Thursday, August 18, 2011

న్యూస్: క్రిష్ తర్వాతి సినిమా ఎలా ఉంటుంది?

మిగతా దర్శకులంతా సేఫ్ జోన్‌లో రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు తీస్తూ ఎక్కువమంది ప్రేక్షకుల్ని ఆకట్టుకోడానికి తాపత్రపడుతుంటే అతను మాత్రం తనకు నచ్చిన మార్గంలో జీవిత వాస్తవికతని ప్రతిబింబించే సినిమాలు తీస్తూ ముందుకు నడుస్తున్నాడు. కేవలం మూడే మూడు సినిమాలతో టాలీవుడ్‌లోనే కాక, మొత్తం భారతీయ చిత్రసీమలోనే అత్యంత ప్రతిభావంతులైన దర్శకుల జాబితాలో చేరిపోయాడు. అతను జాగర్లమూడి రాధాకృష్ణ అలియాస్ క్రిష్. సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్ అంటే ఏమితో 'గమ్యం', 'వేదం' సినిమాలతో చూపించిన అతను 'వేదం' తమిళ రీమేక్ 'వానం'తో తమిళ ప్రేక్షకుల్నీ ఆకట్టుకున్నాడు. ఆ సినిమా చూస్తున్న తమిళ ప్రేక్షకులు థియేటర్లలో లేచి నిల్చుని చప్పట్లు కొడుతూ తమ అభిమానాన్ని ప్రదర్శించకుండా ఉండలేకపోయారంటే అతని దర్శకత్వ ప్రతిభ ఏపాటిదో అర్థం చేసుకోవాల్సిందే. ఈ సినిమాలో అతను హీరోలనీ చూపలేదు, విలన్లనీ చూపలేదు. తప్పుడు మార్గంలో పోయే మనిషి కొన్ని సంఘటనలతో ఎలా మంచివాడిగా మారతాడో ఎంతో కన్విన్సింగ్‌గా అందులో చూపించాడు క్రిష్. ఈ సినిమాని హిందీలో తీసి, మరింతమందికి చేరువయ్యే అవకాశమున్నా అలా వచ్చిన ఆఫర్‌ని సున్నితంగా తిరస్కరించాడు. కానీ ఈ సినిమా తమిళ హక్కులు కొన్న హీరో శింబు హిందీ సినిమానీ డైరెక్ట్ చేయాల్సిందిగా అతన్ని కోరుతున్నాడు.
తెలుగుకంటే తమిళ ప్రేక్షకుల్నే ఎక్కువగా 'వేదం' ఆకట్టుంది. ఆ ఇద్దరి మధ్య పోలికల్ని తెలియజేస్తూ "ఓ సీన్‌లో ముసలాయన సొమ్ముని దొంగిలించిన అల్లు అర్జున్ తిరిగి దాన్ని అతనికి తిరిగివేస్తాడు. ఆ సీను చూసి తెలుగువాళ్లు కన్నీళ్లు పెట్టుకున్నారు. అదే సీనుని తమిళంలో శింబు చేశాడు. ఆ సీను చూసి తమిళులు చప్పట్లు కొట్టి, ఈలలు వేశారు. మనవాళ్లకీ, తమిళులకీ సినిమాని అర్థం చేసుకోవడంలో ఉన్న తేడా అది" అని చెప్పాడు క్రిష్.
ఇప్పటిదాకా తన సినిమాల కోసం గ్రామాల్లో, మురికివాడల్లో ఎక్కువగా తిరిగిన క్రిష్ ఈసారి పట్టణ, పోష్ లొకేషన్లలో సినిమా తీయాలనుకుంటున్నాడు. "నా తర్వాతి సినిమాలో భారీ ఫైట్లు, సెట్లు ఉంటాయి" అని అతను తెలిపాడు. ఓ వైపు సామాజిక వాస్తవికతని చూపిస్తూ, మరోవైపు మానవ భావోద్వేగాల్ని గొప్పగా సెల్యులాయిడ్ మీద మలచగలిగే నేర్పు ఉన్న ఈ డైరెక్టర్ ఇప్పుడు తన తర్వాతి స్క్రిప్టు మీద పూర్తిగా నిమగ్నమై ఉన్నాడు. ఆ సినిమా కూడా అతణ్ణి కచ్చితంగా వార్తల్లో నిలుపుతుందన్నది నిఖార్సయిన నిజం.

No comments: