Tuesday, April 12, 2011

హిట్.. హిట్.. హుర్రే..!: ఆది (రెండో భాగం)

సీన్ 1
ఎన్నడో చిన్నతనంలో వొదిలేసిన ఊళ్లోకి చాలా కాలం తర్వాత అడుగుపెట్ట్టాడు ఆదికేశవరెడ్డి ఉరఫ్ ఆది. దాహం వేస్తోంది. బావి దగ్గర నీళ్లు తోడుతున్న కొంతమంది స్త్రీలు కనిపించారు. జీపు దిగి ఒకామెనడిగి నీళ్లు తాగాడు.
ఆకాశం వంక చూస్తా "వా.. ఏం పెట్టావ్‌రా ఈ నేలలో. నీళ్లు తాగితేనే నెత్తురు మరుగుతోంది" అని సెల్యూట్ చేసి, తనకి మంచినీళ్లు పోసిన స్త్రీతో "ఈ నేల తాకి, ఈ నీళ్లు తాగి పద్నాలుగేళ్లయ్యింది. వస్తానమ్మా" అన్నాడు నమస్కరిస్తా.
"ఎవరు బాబూ నువ్వు?" అనడిగింది ఆ పక్కనే ఉన్న మరొకామె.
"ఆదికేశవరెడ్డి గారి మనవణ్ణి" అనాడు అదే పేరున్న ఆది. అంతే. అక్కడున్న అందరు స్త్రీలూ అతడికి దణ్ణం పెట్టారు. ఆదికి మంచినీళ్లు పోసినామె అతడికి బొట్టు పెట్టింది.
"ఇక నుంచీ మీలో ఒకడిగా ఈ ఊళ్లోనే ఉంటాను" చెప్పాడు ఆది.
సీన్ 2
విజయదశమిలోపు తన ఆస్తులన్నీ తనకి హేండోవర్ చెయ్యమనీ, లేదంటే ఎనిమిదేళ్ల వయసులోనే బాంబులేసిన తనకు ఇప్పుడెయ్యడం పెద్ద కష్టం కాదనీ వార్నింగ్ ఇచ్చి వెళ్తున్న ఆది జీపుని బాంబుతో పేల్చేశాడు నాగిరెడ్డి.
"రేయ్. సీమంటే ఇట్టుంటుందిరా. పో. ఎక్కడో చోట హాయిగా బతుకు. లేదూ. ఇక్కడే బతుకుతానంటావా. ఉండటానికి ఇల్లిస్తా. పదెకరాల పొలమిస్తా. నా ముందు తలదించుకుని బతకాలి. తల ఎత్తావో నరికేస్తా" అన్నాడు నాగిరెడ్డి, కళ్లల్లో క్రూరత్వాన్ని ప్రదర్శిస్తూ.
చాలా మామూలుగా "ఊ.. ఇంకా" అన్నాడు ఆది.
"ఏందిరా.. ఏందిరా ఇంకా" అని రంకె వేశాడు నాగిరెడ్డి.
"చాలా ఉంది" అంటా విజిలేశాడు ఆది. బయట నాగిరెడ్డి సుమోలు నాలుగు ఒకేసారి గాల్లోకి లేచి పేలిపోయాయి. ఈసారి చిటికేశాడు ఆది. ట్రాక్టరు పైకి లేచి, ముక్కలు ముక్కలైంది.
"ఏంట్రా అన్నావ్. నీ ముందు తలదించుకుని బతకాలా. తలదించే వంశలో పుట్టలేదురా. తొడగొట్టే వంశంలో పుట్టా. ఆ.." అని గట్టిగా తొడగొట్టాడు ఆది.
ఇందులో మొదటి సన్నివేశం సీమలోని నీళ్లు సైతం అక్కడి పౌరుషాన్ని ప్రతిబింబిస్తాయని చెబితే, రెండో సన్నివేశం ఆది ఎలాంటివాడో పట్టిస్తుంది. సినిమా అంటేనే డ్రామా. 'ఆది' వంటి ఎమోషనల్ డ్రామాని పండించాలంటే ఎమోషనల్ డైలాగులు తప్పనిసరి. ఇవి ఆయా సన్నివేశాల్లో ఉద్వేగాన్ని ప్రేరేపించడం కోసం ఉపయోగించినవిగానే మనం చూడాలి. మనిషిలోని భావోద్వేగాల్ని రెచ్చగొట్టి ప్రయోజనం పొందాలనుకోవడం సరికాదనే విమర్శకులూ ఉన్నారు. అది వేరే సంగతి. అయితే ఆ ఉద్వేగభరిత సంభాషణలూ సందర్భోచితంగానే ఉండాలనేది గుర్తుంచుకోవాలి. అప్పుడే ప్రేక్షకుడి రోమాలు నిక్కబొడుచుకుంటాయి. అవసరానికి మించిన సంభాషణలూ, సందర్భరహిత మాటలూ ప్రేక్షకుణ్ణి చికాకు పరుస్తాయి. అపహాస్యానికి గురవుతాయి. అందుకు ఆ తర్వాత వచ్చిన ఎన్నో రాయలసీమ నేపథ్య చిత్రాలే నిదర్శనం.
ఉరకలెత్తే ఉద్వేగభరిత కథనం
'ఆది' సినిమా విజయానికి ప్రధానంగా దోహదం చేసింది ఎమోషనల్ డ్రామానే. ఆ డ్రామాని వినాయక్ పండించిన తీరు చూస్తే, ఆ చిత్రాన్ని ఒక కొత్త దర్శకుడు కాక, కాకలు తీరిన దర్శకుడు తీశాడనే అభిప్రాయం కలుగుతుంది. తన తల్లిదండ్రుల్ని కిరాతకంగా హత్యచేసిన నాగిరెడ్డి (రాజన్ పి. దేవ్) అనే ఫ్యాక్షనిస్టుపై ఆదికేశవరెడ్డి అనే ఇరవై రెండేళ్ల కుర్రాడు ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడనే చిన్న అంశాన్ని సరిగ్గా రెండున్నర గంటలసేపు చిక్కనైన స్క్రీన్‌ప్లేతో తెరమీద రసవత్తరంగా నడిపి భేష్ అనిపించుకున్నాడు వినాయక్. ఆది పాత్రనూ, దానికి వ్యతిరేకమైన నాగిరెడ్డి పాత్రనూ బలంగా రూపొందించి ఉద్వేగభరిత సన్నివేశాలతో కథను పరుగులెత్తించాడు. ఆది పాత్ర తీరుతెన్నులు ఎలా ఉండబోతున్నాయో, అతని చిన్నప్పటి సన్నివేశంతోనే రుచి చూపించాడు. ఆది తల్లిదండ్రుల్ని నాగిరెడ్డి హత్య చేసే సమయానికి ఆది ఎనిమిదేళ్ల పిల్లాడు. నాగిరెడ్డి బారినుంచి తప్పించుకోవాలంటే అతడికి దొరక్కుండా పారిపోవడం ఒక్కటే కర్తవ్యం. ఆ సమయంలో ఎర్రన్న (చలపతిరావు) అనే అతను ఆదిని తీసుకుని పారిపోతుంటాడు. నాగిరెడ్డి మనుషులు వాళ్ల వెంట పడతారు. వాళ్లమీద బాంబులు వేస్తాడు ఎనిమిదేళ్ల పిలగాడు ఆది. అది చూసి "నాన్నా. నీ పేరేమిటి?" అనడుగుతాడు అప్పటిదాకా ఆ పిల్లాడి పేరు తెలీని ఎర్రన్న.
ఆది.. ఆదికేశవరెడ్డి" అని చెబుతాడు ఆది, పళ్లు బిగించి. అమెరికా నుంచి వచ్చినా, పసివాడైనా ఆదిలో సీమ పౌరుషం ఉరకలెత్తుతున్నదని ఆ సన్నివేశంతో తెలియజేశాడు స్క్రీన్‌ప్లే రచయిత కూడా అయిన వినాయక్. ఈ కథ కూడా అతనిదే. ఆది పెరిగి పెద్దవాడై, హైదరాబాద్‌లో కాలేజీ స్టూడెంట్ అయిన అతను చెప్పే తొలి డైలాగ్ "మాది రాయలసీమన్నా. అమ్మతోడు. ఎంతమందొస్తే అంతమందినీ అడ్డంగా నరికేస్తా". అలా అని ఆదికి ఎప్పుడూ కొట్లాటలే అనుకుంటే పొరబాటే. స్వతహాగా అతను సరదా కుర్రాడు. అందుకే 'చికు చికు బంబం చికు చికు బంబం చిదులు వేసే వయసేలే' అని పాడతాడు. ఆ పాటలోనే 'వేటకి వేటా మన ఆటా వేటుకి వేటూ మన బాటా' అని తన స్వభావాన్ని తెలియజేస్తాడు.
కొన్ని లోపాలూ లేకపోలేదు
చాలా సినిమాల్లో మాదిరిగానే ఈ సినిమాలోనూ అతను ప్రేమించింది విలన్ కూతుర్నే. నాగిరెడ్డి కూతురే నందిని (కీర్తి చావ్లా) అని తెలిసినప్పుడు ఆమెని మరచిపోవాలని అనుకుంటాడు ఆది. కానీ ఏ పాపమూ తెలీని ఆమె ప్రేమని వొదులుకోవద్దని ఎర్రన్న చెప్పడంతో ఆమెని మనసారా తన జీవితంలోకి ఆహ్వానిస్తాడు. అలాంటి ఆది ఓ సందర్భంలో ఆమెతో అన్న మాటలు ఆ పాత్ర ఔచిత్యాన్ని దెబ్బతీసేట్లు ఉంటాయి.
"మీ అమ్మానాన్నల్ని చంపింది మా నాన్నే అని నాకెందుకు చెప్పలేదు?" అని నందిని అడిగితే "బయటి విషయాలు భార్యలతో డిస్కస్ చేసే అలవాటు మాకు లేదు" అంటాడు ఆది. అంటే ఆది తల్లిదండ్రుల్ని నందిని తండ్రి చంపడం బయటి విషయమా? దాన్ని ప్రేయసికి చెప్పకూడదా? ఆది స్వభావానికి సరితూగే డైలాగ్ కాదు అది. రచయిత అప్రమత్తంగా ఉంటే ఈ తప్పు దొర్లేది కాదు.
ఈ సినిమాలో కనిపించే మరో తప్పు నాగిరెడ్డికి ప్రధాన అనుచరుడిగా కనిపించిన గంగిరెడ్డి (రఘుబాబు) పాత్ర చిత్రణ. వీరారెడ్డి (ఆది తండ్రి) పేదలకి భూములు పంచాలనుకుంటే, అతడికి విరుద్ధంగా నాగిరెడ్డిని ఎగదోసేది గంగిరెడ్డే. ఇంకోసారి తనని గంగిరెడ్డి బృందం చంపుతున్నప్పుడు 'ఒరేయ్ మేం కష్టపడుతున్నది మీ అందరికీ పొలాలు ఇవ్వడం కోసమేరా' అంటాడు ఎర్రన్న. 'వాడి మాటలు వినకండిరో' అంటూ తన మనుషుల్ని ఉసిగొల్పి, ఎర్రన్నని చంపుతాడు గందిరెడ్డి. ఎర్రన్నని అలా చంపాలని ప్లాన్ చేసేదీ అతనే. అలాంటి అతను క్లైమాక్సులో హఠాత్తుగా మంచివాడిగా మారిపోవడం పెద్ద వింత!
'గంగిరెడ్డీ.. మీరన్నా చావండి. ఆణ్ణన్నా చంపండి' అని నాగిరెడ్డి ఆజ్ఞాపిస్తే, 'నీ కోసం మేమెందుకు చావాలన్నా?' అని ప్రశ్నించి నాగిరెడ్డినే కాక, ప్రేక్షకుణ్ణీ ఆశ్చర్యపరుస్తాడు గంగిరెడ్డి. ఇలాంటి కొన్ని లోపాలు మినహాయిస్తే 'ఆది' ఆద్యంతమూ జనరంజక చిత్రం. ఇరవై రెండేళ్ల ఆది పాత్రలో పద్దెనిమిదేళ్ల ఎన్‌టీఆర్ వయసుకు మించిన అభినయ సామర్థ్యాన్ని ప్రదర్శించి, అచ్చెరువు కలిగించాడు. సినిమానంతా తన భుజాల మీద మోశాడు. భావోద్వేగ సన్నివేశాల్లో హావభావ విన్యాసాలతో, డైలాగ్ డిక్షన్‌తో ఆకట్టుకున్నాడు. ఇక యాక్షన్ సన్నివేశాల్లో, పాటల్లో చెలరేగిపోయాడు. నందిని పాత్రలో హీరోయిన్‌గా కీర్తి చావ్లా అటు అందం విషయంలోనూ, ఇటు అభినయం విషయంలోనూ ఏ కాస్త మెరుగ్గా ఉన్నా 'ఆది' మరింత హిట్టయ్యేది. ఈ చిత్రంలో మిగతా అందరూ పరిధుల మేరకు రాణిస్తే ఫెయిలైన ఒకే ఒక్క నటి కీర్తి చావ్లా. రాజన్ పి. దేవ్, చలపతిరావు, రఘుబాబు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేకూర్చారు. అలీ, వేణుమాధవ్ కొద్దిసేపు నవ్వించారు.
ఆ కాలంలో ఉచ్ఛస్థితిలో ఉన్న మణిశర్మ కీ బోర్డు నుంచి జాలువారిన మరో పాపులర్ ఆడియో ఆల్బం 'ఆది'. దర్శకుడు వినాయక్ చెప్పినట్లు 'నీ నవ్వుల తెల్లదనాన్నీ నాగమల్లీ అప్పడిగిందీ' పాట చక్కని మెలోడీతో ఆహ్లాదం కలిగిస్తే, 'చికు చికు బంబం చికు చికు బంబం చిందులు వేసే వయసేలే', 'తొలి పిలుపే నీ తొలి పిలుపే', 'అయ్యోరామ ఆంజనేయా ఎంత పని చేశావు', 'సున్నుండ తీసుకో సిగ్గుపడక తీసుకో' పాటలూ జనరంజకమయ్యాయి. సి. రాంప్రసాద్ ఛాయాగ్రహణం, విక్రంధర్మా, స్టన్ శివల స్టంట్స్, గౌతంరాజు ఎడిటింగ్ 'ఆది'కి బలమయ్యాయి. అన్నింటికీ మించి 'ఆది'కి అసలైన హీరో వి.వి. వినాయక్. ఎన్‌టీఆర్‌ని అతను తెరమీద ఆవిష్కరించిన తీరే పాతిక కోట్ల రూపాయలు వసూలు చేసిన సినిమాగా దీన్ని నిలిపింది. ఎన్‌టీఆర్‌కి స్టార్‌డంని తీసుకొచ్చి, వినాయక్ భవిష్యత్ అగ్ర దర్శకుల్లో ఒకడిగా నిలిచే క్రమంలో పునాది అయ్యింది.

'ఆది' నాటి ధైర్యం ఇప్పుడు లేదు
-వి.వి. వినాయక్
ఎన్‌టీఆర్ ఈ కథ ఓకే చెయ్యగానే మా నాన్నకి ఫోన్ చేశా. ఓ స్నేహితుడిలా ఆయనతో అన్నీ చర్చించేవాణ్ణి. 'ఆది' రిలీజయ్యాక నాకు హయ్యస్ట్ రెమ్యూనరేషన్ ఆఫర్ వస్తుందని గట్టి నమ్మకంతో చెప్పా. నా ఆత్మవిశ్వాసం చూసి ఆయన ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత నిజంగానే సీనియర్ నిర్మాత కె.ఎస్. రామారావు గారు అప్పట్లో అందరికంటే అత్యధిక పారితోషికం ఆఫర్ చేశారు.
'ఆది' అంటే నా ఒక్కడికే కాదు, దానికి సంబంధించిన వాళ్లందరికీ ప్రత్యేక ప్రేమ. నా జీవితంలో మరపురాని, మరవలేని సినిమా. ఎన్ని సినిమాలు తీసినా 'ఆది' ఆదే. ఆ సినిమా చేసిన ఆత్మవిశ్వాసం, అప్పటి పొగరు, ఆ ధైర్యం ఆ తర్వాత నాకు లేకుండా పోయాయి. అది అంత హిట్టవడమే కారణం. ఈ చిత్రంలో యాక్టర్లు కానివ్వండి, టెక్నీషియన్లు కానివ్వండి, నేను కోరుకున్నవాళ్లే వచ్చారు. నిర్మాతలు ఆ విషయంలో నాకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. నాకు తెలిసి కొత్త దర్శకుల్లో అంటే తొలి సినిమాకే పూర్తి స్వేచ్ఛతో, ఏదంటే అది చేయగలిగింది నేనొక్కణ్ణే.
'అన్నయ్యా' అని పిలుస్తూ తన కుటుంబంలో మనిషిగా నాకు గౌరవాన్నిచ్చాడు ఎన్‌టీఆర్. అంత శక్తివంతమైన పాత్రని అంత చిన్న వయసులో మెప్పించడం మామూలు సంగతి కాదు. యువ హీరోల్లో ఎవరికీ లేనటువంటి డైలాగ్ డిక్షన్ ఎన్‌టీఆర్ సొంతం. ఎమోషనల్ డైలాగ్స్ చెప్పడంలో మరీ. డాన్సుల్లోనూ, ఎనర్జీ లెవల్స్‌లోనూ అతనిది పైస్థాయి. పైగా విశ్వవిఖ్యాత నటసార్వభౌముణ్ణి జనం ఆ అబ్బాయిలో చూడటం కూడా సినిమా విజయానికి కారణం. 'ఆది' పాత్రని నా ఊహకి మించి గొప్పగా చేశాడు. అతను ఆల్‌రౌండర్. 'బార్న్ ఆర్టిస్ట్'. యాక్షన్ సీన్లలో, డాన్సుల్లో పక్కవాళ్ల కో-ఆర్డినేషన్ కుదరక రెండు మూడు టేకులు ఎప్పుడన్నా తీసుకున్నాడేమో గానీ, తనకు సంబంధించిన సన్నివేశాల్లో రెండో టేక్ తీసిన సందర్భమేదీ నాకు జ్ఞాపకం లేదు. ఇది రాయలసీమ కథ అయినప్పటికీ క్లైమాక్స్ సన్నివేశాల్ని విజయనగరంలోని సైనిక్ స్కూల్లో చేశాం. క్లైమాక్స్ తీసేప్పుడు ఎన్‌టీఆర్ చేతికి గ్లాస్ తగిలి గాయమైంది. 'ఆది' హిట్టయ్యాక ఏ సినిమాలో ఎన్‌టీఆర్‌కి దెబ్బ తగిలితే ఆ సినిమా హిట్టవుద్దనే సెంటిమెంట్ ఏర్పడింది.
ఈ సినిమాకి సంబంధించి చెప్పుకోవాల్సిన మరో అంశం మణిశర్మ సంగీతం. ఆయన సినీ జీవితంలోని గొప్ప పాటల్లో 'నీ నవ్వుల తెల్లదనాన్ని' పాట తప్పకుండా ఉంటుంది. ఈ పాట రాసింది చంద్రబోస్. 'ఆది' తీయడానికి రెండేళ్ల ముందే ఈ పాటని నాకు వినిపించాడు. దాన్ని ఎవరికీ ఇవ్వొద్దనీ, నా సినిమాలో అది ఉండాలనీ అడిగా. సరేనని, మాట మీద నిలబడ్డాడు.

(వచ్చే వారం 'సంతోషం' సంగతులు)

Monday, April 4, 2011

కవిత: ఓ తెలు'గోడు'!

కలత చెందమాకే అమ్మా!
క్షేమమేనే నేను
అయ్యాళ 'మాకు తప్పలేదు,
నీకెందుకురా మగ్గం గుంట?
హైద్రాబాదెళ్లి ఉద్యోగమేదన్నా చేసుకో' అంటా
బలవంతంగా తరిమావ్
ఇయ్యాళ 'నాన్నా! హైద్రాబాదులో
ఒకటే గొడవలంట కదరా
నీకేమవ్వుద్దోనని బయంగా ఉందిరా' అంటా
కలవరపడ్తున్నావ్
అప్పుడు తరిమిదీ నువ్వే
ఇప్పుడు భయపడ్తోందీ నువ్వే

అయినా నువ్వు మాత్రం కలగన్నావా
రోజులిట్లా మారతాయనీ
ఇన్నేళ్ల తర్వాత
నువ్వెందుకు వొణికిపోతున్నావో
నాకు తెలుస్తానే ఉందమ్మా
ఇయ్యాళ విగ్రహాలు పడగొట్టినోళ్లు
రేపు మనుషుల్ని కొట్టకుండా ఉంటారా?
ఇది నీ ప్రశ్న
నీలాంటి అమ్మలందరి ప్రశ్న

ఈ నగరానికొచ్చినప్పుడు
నేనున్నది తెలంగాణ అనీ
అది నాది కాదనీ తెల్వదే అమ్మా
ఈ ఆంధ్ర, తెలంగాణ
పంచాయితీ ఏందో అస్సలు తెల్వదే
'మన హైద్రాబాద్' అనుకునే
నువ్వు పంపిచ్చావు.. నేనొచ్చానే
'సీమాంధ్ర' అంటా
ఓ కొత్తమాటని పలుకుతున్నారే
నిన్న మొన్నటిదాకా
భుజం మీద చేతులేసి తిరిగిన
నా తెలంగాణ మిత్రులు
ఇయ్యాళ అదోరకంగా, అపనమ్మకంగా
నావంక చూస్తున్నారే
వాళ్లేమన్నా పడాలంటనే
నేను చేసిన తప్పేందే అమ్మా!

తెలంగాణ కోసం కొట్లాడాల్సింది
కూటి కోసం వచ్చిన
మామూలు జనంతో కాదనీ
అధికారం చేతుల్లో పెట్టుకుని
తమ లాభం మాత్రమే చూసుకునే,
మనుషుల మధ్య ప్రాంతీయ ద్వేషాలు రగిల్చే
ఓటు రాజకీయాలు చేసే వాళ్లతోననీ
తెలిసినోళ్లు కూడా
తెలీనట్లు ఊరుకుంటున్నారే

కులం ఓ మత్తు
మతం మరింత మత్తు
ఇయ్యాళ 'ప్రాంతం' లేదంటే 'స్థానికం'
మహా మహా మత్తు అయిపోతోందే
'మీరేమిట్లు?' నుంచి 'మీదే ఊరు?' కాడికి
వొస్తున్నారే జనం
'మనమంతా భారతీయులం' ఒట్టిమాట
ఇయ్యాళ ఫలానా రాష్ట్రీయులం
రేపు ఫలానా జిల్లా వాళ్లం
ఎల్లుండి ఫలానా ఊరోళ్లం
ఆవులెల్లుండి ఫలానా వీధోళ్లం
ఆ తర్వాత రోజు పక్కింటోడూ
మన శత్రువేనమ్మా

ఎవడి అస్తిత్వం వాడిదే
ఎవడి బలం వాడిదే
బలవంతుడిదే రాజ్యమమ్మా
భయపడమాకే అమ్మా
నాకు మంచితనం మీదా
మనిషితనం మీదా నమ్మకం పోలేదే
ఈ రోజుకైతే క్షేమమేనే నేను!

-ఆంధ్రజోతి డైలీ, ఏప్రిల్ 1, 2011

Friday, April 1, 2011

హిట్.. హిట్.. హుర్రే...!: ఆది

తారాగణం: ఎన్‌టీఆర్, కీర్తి చావ్లా, రాజన్ పి. దేవ్, చలపతిరావు, రఘుబాబు, అలీ, ఎమ్మెస్ నారాయణ, ఎల్బీ శ్రీరాం, రాజీవ్ కనకాల, వేణుమాధవ్, ఆహుతి ప్రసాద్, నారాయణరావు, సంగీత, హరిత, బెంగుళూరు పద్మ, రమ్యశ్రీ, మాస్టర్ నందన్, విజయ్, ప్రసన్నకుమార్, చిత్రం శ్రీను
మాటలు: పరుచూరి బ్రదర్స్
పాటలు: చంద్రబోస్, భువనచంద్ర, పోతుల రవికిరణ్
సంగీతం: మణిశర్మ
ఛాయాగ్రహణం: సి. రాంప్రసాద్
కూర్పు: గౌతంరాజు
స్టంట్స్: విక్రం ధర్మా
నృత్యాలు: రాఘవేంద్ర లారెన్స్, అమ్మ రాజశేఖర్, ప్రదీప్ ఆంథోని
కళ: పార్థసారథి వర్మ
డీటీఎస్ మిక్సింగ్: మధుసూదన్‌రెడ్డి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి)
నిర్మాత: పి. నాగలక్ష్మి
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వి.వి. వినాయక్
బేనర్: శ్రీ లక్ష్మీనరసింహా ప్రొడక్షన్స్
నిడివి: 2.30 గంటలు
విడుదల తేది: 28 మార్చి 2002

కేవలం పద్దెనిమిదేళ్ల కుర్రాడు సినిమానంతా తన భుజాల మీద మోసి. 'ఆది'గా బాక్సాఫీసు వద్ద చెలరేగిన తీరు చూసి ముక్కుమీద వేలేసుకుని ఆశ్చర్యపడని వాళ్లు లేరు. ఆ కుర్రాడు జూనియర్ ఎన్‌టీఆర్. తాత నందమూరి తారక రామారావు పేరునే పెట్టుకున్న అతను మొదట 'నిన్ను చూడాలని' సినిమాతో హీరోగా పరిచయమై, పరాజయాన్ని పొందాడు. కానీ రెండో సినిమా 'స్టూడెంట్ నెం.1'తో ప్రేక్షకుల మన్ననల్ని పొందడంలో విజయం సాధించాడు. ఇక మూడో సినిమా 'ఆది'తో స్టార్ హీరో అయిపోయాడు (గుణశేఖర్ రూపొందించిన 'రామాయణం'ని ఇక్కడ పరిగణనలోకి తీసుకోవడం లేదు. ఎందుకంటే అప్పటికి ఎన్‌టీఆర్ బాలనటుడు). వి.వి. వినాయక్ అనే ఇరవై ఆరేళ్ల కొత్త దర్శకుడు ఎలా గమనించాడో ఏమో కానీ, ఎన్‌టీఆర్‌లోని మాస్ పొటెన్షియాలిటీని వెలికితీసి, ప్రపంచానికి తొలిగా రుచి చూపించాడు. అందుకే 2002 మార్చిలో విడుదలైన ఆ చిత్రం ఆ ఇద్దరి కెరీర్‌కి బంగారు బాట వేసింది. 105 కేంద్రాల్లో విడుదలైన 'ఆది' అన్ని కేంద్రాల్లోనూ యాభై రోజులు, 98 కేంద్రాల్లో వంద రోజులు ఆడటం విశేషం కాక మరేమిటి! కేవలం రెండున్నర కోట్ల రూపాయలతో రూపొందించిన ఆ చిత్రం ఏకంగా పాతిక కోట్ల రూపాయల్ని వసూలు చేసి, ఆ ఘనతని సాధించిన తొలి తెలుగు చిత్రంగా బాక్సాఫీసు చరిత్రకెక్కింది! అంటే వ్యయానికి పది రెట్ల ఆదాయాన్ని సంపాదించి పెట్టాడు 'ఆది'.
అలాంటి 'ఆది'కి బీజం ఎలా పడింది? "నేను 'చెప్పాలని ఉంది' సినిమాకి కో-డైరెక్టర్‌గా పనిచేస్తున్నప్పుడు, దానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసరైన బుజ్జి (నల్లమలుపు శ్రీనివాస్) నన్ను కథ చెప్పమన్నాడు. అన్నపూర్ణ స్టూడియోస్‌లో శివుని బొమ్మ దగ్గర కూర్చొని ఓ కథ చెప్పా. అది ఆయనకి బాగా నచ్చింది. అప్పట్లో సినీ పాత్రికేయుడిగా ఉన్న నేటి సినీ గేయ రచయిత భాస్కరభట్ల రవికుమర్‌ని పిలిచి 'మా బేనర్‌లో తర్వాతి సినిమాని వినయ్‌తో చేస్తున్నామ'ని చెప్పాడు బుజ్జి. నేను భాస్కరభట్లతో నా పేరుని వి.వి. వినాయక్‌గా రాయమని చెప్పా. నేను బుజ్జికి కథ చెప్పింది 'ఆనందం' హీరో ఆకాశ్‌ని దృష్టిలో పెట్టుకుని. మేం 'చెప్పాలని వుంది' పాటల కోసం స్విట్జర్లాడ్ వెళ్లినప్పుడు అప్పటికే 'స్టూడెంట్ నెం.1' పాటల కోసం అక్కడ ఉన్నాడు ఎన్‌టీఆర్. బుజ్జి అతనితో నా గురించి చెప్పాడు. హైదరాబాద్ వచ్చాక నా కథ విన్నాడు. నచ్చిందని చెప్పాడు. అయితే తర్వాత లవ్ స్టోరీ కాకుండా మంచి మాస్ కథ ఉంటే చెప్పమన్నాడు. మాస్ స్టోరీకి సంబంధించి, నా మనసులో రెండు సీన్లు మాత్రమే ఉన్నాయి. కానీ వచ్చిన అవకాశం పోతుందేమోననే టెన్షన్‌లోనే రెండంటే రెండు రోజుల్లో అరవై సీన్లతో కథ తయారుచేశా. ఆ కథ చెప్పగానే ఉద్వేగానికి గురయ్యాడు ఎన్‌టీఆర్. 'అన్నా. ఈ కథతో మనం సినిమా చేస్తున్నాం' అన్నాడు. అలా 'ఆది' తెరమీదకి వచ్చింది" అని చెప్పుకొచ్చారు వి.వి. వినాయక్.
తన తల్లిదండ్రుల్ని తలనరికి కిరాతకంగా హత్య చేసిన నాగిరెడ్డి అనే ఫ్యాక్షనిస్టుపై ప్రతీకారం తీర్చుకునే 'ఆది'కేశవరెడ్డి అనే రాయలసీమ కుర్రాడిగా ఎన్‌టీఆర్ తెలుగు ప్రేక్షకులపై చెరగని ముద్ర వేశాడు. 'పిట్ట కొంచెం కూత ఘనం' నానుడిని నిజంచేస్తూ ఆ సినిమాతో అతను అగ్ర యువ కథానాయకుల్లో ఒకడిగా పేరుపొందాడు. ఒక కొత్త దర్శకుడిలోని కసికీ, మాస్ హీరోగా తాత పేరుని నిలబెట్టాలనే ఓ కుర్రాడి తాపత్రయానికీ దక్కిన ఈ విజయంలో అప్పట్లో 'పీక్ స్టేజ్'లో ఉన్న మణిశర్మ సంగీతానికీ ప్రధాన భాగముంది. అతని సినీ జీవితంలో ఎన్నదగిన పాటల్లో ఒకటైన 'నీ నవ్వుల తెల్లదనాన్నీ నాగమల్లీ అప్పడిగిందీ ఇవ్వొద్దూ ఇవ్వొద్దూ' పాట ఈ చిత్రంలోనిదే. ఆ పాట జాలువారింది చంద్రబోస్ కలం నుంచి. ఈ చిత్రంలోని భావోద్వేగపూరిత డైలాగులు కూడా బాగా పాపులర్. ఎన్‌టీఆర్ నోట పలికిన 'తలదించే వంశంలో పుట్టలేదురా. తొడగొట్టే వంశంలో పుట్టా', 'అరవకు. అమ్మతోడు. అడ్డంగా నరికేస్తా' వంటి డైలాగులకి థియేటర్లలో మోగిన చప్పట్లు చాలామందికి జ్ఞాపకముండే ఉంటాయ్.
కథాసంగ్రహం
అమెరికా నుంచి కడపకు వచ్చిన వీరారెడ్డి (ఆహుతి ప్రసాద్)తో అతనికి చెందిన భూములన్నింటినీ నాగిరెడ్డి (రాజన్ పి. దేవ్) ఆక్రమించేశాడనీ, ఈ వేల ఎకరాల బంజరు భూమిని పేదలకిస్తే తమ చెమటని చిందించి, ఈ నేలను తడిపి, నాలుగు మెతుకులు తింటారనీ చెబుతాడు ఎర్రన్న (చలపతిరావు). సరేనంటాడు వీరారెడ్డి. అయితే ఈ భూముల్ని పేదోళ్లకి పంచిపెడితే, రాజకీయంగా తనకు పుట్టగతులు వుండవని భావించిన నాగిరెడ్డి ఓ రాత్రివేళ దాడిచేసి వీరారెడ్డినీ, అతని భార్యనీ తలనరికి చంపేస్తాడు. పిల్లవాడైన ఆదికేశవరెడ్డిని తీసుకుని హైదరాబాద్ పారిపోతాడు ఎర్రన్న. హత్యానేరాన్ని వీరారెడ్డి మనుషులపైనే మోపి, వాళ్లని జైలుపాలు చేస్తాడు నాగిరెడ్డి.
పన్నెండేళ్లు గడిచిపోతాయి. నిజాం కాలేజీలో డిగ్రీ చదువుతున్న ఆది (ఎన్‌టీఆర్), నందిని (కీర్తి చావ్లా) ప్రేమలో పడతారు. కడప జిల్లా జైలులో శిక్ష అనుభవిస్తున్న తమ మనుషుల వద్దకు ఆదిని తీసుకుపోతాడు ఎర్రన్న. అతడి తల్లిదండ్రుల్ని నాగిరెడ్డి ఎట్లా చంపి, తమ మీద నెరం మోపి, జైలుపాలు చేశాడో చెబుతారు వాళ్లు. నాగిరెడ్డిని అప్పుడే చంపాలన్నంత ఆవేశానికి గురవుతాడు ఆది. నందిని ఎవరో కాదు, నాగిరెడ్డి కూతురనే సంగతి తెలిసి, బాధపడతాడు. ఆమెని మరచిపోదామనుకుంటాడు. కానీ ఏ పాపమూ తెలీని ఆమె ప్రేమని వొదలొద్దని చెబుతాడు ఎర్రన్న.
తండ్రికి ఆదితో తన ప్రేమ సంగతి చెబుతుంది నందిని. అతణ్ణి రమ్మనమనీ, తనకి నచ్చితే పెళ్లి చేస్తాననీ అంటాడు నాగిరెడ్డి. నందిని చెప్పడంతో కడపకు వస్తాడు ఆది. అతణ్ణి తండ్రికి పరిచయం చేస్తుంది నందిని. "వాహ్. ఏం తేజస్సు బిడ్డా. కోహినూర్ వజ్రం గురించి వినడమే కానీ ఎప్పుడూ చూళ్లేదు. బహుశా అది నీలాగే ఉంటుందేమో. బాగా నచ్చావ్" అంటాడు నాగిరెడ్డి. అప్పుడు "నా పేరు ఆదికేశవరెడ్డి" అంటాడు ఆది. అతడి తాత పేరు కూడా అదే. తనెవరో తెలిసిన నాగిరెడ్డితో "నేనెవరో తెలిశాక నీ పరువుగా ఫీలయ్యే నీ కూతుర్ని నాకిచ్చి పెళ్లి చెయ్యవని నాకు బాగా తెలుసు. కానీ, నువ్వు చేసినా, చెయ్యకపోయినా నీ పరువుకి తాళికట్టేది నేనే" అంటాడు ధైర్యంగా. విజయదశమి వరకు టైమిస్తున్నాననీ, ఈలోపు తన ఆస్తులు మొత్తం తనకు అప్పగించమనీ, లేదంటే ఎనిమిదేళ్ల వయసులోనే బాంబులు వేసిన తనకు ఇప్పుడెయ్యడం పెద్ద కష్టం కాదనీ హెచ్చరిస్తాడు. పాడుబడిపోయిన తమ ఇంటికి వెళ్తాడు. ఊరి జనమంతా అక్కడికి వచ్చి తామంతా అతని వెనకాల ఉంటామని చెబుతారు.
నందినికి పులివెందుల నుంచి ఓ సంబంధం మాట్లాడుకుని వస్తాడు నాగిరెడ్డి. ఆది వద్దకు రాత్రి పూట వస్తుంది నందిని. అది తెలిసి అక్కడకు వస్తాడు నాగిరెడ్డి. అతడి ముందే ఆమె నుదుటిమీద ముద్దు పెట్టుకుంటాడు ఆది. ఇంటికెళ్లాక తనని చంపినా ఆది మీద ప్రేమపోదని తండ్రితో అంటుంది నందిని. ఆమె రమ్మంటున్నదని తప్పుడు సమాచారమిచ్చి, ఒక్కణ్ణే రప్పించి, ఎర్రన్నని చంపుతారు నాగిరెడ్డి ప్రధాన అనుచరుడైన గంగిరెడ్డి (రఘుబాబు), అతని మనుషులు. తను బాబాయ్‌గా పిలుచుకునే తన సర్వస్వమైన ఎర్రన్నని చంపడంతో మహోగ్రుడవుతాడు ఆది. తల్లిని తండ్రి మెడకొరికి చంపబోతుండటంతో అతడు చూసిన సంబంధం చేసుకుంటానని ఏడుస్తుంది నందిని. హడావిడిగా పెళ్లి ఏర్పాట్లు చేస్తాడు నాగిరెడ్డి. పెళ్లి వేదిక వద్దకు వస్తాడు ఆది. పెళ్లికొడుకు తాళి తీసుకుని వచ్చి, ఆదికి ఇస్తాడు. ఆదిని పిస్టల్‌తో పొట్టమీద కాలుస్తాడు నాగిరెడ్డి. కానీ చలించని ఆది అతణ్ణి బతికుండగానే అప్పటికే అతడి కోసమే తవ్వించిన గుంటలో పడేస్తాడు. మొదటగా నాగిరెడ్డి భార్యాకొడుకులే అతడి మీద మట్టిపోస్తారు. జనమంతా అతణ్ణి సజీవ సమాధి చేసేస్తారు.

శతదినోత్సవం చెయ్యకపోవడం వెలితి
-నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి)
దివంగత ఎన్‌టీ రామారావు అంటే నాకు విపరీత అభిమానం. అదే పేరున్న ఆయన మనవడు నటించిన తొలి చిత్రం 'నిన్ను చూడాలని' విడుదలైనప్పుడు మనోడు కదా, ఎలా చేశాడో చూద్దామని వెళ్లా. క్లైమాక్సులోని ఎమోషనల్ సీన్‌ని అతడు చేసిన తీరుకి చాలా ఆశ్చర్యమేసింది. అతడితో సినిమా తీయాలని అప్పుడే నిర్ణయించుకున్నా. మేం తీసిన 'చెప్పాలని ఉంది' సినిమాకి వినయ్ (వి.వి. వినాయక్) కో-డైరెక్టరుగా పనిచేశాడు. చాలా తక్కువ కాలంలో నాకు సన్నిహితమయ్యాడు. అతడు చెప్పిన కథ నచ్చి, దాన్ని ఎన్‌టీఆర్‌కి చెప్పించా. అది అతనికి నచ్చింది కానీ మాస్ కథ కావాలన్నాడు. అప్పుడు వినయ్ 'ఆది' కథ చెప్పాడు. వెంటనే ఓకే అనేశాడు ఎన్‌టీఆర్.
క్లైమాక్స్ సీన్ చేసేప్పుడు గాజు ముక్క కోసుకుని ఎన్‌టీఆర్ కుడి చేతికి పెద్ద గాయమైంది. చాలా రక్తం పోయింది. అతను మొండోడు. చేతికి కట్టు కట్టుకుని మిగతా సీన్లు చేశాడు. ఈ సినిమా సూపర్ హిట్టయి, దీని మీద ఆధారపడిన చాలా మంది జీవితాల్ని నిలబెట్టింది. ఎన్‌టీఆర్ స్టామినా ఏమిటో లోకానికి తెలిపింది. 98 సెంటర్లలో వంద రోజులు నడిచింది. వినయ్‌కీ, బెల్లంకొండ సురేశ్‌కీ, నాకూ మంచి బ్రేక్‌నిచ్చింది. అయితే శతదినోత్సవం జరపకపోవడం ఇప్పటికీ నా జీవితంలో వెలితిగానే అనిపిస్తుంటుంది. ఈ సినిమాలో యాక్టర్లు గానీ, టెక్నీషియన్లు గానీ వినయ్ కోరుకున్నవాళ్లే చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది వినయ్ సినిమా. మొత్తం స్క్రిప్టు అతనిదే. పరుచూరి బ్రదర్స్‌కి డైలాగ్ రైటర్స్‌గా క్రెడిట్ ఇచ్చినా, డైలాగ్ వెర్షన్ సహా అంతా తనే తయారుచేసుకున్నాడు. అందుకే ఈ సినిమా క్రెడిట్ అంతా అతనిదే. ఎన్‌టీఆర్‌తో అతని కాంబినేషన్‌ని కుదిర్చిన ఘనత మాత్రం నాది.
అల్లరి చేసే పద్దెనిమిదేళ్ల వయసులో ఎన్‌టీఆర్ 'ఆది'గా ఏం చేశాడండీ! అతను పెద్దాయన (దివంగత ఎన్‌టీఆర్) అంశతోనే పుట్టాడని అనిపిస్తుంటుంది. అన్ని సీన్లూ సింగిల్ టేక్‌లో చేసేవాడు. 'ఆది'కి పనిచేయడం 'ద బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ మై లైఫ్'.
(వచ్చే వారం 'ఆది' విజయానికి దోహదం చేసిన అంశాలు)