Tuesday, August 16, 2011

న్యూస్: కృష్ణ అల్లుడు ఆకట్టుకుంటాడా?

వారసులుగా కొడుకులు రావడం చాలా కాలం నుంచి తెలుగు సినీరంగంలో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అల్లుళ్లు కూడా ఆ బాట పడుతున్నట్లు కనిపిస్తోంది. సూపర్‌స్టార్ కృష్ణ అల్లుడు సుధీర్‌బాబు హీరోగా మారారు. అతను కృష్ణ చిన్న కుమార్తె ప్రియదర్శిని భర్త. నాగచైతన్య సినిమా 'ఏమాయ చేసావె'లో హీరోయిన్ సమంతా అన్నగా ఆకట్టుకుంది సుధీర్‌బాబే. అతను హీరోగా ఇప్పుడు 'శివ మనసులో శ్రుతి' అనే సినిమా తయారవుతోంది. 'భీమిలి కబడ్డిజట్టు' ఫేం తాతినేని సత్య ఈ సినిమాకి డైరెక్టర్. సత్య తండ్రి టి.ఎల్.వి. ప్రసాద్ ఒకే హీరోతో 35 సినిమాలు డైరెక్ట్ చేసి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకున్నారు. ఆ హీరో మిథున్ చక్రవర్తి. ఇక సత్య తాత తాతినేని ప్రకాశరావు కూడా గొప్ప డైరెక్టర్. 'పల్లెటూరు', 'ఇల్లరికం' వంటి సినిమాల్ని ఆయన రూపొందించారు. ఇప్పుడు 'శివ మనసులో శ్రుతి' సినిమాని ఆర్.బి. చౌదరి సమర్పిస్తుండగా, హనీబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బేనర్‌పై కృష్ణ కుమార్తె ఘట్టమనేని ప్రియ నిర్మిస్తున్నారు. ఇందులో సుధీర్ సరసన నాయికగా రెజీనా పరిచయమవుతోంది. సెల్వ గణేశ్ మ్యూజిక్ డైరెక్టర్. మంచి స్ఫురద్రూపి అయిన సుధీర్ ఇప్పటికే 'ఏమాయ చేసావె'తో నటుడిగా ఓకే అనిపించుకోవడంతో హీరోగానూ రాణిస్తాననే నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నాడు. మరి ప్రేక్షకులు అతణ్ణి ఆదరిస్తారా?

No comments: