Saturday, July 31, 2010

Gallery: Kamalini Mukherjee











Poetry: Bathukuporu

బతుకుపోరు

ముంచెత్తబోయే వరదని వంతెన మాటున
నొక్కిపట్టి
కొత్త కలలకు రెక్కలు మొలిపించుకుంటూ
ఆశగా
"నా రైతుని బతికించుకోవాలి" అంది
నేలతల్లి!
అక్కడ
ఎదుగుతున్న వరినారు బేలగా ఎండిపోయి
అప్పు కుప్పలుగా పేరుకుంది
కరువు కాలికింద
రైతు బతుకు చితికిపోయింది
కరువునిస్తా లేదంటే
వరదనిస్తా అనే ప్రకృతిని
నారు పోసినంత తేలిక్కాదు కదా
అదుపు చేయడం!
నిజం
రైతుకేం ఇవ్వాలో తెలీని
ప్రకృతిని
అంత సులువుకాదు వంచడం!
రైతుకు కచ్చితంగా తెలుసు
పంటా కావాలి
అందుకు తగ్గ ధరా కావాలి.. అని!
అప్పటికే ప్రతి రుతువూ మోసం చేసినా కూడా
శిలువ మోస్తున్న రైతుకు అనిపిస్తూనే వుంది
ఈ యేడు పంట ఎండినా
వచ్చే యేడు పండుద్దని
బతికే ధైర్యాన్నిస్తుందని
అతణ్ణి నిలువునా కోసినా
నేలతల్లినే కలవరిస్తుంటాడు!
ఎన్ని తరాలైనా ఎడతెగని
ఈ బతుకుపోరులో
చీడపురుగు పట్టిన వ్యవస్థ
ధైర్యాన్ని హరిస్తూనే వుంది
ఆత్మహత్యల్ని ఆపలేకపోతూనే వుంది
అవును.. అవునవును..
ఒకడుపోయి ఇంకొకడు వస్తాడు
అధికారానికి
ఫలితం మాత్రం ఒక్కటే
ఇది
రైతులు బతికే కాలం కాదు
రాబందుల కాలం
అందుకే రైతన్నాడు
"ఆగండి.. వంచన మాటలు చెప్పకండి
ముందు నన్ను పురుగులమందు
తాగనివ్వండి
చావు పొత్తిళ్లలో సేదతీరనివ్వండి"..!

-ప్రస్థానం, డిసెంబర్ 2009-జనవరి 2010

'Dubbing' Stroke To Tollywood


తెలుగు సినిమాకి ప్రధాన శత్రువులేమిటి? వీడియో పైరసీ, డబ్బింగ్ సినిమాలు. అవును. తామరతంపరగా వస్తున్న అనువాద చిత్రాలు నేడు స్ట్రయిట్ తెలుగు సినిమాల పాలిట విలన్లు. తెలుగు చలనచిత్ర పరిశ్రమకు దాదాపు పారలల్ గా అనువాద చిత్ర పరిశ్రమ 'వర్థిల్లుతోంది'. 2009లో విడుదలైన స్ట్రయిట్ సినిమాలకు కాస్త అటుఇటుగా అంతే సంఖ్యలో డబ్బింగ్ ఫిలిమ్స్ రిలీజయ్యాయి. దానికి రిజల్ట్.. స్ట్రయిట్ సినిమాల కలెక్షన్లకు భారీ గండి. ఈ ఏడాది పరిస్థితిలోనూ పెద్ద మార్పు లేదు. కాకపోతే పోయిన సంవత్సరం స్థాయిలో డబ్బింగ్ సినిమాలు విడుదల కాకపోవచ్చు. ఆ రకంగా చూస్తే ఈ ఏడు నేరుగా తెలుగులో నిర్మాణమై, విడుదలైన సినిమాలు కూడా తక్కువయ్యాయి. ఫిల్మ్ ఛాంబర్ అందించిన సమాచారం ప్రకారం జనవరి నుంచి జూన్ వరకు ఆరు నెలల్లో రిలీజైన స్ట్రయిట్ సినిమాలు 58 అయితే, డబ్బింగ్ సినిమాలు సరిగ్గా 50. వాటిలో బాగా కలెక్షన్లు రాబట్టిన సినిమాలు స్ట్రయిట్ సినిమాల మాదిరే బాగా తక్కువ. 'యుగానికి ఒక్కడు', 'ది ఉల్ఫ్ మ్యాన్', 'మదనుడు.. మృగమైతే', 'ఐరన్ మ్యాన్-2', 'ఆవారా', 'ప్రిన్స్ ఆఫ్ పర్షియా', 'యముడు', 'ద కరాటే కిడ్' వంటివి కొద్దో గొప్పో కలెక్షన్లు రాబట్టాయి. మిగతావేవీ ఆడలేదు. వాటిలో 'విలన్', 'క్లాష్ ఆఫ్ ద టైటాన్స్', 'ఆవహం', 'సూపర్ కౌబాయ్', 'కైట్స్', 'ప్రిన్స్' వంటి డిజాస్టర్స్ వున్నాయి.
తక్కువ కష్టం, నష్టం
అసలు నిర్మాతలు స్ట్రయిట్ సినిమాల కంటే డబ్బింగ్ సినిమాల మీదే ఎందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు? సమాధానం సులువైనదే. స్ట్రయిట్ సినిమాల ప్రొడక్షన్లో సవాలక్ష కష్టాలు వుంటాయి. ఇండస్ట్రీలోని 24 క్రాఫ్టులతో పని వుంటుంది. రోజువారీ షూటింగంటే ఒక యుద్ధం చేసినంత పని. ఎన్ని రోజులు షూటింగుంటే అన్ని రోజులూ నిర్మాతలకి ఊపిరి సలపనంత పని. ఏదైనా అవాంతరంతో ఒక్క రోజు షూటింగ్ కాన్సిలయినా, ఆ రోజు కాల్షీట్లు ఇచ్చిన యాక్టర్ల కాంబినేషన్లో తిరిగి షూటింగ్ చేయడానికి నానా పాట్లూ పడాలి. టైమ్ వేస్ట్, మనీ లాస్. 24 క్రాఫ్టులవారినీ సమన్వయంతో పనిచేయించుకోడం అంత ఈజీ కాదు. ఇన్ని బాధలు పడి సినిమా తీసినా ఆ సినిమా హిట్టవుతుందనే గ్యారంటీ ఏ కోశానా వుండదు. పెట్టిన డబ్బు వస్తుందనే నమ్మకం కనిపించదు. ఆ బాధలన్నీ ఎందుకనే ఉద్దేశంతోటే చాలామంది డబ్బింగ్ సినిమాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ సినిమాలకైతే కొత్తగా షూటింగ్ చేయాల్సిన పనిలేదు. 24 క్రాఫ్టుల్లో రెండు, మూడు క్రాఫ్టులు మినహా మిగతా వారితో పనివుండదు. డబ్బింగ్ స్పెషలిస్టులైన రచయితలతో మాటలు, పాటలు రాయించి, డబ్బింగ్ కళాకారులతో వాయిస్ ఇప్పిస్తే సరిపోతుంది. అవసరమైతే ఎడిటింగ్ మార్పులు వుంటాయి. అంతకుమించి మిగతా డిపార్టుమెంట్ల వారితో అవసరం వుండదు. ల్యాబులో డైలాగ్స్, సాంగ్స్ మిక్సింగ్ చేయిస్తే చాలు.. సినిమా రెడీ! అందుకే అతి తక్కువ కష్టం, నష్టం వుండే డబ్బింగ్ సినిమాలకి నిర్మాతలు ఓటు వేయడం.
పెద్ద సంస్థలదీ అదే బాట
మనదేశంలో బాలీవుడ్ తర్వాత అతిపెద్ద సినీ పరిశ్రమ టాలీవుడ్డే. అందువల్లే ఇక్కడి డబ్బు కొల్లగొట్టుకు పోవడానికి తమిళ, హిందీ, ఇంగ్లీషు సినిమాల డబ్బింగ్ రూపాలు వెల్లువలా వస్తున్నాయి. తెలుగులో అవి భారీ విజయాలు సాధించకపోవచ్చు. కానీ ఏడాది మొత్తం మీద డబ్బింగ్ సినిమాల మీద తెలుగు ప్రేక్షకులు వెచ్చిస్తున్న డబ్బు యాభై కోట్ల రూపాయల పైమాటే. అంటే ఆమేరకు మన తెలుగు సినిమాలు నష్టపోతున్నాయన్నమాట. ఇంగ్లీషు భాషలో వుండే హాలీవుడ్ సినిమాలు నగరాలకే పరిమితమవుతున్నందున, విలేజ్ మార్కెట్టుని కూడా అందుకోవాలంటే తెలుగులో వాటిని డబ్ చేయడమొక్కటే మార్గం. కాబట్టే.. వార్నర్ బ్రదర్స్ పిక్చర్స్, పారామౌంట్ ఫిలిమ్స్, ఇండో ఓవర్సీస్ ఫిలిమ్స్, వాల్ట్ డిస్నీ పిక్చర్స్, కొలంబియా పిక్చర్స్ వంటి గొప్ప గొప్ప హాలీవుడ్ నిర్మాణ సంస్థలు తమ సినిమాల్ని తెలుగు వంటి ప్రాంతీయ భాషల్లో డబ్ చేయడానికి ఉత్సాహం చూపుతున్నాయి.
ఈ ఏడాది వార్నర్ బ్రదర్స్ పిక్చర్స్ సినిమాలు 'ఫైనల్ డెస్టినేషన్', 'క్లాష్ ఆఫ్ ద టైటాన్స్', పారామౌంట్ ఫిలిమ్స్ ప్రొడ్యూస్ చేసిన 'ది ఉల్ఫ్ మ్యాన్', 'ఐరన్ మ్యాన్-2', ఇండో ఓవర్సీస్ ఫిలిమ్స్ 'లేడీ టెర్మినేటర్', వాల్ట్ డిస్నీ పిక్చర్స్ నిర్మించిన 'ప్రిన్స్ ఆఫ్ పర్షియా' సినిమాలు తెలుగులో రిలీజయ్యాయి. అలాగే బాలీవుడ్డులో భారీ వ్యయంతో తయారైన వివేక్ ఓబరాయ్ సినిమా 'ప్రిన్స్', సాజిద్ నదియడ్ వాలా సినిమా 'హౌస్ ఫుల్', హృతిక్ రోషన్ మూవీ 'కైట్స్' సినిమాలు తెలుగులో విడుదలయ్యాయి. రాంగోపాల్ వర్మ బాలీవుడ్డులో నిర్మించిన 'ఫూంక్-2' చిత్రం 'ఆవహం' పేరుతో వచ్చింది. వీటిలో బాలీవుడ్ నుంచి వచ్చిన సినిమాలన్నీ ఫెయిలవడం గమనార్హం.
థియేటర్ల కొరత
స్ట్రయిట్ సినిమాలతో సమాన సంఖ్యలో డబ్బింగ్ సినిమాలు విడుదలవడం వల్ల తెలుగు నిర్మాతలకు తమ సినిమాల్ని విడుదల చేసుకోడానికి థియేటర్ల కొరత ఏర్పడుతోంది. తమిళ హీరోలు రజనీకాంత్, కమల్ హాసన్, విక్రమ్, సూర్య, కార్తీ వంటివాళ్ల సినిమాలకు మన రాష్ట్రంలో మంచి మార్కెట్ వుంది. వాళ్ల సినిమాలు తెలుగులోని పెద్ద హీరోల సినిమాల స్థాయిలో ఎక్కువ ప్రింట్లతో విడుదలవుతున్నాయి. ఈ ఏడాది కొత్తగా సూర్య తమ్ముడు కార్తీ తెలుగులోనూ చెప్పుకోదగ్గ మార్కెట్ సంపాదించాడు. 'యుగానికి ఒక్కడు'తో అతను తెలుగువాళ్లకి పరిచయమయ్యాడు. పబ్లిసిటీ వల్లనైతేనేమి, సినిమాలోని విషయం వల్లనైతేనేమి అది పెద్ద హిట్టయ్యింది. తమిళ వెర్షన్ కంటే తెలుగు డబ్బింగ్ వెర్షనుకే ఆ సినిమా నిర్మాతకి ఎక్కువ లాభాలు రావడం ఇక్కడ గమనించదగ్గ అంశం. ఈ ఒక్క సినిమాతో కార్తీ తెలుగువాళ్లకి సన్నిహితమైపోయాడు. అది హిట్టవడంతో అతని మరో సినిమా 'ఆవారా'కు ఎక్కడలేని డిమాండూ వొచ్చింది. అందుకు తగ్గట్లే సుమారు 125 ప్రింట్లతో విడుదలైన ఆ సినిమాకి తెలుగులోని పెద్ద హీరో సినిమాల స్థాయిలో ఓపెనింగ్స్ వొచ్చాయి. ఇలా అతని రెండు సినిమాలూ తెలుగులో విజయాన్ని సాధించడం వల్ల కార్తీ మినిమం గ్యారంటీ డబ్బింగ్ సినిమాల హీరోగా మారాడు. భవిష్యత్తులో రిలీజవబోయే అతని సినిమా కోనేందుకు బయ్యర్లు పోటీపడడం ఖాయం. ఇక 'గజిని' సినిమాతో సూర్యకి తెలుగులో వొచ్చిన మార్కెట్ ఏ స్థాయిదో మనకు తెలిసిందే. అతని మునుపటి సినిమా 'ఘటికుడు' చెప్పుకోదగ్గ స్థాయిలో ఆడకపోయినా ఇటీవల వొచ్చిన 'యముడు' సినిమాకి మంచి ఓపెనింగ్స్ వొచ్చాయి. ఆ సినిమాలో హీరోయిన్ అనుష్క కావడం ప్లస్సయింది. అది వంద ప్రింట్లతో రాష్ట్రవ్యాప్తంగా విడుదలైంది. ఇక విక్రమ్, ఐశ్వర్యారాయ్ కాంబినేషనుతో మణిరత్నం తమిళంలో రూపొందించిన 'రావణన్' తెలుగు డబ్బింగ్ వెర్షన్ 'విలన్' భారీ స్థాయిలో 125 ప్రింట్లతో 215 థియేటర్లలో విడుదలైంది. అంటే అవి ఆడుతున్న సమయాల్లో థియేటర్లు లభించక స్ట్రయిట్ తెలుగు సినిమాల నిర్మాతలు కొంతమంది ఇబ్బందులు పడ్డారు.
నిఘా నిల్
ఒకవైపు తెలుగులోని క్రేజీ సినిమాల వల్ల థియేటర్ల కొరతని ఎదుర్కొంటున్న తెలుగులోని చిన్న (తక్కువ బడ్జెట్) సినిమాల నిర్మాతలు ఇప్పుడు ఈ బడా డబ్బింగ్ సినిమాల వల్ల మరింత అగచాట్లకు గురవుతున్నారు. థియేటర్లు సకాలంలో లభ్యంకాక విడుదల వాయిదా వేసుకుంటున్న సినిమాలెన్నో. ఆ తర్వాత విడుదల చేద్దామంటే వాటిని కొనేందుకు ఏ బయ్యరూ, ఏ డిస్ట్రిబ్యూటరూ ముందుకురాడు. అప్పటికే ఫైనాన్సుతో సినిమాని పూర్తి చేసిన నిర్మాతకు సొంతంగా రిలీజ్ చేసుకునే స్థోమత వుండదు. పబ్లిసిటీకీ, విడుదలకీ మళ్లా అప్పుచేసే ధైర్యం లేక చాలామంది నిర్మాతలు తమ సినిమాల్ని ల్యాబుల్లోనే మగ్గనిస్తున్నారు. అవెప్పుడు థియేటర్ల మొహం చూస్తాయో ఎవరూ చెప్పలేని స్థితి. ఈమధ్య కొంతమంది నిర్మాతలు తెలివిమీరి డబ్బింగ్ సినిమాలకి నాలుగైదు తెలుగు సీన్లు జోడించి, స్ట్రయిట్ సినిమాలంటూ విడుదల చేస్తున్నారు. తద్వారా డబ్బింగ్ సినిమాల మీద ప్రభుత్వం వేస్తున్న పన్నుని తప్పించుకుంటున్నారు. వీటిమీద సరైన నిఘా లేకపోవడంతో ఇలాంటి సినిమాలు తరచూ వస్తూనే ఉన్నాయి. ఈరకంగా డబ్బింగ్ సినిమాలు తెలుగు మార్కెట్ మీద దురాక్రమణ చేస్తున్నాయి. అష్టకష్టాలు పడి తెలుగులో సినిమాలు తీస్తున్న నిర్మాతల నడ్డి విరుస్తున్నాయి. కర్నాటక తరహాలో ఇక్కడ కూడా డబ్బింగ్ సినిమాల మీద ఆంక్షలు పెట్టుకుంటే తప్ప 'మన' నిర్మాతల కష్టాలు కొంతమేరకైనా తీరవు.

Thursday, July 29, 2010

Youth: Lessons from First Love


There is nothing either good or bad but thinking makes it so.
స్నేహానికి హద్దు అవసరమా? యువతీ యువకుల మధ్య స్నేహానికి మాత్రం హద్దు అవసరమేననేది అత్యధికుల అభిప్రాయం. మనిషి జీవితంలో బాల్యం తర్వాత వచ్చే యవ్వన దశ ఎంత సంక్లిష్టంగా వుంటుందో యవ్వనాన్ని ఇప్పటికే అనుభవించిన వాళ్లందరికీ తెలుసు. మరి ఈ రాతలు ఎవరికోసమంటే యవ్వనంలో వున్న వాళ్ల కోసమే. యవ్వనంలో వున్న వాళ్లలో బాల్య చేష్టలూ పూర్తిగా ప్రతిఫలించవు, ప్రౌఢ దశలోలా పరిపక్వతా కనిపించదు. ఓ విధమైన ద్వైదీభావంతో వాళ్లు కొట్టుమిట్టాడుతూ వుంటారు. ఈ దశ యువకులకి కచ్చితంగా పరీక్షా సమయం లాంటిదే. వాళ్లలో కలిగే ఆశలూ, ఊహలూ నియంత్రణని కోల్పోతాయి. వాళ్ల ప్రవర్తన మూలంగా తల్లిదండ్రులతో, టీచర్లతో, స్నేహితులతో విభేదిస్తుంటారు.
యువకులలో కలిగే భావానుభూతులు వాళ్లని చలింప జేస్తుంటాయి. భావ సంఘర్షణలు, అస్పష్టమైన దృక్పథాలు వంటివి వాళ్లని అనేక పరీక్షలకు లోను చేస్తాయి. ఏదో ఓ కొత్త మార్గాన్ని అన్వేషించాలనీ, గుర్తింపు పొందడం కోసం ఎంతటి క్లిష్టమైన పనైనా చేయాలనీ యువకులు తలపోస్తూ వుంటారు. తన కుటుంబం, చదువు, స్నేహితులు - వాళ్లతో సంబంధాలు, వాళ్ల ప్రవర్తన యువకుల్ని మరో గమ్యం వైపుకు లాగుతుంటాయి. అందులో భాగంగానే యువతులతో స్నేహాన్ని వాళ్లు వాంఛిస్తుంటారు.
యవ్వనమంటే 'తొలిప్రేమ' నుంచి తప్పించుకోలేని దశగా కవులు వర్ణిస్తుంటారు. మనో వైజ్ఞానికులు కూడా దీన్ని రూఢిపరుస్తారు. పదహారేళ్ల అమ్మాయికీ, పదిహేడేళ్ల అబ్బాయికీ 'తొలిప్రేమ' బారి నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదు. తమ ప్రేమని బయటకి వ్యక్తం చేయకపోయినా తప్పనిసరిగా వాళ్లు 'తొలిప్రేమ' అనుభవాన్ని పొందే వుంటారు. దాన్ని సహజమైన విషయంగానే గుర్తించాలి. తప్పించుకోలేని ఊహా జగత్తులోకి తొలిప్రేమ టీనేజర్లని తీసుకుపోతుంది. దాని ప్రభావం కూడా వారి హృదయాలపై ప్రసరిస్తుంది. ఆ స్థితిలో - ఇంద్రధనస్సులాంటి అందమైన ఆలోచనలు, తియ్యని పగటి కలలు, ప్రియురాలి ఓ చిరునవ్వు, ఆమె నుంచి చిన్న ఒప్పుకోలు, ఒక ప్రేమమాట, ఒక భాష్యం టీనేజర్ని ప్రేమజ్వరంతో కాగిపోయేట్టు చేస్తాయి. ఎట్లా జరగాలని అతడు కోరుకుంటాడో అందుకు అనుగుణమైన ఆలోచనలే అతనిలో కలుగుతుంటాయి. అతడిలో పూర్తి తాదాత్మ్య స్థితి కలుగుటుంది. ఒక కవిగా మారిపోయి ప్రేమ కవిత్వం చెబుతాడు. రచయితగా మారిపోయి తన భావాలను ప్రేమలేఖల రూపంలో వ్యక్తం చేస్తాడు. ఇవాళ సెల్ ఫోన్లతో ఎస్సెమ్మెస్సుల ద్వారా తన ప్రేమని ప్రదర్శిస్తున్నాడు. తన ప్రేమ ఎంతో స్వచ్ఛమైనది కూడా అని అతడు తన కవిత్వం ద్వారా, తన రచన ద్వారా తెలియజేస్తాడు. శ్రీశ్రీ 15 సంవత్సరాల వయసులోనే 'పరిణయ రహస్యము' అనే నవల రాశాడంటే అది తొలిప్రేమ ప్రభావమేమో అనిపిస్తుంది.
తొలిప్రేమలో చిక్కుకున్న వాళ్లు తమ భావానుభూతుల్ని లేఖల ద్వారా మాత్రమే కాదు. డైరీల్లో నిక్షిప్తం చేసుకోవడం ద్వారా కూడా వ్యక్తం చేస్తుంటారు. వస్త్రధారణ విషయంలో కూడా వీరు అమిత శ్రద్ధ కనపరుస్తారు. ప్రేమలో పడిన యువతయితే ఆధునిక శైలిలో ఎదుటివాళ్లని ఆకట్టుకునే లాగా వస్త్రధారణ చేసుకుంటుంది. ఎంత సమయాన్నైనా దీనికోసం వెచ్చిస్తుంది. ఫ్యాషన్ దుస్తులు, హైహీల్స్, బాబ్డ్ హెయిర్, ధగధగలాడే ఇయర్ రింగ్స్ - ధరిస్తుంది. ఇక యువకుడైతే జీన్స్, కొత్త కొత్త మోడళ్ల దుస్తులు, కళ్లకి రేబాన్ గ్లాసెస్ ధరిస్తుంటాడు. మోటార్ సైకిల్ మీద ఝామ్మని పోతుంటాడు. అలాగే తాను అమితంగా అభిమానించే సచిన్ లేదా ధోనీ లాంటి క్రికెట్ స్టారునో, మహేశ్ లేదా రాంచరణ్ లాంటి సినీ హీరోనో అనుకరిస్తూ వారిలా ప్రవర్తించడానికి ప్రయత్నిస్తుంటాడు. అయితే ఇవన్నీ చాలా త్వరగానే మరుగునపడి పోతుంటాయి. ఇలా జరగడం కూడా సహజమే. వాస్తవం తెలిశాక ఇవేవీ నిజమైన ప్రేమ భావాలకు ప్రతీకలు కాదన్న స్థితికి వాళ్లు వస్తారు. ఇది కూడా అసహజం కాదు. ఎందుకంటే యవ్వనమనేది మానసిక పరిపక్వతలేని, తన గురించి తనకే అవగాహనలేని, ఏదో గుర్తింపు కావాలని కోరుకునే దశ. తొలిప్రేమ భావాలు వాళ్లని చదువు నుంచీ, బాధ్యతల నుంచీ దూరం చేస్తాయి. ఆశ్చర్యంగా ఇవే అనుభూతులు వాళ్లకి చదువులో ఆధిక్యతనీ, గుర్తింపునీ త్వరలోనే కలిగిస్తాయి.
తొలి ప్రేమానుభూతులకి కారణం ఏమిటంటే ఎవరూ చెప్పలేరు. ఆ అనుభూతులు తప్పా, ఒప్పా కూడా చెప్పలేరు. కానీ తొలిప్రేమ సహజం. అది తప్పించుకోలేని అనుభూతి. వింతేమిటంటే తప్పొప్పులని గ్రహించడానికీ, మానసిక పరిపక్వతకీ తొలిప్రేమ బీజం వేస్తుంది.
పాశ్చాత్య దేశాల్లో యువతీ యువకుల మధ్య 'డేటింగ్' అనేది ఒక సహజమైన అంశం. మన సమాజంలో ఈ 'డేటింగ్' అనుసరించదగినదేనా? అనే ప్రశ్న టీనేజర్లలో వుంటుంది. ఈ విషయంలో మాత్రం ఏకాభిప్రాయం వ్యక్తం కావడం లేదు. ఆచారాలకీ, సంప్రదాయాలకీ విలువ ఇచ్చే పెద్దవాళ్లు మన సమాజం దృష్ట్యా 'డేటింగ్' మంచిది కాదనీ, భారతీయతకు సరిపడనిదనీ అంటారు. అయితే పాశ్చాత్య నాగరికతకు సన్నిహితమవుతున్న మనం - ముఖ్యంగా యువత దీన్నేమీ ఖాతరు చేయడం లేదు. ఇవాళ మన నగరాల్లో డేటింగ్ ఓ సాధారణ అంశం. హైదరాబాదులో ట్యాంకుబండ్ వద్దా, ఇందిరా పార్కు, ప్రసాద్ ఐమాక్స్ వద్దా పెళ్లికాని అమ్మాయిలూ అబ్బాయిలూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుండడం మనకు ప్రత్యక్షంగా కనిపిస్తుంది. పబ్బుల సంస్కృతి వచ్చాక ఏ పబ్బులో చూసినా ఇలాంటివాళ్లు కొల్లలుగా కనిపిస్తున్నారు.
ఫారిన్లో తమ పిల్లలకు తగిన జోడీని వెతకడం తల్లిదండ్రులకు చాలా కష్ట సాధ్యం. కాబట్టి తమకు నచ్చిన భాగస్వామిని వెతుక్కోవడానికి డేటింగ్ వారికి ఉపకరిస్తుంది. అదే మనదేశంలో తమ పిల్లలకు తామే జీవిత భాగస్వామిని ఎంపిక చేసే సంస్కృతి కొనసాగుతోంది. అందుచేత మన సమాజంలో డేటింగ్ ఆచరణీయం కాదని అంటారు. అయితే ఇంతకు ముందు నగరాలకు మాత్రమే పరిమితమైన డేటింగ్ ఇప్పుడు చిన్న పట్టణాలకు సైతం వ్యాపించింది. క్రమేణా ఇది పెరుగుతూ వస్తోంది. డేటింగ్ కోరుకునే యువతికి ఇదో థ్రిల్లింగుగా తోస్తుంది. ఒక్కోసారి అది సరిదిద్దుకోలేని విపత్కర పరిస్థితికి దారితీసే ప్రమాదం వుంటుందని అప్పుడామె గ్రహించకపోవచ్చు. ఆరాధనకన్నా మోహమే ఇందులో అధికంగా కనిపిస్తుంది.
సహజంగా ఒకే వయసు వున్న యువతీ యువకుల్లో ముందుగా యువతే వివాహానికి సిద్ధపడుతుంది. యువకుడికైతే చదువు పూర్తి కావాలి, ఉద్యోగం రావాలి, ఏదో ఓ ఉపాధి చూసుకోవాలి. జీవితంలో నిలదొక్కుకోవాలి. అందుకని అతడికి డేటింగ్ వివాహానికి సహకరించే సాధనంగా అనిపించదు. ఈ కారణంవల్ల డేటింగ్ మూలంగా నష్టపోయేదిఎక్కువగా ఆడవాళ్లే. ఒక యువతితో డేటింగ్ చేస్తున్నప్పటికీ తల్లిదండ్రుల వత్తిడి వల్ల ఇంకో యువతిని పెళ్లి చేసుకుంటాడు పురుషుడు. అలా కాకపోయినా మానసిక పరిపక్వతలేని వాళ్లు వివాహం చేసుకున్నా ప్రపంచానుభూతులకు ఎట్లా స్పందించాలో తెలీక తీవ్రమైన భావ సంఘర్షణకి లోనవుతారు.
కేవలం ఇద్దరు యువతీయువకుల మధ్య డేటింగ్ అనేదాన్ని ప్రోత్సహించడం కాకుండా సామూహికంగా స్కూళ్లలో, కాలేజీలలో స్త్రీ, పురుష సంబంధాలను, వాళ్ల సమస్యలను చర్చా గోష్ఠులుగా నిర్వహిస్తే యువతీ యువకుల మధ్య సరైన అవగాహన పెంపొందడానికి అవకాశం వుంది. సమభావంతో ఆటలలో కలిసి పాల్గొనడం ద్వారా వాళ్లు ఒకరి పట్ల మరొకరు ఆసక్తినీ, అవగాహననీ కలిగించుకోవచ్చు. పిక్నిక్కులు, ఎక్సుకర్షన్లు వంటివి కూడా వాళ్ల మధ్య మంచి అవగాహన ఏర్పడటానికి తోడ్పడతాయి. ఆనందాన్ని మాత్రమే కాక అవి వాళ్లలో నాయకత్వ లక్షణాల్ని కూడా ప్రేరేపిస్తాయి. ఈ సందర్భాల్లో వాళ్లు ఆడే ఆటలు, పాడే పాటలు ఉల్లాసాన్ని కలిగిస్తాయి. హృదయాన్ని గిలిగింతలు పెడతాయి.
ఎప్పుడైతే సామూహికంగా యువతీ యువకులు కలసి వుంటారో, ఒకరికొకరు సహకరించుకుంటారో అప్పుడు మనం భయపడేదేమీ జరగదు. జంటలు జంటలుగా విడిపోయి వున్నప్పుడు మాత్రమే మనమనుకునే ప్రమాదాలు సంభవించేది. వయసు కలిగించే సహజమైన కోరికలతో వాళ్లు పెడతోవపట్టే అవకాశం అప్పుడే వుంటుంది.
యువతీ యువకులు కూడా ఎప్పుడూ ఊహా ప్రపంచంలో విహరిస్తూ గాలిలో మేడలు కట్టే పనికి స్వస్తి చెప్పాలి. అందుకుగాను చక్కగా చదువుకోవాలి. ఒక మంచి లక్ష్యాన్ని ఎంచుకుని ముందుకు పోవాలి. వాళ్ల భవిష్యత్తు సక్రమంగా వుండటానికి ఇవే ఉత్తమ మార్గాలు.

Gallery: Namita