాస నయనముల విచ్చుచుండె

తెల్లవారెనో లేదోయనే సంకోచముతో
కోయిలలు తీయని కూతలు కూయసాగె

భిక్షకుని వాణి సుఖనిద్రారతములగు
నగర హర్మ్యముల మారుమోగుచుండె

గతరాత్రి మైమరపించిన మనోహరిణి
పుష్పమాలికలు వసివాడి జారి నలిగిపోవుచుండె

మేఘములు ఆత్మత్యాగ మొనర్చుకొని
వర్షధారల నొసగుచుండె

Saturday, December 12, 2015

Synopsis of the movie VINDHYA RANI (1948)

'వింధ్యరాణి' (1948) చిత్ర కథాంశం


వింధ్యరాజు ఒక ప్రత్యేక ఉన్మత్త మనస్తత్వం కలిగినవాడు. స్వప్రయోజనం కోసం నీతినియమాల్ని పాటించడు. నీతిబోధలన్నా, మంచిమాటలన్నా అతనికి విసుగు. వందిమాగధుల ప్రశంసలకు ఉబ్బిపోడు. స్తోత్రాలలోని వాస్తవమెంతో తెలిసినవాడు. అలా అని ఎదుటివాళ్ల ప్రశంసల్ని ఆశించని అమాయకుడు కాడు. స్త్రీద్వేషి కాకపోయినా వాళ్లంటే గౌరవం లేనివాడు. కామంతో రగిలిపోయే భోగలాలసుడు. అయితే బలహీనులైన స్త్రీలంటే అతనికి రోత. తనకు తగ్గ దృఢవంతురాలై, తన అధికార పరాక్రమానికి ఎదురునిల్చి, బుసలుకొట్టే మహాక్రోధ అయిన స్త్రీని చేజిక్కించుకొని, చెరబట్టి, లొంగదీసుకోవడంలోనే అతనికి మహానందం.
అలాంటి స్త్రీ ఒకామె అతనికి తారసిల్లింది. ఆమే వింధ్యరాణి. ఆమెను ఉడికించి, రెచ్చగొట్టి, ఆమెలో ఎంత విషమున్నదో దాన్నంతా కక్కించేదాకా అతనికి నిద్రపట్టదు. నిద్రపోతున్న తనను ఆమె చాకుతో పొడిచినా కూడా, ఆమె ధైర్యసాహసాలను మెచ్చుకుంటాడే తప్ప ద్వేషించడు. నీతిమంతంగా ఉండేవాళ్లను  అతను సహించడు. అలాంటి వాళ్లు  అతని దృష్టిలో పిరికిపందలు. వాళ్లను రెచ్చగొట్టి, వాళ్లలోని ఉద్రేకాలని బయటకుతీసి, అంతలోనే వాళ్ల నెత్తిపై చరిచి, తిరిగి వాళ్లను యథాస్థానంలోకి కుచించుకుపోయేట్లు చేయడం అతనికి సరదా.
శివశ్రీని అలాగే ఉడికించాడు. కానీ శివశ్రీ ధర్మమార్గ పరాయణుడు, అహింసామార్గానువర్తి. వింధ్యరాజు అసహాయంగా చేత చిక్కినప్పుడు, అతడు తన శత్రువైనప్పటికీ హింసించకుండా క్షమించి విడిచిపెట్టి, పరితాపాగ్నిలో ముంచేశాడు. ఆ పరితాపాగ్ని అతని స్వభావంలోని చెడుని దహించివేసి, సహజంగా అతనిలో ఉన్న మంచిని ప్రేరేపించి, ఇతరుల మంచినికోరే యోగిగా అతణ్ణి మార్చేస్తుంది.

తారాగణం: పుష్పవల్లి, డీవీ సుబ్బారావు, రమణారావు, వరలక్ష్మి, రేలంగి, పండితరావు, ఏవీ సుబ్బారావు
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
దర్శకుడు: చిత్తజల్లు పుల్లయ్య
బేనర్: వైజయంతి ఫిలిమ్స్
విడుదల తేదీ: 14 జనవరి

Friday, December 11, 2015

Actor P. Suribabu Filmography

1. Draupadi Vastrapaharanam (1936) (Narada)
2. Kanaka Thara (1937) (Sadhu)
3. Mala Pilla (1938) (Chowdarayya)
4. Radha Krishna (1939) (Gopala)
5. Raitu Bidda (1939) (Ramajogi)
6. Illalu (1940)
7. Tara Sasankam (1941)

contd...

Thursday, December 10, 2015

Synopsis of the movie KALASINA MANASULU (1968)

'కలసిన మనసులు' (1968) చిత్ర కథాంశం


రామాపురం గ్రామంలో మోతుబరి వెంకటరత్నం (రేలంగి). కొడుకు శేఖర్ (జగ్గయ్య), మనవరాలు లక్ష్మి (బేబీ శంతికళ) తప్ప ఆ ఇంట్లో మరో ప్రాణి లేదు. లక్ష్మి బాగోగులు చూసేందుకు ఆయాగా నిర్మల (వాణిశ్రీ) వస్తుంది. నిర్మల అన్నయ్య రాము (శోభన్‌బాబు) పట్నంలో వెంకటరత్నం దయాధర్మాలతో చదువుతుంటాడు. ఆ ఊళ్లోనే ఉండే రిటైర్డ్ హెడ్‌మాస్టర్ కోరికల కొండలరావు (అల్లు రామలింగయ్య) ఏకైక పుత్రిక లీల (భారతి) పంతులమ్మగా పనిచేస్తుంటుంది. రాము, లీల చిన్ననాటి చెలిమితో పెద్దయ్యాక ప్రేమలో పడ్డారు. కోరికల కొండలరావుకు కోరికలు జాస్తి. తనకు కాబోయే అల్లుడు అర్హతలంటూ బ్లాక్‌బోర్డుపై ఓ దండకం రాసి వాటిని కూతురి చేత నిత్య పారాయణం చేయిస్తూ ఉంటాడు.
పట్నంలో బీకాం పరీక్ష రాసిన రాము ఇంటికి వస్తూ దారిలో మూర్తీ అండ్ కంపెనీ మేనేజర్ ఆనంద్ (రామ్మోహన్)ను దొంగల బారి నుండి కాపాడటమే కాక ఆస్పత్రిలో తన రక్తం ఇచ్చి ప్రాణదానం చేస్తాడు. రాము నిజాయితీకి, త్యాగనిరతికి ఆకర్షితుడైన ఆ కంపెనీ యజమాని రాముకు తన కంపెనీలో ఉద్యోగం ఇస్తాడు.
రాము ఆహ్వానంపై అతని ఇంటికి వచ్చిన ఆనంద్, అక్కడ లీలను చూసి, ఆమెను రాము చెల్లెలు నిర్మలగా భ్రమించి ప్రేమిస్తాడు. ప్రేమ పర్యవసానం - ఆనంద్, నిర్మల వివాహం. తీరా తాళికట్టబోయే సమయంలో నిర్మలను చూసిన ఆనంద్ 'ఇదంతా మోసం' అంటూ పెళ్లిపీటల మీదనుంచి లేచిపోతాడు. ఆ అవమానం కలిగించిన దుఃఖంతో నిర్మల తల్లి మరణిస్తుంది. పచ్చని కల్యాణమంటపం శోకానికి నిలయం కాగా, నిర్మలకు పెళ్లి చేశాకే తను వివాహం చేసుకుంటానని చివరి క్షణాల్లో తల్లికి మాటిస్తాడు రాము.
ఎందుకిలా చేశావని ఆనంద్‌ను నిలదీస్తాడు రాము. పేరు ఏదైనా తను చూసిందీ, ప్రేమించిందీ లీలననీ, ఆమె కూడా తనను ప్రేమించిందనీ, దానికి నిదర్శనం కూడా ఉందనీ దబాయిస్తాడు ఆనంద్. దీంతో నిర్ఘాంతపోయిన రాము భగ్న ప్రేమికుడిలా బాధను అనుభవిస్తుంటాడు. లీలను ఆనంద్ ప్రేమిస్తున్నట్లు తెలుసుకున్న అతని తల్లి కోర్కెల కొండలరావుతో మాట్లాడి లీల, ఆనంద్ పెళ్లి నిశ్చయం చేస్తుంది. ఈ విషయం తెలుసుకున్న లీల తన హృదయంలో రాముకు తప్ప మరొకరికి చోటులేదని ఆనంద్‌కు తేల్చిచెప్పి, ఆనంద్ తన ప్రేమకానుకను ఇచ్చింది నిర్మలకేనని రుజువుచేస్తుంది. దాంతో కథ సుఖాంతం.

తారాగణం: శోభన్‌బాబు, భారతి, వాణిశ్రీ, జగ్గయ్య, రామ్మోహన్, రేలంగి, అల్లు రామలింగయ్య, హేమలత, రావి కొండలరావు, గుంటూరు వెంకటేశ్, బేబీ శాంతికళ
సంగీతం: మాస్టర్ వేణు
నిర్మాత: ఎమ్మెస్ రెడ్డి
దర్శకుడు: కమలాకర కామేశ్వరరావు
బేనర్: కౌముది పిక్చర్స్
విడుదల తేదీ: 11 అక్టోబర్

Wednesday, December 9, 2015

Actor Parupalli Subba Rao Filmography

1. Lava Kusa (1934)
2. Sri Krishna Leelalu (1935)
3. Draupadi Mana Samrakshanam (1936) (Dharmaraju)
4. Mahananda (1939)
5. Bhoja Kalidasa (1940)
6. Tenali Ramakrishna (1941)
7. Parvathi Kalyanam (1941)

Tuesday, December 8, 2015

Synopsis of the movie BOMMALU CHEPPINA KATHA (1969)

'బొమ్మలు చెప్పిన కథ' (1969) చిత్ర కథాంశం


అమరావతీ నగర మహారాజు (ధూళిపాళ) బావమరిది వీరసేనుడి (ప్రభాకరరెడ్డి) ఇద్దరు కుమార్తెల్లో ఒకరు మరొకరి మరణానికి కారకులవుతారని బొమ్మలు చెపుతాయి. ఇది విన్న వీరసేనుడు చిన్న కూతుర్ని కాళీ ఆలయంలో వదిలేసి వెళ్తాడు. ఆ అమ్మాయి చంప (విజయనిర్మల) పేరుతో ఓ గొర్రెల కాపరి వద్ద పెరుగుతుంది. పెద్దమ్మాయి సుజాత (విజయలలిత) రాజ ప్రసాదంలో పెరిగి యువరాజు ప్రతాప్ (కాంతారావు)పై మనసు పడుతుంది.
రాజ్యంలో బందిపోట్ల అరాచకాల్ని అణచాలని అడవికి వెళ్లిన ప్రతాప్ బందిపోట్ల చేతుల్లో దెబ్బలుతిని అక్కడ చంప ఆశ్రయంలో తేరుకొంటాడు. ఆమెను ప్రేమించి పెళ్లాడి అంతఃపురానికి తెస్తాడు. తను ప్రేమించినవాణ్ణి వలలో వేసుకొని పెళ్లి చేసుకుందనే కక్షతో చంపను ఏడిపిస్తూ ఉంటుంది సుజాత. విషమిచ్చి చంపటానికి సైతం ప్రయత్నిస్తుంది. అది విఫలం కావడంతో పగతో రగిలిపోతూ ఉంటుంది. ఈలోగా బందిపోటు మంగు (కృష్ణ) అనుచరుణ్ణి యువరాజు పట్టుకొని ఉరితీయించాడనే వార్త బందిపోటు దొంగల్లో కలవరం కలిగిస్తుంది. ప్రతాప్‌ను చంపడానికి అర్ధరాత్రి అంతఃపురానికి వెళ్లిన మంగూను తన అన్నగా గుర్తిస్తుంది చంప.
ఇంతలో యువరాజు మేల్కొని వెన్నంటి తరమగా గాయపడిన మంగు కాళికాలయం చేరి, అక్కడ బొమ్మలు చెప్పిన మరో కథ వింటాడు. చంప శ్రీమంతం నాటి రాత్రి ఒక కాలనాగు యువరాజును కాటువేస్తుంది. ఈలోగా చంప తన భర్త గుండెల్లో గాయంచేసి ఆ రక్తంతో నుదుట తిలకం దిద్దుకుంటే యువరాజు బతుకుతాడు. ఈ రహస్యం ఆమె బయటపెడితే భర్త శిలగా మారిపోతాడు. ఈ కథ వినడంతో యువరాజు రక్షణకు సిద్ధమవుతాడు  మంగు. అదును కోసం వేచిచూస్తున్న సుజాత, ఇదే సమయమని మంగూ చంపలకు రంకు అంటగట్టి యువరాజును హత్యచేయడానికి ప్రయత్నించిందని చంపపై అభియోగం మోపుతుంది. విచారణలో చంపకు నిజం చెప్పక తప్పలేదు. ఫలితంగా యువరాజు శిలైపోతాడు. చంపను మాయలమారిగా నిర్ణయించి శిక్ష విధిస్తారు. అప్పుడే రాజును బంధించి సింహాసం ఆక్రమిస్తాడు మంత్రి.
ఈ చిక్కును విడదీసే ఉపాయాన్ని సైతం బొమ్మలే చెబుతాయి. మంగు సాహసంతో, సుజాత ఆత్మ పరిత్యాగంతో కథ నిర్ణీత ప్రకారం సుఖాంతమవుతుంది. మంగు  ఎవరో కాదు, వీరసేనుడి కుమారుడేనని తేలుతుంది.

తారాగణం: కాంతారావు, కృష్ణ, విజయనిర్మల, విజయలలిత, సంధ్యారాణి, గీతాంజలి, ధూళిపాళ, ప్రభాకరరెడ్డి, సత్యనారాయణ, మిక్కిలినేని, రాజబాబు
సంగీతం: మాస్టర్ వేణు
నిర్మాత: డి. రామానాయుడు
దర్శకుడు: జి. విశ్వనాథం
బేనర్: సురేశ్ మూవీస్
విడుదల తేదీ: 4 ఏప్రిల్

Saturday, December 5, 2015

Can STAR save the movie?

'సినిమా' చూపిస్తున్నారు!

జీవనం కోసం పగలంతా కష్టపడి అలసినవాళ్లకు కొద్దిసేపైనా విశ్రాంతీ, వినోదం అవసరం. అందువల్లే వినోదాన్నిచ్చే సినిమాలు, టీవీ జన జీవనంలో ప్రాధాన్యం ఏర్పరచుకున్నాయి. నిజానికి ఇవాళ సినిమాకు పరమావధి వినోదమే. నిత్య జీవితంలో మనం పడ్డ శ్రమనూ, కష్టాన్నీ మరిపించి సినిమాలు మనసుకు ఉల్లాసాన్ని ఇస్తున్నాయి. అందుకని మంచికో, చెడుకో ఈ సినీ పరిశ్రమ ఏర్పడిన నాటినుంచీ రోజురోజుకూ అభివృద్ధి చెందుతూ ఇవాళున్న స్థాయికి చేరింది. హాలీవుడ్‌లో తయారయ్యే సినిమాల్లో ఎక్కువ అశ్లీలత, హింస కనిపిస్తాయి. యువత మనసుల్లో అవి విష ఫలితాల్ని కలిగిస్తున్నాయనే ఉద్దేశంతో సామాజిక సంస్థలు, మహిళా సంఘాలూ కొన్నేళ్ల క్రితం వాటిని మన ప్రాంతంలో నిషేధించాలని ఆందోళనలు కూడా చేశాయి. కానీ ఇవాళ ఇంటర్నెట్ కారణంగా మితిమీరిన అశ్లీలత అందుబాటులోకి రావడంతో సినిమాల్లోని అసభ్యత, అశ్లీలత, హింస గురించి ఎవరూ మాట్లాడటం లేదు. నేటి మన సినిమాల్ని గమనిస్తే హాస్యం పేరుతో ఎంత అసభ్యత చలామణీ అవుతుందో అర్థమవుతుంది. అశ్లీలంగా, అభ్యంతరకరంగా తోచిన సన్నివేశాల్ని నిర్దాక్షిణ్యంగా తొలగించడానికి ఏర్పాటుచేసిన సెన్సార్ బోర్డులు ఆ పనిని చేయకుండా 'చూసీచూడనట్లు' పోతుండటంతో అలాంటి సన్నివేశాలు మన సినిమాల్లో సాధారణ విషయం కింద తయారయ్యాయి.
హాలీవుడ్, ఇతర విదేశీ సినిమాల్లోని సెక్స్ సన్నివేశాల్నీ, అర్ధనగ్నత్వాల్నీ మనవాళ్లు గుడ్డిగా.. కాదు కాదు.. యథేచ్ఛగా అనుకరిస్తున్నారు. ఇవి మనదేశ పునర్నిర్మాణానికి గానీ, సంస్కృతీ వికాసానికి గానీ ఏమాత్రం తోడ్పడవు. కొన్నేళ్లుగా తెలుగులో కానీ, హిందీలో కానీ తయారవుతున్న చిత్రాల్లో చాలావరకు విదేశీ సినిమాల అనుకరణే అని చెప్పాలి. అందుకే వాటిలో నేటివిటీ అనేది కనిపించడం లేదు. కథా విశిష్టత మచ్చుకైనా కానరావడం లేదు. ఈ విషయంలో మన పొరుగున ఉన్న తమిళ సినిమా చాలా బెటర్ అని చెప్పాలి. వాళ్లు నేటివిటీతో ఎలాంటి సినిమాలు తీస్తున్నారో అక్కణ్ణించి తెలుగులో అనువాదమై వస్తున్న సినిమాలు చెబుతున్నాయి. 
తెలుగు సినిమా ప్రారంభ సంవత్సరాల్లోనే గూడవల్లి రామబ్రహ్మం వంటి దర్శకుల నుంచే చక్కని చిత్రాలు, ప్రజాభ్యుదయాన్ని కాంక్షించే సినిమాలు తీయడం మొదలైంది. అవి ప్రేక్షకుల్లో చక్కని ఆలోచనలను రేకెత్తించేవి. వాళ్ల అభిరుచి మెరుగుపడేందుకు దోహదం చేసేవి. సామాజిక దురన్యాయాల్ని అరికట్టాలనే ఆవేశాన్ని రగిలించేవి. భూస్వాముల దోపిడీకి అడ్డుకట్ట వేయడం, వరకట్న నిర్మూలనం, ప్రభుత్వాల, రాజకీయ నాయకుల, అవినీతి అధికార్ల దాష్టీకాల్ని ప్రశ్నించడం, కింది కులాలవారిపై అగ్రవర్ణాల పీడనను నిలదీయడం, కుటుంబాన్ని చక్కదిద్దుకోవడం, ఊరిని బాగుచేసుకోవడం.. ఇలా ఎన్నెన్నో అంశాలతో సినిమాలు వచ్చాయి. ఇవి ఓ వైపు వినోదాన్ని అందిస్తూనే, మరోవైపు మానసిక వికాసాన్నీ కలిగించేవి.
కొంతకాలం చిత్ర పరిశ్రమ అభివృద్ధి మార్గంలోనే ఉంది కానీ, దురదృష్టవశాత్తూ జానపద, పౌరాణిక సినిమాల ధాటికి సామాజిక చిత్రాలు వెనకపడిపోయాయి. ఫలితంగా పరిశ్రమ ఆత్మే నాశనమయ్యే స్థిది దాపురించింది. వ్యాపారాలతో అకస్మాత్తుగా డబ్బు సంపాదించిన నయా సంపన్న వర్గం మరింత డబ్బు, పేరు సంపాదించాలనీ, తళుకుబెళుకు తారల మధ్య తారట్లాడాలనే ఆశతో పరిశ్రమలోకి అడుగుపెట్టడం మొదలుపెట్టింది. అవినీతి సంపాదన కావడం వల్ల ఇష్టమొచ్చినంత డబ్బుపెట్టి సినిమాలు నిర్మిస్తూ వాళ్ల కులాసా కొద్దీ తారలకు భారీ పారితోషికాలిస్తూ వచ్చారు. ఈ నిర్మాతలకు కళాదృష్టి కానీ, సంస్కృతిపట్ల గౌరవం కానీ లేకపోవడంతో శృంగార, అశ్లీల, హింసాత్మక చిత్రాల వైపు మొగ్గు చూపారు. వాళ్లు ఒకే రకమైన సినిమాలు తీయడం ప్రారంభించారు. నేటికీ ఆ రకం సినిమాలే తయారవుతున్నాయి. 
మొదట్లో నిర్మాతల అధీనంలో కాంట్రాక్టు పద్ధతిలో ఉండేవాళ్లు  తారలు. అయితే వాళ్లలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే దురాశ బయలుదేరి, 'కాల్షీట్ల' పద్ధతిలో ఒకేసారి నాలుగైదు సినిమాల్ని ఒప్పుకోవడం మొదలుపెట్టారు. తాము అంత శ్రమ పడగలమో, లేదో కూడా ఆలోచించలేని విధంగా వాళ్ల ఆశలు మితిమీరిపోయాయి. ఫలితంగా సినిమా బడ్జెట్ నిర్మాత అదుపులో లేకుండా పోయింది. షూటింగ్‌కు అయ్యే ఖర్చు కంటే తారల, సాంకేతిక నిపుణుల పారితోషికాలకే నిర్మాత ఎక్కువ డబ్బు వెచ్చించాల్సిన దరిద్రపు స్థితి వచ్చింది. మరోవైపు టెలివిజన్ రాకతో సినిమాల ద్వారా వచ్చే ఆదాయం బాగా పడిపోయింది. నూటికి పది సినిమాలు మాత్రమే గట్టెక్కే రోజులు వచ్చాయి. దీంతో అసలు చిత్ర పరిశ్రమ నిలుస్తుందా, లేదా అని అసలు సిసలు సినిమా ప్రియులు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ తారల్లో మచ్చుకి వెతికినా సహకారమనేది కనిపించడం లేదు. వాళ్లు పూర్వం మాదిరిగానే కోట్లు కావాలని కూర్చుంటున్నారు. వాళ్లడిగిన డబ్బు ఇవ్వడమే కాదు, వాళ్లు సెట్స్‌పైకి ఎప్పుడొచ్చినా.. అదేమని అడగకూడదు. వాళ్లు వచ్చిందే భాగ్యమన్నట్లు అప్పుడే సీన్లు తీసుకోవాలి. 
వాళ్లు ఇలాంటి ప్రవర్తనతో తమనెంతంగా బాధపెడ్తున్నా, నిర్మాతలు జీ హుజూర్ అంటున్నారు. చిత్రమేమంటే ఈ బడా తారలు నటిస్తున్న చిత్రాల్లో చాలా భాగం భారీ పరాజయాలు మూటగట్టుకుంటున్నాయి. నిజానికి ఇవాళ చిన్న తారలు నటిస్తున్న సినిమాలే నిర్మాతకు మనశ్శాంతినిస్తున్నాయి. అయినా పెద్ద తారల విలువ తగ్గడం లేదు. వాళ్లపై మోజు అంతకంతకూ పెరుగుతున్నదే కానీ తగ్గడం లేదు. స్టార్ సిస్టంను ఈ నిర్మాతలే ప్రోత్సహిస్తున్నట్లు  కనిపిస్తోంది. వీళ్లే భారీ పారితోషికాలిచ్చి మరీ ముంబాయి, ఇతర భాషా చిత్రాల నాయికలను, నటులను బుక్ చేస్తున్నారు. దానితో తెలుగు కళాకారులు చికాకు ప్రదర్శిస్తున్న సందర్భాలు ఇటీవల ఎక్కువవుతున్నాయి. అప్పనంగా వచ్చిపడుతున్న డబ్బు కారణంగా ఇతర భాషల నటులు తమ సొంత భాషా చిత్రాల కంటే తెలుగు చిత్రాలంటేనే మోజుపడే స్థితికి వచ్చారు. 
ఇంత జరుగుతున్నా, పెద్ద తారల సినిమాలకు పరాజయం తప్పడం లేదు. కథకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలనీ, స్టార్ వాల్యూలో ఏమీ లేదనీ తెలుసుకోడానికి ఆ హీరోలు నిరాకరిస్తున్నారు. 'బ్రూస్‌లీ' సినిమాని ఇందుకు మంచి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. రాంచరణ్ హీరోగా నటించిన ఈ సినిమాకు శ్రీను వైట్ల దర్శకుడు. ఓ స్టార్ హీరో, ఓ స్టార్ డైరెక్టర్ కలిస్తే ఆ సినిమా బ్రహ్మాండంగా ఆడుతుందనీ, కాసుల వర్షం కురుస్తుందనీ బయ్యర్లు ఆశించారు. జరిగింది అందుకు భిన్నం. గమనించాల్సిన విషయమేమంటే ఈ సినిమాకు మరింత స్టార్ వాల్యూ తీసుకు రావాలనే ఉద్దేశంతో చిరంజీవి కూడా స్పెషల్ అప్పీరెన్స్ ఇచ్చారు. ఓ ఫైట్ చేశారు. అయినా సినిమాని చిరంజీవి స్టార్ వాల్యూ ఏమాత్రం కాపాడలేకపోయింది. ఫలితంగా బయ్యర్లు భారీ నష్టాలకు లోనయ్యారు. ఇదివరకు ఇదే శ్రీను వైట్ల, మరో సూపర్‌స్టార్ మహేశ్‌తో చేసిన 'ఆగడు' సినిమా సైతం ఘోరంగా ఫ్లాపయింది. అందుచేత నిర్మాతలు పెద్ద హీరోల కాళ్లు పట్టుకొని వేళ్లాడే కంటే, తమ దృష్టిని ఎక్కువగా కథపైనా, నిర్మాణ విలువలపైనా పెడితే ఫలితం మెరుగ్గా ఉంటుంది.
సినిమా నిర్మాణంపై ఏమాత్రం అవగాహన లేకుండా కొంతమంది వ్యాపారులు అందులోకి దిగి అనవసరంగా డబ్బును నాశనం చేస్తున్నారు. చాలా సినిమాలు విడుదలకు నోచుకోకుండా ల్యాబుల్లో మురిగిపోతుండటానికి వాళ్ల అజ్ఞానమే కారణం. వీటిపై వందల కోట్ల రూపాయలు నాశనమయ్యాయి. ఈ పరిస్థితికి డిస్ట్రిబ్యూటర్లు, డబ్బు పెట్టుబడిదార్లు కూడా కారణమే. నిజాయితీ ఉన్న నిర్మాతలకు డబ్బు ఇచ్చేందుకు వెనుకాడి, మోసగాళ్లను మేపడం వల్ల ఈ దుస్థితి దాపురించింది. అందుకే చిత్ర పరిశ్రమ నిరంతర ఒడిదుడుకులతో సతమతమవుతూ సాంకేతికంగా పురోగమిస్తున్నదే కానీ, నిర్మాతల్లో ఎక్కువ శాతం మందికి ఖేదాన్ని కలిగిస్తూ కుంటి నడకతో సాగుతూ ఉంది.

Actor Kumpatla Subba Rao Filmography

1. Sati Sakkubai (1935)
2. Draupadi Vastrapaharanam (1936) (Dhrutarashtra)
3. Mohini Rukmangada (1937) (Haridas)
4. Kanaka Thara (1937) (Malligadu)
5. Kacha Devayani (1938)
6. Dakshayagnam (1941) (Visuna)

Friday, December 4, 2015

Synopsis of the movie Balaraju (1948)

'బాలరాజు' (1948) చిత్ర కథాంశం

దేవకన్య మోహిని మంచి నాట్యకత్తె. యక్షుణ్ణి ప్రేమిస్తుంది. మోహిని అపురూప సౌందర్యం ఇంద్రుణ్ణి స్థిమితంగా ఉండనీయదు. ఆమె తన కొలువులో నృత్యం చేయాలని ఆమె తండ్రిని ఆజ్ఞాపిస్తాడు. మోహిని ఒప్పుకోదు. తనకు అడ్డు అయ్యాడనే కోపంతో భూలోకంలో ప్రేమంటే తెలీని జడునివికమ్మని యక్షుణ్ణి శపిస్తాడు. మోహినిని బలవంతంగా తన సభకు రప్పిస్తాడు. నాట్యానికి ససేమిరా అంటుంది మోహిని. ఆవేశంతో రగిలిపోయిన ఇంద్రుడు ఆమెను మానవ జన్మ ఎత్తి, ఫలించని ప్రేమతో అల్లాడమని శపిస్తాడు.
యక్షుడు వెలమవాళ్లింట బాలరాజుగా, మోహిని కమ్మవాళ్లింట సీతమ్మగా పుట్టి పెరుగుతుంటారు. సీతమ్మను  ఎవరికంటా పడకుండా ఊరి బయట ఒక ఒంటిస్తంభం మేడలో పెంచుతుంటాడు కమ్మనాయుడు. ఒకరోజు బాలరాజు తన స్నేహితుడు యలమందతో కలిసి ఆ ఇంటిమీదుగా వెళ్లడం చూస్తుంది మోహిని. తొలిచూపుతోనే పాతప్రేమ చిగురిస్తుంది. ఇల్లు విడిచి బాలరాజును  కలుసుకుంటుంది సీత. ఆమె నిద్రపోతుండగా జడత్వంతో వెళ్లిపోతాడు బాలరాజు. వద్దన్న కొద్దీ తనవెంట పడుతున్న సీతను మొదట దెయ్యంగా భావిస్తాడు. తర్వాత మంచిదని నమ్ముతాడు.
అడవి దొంగలు మత్తుమందుజల్లి సీతను ఎత్తుకుపోతారు. వెతకడానికి వెళ్ళిన బాలరాజు మునిశాపంతో పాముగా మారిపోతాడు. సీత తప్పించుకువచ్చి పామైన బాలరాజును కలుసుకుంటుంది. తర్వాత వరసబెట్టి కష్టాలొస్తాయి. బాలరాజు చనిపోతాడు. అశ్వనీ దేవతలు ఇచ్చిన సంజీవిమాలతో అతణ్ణి బతికించుకుంటుంది సీత. ఇంద్రుడు మళ్లీ తయారై ఆమెను నిర్బంధిస్తాడు. దాంతోనూ ఫలితం కనిపించక మాయసీతగా మారి బాలరాజుతో సరసాలాడతాడు. ఆగ్రహంతో ఇంద్రుణ్ణి సీత శపించబోయేసరికి శచీదేవి వచ్చి భర్తను కాపాడమనటంతో కథ సుఖాంతం.

తారాగణం: అక్కినేని నాగేశ్వరరావు, అంజలీదేవి, యస్. వరలక్ష్మి, గాడేపల్లి, డి.ఎస్. సదాశివరావు, కస్తూరి శివరావు
సంగీతం: సి.ఆర్. సుబ్బరామన్, గాలిపెంచల నరసింహారావు
నిర్మాత, దర్శకుడు: ఘంటసాల బలరామయ్య
బేనర్: ప్రతిభా ఫిలిమ్స్
విడుదల తేదీ: 26 ఫిబ్రవరి

Thursday, December 3, 2015

Need for Artistic Vision in Film Makers

కూసింత కళాత్మక దృష్టి కావాలి!

నేటి నిర్మాతలు, దర్శకుల్లో ఎక్కువమందికి సినిమా అంటే కేవలం వ్యాపారమే. అందులో కళకు చోటులేదనేది వాళ్ల నిశ్చితాభిప్రాయం. ఒకళ్లతో ఒకళ్లు పోటీపడుతూ ఏడాదికి 150 సినిమాల దాకా తీస్తున్నారు. వాటిలో విజయాన్ని సాధించే సినిమాలు పది, పన్నెండుకంటే మించవు. అవైనా ఎందుకు ఆడుతున్నాయని పరిశీలిస్తే కథా కథనాల విషయంలో అవి మిగతా వాటికంటే మెరుగ్గా ఉండటం, తెలిసో తెలియకో వాటిల్లో ఎంతోకొంత కళాదృష్టి కనిపించడం.
ఉదాహరణకు ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి విజయం సాధించిన 'బాహుబలి', 'శ్రీమంతుడు', 'భలే భలే మగాడివోయ్' చిత్రాల్ని తీసుకుందాం. 'బాహుబలి' సాంఘిక సినిమా కాదు. అది జానపదం. అందులోనిది బలమైన కథ కాదు. కథనం, కంటికి 'అబ్బో' అనిపించే విజువల్స్, భారీ యుద్ధ సన్నివేశాలు, ఉద్వేగభరితమైన సన్నివేశాల కారణంగా అది జనానికి నచ్చేసింది.
'శ్రీమంతుడు' సినిమా కథ గొప్పదేమీ కాదు. కానీ అందులోని అంశం ప్రజలకు బాగా పట్టేసింది. రాబందుల వంటి భూ బకాసురులు పీక్కుతింటున్న తన సొంత ఊరిని దత్తత తీసుకొని, దాన్ని బాగు చేసుకున్న యువకుడి విశాల హృదయాన్ని జనం మెచ్చారు. అందులో కథానాయకుడు కోట్లకు వారసుడైనా, కార్లలో తిరగడానికంటే, సైకిల్‌పై ప్రయాణానికే ఇష్టపడతాడు. అందుకే ఆ సినిమా వచ్చాక తెలుగు రాష్ట్రాల్లో సైకిళ్ల అమ్మకాలు పెరిగాయి. సంపన్నవంతులు వెనుకబడిన గ్రామాల్ని దత్తత తీసుకోవడం మొదలుపెట్టారు. అంతటి ప్రభావాన్ని కలిగించిన సినిమా ఇటీవలి కాలంలో మరొకటి లేదు. ఇక 'భలే భలే మగాడివోయ్' సినిమా విషయానికొస్తే, అది తక్కువ బడ్జెట్‌తో తయారైనా, ప్రజల మనసుల్ని భారీ స్థాయిలో గెలుచుకుంది. చిన్నతనం నుండే తీవ్ర మతిమరుపు రుగ్మతను కలిగి ఉండే ఓ యువకుడు ప్రేమలోపడి, తన మతిమరుపు కారణంగా ఎలాంటి సమస్యల్ని ఎదుర్కొని, చివరకు ఎలా అందరి హృదయాల్ని దోచుకున్నాడనే అంశాన్ని దర్శకుడు ఆసక్తికరంగా మలిచాడు. కథానాయకుడి అమాయకత్వం, తన మతిమరుపును కప్పిపుచ్చుకోడానికి ఒకదాని తర్వాత ఒకటిగా ఆడే అబద్ధాలు ప్రేక్షకుల్లో సానుభూతినే కలిగించాయి కానీ, విముఖతని కలిగించలేదు. ఈ రకంగా ఈ మూడు సినిమాల్లో ఎంతోకొంత కళాత్మకత కనిపిస్తుంది.
అలాగే శేఖర్ కమ్ముల, క్రిష్ వంటి దర్శకులు కేవలం వ్యాపార దృష్టితోనే కాకుండా, వాస్తవిక దృష్టితో సినిమాలు తీస్తున్నారు. శేఖర్ కమ్ముల 'ఆనంద్', 'గోదావరి', 'హ్యాపీడేస్', 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' సినిమాల్లో జీవితంలోని భిన్న కోణాలు మనకు దర్శనమిస్తాయి. కాకపోతే వాటిలో జీవన సౌందర్యానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాడు. ఆయనకు కాస్త భిన్నంగా క్రిష్ దర్శనమిస్తాడు. జీవితంలోని ఆనంద ఘడియల వెనుకే విషాదం కూడా ఉంటుందని ఆయన సినిమాలు చూపిస్తాయి. 'గమ్యం', 'వేదం', 'కంచె' సినిమాల్లో అటు ఆనందమూ, ఇటు విషాదమూ రెండూ కనిపించడం మనం చూడవచ్చు. 'కృష్ణం వందే జగద్గురుం'లో విషాదం బదులు తెలుగువాళ్లకు ఒకప్పుడు ఎంతో ప్రీతిపాత్రమైన రంగస్థల నాటకాన్ని బతికించుకోవాలనే తపన, మైనింగ్ మాఫియాపై పోరాడాల్సిన ఆవశ్యకత మనకు కనిపిస్తాయి. అంటే రెగ్యులర్ సినిమాల్లో కనిపించే నాలుగు ఫైట్లు, ఆరు పాటలు, అనవసర భావోద్రేక సన్నివేశాలు, కథకు సంబంధంలేని రోత కామెడీ ట్రాకుల ఫార్ములా వీళ్ల సినిమాల్లో కనిపించని సంగతి గ్రహించాలి.
ఇదివరకు దర్శకులు సెల్ఫ్ సెన్సారింగ్ పాటించి ప్రేమ సన్నివేశాలను హద్దుల్లో ఉంచేవాళ్లు. వాటివల్ల ప్రజలకు అవి ఎలాంటి హానీ కలుగచేయని రీతిలో ఉండేవి. అందరి ఆదరణ పొందేవి. కానీ రాను రాను విదేశీ మోజుకు, కృత్రిమ నాగరికతకూ అలవాటుపడిన దర్శకులు ప్రణయ ఘట్టాల్ని విచ్చలవిడిగా తీయడం మొదలుపెట్టారు. టీనేజ్ లవ్‌స్టోరీల పేరుతో, కాలేజీ ప్రేమకథల పేరుతో బూతు చిత్రాలు తీస్తూ వస్తున్నారు. తెలిసీ తెలియని వయసులో ఉండే, ఉడుకు రక్తం ఉరకలు వేసే పిల్లల్లో అవి కలిగించే మానసిక వికారాలు అన్నీ ఇన్నీ కావు. ఇలాంటి సినిమాల్ని పిల్లలతో కలిసి చూడాలంటే పెద్దలు సిగ్గుతో చచ్చిపోవాల్సిందే. కాలేజీలు ఎగ్గొట్టి ఇలాంటి సినిమాలు చూస్తూ అవే నిజమైన ప్రేమలుగా భ్రమించి, అమ్మాయిలను ప్రేమ పేరుతో వేధించే సంఘటనలు ఇవాళ సమాజంలో నిత్యకృత్యమైపోయాయి. 'నిర్భయ' వంటి సంఘటనలు పెచ్చుమీరిపోవడానికి బూతు సినిమాల ప్రభావమే ప్రధాన కారణం. ఇలాంటి సినిమాల సంఖ్య అంతకంతకూ పెరుగుతూ, మంచి సినిమాల సంఖ్య తరుగుతూ రావడానికి కారణం ఎవరో దర్శక నిర్మాతలతో పాటు ప్రేక్షకులూ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇవాళ మంచి సినిమా తీస్తే దాన్ని ఆస్వాదించే హృదయాలు ఎన్ని? నిర్మాతలు ఇలాంటి మూస కమర్షియల్ సినిమాల్నే ఎక్కువగా నిర్మించడానికి కారణం.. వాళ్లకు డబ్బే ప్రధానం. ఎలాంటి సన్నివేశం తర్వాత ఎలాంటి సన్నివేశం వస్తే జనం ఈలలు వేస్తారు, లాభాలు ఎలా వస్తాయి, ఏ హీరోతో తీస్తే జనం ఎక్కువగా వస్తారు, ఏ డైరెక్టర్‌కు స్టార్ వాల్యూ బాగా ఉంది.. అనే బాక్సాఫీస్ సూత్రాలకు లోబడిపోయి తమ సినిమాల్ని కేవలం వ్యాపారం కోసమే తీస్తున్నారు.
వర్తమానం కంటే గతమెంతో ఘనం అనేది పాత చింతకాయ పచ్చడి లాంటి నానుడి కావచ్చేమో గానీ, తెలుగు సినిమాకు సంబంధించి అది అక్షరాలా నిజం. గతంలోని సినిమాల్లో నటీనటుల నటన ఇప్పటికీ మన హృదయాల్లో నిలిచిపోయి ఉంది. ఇప్పటి ఏ నటుడి అభినయం గురించి గొప్పగా మనం చెప్పుకోగలం? కారణం మునుపటి తారలు నటనను ఓ కళగా భావించి, పాత్రను, దాని స్వభావాన్ని పూర్తిగా ఆకళింపు చేసుకొని ఆ పాత్రల్ని సొంతం చేసుకొనేవాళ్లు. ఇప్పటి ఏ నటుడు కానీ, నటి కానీ నటనను కళగా భావించి పాత్ర పోషణ చేస్తున్నారు? ఓ సినిమా చేస్తే ఎంత పారితోషికం అందుతుందనే ధ్యాస తప్పితే, నటనపై అంకితభావం చూపించేవాళ్లు కనిపిస్తారా? ఇవాళ హీరో కావాలంటే నటనకంటే డాన్సులు బాగా వచ్చుండాలి. ఫలానా హీరో బాగా నటించాడని చెప్పుకోవడం కంటే బాగా డాన్సులు, ఫైట్లు చేశాడని చెప్పుకోవడమే గొప్పయింది.
ఇక దర్శకుడి విషయానికి వస్తే పూర్వం తన శక్తివంచన లేకుండా చిత్రాన్ని ఆద్యంతం నవరసాలతో కళాత్మకంగా రూపొందించేవాడు. దర్శకునికి తగినట్లు నటీనటులు అభినయాన్ని ప్రదర్శించి పూర్తి సహకారం అందించేవాళ్లు. అంటే సమష్టి కృషివల్ల సినిమా విజయవంతమై నిర్మాతకు ఇంకో సినిమా తియ్యడానికి ముందడుగు వేసే ధైర్యం వచ్చేది. కానీ ఇవాళ్ల దర్శకునికే దర్శకులుగా మారిపోయారు తారలు. దాంతో దర్శకుడు మనసుకి ఎంత కష్టంగా ఉన్నా రాజీపడి సినిమాని పూర్తిచేశాననిపిస్తున్నాడు.
స్వర్ణయుగ సినిమాల విజయాల పరంపరకూ, ఇప్పటి సినిమాల విజయానికీ తేడాని పోలిస్తే ఎంతో కనిపిస్తుంది. అప్పుడు తయారయ్యే సినిమాల సంఖ్య తక్కువ. అవి కళాత్మకంగా ఉండేవి. ప్రజాదరణ అమితం. ఇప్పుడు సినిమాల సంఖ్య చాలా ఎక్కువ. అంతా వ్యాపార దృష్టే. కళాదృష్టి అసలు లేదు. అందువల్ల ఇప్పటి సినిమాలు అభిరుచి కలిగిన సినీ ప్రియుల్ని ఆకర్షించలేకపోతున్నాయి. కళకూ, ప్రజాదరణకూ సంఘర్షణ రావాల్సిన అవసరం లేదు. సమర్థుడైన దర్శకుడు కళను కించపరచకుండానే ప్రజారంజకమైన చిత్రాలు తీయగలడని అలనాటి కేవీరెడ్డి నుంచి, నిన్నటి కె. విశ్వనాథ్ నుంచి, ఇవాళ్టి క్రిష్, క్రాంతిమాధవ్ దాకా నిరూపిస్తూనే ఉన్నారు. మనకు జాతీయంగా పేరు వచ్చేది ఇలాంటి దర్శకులవల్లే. అందువల్ల మన నిర్మాతలు, దర్శకులు సినిమాలో వ్యాపారానికే తప్ప కళకు  చోటు లేదన్న భ్రమలోనే ఉంటూ కళను విస్మరించకుండా కళాఖండాలను, దృశ్యకావాలనూ తీయవచ్చని గుర్తించాలి. దానికి కావాల్సిందల్లా కూసింత ఆత్మవిశ్వాసం.

Wednesday, December 2, 2015

Actor Addanki Srirama Murthy Filmography

1. Bhakta Kuchela (1935)
2. Harischandra (1935)
3. Nara Narayana (1937) (Dharmaraju)
4. Sarangadhara (1937) (Rajaraja Narendra)
5. Chitra Naleeyam (1938)
6. Mahananda (1939)
7. Bhoja Kalidasa (1940)
8. Bhaktimala (1941)

contd...

Synopsis of the movie Varalakshmi Vratam (1961)

'వరలక్ష్మీ వ్రతం' (1961) చిత్ర కథాంశం


అనగనగా ఓక రాజు. ఆ రాజుకు ఇద్దరు భార్యలు. సహజంగానే పెద్ద భార్య ఉత్తమురాలు. రెండో భార్య చూపులకు మొద్దుగా ఉన్నప్పటికీ రాజుగారికి మాత్రం ముద్దుగానే ఉంటుంది. అంతటి మనిషి అక్కకంటే ముందుగానే కొడుకును కని తన ప్రతిభను చాటుకుంది. ఆ పుత్రరత్నమే కాబోయే రాజు అని ఉవ్విళ్లూరుతోంది. అది జరిగితే కథేముంది? పెద్దరాణి ఉన్నన్నాళ్లూ ఊరుకొని లేటు వయసులో గర్భం దాల్చింది. ఆమె కడుపులో పెరుగుతున్న పిండం చిన్నరాణి ఆశలకు గండం అయింది. ఆమెకు జోస్యం తెలుసో లేక స్కానింగ్ కళ్లు ఉన్నాయో కానీ, పెద్దరాణికి కొడుకే పుడ్తాడని తమ్ముడితో గట్టిగా అరిచి మరీ చెప్పింది. అందుకని ఆమెను అంతం చేయమని తమ్ముడికి నూరిపోసింది. ఒక మాంత్రికుడి సహాయంతో చేసిన ఆ ప్రయత్నం విఫలమైంది. ఆ మాంత్రికుడికీ, అతని ఇద్దరు శిష్యులకూ బోడిగుళ్లు దక్కాయి. ఆపైన గాడిదపై ఊరేగే భాగ్యమూ లభించింది.
పెద్దరాణి కొడుకుని కనేసింది. ఆ పసికందును తమ్ముడిచేత హత్యచేయించడానికి ప్రయత్నించింది చిన్నరాణి. కాని ముసలి మంత్రి తెలివితేటల వల్ల రాకుమారుడు తప్పించుకొని ఒక స్వామిభక్తి పరాయణుడి ఇంట పెరుగుతాడు. అతనికి బదులు ఆ భక్తుడి కొడుకు హత్యకు గురవుతాడు. ఆ పిల్లల తల్లులు ఎంతటి సత్తెకాలపు వాళ్లంటే పిల్లలు మారిపోయినా వాళ్లకు తెలీదు.
పనిలో పనిగా రాజుగారిని ఫినిష్ చేసి లైన్ క్లియర్ చేస్తాడు. ఆపైన రాణీని, ఎక్కడ తనకు ద్రోహం చేస్తుందోనని తన అక్కని జైలులో పెట్టేస్తాడు. తానే రాజ్యం చేపడతాడు.
సినిమా కథలో విధి బలీయంగా ఉంటుంది కాబట్టి అతని కూతురు మణిమంజరి, అజ్ఞాత రాకుమారుడు తొలిచూపులోనే ప్రేమించేసుకుంటారు. ప్రేమకు ఫలం దక్కాలంటే ఎన్నో కష్టాలు పడాలి. అందుకు తగ్గట్లే ఆ కష్టాలన్నీ దుష్టుల రూపంలో వచ్చి ఉక్కిరిబిక్కిరి చేసేసి నాయికను వరలక్ష్మీదేవి భక్తురాలిగా చేస్తాయి. ఈలోగా రాజకుమారిని దుష్టులు చెరబట్టబోగా, ఒక యక్షిణి రాకుమారుని చెరబట్టి, తన లోకానికి తీసుకుపోయి షికార్లకు వెళ్లేప్పుడల్లా కాగితం పువ్వుగా మారుస్తుంటుంది.
గుండు కొట్టించుకున్న ఒక మాంత్రికుడు మాయలూ మంత్రాలతో హంగామా చేస్తుంటాడు. ఏదైతేనేం, దుష్ట శిక్షణ, శిష్టరక్షణ జరిగి విడిపోయిన దంపతులను ఏకంచేసి తన మహత్యం నిరూపించుకుంటుంది వరలక్ష్మి.

తారాగణం: కాంతారావు, కృష్ణకుమారి, రాజనాల, సత్యనారాయణ, బాలకృష్ణ (అంజి), ముక్కామల, మిక్కిలినేని, స్వర్ణలత, మీనాకుమారి, జగ్గారావు, అల్లు రామలింగయ్య, కాకరాల, ఆదోని లక్ష్మి
సంగీతం: రాజన్ - నాగేంద్ర
నిర్మాత, దర్శకుడు: బి. విఠలాచార్య
బేనర్: విఠల్ ప్రొడక్షన్స్