Thursday, August 4, 2011

న్యూస్: ఆరేళ్ల తర్వాత హీరోగా మోహన్‌బాబు

ఆరేళ్ల గ్యాప్‌తో సీనియర్ నటుడు మోహన్‌బాబు సోలో హీరోగా తెర మీద కనిపించబోతున్నారు. చివరిసారి 2005లో 'పొలిటికల్ రౌడీ'గా ఆయన కనిపించారు. ఈ మధ్యలో 'గేం', 'యమదొంగ', 'బుజ్జిగాడు', 'పాండురంగడు', 'మేస్త్రి', 'రాజు మహరాజు', 'సలీం', 'ఝుమ్మంది నాదం' వంటి సినిమాల్లో ఆయన నటించారు. వీటిలో 'గేం', 'రాజు మహరాజు'లో ప్రధాన పాత్రలు చేయగా, మిగతావి కేరక్టర్ రోల్స్ కింద లెక్క. ఇన్నాళ్లకి సోలో హీరోగా మరోసారి నటించబోతున్నారు. ఆయన సొంత బేనర్ శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్‌పై నిర్మాణమయ్యే ఈ సినిమాని ఎవరు డైరెక్ట్ చేస్తారో ప్రకటించలేదు కానీ కథని సమకూర్చిన ముగ్గురు రచయితల పేర్లను వెల్లడించారు. వారు.. కోన వెంకట్, గోపీమోహన్, బీవీఎస్ రవి. "ఈ ముగ్గుర్నీ కలిపి నేను 'కేజీబీ' అని పిలుస్తుంటా. ఫారిన్‌లో ఈ గ్రూప్‌కి ప్రత్యేకమైన పేరుంది. ఆ ముగ్గురు రచయితలు దాదాపు యేడాదిగా పనిచేసి అద్భుతమైన స్క్రిప్తును అందించారు" అని చెప్పారు మోహన్‌బాబు. విశేషమేమంటే ఇందులో ఆయన సరసన అయిదుగురు అమ్మాయిలు నటించబోతున్నారు. వాళ్లెవరనేది తర్వాత తెలియజేస్తారు. మొదట ఇందులో ఐదుగురు హీరోలు, ఐదుగురు హీరోయిన్లు ఉంటారని ప్రకటించి, తర్వాత హీరో మోహన్‌బాబు ఒక్కరేననీ, హీరోయిన్లు ఐదుగురనీ ప్రకటించడం గమనార్హం. ఈ సినిమాలో మోహన్‌బాబు పాత్రని ప్రత్యేకంగా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఆ పాత్ర బాగా నచ్చినందునే ఇంత కాలం తర్వాత హీరోగా నటించేందుకు ఆయన నిర్ణయించుకున్నారు. ఈ సినిమా ఫలితం హీరోగా ఆయన భవితవ్యాన్ని నిర్దేశించనున్నది.

No comments: