Saturday, August 27, 2011

న్యూస్: విష్ణువర్థన్ సినిమాల్ని మిస్ చేసుకున్న రాం

రాం చాలా ఆనందంగా ఉన్నాడు. కారణం తెలిసిందే. అతని లేటెస్ట్ సినిమా 'కందిరీగ' బాక్సాఫీస్ వద్ద హిట్‌గా డిక్లేరయ్యింది. తొలిసారిగా ఈ సినిమాలో కాలేజీ స్టూడెంట్ పాత్రలో తనదైన ఎనర్జీతో నటించి అలరించాడు రాం. ప్రస్తుతం 'ఎందుకంటే ప్రేమంట' సినిమాని చేస్తున్న అతను మరో కారణంగా ఎగ్జయిట్ అవుతున్నాడు. అది గౌతం మీనన్ డైరెక్షన్‌లో పనిచేసే అవకాశం రావడం. 'ఏమాయ చేసావె' తర్వాత గౌతం డైరెక్షన్‌లో చేయాలని చాలామంది కుర్ర హీరోలు ఆసక్తి చూపిస్తున్నారు. ఆ అవకాశం రాంకి దక్కింది. 'ఏమాయ చేసావె' హిందీ వెర్షన్‌ని డైరెక్ట్ చేశాక రాంతో అతని సినిమా మొదలవుతుంది. ఇది ఇటు తెలుగుతో పాటు అటు తమిళంలోనూ రూపొందుతుంది. చాలా కాలం నుంచి తమిళంలో చేయాలని ఆశిస్తున్నాడు రాం. "నిజానికి సూపర్‌హిట్ సినిమా 'ప్రేమిస్తే'లో నేనే చేయాల్సింది. అలాగే విష్ణువర్థన్ డైరెక్షన్‌లో నటించే ఛాన్స్ రెండు సార్లు వచ్చింది నాకు. కానీ రకరకాల కారణాలతో వాటిని చేయలేకపోయా" అని అతను తెలిపాడు.
ఖాళీ దొరికిందంటే అద్దం ముందు గడపడానికి అతను ఇష్టపడతాడు. "నన్ను నేను కరెక్ట్ చేసుకోడానికీ, నేర్చుకోవడానికీ అద్దం నాకు బాగా ఉపయోగపడుతుంది. ఇటు హైదరాబాద్, అటు చెన్నై ఆఫీసుల్లో నా గదిలోని ఓ గోడకి పూర్తిగా అద్దం వేయించా. అద్దంలో మనల్ని మనం పరిశీలించుకుంటుంటే మన రూపాన్నీ, హావభావాల్నీ అభివృద్ధి చేసుకోవచ్చు. ఎక్స్‌ప్రెషన్ పెడితే నా ఫేస్ ఎలా ఉండాలో నాకు తెలియాలి" అంటాడతను. ఎప్పుడూ ఒకే రకమైన పాత్రలంటే అతడికి చిరాకు. మిగతా కుర్ర హీరోలతో పోలిస్తే అతను బుద్ధిమంతుడే. "నేను తాగను. సిగరెట్లు కాల్చను. ఆడపిల్లలతో కలిసి తిరగను. పార్టీలకి వెళ్లను. తొందరగా పడుకుంటాను. అందుకే నన్నంతా అబ్‌నార్మల్ అంటుంటారు" అని నవ్వేస్తాడు.

No comments: