Sunday, October 31, 2010

దీపావళి (1960)

తారాగణం: ఎన్టీ రామారావు, సావిత్రి, కృష్ణకుమారి, ఎస్వీ రంగారావు, గుమ్మడి, ఎస్. వరలక్ష్మి, రమణారెడ్డి
రచన: సముద్రాల రాఘవాచార్య, గాలి బాలసుందరరావు
సంగీతం: ఘంటసాల
నిర్మాత: కె. గోపాలరావు
దర్శకుడు: ఎస్. రజనీకాంత్
బేనర్: అశ్వరాజ్ ప్రొడక్షన్స్
విడుదల తేది: 22 సెప్టెంబర్
కథ: భూదేవీ వరాహ మూర్తులకు జన్మించిన నరకాసురుడు (ఎస్వీ రంగారావు) ఘోర తపస్సు చేసి భూదేవి చేతిలో తప్ప మరెవ్వరిచే హతం కాలేననే వరాన్ని శివుని నుంచి పొందుతాడు. ఇంద్రాది దిక్పాలకుల్ని జయిస్తాడు. కృష్ణ భక్తుడైన నాగదత్తు (గుమ్మడి)ని మోసగించి ఆయన కుమార్తె వసుమతి (ఎస్. వరలక్ష్మి)ని వివాహమాడతాడు. తమకు పుట్టిన బిడ్డను తల్లి ఐన వసుమతి నుంచి వేరు చేస్తాడు. తనపై పగబట్టిన నాగదత్తుని నేత్రాలు తోడుతాడు. కృష్ణుని (ఎన్టీ రామారావు)పై పగబట్టి ద్వారకకు కృష్ణుని వేషంతో వచ్చి యువతుల్ని అపహరించుకు పోతాడు. ద్వారకావాసులు సత్యభామ (సావిత్రి)తో మొరబెట్టుకుంటారు, కృష్ణుని అదుపులో వుంచుకోమని. అంతవరకు సహనం వహించిన కృష్ణుడు లోక రక్షణార్థం నరకాసుర సంహారానికి సత్యభామా సమేతంగా బయలుదేరుతాడు. సత్యభామలో భూదేవి అంశ వున్నదనీ, నరక సంహారం సత్యవల్లనే కావాలనీ కృష్ణుని వల్ల గ్రహించిన రుక్మిణి (కృష్ణకుమారి) ఆ ఇరువురినీ విజయులై రమ్మని వీడ్కోలిస్తుంది. అటు నరకాసురుడూ సమర రంగానికి పయనమవుతాడు.
యుద్ధంలో కృష్ణుడు మూర్ఛపోయినట్లు నటిస్తాడు. నరకాసురుడు సత్యభామను అవమానిస్తాడు. నరకాసురునిపై అస్త్రం ప్రయోగిస్తుంది సత్యభామ. భూదేవియే సత్యభామ అని అవసాన దశలో నరకాసురుడు గ్రహించి క్షమాభిక్ష వేడుతాడు. నరకాసురుని చిరస్మరణీయం చేయాల్సిందిగా భూదేవి అర్థిస్తుంది. నరకాసురుని జ్ఞానజ్యోతికి చిహ్నంగా లోక వాసులంతా ఇంటింటా జ్యోతులు వెలిగించుకుని పండగ చేసుకొంటారనీ, ఆ పర్వదినమే 'దీపావళి'గా పిలువబడుతుందనీ చెప్పిన కృష్ణుడు ప్రాగ్జ్యోతీషపురంలో నరకాసురుని కుమారుని పట్టాభిషిక్తుని చేస్తానని మాట ఇస్తాడు.                      

Saturday, October 30, 2010

గేలరీ: రగడ




ఆనాటి సంగతి: 'పెళ్లి కానుక' రజతోత్సవం

అక్కినేని నాగేశ్వరరావు, బి. సరోజాదేవి, కృష్ణకుమారి, జగ్గయ్య కాంబినేషనులో వచ్చిన 'పెళ్లి కానుక' (1960) చిత్రం విజయవాడ అలంకార్ థియేటర్లో 25 వారాలు (175 రోజులు) ఆడింది. శ్రీధర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా రజతోత్సవం మద్రాసులోని న్యూవుడ్ లాండ్స్ హోటల్లో 1960 నవంబర్ 6న జరిగింది. ఆరోజు కుంభవృష్టిగా వాన పడుతున్నా లెక్కచెయ్యక ఆహ్వానితులంతా వచ్చారు. అయితే ఈ కార్యక్రమానికి సినిమాలోని ప్రధాన నాయిక బి. సరోజాదేవి రాలేదు. ఈ కార్యక్రమానికి హాజరైన వాళ్లలో అక్కినేని, బిఎన్ రెడ్డి, డి. మధుసూదనరావు, గుమ్మడి, జగ్గయ్య, సావిత్రి, కృష్ణకుమారి, షావుకారు జానకి, రేలంగి, గిరిజ, మాలతి, పి. సుశీల, జిక్కి, ఎస్. జానకి, దేవిక, చక్రపాణి, తాపీ చాణక్య, తాతినేని ప్రకాశరావు, బిఎ సుబ్బారావు, ఎవి సుబ్బారావు, ఎ.ఎం. రాజా, పేకేటి శివరామ్, శ్రీధర్ (డైరెక్టర్), బి. నాగిరెడ్డి, చిత్తూరు నాగయ్య, జెమిని గణేశన్, వీనస్ ఫిలిమ్స్ కృష్ణమూర్తి, నవయుగ ఫిలిమ్స్ శ్రీనివాసరావు, అలంకార్ థియేటర్ ఎస్. విష్ణురావు తదితరులు ఉన్నారు.                              

వాల్ పేపర్: షకీలా

నేటి పాట: సడిసేయకో గాలి (రాజమకుటం)

చిత్రం: రాజమకుటం (1960)
రచన: దేవులపల్లి కృష్ణశాస్త్రి
సంగీతం: మాస్టర్ వేణు
గానం: పి. లీల

పల్లవి:
సడిసేయకో గాలి! సడిసేయబోకే!
బడలి ఒడిలో రాజు పవ్వళించేనే
సడిసేయకే..
చరణం 1:
రత్నపీఠిక లేని రారాజు నా స్వామి!
మణికిరీటము లేని మహరాజు గాకేమి!
చిలిపి పరుగులు మాని కొలిచిపోరాదే!
సడిసేయకే..
చరణం 2:
ఏటి గలగలలకే ఎగిరి లేచేనే!
ఆకు కదలికలకే అదరి చూసేనే!
నిదుర చెదరిందంటే నేనూరుకోనే!
సడిసేయకే..
చరణం 3:
పండు వెన్నెల నడిగి పాన్పు తేరాదే!
నీలిమబ్బుల దాగు నిదుర తేరాదే!
విరుల వీవన పూని విసిరిపోరాదే!
సడిసేయకే గాలి సడిసేయబోకే
బడలి ఒడిలో రాజు పవ్వళించేనే
సడిసేయకో గాలి..                          

వాల్ పేపర్: షీలా

Friday, October 29, 2010

సినిమా: మూడు క్రేజీ సినిమాలు - ఒక వాస్తవం (చివరి భాగం)

'ఖలేజా' కనిపిస్తున్నదెక్కడ?
మూడేళ్ల విరామంతో మహేశ్ సినిమా వస్తున్నదనేసరికి ఆయన అభిమానుల్లోనే కాక, సాధారణ ప్రేక్షకుల్లోనూ ఎంత ఆసక్తి! బాక్సాఫీసు చరిత్రని 'మహేశ్ ఖలేజా' తిరగరాస్తుందనే చాలామంది ఆశించారు, నమ్మారు. తీరా థియేటర్లలో సినిమా విడుదలయ్యాక చూస్తే.. 'ఈ సినిమా కోసమా మహేశ్ మూడేళ్లు ఆగింది' అనే వ్యాఖ్యలే, విమర్శలే. కథని కాక, కేవలం కాంబినేషన్ ని నమ్ముకుని సినిమా తీస్తే ఫలితం ఎలా ఉంటుందో చెప్పిన సినిమా 'ఖలేజా'. ఈ సినిమా కంటే ముందు వేరే దర్శకులతో వేరే సినిమాలు చేస్తానని మహేశ్ నుంచి ప్రకటనలు వచ్చాయి. కానీ అవన్నీ పక్కకి వెళ్లిపోయి, త్రివిక్రమ్ సినిమా ముందుకొచ్చింది. మహేశ్, త్రివిక్రమ్ కాంబినేషనులో అదివరకు వచ్చిన 'అతడు' హిట్టవడం, అప్పుడే త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన 'జల్సా' విజయం సాధించడం దీనికి కారణం. హీరోయిన్ విషయంలోనూ ఇదే స్థితి. మొదట ఎంపిక చేసిన పార్వతీ మెల్టన్ ని కాదని 'అరుంధతి' సూపర్ హిట్టవడంతో అనుష్కని హీరోయినుగా తీసుకున్నారు. సూపర్ హీరో, సూపర్ హీరోయిన్, సూపర్ డైరెక్టర్ కాంబినేషన్ బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుందని నిర్మాత ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. 'పులి' కథని కానీ, 'ఖలేజా' కథని కానీ ముందుగా ఆయన వినలేదు. కాంబినేషన్స్ ని కుదుర్చుకుని, పెట్టుబడి పెట్టారంతే. ఒకప్పటి నిర్మాతలకీ, ఈ కాంబినేషన్ నిర్మాతలకీ అదే తేడా.
'ఖలేజా'లో ప్రారంభం నుంచి చివరిదాకా రీజనింగ్ కి అందని సన్నివేశాలెన్నో. హీరో ఇంట్రడక్షన్ సీనులో ఎడారిలో మనుషుల్ని మహేశ్ కత్తులతో కుత్తుకలు కోస్తుంటే, వాళ్లు అతనికి ఏం అన్యాయం చేశారో, ఎంతటి దుర్మార్గాలు చేశారో.. అనుకుంటాం. కానీ వాళ్లని అతను చంపింది 'నీళ్ల' కోసం! ఆ ఓపెనింగ్ ఫైట్ తోటే హీరో పాత్ర ఔచిత్యం దెబ్బతినిపోయింది. విషపు నీటివల్ల ఐదొందల పైచిలుకు జనాభా ఉన్న ఓ ఊరు వల్లకాడవుతుంటే, వాళ్లని 'దేవుడు'గా మహేశ్ ఎలా కాపాడాడనేది ఈ సినిమా ప్రధానాంశం. 'స్టఫ్' అంటూ లేని ఈ కథలోని 95 శాతం సన్నివేశాల్లో అంతా తానై కనిపిస్తాడు మహేశ్. అంటే ప్రధాన పాత్ర మీదే ధ్యాసంతా పెట్టిన దర్శకుడు మిగతా పాత్రల పట్ల చిన్నచూపు చూశాడు. తనవరకు విభిన్నమైన డైలాగ్ డిక్షనుతో, నటనతో మహేశ్ ఎంతగా చెలరేగిపోయినా, బిగువైన కథనం లేకపోవడమే 'ఖలేజా'కి ప్రతికూలంగా పరిణమించింది. ప్రపంచవ్యాప్తంగా తొలివారం బాక్సాఫీసు వద్ద భారీగా 21 కోట్ల రూపాయల షేరుని వసూలుచేసిన ఈ సినిమా కలెక్షన్లు రెండో వారం బాగా నెమ్మదించాయి. దాదాపు 40 కోట్ల రూపాయల (అంచనా) వ్యయమైన ఈ సినిమాకి పెట్టుబడి రావడం చాలా కష్టమనేది ట్రేడ్ వర్గాల మాట.
'బృందావనం' అందరిదయ్యేనా?
'బృందావనం' బాగుంది.. ఎక్కడికెళ్లినా ఇదే మాట. ఎన్టీఆర్ కథానాయకుడిగా; కాజల్ అగర్వాల్, సమంతా నాయికలుగా నటించిన ఈ సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో సినిమా విడుదలైన తొలిరోజు నిర్మాత రాజు, దర్శకుడు వంశీ పైడిపల్లి ముఖాలు సంతోషంతో వెలిగిపోయాయి. 'బృందావనం' సూపర్ డూపర్ హిట్టయి, బాక్సాఫీసు వద్ద రారాజుగా వెలిగిపోతున్న 'రోబో'ని నిలువరించడం ఖాయమనే ట్రేడ్ వర్గాలు భావించాయి. అయితే టాక్ కీ, కలెక్షన్లకీ కనిపిస్తున్న దూరం బయ్యర్లని ఆందోళన పరుస్తోంది. పైరసీ కారణంగానే ఈ సినిమాకి ఆశించిన రీతిలో వసూళ్లు రావడం లేదనేది ఓ వాదన. అదే నిజమైతే 'రోబో' కలెక్షన్లు ఇంకా నిలకడగా ఎందుకున్నాయనేది ప్రశ్న. ఇంతవరకు చేయని కొత్త తరహా పాత్రలో ఎన్టీఆర్ నటన అందరి ప్రశంసలూ పొందుతున్నప్పటికీ స్త్రీల హక్కులు, సమానత్వం మీద ఎంతో చైతన్యం కనిపిస్తున్న ఈ రోజుల్లోనూ 'ఒక పురుషుడికి ఇద్దరు స్త్రీలు' పాయింట్ ఎలా మెప్పు పొందుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 30 కోట్ల రూపాయలకు మించి వ్యయమైన ఈ సినిమాకి పెట్టుబడి రావాలంటే మరో రెండు వారాల పాటు కలెక్షన్లు బలంగా ఉండాలి. అయితే 'రోబో' స్థాయిలో ఈ సినిమా పట్ల ప్రేక్షకులు ఆసక్తి కనపర్చడం లేదనేది కనిపిస్తున్న వాస్తవం. మాస్ హీరో అయిన ఎన్టీఆర్ సినిమాకి 'బృందావనం' వంటి సాఫ్ట్ టైటిల్ పెట్టడం వల్లే ఓపెనింగ్స్ లో ఉధృతి కనిపించ లేదనేది ట్రేడ్ విశ్లేషకుల భావన.
డబ్బింగ్ సినిమాల వల్ల తెలుగు సినిమాలకు థియేటర్లు కరువవుతున్నాయని ఇప్పటిదాకా చిన్న సినిమాల నిర్మాతలు ఆవేదన చెందుతూ వచ్చారు. ఇప్పుడు ఆ డబ్బింగ్ సినిమాల వల్ల తమకూ ముప్పు ఏర్పడిందని పెద్ద సినిమాల నిర్మాతలు బాధపడే రోజులొచ్చాయి. కిం కర్తవ్యం? కాంబినేషన్ల మీదకంటే కథాకథనాల మీద శ్రద్ధ ఎక్కువగా పెట్టడమే.                          

వాల్ పేపర్: శ్రియ

Thursday, October 28, 2010

నేటి పాట: నవ్వుతూ బతకాలిరా (మాయదారి మల్లిగాడు)

చిత్రం: మాయదారి మల్లిగాడు (1973)
రచన: ఆత్రేయ
సంగీతం: కె.వి. మహదేవన్
గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం

పల్లవి:
నవ్వుతూ బతకాలిరా.. తమ్ముడూ
నవ్వుతూ చావాలిరా..
చచ్చినాక నవ్వలేవురా.. ఎందరేడ్చినా
బతికిరావురా.. తిరిగిరావురా.. అందుకే   ||నవ్వుతూ||                        
చరణం 1:
చంపేది ఎవడురా..
చచ్చేది ఎవడురా..
శివునాజ్ఞ లేకుండా చీమైనా కుట్టదురా
కుడితే సావాలని వరమడిగిన చీమ
కుట్టీ కుట్టకముందె సస్తోంది సూడరా.. అందుకే   ||నవ్వుతూ||
చరణం 2:
బతికుండగా నిన్ను ఏడిపించినోళ్లు
నువ్వు సస్తె ఏడుత్తారు దొంగనాయాళ్లు
అది నువ్వు సూసేదికాదు - నిను కాసేదికాదు
నువ్వు పోయినా నీ మంచి సచ్చిపోదురా..
ఒరె సన్నాసీ నవ్వరా.. అందుకే   ||నవ్వుతూ||
చరణం 3:
వున్నాడురా దేవుడు
వాడు ఒస్తాడురా తమ్ముడు..
ఎప్పుడు?
అన్నాయం జరిగినపుడు - అక్కరమం పెరిగినపుడు
వస్తాడురా.. సచ్చినట్టు వస్తాడురా.. అందుకే   ||నవ్వుతూ||

వాల్ పేపర్: విమలా రామన్

సినిమా: మూడు క్రేజీ సినిమాలు - ఒక వాస్తవం (1వ భాగం)

ఒక డబ్బింగ్ సినిమా ఒకవైపు.. మూడు భారీ, క్రేజీ తెలుగు సినిమాలు ఇంకోవైపు.. మామూలుగా అయితే డబ్బింగ్ సినిమా మట్టికరచి మాయం కావాలి. చిత్రం.. సీను రివర్స్. తెలుగులో అగ్ర కథానాయకులు నటించిన సినిమాల్నే వెనక్కి నెట్టేస్తూ ఆ డబ్బింగ్ సినిమా అప్రతిహతంగా బాక్సాఫీసును దున్నేస్తోంది. తెలుగు ప్రేక్షకులకి వినోదపు మజాని రుచి చూపిస్తూ నాణ్యమైన సినిమాకే వాళ్లు పట్టం కడతారనే నిజాన్ని చాటి చెబుతోంది. ఆ డబ్బింగ్ సినిమా 'రోబో'. ఆ భారీ, క్రేజీ సినిమాలు 'పులి', 'మహేశ్ ఖలేజా', 'బృందావనం'. తమిళ అగ్ర కథానాయకుడైన రజనీకాంత్ టాలీవుడ్ టాప్ హీరోల్ని పడగొట్టి బాక్సాఫీసు మీద గుత్తాధిపత్యం చలాయిస్తుండటం ఆషామాషీ సంగతి కాదు. టాలీవుడ్ వర్గాలు చాలా చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన సంగతి.
ఎందుకిలా జరిగింది? మొదటే హీరోని దృష్టిలో పెట్టుకుని కథలు వండటం తెలుగు దర్శకులు, రచయితలకి బాగా అలవాటైన పనయితే, స్క్రిప్టు మీదే ఎక్కువ దృష్టిపెట్టి, ఆ స్క్రిప్టుకి పనికొచ్చే నటుణ్ణి వెతుక్కోవడం తమిళ దర్శకుడైన శంకర్ కి తెలిసిన పని. 'రోబో' గురించీ, ఆ సినిమా ఆంధ్రప్రదేశ్ బాక్సాఫీస్ మీద చేస్తున్న సందడి గురించీ ఇదివరకే చెప్పుకున్నాం. ఇప్పుడు ఆ సినిమా స్థాయిలో మన మూడు తెలుగు స్ట్రెయిట్ సినిమాలు ఎందుకని ప్రేక్షకుల్ని అలరించలేక పోతున్నాయో విశ్లేషించుకోవాల్సిన సందర్భం.
తోకముడిచిన 'పులి'
'రోబో' కంటే మూడు వారాల ముందు విడుదలైన పవన్ కల్యాణ్ సినిమా 'పులి' (కొమరం పులి)ని ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో వెయ్యి ప్రింట్లతో విడుదల చేశారు. అందుకే తొలివారం ఆ సినిమా 25 కోట్ల రూపాయల్ని వసూలు చేసింది. నిజానికి అందులో ముప్పాతిక వంతు తొలి మూడు రోజుల్లోనే రావడం గమనార్హం. ఆ తర్వాత నుంచే ఆ సినిమాకి వచ్చే వాళ్లు కనుచూపు మేరలో కనిపించకుండా పోయారు. ఆ 'ఘనత'ని మొత్తంగా దర్శకుడు ఎస్.జె. సూర్యకే ఆపాదించారు. ప్రేక్షకుల్ని కుర్చీల్లోంచి లేవకుండా కూర్చోపెట్టాలంటే వినోదమన్నా వుండాలి, ఉత్కంఠభరితమైన కథనమన్నా వుండాలి. ఆ రెండూ లేకపోవడమే 'పులి' పరాజయానికి ప్రధాన కారణమనేది విమర్శకుల అభిప్రాయం. పులి పాత్ర చేత పదే పదే 'ప్రసంగాలు' ఇప్పించడం సినిమాకి పెద్ద మైనస్ పాయింట్. జనం సినిమాకి వచ్చేది ప్రధానంగా వినోదం కోసమేననే, సినిమాలోని ప్రధాన పాత్రలతో వాళ్లు సహానుభూతి చేందితేనే సినిమా ఆడుతుందనే ప్రాథమిక సత్యం తెలియకుండా తీసిన సినిమాగా 'పులి'ని చెప్పుకోవాలి. ఆరంభ సన్నివేశాల్లోనే పులి ఆవేశంగా ఐదు నిమిషాల సేపు జనానికి ఉపదేశించే రీతిలో ప్రసంగించడం చూసి బిత్తరపోయిన ప్రేక్షకులు, ఆ తర్వాత మరో మూడు నాలుగు సార్లు అలాంటి సీనులే ఎదురవడంతో కుర్చీల్లో ఎంత ఇబ్బందికరంగా మసిలారో 'పులి'ని చూసిన వాళ్లందరికీ అనుభవమే. నీతిబోధకుడు చెప్పే రీతిలో పవన్ కల్యాణ్ చెప్పిన నీతులు ప్రేక్షకుల్ని కదిలించాయి. ఎలా? కుర్చీల్లో అసహనంగా, చికాకుగా. రాజకీయ వేదికలపై చెప్పే ఆవేశభరిత, ఊకదంపుడు ఉపన్యాసాల్ని వినీ వినీ డంగైపోయిన జనం సినిమాలోనూ అలాంటి సీనే కనిపించడంతో మూకుమ్మడిగా 'పులి'కి వ్యతిరేకంగా ఓటేశారు. ఫలితంగా ఆ సినిమాపై పెట్టుబడి పెట్టిన నిర్మాత, బయ్యర్లు నిలువునా మునిగిపోయారు. తొలివారం భారీ కలెక్షన్లు సాధించిన ఆ సినిమా రెండో వారం సగానికంటే ఎక్కువ సంఖ్య థియేటర్లలో మాయమయ్యింది. మొత్తంగా ఈ ఏడాది ఇప్పటివరకు రిలీజైన సినిమాల్లో నెంబర్ వన్ డిజాస్టర్ అనే ముద్రని సంపాదించుకుంది. (ఇంకావుంది)

వాల్ పేపర్: లక్ష్మీరాయ్

Wednesday, October 27, 2010

నేటి పాట: ఆకలుండదు దాహముండదు (మంచివాడు)

చిత్రం: మంచివాడు (1973)
రచన: ఆత్రేయ
సంగీతం: కె.వి. మహదేవన్
గానం: ఘంటసాల, పి. సుశీల

పల్లవి:
అతడు: ఆకలుండదు - దాహముండదు నిన్ను చూస్తుంటె
ఆమె: వేరే ఆశ వుండదు ధ్యాస వుండదు నువ్వు తోడుంటె
అతడు: మల్లెలుండవు - వెన్నెలుండవు నీ నవ్వే లేకుంటె
ఆమె: మనసు వుండదు - మమత వుండదు నీ మనిషిని కాకుంటె                          
అతడు: వయసులో ఈ పోరువుండదు నీ వలపే లేకుంటే
ఆమె: వలపు ఇంత వెచ్చగుండదు నీ ఒడిలో కాకుంటే   ||ఆకలుండదు||
చరణం 1:
అతడు: పొద్దు గడిచేపోతుంది - నీ నడక చూస్తుంటె
ఆమె: ఆ నడక తడబడిపోతుంది - నీ చూపు పడుతుంటె
అతడు: ఆకు మడుపులు అందిస్తూ నువ్వు వగలుపోతుంటె
ఆమె: ఎంత ఎరుపో అంత వలపని నేనాశపడుతుంటె   ||ఆకలుండదు||
చరణం 2:
అతడు: తేనెకన్న తీపికలదని - నీ పెదవే తెలిపింది
ఆమె: దానికన్న తీయనైనది నీ ఎదలో దాగుంది
అతడు: మొదటిరేయికి తుదేలేదని నీ ముద్దే కొసరింది
ఆమె: పొద్దు చాలని ముద్దులన్నీ నీ వద్దే దాచింది
           ఆ ముద్దే మిగిలింది   ||ఆకలుండదు||

Tuesday, October 26, 2010

ఫోకస్: 'నంది' లీలలు (చివరి భాగం)

'లీడర్'కి అన్యాయం?
'ఇంకోసారి' అనే సినిమా ఎప్పుడు వచ్చిందో, ఎప్పుడు పోయిందో సాధారణ ప్రేక్షకులకే కాదు విమర్శకులకి కూడా జ్ఞాపకం లేదు. ఆ సినిమాలో నటించించిన వెన్నెల కిశోర్ ఉత్తమ హాస్యనటుడిగా, దాన్ని డైరెక్ట్ చేసిన సుమాన్ పాతూరి తొలి చిత్ర దర్శకుడిగా అవార్డులు పొందారు. హాస్యనటుడిగా అవార్డునివ్వాలంటే అతను ఆ పాత్ర ద్వారా జనాన్ని బాగా నవ్వించాలి కదా. కానీ ఆ సినిమాని చూసిన వాళ్లెంతమంది? సుమన్ పాతూరితో పోలిస్తే ఉత్తమ తొలిచిత్ర దర్శకుడిగా ఎంపికకు అర్హత ఉన్నది ఉత్తమ సకుటుంబ కథా చలనచిత్రంగా అవార్డుకు ఎంపికైన 'కొంచెం ఇష్టం కొంచెం కష్టం' దర్శకుడు కిశోర్ కే అనేదే అత్యధిక విమర్శకుల అభిప్రాయం. ఉత్తమ సంగీత దర్శకుడిగా ఎం.ఎం. కీరవాణిని ఎంపిక చేశారు. ప్రస్తుత సంగీత దర్శకుల్లో ఆయన అగ్రగణ్యుడనేది నిర్వివాదం. కానీ ఆయన ఆ అవార్డుకు ఎంపికైన చిత్రం సందర్భవశాత్తూ 'మగధీర' కాదు, 'వెంగమాంబ'! జనానికి తెలిసింది 'మగధీర' సంగీతమా? 'వెంగమాంబ' సంగీతమా? ఇలాగే మరికొన్ని అవార్డుల విషయంలోనూ ఇదే అభిప్రాయం కలుగుతుంది.
ఈ అవార్డుల విషయంలో అన్యాయం జరిగిన సినిమా ఏదంటే 'లీడర్' అనే చెప్పాలి. ఈ సినిమాకి కంటితుడుపుగా ఉత్తమ కథా రచయిత అవార్డునిచ్చారు. శేఖర్ కమ్ముల తయారుచేసిన కథ నచ్చిన జ్యూరీకి ఈ సినిమాలో మరే అంశమూ నచ్చకపోవడం వైచిత్రి. రాష్ట్రానికి ముఖ్యమంత్రయి, వ్యవస్థలోని అవినీతిని అంతం చేయాలని తపించే యువకుడి కథతో రూపొందిన ఈ సినిమా జ్యూరీని ఇతర అంశాల్లో ఎందుకు మెప్పించలేక పోయింది? ఉత్తమ చిత్రం కేటగిరీలో ఎంపికైన మూడు చిత్రాల్లోని కథకంటే ఈ సినిమా కథ ఉత్తమమైందని జ్యూరీకి తోచినప్పుడు ఉత్తమ చిత్రాలుగా వాటిని ఏ ప్రాతిపదిక ఆధారంగా ఎంపిక చేసినట్లు? 'నంది అవార్డుల జ్యూరీ లీలలు ఇన్నిన్నికాదయా' అని చెప్పడానికి ఇంతకు మించి నిదర్శనం మరేముంటుంది?  (అయిపోయింది)

Sunday, October 24, 2010

వాల్ పేపర్: రాఖీ సావంత్

నేటి పాట: చెంగావి రంగు చీర (బంగారుబాబు)

చిత్రం: బంగారుబాబు (1973)
రచన: ఆత్రేయ
సంగీతం: కె.వి. మహదేవన్
గానం: ఘంటసాల, పి. సుశీల

ఆమె: ఛీ.. ఛీ.. ఛీ..

అతడు: ఛా.. ఛా.. ఛా..
             చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది
             దాని జిమ్మదియ్య అందమంతా చీరలోనే వున్నది

ఆమె: చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది
           దాని జిమ్మదియ్య కొంగు కొంగు కలిపి చూడమన్నది

అతడు: మెరుపల్లె వచ్చింది నా యింటికి - నన్ను
              మెల్లంగ దించింది ముగ్గులోనికి

ఆమె: తలదాచుకొమ్మని తావిస్తినీ - పిల్ల
            దొరికింది చాలనీ ఇల్లాల్ని చేస్తివి..   ||చెంగావి||

అతడు: ప్రేమంటే నేర్పింది పిచ్చివాడికి - దాంతో
              వెర్రెత్తిపోయింది కుర్రవాడికి

ఆమె: పిచ్చివాడనే పేరుచాటున మాటువేసినావు
           పిల్లదాని పెదవిమీద కాటు వేసినావు...   ||చెంగావి||

అతడు: సరి.. సరి.. సరి..

ఆమె: సరసంలో పడ్డాడు యిన్నాళ్లకి - అబ్బో
           సంగీతం వచ్చిందీ బుజ్జిబాబుకి

అతడు: తెరచాటు తొలిగింది పరువానికి - అది
               పరవళ్లు తొక్కుతూ పాడింది నేటికి...   ||చెంగావి||

Saturday, October 23, 2010

ఫోకస్: 'నంది' లీలలు! (2వ భాగం)

నారా రోహిత్ కథానాయకుడిగా, చైతన్య దంతులూరి దర్శకుడిగా పరిచయమైన 'బాణం' సినిమా జనాదరణ పొందలేకపోయినా విమర్శకుల్ని మెప్పించింది. భ్రష్టుపట్టిపోయిన ఈ వ్యవస్థను ప్రక్షాళన చెయ్యాలని భావించే ఒక యువకుని కథ ఈ సినిమా. ఆ క్రమంలో అతడు ఎలాంటి అడ్డంకుల్ని ఎదుర్కొన్నాడు, ఆ అడ్డంకుల్ని చట్టం పరిధిలో ఎలా పరిష్కరించాడనేది ప్రధానాంశం. సమాజాన్ని ఆలోచింపజేసే సినిమా. 'కలవరమాయె మదిలో' ఉత్తమ తృతీయ చిత్రంగా అవార్డు గెలుచుకోవడం ఆశ్చర్యపరిచే విషయం. ఇటు జనాన్నీ, అటు విమర్శకుల్నీ మెప్పించలేకపోయిన ఈ బోరింగ్ ఫిల్మ్ నంది జ్యూరీని ఆకట్టుకోవడం విశేషమే. ఎప్పటికైనా ఎ.ఆర్. రెహమాన్ సంగీతంలో పాటలు పాడే అవకాశాన్ని చేజిక్కించుకోవాలని ఆశించే ఓ ఔత్సాహిక గాయని కథ ఈ సినిమా.
విమర్శలెదుర్కొన్న 'ఉత్తమ నటుడు'
ప్రజాదరణ పొందిన ఉత్తమ చిత్రంగా 'మగధీర'ని మించిన సినిమా ఇంకేముంటుంది? దీన్ని తప్పుపట్టే వాళ్లయితే లేరు. ఇదే సినిమా మరో ఎనిమిది అవార్డుల్ని గెలుచుకుని సత్తా చాటింది. 'మగధీర' సరికొత్త బాక్సాఫీసు రికార్డుల్ని సృష్టించడానికి ప్రధాన కారణమైన ఎస్.ఎస్. రాజమౌళి ఉత్తమ దర్శకుడిగా ఎంపికవడమూ సబబే. ఇదే సినిమాకి సమకూర్చిన నృత్యాలతో జాతీయ నృత్య దర్శకుడిగా అవార్డుని గెలుచుకున్న శివశంకర్, జాతీయ స్థాయిలో స్పెషల్ ఎఫెక్ట్స్ అవార్డు పొందిన కమల్ కణ్ణన్ లకే ఆ అవార్డులనివ్వడం మినహా జ్యూరీకి చేసేదేముంటుంది? అలాగే ఉత్తమ ఎడిటరుగా కోటగిరి వెంకటేశ్వరరావు, కళా దర్శకుడిగా రవీందర్, శబ్దగ్రాహకుడిగా రాధాకృష్ణ, కాస్ట్యూమ్ డిజైనరుగా రమా రాజమౌళికి అవార్డులు ప్రకటించారు. వీటికి అదనంగా కథానాయకుడు రాంచరణ్ కి స్పెషల్ జ్యూరీ అవార్డు(!)ని ప్రకటించారు. ఇలా రాంచరణ్ కి జ్యూరీ అవార్డు ప్రకటించి, దాసరి నారాయణరావుని ఉత్త నటుడిగా ఎంపికచేయడం విమర్శకి తావిచ్చింది. చిరంజీవి - రాంచరణ్ అభిమానులు సహజంగానే ఇందులో రాజకీయం ఉందని ఆరోపించారు. దాసరికి ఈ అవార్డుని ప్రకటిస్తారని విమర్శకులు సహా ఎవరూ ఊహించలేదు. 'మేస్త్రి'లో పాలకొల్లు అనే పాత్రలో జీవించినందుకు గాను ఆయనకు జ్యూరీ ఈ అవార్డుని అందించిందనుకోవాలి. గమనించదగ్గ సంగతేమంటే, ఈ సినిమాలో పాలకొల్లు ప్రస్తుత ప్రభుత్వ విధానాల మీద విరుచుకుపడతాడు. సినిమా ప్రారంభంలో ఈ సినిమాలోని పాత్రలు, సన్నివేశాలు కేవలం కల్పితమనీ, ఎవర్నీ ఉద్దేశించినవి కాదనీ చెప్పినా, చిరంజీవిని లక్ష్యంగా చేసుకునే, ఆయన్ని విమర్శించడానికే ఈ సినిమా తీశారని అంతా భావించారు. అలాంటి సినిమాలో నటించిన ఆయనకు ఉత్తమ నటుడి అవార్డునివ్వడం చాలామందికి మింగుడుపడని సంగతి.  (ఇంకావుంది)                          

వాల్ పేపర్: రీమాసేన్

నేటి పాట: ఒసె వయ్యారి రంగీ (పల్లెటూరి బావ)

చిత్రం: పల్లెటూరి బావ (1973)
రచన: ఆత్రేయ
సంగీతం: టి. చలపతిరావు
గానం: ఘంటసాల

పల్లవి:
ఒసె వయ్యారి రంగీ - వగలమారి బుంగీ
ఊగిందే నీ నడుము ఉయ్యాల
ఆ వూపు చూస్తుంటే -
నే నోపలేకుంటే
పాడిందే నా మనసు జంపాల                
చరణం 1:
నీ చూపులో వుందే పిడిబాకు - దాని
పదునెంతో చూస్తానే -
నీ సెంపలో వుందే సిగురాకు - దాని
వగరెంతో సెబుతానే -
యీయేళ కాదని అనమాకు
ఇంకెన్నాళ్లే యీ కొలువు
నా రవ్వ - నా గువ్వ - నా మువ్వ -
ఓ రంగమ్మా - జివజివలాడిందే
మనసే - గుబగుబలాడిందే...   ||ఒసే||
చరణం 2:
ఎగిరెగిరి పడుతోందే నీ పైట,
    ఓహో యీపాటి చిరుగాలికే
ఉరికురికి వస్తోందే నీ వయసు,
    ఆహ నాతోటి జగడానికే
అదిరదిరి పడుతోంది నీ మనసు,
    వుత్తుత్తి సరసాలకే -
నా కన్న - నా చిన్న - నా పొన్న
ఓ రంగమ్మా - జివజివలాడిందే -
మనసే గుబగుబలాడిందే -   ||ఒసే||
చరణం 2:
కోటప్ప తిరణాల కెళ్లినపుడు -
    మనం కొన్నామె గుళ్లపేరు
అది రొమ్ముమీద అటూ యిటూ వూగుతుంటే
నాకు రిమ్మతెగులు రేగుతుందే -
పెళ్లయినవాణ్ణని జంకమాకు -
ఒకరికి యిద్దరైన వేడుకేలే -
నా చిట్టి - నా పొట్టి - నా పట్టి
ఓ రంగమ్మా ఏస్తానె మూడుముళ్లూ
రంగమ్మా ఏస్తానె మూడుముళ్లూ
ప్పిప్పి పిప్పీ డుండుం పిప్పిప్పీ డుండుండుం

Friday, October 22, 2010

ఫోకస్: 'నంది' లీలలు! (1వ భాగం)

అందరికీ ఆమోదయోగ్యమైన రీతిలో అవార్డుల్ని ఎంపిక చేయడం అంత సులువైన పని కాదు. అయితే అసలు సిసలు సినిమా ప్రియులు, అవార్డులు గెలుచుకోగల అవకాశం ఎవరికుంటుందో ఊహించగలుగుతారు. ఆ ఊహకు భిన్నంగా ఫలితాలు వచ్చినప్పుడు విస్మయానికి గురవుతారు. రాష్ట్ర ప్రభుత్వం అందించే నంది అవార్డుల విషయంలో వాళ్లు విస్మయపడే సందర్భాలే ఎక్కువ. నిరుడు విమర్శకుల్ని సంతృప్తిపరచిన నంది అవార్డుల జ్యూరీ ఈ ఏడాది పాతబాటనే అనుసరిస్తూ విమర్శకులకు ఎక్కువ పని కల్పించింది. 2009 సంవత్సరానికి జ్యూరీ ప్రకటించిన అవార్డుల్ని చూసి, 'ఇవేం అవార్డులు?' అనుకోనివాళ్లు బాగా తక్కువ.
జ్యూరీని మెప్పిస్తే చాలు!
ఉత్తమ చిత్రం అవార్డు విషయంలో ప్రజాదరణ పొందిన సినిమాల్ని లెక్కలోకి తీసుకోకూడదనీ, సమాజానికి ప్రయోజనకరమైన ఇతివృత్తంతో తీసిన సినిమాల్నే లెక్కలోకి తీసుకోవాలనీ జ్యూరీ నిర్ణయించుకున్నట్లు అనిపిస్తుంది. అందుకే ఉత్తమ చిత్రంగా ప్రథమ, ద్వితీయ, తృతీయ అవార్డుల్ని గెలుచుకున్న సినిమాల్లో ఒక్కటి కూడా ప్రేక్షకుల ఆదరణకు నోచుకున్న సినిమా లేదు. ఉత్తమ ప్రథమ చిత్రంగా బంగారు నందిని గెలుచుకున్న 'సొంత ఊరు'ని గానీ, ద్వితీయ చిత్రంగా నిలిచిన 'బాణం'ని గానీ, తృతీయ చిత్రం అవార్డుని పొందిన 'కలవరమాయె మదిలో'ని గానీ థియేటర్లలో చూసిన ప్రేక్షకులు బాగా తక్కువ. వీటిలో తొలి రెండు సినిమాలు విషయపరంగా, కథపరంగా విమర్శకుల్ని ఆకట్టుకున్నాయి.
'కలవరమాయె మదిలో' సినిమా ప్రేక్షకుల్నే కాదు, విమర్శకుల్నీ మెప్పించలేకపోయింది. అయితేనేం జ్యూరీని మెప్పించిందన్న మాట. పి. సునీల్ కుమార్ రెడ్డి రూపొందించిన 'సొంత ఊరు' సినిమా సెజ్ ల వల్ల ఎలాంటి విపరిణామాలు జరుగుతాయనే సంగతిని రుద్ర అనే ఓ కాటికాపరి దృష్టికోణం నుంచి తీసిన చక్కని సినిమా అనడంలో సందేహం లేదు. అయితే నెగటివ్ క్లైమాక్స్ ఈ సినిమాలో ప్రధానంగా కనిపించే లోపం. దేవుడు అని అందరూ పిలిపించుకునేవాడు ఊరివాళ్లందర్నీ మభ్యపెట్టి వాళ్ల భూముల్ని అమ్ముకునేట్లు చేసి, ఊరిని ఎడారిలా మార్చేస్తుంటే చూసి సహించలేని రుద్ర ఆఖర్లో అతణ్ణి అంతం చేస్తాడు. ఆ హత్యకు కారణమేమిటనే నిజాన్ని జనం గ్రహించేట్లు చేసి, తమ ఊరిని కాపాడుకోవడానికి వాళ్లు నడుం బిగించినట్లు చూపిస్తే అర్థవంతంగానూ, ఔచిత్యంగానూ ఉండేది. కానీ జనం సత్యాన్ని గ్రహించకుండా దేవుణ్ణి చంపిన రుద్రపై ఆగ్రహించి, అతణ్ణి చంపేస్తారు. అంటే ఈ సినిమా ద్వారా దర్శకుడు సమాజానికి ఏం చెప్పదలచుకున్నాడు? మంచి పనుల్ని జనం అర్థం చేసుకోలేరు, మంచి చేసినవాళ్లనే చంపేస్తారు.. అనే ఒక తప్పుడు అభిప్రాయం ఇచ్చినట్లే కదా. అవార్డుకు ఎంపికయ్యే సినిమా ఈ తరహాలో ఉండకూడదు. ఇదే సినిమాకి మరో మూడు అవార్డులు లభించాయి. ఉత్తమనటి, క్యారెక్టర్ నటుడు, సంభాషణల రచయిత అవార్డులు దీనికి దక్కాయి. వీటిలో ఉత్తమ నటి అవార్డు మరీ విస్మయకరం. మల్లి అనే వేశ్య పాత్రలో నటించిన కొత్తమ్మాయి తీర్థని ఆ అవార్డుకు ఎంపికచేశారు. ఆమె ఎలా నటించిందో సగటు సినిమా ప్రియుడికైతే అసలే తెలీదు. జ్యూరీకి తెలిస్తే చాలుగా! రుద్ర పాత్రని ప్రతిభావంతంగా పోషించిన ఎల్బీ శ్రీరామ్ క్యారెక్టర్ నటునిగా అవార్డుని గెలుచుకోవడమే కాక, సంభాషణల రచయిత గానూ అవార్డుని పొందారు.  (ఇంకావుంది)
                          

వాల్ పేపర్: కాజల్ అగర్వాల్

వాల్ పేపర్: రియాసేన్

నేటి పాట: మబ్బులు రెండు భేటీ అయితే (దేశోద్ధారకులు)

చిత్రం: దేశోద్ధారకులు (1973)
రచన: ఆత్రేయ
సంగీతం: కె.వి. మహదేవన్
గానం: ఘంటసాల, పి. సుశీల

ఆమె: మబ్బులు రెండు భేటీ అయితే మెరుపే వస్తుంది
అతడు: మనసులు రెండు పేచీ పడితే వలపే పుడుతుంది
ఆమె: మూడు ముళ్లూ పడతాయంటె సిగ్గే మొగ్గలు వేస్తుంది
అతడు: ఆ మొగ్గలు పూచీ మూడు రాత్రులు తీయని ముద్రలు వేస్తాయి
             కన్నులు నాలుగు కలిశాయంటే పున్నమి వెన్నెల కాస్తుంది
ఆమె: ఆ వెన్నెల నాలుగు వారాలైనా తరగని వెలుగై వుంటుంది
           అయిదోతనమే ఆడజన్మకు అన్ని వరాలను మించింది
అతడు: ఆ వరాన్ని తెచ్చిన మగువే మగనికి ఆరో ప్రాణం అవుతుంది
             అడుగులు ఏడూ నడిచామంటే అనుబంధం పెనవేస్తుంది
ఆమె: ఆ అనుబంధం ఏడేడు జన్మలకు వీడనిబంధం అవుతుంది   ||మబ్బులు||                             

Thursday, October 21, 2010

వాల్ పేపర్: ఇలియానా

నేటి పాట: చీకటి వెలుగుల రంగేళీ (విచిత్రబంధం)

చిత్రం: విచిత్రబంధం (1972)
రచన: ఆత్రేయ
సంగీతం: కె.వి. మహదేవన్
గానం: ఘంటసాల, పి. సుశీల

పల్లవి:
చీకటి వెలుగుల రంగేళీ
జీవితమే ఒక దీపావళి - మన
జీవితమే ఒక దీపావళి
అందాల ప్రమిదల ఆనందజ్యోతుల
ఆశల వెలిగించు దీపాలవెల్లి    ||చీకటి||                        
చరణం 1:
అక్కయ్య కన్నుల్లో మతాబులు
ఏ చక్కని బావకో జవాబులు
మాటల్లో వినిపించు చిటపటలు
ఏ మనసునో కవ్వించు గుసగుసలు    ||చీకటి||
చరణం 2:
అల్లుళ్లు వస్తారు అత్తవారిళ్లకు
మరదళ్లు చేస్తారు మర్యాద వాళ్లకు
బావ బావ పన్నీరు - బావను పట్టుకు తన్నేరు
వీధి వీధి తిప్పేరు - వీసెడు గుద్దులు గుద్దేరు    ||చీకటి||
చరణం 3:
అమ్మాయి పుట్టింది అమాసనాడు
అసలైన గజదొంగ అవుతుంది చూడు
పుట్టినరోజున దొరికాడు తోడు
పున్నమినాటికి అవుతాడు జోడు    ||చీకటి||

Wednesday, October 20, 2010

సినిమా: డిసెంబర్ నుంచి మహేశ్ '3 ఇడియట్స్'

'ఖలేజా' తర్వాత మహేశ్ చేసే సినిమా ఏది? 'దూకుడు', '3 ఇడియట్స్'లో ముందు ఏ సినిమా చేయబోతున్నాడు? ప్రస్తుతం ఆయన అభిమానుల్ని వేధిస్తున్న ప్రశ్నలివి? నిజానికి శ్రీను వైట్ల దర్శకత్వం వహించే 'దూకుడు' ఈ అక్టోబరులో టర్కీలో మొదలవుతుందనే వార్తలు వచ్చాయి. తాజా సమాచారం ప్రకారం ఆ సినిమా షూటింగ్ ఈ నెలలో లేదు. నవంబరులో మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు '3 ఇడియట్స్' తెలుగు వెర్షన్ డిసెంబర్ 6న ప్రారంభం కానున్నట్లు ఫిలింనగర్ వర్గాల భోగట్టా. 'రోబో' తర్వాత శంకర్ డైరెక్ట్ చేయబోతున్న సినిమా ఇదే. జెమిని ఫిల్మ్ సర్క్యూట్ నిర్మించే ఈ సినిమాకి హారిస్ జయరాజ్ మ్యూజిక్ డైరెక్టర్. ఇప్పటికే రెండు పాటల్ని రికార్డ్ చేశారు. ఇందులో ప్రధాన హీరోగా మహేశ్ నటించనుండగా, మరో ఇద్దరు హీరో పాత్రల కోసం తమిళ నటులు ఆర్య, జీవాలను సంప్రదిస్తున్నారు.

వాల్ పేపర్: మాళవిక

నేటి పాట: ఎన్నాళ్లో వేచిన ఉదయం (మంచి మిత్రులు)

చిత్రం: మంచి మిత్రులు (1969)
రచన: సి. నారాయణరెడ్డి
సంగీతం: ఎస్.పి. కోదండపాణి
గానం: ఘంటసాల, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం

ఎస్.పి.: ఎన్నాళ్లో వేచిన ఉదయం
             ఈనాడే.. ఎదురౌతుంటే   ||ఎన్నాళ్లో||
ఘంటసాల: ఇన్నినాళ్లు దాచిన హృదయం
                   ఎగిసి ఎగిసిపోతుంటే..
ఎస్.పి.: ఇంకా తెలవారదేమి, ఈ చీకటి విడిపోదేమి                          
ఘంటసాల: ఇంకా తెలవారదేమి, ఈ చీకటి విడిపోదేమి
ఎస్.పి.: మంచిని పెంచిన మనిషిని ఏ వంచన ఏమీ చేయదని
             నీతికి నిలబడువానికి ఏనాటికి ఓటమి లేదని   ||నీతికి||
             నే చదివిన జీవిత పాఠం నీకే నేర్పాలనివస్తే
             ఇంకా తెలవారదేమి, ఈ చీకటి విడిపోదేమి   ||ఇంకా||
ఘంటసాల: నాగులు తిరిగే కోనలో ఏ న్యాయం పనికిరాదని
                   కత్తులు విసిరేవానిని, ఆ కత్తితోనె గెలవాలని  ||కత్తులు||
                   నేనెరిగిన చేదునిజం నీతో చెప్పాలని వస్తే
                   ఇంకా తెలవారదేమి, ఈ చీకటి విడిపోదేమి    ||ఇంకా||
ఎస్.పి.: ఎన్నాళ్లో వేచిన ఉదయం
             ఈనాడే.. ఎదురౌతుంటే
ఘంటసాల: ఇన్నినాళ్లు దాచిన హృదయం
                   ఎగిసి ఎగిసిపోతుంటే..
ఎస్.పి.: ఇంకా తెలవారదేమి, ఈ చీకటి విడిపోదేమి
ఘంటసాల: ఇంకా తెలవారదేమి, ఈ చీకటి విడిపోదేమి

Wednesday, October 13, 2010

వాల్ పేపర్: మధుశర్మ

నేటి పాట: నిన్న మొన్న రేకువిప్పిన (బడిపంతులు)

చిత్రం: బడిపంతులు (1972)
రచన: ఆత్రేయ
సంగీతం: కె.వి. మహదేవన్
గానం: ఘంటసాల, పి. సుశీల

అతడు: నిన్న మొన్న రేకువిప్పిన లేతమొగ్గా
నీకు ఇంతలోనే నన్ను చూస్తే అంత సిగ్గా

ఆమె: నిన్న మొన్న రెక్కలొచ్చిన గండు తుమ్మెదా
నీకు అంతలోనే నన్ను చూస్తే ఇంత తొందరా

అతడు: పరికిణీలు కట్టినప్పుడు లేని సొగసులు
నీ పైటకొంగు చాటున దోబూచులాడెను

ఆమె: పసితనాన ఆడుకున్న తొక్కుడు బిళ్లలు
నీ పరువానికి నేర్పినవీ దుడుకు కోర్కెలు   ||నిన్న||

అతడు: పాలబుగ్గలు పూచె లేత కెంపులు
వాలు చూపులందు దోచె వయసు జోరులు

ఆమె: చిరుత నవ్వులు ఒలికె చిలిపితనాలు
చిన్ననాటి చెలిమితీసె వలపుదారులు    ||నిన్న||

అతడు: ఇన్నాళ్లూ కళ్లుకళ్లు కలిపి చూస్తివి
ఇప్పుడేం రెప్పలలా రెపరెపన్నవి

ఆమె: ఇన్నాళ్లూ నీ కళ్లు వూరుకున్నవి
ఇపుడేవేవో మూగబాస లాడుచున్నవి   ||నిన్న||                      

వాల్ పేపర్: మధురిమ

సినిమా: మంచి సినిమాకి మంచి రోజులు? (చివరి భాగం)

కథనమే కాదు కథా ముఖ్యమే
సరే, ఇక్కడ మనం ప్రస్తావిస్తున్న చిన్న చిత్రం అంటే చెత్త సినిమా కాదు, 'బి' గ్రేడ్ సినిమా అంతకంటే కాదు. చిన్న సినిమా పేరుతో వచ్చే 'బి' గ్రేడ్ సినిమాల వల్లే వాటికి చెడ్డ పేరు వచ్చింది. కానీ ఇక్కడ చిన్న సినిమా అంటే 'ఆనంద్', 'హ్యాపీడేస్', 'వినాయకుడు', 'గమ్యం' లాంటి నవ్య సినిమాలు. బడ్జెట్ పరంగానే అవి చిన్న సినిమాలు కానీ, భారీ బడ్జెట్ తో తీసిన ఎన్నో స్టార్ల సినిమాల కంటే అవి మంచి సినిమాలు, పెద్ద సినిమాలు. మనం చెప్పుకుంటోంది అలాంటి చిన్న, మంచి సినిమాల గురించి. మల్టీప్లెక్స్ విప్లవం మొదలైన కాలంలో ఇక భవిష్యత్ అంతా స్వతంత్ర సినిమాదే అనే అభిప్రాయం కలిగిందనేది నిజం. అయితే అది అనుకున్నంత వేగంగా జరగడం లేదనేదీ వాస్తవం. కారణం కథలో కంటే కథనంలోనే ఎక్కువ కొత్తదనం కనిపిస్తుండటం. థియేటర్లకు వెళ్లకుండా ఇంట్లో వీడియోల్లోనూ, టీవీల్లోనూ సినిమాలు చూడటం మొదలుపెట్టిన వాళ్లు కూడా ఇప్పుడు కనీసం వారాంతాల్లోనైనా సినిమా హాళ్లకు రావాలనుకుంటున్నారు. ఈ తరహా ప్రేక్షకులకి కొత్త తరహా కథలు, కథనాలు కావాలి. స్వతంత్ర సినిమా దర్శకులకి కావలసింది ఇదే. 'తక్కువ బడ్జెట్ తో సినిమా తీసి విడుదల చేస్తే చాలు - శాటిలైట్, వీడియో హక్కులతో పెట్టుబడి అంతా వచ్చేస్తుంది' అనే అభిప్రాయంతో కొంతమంది దర్శకులు కథ, కథనాల మీద ఎక్కువ శ్రద్ధ పెట్టకుండా సినిమాలు తీసి, చెడ్డపేరు తెచ్చుకున్నారు. ఈ ధోరణిని మార్చుకుని హద్దుల్ని చెరిపేసే రీతిలో కష్టపడి పనిచేసి, కొత్తదనంతో సినిమాలు తీయకపోతే నవ్య సినిమాకి ఈరోజు ఉన్న మంచి అవకాశాన్ని జారవిడుచుకున్నవాళ్లు అవుతారు.
ఇవాళ విలక్షణమైన కథ, కథనాలతో తీస్తున్న దర్శకులు ఇద్దరు ముగ్గురు కంటే ఎక్కువమందే ఉండటం తెలుగు సినిమాకి సంబంధించి శుభపరిణామం. వాళ్లు తీసే నాణ్యమైన సినిమాల సంఖ్య ఏడాదికి పది మించగలిగితే స్టార్లు సైతం తమ అభిప్రాయాల్ని మార్చుకుని, ఆ దర్శకులతో పనిచేయాలని ఉవ్విళ్లూరుతారు. శేఖర్ కమ్ముల ఈమధ్య రూపొందించిన 'లీడర్' సినిమాని గానీ, కొత్త దర్శకుడు చైతన్య దంతులూరి తీసిన 'బాణం'ని గానీ, దేవా కట్టా డైరెక్ట్ చేసిన 'ప్రస్థానం'ని గానీ స్టార్ వాల్యూ ఉన్న నటులు చేసినట్లయితే పెద్ద హిట్లయ్యేవి. అయితేనేం, వాటి ద్వారా ఆ దర్శకుల ప్రతిభ బయటపడింది. వాటి వల్ల ఇద్దరు ముగ్గురు ప్రతిభావంతులైన నటులు పరిచయమై, భవిష్యత్ మీద ఆశలు రేకెత్తించారు. ఇదే స్పిరిట్ తో స్వతంత్ర సినిమా దర్శకులు ముందుకు అడుగేయాలి. తెలుగులో మంచి సినిమాలకు కొదవలేదనే పేరు వచ్చే అవకాశం ఉంది వాళ్ల వల్లనే.  (అయిపోయింది)                         

ఇంటర్వ్యూ: ఎన్టీఆర్

"ఇందులో నా పాత్ర పేరు కృష్ణ. ఒక యాక్టర్‌కి విందుభోజనం లాంటి పాత్ర. అన్ని రకాల ఎమోషన్స్, షేడ్స్ కలగలిపి ఉన్న పాత్ర. 'బృందావనం'లో మెయిన్ హైలైట్ ఎన్టీఆర్ కొత్తగా కనిపించడం'' అని చెప్పారు ఎన్టీఆర్. ఆయన హీరోగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై రాజు నిర్మించిన 'బృందావనం' ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. వంశీ పైడిపల్లి దర్శకుడు. 'శక్తి' షూటింగ్‌లో బిజీగా ఉన్న ఎన్టీఆర్ ఆ సినిమా సెట్స్‌పై మంగళవారం ప్రత్యేక ఇంటర్వ్యూలో 'బృందావనం' గురించీ, అనేక ఇతర అంశాల గురించీ విపులంగా మాట్లాడారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే..


నా కెరీర్‌లో తిరిగి చూసుకుంటే మిగిలిపోయే సినిమా 'బృందావనం'. ఇంతదాకా రెగ్యులర్ ఫార్ములా సినిమాలు, మాస్ మసాలా సినిమాలు చేస్తూ వస్తున్నా. 'బృందావనం' కమర్షియల్ అంశాలు ఉంటూనే ప్రేమ, ఫ్యామిలీ అనుబంధాల మీద ఎక్కువ దృష్టి పెట్టి చేసిన సినిమా. 'బృందావనం' అనేది ఓ ఇంటిపేరు. బృందావనంలో కృష్ణుడు ఉంటే ఎంత కళకళలాడిపోతుంటుందో, ఇదీ అలా కళకళలాడే సినిమా. ఎలాంటి బృందావనంని ఎలాంటి బృందావనంగా నేను మార్చాననేదే ఈ సినిమాలోని ప్రధానాంశం.
విందుభోజనం లాంటి పాత్ర 
ఇందులో నా పాత్ర పేరు కృష్ణ. నాకు బాగా నచ్చిన క్యారెక్టర్. ఒక యాక్టర్‌కి విందుభోజనం లాంటి పాత్ర. అన్ని రకాల ఎమోషన్స్, షేడ్స్ కలగలిపి ఉన్న పాత్ర. బాగా కష్టపడి చేశాను. ఒక మంచి ప్రయత్నమైతే మేం చేశాం. ఎన్టీఆర్‌ని కొత్త కోణంలో చూపించిన సినిమా. అంతేకానీ సూపర్‌హిట్ సినిమా చెయ్యాలనే ఉద్దేశంతో చేసిన సినిమా కాదు. సక్సెస్‌లో టీమ్ వర్క్ ఎంత ఉంటుందో, ఫ్లాపులోనూ టీమ్ వర్క్ అంతే ఉంటుంది. అది ఏ ఒక్కరి క్రెడిటో కాదు. 'బృందావనం'లో మెయిన్ హైలైట్ ఎన్టీఆర్ కొత్తగా కనిపించడం. కొరటాల శివ డైలాగ్స్, తమన్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, ఛోటా కె. నాయుడు సినిమాటోగ్రఫీ సినిమాని అందంగా మలిచాయి. పాటల్లో 'నిజమేనా నిజమేనా' బాగా ఇష్టం.
పోటాపోటీ నటన 
కాజల్, సమంతా - ఇద్దరూ ప్రొఫెషనల్స్. భూమి, ఇందు పాత్రల్లో ఇద్దరూ బాగా కష్టపడ్డారు. పోటాపోటీగా చేశారు. ఇద్దరికీ మంచి భవిష్యత్ ఉంది. వాళ్లని కేవలం గ్లామర్ కోసం పెట్టుకోలేదు. పర్ఫార్మెన్స్‌కి కూడా స్కోప్ ఉన్న పాత్రలు వాళ్లవి. వాళ్లే కాదు, శ్రీహరి, ప్రకాశ్‌రాజ్ కూడా తాము తప్ప ఆ పాత్రల్ని ఇంకెవ్వరూ చేయ్యలేరనే అభిప్రాయం కలిగించే విధంగా చేశారు. కోట శ్రీనివాసరావుగారు అద్భుతంగా నటించారు. చాలా రోజులకి ఆయనలోని నటుణ్ణి పీక్ స్టేజ్‌లో చూశా. ఒక మంచి ఆర్టిస్టుకి మంచి పాత్ర ఇస్తే ఎలా చేస్తారో ఆయన నటన చూస్తే తెలుస్తుంది.
పెయింటింగ్‌లా తీశాడు 
సినిమాని వంశీ చాలా బాగా తీశాడు. ఒక అద్భుతమైన దర్శకుడిగా తయారయ్యే లక్షణాలు అతనిలో కనిపిస్తు న్నాయి. చెప్పిన కథ కన్నా బాగా తీశాడు. ప్రతి ఫ్రేమ్‌ని ఒక పెయింటిం గ్‌లా, చాలా అందంగా తీశాడు. 'బ్యూటిఫుల్ పిక్చరెస్క్' అంటారే - అది 'బృందావనం'లో అడుగడుగునా కనిపిస్తుంది. నా వరకు అయితే వందకి వంద మార్కులు కొట్టేశాడు. 'మున్నా' రూపంలో అతని తొలి ప్రయత్నం ఫలించలేదంతే. అతను ఫ్లాప్ కాదు. 'మున్నా' స్క్రిప్టు ఫ్లాపయ్యిందేమో కానీ డైరెక్టర్‌గా పాసయ్యాడు. చాలా స్టైలిష్‌గా ఆ సినిమాని తీశాడు. అలాంటి డైరెక్టర్ మంచి కథ చేస్తే ఎలా ఉంటుందనేదానికి 'బృందావనం' ఒక నిదర్శనం. అంత బలమైన కథ ఇది.
రాజుకు సినిమా పిచ్చి 
దిల్ రాజు సినిమా మీద తపన ఉన్న నిర్మాత. ఆయనకు సినిమా అంటే పిచ్చి, వ్యామోహం, వ్యాధి. ఎవరితో చేసినా ఒకే విధమైన తపనతో తీస్తారు. బ్యానర్ విలువ పెరగాలనే కించిత్ స్వార్థం కూడా అందులో ఉంటుంది. నాకు దర్శకుడే పనిచేయాలని ఉంటుంది. దర్శకుడికి మనం సలహాలు ఇవ్వాలే కానీ మన అభిప్రాయాల్ని అతని మీద రుద్దకూడదు. ఆ విషయంలో దర్శకుడికి రాజు చాలా స్వేచ్ఛనిచ్చారు. అమోఘంగా ఈ సినిమాని నిర్మించారు. అందుకే అద్భుతమైన టీమ్‌తో పనిచేసిన ఫీలింగ్ నాది.
గ్రాఫిక్స్ వల్లే ఆలస్యం 
8న రిలీజ్ చెయ్యాలనుకున్నారు కానీ సెన్సార్ అయ్యింది 7నే. అంటే 8న విడుదల చెయ్యడం అసాధ్యం. 14 విడుదల అనేది కావాలని చేసిన పోస్ట్‌పోన్ కాదు. అన్నీ మనకు అనుకూలంగా జరగవు. ఈ సినిమాకి సెట్స్‌మీద 130 రోజులు కష్టపడ్డాం. కొన్ని అనుకున్న టైమ్‌కి అవుతాయి. కొన్ని అవవు. గ్రాఫిక్స్ వల్లే పోస్ట్ ప్రొడక్షన్ కాస్త లేటయ్యింది. అందుకే రిలీజ్ డేట్ 14కి జరిగింది.
ప్రేక్షకుల కోసమే సినిమా 
నా కెరీర్‌లో హిట్లు, ఫ్లాపులు చూశా. ఇప్పుడు వాటికి అతీతమై పోయా. మనం హిట్టవుతాయనుకున్నవి హిట్లవ్వవు. ఫ్లాపవుతాయనకున్నవి కావు. మనం చేసేది ప్రేక్షకుల కోసమే. ఒకే ఫార్ములాకి పరిమితమవుతున్నామా అనే భావన మొదలైంది. నాకు ఎన్టీ రామారావుగారు ఇన్‌స్పిరేషన్. ఆయన ఒకదానికొకటి పొంతనలేని ఎన్నెన్నో భిన్నమైన ప్రాతలు చేసుకుంటూ పోయారు. పౌరాణికాలు, జానపదాలు, సోషియో ఫాంటసీలు, సాంఘిక సినిమాల్లో సందేశాత్మకాలు, సెంటిమెంట్ సినిమాలు, వినోదాత్మక చిత్రాలు, మాస్ సినిమాలు, క్లాస్ సినిమాలు.. ఇలా ఎన్నో చేశారు. అందుకే ఆయన ఆల్‌రౌండర్ అయ్యారు. నాకు 'బొమ్మరిల్లు', 'కొత్త బంగారులోకం' సినిమాలు బాగా ఇష్టం. కానీ అలాంటివి చేయాలనుకున్నా చేయలేను. మాస్‌ని వొదులుకోకుండానే కొత్తకోణంలో, కొత్తరకంగా చెయ్యాలని చేసిన సినిమా 'బృందావనం'.
ఎవడి పని వాడిదే 
నాకు కథ చెప్పిన తర్వాత ఫైనల్ నెరేషన్ అడుగుతా. అది నచ్చితే ఇక వదిలేస్తా. నాకు తెలిసింది యాక్టింగ్ ఒక్కటే. ఎవడి పని వాడు చెయ్యాలి. ఒక్కొక్కరిది ఒక్కో టాలెంట్. కథ పూర్తిగా వినేవరికే నా జోక్యం కానీ, ఇన్‌వాల్వ్‌మెంట్ కానీ ఉంటుంది. అప్పుడైనా సజెషన్స్ ఇస్తానే కానీ ఇలాగే ఉండాలని శాసించను.
ఆ రోజులు వేరు 
థియేటర్లు మూత పడుతుండటానికీ, జనం థియేటర్లకు రాకపోతుండటానికి పది రకాల కోణాలుంటాయి. వాటిలో స్టార్ల సినిమాలు ఎక్కువగా లేకపోవడం కూడా ఒకటనేది నిజమే. ఎన్టీ రామారావు గారు ఓ ఏడాది పదిహేను సినిమాలు, కృష్ణగారు పద్దెనిమిది-ఇరవై సినిమాలు చేసిన సందర్భాలున్నాయి. ఆ రోజులు వేరు. ఈ రోజులు వేరు. మనది ప్రపంచ మార్కెట్ ఉన్న సినిమా కాదు. హాలీవుడ్‌లో 'అవతార్', '2012' సినిమాలకు వందల కోట్ల డాలర్లు వెచ్చించి అత్యున్నత ప్రమాణాలతో తీశారు. బ్రహ్మాండంగా ఆడాయి. అంత బడ్జెట్‌తో మనం సినిమాలు తియ్యలేం. అప్పట్లో 'యమగోల'ని రెండు మూడు నెలల్లో తీస్తే, ఇవాళ 'యమదొంగ' తియ్యడానికి ఏడాది పట్టింది. నా వరకు నేను ఏడాది మూడు సినిమాలు చెయ్యాలని అనుకుంటున్నా. అది జరుగుతుందో, లేదో తెలీదు. దర్శకులు, నిర్మాతల కృషి కూడా కావాలి. ఇది కేవలం ఆర్టిస్టులతో అయ్యే పనికాదు.
పబ్బులకు దూరం 
'బృందావనం' నుంచి ఇప్పుడు చేసున్న 'శక్తి'కి వరుసగా 135 రోజులు షూటింగ్ చేశా. మధ్యలో అమ్మమ్మ చనిపోయినప్పుడు ఓ రెండు రోజులు మాత్రమే సెలవు తీసుకున్నా. నేనెంతగా పనిచేస్తున్నాననే దానికి ఇదో నిదర్శనం. ఎప్పుడైనా తీరిక దొరికితే ఇంట్లోనే ఉండి అమ్మతో ఎక్కువగా గడుపుతుంటా. నన్ను నన్నుగా చూసే అద్భుతమైన స్నేహితులు నాకు దొరికారు. వాళ్లలో ఇండస్ట్రీ లోపలి, బయటి వాళ్లిద్దరూ ఉన్నారు. నేను పబ్బులు, డిస్కోథెక్కులకు వెళ్లను. ఆ వాతావరణం నాకు నచ్చదు.
నేనింకా ఎదగాలి 
'దానవీరశూరకర్ణ' వంటి పౌరాణికం చెయ్యాలంటే నేనింకా ఎదగాలి. రామారావుగారంత కాకపోయినా ఆయనలో కొంతైనా చెయ్యగలగాలి కదా. దుర్యోధనుడి పాత్ర చెయ్యడమంటే ఒక యుద్ధం చెయ్యడం లాంటిది. దానికి నేనింకా రెడీ కాలేదు. 'యమదొంగ'లో యముడిగా ఒక ప్రయత్నం లాంటిది చేశా. సక్సెస్ అయ్యా. అయితే నేనేం చేసినా రామారావుగారితో పోలిక వస్తుంది. చేస్తే ఆయనలో 80 శాతమన్నా సక్సెస్ చేయగలగాలి. నాలో ఆ పరిణతి ఇంకా రావాలి. పైగా అలాంటి సినిమా చెయ్యగల దర్శకుడు ఉండాలి, అలాంటి స్క్రిప్టు రావాలి. నిర్మాత కావాలి. చెయ్యగలననే ధైర్యం నాలో ఉండాలి.
వచ్చే మార్చిలో 'శక్తి' 
ప్రస్తుతం 'శక్తి' షూటింగ్ జరుగుతోంది. తెలుగు చిత్రసీమలోని అత్యంత భారీ బడ్జెట్ సినిమాల్లో ఒకటిగా అది తయారవుతోంది. 'శక్తి' శక్తిగానే ఉంటుంది. ఇందులో చాలా చాలా గ్రాఫిక్స్ ఉన్నాయి. ఇంకా చాలా వర్క్ ఉంది. వచ్చే ఏడాది మార్చిలో వస్తుందనుకుంటున్నా. మరికొన్ని చర్చల స్థాయిలో ఉన్నాయి. ఫైనలైజ్ అయ్యాక వాటి వివరాలు చెబుతా.
పెళ్లి వచ్చే ఏడాది 
నా పెళ్లి నవంబర్‌లో అనే ప్రచారం జరుగుతోంది. కానీ నవంబర్‌లో నా పెళ్లి లేదు. వచ్చే ఏడాది ఉంటుంది. ఎప్పుడనేది నేనే చెబుతా. నేను సాంప్రదాయక పెళ్లి చేసుకుంటున్నా. మా అమ్మా నాన్న వెతికి చూసిన సంబంధం. అలాగే పెళ్లి బట్టల కోసం బ్యాంకాక్ వెళ్లాననే ప్రచారంలో కూడా ఏమాత్రం నిజంలేదు. పెళ్లిలో నేను వేసుకునేవి కూడా సాంప్రదాయకమైనవే. సూటూ బూటూ వేసుకుని చేసుకోను. అభిమానుల మధ్య పెళ్లి చేసుకోవాలనేది నా కోరిక. ఎంతవరకు వీలవుతుందో చూడాలి. లక్ష్మీ ప్రణతితో మాట్లాడుతుంటా కానీ కలవడం బాగా తక్కువ.

గేలరీ: బిందుమాధవి






Tuesday, October 12, 2010

సినిమా: మంచి సినిమాకి మంచి రోజులు? (2వ భాగం)

ఆక్సిజన్ ఇచ్చిన 'ఆనంద్'
నిజం చెప్పాలంటే 1989లో రాంగోపాల్ వర్మ అనే కొత్త దర్శకుడు తీసిన 'శివ' సైతం స్వతంత్ర సినిమా అనే చెప్పాలి. అయితే అందులో హీరో నాగార్జున స్టార్ కావడం వల్లే ఆ సినిమా కోట్ల రూపాయల్లో వసూళ్ల వర్షాన్ని కురిపించింది. దాదాపు అదే సమయంలో తమ్మారెడ్డి భరద్వాజ్ రూపొందించిన 'అలజడి' చిత్రం సైతం స్వతంత్ర సినిమానే. స్టార్లు లేకపోవడం వల్లే ఆ సినిమా 'శివ' స్థాయి విజయాన్ని నమోదు చేయలేకపోయింది.  అయినప్పటికీ దానినీ చెప్పుకోదగ్గ స్థాయిలోనే ప్రేక్షకులు చూశారు.
ఇటీవలి కాలానికొస్తే స్టార్లు లేకుండా 'మంచి కాఫీలాంటి సినిమా' అంటూ శేఖర్ కమ్ముల రూపొందించిన 'ఆనంద్' సినిమాకి పెట్టుబడి పెట్టేందుకు గానీ, దాన్ని విడుదల చేయడానికి గానీ ఎవరూ ముందుకు రాలేదు. అయినా కేవలం తన పనినీ, తన సినిమానీ నమ్ముకున్న శేఖర్ రాష్ట్రం మొత్తం మీద కేవలం మూడంటే మూడు ప్రింట్లతో 'ఆనంద్'ని విడుదల చేస్తే, ఆ తర్వాత అది ఎంత సంచలనాన్ని సృష్టించిందీ, స్వతంత్ర సినిమా దర్శకుడిగా శేఖర్ కి ఎంత మైలేజ్ ఇచ్చిందీ మనకు తెలియంది కాదు. 'ఆనంద్' సినిమా మంచి సినిమా దర్శకులకి అక్సిజన్ లాగా పనిచేసిందని చెప్పాలి.
మూస పంథాలో తీస్తే తప్ప జనం చూడరనే అభిప్రాయం అందరిలో ఉంది. ఆ అభిప్రాయం తప్పని అప్పట్లో 'శివ', ఇప్పట్లో 'ఆనంద్' నిరూపించాయి. అయినప్పటికీ 'కమర్షియల్ ఉచ్చు'లో ఉండేందుకే ఇష్టపడే నిర్మాతలు తాము మార్కెట్ ఉందనుకున్న ఒక స్టార్ హీరోని పెట్టి 20 కోట్ల రూపాయలయినా ఖర్చుచేసి సినిమా తీస్తున్నారు కానీ, దానివల్ల నష్టాలు వచ్చినా భరిస్తున్నారు కానీ ఒక చిన్న చిత్రం మీద ఒక కోటి రూపాయలు వెచ్చించేందుకు మాత్రం అనాసక్తి ప్రదర్శిస్తున్నారు. వాళ్లకి మరోరకంగా సినిమా నిర్మించడం తెలియకపోవడమే దీనికి కారణమంటే కరెక్టుగా ఉంటుంది. సినిమా నిర్మాణంలో వారికి అర్థమయ్యే ఒకే ఒక అంశం టేబుల్ ప్రాఫిట్. అది రావాలంటే ఒక స్టార్ హీరో లేదా స్టార్ డైరెక్టర్ ఉండాలి. ఇక స్టార్ హీరోలు, స్టార్ డైరెక్టర్లకు కూడా వాళ్లదైన ఒక అజెండా ఉంటుంది. ఫలానా తరహా సినిమాలనే ప్రేక్షకులు ఇష్టపడతారని వాళ్లు అనుకుంటూ ఉంటారు. కానీ చిత్రమేమంటే వాస్తవాలు అందుకు భిన్నంగా ఉంటాయి. వాళ్లు నటించే సినిమాల్లో సక్సెస్ అయ్యేది 15 నుంచి 20 శాతమే. అంటే ప్రేక్షకుల ఆదరణ పొందాలనే లక్ష్యంతో తీసిన సినిమాల్లో అత్యధిక శాతం పరాజయం పాలవుతుంటాయి. వాటికి పెట్టిన డబ్బులు కూడా తిరిగిరావు. అయినా స్టార్ల దృక్పథంలో మార్పు రావడం లేదు.  (ఇంకావుంది)                      

Sunday, October 10, 2010

సినిమా: మంచి సినిమాకి మంచి రోజులు? (1వ భాగం)

గ్రామీణ ప్రాంతాల్లో సినిమా థియేటర్లు ఒక్కొక్కటే మూతపడుతూ పట్టణాలు, నగరాల్లో మల్టీప్లెక్సుల సంఖ్య పెరుగుతుండటంతో తెలుగు సినిమా నిర్మాణ ఫార్ములా క్రమేపీ మార్పుకు గురవుతోంది. 'స్టార్ మేనియా' ఇప్పటికీ కొనసాగుతున్నా కొత్త తరహా కథాకథనాలతో వస్తున్న సినిమాలు సైతం కొద్దో గొప్పో ఆదరణ పొందుతున్నాయి, 'మంచి సినిమా'గా పేరు తెచ్చుకుంటున్నాయి. చంద్రసిద్ధార్థ్, శేఖర్ కమ్ముల, రవిబాబు, దేవా కట్టా, సాయికిరణ్ అడివి, క్రిష్, చైతన్య దంతులూరి, మధుర శ్రీధర్ వంటి దర్శకులు మంచి సినిమా పట్ల ఆశలు రేకెత్తిస్తున్నారు.
'ఆ నలుగురు' ఆదర్శం
ఆరు సంవత్సరాల క్రితం వచ్చిన 'ఆ నలుగురు' సినిమా ఈ నవ్య పంథాకు మార్గదర్శకంగా నిలిచిందని చెప్పాలి. చంద్రసిద్ధార్థ్ రూపొందించిన ఆ సినిమా 2004 సంవత్సరానికి ఉత్తమ చిత్రంగా నంది అవార్డు పొందడమే కాక, ఉత్తమ నటునిగా రాజేంద్రప్రసాద్ కీ, ఉత్తమ క్యారెక్టర్ నటునిగా కోట శ్రీనివాసరావుకీ అవార్డులు సంపాదించి పెట్టింది. అన్నింటికీ మించి ఆ సినిమాని చెప్పుకోదగ్గ రీతిలో ప్రేక్షకులు సైతం ఆదరించారు. తన సినీ జీవితంలో 'ఆ నలుగురు' సినిమా ఓ మైలురాయి లాంటిదని రాజేంద్రప్రసాద్ గర్వంగా చెప్పుకోవడమే ఈ సినిమా గొప్పతనాన్ని చాటి చెబుతుంది. తన సంపాదనలో సగాన్ని ప్రజోపయోగ కార్యక్రమాలకు వెచ్చించే ఓ దినపత్రిక సంపాదకుడు రఘురామ్ తన మనసుకు విరుద్ధమైన పని చేయాల్సి వస్తే ఎలాంటి సంఘర్షణకు గురవుతాడు, అతడు చినిపోయాక కూడా అతని ఆత్మ ఎంతగా క్షోభిస్తుందనే అంశాన్ని హృద్యంగా చిత్రించిన విధానం అందరి ప్రశంసల్నీ పొందింది. మంచి సినిమా దర్శకుడిగా చంద్రసిద్ధార్థ్ ఎంతో పేరు తెచ్చుకున్నాడు. అయితే అతను కేవలం మంచి సినిమా దర్శకుడే కాదు, 'స్వతంత్ర సినిమా' దర్శకుడు కూడా. 'స్టార్' విలువ మీద ఆధారపడకుండా, నిర్మాత వత్తిళ్లకు తలొగ్గకుండా, తనేం తీయదలచుకున్నాడో, దాన్ని అందంగా, నాణ్యంగా సెల్యులాయిడ్ మీద చిత్రించేవాడూ, మార్కెట్లు, వర్తమాన ధోరణులు, అభిప్రాయాలు, ప్రేక్షకుల అంచనాలు, అమలులో ఉన్న సినిమా రూపకల్పన విధానాల ప్రభావం లేకుండా తీసేవాడూ స్వతంత్ర సినిమా దర్శకుడు అని సూత్రీకరిస్తాడు బాలీవుడ్ లో 'రఘు రోమియో' చిత్ర రూపకర్త రజత్ కపూర్. ఆ రెండు సినిమాలతో పాటు బాలీవుడ్ లో వచ్చిన 'హైదరాబాద్ బ్లూస్', 'మాన్సూన్ వెడ్డింగ్', 'సత్య', 'ఝంకార్ బీట్స్', 'దేవ్ డి', 'హరిశ్చంద్రాచ్చి ఫ్యాక్టరీ', 'ఖర్గోష్' వంటి సినిమాలు స్వతంత్ర సినిమా జెండాని నిలబెట్టేందుకు ఉపకరించాయి. వాటి తరహాలోనే తెలుగులో 'ఆనంద్', 'హ్యాపీడేస్', 'ఎ ఫిల్మ్ బై అరవింద్', 'వినాయకుడు', 'మంత్ర', 'అనసూయ', 'గమ్యం', 'బాణం', 'విలేజ్ లో వినాయకుడు', 'లీడర్', 'ప్రస్థానం', 'అందరి బంధువయ', 'వేదం' వంటి సినిమాలు మంచి సినిమాలుగా పేరు తెచ్చుకున్నాయి. వీటిలో చాలావాటికి ప్రేక్షకాదరణ కూడా ఉండటం ఇక్కడ గమనించాల్సిన అంశం.  (ఇంకావుంది)

నేటి పాట: అమ్మా చూడాలి (పాపం పసివాడు)

చిత్రం: పాపం పసివాడు (1972)
రచన: ఆత్రేయ
సంగీతం: సత్యం
గానం: పి. సుశీల

పల్లవి:
అమ్మా చూడాలి
నిన్నూ నాన్నను చూడాలి
నాన్నకు ముద్దు ఇవ్వాలి -
ఒడిలో నిద్దుర పోవాలి    ||అమ్మా||
                          
చరణం 1:
ఇల్లుచేరే దారే లేదమ్మా
నిన్ను చూసే ఆశే లేదమ్మా
నడవాలంటే ఓపిక లేదు
ఆకలి వేస్తూంది    ||అమ్మా||

చరణం 2:
పలికేందుకు మనిషే లేడు
నిలిచేందుకు నీడే లేదు
బాధగ వుంది భయమేస్తూంది
ప్రాణం లాగేస్తూంది..    ||అమ్మా||

గేలరీ: భూమిక








వాల్ పేపర్: భావన

మహిళ: ఆనాటి స్త్రీని మేల్కొలిపిన 'అనసూయ' (చివరి భాగం)

ఆనాటి సంఘంలో స్త్రీల పరిస్థితి ఎంత దయనీయంగా ఉండేదంటే.. "ఆ కాలంలో స్త్రీల స్థితి చాలా హైన్యంగా ఉండేది. మూర్ఖత్వానికి స్త్రీలు పుట్టినిండ్లుగా ఉండేవారు. వితంతువుల నిర్బంధనలు, కోడండ్రికములు చాలా ఎక్కువగా ఉండేవి.. ఇంతలో వరకట్నాలొకటి వచ్చిపడ్డాయి. వీటి మూలంగా ఆడపిల్లల అభివృద్ధి ఆగిపోయింది. ఆడపిల్ల పుట్టిందంటే పెళ్లి ఎలా చేస్తుమాని విచారిస్తున్నారు... మా కాలంలో ఆడపిల్లలను కన్న దరిద్రులెవరన్నా ఉంటే ఏ ముసలికో, ముతక్కో ఇచ్చి చేసేవారు. అంతేకానీ ఈ మాదిరిగా బేరంపెట్టి మర్యాదస్తులు, ధనవంతులు, పరువుగలవారు కూడా మగపిల్లలను అమ్ముకోవడం యెరగం. ఆత్మగౌరవం గల విద్యార్థులు ఈ అమ్ముడుబోవడానికి ఎలా ఒప్పుకుంటారో తెలియదు" (అప్పుడు-ఇప్పుడు-వృద్ధురాలు- 1920 మార్చి సంచిక). ఇప్పుడూ ఆ విద్యార్థుల ఆత్మగౌరవంలో మార్పేమీ లేదు కద!
స్త్రీలలో ఎప్పటికీ మారని గుణం ఉన్నది. అది తమ జాతిని తామే దూషించడం. ఇట్లాంటివి వద్దంటారు గుడుపూడి ఇందుమతీ దేవి తమ 'బ్రాహ్మణ వివాహ ప్రహసనము'లో. ఇందులో ఓ చోట చారుమతి అంటుంది.. "మన జాతిని మనమే దూషించితే, పురుషులేమనవలె? మనకు సరియైన విద్య లేకనే మనకీ మూర్ఖత్వము వదలకున్నది". ఇందులోనే మంగమ్మ "తెలియక మనవాళ్లు పోట్లాడుతారు గాని మూర్ఖాచారం వదిలితే దేశమే బాగుపడును. ముందొక నాచారమును కొత్తగా నాచరణలోనికి దెచ్చువారు ప్రథమమున చాలా ఇక్కట్లకు తలయొగ్గవలె. తర్వాత అందరూ చేస్తారు" అంటుంది.
మొత్తం మీద 'అనసూయ'లో స్త్రీలను చైతన్యవంతులను చేయాలనే తాపత్రయం కనిపిస్తుంది. విద్యవలనే అది సాధ్యమవుతుందనే ఉద్దేశం అందులో స్పష్టమవుతుంది. 'అనసూయ'కి కేవలం స్త్రీలే కాదు, పురుషులు కూడా రచనలు పంపేవారు. కృష్ణశాస్త్రి కవితలు కూడా కొన్ని వచ్చాయి. 'అన్వేషణము', 'అనుతాపము' లాంటి కవితలు వాటిలో ఉన్నాయి. విజ్ఞానదాయకమైన వ్యాసాలెన్నింటినో వెంకటరత్నమ్మ తన పత్రికలో ప్రచురించేవారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల మధ్యమధ్యలో పత్రిక రావడం ఆలస్యమైనా భరించి రెండునెలలకి కలిపి ఒక సంచికను తీసుకొచ్చేవారామె. 1917లో మొదలైన పత్రిక ఎంతవరకూ వచ్చిందో కచ్చితంగా తెలీదు కానీ 1924 జూలై సంచిక వరకు పత్రిక లభ్యమవుతున్నది. ఆర్థిక ఇబ్బందుల మూలంగానే ఆ పత్రిక ఆగిపోయిందనుకోవచ్చు. ఏదేమైనా స్త్రీవిద్య, సమానత్వం కోసం స్వాతంత్ర్యానికి పూర్వమే స్త్రీ సంపాదకత్వంలో వచ్చిన ఓ గొప్ప మాసపత్రికగా 'అనసూయ'కి స్థానం ఉంటుంది.  (అయిపోయింది)                          

Saturday, October 9, 2010

వాల్ పేపర్: ఐశ్వర్యారాయ్

మహిళ: ఆనాటి స్త్రీని మేల్కొలిపిన 'అనసూయ' (2వ భాగం)

హూవి తల్లి భర్తని విడిచిపెట్టి వెళ్లిపోతుంది. అందుకని తండ్రి హూవితో "నీ తల్లిని నేను విడిచిపెట్టలేదనియు, అదియే నన్ను విడిచిపోయెననియు నీవెరుగుదువా?" అని అన్నప్పుడు "అట్లామె నిన్ను విడిచినదని విని నేను గర్వపడుచున్నాను. మా యాడువాండ్రు నీవు త్రోలి డబ్బును గడియించు గుర్రమువంటి వారు కాదని నిదర్శనపూర్వకముగా నీకామె చూపినది" అని సమాధానమిస్తుంది హూవి. మరో సందర్భంలో 'కులము వారికి నాయందముతో జోక్యము లేదు. నేనడగుటయే తడవుగ వరులు నాకు లభింతురని నీవనుచుంటివి. కాని వధువులంత చులకనగ లభ్యము కారని నేను జూపింపదలచుకున్నాను" అనేందుకు సాహసిస్తుంది హూవి. ఇప్పటి పరిస్థితుల్లోనూ హూవిలా ధైర్యంగా చెప్పగలిగే యువతులు లేరు. కాని అప్పట్లోనే అలాంటి భావాల్ని పత్రికలో ప్రకటించడం అంటే సామాన్యం కాదు.
పూర్వకాలంలో మనదేశంలో ఉన్న ఘోషాపద్ధతి మూలంగా స్త్రీలు పురుషుల మాదిరిగా బయటకి వచ్చి చదువుకోవడానికి వీల్లేకుండా ఉండేది. అయితే అవకాశమిస్తే మేధాపరంగా వారు పురుషులకేమాత్రం తీసిపోరు అన్న అంశంతో వెంకటరత్నమ్మ ఒక వ్యాసంలో బాలికల పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా స్త్రీలను మాత్రమే నియమించాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వారిని ఆదర్శంగా తీసుకొని విద్యార్థినులు తయారవుతారని ఆమె భావన.
20వ శతాబ్దంలో మొదటి మూడు దశాబ్దాల కాలం వరకూ బాల్యవివాహాలు చాలా ఎక్కువగా జరుగుతూ ఉండేవి. వితంతువుల కష్టనష్టాలను గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ దురాచారాలపై యుద్ధం ప్రకటిస్తూ గోపిశెట్టి సూర్యనారాయణమ్మ తన 'స్త్రీవిద్య' వ్యాసంలో "ఏమాత్రము వివేకమున్నను స్త్రీలు తమ బిడ్డలకు బాల్యవివాహము చేయనిత్తురా? బిడ్డలకు జేయు పెండ్లిండ్ల వ్యయములో నాల్గవవంతు స్త్రీవిద్యకి వెచ్చించిన, నమూల్యమగు సంతతిని దేశమున నిల్పవచ్చునే" అని ఆవేదన వ్యక్తం చేశారు.
ఏమాత్రం విలువలు పాటించని రాజకీయ నాయకులు మైకుముందు ఎలా మాట్లాడతారో, మైకు దాటి బయటకి వచ్చి ఎలా ప్రవర్తిస్తారో మనకి తెలుసు. అట్లాంటి నాయకుల్ని అనాడే వసంతరావు అమ్మన్న ఒక వ్యాసంలో ఎండగట్టారు. అప్పటి వారసత్వం రాజకీయ నాయకుల్లో ఇప్పటికీ కొనసాగుతోంది కదా!   (ఇంకావుంది)                      

గేలరీ: సిమ్రాన్ ఖాన్




మహిళ: ఆనాటి స్త్రీని మేల్కొలిపిన 'అనసూయ' (1వ భాగం)

తెలుగులో స్త్రీలకోసం స్థాపించిన మొదటి పత్రిక 'సతీహితబోధిని'. దాన్ని స్థాపించినది కందుకూరి వీరేశలింగం పంతులు. గొప్ప సంఘసంస్కర్తగా పేరు తెచ్చుకున్న ఆయనకి స్త్రీలపట్ల ఉన్నవన్నీ గొప్ప భావాలు కావు. ఆయన దృష్టిలో స్త్రీ అవలక్షణాల పుట్ట. అలాంటి స్త్రీని బాగుచేసి ఆదర్శగృహిణిగా నిలపడం గొప్ప సంస్కరణ కింద ఆయన భావించారు. అప్పట్లో సంస్కర్తలమనుకునే వాళ్లకి ఇలాంటి అభిప్రాయమే ఉండేదని తోస్తుంది.
స్వాతంత్ర్యానికి పూర్వమే స్త్రీల సంపాదకత్వంలో పత్రికలు వెలువడటం గొప్ప విషయమైతే అందులో కొన్ని పత్రికలు స్త్రీ విద్యకోసం, తద్వారా స్త్రీలలో చైతన్యం పెంపొందడం కోసం కృషిచేయడం మరింత విశేషమనే చెప్పాలి. 'హిందూసుందరి' స్త్రీ సంపాదకత్వంలో వెలువడిన తొలి పత్రిక. మొసలికంటి రమాబాయి సంపాదకత్వంలో 1902లోనే ఆ పత్రిక ప్రారంభమైంది. అప్పట్లో హిందూసుందరి పత్రిక వెలువడటం అనేది తెలుగుదేశంలో పెద్ద సంచలనాన్ని సృష్టించింది. ఇంతటి పేరు తెచ్చుకోకపోయినా స్త్రీ విద్యపైనా, సమాజంలో ఆనాడు ఉన్న సంఘదురాచారాలపైనా వచ్చిన మరో పత్రిక 'అనసూయ'. 1917లో ప్రారంభమైన ఈ పత్రికకి సంపాదకురాలు వింజమూరి వెంకటరత్నమ్మ. అనసూయ కంటే ముందు వచ్చిన స్త్రీల పత్రికలు హిందూసుందరి కాక సావిత్రి, జనానా, గృహలక్ష్మి అనేవి. వీటిలో హిందూసుందరి తప్ప మిగతా మూడూ అనసూయ వచ్చేనాటికి మాయమయ్యాయి.
"స్త్రీలెచ్చట నుచ్ఛస్థితిలో నుందురో యాదేశ మభివృద్ధిలోనున్న మాటయే. అట్లుండుటకు వారి యజ్ఞానాంధకారము పారద్రోలబడవలయును. వారు పురుషులతో సర్వవిధముల సమానలని యెన్నుకొనబడు నవస్థ రావలయును" (వింజమూరి వెంకటరత్నమ్మ, 1920 జనవరి సంచిక) అనే భావాన్ని వ్యక్తం చేయడం నిజంగా అప్పట్లో సాహసమే. సాహిత్యలోకంలో గొప్ప సంచలనాన్నీ, ప్రకంపనల్నీ పుట్టించిన 'స్త్రీ'ని చలం రచించింది 1925 ప్రాతంలో కాగా, అంతకు ఐదు సంవత్సరాల మునుపే పురుషులతో పాటు స్త్రీలు అన్నివిధాలా సమానమనే సమాజం రావాలని వీరు పేర్కొనడం విశేషమే.
'టైమ్స్ ఆఫ్ ఇండియా' పత్రికలో సర్ నారాయణచంద్ర వార్కరు రచించిన ఒక వ్యాసాన్ని వెంకటరత్నమ్మ 'ఇరువురు మాలకన్నియలు' పేరుతో అనువదించి 1919 జూలై-ఆగస్టు సంచికలో ప్రచురించారు. అందులో మాలకన్య హూవి తండ్రి తనకి పెళ్లి చేస్తాననీ, పెళ్లి వలన సుఖంగా ఉండొచ్చనీ చెబితే తండ్రితో "సుఖమా? భర్తలకును సుఖమునకును ఎంతో సంబంధముండుచున్నట్లు మాట్లాడుచున్నావే" అంటుంది.  (ఇంకావుంది)

వాల్ పేపర్: శిల్పాశెట్టి

నేటి పాట: నువ్వు నేను ఏకమైనామూ (కొడుకు కోడలు)

చిత్రం: కొడుకు కోడలు (1972)
రచన: ఆత్రేయ
సంగీతం: కె.వి. మహదేవన్
గానం: ఘంటసాల, పి. సుశీల

నువ్వూ - నేనూ ఏకమైనామూ -
ఇద్దరము, మనమిద్దరము ఒక లోకమైనాము
లోకమంతా ఏకమైనా - వేరు కాలేము, వేరు కాలేము -

అతడు: కళ్లు నాలుగు కలిపి మనము ఇల్లు కడదాము
ఆమె: అందులో మన చల్లచల్లని వలపు దీపం నిలుపుకుందాము
అతడు: పసిడి మనసుల పట్టెమంచం వేసుకుందాము
ఆమె: అందులో మన పడుచుకోర్కెల మల్లెపూలు పరుచుకుందాము   ||నువ్వు||

అతడు: చెలిమితో ఒక చలువ పందిరి వేసుకుందాము
ఆమె: కలల తీగల అల్లిబిల్లిగ అల్లుకుందాము
అతడు: ఆ అల్లికను మన జీవితాలకు పోల్చుకుందాము
ఆమె: ఏ ప్రొద్దుగాని వాడిపోని పువ్వులవుదాము -    ||నువ్వు||

అతడు: లేత వెన్నెల చల్లదనము - నువ్వు తెస్తావు
ఆమె: అందులో నీరెండలోని వెచ్చదనము నువ్వు ఇస్తావు
అతడు: సూర్యచంద్రులు లేని జగతిని సృష్టి చేద్దాము
ఆమె: అందులో ఈ సృష్టికెన్నడు లేని సొగసు మనము తెద్దాము    ||నువ్వు||                  

వాల్ పేపర్: సల్మా హయక్

సినిమా: నెరవేరని శ్రీశ్రీ సంకల్పం

మహాకవి శ్రీ శ్రీ యుగకర్త వీరేశలింగం జీవిత చిత్రాన్ని నిర్మించాలని 1960లో సంకల్పించారు. దానికోసం ఆయన ఉదయశ్రీ పిక్చర్స్ అనే నిర్మాణ సంస్థని నెలకొల్పారు. 'మహాపురుషుడు కందుకూరి' అనే టైటిలుతో ఆ సినిమా తీయాలనుకున్నారు. కథ, మాటలు, పాటలు సమకూరుస్తూ తనే ఆ సినిమాకి దర్శకత్వం వహించాలని తలపోశారు. అయితే ఎన్నో కారణాల వల్ల ఆయన సంకల్పం నెరవేరలేదు. అంతకుముందు పన్నెండేళ్ల క్రితం ఆయనలాగే డైరెక్టర్ తాతినేని ప్రకాశరావు కూడా వీరేశలింగం సామాజిక వీర చరితను వెండితెరకి ఎక్కించాలనుకున్నారు. శ్రేయోభిలాషులు వారించారు. రాజమండ్రి నుంచి సరైన సహకారం లభించలేదు. దాంతో ఆయన ఆ ప్రాజెక్టుని విరమించారు. ఇంతవరకు కందుకూరి జీవితం వెండితెర మీద ఆవిష్కృతం కాకుండానే ఉండిపోయింది.

వాల్ పేపర్: ప్రియమణి