Saturday, November 8, 2014

Cinema: Best Performances of Kamal Hassan

నడిచే నట పాఠశాల

భారతీయ చిత్రసీమలోని సమకాలీన నటుల్లో కమల్‌హాసన్ చేసినన్ని విలక్షణమైన, వైవిధ్యమైన పాత్రలు మరే నటుడూ చేయలేదనేది నిర్వివాదం. ఆయన వయసు అరవై అయితే, ఆయన సినీ కెరీర్ వయసు యాభై నాలుగేళ్లు. బాలనటునిగా కేవలం ఆరేళ్ల వయసులో నటించిన మొదటి సినిమాకే జాతీయ అవార్డు అందుకున్న ఘన చరిత్ర ఆయనది. అప్పట్నించీ ఇప్పటిదాకా ఆయన పోషించిన ఎన్నో పాత్రలు మన హృదయల్లో సుస్థిర స్థానాన్ని పొందాయి. పాత్రలో పరకాయ ప్రవేశం చేయడమంటే ఏమిటో ఇప్పటి నటులు ఆయనను చూసే నేర్చుకోవాలి. దక్షిణాదిన కానీ, ఉత్తరాదిన కానీ సూపర్‌స్టార్లు ఎంతోమంది ఉండోచ్చు కానీ, కమల్ వంటి గ్రేట్ యాక్టర్లు ఒకరిద్దరు కంటే కనిపించరు. నిజానికి కమల్‌కు సాటిరాగల నటుడు ఈ కాలంలో ఎవరున్నారనీ!

జాతీయ ఉత్తమ నటుడు 

1960లో వచ్చిన తమిళ చిత్రం 'కళత్తూర్ కన్నమ్మ' సినిమాతో ఆరేళ్ల వయసులో బాలనటునిగా పరిచయమయ్యారు కమల్. అందులో జంటగా నటించిన జెమినీ గణేశన్, సావిత్రి కొడుకు పాత్రను ఆయన పోషించారు. పసితనంలోనే తల్లిదండ్రులకు దూరమై అనాథాశ్రమంలో పెరిగిన పిల్లవాడిగా ఉన్నత స్థాయి నటనను ప్రదర్శించి ఉత్తమ బాలనటునిగా జాతీయ అవార్డు అందుకున్నారు కమల్. కథానాయకుడిగా ఎదిగాక ఆయన మరో మూడుసార్లు జాతీయ ఉత్తమ నటుడి అవార్డును పొందారు. వాటిలో మొదటిది 'మూండ్రం పిరై' (1982). బాలు మహేంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగులో 'వసంత కోకిల'గా అనువాదమైంది. రెండు భాషల ప్రేక్షకుల హృదయాలనూ పిండేసింది ఈ సినిమా. మతిస్థిమితం కోల్పోయిన శ్రీదేవికి అండగా నిలిచి, ఆమెకు అన్నీ తానై కంటికి రెప్పలా కాపాడి, ఆమె మామూలు మనిషయ్యాక తనను గుర్తుపట్టకపోతే విలవిల్లాడిపోయిన స్కూల్ టీచర్‌గా కమల్ ప్రదర్శించిన అభినయం అపూర్వం. రైల్వే స్టేషన్‌లో శ్రీదేవికి తానెవరో స్ఫురణకు రావాలనే ఉద్దేశంతో ఆమెకు ఇష్టమైన కోతి చేష్టలన్నీ చేస్తే, అతను మానసిక రోగి అయిన భిక్షగాడేమోనని ఆమె భావించే క్లైమాక్స్ సీన్ ఎంతటి కఠిన హృదయులనైనా కదిలించి వేస్తుంది. ఆ సన్నివేశం చూసి దు:ఖపడని వాళ్లు ఒక్కరూ లేరు. భారతీయ సినిమాలో ఓ క్లాసిక్‌గా పేరు తెచ్చుకున్న 'నాయకన్' (1987 - తెలుగులో 'నాయకుడు') ఆల్‌టైం 20 గ్రేటెస్ట్ ఇండియన్ ఫిలిమ్స్‌లో ఒకటిగా నిలిచింది. ఒకప్పటి బొంబాయి చీకటి సామ్రాజ్య చక్రవర్తి వరదరాజ మొదలియార్ జీవితం ప్రేరణతో మణిరత్నం రూపొందించిన ఈ చిత్రంలో కథానాయకుడు వేలు నాయకర్ పాత్రలో కమల్ నటనా విన్యాసాలు చూసి తీరాల్సిందే. ఈ పాత్రతో ఆయన మరోసారి ఉత్తమ నటునిగా జాతీయ అవార్డు అందుకునారు. ఆ అవార్డును ఆయన చివరిసారి అందుకున్న చిత్రం 'ఇండియన్' (1996 - తెలుగులో 'భారతీయుడు'). దేశంలో అన్ని రంగాల్లో వేళ్లూనుకుపోయిన అవినీతి, లంచగొండితనం నేపథ్యంలో శంకర్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో తండ్రీ కొడుకులుగా ద్విపాత్రలు పోషించారు కమల్. ప్రధానంగా స్వాతంత్ర్య సంగ్రామ కాలంలో ఇండియన్ నేషనల్ ఆర్మీలో పనిచేసిన సేనాపతి అనే డెబ్భై ఏళ్ల వృద్ధుడి పాత్రను ఆయన పోషించిన తీరు అనన్యసామాన్యం.

అమావాస్య చంద్రుడు 

కథానాయకుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతులు పొందిన తర్వాత కూడా ఇమేజ్ అనేదాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా, పాత్రల విషయంలో ఎన్నో ప్రయోగాలు చేశారు కమల్. ప్రధానంగా కె. బాలచందర్, కె. విశ్వనాథ్, సింగీతం శ్రీనివాసరావు వంటి దర్శకులు ఆయనలోని నటుణ్ణి ప్రపంచం ముందు గొప్పగా ప్రదర్శింపజేశారు. వందో చిత్రమంటే ఏ నటుడికైనా మైలురాయే. అలాంటి వందో చిత్రంలో ఏ హీరో గుడ్డివాని పాత్రతో రిస్క్ చేస్తాడు, కమల్ తప్ప! ఆ సినిమా 'రాజా పార్వై' (1981 - తెలుగులో 'అమావాస్య చంద్రుడు'). సింగీతం శ్రీనివాసరావు రూపొందించిన ఈ చిత్రంలో ఓ అందమైన క్రిస్టియన్ యువతి (మాధవి) ప్రేమలో పడిన అంధ వయొలినిస్ట్‌గా నటించి, మెప్పించారు కమల్. ఇక అదే దర్శకుడు తీసిన 'పుష్పక విమానం' (1987) గురించి చెప్పేదేముంది. 1930ల కాలంలోని మూకీ సినిమాల తరహాలో ఎలాంటి సంభాషణలూ లేకుండా పాత్రల సైగలతోటే నడిచే నిశ్శబ్ద చిత్రమిది. ఇందులో కమల్ ప్రదర్శించే హావభావాలు ఔత్సాహిక నటులకు పాఠాలు. సీఎన్ఎన్-ఐబీఎన్ రూపొందించిన వంద గొప్ప భారతీయ చిత్రాల జాబితాలో చోటు సంపాదించింది ఈ చిత్రం. సింగీతమే రూపొందించిన 'అపూర్వ సహోదరగళ్' (1989 - తెలుగులో 'విచిత్ర సోదరులు') బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. తను స్వయంగా నిర్మించిన ఇందులో తండ్రిగా, ఆయన ఇద్దరు కవల పిల్లలుగా త్రిపాత్రలు చేశారు  కమల్. ముఖ్యంగా తండ్రి మరణానికి కారకులైన వాళ్లపై పగతీర్చుకునే మరుగుజ్జు అప్పు పాత్రను ఆయన పోషించిన తీరు సినిమాకు హైలైట్. ఎలాంటి కంప్యూటర్ గ్రాఫిక్స్ లేకుండా మరుగుజ్జుగా కనిపిస్తూ నటించడానికి ఆయన పడిన విపరీతమైన కష్టం అనితర సాధ్యం.

సాగర ముత్యం 

కె. విశ్వనాథ్, కమల్ కాంబినేషన్ గొప్పగా రాణించింది. అందుకు చక్కని ఉదాహరణలు 'సాగర సంగమం' (1983), 'స్వాతిముత్యం' (1986). సంగీత నృత్య దృశ్యకావ్యంగా రూపొందిన 'సాగర సంగమం' సీఎన్ఎన్-ఐబీఎన్ వంద గొప్ప భారతీయ చిత్రాల్లో స్థానం పొందింది. శాస్త్రీయ నృత్యంలో నిష్ణాతుడైన బాలకృష్ణగా కమల్ అభినయం అసామాన్యం. నీళ్లబావిపై నిల్చుని ఆయన చేసే నాట్యం సినిమాకే హైలైట్. నడవలేని స్థితిలో వీల్‌చైర్‌లో కూర్చొని స్టేజిపై శైలజ నృత్యాన్ని చూస్తూ ఆయన చనిపోయే సన్నివేశం గుండెను బరువు చేసేస్తుంది. ఇక వయసు పెరిగినా, మెదడు ఎదగని శివయ్య అనే అమాయక గ్రామీణ యువకునిగా కమల్ నటించిన చిత్రం 'స్వాతిముత్యం'. దేశంలోనే తానెందుకు అత్యుత్తమ నటుడో మరోసారి ఆయన ప్రపంచానికి నిరూపించిన పాత్ర శివయ్య. ఈ సినిమా తర్వాత నిష్కల్మష హృదయుణ్ణి 'వాడు స్వాతిముత్యంరా' అనడం పరిపాటి అయ్యింది. అది ఆ పాత్ర, ఆ పాత్ర పోషణలో కమల్ సాధించిన విజయం.

మరో చరిత్ర 

కె. బాలచందర్ రూపొందించిన ప్రేమకావ్యం 'మరో చరిత్ర' (1978) టైటిల్‌కు న్యాయం చేస్తూ బాక్సాఫీస్ వద్ద మరో చరిత్రను సృష్టించింది. ఆ కాలం కుర్రకారు ఈ సినిమాను ఎన్నిసార్లు చూశారో! ఒక క్రిస్టియన్ మతానికి చెందిన తెలుగమ్మాయి ప్రేమలోపడ్డ తమిళ బ్రాహ్మణ యువకుడు బాలు పాత్రలో యువతరానికి ప్రతినిథిగా కమల్ అత్యుత్తమ నటన ప్రదర్శించారు. తర్వాత కాలంలో ఇదే సినిమాను కమల్‌తోటే 'ఏక్ దూజే కే లియే'గా హిందీలో రీమేక్ చేశారు బాలచందర్. ఈ రెండు చిత్రాలూ సీఎన్ఎన్-ఐబీఎన్ జాబితాలో స్థానం పొందడం విశేషం. మహాకవి శ్రీశ్రీ అభిమానిగా కమల్ కనిపించే చిత్రం 'ఆకలి రాజ్యం' (1981). డెబ్భైల చివరి నాళ్లనుంచీ, ఎనిమిదో దశకం వరకు దేశంలోని యువతను నిరుద్యోగం ఎంతగా బాధించిందనే దానికి ఈ సినిమా ఓ ఉదాహరణ. నిజాయితీగా ఉద్యోగం సంపాదించాలనుకుని భంగపడే నిరుద్యోగిగా కమల్ ప్రదర్శించిన అభినయాన్ని మరచిపోవడం కష్టం. అదివరకు కమల్‌తో తనే తీసిన తమిళ చిత్రం 'వారుమయిన్ నీరం శివప్పు'కు రీమేక్‌గా దీన్ని రూపొందించారు బాలచందర్. 

మహానది 

నటునిగా కమల్ కెరీర్‌లోని అత్యుత్తమ చిత్రాల్లో 'మహానది' (1994)ని ప్రస్తావించకపోతే ఈ వ్యాసం అసమగ్రం అవుతుంది. ఫోర్బ్స్ ఇండియా ఎంపిక చేసిన '25 గ్రేటెస్ట్ యాక్టింగ్ పర్ఫార్మెన్సెస్ ఆఫ్ ఇండియన్ సినిమా'లో ఈ చిత్రంలో కమల్ పోషించిన పాత్ర చోటు పొందిందంటేనే, ఆ పాత్రను ఆయన ఏ రీతిలో పోషించారో అర్థం చేసుకోవచ్చు. బీభత్స రస ప్రధానంగా దర్శకుడు సంతాన భారతి రూపొందించిన ఈ చిత్రంలో భార్యను కోల్పోయిన ఇద్దరు పిల్లల తండ్రి కృష్ణస్వామిగా కనిపిస్తారు కమల్. స్నేహితుని వంచనకు గురై జైలుపాలై, బయటకు వచ్చాక కనిపించకుండా పోయిన పిల్లల కోసం అన్వేషించే తండ్రిగా కమల్ ప్రదర్శించిన నటన వర్ణనలకు అందనిది. ముఖ్యంగా కలకత్తాలోని వ్యభిచారవాడ సోనాగచ్చిలో ఉన్న కూతురిని వెతుక్కుంటూ, అక్కడకు వెళ్లి మొదటిసారి ఆమెను కమల్ చూసే సన్నివేశం భారతీయ సినిమాలోని అత్యంత హృదయ విదారక సన్నివేశాల్లో ఒకటిగా పేర్కొనవచ్చు. దానితో పాటు మరికొన్ని సన్నివేశాలు, ఆ సన్నివేశాల్లో కమల్ అభినయం మనల్ని చాలా కాలం వెంటాడుతూనే ఉంటాయి.
ఇవే కాకుండా తమిళ చిత్రాలు 'అవల అప్పడిదన్' (1978), 'మైఖేల్ మదన కామ రాజన్' (1990), 'గుణ' (1991), 'అన్బే శివం' (2003), 'విరుమాండి' (2004), 'దశావతారం' (2008), తెలుగు చిత్రాలు 'ఇంద్రుడు చంద్రుడు' (1989), 'శుభసంకల్పం' (1995), హిందీ చిత్రాలు 'సాగర్' (1985), 'హే రాం' (2000) వంటివి కూడా కమల్ విలక్షణ నటనా సామర్థ్యానికి మెచ్చు తునకలు.

(నవంబర్ 7 కమల్‌హాసన్ షష్టి పూర్తి సందర్భంగా)

Tuesday, November 4, 2014

Cinema: Best Performances of Aishwarya Rai

- ఆంధ్రజ్యోతి డైలీ, 1 నవంబర్ 2014

General: Reforms Means Selling Assets?

సంస్కరణలంటే ఆస్తులు అమ్ముకోవడమేనా?

భారత్‌లో వ్యవసాయాభివృద్ధి కుంటుపడటంతో పారిశ్రామికాభివృద్ధి కూడా బాగా తగ్గింది. ఈ యేడాది ఫిబ్రవరిలో పారిశ్రామికాభివృద్ధి 0.2 శాతం మాత్రమే నమోదైంది. పారిశ్రామిక ఉత్పత్తులకు డిమాండ్ పడిపోయి ధరలు తగ్గడంతో ద్రవ్యోల్బణం కూడా తగ్గింది. పారిశ్రామికాభివృద్ధికి ఊతమిస్తూ వడ్డీరేట్లను తగ్గిస్తుందనుకున్న వారికి రిజర్వ్‌బ్యాంక్ నిరాశను మిగిల్చింది. ఆర్థిక సంస్కరణలు ప్రారంభమైన తర్వాతి సంవత్సరంలో పారిశ్రామికాభివృద్ధి 2.4 శాతం దాటకపోవడంతో, సరళీకృత విధానాలకు పరిశ్రమలు ఇంకా అలవాటు పడలేదని ప్రభుత్వం భావించింది. అయితే ఇన్నేళ్ల తర్వాత కూడా పరిస్థితి అంతగా మెరుగుపడలేదంటే ఆ విధానాల్నే శంకించాల్సి వుంది.
ఆధునిక పరిశ్రమలకు భారత్‌లో సుమారు 1850-1870 మధ్యకాలంలోనే పునాదులు పడ్డాయి. 1890 నాటికి భారీ పరిశ్రమలు స్థాపితమయ్యాయి. అప్పటి నుండి మొదటి ప్రపంచ యుద్ధం మొదలయ్యేదాకా అన్ని రంగాల్లోనూ ప్రగతి ఓ క్రమ పద్ధతిలో సాగింది. నూలు కదుళ్ల ఉత్పత్తి రెట్టింపు పైగా పెరిగింది. విద్యుచ్ఛక్తితో నడిచే మరమగ్గాల సంఖ్య నాలుగు రెట్లు పెరిగింది. జనపనార యంత్రాల సంఖ్య కూడా నాలుగు రెట్లు పెరగితే, బొగ్గు తవ్వకం ఆరు రెట్లు పెరిగింది.
ఏడాదికి సగటున 800 మైళ్ల పొడవుగల రైలు మార్గాలు నిర్మితమయ్యాయి. బెంగాల్‌తో పాటే దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ పరిశ్రమలు వృద్ధిచెందాయి. భారతీయ పెట్టుబడిదారుల గుత్తాధిపత్యం కింద 19వ శతాబ్దం మధ్యకాలంలోనే నూలు బట్టల పరిశ్రమ ముఖ్యంగా బొంబాయిలో అభివృద్ధి చెందింది. 20వ శతాబ్దం ఆరంభంలో పరిశ్రమలు మరింత అభివృద్ధిని సాధించాయి. 1886లో 95 మిల్లులు ఉంటే, 1905 నాటికి వాటి సంఖ్య 197కు పెరిగింది. అంటే ఇరవై ఏళ్ల కాలంలో పరిశ్రమలు రెట్టింపు అయ్యాయన్న మాట. ఇక్కడ ఒక విషయం గుర్తించాల్సి ఉంది. పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానంలో అంతర్భాగమైన భారతీయ పెట్టుబడిదారీ సంస్థలు స్వదేశంలోనే బ్రిటీష్ పెట్టుబడిదారీ సంస్థలతో సమాన స్థాయినీ, హోదానీ ఎన్నడూ అనుభవించలేదు. భారతీయ సంస్థలకు ప్రోత్సాహం ఇవ్వడానికి బదులుగా వలస పాలకులు బ్రిటీష్ పెట్టుబడిదారుల ఆదేశాల మేరకు దేశంలోని పారిశ్రామికాభివృద్ధిని నిర్లక్ష్యం చేశారు. అంతేకాక అనేక సంస్థల అభివృద్ధిని కుంటుపరిచారు. ఆంగ్ల-భారతీయ పెట్టుబడిదారుల ప్రయోజనాల మధ్య స్పష్టమైన వైరుధ్యాలున్నప్పటికీ, బ్రిటన్‌లోని ప్రైవేటు పెట్టుబడిదారుల విషయంలో బ్రిటీష్ ప్రభుత్వం బహిరంగంగానే పక్షపాత వైఖరి అవలంబించినప్పటికీ, వివిధ రంగాల్లో పరిశ్రమల అభివృద్ధి జరుగుతూనే ఉంది. రైలుమార్గాలు, రోడ్డు రవాణా, నౌకామార్గాలు వృద్ధిచెందాయి. స్వదేశీ, విదేశీ రవాణా సౌకర్యాలు మెరుగవడంతో భారతీయ ఆర్థిక, సామాజిక జీవితంలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి.
ఇదంతా చెప్పడం ఎందుకంటే అప్పటి బ్రిటీష్‌వాళ్లు తమ అవసరాల నిమిత్తం ఇక్కడ ఎట్లా అయితే పారిశ్రామిక అభివృద్ధికి బాటలు వేస్తూనే బ్రిటీష్, భారతీయ పారిశ్రామికులకు మధ్య పక్షపాతం చూపించారో, ఇప్పటి మన పాలకులు సైతం అదే రకమైన పారిశ్రామికాభివృద్ధికి తోడ్పడుతున్నామంటూనే ప్రభుత్వ, ప్రైవేటు పరిశ్రమల మధ్య పక్షపాతాన్ని ప్రదర్శిస్తున్నారు. చిత్రమేమంటే అప్పుడు బ్రిటీష్ వాళ్లు తమ కంపెనీలను ప్రమోట్ చేయడానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తే ఇప్పుడు పాలకులు ప్రభుత్వ కంపెనీలను మూసేస్తున్నారు, లేదంటే  వాటిని ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెడుతున్నారు! ఈ రాజకీయ నాయకుల పునరావాసానికీ, అధికారుల అక్రమాలకూ ఈ ప్రభుత్వ సంస్థలే పనికివచ్చాయి. ఫలితంగా నిలువెత్తు నష్టాల్లో కూరుకుపోయి ఆర్థిక వ్యవస్థకు అడ్డంకులుగా తయారయ్యాయి. కేంద్రానికి చెందిన 236 సంస్థల్లో పెట్టుబడి రూ. 2,30,000 కోట్లు కాగా 1998-99లో వచ్చిన లాభం రూ. 19,473 కోట్లు మాత్రమే. వీటిలో 118 సంస్థలు రూ. 5,856 కోట్ల నష్టం చూపాయి. ఖాయిలాపడిన 67 సంస్థలు ప్రభుత్వ ఖజానాకు భారంగా పరిణమించాయి. వీటిలో 23 సంస్థల పునరుద్ధరణకు గత తొమ్మిదేళ్లుగా రూ. 34,000 కోట్లు వెచ్చించారని అంచనా. రూ. 13 వేల కోట్లతో ప్రస్తుతం మరో 14 సంస్థల మరమ్మతు కార్యక్రమం నడుస్తోంది.
ప్రభుత్వపు పెట్టుబడుల్ని క్రమంగా ప్రభుత్వ సంస్థల నుండి ఉపసంహరింప చేసేందుకు ప్రపంచ బ్యాంకు ఆదేశాలపై ప్రభుత్వమే నియమించిన 'డిజిన్వెస్ట్‌మెంట్ కమీషన్' 1997లో ఒక సలహా ఇచ్చింది. దాని ప్రకారమే 'బాల్కో' (భారత్ అల్యూమినియం కంపెనీ) షేర్లను విక్రయించాలని నిర్ణయించారు. ప్రభుత్వం తన వంద శాతం వాటాను 50 శాతం కన్నా తగ్గించుకోవడం అన్నది బాల్కో షేర్ల విక్రయంతోనే మొదలయ్యింది. ఇలా ప్రభుత్వరంగ పరిశ్రమల్ని ప్రైవేటీకరించే అంశంలో రెండు రకాల సమర్ధనలను ప్రభుత్వం ముందుకు తెస్తోంది. ప్రభుత్వరంగ సంస్థల సామర్థ్యాన్ని పెంపొందించేదుకు గాను ప్రైవేటు భాగస్వామ్యాన్నీ, యాజమాన్యాన్నీ చొప్పించడం తప్పనిసరి అనేది వీటిలో మొదటిది. ప్రభుత్వ రంగ సంస్థలు జాతీయ ఖజానాకు పెనుభారం అవుతున్నాయి కాబట్టి వీటిని సాధ్యమైనంత త్వరగా ప్రైవేటీకరించాలనేది రెండో వాదన. నష్టాలతో నడుస్తున్న, ఆర్థిక భారంగా మారిన ప్రభుత్వ పరిశ్రమల్ని ప్రైవీటీకరించడం తన లక్ష్యమనీ, లాభాల బాటలో నడుస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలకు స్వయం ప్రతిపత్తిని ఇవ్వడం తన విధానమనీ మొదట తెలిపింది ప్రభుత్వం. అట్లాగే మనదేశంలోనూ అంతర్జాతీయ స్థాయి బహుళ జాతి సంస్థల్ని అభివృద్ధి చెయ్యడం తన లక్ష్యమంది. అయితే ఆచరణలో ఇవేమీ జరుగుతున్నట్లు కనిపించడం లేదు. నష్టాలలో నడుస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలకు  సంబంధించిన ఆర్థిక వ్యయ భారాన్ని తగ్గించడం గానీ, బాగా నడుస్తున్న ప్రభుత్వ రంగ పరిశ్రమల్ని దృఢపరచడంగానీ చెయ్యలేకపోతున్నాయి ప్రభుత్వ విధానాలు.
బడ్జెట్ లోటును పూడ్చుకోడానికి లాభాల బాటలో నడుస్తున్న సంస్థల వాటాలను అమ్మివేయడమే ప్రభుత్వ విధానంగా కనిపిస్తోంది. లాభాల బాటలో ఉన్న ప్రభుత్వ రంగ పరిశ్రమల్ని అంతర్జాతీయ స్థాయికి ఎదగనీయడం అనేది కేవలం వట్టిమాట అనడానికి - గత ఎనిమిదేళ్ల కాలంలో ప్రభుత్వ రంగ సంస్థల వాటాలను అమ్మడమే నిదర్శనం. లాభాల బాటలో నడుస్తున్న ప్రభుత్వ రంగ పరిశ్రమల్ని కీలక స్థానాల్లోకి ప్రమోట్ చెయ్యడానికి బదులుగా ఆ సంస్థల్ని జాతీయ, అంతర్జాతీయ పోటీదారులకు కుదువబెడుతున్నారు. ప్రభుత్వ ఖజానాకు పెద్ద మొత్తాల్ని అందించిన ప్రభుత్వ రంగ సంస్థలైన ఐఒసి, ఓఎన్‌జిసి, హెచ్‌పిసిఎల్, భారత్ పెట్రోలియం, సెయిల్, మద్రాస్ రిఫైనరీస్, బిహెచ్ఇఎల్, కొచ్చిన రిఫైనరీస్, ఐపిసిఎల్, ఎంటిఎన్ఎల్ వంటి వాటిని బడ్జెట్ లోటును పూడ్చుకునే మిషతో ప్రైవేట్‌పరం చెయ్యాలని ప్రభుత్వం చూస్తోంది. యాజమాన్య సంస్కరణలంటూ, స్వచ్ఛంద పదవీ విరమణలంటూ, ప్రభుత్వరంగ సంస్థలకు మరింత స్వయం ప్రతిపత్తి అంటూ పెద్ద పెద్ద ఆదర్శాల్ని - ప్రైవీటీకరణకు సాకుగా చెబుతోంది. నిజ లక్ష్యం మాత్రం ఆ సంస్థల ఆస్తులను అమ్మివేయడమే. 1991-92 సంవత్సరంలో ప్రైవీటీకరణ ద్వారా రూ.2,500 కోట్ల రూపాయల ఆర్జనను లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం 1999-2000 నాటికి దాన్ని రూ.పదివేల కోట్లకు పెంచింది.
నిజానికి ప్రభుత్వ నియంత్రణలో ఉన్న ప్రభుత్వరంగ సంస్థలు దేశంలో బడా పెట్టుబడిదారుల ప్రయోజనాలను కాపాడుతూ వచ్చాయి. విదేశీ బహుళజాతి సంస్థలకు, దేశీయ బడా పెట్టుబడిదారులకు 'గిఫ్ట్'గా తక్కువ ధరలకు అమ్మివేస్తున్న ప్రభుత్వరంగ పరిశ్రమల్లోని పెట్టుబడులు అనేక సంవత్సరాల పాటు చెమటోడ్చి కష్టపడిన శ్రమజీవుల కష్టఫలాలే. ప్రజల ఆస్తుల్ని ప్రైవేట్‌పరం చేయడం ఎంతవరకు సమంజసం? ప్రభుత్వరంగ పరిశ్రమల్లో వాటాల అమ్మకాన్ని ద్రవ్యలోటుతో ముడిపెట్టడాన్ని పునరాలోచించాలి. లాభాలు సంపాదిస్తోన్న ప్రభుత్వరంగ పరిశ్రమల వాటాల్ని అమ్మకూడదు. ఆ సంస్థల్ని అంతర్జాతీయ స్థాయికి పెంచేందుకు కృషిచేయాలి. కనీసం 51 శాతం వాటాల్ని అమ్మకుండా యాజమాన్యాన్ని బదలాయించకూడదు. వాటాల్ని కొనుగోలుచేసే మొదటి అవకాశాన్ని వాటి ఉద్యోగులకే ఇవ్వాలి.

- వార్త దినపత్రిక, 26 జూలై 2001


Thursday, October 23, 2014

Cinema: Can Prabhas make a history as BAAHUBALI?

- ఆంధ్రజ్యోతి డైలీ, 23 అక్టోబర్ 2014

Cinema: Interview with Film Chamber President NV Prasad

- ఆంధ్రజ్యోతి డైలీ, 22 అక్టోబర్ 2014

Cinema: Interview with director Vijay Kumar Konda

- ఆంధ్రజ్యోతి డైలీ, 21 అక్టోబర్ 2014

Cinema: Interview with actor Nikhil

- ఆంధ్రజ్యోతి డైలీ, 21 అక్టోబర్ 2014

Cinema: Biopics in Bollywood

- ఆంధ్రజ్యోతి డైలీ, 20 అక్టోబర్ 2014

Saturday, October 18, 2014

Society: Hudhud in the eyes of actor and director R Narayana Murthy


- ఆంధ్రజ్యోతి డైలీ, 18 అక్టోబర్ 2014

Cinema: Remembering Smita Paril

- ఆంధ్రజ్యోతి డైలీ, 17 అక్టోబర్ 2014

Cinema: One Theater and Four Movies

- ఆంధ్రజ్యోతి డైలీ, 16 అక్టోబర్ 2014

Cinema: Interview of actress and director Renu Desai

- ఆంధ్రజ్యోతి డైలీ, 14 అక్టోబర్ 2014

Cinema: Remembering Ashok Kumar

- ఆంధ్రజ్యోతి డైలీ, 13 అక్టోబర్ 2014

Sunday, October 5, 2014

Society: Are Women Consumer Goods?

స్త్రీ వినియోగ వస్తువా?

ఇవాళ స్త్రీ సౌందర్యం పెద్ద వినియోగ సరుకు అయ్యింది మార్కెట్లో. సినిమాల్లోనూ, వాణిజ్య ప్రకటనల్లోనూ స్త్రీ శరీరాన్ని అసభ్యంగా, అశ్లీలంగా చూపించడం అప్పుడప్పుడూ చర్చకు వస్తున్నా ఫలితం మాత్రం శూన్యమే. అయితే కొన్ని పెద్ద పత్రికలుగా ముద్ర వేయించుకొన్న ఇంగ్లీష్ పత్రికలతో పాటు సెక్స్‌మీదే ఎక్కువగా ఆధారపడుతూ వస్తున్న కొన్ని తెలుగు పత్రికల ముఖచిత్రాల మీద అర్ధనగ్నంగా, అంతకంటే ఎక్కువగా కూడా స్త్రీ దేహం ప్రత్యక్షమవుతోంది. దిన, వార, మాస పత్రికలు అమ్మే అన్ని బుక్‌షాపుల్లో ఇవి దర్శనమిస్తున్నాయి. ఏదైనా మంచి పత్రిక కొందామని అక్కడకి వెళ్లే స్త్రీలు ఎదురుగా కనిపిస్తున్న ఆ పత్రికలను చూసి సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తోంది.
స్త్రీకి సౌందర్యం ప్రకృతి సహజంగా వచ్చింది. అంతమాత్రం చేత నిస్సంకోచంగా పత్రికల ముఖచిత్రాల కోసం ఆ సౌందర్యాన్ని ప్రదర్శించడం ఎంతవరకు సరైనది? తమ చర్య కేవలం పురుషుల్లోని మృగవాంఛను తృప్తి పరచడానికే తప్ప మరోరకంగా ఏమైనా ఉపయోగపడుతుందా? ప్రస్తుతం మన దేశ మార్కెట్ 'తిలకించు.. ఆనందించు..' అనే భావనలో కొట్టుకుపోతోంది. దీన్ని డబ్బు చేసుకోవడం కోసం కొంతమంది చేసే ప్రయత్నంలో యువతులు మార్కెట్ సరుకు కింద మారిపోతున్నారు. కవ్వింపు ఫోజుల్లో, లేస్ చేసిన లో దుస్తుల్లో, బిడియం, సిగ్గు లేకుండా అతి తక్కువ దుస్తుల్లో దర్శనమివ్వడాన్ని కొంతమంది యువతులు ధీరత్వంగా భావించడం ఏ సంస్కృతికి నిదర్శనమో అర్థంకాదు.
దిగంబర మోడలింగ్ అనేది చాలాకాలం క్రితమే పుట్టింది. అప్పట్లో దేహాన్ని అమ్ముకొనే వ్యభిచారిణులు మాత్రమే ఆ తరహా మోడలింగ్‌కు ఒప్పుకొనేవాళ్లు. పైగా వాళ్ల ఆర్థిక స్థితి అందుకు దోహదం చేసేది. అయితే ఇప్పుడు సంపన్న యువతులు సైతం ఈ మోడలింగ్‌కు వస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. డెబొనైర్, ఫాంటసీ వంటి పేరున్న పత్రికలు తమ పత్రికల్లో నగ్నంగా ఫోజు ఇస్తే రూ. 15,000 నుంచి రూ. 20,000 దాకా పారితోషికం ఇస్తుండగా, చాస్టిటీ, గయ్స్ ఎన్ గాళ్స్, బిఎం యాడ్స్, గ్లాడ్‌రాగ్స్, బాంబే ఎయిట్ వంటి పత్రికలు రూ. 10,000 దాకా ఇస్తున్నాయి. గృహిణులు, విద్యార్థినులు, ప్రైవేట్ రంగంలో ఉన్నత స్థానాల్లో ఉన్న స్త్రీలు కూడా ఆ రకమైన ఫోజులిచ్చేందుకు ముందుకు వస్తున్నారు. సాంఘిక రీతి రివాజులపై తిరుగుబాటు చేయాలన్న తపన, సంప్రదాయ విరుద్ధంగా, కొత్తగా కనిపించాలన్న ఆత్రుత తమను శారీరక ప్రదర్శనకు పురికొల్పాయని వాళ్లు చెబుతున్నారు. అయితే తమ చర్యవల్ల లబ్దిపొందేది పురుష పుంగవులేననే స్పృహను వాళ్లు విస్మరిస్తున్నారని చెప్పాలి.
సెక్స్‌ను మించిన సరకు లేదనే వ్యాపార వ్యూహంతో రంగంలోకి దిగిన ఆయా పత్రికల యాజమాన్యాలు మాత్రం తమ ఊహలకు మించి యువతులు నగ్నఫోజులిచ్చేందుకు ముందుకు వస్తుండటంతో తెగ ఆనందపడుతున్నారు. ఇరవై మప్పై వేల కాపీల నుంచి లక్ష కాపీలపైనే వాళ్ల పత్రికలు అమ్ముడవుతుండటం సమాజంలోని విలువల పతనానికి నిదర్శనం. 50 రూపాయల ధర ఉండే సంచిక వల్ల ఈ పత్రికలు తమ మనుగడ కోసం, ఆదాయం కోసం వ్యాపార ప్రకటనలపై ఆధారపడాల్సిన అవసరం లేదు. అయినా వ్యాపార ప్రకటనలు కూడా వీటికి బాగానే వస్తున్నాయి. ఈ రకంగా ఆర్థికంగా గట్టి పునాదులపై నిల్చిన ఈ పత్రికలు ముందుకు దూసుకెళ్లడంలో ఆశ్చర్యం లేదు. అయితే తమ వలువలు విడిచి ఫోజులివ్వాలన్న ఆలోచనని యువతులు మానుకునేలా చేయాల్సిన బాధ్యతను విలువలకు విలువనిచ్చే స్త్రీలు చేపట్టాలి. దేశవ్యాప్తంగా ఉన్న స్త్రీ సంఘాలు ఈ విషయమై కార్యాచరణ రూపొందించి ముందుకు నడవాలి. లేదంటే స్త్రీని కేవలం భోగవస్తువుగా మాత్రమే చూసే ధోరణి మరింత పెచ్చరిల్లుతుంది.

- ఆంధ్రభూమి డైలీ, 14 డిసెంబర్ 2002


Saturday, September 6, 2014

Saturday, August 30, 2014

Short Story: Sarangi Vadyagadu Maa Mavayya

కథ: 

సారంగి వాద్యగాడు మా మావయ్య

మా మావయ్య సారంగి మా గొప్పగా వాయిస్తాడు. మావయ్యంటే మా అమ్మకి అన్న. మావయ్యకు సంగీతమంటే ప్రాణం. ఉద్యోగం నిమిత్తం ఉత్తరప్రదేశ్‌కి పోయినప్పుడు జహీర్‌ఖాన్ అనే ఆయన దగ్గర సారంగి వాద్యం నేర్చుకొన్నాడు. సారంగి మీద వయొలిన్ స్వరాలు కూడా పలికించే మొనగాడు మా మావయ్య. ఆయనకు ఇద్దరు కూతుళ్లు. నేనింకా హైస్కూలుకు వెళ్లకముందే మా అత్తయ్య చనిపోయింది. దాంతో కూతుళ్లిద్దర్నీ తనే తల్లీ తండ్రీ అయ్యి ఏ లోటూ లేకుండా పెంచాడు మావయ్య. బాగా చదువు చెప్పించాడు. అయితే చీరాల్లో పనిచేస్తున్నప్పుడు ఆయన పెద్ద కూతురు వినీల ఇంట్లోంచి వెళ్లిపోయింది. వెళ్లిపోయిందంటే మనవాళ్లు సాధారణంగా అంటుంటారే.. 'లేచిపోయింది' అనీ.. అలా అన్నమాట. చీరాల్లోనే ఉండే ఒక డబ్బున అబ్బాయి ప్రేమలో పడి, పెద్దవాళ్లకు చెప్పా పెట్టకుండా గుళ్లో పెళ్లిచేసుకొని అతనితో వెళ్లిపోయింది. అప్పుడు మావయ్య ఎంత బాధపడ్డాడో. తన ప్రాణం పోయినట్లే విలవిల్లాడాడు. కొద్ది రోజులు ఎవరితోనూ.. అఖరుకి తన చిన్న కూతురు భావనతోనూ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు. పలకరించడానికి వెళ్లిన మా అమ్మతో "అదేంది అట్లా చేసింది? తల్లిలేని పిల్లలు కదా అన్జెప్పి వాళ్లని ఎండకి కందకుండా ఎట్లా పెంచాను. నా పరువిట్లా తీసుద్దని అనుకోలేదు" అన్నాడు.
అమ్మ "దానికి నువ్వేం చేస్తావులే అన్నయ్యా. నీ మీద గౌరవం ఉంటే అది ఈ పని ఎందుకు చేసుద్ది? నువ్వు దిగులు పెట్టుకోమాక" అని సముదాయించబోతే, "ఆడెవడో దానికి మాయమాటలు చెప్పి తీసకపొయ్యాడు. అది తప్పకుండా ఎప్పటికైనా వొచ్చుద్ది చూడు" అన్నాడు కూతుర్ని వెనకేసుకొస్తా. అమ్మ బిత్తరపొయ్యింది. ఆ తర్వాత చాలా మంది మావయ్యతో వినీల చాలా సంతోషంగా ఉందనీ, ఆమె మాంగారు బాగా ఉన్నోళ్లనీ, మీ అల్లుడు శానా మంచోడనీ చెప్పేతలికి "మంచోడైతే నాకు చెప్పి పెళ్లి చేసుకుంటాడు కానీ ఇట్టా లేవదీసుకపోతాడా" అని పైకని, లోపల్లోపల చాలా సంతోషపడ్డాడు. వినీల సంగతి వాళ్లు ఒకటి చెబితే, ఇంకో రెండు సంగతులడిగి, గోడకి తగిలించిన మా అత్తయ్య పటం ముందు నిల్చొని "ఏమనుకోమాక. అప్పుడది అట్టాంటి పన్జేసిందని తిట్టా. ఇప్పుడది సుఖంగా ఉందని తెలిశాక కూడా తిడ్తానా. దాన్సుఖమే కదా నాకు కావాల్సింది. నీకు సంతోషమే కదా" అన్నాడు.
కొన్ని నెలలు గడిచిపొయ్యాయి. ఒకరోజు మా అమ్మతో "పెద్దదాని బాధ్యత తీరిపోయింది. అది సుఖంగా ఉంది అంతే చాలు. రెండో దానికి ఓ మంచి సంబంధం చూసి చేస్తే ఇంక నాకే దిగులూ ఉండదు" అన్నాడు మావయ్య. ఆ సంగతి నాకు చెప్పిందమ్మ. ఆ తర్వాత రోజే ఆదివారం రావడంతో నేను మావయ్య వాళ్లింటికెళ్లా. నన్న్ను చూడ్డంతోటే భావన కళ్లు మెరిశాయి. నాకు తెలుసు భావనకి నేనంటే ఎంతిష్టమో. "మావయ్యా, నేను భావనని పెళ్లి చేసుకుంటా" అని చెప్పేశా. మామూలుగా అయితే ఎవర్నన్నా మధ్యవర్తుల్ని పంపించి సంబంధం అడిగిస్తుంటారు. సొంత బంధువులైనా సరే. నాకట్లా చెయ్యడం ఇష్టం లేదు. అందుకే డైరెక్టుగా చెప్పేశా. అప్పుడు మావయ్య కళ్లు వెలిగాయి.
"ఏరా రాఘవా. నిజంగానే అంటున్నావా, తమాషా చేస్తున్నావా?" అనడిగాడు మావయ్య. ఎందుకంటే ఇప్పుడు ఆయనకంటే మాకు ఆస్తులెక్కువ. మా నాన్న బట్టల వ్యాపారంలో బాగా సంపాదించాడు. చీరాల్లో మాకు రెండు బట్టల దుకాణాలున్నాయి. వాటిలో ఓ షాపుని నన్ను చూసుకొమ్మని నాన్న చెప్పాడు కానీ, నాకు ఇష్టం లేక రైల్వేలో ఉద్యోగం చేస్తున్నా.
"పెళ్లి విషంలో కూడా తమాషా చేస్తానా మావయ్యా. నాకు భావన అంటే ఇష్టం. తనకీ ఇష్టమైతే చేసుకుంటా" అన్నా, అక్కడే ఉన్న భావన వంక ఆరాధనగా చూస్తా. మావయ్య భావన వంక చూశాడు. అప్పుడు భావన "రాఘవని చేసుకోవడం నాకిష్టమే" అంది, కొంచెం సిగ్గుపడతా. మావయ్య మా పెళ్లిని మా గొప్పగా చెయ్యాలని నిర్ణయించుకొన్నాడు. పెద్ద కూతురి పెళ్లి తానెలాగూ చెయ్యలేకపోయాడు కాబట్టి ఈ చివరి పెళ్లినైనా ఘనంగా చెయ్యాలనేది ఆయన కోరిక. నాకేమో సింపుల్‌గా చేసుకోవాలనుంది. కానీ మావయ్య పడనియ్యలేదు.
"పెళ్లనేది జీవితంలో ఒక్కసారే కదరా వొచ్చేది. నాకు ఈ పెళ్లి తప్ప వేరే ఖర్చేముంది? మీ అంత లేకపోయినా నేను సంపాదించింది కూతుళ్లకి గాక ఎవరికియ్యను? దీనికి మాత్రం అడ్డు చెప్పకురా" అన్నాడు బతిమాలుతున్నట్లు.
దాంతో సరేననక తప్పలేదు. చీరాల ఏరియాలోనే ఖరీదైన కల్యాణ మండపాన్ని మాట్లాడాడు మావయ్య. ఇంకొద్ది రోజుల్లో పెళ్లనంగా ఓ మధ్యాహ్నం పూట మావయ్య, భావన బలవంతపెడితే వాళ్లతో పాటు భోజనం చేస్తున్నా. అప్పుడే తలుపు దగ్గిర ఎవరో వచ్చిన అలికిడి.
"ఎవరూ, లోపలికి రండి" అని కేకేశాడు మావయ్య. ఒక స్త్రీ లోపలికొచ్చింది. ముగ్గురం తినడం ఆపి ఆశ్చర్యంగా నోరెళ్లబెట్టాం. ఆ వొచ్చింది వినీల!
"నాన్నా" అని మావయ్య దగ్గరకొచ్చింది. ఆయనకి నోటెంట మాట రావడం లేదు. చాలాకాలం తర్వాత పెద్దకూతురు కనిపించేటప్పటికి ఏం చేయాలో, ఏం మాట్లాడాలో తోచనట్లు కట్టెలా ఉండిపోయాడు.
నేనే "మావయ్య ఏంటట్లా మాట్లాడకుండా చూస్తున్నావ్, వినీల వొస్తే" అన్నా ఉండబట్టలేక. అయినా ఆయన్లో ఉలుకూ పలుకూ లేదు. అట్లానే చూస్తున్నాడు వినీల వొంక. భావన "అక్కా, ఎంతకాలమైందే నిన్ను చూసి. యెట్టా ఉన్నావే" అని ఓ చేత్తో వాటేసుకుంది.
అప్పుడు చూడాలి మావయ్య మొహం. ఆనందంతో కళ్లెమ్మట నీళ్లు. "ఇన్నాళ్లకు నాన్నని చూడాలనిపించిందా బంగారు తల్లీ" అని వినీలని దగ్గరకు తీసుకున్నాడు. ఇట్లాంటి ఎమోషనల్ సీన్లని సినిమాల్లో చూడ్డమే కానీ నిజ్జంగా చూడ్డం అప్పుడే నాకు.
నిజం చెప్పొద్దూ.. అప్పుడా తండ్రీకూతుళ్ల సీను చూస్తుంటే నాక్కూడా ఏడుపొచ్చింది కానీ బలవంతాన అపుకున్నా.
"సారీ నాన్నా.. సారీ నాన్నా..." అంతకంటే మాట్లాడలేకపోయింది వినీల. మాతో పాటు తను కూడా తృప్తిగా భోంచేసింది. మా పెళ్లి సంగతి తెలిసి రాకుండా ఉండలేకపోయానంది. భావన, నేను పెళ్లి చేసుకోవడం తనకు చాలా సంతోషంగా ఉందని చెప్పింది.
మా పెళ్లికి ముహూర్తాలు పెట్టారు. మాఘమాసంలో చివరి సోమవారం భావన మెళ్లో మూడు ముళ్లూ వేశా. ఆ పెళ్లికి వినీల, వాళ్లాయనా, ఆమె అత్తామామలు కూడా వొచ్చారు. అప్పుడు మావయ్య ఆనందం అంతా ఇంతా కాదు. వినీల వాళ్లాయన పేరు చంద్రశేఖర్. అతను వినీలను అంటిపెట్టుకునే తిరుగుతున్నాడు. వాళ్లను చూసి "చూడముచ్చటైన జంట" అంది మావయ్యతో అమ్మ. అప్పుడు మావయ్య కళ్లు తృప్తిగా మెరిశాయి. వినీల వాళ్లను చూసి కొంతమంది చాటుమాటుగా చెవులు  కొరుక్కుంటున్న సంగతి చూసి కూడా ఆయన పట్టించుకోలేదు. 'అల్లుడి కులమేదైతేనేం, కూతురు సుఖంగా ఉంది. అంతే చాలు' అన్నాడు.
పెళ్లయి పదహార్రోజుల పండగ అయినాక మా అందర్నీ భోజనానికి పిలిచాడు చంద్రశేఖర్. ఆ ఆలోచన వినీలదేనని మా అందరికీ తెలుసు. మావయ్య వెళ్లాలా, వొద్దా అని వొకటే మల్లగుల్లాలు పడ్డాడు. "వెళ్లకపోతే అక్క బాధపడుద్ది నాన్నా. వెళ్దాం" అని పట్టుబట్టింది భావన. నేనూ, అమ్మ కూడా తనను సపోర్ట్ చేశాం.
వినీల వాళ్లింటి దగ్గిర ఊహించనంత మర్యాదలు జరిగాయి. వినీల అత్తామామలు మాపై చూపిన ఆదరంతో మావయ్య అనుమానాలన్నీ పటాపంచలైపోయాయి. అంతదాకా బాగా డుబ్బున్నోళ్లకు తలపొగరు ఉంటుందనీ, తమకంటే తక్కువ స్థాయివాళ్లను చులకనగా చూస్తారనీ నాకూ ఓ అభిప్రాయం ఉండేది. వాళ్లను చూశాక నా అభిప్రాయం సవరించుకున్నా, బాగా ఆస్తిపరుల్లోనూ కొంతమంది మంచివాళ్లుంటారని.
ఆ ఇంట్లోని ప్రతిగదినీ దగ్గరుండి చూపించింది వినీల. అంతసేపూ భావన చేయిపట్టుకునే ఉంది. అన్నీ విశాలమైన గదులు. హాలు సంగతైతే చెప్పనక్కరలేదు. అంత పెద్ద ఇల్లు కూడా పరిశుభ్రంగా ఉండటాన్ని మేం గమనించాం. డైనింగ్ హాల్లోకి వెళ్లాక ఆశ్చర్యపోయాం. అక్కడ పదిమంది కూర్చునేంత పెద్ద టేబుల్ ఉంది. అప్పటికే వాటిపై భోజన ఏర్పాట్లు చేసున్నాయి. పెద్దవాళ్లంతా.. వినీల అత్తామామలు, మా అమ్మానాన్నలు, మావయ్య ఒకేపు కూర్చుంటే, కుర్రాళ్లం.. వినీల, చంద్రశేఖర్, భావన, నేను.. ఇంకోయేపు ఎదురెదురుగా కూర్చున్నాం.
ఆ ఇంట్లో పనివాళ్లయిన ఇద్దరు మొగుడూ పెళ్లాలున్నారు. వాళ్లు ముందుగానే టేబుల్ మీద తొమ్మిది వెడల్పాటి అరిటాకులు వేసి, గాజు గ్లాసులో మంచినీళ్లు పోసి ఉంచారు. భోజన పదార్థాలన్నీ టేబుల్ మధ్యలో ఉంచిన పాత్రల్లో పొగలు కక్కుతున్నాయి, వేడివేడిగా. వినీలే స్వయంగా అందరికీ వడ్డిస్తుంటే చంద్రశేఖర్ ఆమెకు అవీ ఇవీ అందిస్తూ వచ్చాడు. మేం తృప్తిగా, సుష్టుగా భోంచేశాం. భోజనాలయ్యాక అందరం ఇంటిముందున్న చెట్లకింద నీడలో వేసిన కుర్చీల్లో కూర్చున్నాం. కొద్దిసేపటి దాకా అక్కడ వాతావరణం నిశ్శబ్దంగా ఉంది. కొత్త ప్రదేశం, కొత్త మనుషులు కావడం వల్ల కావచ్చు మేం కలివిడిగా ఉండలేకపోతున్నాం. గాలి చల్లగా వీస్తున్నా.. ఏదో అసౌకర్యం.
అప్పుడే వినీలకు చంద్రశేఖర్ దేనికోసమో సైగచేయడం గమనించా. లోపలికి వెళ్లిన వినీల తెచ్చిన వస్తువును చూసి అందరం ఆశ్చర్యపోయాం. అది సారంగి! మావయ్యయితే వెడల్పయిన కళ్లతోటి దానివొంక చూశాడు. ఆ సారంగి కొత్తదని దాని మెరుపు చెబుతోంది. వినీల దాన్ని చంద్రశేఖర్‌కిచ్చింది. వినీల వొంక నవ్వుతా చూసి సారంగి తీగను మీటాడు చంద్రశేఖర్. అది శ్రావ్యంగా మోగింది. మావయ్య ఆశ్చర్యంలో మునిగితేలుతుండగా యమునా రాగంలో ఒక పాత సినిమా పాట పాడుతూ సారంగి వాయిస్తున్నాడు చంద్రశేఖర్. అది మావయ్యకు ఎంతో ఇష్టమైన పాట. ఒక పల్లవీ, ఒక చరణం పూర్తయ్యాయి. ఆ పాట, ఆ వాద్యం తప్ప మరే చప్పుడూ అక్కడ లేదు.
మేం పరిసరాల్ని మర్చిపోయి అతడి పాటనీ, మధురమైన సారంగి వాద్యాన్నీ ఆస్వాదిస్తున్నాం, ఆ ఎండలో నీడపట్టున. అంతలో ఏదో అపశృతి. పాటకూ, వాద్యానికీ లంకెలేకుండా. సంగీత జ్ఞానం లేని మాకు కూడా అది తెలిసిపోయింది. చప్పున మావయ్య "తాళం తప్పింది అల్లుడుగారూ" అన్నాడు అప్రయత్నంగా. చంద్రశేఖర్ చేతిలోని సారంగి ఆగిపోయింది. "మీ వాద్యం వినాలని ఉంది మావయ్యగారూ" అన్నాడు. నాకెందుకో అతను కావాలనే తాళం తప్పాడనీ, మావయ్యచేత సారంగి వాయించడానికి అలా చేశాడనీ అనిపించింది.
"కానియ్ నాన్నా" అంది వినీల మావయ్య బెరుకును పోగొట్టాలని. అప్పుడు మావయ్య ఆ పాటలోని రెండో చరణాన్నీ, పల్లవినీ సారంగి వాయిస్తూ అద్భుతంగా పాడాడు. సారంగి వాద్యంలోని తీయదనాన్ని మాకందరికీ పంచాడు. "సూపర్.. సూపర్‌గా పాడారు మావయ్యగారూ" అని చంద్రశేఖర్ చప్పట్లు కొడితే, మిగతా అందరం అతనితో జత కలిశాం. దాంతో మావయ్య కాస్త సిగ్గుపడ్డాడు. సారంగిని చూస్తూ దాని తీగలు సవరించాడు. చంద్రశేఖర్‌కు దాన్ని తిరిగివ్వబోయాడు. అతను "మీ వద్దే ఉంచండి మావయ్యా. ఇది మీకు నా గిఫ్ట్" అన్నాడు. మావయ్యకు ఆశ్చర్యమూ, ఆనందమూ.. రెండూ కలిగాయి.
"మీరు నాకు కానుక ఇవ్వడమేమిటి అల్లుడుగారూ.. నేనే మీకివ్వాలి. ఇంత గొప్పింటికి నా కూతురు కోడలైనా మీకేమీ ఇవ్వలేకపోయా" అన్నాడు  మావయ్య కృతజ్ఞత నిండిన గొంతుతో.
"ఎందుకివ్వలేదు మీరు. పెద్ద కానుకే ఇచ్చారుగా" అన్న చంద్రశేఖర్ మాటలకు అందరం అతనివొంక ఆసక్తిగా చూశాం. అతను వినీల చేయిపట్టుకొని "ఇదుగో ఆ కానుక" అన్నాడు. అతని మంచి మనసుకు మావయ్యతో పాటు మేం కూడా చాలా చాలా సంతోషించాం.
"అవునూ.. మీకు సారంగి ఎలా వొచ్చు?" అడిగా కుతూహలం ఆపుకోలేక.
"నేను ఉస్మానియా యూనివర్శిటీలో చదివేప్పుడు జాహెద్ అనే అతను నాకు మంచి ఫ్రెండ్. వాడిది ఉత్తరప్రదేశ్. వాడి దగ్గర సారంగి ఉండేది. బాగా వాయిస్తాడు. వాడివద్దే ఏదో కొద్దిగా నేర్చుకున్నా. పెళ్లయ్యాక వినీల చెప్పింది, మావయ్యకు సారంగి అంటే బాగా ఇష్టమని. జాహెద్‌కు ఫోన్‌చేశా. ఇది పంపించాడు" చెప్పాడు చంద్రశేఖర్. అప్పుడు మావయ్య కళ్లు చెమర్చకుండా ఉండలేకపోయాయి. చంద్రశేఖర్ రెండు చేతులూ పట్టుకొని "సారీ బాబూ" అన్నాడు.
"ఎందుకు మావయ్యాగారూ?"
"మా అమ్మాయిని నాకు తెలీకుండా, చెప్పకుండా పెళ్లిచేసుకొని తీసుకుపొయ్యావని నిన్ను ఎన్ని మాటలన్నానో. నీ మంచి మనసు చూశాక, నేనెంత తప్పు చేశానో అర్థమైంది."
"లేదు మావయ్యాగారూ. మా ప్రేమ సంగతి మీకు చెప్పకుండా నిజంగా తప్పుచేసింది నేనూ, వినీలా. మీరు మా పెళ్లికి ఒప్పుకోరనే సందేహంతోటే మీకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నాం. తనను మా ఇంటికి తీసుకుపోయా. అప్పుడు ఓ తండ్రిగా మీరెంత బాధపడి ఉంటారో. మీరే మమ్మల్ని క్షమించాలి."
అదరి హృదయాలూ తేలికైపోయాయి.
ఇప్పుడు మావయ్య మా పిల్లల్నీ, వినీల పిల్లల్నీ దగ్గర కూర్చోబెట్టుకొని ఆ సారంగి వాయిస్తూ, వాళ్లకు నేర్పిస్తూ కాలక్షేపం చేస్తున్నాడు హాయిగా.

- 4 ఏప్రిల్ 2010, ఆదివారం ఆంధ్రప్రభ