Friday, February 25, 2011

హిట్.. హిట్.. హుర్రే...!: నువ్వు నాకు నచ్చావ్

తారాగణం: వెంకటేశ్, ఆర్తీ అగర్వాల్, ప్రకాశ్‌రాజ్, చంద్రమోహన్, సుహాసిని, సుధ, ఎమ్మెస్ నారాయణ, హేమ, సునీల్, తనికెళ్ల భరణి, సిజ్జు, సుదీప, గణేశ్, ఆషా సైనీ, పృథ్వీ, బ్రహ్మానందం, బాబూమోహన్, మల్లికార్జునరావు, చిట్టిబాబు, కల్పనారాయ్
కథ, మాటలు: త్రివిక్రం
పాటలు: సీతారామశాస్త్రి, భువనచంద్ర
సంగీతం: కోటి
గానం: ఎస్పీ బాలు, కుమార్ సాను, చిత్ర, హరిణి, శ్రీరాం ప్రభు, టిప్పు
ఛాయాగ్రహణం: కె. రవీంద్రబాబు
కూర్పు: ఎ. శ్రీకరప్రసాద్
కళ: పేకేటి రంగా
నృత్యాలు: సుచిత్రా చంద్రబోస్, సరోజ్‌ఖాన్, రాజశేఖర్
సమర్పణ: సురేశ్ ప్రొడక్షన్స్
నిర్మాత: స్రవంతి రవికిశోర్
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: విజయభాస్కర్
బేనర్: శ్రీ స్రవంతి మూవీస్
విడుదల తేది: 6 సెప్టెంబర్ 2001

పదేళ్ల క్రితం అమెరికాలో ఉద్యోగమన్నా, అమెరికా అల్లుడన్నా మహా క్రేజ్. ఈ పరిణామం మన సమాజంలో తలెత్తడానికి కారణమైంది సాఫ్ట్‌వేర్ బూం. దాన్ని దృష్టిలో ఉంచుకుని 'అమెరికా' వెంపర్లాట కూడదనీ, ప్రేమానుబంధాలే ముఖ్యమనీ చెబుతూ వచ్చిన ఓ సినిమా తెలుగు ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకుని, అంతకుమించిన ఆహ్లాదాన్ని పంచి, బాక్సాఫీసు వద్ద విజయ బావుటా ఎగరేసింది. ఆ సినిమా 'నువ్వు నాకు నచ్చావ్'. ఇమేజ్‌ని పట్టించుకోకుండా ప్రతి చిత్రంలోనూ కొత్తదనం కోసం తపించే కథానాయకుడు వెంకటేశ్ ఒక్క ఫైటూలేని ఈ సినిమా చేసి, అందర్నీ ఆశ్చర్యపరచారు. విడుదలకు ముందు ఈ సినిమాకి అంచనాలెన్నో. కారణం కాంబినేషన్! దీనికి ముందు ఏడాది క్రితం కొత్త తారలు నటించగా వచ్చిన 'నువ్వే కావాలి' అనే సినిమా ఓ ప్రభంజనాన్నే సృష్టించిది. దానికి దర్శకుడు కె. విజయభాస్కర్, రచయిత త్రివిక్రం. ఆ ఇద్దరితో కలిసి వెంకటేశ్ చేసిన సినిమా కావడమే 'నువ్వు నాకు నచ్చావ్'కి క్రేజ్‌ని తీసుకొచ్చింది. పైగా 'నువ్వే కావాలి' ఫేం స్రవంతి రవికిశోర్ దీనికీ నిర్మాత. ఇది 3 గంటల 9 నిమిషాల నిడివి సినిమా. అందువల్ల ఓ అరగంట నిడివినైనా తగ్గించి, విడుదల చేయమని చాలామంది శ్రేయోభిలాషులు చెప్పారు. కానీ విజయభాస్కర్ తెరమీదకు తెచ్చిన సినిమా మీద సమర్పకుడు సురేశ్‌బాబు, నిర్మాత రవికిశోర్ పూర్తి నమ్మకాన్ని ఉంచారు. నిడివి తగ్గించకుండా రిలీజ్ చేశారు. విజయం సాధించారు. నిర్మాత నుంచి ఎగ్జిబిటర్ దాకా అందరికీ మంచి లాభాలు తీసుకొచ్చి 2001 సూపర్‌హిట్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది 'నువ్వు నాకు నచ్చావ్'. సుమారు 7 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ సినిమా 16 కోట్ల రూపాయల్ని వసూలు చేసింది.  
అనంతర కాలంలో నెంబర్‌వన్ స్థాయికి ఎదిగిన ఆర్తీ అగర్వాల్ పరిచయమయ్యింది ఈ చిత్రంతోటే. వెంకటేశ్ సరసన రూపలావణ్యాలతోటే కాక, అభినయంతోనూ ఆర్తీ తెలుగు ప్రేక్షకుల హృదయాలకు గాలం వేసింది. "హీరోయిన్ నందిని పాత్రకి కొత్తమ్మాయిని పరిచయం చేయాలనుకున్నాం. సినిమాలో నందిని మాత్రమే కనిపించాలి కానీ, హీరోయిన్ కనిపించకూడదు. చాలామంది అమ్మాయిల్ని చూశాం. అప్పుడే బాలీవుడ్ సినిమా 'పాగల్‌పన్'లో హీరోయిన్‌గా కనిపించిన కొత్తమ్మాయి మా దృష్టికి వచ్చింది. న్యూజెర్సీలో తల్లిదండ్రులతో పాటు ఉంటున్న ఆమె ఆ సినిమా చేసి, మళ్లీ అక్కడకి వెళ్లిపోయిందని తెలిసింది. ఆమెని పిలిపించాం. ఇక నందిని ఆమే అని డిసైడ్ అయిపోయాం. అలా ఆర్తీ అగర్వాల్ తెలుగు సినిమాల్లోకి అడుగుపెట్టింది" అని చెప్పారు నిర్మాత రవికిశోర్.
సినిమాలో కీలకమైన నందిని తండ్రి మూర్తి పాత విషయంలో చెప్పుకోదగ్గ సంగతొకటుంది. ఆ పాత్రని ప్రకాశ్‌రాజ్‌తోటే చేయించాలని నిర్మాత, దర్శకుడు సంకల్పించారు. సరిగ్గా అదే టైంలో ప్రకాశ్‌రాజ్ మీద 'మా' (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) నిషేధం నడుస్తోంది. దాంతో అతని బదులు మరొకర్ని తీసుకోక తప్పని స్ఠితి. "మేం మాత్రం ఆయన కాకుండా మరొకర్ని మూర్తి పాత్రలో ఊహించలేకపోయాం. అందుకని ఆయన పాత్ర వచ్చే సీన్లు మినహా మిగతా సినిమా అంతా తీసేశాం. నిషేధం ఎత్తేశాక 17 రోజుల కాల్షీట్‌తో తన పోర్షన్ పూర్తిచేశాడు ప్రకాశ్‌రాజ్" అని అప్పటి విశేషాన్ని జ్ఞాపకం చేసుకున్నారు రవికిశోర్.
కేవలం ప్రేక్షకుల రివార్డులతోటే సరిపెట్టలేదు ఈ సినిమా. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఐదు నందులు ఈ సినిమా ఖాతాలో చేరాయి. కుటుంబ సమేతంగా చూడదగ్గ ఉత్తమ వినోదాత్మక చిత్రంతో పాటు సుచిత్రకు ఉత్తక కొరియోగ్రాఫర్‌గా, సుహాసినికి ఉత్తమ సపోర్టింగ్ ఆర్టిస్ట్‌గా, త్రివిక్రంకు ఉత్తమ సంభాషణల రచయితగా, సవితారెడ్డికి ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్టుగా నందులు దక్కాయి. సమకాలీన చిత్రాల్లో టీవీలో ఎక్కువసార్లు ప్రసారమయ్యిందీ, అత్యధిక శాతం వీక్షించిందీ ఈ సినిమానే అనడంలో అతిశయోక్తి లేదు. 'స్వీట్ అండ్ క్యూట్ ఫిల్మ్'గా పేర్కొనదగ్గ ఈ సినిమా ఎన్నిసార్లు చూసినా మనసుకి ఆహ్లాదమే ఆహ్లాదం.

కథా సంగ్రహం:
నందిని అలియాస్ నందు (ఆర్తీ అగర్వాల్)కి పెళ్ళి నిశ్చితార్థం ఏర్పాటు చేస్తాడు తండ్రి మూర్తి (ప్రకాశ్‌రాజ్). ఆ సమయంలోనే అక్కడకి ఆయన సన్నిహిత మిత్రుడైన శేఖరం (చంద్రమోహన్) కొడుకు వెంకటేశ్వర్లు అలియాస్ వెంకీ (వెంకటేశ్) ఉద్యోగార్థం వస్తాడు. ప్రసాద్ (సిజ్జు)తో నందు నిశ్చితార్థం జరుగుతుంది. రెండు నెలల తర్వాత పెళ్లని ముహూర్తం ఖాయం చేసుకుంటారు. మూర్తి వాళ్ల ఔట్‌హౌస్‌లో దిగుతాడు వెంకీ. అతనూ, నందూ ఒకర్నొకరు ఆటపట్టించుకుంటూ ఉంటారు. వెంకీకి ఉద్యోగం వస్తుంది. రోజులు గడుస్తున్న కొద్దీ నందు మనసులో వెంకీ చోటు చేసుకుంటాడు. ఓసారి ఇంట్లోని ఆడవాళ్లంతా గుడికి వెళ్తుంటే తోడుగా వెంకీ కూడా వెళతాడు. అక్కడ 'నువ్వంటే నాకిష్టం. నువ్వు నాకు నచ్చావ్' అని చెబుతుంది నందు. బిత్తరపోతాడు వెంకీ. ఇక్కడికి వచ్చేప్పుడు తండ్రి "వాడి స్నేహం పోతే భరించలేనురా. నువ్వక్కడకు వెళ్లి బాగుపడకపోయినా ఫర్వాలేదు. కానీ నీ వల్ల మా స్నేహం పాడవకుండా ఉంటే అంతే చాలు" అంటూ చెప్పిన మాటలు జ్ఞాపకమొస్తాయి. నందుకి దూరంగా ఉండటమే మంచిదనుకుని బ్యాగ్ సర్దుకుని వెళతాడు. రైల్వే స్టేషనులో మూర్తి ప్రత్యక్షమై అతణ్ని ఇంటికి తీసుకొస్తాడు.
ఊటీలో జరుగుతున్న నందు స్నేహితురాలు ఆషా (ఆషా సైనీ) పెళ్లికి వెంకీని తీసుకువెళ్తారు నందు, ఆమె బాబాయి కూతురు పింకీ. ఆషా పెళ్లవుతుంది. అక్కడ వాటర్ వరల్డ్ బాగుంటుందనీ, వెళ్లమనీ ఆషా చెబితే ముగ్గురూ వెళతారు. మధ్యలో కారు చెడిపోయిన బ్రహ్మానందం వాళ్ల కారెక్కుతాడు. వాటర్ వరల్డ్ దగ్గర చేయీ చేయీ కలిపి పట్టుకున్న వెంకీ నందూల ఫోటో తీస్తాడు బ్రహ్మానందం. నందుకి వెంకీ మరింత సన్నిహితమవుతాడు. నందు పెళ్లి దగ్గర పడుతుంది. మగపెళ్లివారు వచ్చేస్తారు. వెంకీ గదిలోకి వస్తుంది నందు. అతను ఆశ్చర్యపోతే "వెంకీ.. నేననే నీకిష్టమా, కాదా? నిజం చెప్పు" అనడుగుతుంది. "నీకు ప్రేమ కావాలి. మీ నాన్నకి పరువు కావాలి. మా నాన్నకి మీరు కావాలి. అంటే ఈ పెళ్లి జరగాలి. నువ్వెళ్లిపోవాలి. నన్ను మర్చిపోవాలి" అంటాడు వెంకీ.
మగపెళ్లివారి చేతుల్లో వెంకీ, నందూ కలిసి ఉన్న ఫోటో పడుతుంది. అది ఊటీలో బ్రహ్మానందం తీసిన ఫోటో. అది చూసి ఈ పెళ్లి చేసుకోనంటాడు ప్రసాద్. అయితే ఇది మంచి సంబంధమనీ, దీన్నడ్డం పెట్టుకుని ఇంకో కోటి రూపాయలు మూర్తి నుంచి వసూలు చేసుకోవచ్చనీ చెబుతాడు తండ్రి (తనికెళ్ల భరణి). అతని బంధువులు ఆ ఫోటోని మూర్తి చేతిలో పెడతారు. వాళ్లని తిడతాడు మూర్తి. దాంతో వారు వెళ్లిపోతారు. సంగతి తెలిసి రైల్వే స్టేషన్‌కి వెళ్లి ఆ ఫోటో అబద్ధమనీ, తనకీ నందూకీ ఏ సంబంధమూ లేదనీ చెబుతాడు వెంకీ. నందూ దేవత అనీ, ఈ పెళ్లిని జరిపించనీ వాళ్ల కాళ్లు పట్టుకోబోతాడు.
"ఈ పెళ్లే కాదు. దానికసలు పెళ్లే జరగదు. జరగనివ్వను. అదొక మహా పతివ్రత" అంటా ప్రసాద్ తండ్రి అతణ్ని నెట్టేస్తాడు. పెళ్లివారి ప్రవర్తననీ, వెంకీ వాళ్లని బతిమలాడటాన్ని చూసిన మూర్తి వెంకీని ఆగమంటాడు. పెళ్లికొడుకుని తన ఇంటి వాచ్‌మన్‌గా కూడా పనికిరాడంటూ వాళ్లని పొమ్మంటాడు. "ఐ యాం ఎ ఫూల్. నా అల్లుడు అమెరికాలో ఉన్నాడో, లేదోనని చూశాను కానీ, నా కూతురి మనసులో ఉన్నాడా, లేదా అని చూడలేదు. ఇలాంటివాణ్ని పక్కనపెట్టుకుని ఎక్కడెక్కడో వెతికా. ఐయాం సారీ వెంకీ" అని అతణ్ని కావలించుకుంటాడు. వెంకీ, నందూ ఒక్కటవుతారు.

ఆ రెండు పాయింట్లతో ఈ సినిమా తీశాం
-స్రవంతి రవికిశోర్
కథ ఎక్కువగా ఒక ఇంట్లోనే జరుగుతుంది. అందువల్ల ఔట్‌డోర్‌లోనూ కొంత కథ జరిగేటట్లు చూస్తే బాగుంటుందని సురేశ్‌బాబు సూచించారు. అప్పుడు ఊటీ ఎపిసోడ్ వచ్చి చేరింది. ఆషాసైనీ పెళ్లి తతంగం, బ్రహ్మానందం ఎపిసోడ్ అలా వచ్చి చేరాయి. న్యూజిలాండ్‌లో పాటలు తీసేప్పుడు 104 డిగ్రీల జ్వరంలో ఉండికూడా స్టెప్పులేశారు వెంకటేశ్. అలాగే క్లైమాక్స్ సీన్ చేసేప్పుడు ఆర్తీకి కూడా బాగా జ్వరం. అయినా ఎంతో నిబద్ధతతో పనిచేసింది. సినిమాకి కోటి మ్యూజిక్ ఎస్సెట్. పాటలన్నీ హిట్టే. రీరికార్డింగ్‌కి 26 రోజుల టైం తీసుకున్నారు కోటి. టీవీలో ఎన్ని వందలసార్లు వచ్చినా ఇంకా ఎంజాయ్ చేస్తున్నారంటే, ఆ సినిమా ఇచ్చే ఆహ్లాదం వల్లనే.
ప్రధానంగా రెండు పాయింట్ల మీద ఈ సినిమా చేశాం. అప్పట్లో అమెరికా క్రేజ్ బాగా ఎక్కువ. దాన్ని దృష్టిలో ఉంచుకుని అమ్మాయికి అమెరికా సంబంధం తేవడం కంటే, మనసుకి నచ్చినవాణ్ని తీసుకొస్తే ఆమె సుఖపడుతుందని చెప్పడం ఒక పాయింటైతే, తల్లిదండ్రులకు దూరంగా ఉండంటం కంటే సొంతూళ్లో ఏదో ఒక పని చేసుకుంటూ వాళ్లవద్ద ఉండటమే ఆనందకరమని చెప్పడం రెండో పాయింట్.
త్రివిక్రం, విజయభాస్కర్ కాంబినేషన్ గొప్పగా వర్కవుట్ అయిన సినిమాల్లో ఇదొకటి. సన్నివేశాల చిత్రణలో విజయభాస్కర్ టైమింగ్‌ని తక్కువ చెయ్యలేం. దానికి మేకింగ్ వాల్యూస్ తోడయ్యాయి.
'ఈ నీలి గగనాన' పాటను భువనచంద్ర రాస్తే, మిగతా అన్ని పాటల్నీ సీతారామశాస్త్రి రాశారు. 'ఒక్కసారి చెప్పలేవా' పాటను ఆయన రాసిన తీరు అమోఘం. అందులో ఎంత అర్థముంది! ఏ పాటనైనా అలవోకగా రాసే ఆయన ఆ ఒక్కపాటకు ఆరు రాత్రులు కష్టపడ్డారు. ఇప్పటి రచయితల్లో కథని ఆయన జీర్ణించుకున్నట్లు ఎవరూ జీర్ణించుకోరు. ఆయన పాటలు కథతో ట్రావెల్ చేస్తాయి. ఆయనతో పనిచేయడమన్నది గ్రేట్ ఎక్స్‌పీరియెన్స్.
(వచ్చే వారం 'నువ్వు నాకు నచ్చావ్' విజయానికి దోహదం చేసిన అంశాలు) 

Thursday, February 17, 2011

కథ: మిలట్రీ నరసింహులు (రెండో భాగం)

పదెకరాల తోట. అక్కడక్కడా జీడిమామిడి చెట్లు కూడా ఉన్నాయి లోపల. వాటి కొమ్మలు నేలకి సమాంతరంగా, దగ్గరగా ఉండటంతో పిల్లలు వాటి కొమ్మల మీద ఆడుకుంటున్నారు చిలకల్లా, సీతాకోక చిలకల్లా. ఫిబ్రవరి తొలి రోజులు కావటాన మామిడిచెట్లు అప్పుడే పచ్చటి పూతతో నిగనిగలాడుతున్నాయి. అక్కడక్కడా పిందెలు వేస్తున్నాయి. ఆ పిందెల్ని కోయకుండా ఆడుకోమన్నాడు తోటమాలి.
పిల్లలు కోతికొమ్మచ్చి ఆడుతుంటే తనూ పిల్లాడిలా మారిపోయి వాళ్లతో ఆడాడు నరసింహులు. పిల్లలు మామిడి పిందెలు కోయబోతుంటే తోటమాలి రాక్షసుడనీ, చూశాడంటే మింగేస్తాడనీ భయపెట్టాడు.
పిల్లలు కథ చెప్పమని మారాం చేశారు. విశాలమైన పెద్ద మామిడి చెట్టు కింద నేల శుభ్రంచేసి, పిల్లలకి 'పాతాళ భైరవి' కథ చెప్పాడు నరసింహులు. కజ్జికాయలు, మినమ్ముద్దలు తింటా ఆ కథలో నాయకుడైన తోటరాముడు చేసే సాహసాల్నీ, నేపాళ మాంత్రికుణ్ణి అతడు ఎదుర్కొనే వైనాన్నీ ఆశ్చర్యపోతూ విన్నారు పిల్లలు. కథవిని, కాస్సేపు తాము స్కూల్లో చేసిన సాహసాల్ని పిల్లలు కబుర్లుగా చెబుతుంటే నరసింహులు నవ్వుతా విన్నాడు.
ఆ తర్వాత 'డిప్పాట' ఆడతామని పిల్లలు గోలపెట్టారు. అప్పటికే సూర్యుడు కిందికి పోతున్నాడు. "ఇంక చాలు పిల్లలూ. చీకటి పడబోతోంది. ఇంటికాడ మీ అమ్మానాన్నలు ఎదురు చూస్తుంటారు. కావాల్నంటే ఇంకోసారి వొద్దురుగానీలే" అని చెప్పాడు నరసింహులు, సముదాయింపుగా.
"ఒక్క పది నిమిషాలే తాతా. ఆడుకుని యెళ్దాం" అన్నారు పిల్లలు. సరేననక తప్పలేదు నరసింహులుకి. పిల్లలు డిప్పాట ఆడుతుంటే చుట్ట వెలిగించి తోటలో తిరుగుతున్నాడు. ఒకచోట దొరువు కనిపిస్తే దానిలోకి దిగాడు. చల్లగా వున్నాయి నీళ్లు. చుట్ట ఆర్పి మొహం కడుక్కుంటున్నాడు. అతడు నిల్చున్నచోట పాచిపట్టి ఉంది. అతడు చూసుకోలేదు. సర్రున జారి దొరువులో పడిపోయాడు. రెండు అడుగుల లోతుకంటే ఎక్కువ లేవు నీళ్లు. అయినా నడుం పట్టేసినట్లయ్యింది. బట్టలన్నీ తడిసిపోయాయి. నొప్పి పెడుతుంటే నడుం పట్టుకుని వొంగిపోయి, నెమ్మదిగా దొరువులోంచి బయటకు వొస్తున్నాడు. అప్పుడే డిప్పాటలో దొంగ పాత్ర పోషిస్తున్న ఏడేళ్ల పాప మిగతా వాళ్లని కనిపెట్టడం కోసం అటేపువొచ్చింది. దొరువులోంచి మెల్లమెల్లగా నల్లటి ఆకారం పైకి వొస్తుండటం చూసింది ఆ పాప. తల్లోంచి నీళ్లుకారుతూ, బవిరిగడ్డమేసుకుని, ఒక కన్ను దాదాపు మూసుకుపోయి, వికృతంగా కనిపించిన ఆ ఆకారాన్ని చూసి దడుసుకుంది. దెయ్యమో, 'పాతాళ భైరవి'లోని నేపాళ మాంత్రికుడో వొచ్చాడనుకుంది. భయంతో నోరు తెరచి, అట్లానే వెనక్కి విరుచుకుపడిపోయింది పాప.
నరసింహులు చూశాడు. ఆ అమ్మాయి ఎందుకలా పడిపోయిందో అర్థంకాలేదు. ఆందోళనగా పాప దగ్గరికెళ్లి "పాపా.. పాపా" అని కేకవేశాడు, కుదుపుతా. పాప ఉలకలేదు, పలకలేదు. దాంతో పాప గుండెమీద చెవిపెట్టాడు. బలహీనంగా కొట్టుకుంటోంది. 'అమ్మయ్య' అనుకుని తలపైకెత్తాడు. గుండె గుభేల్మంది. ఎప్పుడు వొచ్చారో మిగతా పిల్లలంతా ఎదురుగా నిల్చొని, భయంభయంగా అతడి వొంకా, కింద ఉన్న పాప వొంకా చూస్తున్నారు. పిడచకట్టుకుపొయ్యింది నరసింహులు నాలుక. సరిగ్గా అప్పుడే తోటమాలి వొచ్చాడు అక్కడకి.
"నేనేం చెయ్యలేదు. ఎందుకో పాప ఉన్నట్టుండి యెనక్కి యిరుచుకుని పడిపోయింది" అన్నాడు నరసింహులు, బలహీనమైన గొంతుతో.
***
ఆసామి ఇంట్లో ఆ రాత్రి వొకటే గొల్లున ఏడ్పులు.
"మేం చూసేసరికి పాపమీద పడుకుని ఉన్నాడు తాతయ్య" అని చెప్పారు పిల్లలు, వాళ్లు చూసింది అదే కాబట్టి.
"నువ్వు మనిషివా, పశువ్వా. పసిపాపని పట్టుకుని.." అని శాపనార్థాలు పెట్టారు ఆడోళ్లు. అతడి మొహాన ఉమ్మేశారు. ఆసామి, అతని ఇద్దరు తమ్ముళ్లు పిడికిళ్లు బిగించి నరసింహుల్ని ఎక్కడపడితే అక్కడ కొట్టారు. నరసింహులు మొహం పచ్చడైంది. నోరు, ముక్కూ కలిసిపోయాయి, నెత్తురు కారుతూ. నరసింహుల్ని ఇంటిముందున్న వేపచెట్టుకి కట్టేశారు.
"నిన్ను ఊరికే వొదిలిపెట్టకూడదురా పశువా. అన్నెంపున్నెం ఎరగని పసిదాని మీద అఘాయిత్యం చేస్తావా ముసలి కుక్కా. నీకు ఉచ్ఛం నీచం తెలీదంట్రా దొంగనా కొడకా. నువ్వు బతక్కూడదురా" అంటా కర్రలతో మళ్లీ చావబాదారు.
ఈ మధ్యలో నరసింహులు నోరెత్తడానికి లేకపోయింది. తనేమిటి? పాప మీద అఘాయిత్యం చేయడమేమిటి? ఈ నిందతో అతని మెదడు మొద్దుబారిపోయింది. ఒళ్లంతా నెత్తురోడుతున్నా అతను అరవలేదు. ఏడవలేదు. విషయం తెలిసి పోలీసులొచ్చారు. నరసింహుల్ని పట్టుకుపోయారు. వొళ్లంతా పచ్చిపుండై పోలీస్ స్టేషన్లో జీవచ్ఛవంలా పడివున్నాడు. రెండ్రోజుల తర్వాత రాత్రివేళ "ఇక నువ్వెళ్లొచ్చు పెద్దాయనా" అన్నారు పోలీసులు అతని విడిచిపెట్టేస్తా. నరసింహులుకి ఏమీ అర్థంకాలా. జైల్లోపెట్టకుండా తనని ఎందుకు వొదిలేస్తున్నట్లు? అదే అడిగాడు.
"ఆ పాప బతికింది. తనని నువ్వేమీ చెయ్యలేదని చెప్పిందిలే" చెప్పారు పోలీసులు.
అప్పుడు తెలిసింది నొప్పి. వొళ్లంతా భరించలేని నొప్పి. ఆ చీకట్లో పరుగుపరుగున ఇంటికొచ్చాడు నరసింహులు. యానాదమ్మ ఒళ్లో తలపెట్టుకుని యెక్కెక్కి ఏడ్చాడు. అసలే ఆమె జబ్బు మనిషి. రెండు రోజుల్నించీ ఆమెకి తిండి లేదు. మొగుడి మీద బెంగతో. నరసింహులు ఎలాంటివాడో ఆమెకి తెలుసుకదా! ఈ వయసులో అతని మీద పడ్డ అపవాదు, పోలీసులు తీసుకుపొయ్యారన్న బాధ ఆమెని కుంగతీశాయి. నరసింహులుతో పాటు ఆమె కూడా ఏడ్చింది.
తెల్లారింది. రాత్రికి రాత్రే నరసింహులు ఇల్లు ఖాళీ చేసి ఎక్కడికో వెళ్లిపోయాడని అంతా అనుకున్నారు. అక్కడ మాయమైన మనిషి పందిళ్లపల్లిలో తేలాడు. అదీ ఊరికి దూరంగా. ఇరవై ఏళ్లయ్యింది ఇక్కడికొచ్చి. ఇప్పుడు నరసింహులుకి డెబ్భై రెండేళ్లు. అయినా తొంభై ఏళ్ల వాడిలా కనిపిస్తున్నాడు. ఆర్మీనుంచి పెన్షను రావడం పర్చూరు నుంచి వొచ్చేశాక ఆగిపోయింది.
ఇరవై ఏళ్ల క్రితం జీవితంలో ఎదురైన భయానక అనుభవం అతణ్ణి మానసికంగా, శారీరకంగా కుంగదీసింది. దాంతో డ్రైవరుగానే కాదు వాచ్‌మన్‌గానూ పనికిరాకుండా పోయాడు. కూతుళ్లతో సంబంధాలూ తెగిపోయాయి. తనని తనే పోషించుకోలేని దీన స్థితి. మళ్లీ తన మెడకో డోలులాంటి యానాదమ్మ. నరసింహులు బిక్షగాడిగా మారిపోయాడు. అప్పట్నించీ ఇప్పటిదాకా పందిళ్లపల్లి వీధుల్లో 'అమ్మా కాస్త అన్నంపెట్టు తల్లీ', 'బాబూ ఒక్క పావలా ఉంటే ధర్మం చెయ్యి బాబూ' అన్న నరసింహులు గొంతు ప్రతిధ్వనిస్తూనే ఉంది.
***
"అరే పెద్దాయనా చస్తావ్. కాస్త చుట్టుపక్కల చూస్కో" అని చేయిపట్టుకు లాగాడు రాజేంద్ర. దాదాపు నరసింహుల్ని రాసుకుంటున్నట్లుగా పోయింది ఓ లారీ.
"నువ్వా బాబూ, ఇందాక కనపడకపోయేతలికి ఊళ్లో లేవేమోననుకున్నా" అన్నాడు నరసింహులు, కాస్త ఊరట చెందిన మనసుతో.
ఎందుకనో తెలీదు నరసింహులంటే రాజేంద్రకి జాలి. కనిపించినప్పుడల్లా ఐదు లేదంటే పది రూపాయల నోటు ఇస్తుంటాడు. ఇప్పుడూ ఇచ్చాడు పది రూపాయలు.
"పిల్లాపాపల్తో సల్లంగ ఉండు కొడుకా" అన్నాడు నరసింహులు అక్కడే తలుపులు వేసున్న ఓ ఇంటి అరుగుమీద కూలబడతా.
రాజేంద్ర నవ్వి "చీకటి పడింది. ఇంటికెళ్లు. ముసలామె నీకోసం ఎదురు చూస్తుంటుంది" అంటా వెళ్లిపోయాడు.
"అవునవును. వొచ్చేప్పుడు మసల్ది బిళ్లలు తెమ్మంది" అని తనలో తనే గొణుక్కుంటున్నట్లు అంటా మెడికల్ షాపుకేసి నడిచాడు మిలట్రీ నరసింహులు.
(అయిపోయింది)
-ఆంధ్రభూమి డైలీ, 30 మే 2010

Saturday, February 12, 2011

హిట్.. హిట్.. హుర్రే..!: ఖుషి-2

శ్రద్ధగా చదువుకుంటోన్న మధు వద్దకొచ్చి పలకరించాడు సిద్ధు. 'డోంట్ డిస్టర్బ్. చదువుకుంటున్నా' అంది మధు. సరేనంటూ అవతలకి వెళ్లి కూర్చుని, తానూ పుస్తకం తెరిచాడు సిద్ధు. చూపు పుస్తకం మీద నిలవనంటోంది. ఆమె వంక చూశాడు. అప్పుడే గాలికి పైట తొలగి తెల్లని, అందమైన మధు నడుము, పొట్ట మధ్యలో చిన్న నాభి కనిపించాయి. అసలే నల్లని చీర కావడంతో ఆచ్ఛాదన లేని ఆమె నడుము భాగం మరింత తెల్లగా కనిపించింది. చూపు తిప్పుకోలేకపోయాడు. ఎందుకో అతడివంక చూసింది మధు. చప్పున తల తిప్పేసుకున్నాడు. ఆమె మళ్లీ పుస్తకం వేపు దృష్టి పెట్టింది. గాలి వీస్తూనే ఉంది. మధు నడుము అనాచ్ఛాదితంగా కనిపిస్తూనే ఉంది. అతడి చూపులు అటువేపు పోతూనే వున్నాయి. అతడి గొంతు తడారిపోతోంది. గుటకలు మింగుతున్నాడు. నాలుగైదు సార్లు అతడి చూపులు గమనించాక, అప్పుడు అర్థమైంది, అతడు ఎక్కడ, ఏం చూస్తున్నాడో.
"సిద్ధు.. ఇదేం బాలేదు" కోపంగా అంది.
"ఏంటీ?" అడిగాడు సిద్ధు ఏం ఎరగనట్లు.
"నువ్వు చేసే పని"
"నేనేం చేశాను?"
"నీ చూపు గురించి మాట్లాడుతున్నా"
"నేనేం చూశాను?"
"నువ్వు నా నడుం చూశావు"
"లేదు"
"నువ్వు చూశావు. నువ్వు చూసింది నేను చూశాను"
"లేదు. చూడలేదు"
"చూశావు. పదిసార్లన్నా చూసుంటావు"
ఇద్దరూ గొడవపడ్డారు. ప్రతిసారీ తనని అపార్థం చేసుకుంటున్నావని అనాడు సిద్ధు. 'పెద్ద అందగత్తెవని పెద్ద ఫీలింగ్' అని కూడా అన్నాడు. బలవంతాన కోపం అణచుకుంటూ, పళ్లు బిగించి "నువ్వు నడుం చూశావా లేదా?" అని మళ్లీ గటిగా అడిగింది మధు. దానికి సమాధానం చెప్పకుండా "నువ్వు నన్ను లవ్ చేశావా, లేదా?" అడిగాడు సిద్ధు. "లేదు" అంది మధు. "నేనూ నీ నడుం చూడలేదు" అని జవాబిచ్చాడు సిద్ధు. మళ్లీ పోట్లాట. "అసలిలాంటి అమ్మాయితో ఫ్రెండ్‌షిప్ చేయను. ఒకవేళ చేసినా అది లవ్ దాకా రాదు. వచ్చినా మ్యారేజ్ దాకా వెళ్లదు. ఖర్మకాలి నన్ను బలవంతంగా పెళ్లికి దింపినా కానీ, 'ఇలాంటమ్మాయి వొద్దు' అని లెటర్ రాసి పారిపోతా" అన్నాడు సిద్ధు. దాంతో ఏడుస్తూ "సిద్ధు అనేవాణ్ణి లైఫ్‌లో కలవలేదనే అనుకుంటా. మనమధ్య ఏమీ లేదు. నథింగ్ బిట్వీన్ యు అండ్ మి" అని అక్కణ్ణించి విసవిసా వెళ్లిపోయింది మధు.
'ఇగో' (అహం) అనేది ఇద్దరు యువతీ యువకుల మధ్య ఎలాంటి యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తుందనే దానికి చక్కని ఉదాహరణ ఈ సన్నివేశం. 'ఖుషి' చిత్రం మొత్తానికీ కీలకమైన సన్నివేశం ఇది. మిగతా సినిమా అంతా ఆధారపడింది ఈ సన్నివేశం మీదే. ఈ సన్నివేశం వల్లే మధు, సిద్ధు ఎడమొహం పెడమొహం అయ్యారు. ఆ తర్వాత ఆ ఇద్దరూ ఎలా ఒకటయ్యారనేదే మిగతా కథ.
ఈ సన్నివేశాన్ని రాసిన తీరూ, తెరమీద దాన్ని చిత్రీకరించిన తీరూ ఉన్నత స్థాయికి చెందుతాయి. అప్పటివరకూ వచ్చిన చిత్రాల్లో నాయికా నాయకుల మధ్య గొడవలకు ఇతరేతర గొడవలెన్నో కారణంగా కనిపిస్తూ వచ్చాయి. హీరోయిన్ 'బెత్తెడంత నడుము'ని హీరో చూసినందువల్ల గొడవ వచ్చి, వాళ్లు దూరమవడమనేది కొత్త. లాజికల్‌గా చూస్తే, హీరో మీద ప్రేమవున్న (నోరుతెరచి చెప్పకపోయినా) నాయిక తన నడుముని నాయకుడు చూశాడని కోప్పడి, అతడికి దూరమవ్వాలనుకోవడం హాస్యాస్పదం అనిపిస్తుంది. అయితే అలాంటి భావన సగటు ప్రేక్షకుడికి కలగకపోవడమే ఈ సినిమా సాధించిన విజయం. అందుకు దోహదం చేసినవి బిగువైన స్క్రీన్‌ప్లే, ఉలాసభరితమైన సన్నివేశాల కల్పన. ఆ ఘనత స్క్రీన్‌ప్లేనీ సమకూర్చిన దర్శకుడు ఎస్.జె. సూర్యదే. అంతేకాదు, ఆ సన్నివేశం ఏమాత్రం అసభ్యకరంగా లేకుండా 'క్యూట్'గా రావడానికి కారణం, పి.సి. శ్రీరాం ఛాయాగ్రహణ ప్రతిభ. ఆ సన్నివేశంతో పాటు ఆద్యంతం తన కెమెరా పనితనంతో చిత్రాన్ని 'విజువల్ ఫీస్ట్'గా తయారుచేశాడు శ్రీరాం. ఆయా సన్నివేశాల్లో సందర్భానుసారం చక్కగా అమరిన సంభాషణలనీ తక్కువ చేయలేం. రాజేంద్రకుమార్ రాసిన సంభాషణలు కథనంలో కావలసినంత 'టెంపో'ని తీసుకొచ్చాయి.
ఇక సిద్ధు, మధు మధ్య దూరం మరింత పెరిగే సన్నివేశంలో పవన్ కల్యాణ్ నోటివెంట పలికే డైలాగుల్ని ప్రేక్షకులు ఎంతగా అస్వాదించారో! గుడుంబా ప్యాకెట్ల కోసం మోషే (అలీ) బయటకు వెళితే అప్పటికే గుడుంబా మత్తులో ఉన్న సిద్ధు గోడమీది బొమ్మలో మధుని చూస్తూ "ఏంటి చూస్తున్నావ్ చెప్పు. నాకు చెప్పాల్సిందే. బాగా.. పెద్ద పెద్ద రెండు గుడ్లగూబల్లాంటి కళ్లు పెట్టుకుని ఎందుకలా చూస్తున్నావో చెప్పవే. (నడుము సైజు చేతితో కొలుస్తూ) బెత్తెడంత చోటు లేదు. దీన్ని మేం చూశామంట. నువ్వు పెద్ద అందగత్తెవి. పిడతంత ముఖం, చుంచులాంటి ముక్కు, గండుచీమ కుట్టి వాచినట్లుండే చిన్ని పెదిం. ఆ.. ఏదో.. చూడాలనిపించే చిన్ని నడుం. నల్ల చీర కట్టుకుని ఒళ్లంతా కప్పుకుని కూర్చున్నప్పుడు ఎర్రగా నిమ్మపండు రంగులో.. ఓ.. నిమ్మపండు పసుపురంగులో ఉంటుంది కదూ. ఓ.. ఎరుపు, పసుపు మిక్సయిపోయి చిన్ని రొమాంటిక్ కలర్లో.. చిన్ని ఏరియా కనిపించినప్పుడు కళ్లు ఆటోమేటిగ్గా చూస్తాయి. అది దాని ('అవి వాటి' అని వుండాలి) నైజం. అది నువ్వు చూపించకుండా వుండాల్సింది. ముఖం నీ వొంట్లో భాగమే. నడుం నీ వొంట్లో భాగమే. ముఖం చూస్తే కోపం రాలేదు. నడుం చూస్తే కోపం వచ్చింది. ఎందుకు? ఎందుకని నేను ప్రశ్నిస్తున్నానంతే. ఇప్పుడు నీ నడుమే కాదు. నీ ఫుల్ బాడీ చూస్తాను. అసలు నువ్వు నా పక్కన నిల్చునే అర్హత కోల్పోయావ్' అని మధు బొమ్మని చింపేస్తాడు. దాన్ని మధు చూసి కోపంతో వెళ్తున్నప్పుడే మెళ్లో గుడుంబా పాకెట్ల దండ వేసుకుని ఎదురు వస్తుంటాడు మోషే.
"ఓరి బాబూ మోషయ్యో. కుత్తే. నా బతుకును బుగ్గిపాలు చేశావు కదరా నీయయ్య. నా ప్రేమను బుగ్గిపాలు చేశావు కదరా.. రాయ్యా రారా.. ఈ సచ్చినోడు కలకత్తా నుంచి నా ప్రేమను పాడు చేయడానికొచ్చాడు సచ్చినోడు.. నీ జిమ్మడిపోను.." అంటూ బాధపడతాడు సిద్ధు. ఈ సన్నివేశాన్నీ, సిద్ధు పాత్ర పలికే డైలాగుల్నీ, ఆ డైలాగుల్ని కృష్ణా జిల్లా యాసలో పవన్ కల్యాణ్ చెప్పే తీరునీ ఆస్వాదించని వాళ్లెవరు? ప్రేక్షకుల్ని బాగా అలరించిన సన్నివేశాల్లో ఇది ముఖ్యమైన సన్నివేశం. కథ అత్యధిక భాగం సిద్ధు, మధు పాత్రల చుట్టూనే తిరుగుతుంది. ఆ పాత్రల్లో పవన్ కల్యాణ్, భూమిక అలవోకగా ఇమిడిపోయారు. నిజమైన ప్రేమికులే గొడవ పడుతున్నంత సహజంగా పాత్ర పోషణ చేశారు ఆ ఇద్దరూ. కల్యాణ్‌కి సిద్ధు పాత్రలాగా అంత బాగా అమరిన పాత్ర 'ఖుషి'కి ముందు కానీ, తర్వాత కానీ మరొకటి లేదు. మధు పాత్రలో భూమిక కూడా అంతే. అందుకే 'క్యూట్ పెయిర్' అనిపించుకుంది ఆ జంట.
ఇక సినిమా విజయంలో కీలక పాత్ర పోషించిన మరో అంశం సంగీతం. మణిశర్మ బాణీలు అందించిన ఆరు పాటలూ ఇప్పటికీ ప్రేక్షకుల పెదాలపై ఆడుతూనే ఉన్నాయి. 'యే మేరా జహా యే మేరా ఘర్ మేరా ఆషియా', 'ప్రేమంటే సులువు కాదురా అది నీవు గెలవలేవురా', 'అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా', 'ఆడువారి మాటలకు అర్థాలే వేరులే', 'చెలియ చెలియా చిరుకోపమా', 'గజ్జె ఘల్లుమన్నాదిరో గుండె ఝల్లుమన్నాదిరో' పాటలు ఒకదాన్ని మించి మరొకటి సూపర్ హిట్. వీటిలో పింగళి పాట 'ఆడువారి మాటలకు అర్థాలే'తో పాటు తొలి రెండు పాటల కాన్సెప్టు కల్యాణ్‌దే. ఇక సన్నివేశాలకి ఇచ్చిన నేపథ్య సంగీతాన్నీ ప్రశంసించకుండా ఉండలేం. హీరో హీరోయిన్లతో పాటు మిగతా నటుల హావభావాలతో సైతం బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కచ్చితంగా సింక్ అవడం ముచ్చటగా అనిపిస్తుంది. ఇన్ని అంశాలు పక్కాగా కుదిరినందునే కుర్రకారుని అంతగా ఆకట్టుకుంది 'ఖుషి'. చివరకు ముసలాళ్లు కూడా ఈ సినిమా చూస్తూ తమ కాలేజీ రోజుల్లోకి వెళ్లిపోయి, కుర్రాళ్ల మాదిరిగా ఆస్వాదించారన్నది నిజం.

అది అద్భుతమైన సీన్
-రాజేంద్రకుమార్
తమిళంలో ఈ సినిమా చేసేప్పుడే నన్ను పిలిపించారు. సెట్స్ మీదే సూర్య నాతో చర్చించేవారు. సంభాషణల్లో తెలుగుదనం ఉట్టిపడాలని చెప్పేవారు. తెలుగు నుడికారంతో మాటలు రాయగలిగా. క్లుప్తమైన సంభాషణలు బాగా వర్కవుట్ అయ్యాయి. కథనాన్ని సూర్య అద్భుతంగా నడిపారు. చిన్న చిన్న ఎక్స్‌ప్రెషన్స్‌కి కూడా ప్రాధాన్యతనివ్వడం చిత్రానికి జీవాన్ని తెచ్చింది. దానికి కాంప్రమైజ్ కాని నిర్మాణం తోడైంది.
'తొలిప్రేమ', 'తమ్ముడు', 'బద్రి' చేసిన పవన్ కల్యాణ్‌కి యూత్‌లో గొప్ప ఇమేజ్ వచ్చింది. ఆ ఇమేజ్ 'ఖుషి'కి బాగా హెల్పయ్యింది. ఫైట్స్, సాంగ్స్ అతనే కంపోజ్ చేశాడు. ఒరిజినల్ తమిళ సినిమాలో కోల్‌కతా ఎపిసోడ్ లేదు. తెలుగులో దాన్ని తెచ్చింది కల్యాణ్. గుళ్లో దీపం ఆరిపోతుంటే హీరో హీరోయిన్లు ఒకేసారి వచ్చి దాన్ని ఆపే ప్రయత్నం అద్భుతమైన సీన్. అలాగే భూమిక నడుముని కల్యాణ్ చూసే సన్నివేశం ఎలాంటి అసభ్యతకి తావులేకుండా సున్నితంగా తీయడం గొప్ప విషయం. ఇలాంటి స్క్రిప్టు అంతదాకా రాలేదు. రీ-రికార్డింగ్ కూడా అద్భుతం. చివరలో ట్రైన్‌లో వెళ్లేప్పుడు రాజ్‌కపూర్ 'మేరా నాం జోకర్'లోని మ్యూజికల్ బిట్‌ని ఉపయోగించారు. అది బాగా కుదిరింది.
రైటర్‌గా నేను చెప్పుకోదగ్గ సినిమా. ఈ సినిమాకి భాగస్వామిని కావడం నా అదృష్టం.

నా పాట గ్రాండ్ హిట్
-సుద్దాల అశోక్‌తేజ
ఓ పాట కోసం నిర్మాత రత్నం చెన్నైకి పిలిపించారు. అక్కడే దర్శకుడు సూర్యనీ కలిశా. సందర్భం చెప్పి పాట ఎరోటిగ్గా ఉండాలన్నారు సూర్య. ఓ పాట రాసిచ్చి వచ్చేశా. దాన్ని హీరో పవన్ కల్యాణ్ విని, మళ్లీ చెన్నై పిలిపించారు. బాగుందని చెబుతూనే 'మొదలు నుంచి చివరి దాకా అమ్మాయి శరీరాన్ని ఎక్కడా మీ 'నిబ్' టచ్ చేయకుండా పాట రాయగలరా? ఆ ఊపు, కవ్వింపు మాత్రం తప్పనిసరిగా ఉండాలి' అన్నారు. దాంతో పాటు ఏదైనా హిట్ సాంగ్ తీసుకుని దాన్ని అనుసరించి రాయమన్నారు. అప్పుడు మళ్లీ రాశా. 'హోలి.. హోలిలో రంగ హోలీ.. చమకేళిల హోలీ' అనే జానపద పాట పల్లవిని తీసుకుని 'ఏకవీర', 'రోషనార' వంటి పదాలు మధ్యమధ్యలో ఉపయోగిస్తూ 'గజ్జె ఘల్లుమన్నాదిరో.. గుండె ఝల్లుమన్నాదిరో' అంటూ రాశా. గ్రాండ్ హిట్. దాని చిత్రీకరణ కూడా అంత బాగానూ వచ్చింది. కల్యాణ్ సినిమాకి నేను రాసిన తొలిపాట ఇదే. ఇప్పటి దాకా మళ్లీ రాయలేదు.
(వచ్చేవారం 'నువ్వు నాకు నచ్చావ్' విశేషాలు) 

Tuesday, February 8, 2011

కథ: మిలట్రీ నరసింహులు

చూరు తగలకుండా కిందికి వొంగి గుడిసెలోంచి బయటకు వొచ్చాడు నున్నా నరసింహులు. తలకి రెండు రెట్లు పెద్దదిగా ఉన్న పెద్ద తలపాగా, వెండి దారప్పోగుల్లా మెరుస్తున్న తెల్లటి బుర్ర మీసాలు, ఆ మీసాల కింద గుప్పున పొగ వొదులుతూ పొడవాటి చుట్ట. వొంటిమీద మరకలతో దుమ్ముకొట్టుకుని ఖాకీ చొక్కా, ఆ చొక్కా కింద మురికిమురిగ్గా పాతబడిపోయిన తెల్ల పంచె, కుడి భుజాన అతుకులు వేసిన పురాతన కాలంనాటి నూలు సంచి, ఎడమ చేతిలో కర్ర.. ఇదీ నరసింహులు వేషం.
"వొచ్చేప్పుడు మర్సిపోకుండా బిళ్లలు తేయ్యా" అని లోపల్నించి బలహీనమైన గొంతు వినిపించింది. అది అతడి భార్య యానాదమ్మది. ఆయాసం, దగ్గుతో బాధపడుతూ తెగిపోతున్న నులక మంచం మీద పడుకుని వుంది. ఆమె నడవలేదు కూడా.
"తెత్తాలెయ్యే" అంటా బాట మీదికొచ్చాడు నరసింహులు. ఆ బాట అవతల నేల కనిపించడంలేదు. ఎటు చూసినా విరగ్గాసిన మొక్కజొన్న కంకులే. అప్పుడే ఒక ఎడ్లబండి ఆ చేల మధ్యలోంచి బాట మీదికొచ్చింది. ఆ బండినిండా పొత్తులు. బండెనక నలుగురు పిల్లకాయలు కూర్చుని చేతుల్లో వున్న మొక్కజొన్న పొత్తుల మీది మట్టల్ని వొలుస్తా కబుర్లాడతా వున్నారు. మధ్యమధ్యలో పెద్దపెద్దగా నవ్వుతున్నారు.
ఎడ్లబండి నరసింహుల్ని దాటింది. అతన్ని చూడంగాల్నే "ఇగో మీసాల్తాతా. నీ టోపీ ఇత్తావా. ఇదిత్తా" అని ఓ పిల్లాడు ఎకసెక్కం చేశాడు చేతిలోని పొత్తుని వూపుతా. మిగతా పిల్లకాయలు బిగ్గరగా నవ్వారు.
నరసింహులు చేయి టక్కున తలపాగా మీదికెళ్లింది. గట్టిగా దాన్ని అదిమి పట్టుకున్నాడు.
"పోండిరా భడవల్లారా. ఈ మూసలాణ్ణి చూత్తంటే ఎగతాళిగా ఉంటంది మీకు. మిలట్రీలో పనిచేసినోణ్ణిరా. నాతో పెట్టుకోకండ్రోయ్" అన్నాడు కర్రని వాళ్లకేసి ఊపుతా.
"అబ్బో మిలట్రీ తాత మనల్ని కొట్టేట్టున్నాడ్రోయ్. పారిపోదాం పదండి" అని ఇంకో పిల్లకాయ్ అనేసరికి, మిగతావాళ్లు మళ్లా పెద్దగా నవ్వారు.
"రేయ్ ఆపండ్రా పరాచికాలు. ఆ ముసలోడితో మీకెందుకు" అని కసురుకున్నాడు బండి తోలుతున్నతను. దాంతో పిల్లకాయల నోళ్లు మూతపడ్డాయి.
ఎద్దుల గిట్టల బలానికి లేచిన దుమ్ము ఎడమ కంట్లో పడింది. కన్ను నులుముకున్నాడు నున్నా నరసింహులు. అతడి కుడి కన్ను దాదాపుగా పాడైపోయింది. ఎప్పుడూ పుసులు కారుతూ ఉంటుంది. ఆ కంట్లో ఏం పడినా అతడికి తెలీదు.
నడుస్తున్నాడు నరసింహులు. పందిళ్లపల్లిలో ఊరి చివర గుడిసెలో ఇరవై ఏళ్లుగా ఉంటున్నాడు. అయినా అయినవాళ్లెవరూ అతని దగ్గిర లేరు. ఒక్క రాజేంద్ర మాత్రమే నరసింహులుతో దయగా మాట్లాడుతుంటాడు. అతను రైసుమిల్లు ఓనరు పట్టాభి కొడుకు. సాయంత్రం పూట నరసింహులు గుడిసె మీదుగా తమ పొలానికి వెళ్తుంటాడు రాజేంద్ర. ఆ రోజు నరసింహులుకి అతను కనిపించలేదు.
ఊళ్లోకి వచ్చాడు. కాస్త దర్జాగా కనిపించినోళ్లనల్లా "ఒక్క పావలా ధర్మం చెయ్యండి బాబయ్యా" అని అడుక్కోవడం మొదలుపెట్టాడు భుజానికి తగిలించుకున్న సంచిని తెరిచిపెట్టి. కొంతమంది పావలో, అర్థరూపాయో వేస్తుంటే, కొంతమంది చీదరించుకుని అవతలకి పోతున్నారు. ఇంకొంతమంది "చిల్లర లేదు పో.. పో.." అని చీత్కరిస్తున్నారు. అప్పుడు నరసింహులు పెద్ద గొంతుతో ఎవరినో ఉద్దేశించి తిడుతూ "బాంచెత్. మీవొల్లనే కదంట్రా నాకిట్లాంటి గతి పట్టింది. మీరు పురుగులుపట్టి పోతారా దొంగనాయాళ్లార్రా.." అంటూ ఏడ్పు మొదలుపెట్టాడు.
"నాకేం తెల్వదు.. నాకేం పాపం తెలీదు. అయినా గానీ నామీద నింద మోపారు కదర్రా" అన్నాడు ఏడుస్తూనే. కొత్తవాళ్లు నరసింహులు మాటలు విని, అవి అర్థమయ్యీ అవక, అతను తమని ఉద్దేశించి ఆ మాటలంటున్నాడా అని సందేహపడ్తున్నారు. నరసింహులు గురించి ఏ కాస్తో తెలిసినోళ్లు "ఆ ముసలాడంతే. అడుక్కుంటూ ఎవర్నో తిడుతుంటాడు. ఒకప్పుడు మిలట్రీలో పనిచేశాడంట. పాపం ఇప్పుడు అడుక్కుంటున్నాడు గతిలేక" అని పక్కవాళ్లకి చెబుతున్నారు.
* * *
నున్నా నరసింహులు ఒకప్పుడు ఓ మోస్తరుగానే బతికాడు. మద్రాస్ ఇంజినీరింగ్ గ్రూప్ కింద ఆర్మీలో పనిచేశాడు. 1952లో సైన్యంలో డ్రైవరుగా చేరిన అతను బర్మా, ఇటలీ, నేపాల్, ఇరాన్ వంటి దేశాలు తిరిగాడు ఉద్యోగంలో భాగంగా. పదిహేడు సంవత్సరాల తర్వాత 1969లో రిటైరయ్యాడు. అతని కుడికన్ను దెబ్బతినడమే అందుకు కారణం. ఆ తర్వాత జీవన భృతి కోసం అతను డ్రైవరుగా, వాచ్‌మన్‌గా ఉద్యోగాలు చేశాడు.
ఆర్మీనుంచి వొచ్చాక నెలకు 350 రూపాయలు పెన్షను కింద వొచ్చేవి. దీంతో నరసింహులు జీవితం సాఫీగానే నడిచేది. ఇద్దరు కూతుళ్లకు పెళ్లిళ్లు చేసి అత్తారింటికి పంపేశాడు. ఇక ఇంట్లో ఉండేది అతనూ, భార్య యానాదమ్మే.
బుర్ర మీసాలు, దెబ్బతిన్న కంటితో నరసింహులు చూడ్డానికి కాస్త భీకరంగా అవుపించినా, మనిషి వెన్నలాంటివాడు.
సైన్యంలో పనిచేసినా అతని మాటల్లో, చేతల్లో కరకుదనం కనిపించదు. అందుకే చిన్నపిల్లలకి అతడు 'మీసాల తాతయ్య' అయిపోయాడు. మంచి మంచి కథలు చెబుతుంటాడు కాబట్టి 'కథల తాతయ్య'గానూ చేరువయ్యాడు. అదే అతనికి తర్వాత కాలంలో చేటు తీసుకొచ్చింది.
*  *  *
పర్చూరులో ఒక పెద్ద ఆసామి ఇంట్లో డ్రైవరుగా పనిచేస్తున్నాడు అప్పట్లో. ఆ ఇంట్లో చాలామంది మనుషులు. వాళ్లకి చాలామంది పిల్లలు. వీలు దొరికినప్పుడల్లా ఆ పిల్లలకి కథలు చెబుతున్నాడు నరసింహులు. వాటిలో పౌరాణికాలు, జానపదాలు ఎక్కువ. మళ్లీ వాటిలో వీరరసం ఎక్కువ. సహజంగానే ఆ కథలు పిల్లల్ని బాగా ఆకట్టుకునేవి. అలరించేవి. కథ చెప్పేప్పుడు ఎవరన్నా నరసింహులుని పిలిచి, పనిచెబితే ఆ పిల్లలు తెగ బాధపడేవాళ్లు.
'తాతయ్య కథ చెబుతున్నాడు. కాసేపు ఆగమ'ని పెద్దల్ని బతిమిలాడేవాళ్లు. దాంతో "ఇదిగో నరసింహులూ, ఈ కథలూ, కాకరకాయలూ అంటా పిల్లల్ని చెడగొట్టమాక" అని విసుక్కునేవోళ్లు పెద్దలు. నరసింహులు నవ్వి ఊరుకునేవోడు. "మళ్లీ వొచ్చాక చెబుతాలే" అని పిల్లల్ని ఊరడించి, కారు తియ్యడానికి వెళ్లేవోడు. అట్లా అతడి కథలకి ఎడిక్ట్ అయిపోయారు పిల్లలు. సెలవు వొచ్చిందంటే కథల తాతయ్య కోసం వెతుక్కునేవోళ్లు. కథ చెప్పడంలో అంత మహత్తుంది నరసింహుల్లో. పిల్లలే కాదు, అతడు కథ చెబుతుంటే విన్నారా పెద్దలు, వాళ్లు కూడా కథ అయిపోయేదాకా అట్లా వింటూ వుండి పోవాల్సిందే.
అప్పుడు జరిగింది ఆ విషాదకర సంఘటన. ఆ రోజు సెలవు కావడంతో తమ మామిడి తోటల్ని చూడాలని పిల్లలు గొడవ గొడవ చేశారు. దాంతో ఆ పిల్లల్ని తీసుకెళ్లే బాధ్యత నరసింహులు మీద పడింది. మధ్యలో ఆకలైతే తినడం కోసం మినమ్ముద్దలు, కజ్జికాయలు ఒక టిపినులో పెట్టిచ్చారు ఆ ఇంటి ఆడోళ్లు. ఎనిమిది మంది పిల్లల్ని తీసుకుని రెండు మైళ్ల దూరంలో జాగర్లమూడి దగ్గరున్న మామిడి తోటకి వెళ్లాడు నరసింహులు.
(ఇంకావుంది) 

Saturday, February 5, 2011

హిట్.. హిట్.. హుర్రే...!: ఖుషి

తారాగణం: పవన్‌కల్యాణ్, భూమిక, అలీ, సుధాకర్, శివాజీ, విజయ్‌కుమార్, నాజర్, రాజన్ పి. దేవ్, సుధ, ముంతాజ్, జానకి, డింపుల్, ఎస్.జె. సూర్య (అతిథి పాత్ర)
మాటలు: రాజేంద్ర కుమార్
పాటలు: పింగళి, ఎ.ఎం. రత్నం, చంద్రబోస్, సుద్దాల అశోక్‌తేజ, అబ్బాస్ టైర్‌వాలా
సాంగ్స్ కాన్సెప్ట్: పవన్‌కల్యాణ్
సంగీతం: మణిశర్మ
ఛాయాగ్రహణం: పి.సి. శ్రీరాం
కూర్పు: బి. లెనిన్, వి.టి. విజయన్, కోలా భాస్కర్
యాక్షన్: విజయ్
యాక్షన్ సీక్వెన్సెస్ రూపకల్పన: పవన్‌కల్యాణ్
కొరియోగ్రఫీ: బృంద, హరీశ్‌పాయ్
ఆడియోగ్రఫీ: హెచ్. శ్రీధర్
ఆర్ట్: ఆనంద్‌సాయి
పబ్లిసిటీ డిజైనర్: లంక భాస్కర్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అళహరి రఘురాం
నిర్మాత: ఎ.ఎం. రత్నం
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎస్.జె. సూర్య
బేనర్: శ్రీ సూర్యా మూవీస్
విడుదల తేది: 27 ఏప్రిల్, 2001

చిరంజీవికి అసలు సిసలు వారసుడు వచ్చాడు.. అందరినోటా ఈ మాట అనిపించేట్లు చేసిన సినిమా 'ఖుషి'. అప్పటికే  'తొలిప్రేమ', 'తమ్ముడు', 'బద్రి' చిత్రాల విజయాలతో మంచి జోష్ మీదున్న పవన్‌కల్యాణ్ ఇమేజ్‌ని అమాంతం శిఖరం మీద నిలిపిన చిత్రం 'ఖుషి'. ఈ సినిమాతో యువతరంలో తిరుగులేని ఆరాధ్యతారగా రాపుదాల్చాడు పవన్‌కల్యాణ్.  
నిజం చెప్పాలంటే మెగాస్టార్‌గా నెంబర్‌వన్ హోదాని అనుభవిస్తోన్న చిరంజీవినే సవాలుచేసే స్థాయికి ఆయన్ని చేర్చింది ఈ సినిమా. 79 కేంద్రాల్లో వంద రోజులు ఆడిన 'ఖుషి', ఐదు కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ జరుపుకుంది. వాణిజ్యపరంగా కానీ, అభినయపరంగా కానీ కల్యాణ్ కెరీర్‌లో ఇప్పటివరకు అత్యుత్తమ చిత్రం ఇదే. పైగా ఇది ఆయనలోని సృజనాత్మక ప్రతిభని కూడా బయటపెట్టిన తొలి సినిమా. ఇందులోని యాక్షన్ సన్నివేశాలన్నింటినీ డిజైన్ చేసింది ఆయనే. అంతేనా, ఆరింటిలో మూడు పాటల కాన్సెప్ట్ ఆయనదే. మామూలుగా మనం చూసే ఫైట్లకీ, పాటలకీ అవి ఎంత భిన్నంగా ఉన్నాయో, అంత బాగానూ అవి ఆకట్టుకున్నాయి. అలరించాయి. ఇక పవన్‌కల్యాణ్, భూమిక జోడీ 'క్యూట్ పెయిర్'గా పేరు తెచ్చుకుని యువతలో అపూర్వమైన క్రేజ్ సంపాదించుకోవడం మనలో చాలామందికి తెలిసిందే. అలాగే ఆ రోజుల్లో ఎక్కడ విన్నా 'ఖుషి' పాటలే. ఆరుకి ఆరూ సూపర్ హిట్. 'మిస్సమ్మ'లోని 'ఆడువారి మాటలకు అర్థాలే వేరులే' పాట రీమిక్స్ సైతం ఇన్‌స్టంట్ హిట్. 
అలాంటి ఈ సినిమా రీమేక్ కావడం గమనార్హం. దీని మాతృక తమిళంలో విజయ్, జ్యోతిక జంటగా నటించగా 2000 సంవత్సరంలో విడుదలై ఘనవిజయం సాధించిన 'ఖుషి' చిత్రం. చెప్పుకోదగ్గ విశేషమేమంటే ఒరిజినల్ సాధించిన విజయన్ని మించి తెలుగు రీమేక్ మరింత పెద్ద విజయం సాధించడం. మాతృకని రూపొందించిన ఎస్.జె. సూర్య ఈ రీమేక్‌నీ డైరెక్ట్ చేశాడు. శ్రీ సూర్యా మూవీస్ బేనర్‌పై ఎన్నో ప్రతిష్ఠాత్మక చిత్రాల్ని అందించిన ఎ.ఎం. రత్నం ఈ సినిమాకి నిర్మాత. సినిమా ఆద్యంతం 'రిచ్'గా కనిపించిందంటే - అందుకు కారణం సూర్య దర్శకత్వ ప్రతిభకి రత్నం ఉన్నతస్థాయి నిర్మాణ విలువలు తోడవడమే. పేరుకి రీమేక్ అయినా మాతృకని మించిన 'నవ్యత' తెలుగు 'ఖుషి'లో అడుగడుగునా గోచరిస్తుంది. ఫైట్లు, పాటల విషయంలోనే కాక సన్నివేశాల కల్పనకూ ఇది వర్తిస్తుంది. అందుకే "ఇది తమిళ వెర్షన్‌ని మక్కీకి మక్కీ కాపీ చేసిన సినిమా కాదు. తమిళం కంటే తెలుగు సినిమా మరింత సృజనాత్మకంగా, మరింత వైవిధ్యంగా ఉంటుంది" అని చెప్పారు పవన్‌కల్యాణ్. చాలామందికి తెలీని సంగతి ఇంకోటుంది. సంభాషణల రచయిత రాజేంద్రకుమార్ మాటల్లో చెప్పాలంటే "తమిళ వెర్షన్‌లో కోల్‌కతా ఎపిసోడ్ లేదు. అక్కడ ఆ ఎపిసోడ్ వేరేవిధంగా ఉంటుంది. కోల్‌కతా నేపథ్యంలో ఆ ఎపిసోడ్ తెచ్చింది కల్యాణే".
'ఖుషి' యువతరాన్ని ఇంత గొప్పగా ఆకట్టుకోవడానికి కారణమేంటి? కథ పరంగా చూస్తే చెప్పుకోడానికి ఏమీలేదు. అతి సన్నని లైను మీద అల్లుకున్న సన్నివేశాల సమాహారం మాత్రమే. ఏమిటా లైను. మాస్టర్స్ డిగ్రీ చేస్తున్న ఇద్దరు యువతీ యువకుల మధ్య సున్నితంగా నడిచే ప్రేమ వ్యవహారం. అదీ కూడా చివరి రీలులో తప్ప ఇద్దరూ తమ ప్రేమని ఎదుటివాళ్ల వద్ద వ్యక్తం చేయరు. ఎప్పుడూ 'అహం' (ఇగో) ప్రదర్శిస్తూ గొడవపడుతూనే ఉంటారు. అయినా ఒకరంటే ఒకరికి ఎనలేని అనురాగం. అలాంటి ఓ అమ్మాయి, అబ్బాయి మధ్య సున్నితంగా సాగే రొమాన్స్‌ని ఇంకెంత సున్నితంగా నడపాలి! పాత 'మిస్సమ్మ' గుర్తుంది కదా. ఎన్‌టీఆర్, సావిత్రి పాత్రలు గుర్తున్నాయి కదా. అందులో ఆ ఇద్దరికీ ఒకరంటే ఒకరికి చెప్పలేనంత అనురాగం. కానీ దాన్ని బయటపెట్టడానికి ఇద్దరికీ 'అహం' అడ్డు వస్తుంటుంది. ఒక రకంగా చెప్పాలంటే 'ఖుషి'లో పవన్‌కల్యాణ్, భూమిక పోషించిన సిద్ధార్థ్‌రాయ్, మధుమతి పాత్రలు వాటికి కొనసాగింపు. నాటి పాత్రల స్వభావాన్ని అందిపుచ్చుకుని నేటి పాత్రల్ని మలచాడు సూర్య. అదీ, అత్యంత ఆకర్షణీయంగా. అందుకే ఆ పాత్రల్లో తమని తాము చూసుకున్నారు కాలేజీ యువత. ఆ పాత్రలతో సహానుభూతి చెందారు. 'ఖుషి' చేసుకున్నారు. వాళ్లని అంతగా ఆకట్టుకున్న సిద్ధార్థ్‌రాయ్, మధుమతి కథేమిటో ఓసారి చూద్దాం. 

కథాసంగ్రహం:
కోల్‌కతాలో సిద్ధార్థ్‌రాయ్ అలియాస్ సిద్ధు (పవన్‌కల్యాణ్), కైకలూరులో మధుమతి అలియాస్ మధు (భూమిక) దాదాపు ఒకే సమయంలో పుడతారు. కాలేజీలో సిద్ధుకి బెంగాల్ టైగర్ అని పేరు. అతని తండ్రి తెలుగువాడైతే, తల్లి బెంగాలీ. మాస్టర్స్ డిగ్రీ కోసం కెనడాకి వెళ్లాలనేది సిద్ధు కోరిక. తల్లికి ఇష్టముండదు. ఎమ్మెస్ చదవాలనేది మధు లక్ష్యం. తండ్రి బాపిరాజు (విజయ్‌కుమార్) ఒప్పుకోడు. 'మా అమ్మాయి పెళ్లికి ఒప్పుకోవాలి' అంటూ గుడిచుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న తండ్రిని చూసి పెళ్లికి సరేనంటుంది మధు. పెళ్లిరోజు 'ఇంతకు ముందే నేనో అమ్మాయిని ప్రేమించా. ఆమె ఆత్మహత్యకు సిద్ధపడింది. ఆమె వద్దకి వెళ్తున్నా. నన్ను క్షమించండి' అంటూ ఆ కనిపించని వరుడు ఉత్తరం రాసి వెళ్లిపోతాడు.
కెనడాకని కారులో ఎయిర్‌పోర్ట్‌కి వెళ్తున్న సిద్ధు రోడ్డు మీద సిగ్నల్స్ వద్ద అడ్డం వచ్చిన ఓ యువకుణ్ణి (ఎస్.జె. సూర్య) తప్పించబోయి, ఇంకో కారుని గుద్దేస్తాడు. హాస్పిటల్లో తేలతాడు. రెండు నెల్లు బెడ్ రెస్ట్ తప్పదంటారు డాక్టర్లు. పెళ్లి తప్పిన మధు, కెనడా ప్రయాణం ఆగిన సిద్ధు హైదరాబాద్ నిజాం కాలేజీలో అడుగుపెడతారు. అక్కడ సిద్ధుకి స్నేహితుడైన బాబు (శివాజీ), మధుకి ఫ్రెండయిన శాంతి (డిపుల్) ప్రేమలో పడతారు. బాబు అనాథ అయితే శాంతి పేరుపొందిన గూండా గుడుంబా సత్తి (రాజన్ పి. దేవ్) కూతురు. ఆ ఇద్దరికీ సిద్ధు, మధు సాయపడుతుంటారు. ఆ రకంగా ఇద్దరూ ఒకరికొకరు సన్నిహితమవుతారు. ఓసారి చదువుకుంటున్న మధు వద్దకు వచ్చి పలకరిస్తాడు సిద్ధు. 'డోంట్ డిస్టర్బ్. చదువుకుంటున్నా' అంటుంది మధు. కొద్ది దూరంలో కూర్చుని సిద్ధు ఆమె వంక చూస్తే గాలికి పైట తొలగి అనాచ్చాదితమైన ఆమె నడుము, నాభి.. చూపు తిప్పుకోలేకపోతాడు. మధు తనవైపు చూడగానే తల తిప్పుకుంటాడు. ఇలా మూడు నాలుగుసార్లు జరగడంతో సిద్ధు ఏం చూస్తున్నాడో అర్థమై అతడితో గొడవపెట్టుకుంటుంది మధు. 'నువ్వు నా నడుం చూశావు' అని మధు అంటే 'లేదు' అంటాడు సిద్ధు. ఇద్దరి మధ్యా వాదన జరుగుతుంది. "అసలిలాంటి అమ్మాయితో ఫ్రెండ్‌షిప్ చెయ్యను. ఒకవేళ చేసినా అది లవ్‌దాకా రాదు. వచ్చినా అది మ్యారేజ్ దాకా వెళ్లదు. ఖర్మకాలి నన్ను బలవంతంగా పెళ్లికి దింపినా కానీ, ఇలాంటమ్మాయి వొద్దని లెటర్‌రాసి పారిపోతా" అనికూడా అంటాడు. దాంతో ఏడుస్తూ "సిద్ధు అనేవాణ్ణి లైఫ్‌లో కలవలేదనే అనుకుంటా. నథింగ్ బిట్వీన్ యు అండ్ మి" అంటా వెళ్లిపోతుంది మధు. 
బాబు, శాంతికి సిద్ధు సాయపడుతుండటంతో అతడిమీద సత్తి మనుషులు ఎటాక్ చేస్తారు. ఒకడు సిద్ధుని కత్తితో పొడవబోవడం చూసిన మధు ఆ కత్తిని చేతితో గట్టిగా పట్టుకుని గాయపడుతుంది. ఆమెని హాస్పిటల్లో చేరుస్తాడు సిద్ధు. ఇద్దరూ మళ్లీ దగ్గరవుతున్నట్లే వుంటారు కానీ ఇగోలు తగ్గవు. శాంతికి పెళ్లి నిశ్చయం చేస్తాడు సత్తి. దాంతో శాంతి, బాబుకు గుళ్లో పెళ్లి ఏర్పాట్లు చేస్తాడు సిద్ధు. సత్తి, అతని అనుచరులు అక్కడికి వస్తుంటే మధ్యలో అటకాయించి, వాళకి తన కత్తి పదును రుచి చూపిస్తాడు. స్నేహితులమైన మేమే వాళ్ల పెళ్లికి సాయపడుతుంటే, తండ్రివైన నీవెందుకు వాళ్ల పెళ్లిని అడ్డుకుంటున్నావని అడుగుతాడు సత్తిని. అతని మంచి మాటలతో రియలైజ్ అయిన సత్తి మంచివాడిగా మారిపోయి, వధూవరుల మీద అక్షింతలు చల్లుతాడు. ఎవరిదారిన వాళ్లు ఆనందంగా వెళ్లిపోతారు. చదువులు అయిపోతాయి. విడిపోవాల్సిన సమయం వచ్చేసింది. సూట్‌కేసులు సర్దుకుంటుంటే మధు, సిద్ధు హృదయాలు ఆవేదనాభరితం అవుతాయి. ఒకరి మనసులోని భావం మరొకరికి చెప్పుకోవాలనుకుంటారు. కుదరదు. సిద్ధు ఫలక్‌నామా ఎక్స్‌ప్రెస్‌కి వెళ్తున్నాడని మధుకీ, మధు గౌతమి ఎక్స్‌ప్రెస్‌లో వెళ్లబోతున్నదని సిద్ధుకీ తెలుస్తుంది. స్టేషన్‌లో మధు కోసం గౌతమిలో సిద్ధు, అతని కోసం ఫలక్‌నామాలో మధు వెతుకుతారు. కనిపించకపోయేసరికి మధుకివ్వమని సిద్ధు, సిద్ధుకివ్వమని మధు పక్క సీట్లలో ఉన్నవారికి ఓ లెటర్ ఇచ్చి వాళ్లు వచ్చాక ఇవ్వమంటారు. రైలుబళ్లు కదులుతాయి. ఉత్తరాలు అందుతాయి. 'ఐ లవ్ యు మధు' అని సిద్ధు, 'ఐ లవ్ యు సిద్ధు' అని మధు రాసుకుంటారు. 'నన్ను ప్రేమించడానికీ, నాతో గొడవపడ్డానికీ నువ్వు కావాలి సిద్ధూ' అని కూడా రాస్తుంది మధు.

తెలుగు 'ఖుషి' మరింత సృజనాత్మకం
-పవన్‌కల్యాణ్
రీమేక్ అంటే రీమేకే. కథ విషయానికి వస్తే 'ఖుషి' ఒరిజినల్ కాకపోవచ్చు. కానీ చాలా సన్నివేశాల్లో, ఫ్రేముల్లో ఒరిజినాలిటీ ఉంది. పాటలు, ఫైట్లు కొత్తగా డిజైన్ చేశాం. రెండు భాషల్లోనూ 'ఖుషి' చూస్తే ఆ సంగతి మీకు అర్థమవుతుంది. అంటే తమిళ మాతృకని మేం మక్కీకి మక్కీ కాపీ చేయలేదు. సృజనాత్మకత పరంగా చూస్తే చిత్రంలో చాలా కొత్త ఐడియాలు ప్రవేశపెట్టాం. మాతృక కంటే తెలుగు వెర్షన్ మరింత సృజనాత్మకంగా, మరింత వైవిధ్యంగా ఉంటుందనే సంగతి తెలుస్తుంది.
దర్శకుడు సూర్యలో ఏదైనా కొత్తగా చేయాలనే తపన అధికం. నేనూ అలాంటి నావెల్టీనే కోరుకుంటా కాబట్టి మామధ్య మంచి అండర్‌స్టాండింగ్ కుదిరింది. అందువల్లే ఫైట్స్‌నీ, కొన్ని పాటల్నీ నేను డిజైన్ చేశా. కొన్ని సన్నివేశాల్నీ సమన్వయంతో చేసుకుపోయాం. ఈ సినిమాకి రత్నం నిర్మాత కావడం పెద్ద ప్లస్ పాయింట్. దేనికీ ఆయన 'నో' చెప్పలేదు. 

(వచ్చేవారం 'ఖుషి' ఘనవిజయానికి దోహదం చేసిన అంశాలు)