Monday, January 25, 2016

Society: Need vast selfishness in people

విశాల 'స్వార్థం' కావాలి

కరడుగట్టిన స్వార్థపరులు కూడా తమ కుటుంబం మేరకు స్వార్థాన్ని సడలించి భార్యాబిడ్డల సుఖానికి పాటుపడతారు. వ్యక్తిగత స్వార్థం కొంచెం విశాలమై కుటుంబ స్వార్థంగా పరిణమిస్తుంది. సమాజంలో చాలామంది కుటుంబం కోసం వ్యక్తిగత స్వార్థాన్ని త్యాగం చేస్తారు. అయితే వాళ్లు ఇతరులతో వ్యవహరించేప్పుడు మాత్రం స్వార్థాన్ని ఆవగింజంతైనా వదిలిపెట్టరు. మరికొంతమందిలో కులం, మతం, ప్రాంతం, రాజకీయ పార్టీ వరకు రకరకాలుగా స్వార్థం వ్యాపించి ఉంటుంది. ఎవరికి వాళ్లకు ఆ పరిధుల్ని నిర్ణయించుకునే స్వాధికారం ఉంది. ఇలా స్వార్థం విశాలతను పొందుతూ ఉంటే అది సాధించ గలిగిన, సాధించాలనుకున్న విషయాలు విశాలమైన ఆశలుగా పరిణతి చెందుతాయి. కుటుంబ పరిమితుల్లో సాధించదగ్గ విషయాలు రాష్ట్రం, దేశం వంటి పరిమితుల్లో సాధించదగ్గ విషయాల కంటే చిన్నవిగా, త్వరితగతిన సాధింప దగ్గవిగా ఉంటాయి. ఈ స్వార్థం అతి విశాలతను పొంది ఉన్నతమైన ఆశగా రూపొందినప్పుడు అది ఇతరుల కోసమే అవుతుంది.
ఇలాంటి విశాలమైన ఆశే ఆదర్శం. ఆశలో సంఘ దృష్టి సమ్మిళితమవుతున్న కొద్దీ అది విశాలతను సంతరించుకుంటుంది. కొంతమంది సంస్కర్తలు, విప్లవకారులు కొన్ని ఆదర్శాలను నమ్మి మూఢ సంఘాన్ని, మూఢ నమ్మకాల్ని ఎదిరించారు. తమ ఆదర్శాల కోసం ప్రాణాలు కోల్పోవడానికి కూడా వెనుకాడలేదు. కాల గమనంలో వాళ్ల ఆదర్శాలు ఫలించినప్పుడు భావి తరాలవాళ్లు వాళ్లను పూజించారు. బుద్ధుడు, సోక్రటీస్, క్రీస్తు, మహమ్మద్, బ్రూనో, గెలీలియో, లింకన్, గాంధీ, అంబేద్కర్, మార్క్స్, కందుకూరి వీరేశలింగం.. ఈ కోవలోకి వస్తారు. వీళ్లు ప్రచారం చేసిన విశాల భావాలు మానవాళికి ఆశాజ్యోతులై ఆదర్శాలయ్యాయి.
వ్యక్తి తాలూకు, సంఘం తాలూకు అనుభవాల్ని ఆదర్శాలు సంస్కరిస్తాయి. నిరాశతో కుంగిపోకుండా, ఉత్సాహంతో, ఉత్తేజంతో జీవిస్తూ, ఇతరులకు ఆ ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని కలగజేయడంలో జీవితం ఉత్తమంగా భాసిస్తుంది. కొన్ని ఆశయాలు, లక్ష్యాలు మనుషుల్ని ఉద్వేగపరచి ఉద్రేకపరుస్తాయి. అవి కొరవడితే నిరాశ, నిస్పృహ ఆవహిస్తాయి. స్తబ్దత ప్రవేశిస్తుంది. శాశ్వతమైన ఆదర్శాన్ని గుర్తించని ఉద్యమాలు సంపూర్ణ పరిణతిని చెందలేవు, సంపూర్ణ ప్రయోజనం కలిగించలేవు. ప్రజాస్వామిక హక్కుల కోసం, స్వయం నిర్ణయాధికారం కోసం పోరాడటం విశాలమైన సమతా సాధన కృషిలో భాగాలుగా గుర్తించాలి.
నియంతృత్వానికి ఎదురునిల్చి బహిరంగంగా పోరాటం చేసే ఆదర్శవాదులు లేకుండాపోతున్నారు. నియంతలు, నిరంకుశవాదులు తమ ఆధిపత్యం నిలబెట్టుకోడానికి ఆదర్శాలు వల్లిస్తారు. నిజం గ్రహించడానికి సమయం పడుతుంది. సంకుచితమైన లక్ష్యాలు ఆదర్శాలుగా చలామణీ అవుతున్నా, వాటిని ఎత్తిచూపే విచక్షణాశక్తిని ప్రజల్లో కలిగించడంలో నాయకులు విఫలమవుతున్నారు. వాతావరణం సానుకూలంగా లేనప్పుడు కూడా ఇసుమంతైనా వెనుదీయకుండా విశాల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని అధిక సంఖ్యాకులకు అప్రియమైన సత్యాన్నయినా ఆదర్శవాదులు ఎలుగెత్తి చెప్పాలి. ప్రచారం వల్లా, ఆదర్శవాదుల అకుంఠిత దీక్ష వల్లా విశాల భావాలకు అమోదం లభిస్తూ సంఘం మారుతుంది. 'న్యాయానికి రోజులు కావు' అనే ధోరణిని ఆదర్శవాదులే తమ ఆచరణ ద్వారా ఎదుర్కొని, మోసం, అన్యాయంతో రాజీపడే అవకాశవాదులకు తగిన సమాధానం చెప్పి వాతావరణంలో మార్పులు తీసుకొని రావాలి.

Friday, January 22, 2016

Music Director Bhimavarapu Narasimha Rao Filmography

1. Sati Tulasi (1936)
2. Mohini Rukmangada (1937)
3. Kanaka Thara (1937)
4. Mala Pilla (1938)
5. Raitu Bidda (1939)
6. Meerabai (1940)
7. Apavadu (1941)
8. Bhagya Lakshmi (1943)

contd...

Thursday, January 21, 2016

Synopsis of the movie PRANA MITRULU (1967)

'ప్రాణమిత్రులు' (1967) కథాంశం


చిన్నా, బాబు ఒక తల్లి కడుపున పుట్టకపోయినా, ఒక తల్లి పాలు తాగి పెరిగారు. ఆ ఇంట చిన్నా నౌకరే అయినా బాబే అతని సర్వస్వం. మూడు తరాలుగా నౌకా వ్యాపారం చేస్తున్న వాళ్ల ఎస్టేటును చూస్తూ బాబును ఎలాగైనా మోసం చెయ్యాలని కాచుకొని ఉంటాడు దివాను. ఈ వ్యవహారమంతా కనిపెడుతూ తెలివిగా తప్పిస్తాడు చిన్నా. అది సహించలేక బాబు, చిన్నా మీద దివాను విరుచుకుపడతాడు. దాంతో వెంటనే దివానును తొలగించి ఆ స్థానంలో చిన్నాను నియమించి, తన యావదాస్తినీ చిన్నాకే రాసిస్తాడు బాబు. ఈ విషయం తెలుసుకున్న తల్లి జగదాంబ, చిన్నా దగ్గర లేకపోతే బాబు దారిలోకి వస్తాడనుకుంటుంది. ఎంత డబ్బయినా సరే తీసుకొని బాబును విడిచి వెళ్లమని చిన్నాను బతిమాలుతుంది. బాబు కోసం ఏ త్యాగం చేయడానికైనా సిద్ధపడ్డ చిన్నా ఇల్లు విడిచి వెళ్లేందుకు నిశ్చయించుకుంటాడు. తర్వాత బాబు, చిన్నా అన్యోన్యతను ఆమె అర్థం చేసుకుంటుంది.
హార్బర్ ఆఫీసుకు చిన్నా మేనేజరవుతాడు. అయితే అక్కడి వ్యవహారాలన్నీ అగమ్యగోచరంగా ఉన్నాయి. చదువుకొని విజ్ఞానం సంపాదించాలని పంతులమ్మ పార్వతి దగ్గరకు వెళ్లి రాత్రిపూట చదువుకుంటూ, పగలు ఆఫీసుపని చేస్తుంటాడు. అతడి మంచితనానికీ, అమాయకత్వానికీ ఆకర్షితురాలై అతనికి మనసిస్తుంది పార్వతి.
వాళ్ల ప్రేమను కనిపెట్టిన బాబు పరిహాసానికి పార్వతిని తనకిచ్చి పెళ్లిచెయ్యమంటాడు. చిన్నా నోట ఈ విషయం విన్న పార్వతి ఖిన్నురాలవుతుంది. అవమానంతో కుంగిపోతుంది. బాబు పశ్చాత్తాపపడతాడు. కానీ, ఏం లాభం. విరిగిన మనసు అతకలేదు. తన పరిహాసం ఇంత ప్రమాదానికి దారితీసిందని బాధపడి వాళ్లను నమ్మించడానికి గాను పద్మ అనే అమ్మాయిని పెళ్లాడతాడు బాబు.
అటు అదను కోసం కాచుకొన్న దివాన్ బోనస్ తగాదాల్ని లేపి పనివాళ్లను రెచ్చగొడతాడు. బాబు, చిన్నా కలిసి ఆఫీసులో ఒక చిన్న నాటకం ఆడతారు. చిన్నా పనివాళ్లలో చేరి వాళ్లకు నాయకుడై బోనస్ ఇప్పిస్తాడు. బాబుకూ, అతని వ్యాపారానికీ మేలు చేద్దామని గూడెం చేరిన చిన్నా, పార్వతి బోధనల వల్లా, అక్కడి అమాయకులైన కార్మికుల కష్టాల్ని కళ్లారా చూస్తుండం వల్లా నిజంగానే బాబుకు దూరమవుతాడు.
అది సహించలేని బాబు వెర్రికోపంతో హార్బర్‌కు వెళ్లి అక్కడ సింహాలు అనే కార్మికునిపై చేయి చేసుకుంటాడు. దాంతో పంతాలు పెరిగి ఈ సంఘటన సమ్మెకు కారణమవుతుంది. చిన్నా ఔన్నత్యాన్ని గుర్తిస్తుంది పార్వతి. చివరకు చిన్నా నాయకత్వంలో ఊరేగింపు జరుగుతుంది. తనవైపుకు రాకుండా వారిస్తూ రివాల్వర్ పైకెత్తి అడుగు ముందుకేస్తే ప్రాణం తీస్తానంటాడు బాబు. చిన్నా అడుగుముందుకేస్తాడు. 'అమ్మా' అని కేకపెట్టి పడిపోతాడు. అయితే గుండు పేల్చింది బాబు కాదు. దివాన్ అనుచరుడు. జనం విరుచుకుపడతారు. బాబు అందర్నీ క్షమాపణ వేడుకుంటాడు. "చిన్నా నువ్వు చిరంజీవివి. ధర్మానికీ, న్యాయానికీ, మంచికీ, మానవత్వానికీ ప్రాణాలు విడిచిపెట్టావు" అని విలపిస్తాడు.

తారాగణం: అక్కినేని నాగేశ్వరరావు, జగ్గయ్య, సావిత్రి, కాంచన, గీతాంజలి, గుమ్మడి, రేలంగి, శాంతకుమారి, అల్లు రామలింగయ్య, చదలవాడ కుటుంబరావు, గిరిజ
సంగీతం: కె.వి. మహదేవన్
నిర్మాత: వి. వెంకటేశ్వర్లు
దర్శకుడు: పి. పుల్లయ్య
బేనర్: పద్మశ్రీ పిక్చర్స్

Monday, January 18, 2016

Poetry: Cobweb to be amputated

సాలెగూడు ఛేదించాలి


నేను కాలాన్ని కరిగిస్తున్నవాణ్ణి
సంఘసేవకు వద్దామనే ఉంది
ఏమేమో చేద్దామనీ ఉంది

మనసులో భావాల వరదలు పొర్లుతున్నయ్
గుండెలో ఆవేశాల నురగలు రాగాలు పాడుతున్నయ్
కట్టలుగా పుట్టలుగా అడ్డుపడే అవరోధాలు
అధిగమించాలని ఉంది అవతలకి తోసేయాలని ఉంది

మొదటి కునుకు ఎలాగొస్తుందో కనిపెట్టలేను
ఉదయపు మెలకువ వరకూ వదలవు సినిమా కలలు
నా దారినిపోయే వేళ నాక్కనిపించే అమ్మాయిలు
అదేం ఖర్మమో అందరూ అందగత్తెలు
నా దారినిపోయే వేళ నాక్కనిపించే బిచ్చగాళ్లు
గుండెల్లో మెత్త జాగాలు తడతారు

సంజవేళ సంచరించు ఒంటరి కంకాళం
సందు చూసుకొని సంద్రంలో దూకేస్తుంది
ఆధారం అగుపించని అనుమానం
గుండెలో మండు కుంపటి పెడుతుంది
అమ్మాయిల వెంటపడే తుంటరి వెధవల జాతిని
తన్ని తగలేయాలని ఉంది తుడిచిపెట్టేయాలని ఉంది

మిత్రమా లాభం లేదు
నన్ను నిందించి ప్రయోజనం లేదు
దుర్మార్గ దోపిడీ శక్తులేవో
డబ్బు సూత్రాలు దట్టంగా అల్లుతున్నాయి
సాలెపురుగులా చంపుకు తినాలనుకుంటున్నాయి
సారీ.. నిన్ననుసరించలేను
నీ అడుగులో నా కాలిడలేను
సాలెగూటిలో చిక్కుకోలేను

Saturday, January 16, 2016

Writer Samudrala Raghavacharya Filmography

1. Kanaka Thara (1937) (dialogues)
2. Grihalakshmi (1938) (story)
3. Vande Matharam (1939) (dialogues)
4. Sumangali (1940) (dialogues)
5. Devatha (1941) (dialogues)
6. Bhakta Potana (1942) (story and dialogues)
7. Garuda Garvabhangam (1943) (dialogues)
8. Swargaseema (1945) (dialogues)

As a lyricst
1. Kanaka Thara (1937)
2. Grihalakshmi (1938)
3. Vande Matharam (1939)
4. Raitu Bidda (1939)
5. Sumangali (1940)
6. Devatha (1941)
7. Bhakta Potana (1942)
8. Pantulamma (1943)
9. Chenchu Lakshmi (1943)
10. Swargaseema (1945)

contd...

Friday, January 8, 2016

Poetry: The Writer

రాతగాడు


రాయడం అందరికీ అలవడే విద్యకాదు
రాయడం ఒక నేర్పు, రాత ఒక మత్తు
నేనున్నాననీ, నేను కవిత్వం అల్లగలననీ
రుజువుచెయ్యడానికి రాస్తాడు
తనను తాను ఆవిష్కరించుకుంటాడు
ఒకాయన అగ్గిపుల్ల మీద రాస్తాడు
ఇంకొకాయన క్రికెట్ బ్యాట్ మీద రాస్తాడు
వేరొకాయన ప్రభుత్వానేధినేతను
ఆయనకే తెలీని గొప్పలతో కీర్తిస్తూ రాస్తాడు
మరొకాయన పెళ్లాం మీదా, పిల్లల మీదా
నిజ జీవితంలో కురిపించని ప్రేమనంతా ఒలకబోస్తూ రాస్తాడు
ఏది రాసినా నేర్పున్నోడే రాస్తాడు
ఏం రాయాలనే కిటుకు తెలిసినోడే రాస్తాడు

Wednesday, January 6, 2016

Writer Tapi Dharma Rao Filmography

As a writer
1. Mohini Rukmangada (1937) (dialogues)
2. Sarangadhara (1937) (dialogues)
3. Raitu Bidda (1939) (dialogues)
4. Illalu (1940) (dialogues)
5. Apavadu (1941) (dialogues)
6. Patni (1942) (dialogues)

contd...

As a lyricist
1. Mohini Rukmangada (1937)
2. Mala Pilla (1938)
3. Raitu Bidda (1939)
4. Illalu (1940)
5. Apavadu (1941)
6. Patni (1942)

contd...

Tuesday, January 5, 2016

Society: Encouragement to Superstitious Beliefs

మూఢత్వానికి ప్రోత్సాహం

సమాజాన్ని నిస్సహాయత ఆవహించింది. తప్పని తెలిసి కూడా ఆ తప్పునే అంతా ఆచరిస్తున్నారు. సమాజ దృష్టితో కూడిన ధ్యేయం లేకుండా పోయింది. సంకుచిత స్వార్థాలు, పార్టీ, ముఠా, కులం, మతం, ప్రాంతం, భాష పేరిట కక్షలు పెరిగిపోయాయి. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ కర్త, నిర్ణేత పౌరుడే. కానీ ఆ పౌరుడు ప్రభుత్వాన్ని ఆజ్ఞాపించాల్సిందిపోయి, దీనంగా మంత్రుల్నీ, ఎమ్మెల్యేలనీ, స్థానిక ప్రతినిథుల్నీ, ప్రభుత్వాధికారుల్నీ అర్థించే బానిస మాదిరిగా దిగజారిపోయాడు. పౌరుడు దీనుడవటంతో, జనశక్తి బలహీనపడటంతో అధికారులు, పాలక వర్గాల వాళ్లూ తమ ఇష్టాయిష్టాలకు, రాగద్వేషాలకు, భోగవిలాసాలకు, సంపదను పోగేసుకోడానికి ప్రభుత్వ యంత్రాంగాన్ని సాధనంగా చేసుకొని ప్రజల్ని బలి చేస్తున్నారు.
అధికారంలో ఉన్నవాళ్లు నిజంగా ప్రజా ప్రయోజనాలు కోరేవారైతే ప్రజల్లోని మూఢ విశ్వాసాల్ని తొలగించడానికి కృషిచేసి, వారిలో నూతన చైతన్యాన్ని, ప్రేరణనీ కల్పించాలి. కానీ ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నవాళ్లు ప్రజా చైతన్యాన్ని పెంపొందించడానికి బదులు వాళ్లలోని మూఢ నమ్మకాలకు మరింత ప్రోత్సాహమిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జరిగేదొకటే. అది.. ప్రజాస్వామ్య వ్యవస్థ అంటేనే ప్రజల్లో ఏహ్యభావం ఏర్పడి నియంతృత్వంపై అభిమానం పెరగడం. ఇలాంటప్పుడు ఏ అభివృద్ధి కార్యక్రమాలు అమలు జరిపినా, ఎన్ని ప్రణాళికలు వేసినా, వాటి ఫలితాలు ప్రజలదాకా చేరకుండానే ఇంకిపోతాయి.
ఈ రకంగా భ్రష్టమైన రాజకీయ జీవితం మొత్తం ప్రజా జీవితాన్ని బాధలు పెడుతోంది. ప్రజాస్వామ్యంలో ప్రజా ప్రతినిథులు తమ కర్తవ్యాల్ని సక్రమంగా నిర్వర్తించకపోతే దానివల్ల వాళ్లు ప్రాతినిథ్యం వహించే కోటానుకోట్ల ప్రజలు కష్టాల పాలవుతారు. అందువల్ల వాళ్లను సంకుచిత ముఠా స్వార్థాలలోకి దిగజారకుండా చూడాల్సిన బాధ్యత ప్రజలదే.

Saturday, January 2, 2016

Synopsis of the movie CHIRANJEEVI (1969)

'చిరంజీవి' (1969) చిత్ర కథాంశం

బాలకృష్ణ నర్సింగ్ హోంలో 7వ నెంబర్ వార్డులోని ముగ్గురు రోగులు - సత్యం (చలం), మధు (రామకృష్ణ), వెంకటప్పయ్య (అల్లు రామలింగయ్య). సత్యం అనాథ. ఊపిరితిత్తుల వ్యాధితో బతికేది కొద్ది రోజులే అయినా అది తెలియక అందర్నీ నవ్విస్తూ, కవ్విస్తూ కాలక్షేపం చేస్తుంటాడు. మధు పేరుపొందిన ఫుట్‌బాల్ ఛాంపియన్. ప్రపంచ ఖ్యాతి వచ్చిందని సంబరపడేంతలోనే కాలు విరిగి తన భవిష్యత్ అంధకారబంధురమైందని బాధపడుతుంటాడు. ఇక వెంకటప్పయ్యకు కడుపులో పుండు. డాక్టర్‌కు తెలీకుండా దొరికిన ప్రతిదీ తింటుండే మూర్ఖుడు.
మృత్యువు సమీపంలో ఉన్న సత్యం డాక్టర్ ఇందిరాదేవి (సావిత్రి), మధు మధ్య ప్రేమను కలిగిస్తాడు. తనకు మందు ఇచ్చే నర్సు స్టెల్లా (మీనాకుమారి)ని ప్రేమించి పెళ్లి చేసుకోవాలని కలలు కంటుంటాడు. రోగుల్ని కన్నతండ్రిగా చూసే డాక్టర్ బాలకృష్ణ (ప్రభాకరరెడ్డి)నీ, ఇందిరాదేవినీ అవసరమున్నా లేకపోయినా మాటిమాటికీ కంగారుపెడుతుంటాడు. కానీ తాను ఎక్కువ కాలం బతకననే నిజం డాక్టర్ నోట రహస్యంగా విన్న సత్యం జీవితంలో నిజమైన బాధను తొలిసారి అనుభవిస్తాడు. జీవితం అంటే ఏమితో తొలిసారిగా అప్పుడే అర్థమవుతుంది. చనిపోయేలోగా తానూ ఒక మంచిపని చేసి చనిపోవాలనుకుంటాడు. ఆ మంచిపని మధు, ఇందిర పెళ్లనేది అతని అభిప్రాయం.
సత్యం జీవితం ముగిసిపోయే క్షణం రానే వచ్చింది. డాక్టర్ కోసం కాలింగ్ బెల్ నొక్కుతాడు. ఇదీ వేళాకోళానికేనని భావించిన ఇందిర నిర్లక్ష్యం చేస్తుంది. చివరకు పెద్ద డాక్టర్ వచ్చినా ఫలితం ఉండదు. మధు చేతిలో సత్యం కన్ను మూస్తాడు. చనిపోయే ముందు డాక్టర్ బాలకృష్ణ మనసు మార్చి ఆయన కూతురు ఇందిరను కుంటివాడైన మధుకు ఇవ్వడానికి ఒప్పిస్తాడు. ఇదివరకు తండ్రి వ్యతిరేకించా మధు ప్రేమ కోసమే విదేశాల్లో విద్యాభ్యాసానికి స్వస్తి చెప్పిన ఇందిర, ఇప్పుడు సత్యం మరణంతో మనసు మార్చుకుంటుంది. విదేశాలకు వెళ్లి కేన్సర్ స్పెషలిస్టయి సత్యంలాంటి అభాగ్యుల్ని చిరంజీవులను చేయాలనుకుంటుంది. ఆమె నిర్ణయాన్ని మనసారా అభినందిస్తాడు మధు. తన యావదాస్తినీ ఆమె ఆస్పత్రికి దానం చేస్తానని మాటిస్తాడు.

తారాగణం: సావిత్రి, ప్రభాకరరెడ్డి, చలం, రామకృష్ణ, అల్లు రామలింగయ్య, మీనాకుమారి
సంగీతం: టి. చలపతిరావు
నిర్మాత: ఎ.కె. వేలన్
దర్శకురాలు: సావిత్రి

Actress Tanguturi Suryakumari Filmography

1. Usha Parinayam (1939) (Parvathi)
2. Raitu Bidda (1939) (Seetha)
3. Jayaprada (1939)
4. Chandrahasa (1941)
5. Devatha (1941) (Seetha)
6. Deena Bandhu (1942)
7. Bhakta Potana (1942) (Saraswathi)

contd...

Poetry: The Kiss

ముద్దు

అనంత విశ్వంలోని ఆనందం
ముద్దులోని మాధుర్యం
అనుభవానికి తెచ్చే పెదవులు

ముద్దు
ఒక సముజ్వల వాంఛ
రెండు ప్రాణ వాయువుల్ని
పెనగలిపితే వచ్చే పరవశత్వం

ముద్దు
ప్రేమికుల ప్రాథమిక హక్కు
రెండు హృదయాల నుంచి మొదలై
పెదాల ద్వారా ఉద్భవించే
ఉత్కృష్ట భావం

ముద్దు
ఒక ప్రణయ బాధ
ఒక మూగ వేదన
పుట్టిన ప్రతివాడూ గిట్టేలోగా
ఎప్పుడో ఒకప్పుడు
ముద్దు మాధుర్యాన్ని
చవిచూసే తీరతాడు

Friday, January 1, 2016

Society: We and Our Responisibility

మనం - మన బాధ్యత

ప్రజాస్వామిక వ్యవస్థలో ప్రభుత్వాన్ని ప్రజలే నిర్మించుకుంటారు. మాతృదేశాన్ని సంరక్షించుకుంటూ ప్రపంచంలో తమ దేశానికి మహోన్నతమైన స్థానాన్ని సంపాదించి పెట్టేందుకు కృషి చేస్తారు. ఇదే ప్రజల బాధ్యత. కానీ మనదేశంలో ప్రజలు చాలావరకు తమ బాధ్యతల్ని విస్మరిస్తున్నారు. లంచగొండితనం, బంధుప్రీతి, స్వకుల పక్షపాతం, పార్టీ నియంతృత్వం విస్తృతమైపోతున్నది. లంచాలిస్తున్న వాళ్లెవరు? ఓట్లకు నోట్లు తీసుకుంటున్న వాళ్లెవరు? నాయకుల్ని ఎన్నుకుంటున్న వాళ్లెవరు? ప్రజలే!
అసమర్థులైన నాయకుల్ని ఎన్నుకోకుండా నీతీ నిజాయితీ కలిగినవాళ్లను ఎన్నుకుంటే మేలు జరక్కపోయినా వ్యవస్థకు ప్రమాదమైతే ఉండదు. నోట్లు తీసుకొని ఓట్లు వేసే జనం, లంచాలిచ్చి పనులు చేయించుకునే పెద్ద మనుషులు, లంచాలు తీసుకోవడమే వృత్తిగా పెట్టుకొని, నాయకులకు నీడలాగా తిరుగుతూ అయిన దానికీ, కాని దానికీ రాజకీయ ఏజెంట్లుగా బతుకుతున్న చెంచాలూ, ఈ చెంచాల అడుగులకు మడుగులొత్తే ఉప నాయకులూ ప్రజల్లోనే ఉన్నారు. కాబట్టే ప్రజలు కష్టాలకు గురవుతున్నారు. దేశమంతటా జరుగుతున్న అన్యాయాల్నీ, అక్రమాల్నీ, అరాచకాల్నీ, అత్యాచారాల్నీ, అవినీతినీ కళ్లారా చూస్తూ నిర్లక్ష్యంతో, నిర్లిప్తంతో ఉన్నవాళ్లూ ప్రజలే.
ప్రజల ప్రతిబింబమే ప్రభుత్వం. వాళ్లు సృష్టించుకున్నదే ప్రభుత్వం. కాబట్టి ప్రజలు తమ బాధ్యతల్ని గ్రహించుకొని ప్రవర్తించినప్పుడే నీతీ నిజాయితీ కలిగిన పార్టీలు ఏర్పడతాయి. అప్పుడే మహోన్నతమైన నాయకత్వం లభిస్తుంది. మహా శక్తిమంతమైన ప్రభుత్వం నెలకొంటుంది. దేశం బాగుపడుతుంది. ప్రజల్లో నైతిక శక్తి కొరవడితే ప్రజలెన్నుకొన్న పార్టీల్లో అవినీతి పెరిగిపోతుంది. అవినీతికి ఆశ్రయమిచ్చే పార్టీలు నెలకొల్పే ప్రభుత్వాలు అన్యాయాన్ని అవలంబిస్తాయి. దీనివల్ల ప్రజాస్వామ్యానికే ముప్పు వాటిల్లుతుంది. దేశం అధోగతిలోకి వెళ్తుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ తన బాధ్యతను గుర్తించి, తన కర్తవ్యాన్ని నిర్వర్తించాలి.