Wednesday, August 10, 2011

న్యూస్: యముడైనా గట్టెక్కిస్తాడా?

కెరీర్‌లో ఒక్క హిట్టూలేని హీరో సాయిరాం శంకర్. టాప్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తమ్ముడైన సాయిరాం '143' సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. జగన్నాథ్ స్వయంగా డైరెక్ట్ చేసిన ఈ సినిమా బాక్సాఫీసుని గెలవలేకపోయింది. ఆ తర్వాత సాయిరాం 'హలో ప్రేమిస్తారా', 'వాడే కావాలి', 'డేంజర్', 'బంపర్ ఆఫర్' సినిమాల్లో హీరోగా నటించాడు. వీటిలో 'బంపర్ ఆఫర్' హిట్టవుతున్నట్లే కనిపించి, ఫ్లాప్‌గా తేలింది. 'డేంజర్'కి కృష్ణవంశీ డైరెక్టర్ అయినా ప్రయోజనం లేకపోయింది. వీటితో పాటు రవితేజ సినిమా 'నేనింతే'లో హీరో అభిమానిగా సాయి నటించాడు. ఇవేవీ అతని కెరీర్‌కు దోహదం చేయలేదు. కాగా అతను హీరోగా మరో సినిమా తెరకెక్కుతోంది. దాని పేరు 'యమహో యమహ'. 'ఇన్ అమెరికా' అనేది ట్యాగ్‌లైన్. ఇది సోషియో ఫాంటసీ కావడం గమనార్హం. ఇందులో యమధర్మరాజు పాత్రని శ్రీహరి చేస్తుండటం విశేషం. ఆయన ఆ పాత్రని పోషించడం ఇదే ప్రథమం. ఈ సినిమాకి సంబంధించిన మరో ఆసక్తికర అంశం సాయి సరసన పార్వతీ మెల్టన్ నటిస్తుండటం. పవన్ కల్యాణ్ సినిమా 'జల్సా' తర్వాత ఆమె మళ్లీ తెలుగు సినిమాలో నటించడం ఇదే. 'వేడుక' ఫేం జితేందర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ 20 నుంచి అమెరికాలో జరగనున్నది. యమధర్మరాజు ఉంటే ఆ సినిమా హిట్టే అనే సెంటిమెంట్‌ని సినీ జనం గట్టిగా నమ్ముతున్నారు కాబట్టి ఈ సినిమా అయినా విజయం సాధించి సాయి కెరీర్‌కి ప్రయోజనం చేకూరుస్తుందేమో చూడాలి.

No comments: