Tuesday, August 9, 2011

మన చరిత్ర: అందరిదారీ అ.ర.సం. వైపే!

1943 వేసవిలో బొంబాయిలో అఖిలభారత అభ్యుదయ రచయితల సభలూ, ప్రజా నాట్యమండలి సభలూ జరిగాయి. అక్కడున్న కొయాజీ జహంగీర్ హాలులో జరిగిన ఈ సభలకు తెలుగు నాట నుండి పెద్ద ప్రతినిథి వర్గమే వెళ్లింది. సెట్టి ఈశ్వరరావు, కె.ఎస్. ప్రకాశరవు, చదలవాడ పిచ్చయ్య, కొడవటిగంటి కుటుంబరావు, తుమ్మల వెంకటరామయ్య తదితరులెందరో ఆ ప్రతినిథివర్గంలో ఉన్నారు. అఖిలభారతంగా ఉండే ప్రముఖ రచయితలందరూ వచ్చారు.
అప్పటినుండీ క్రమంగా అభ్యుదయ రచయితల ఉద్యమం ఆంధ్రలో బాగా వేళ్లూనింది. 1944 రెండవ మహసభల్లో చిలకమర్తి లక్ష్మీనరసింహం స్వీయ చరిత్రను ప్రకటించి వారికి బహూకరించింది. తెలికచర్ల వెంకటరత్నం, అడివి బాపిరాజు వంటి వాళ్లతో సహా మొత్తం నవ్య సాహిత్య పరిషత్తు అంతా ఇందులో కలవడంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రతిపత్తి పెరిగింది. 'తెలుగు తల్లి' పత్రికను తీసికొని నడిపారు. 1946లో పెదపూడి (తూ.గో. జిల్లా)లో సాహిత్య పాఠశాల నిర్వహించారు. దాన్ని 'ప్రజా విశ్వవిద్యాలయం'గా నాడు రచయితలు ప్రశంసించారు. సాహితీరంగంలో ప్రసిద్ధులందరూ పాల్గొన్నారు.
1946లో దేవలపల్లి కృష్ణశాస్త్రి అధ్యక్షతన, శ్రీశ్రీ ప్రారంభకులుగా రాజమండ్రిలో మూడవ మహాసభలు జరిగాయి. జలసూత్రం రుక్మిణీనాథశాస్త్రి వంటి వ్యక్తులు ఖాకీ నిక్కరు తొడుక్కుని వలంటీర్లుగా ఆ సభల్లో పనిచేశారు. 1946 నుండే సంఘం 'అభ్యుదయ' పత్రికను నిర్వహించడం మొదులుపెట్టింది. 1947లో నాలుగో మహాసభలు మద్రాసులో జరిగాయి. రాజమన్నారులాంటి వ్యక్తులు ఉద్యమంలోకి వచ్చారు. పల్లెకోన (గుంటూరు జిల్లా)లో 1947లోనే సాహిత్య పాఠశాల జరిగింది.
1955లో సంఘం ఐదవ మహాసభలు విజయవాడలో జూలై 30, 31 తేదీల్లో జరిగాయి. ఉప్పల లక్ష్మణరావు ఆహ్వాన సంఘాధ్యక్షులు. సభలకు శ్రీశ్రీ అధ్యక్షత వహించారు. తెలుగుదేశంలో రచయితలూ, కవులూ, కళాకారులందరూ వచ్చారు. ఈ సభలు చేసిన అనేక తీర్మానాల్లో వ్యావహారిక భాషావ్యాప్తికి ఓ సంఘాన్ని వేసి విశ్వవిద్యాలయాల్లో దానికోసం పోరాడాలన్నది ఓ తీర్మానం. ఆ ఉపసంఘలో తాపీ ధర్మారావు, గిడుగు సీతాపతి, తెలికచర్ల వెంకటరత్నం, కొడవటిగండి సభ్యులు. శ్రీశ్రీ కన్వీనర్.

1 comment:

kothapalli Ravibabu said...

పెదపూడి తెనాలి సమీప గ్రామం.గుంటూరు జిల్లా .ఇక్కడే సాహితి పాఠశాల జరిగింది. పల్లెకోన లో సాహితి పాఠశాల జరగలేదు.