Thursday, August 4, 2011

న్యూస్: చిన్నికృష్ణ కథతో అల్లు అర్జున్ మరో సినిమా!

అల్లు అర్జున్ తొలి సినిమా 'గంగోత్రి', పదో సినిమా 'బద్రినాథ్'కు కథల్ని అందించిన చిన్నికృష్ణ త్వరలో అర్జున్ కోసం మరో కథని సిద్ధం చేయబోతున్నాడు. ఈ సంగతిని 'బద్రినాథ్' 50 రోజుల ప్రెస్‌మీట్‌లో నిర్మాత అల్లు అరవింద్ తెలిపారు. ఇది చిన్నికృష్ణకు తెగ సంతోషాన్ని కలిగించింది. అర్జున్ కోసం మరో గొప్ప కథని తయారు చేస్తానని అప్పటికప్పుడే ప్రకటించారు. ఇప్పటివరకు ఆయన కథని సమకూర్చిన చిత్రాల్లో 'నరసింహనాయుడు', 'ఇంద్ర', 'గంగోత్రి' పెద్ద విజయాల్ని సాధించాయి. వాటితో పాటు బాలకృష్ణ నటించిన డిజాస్టర్ మూవీ 'సీమ సింహం'కీ ఆయన కథని అందించారు. ఇప్పుడు ఆయన కథతో 'బద్రినాథ్' వచ్చింది. ఓంకార్ డైరెక్టర్‌గా పరిచయం కాబోతున్న 'జీనియస్' కథ కూడా ఆయనిదే. నిజానికి 'గంగోత్రి' తర్వాత తనే డైరెక్టర్ కావాలనే తలంపు కలిగింది చిన్నికృష్ణకి. అయితే అది వాస్తవ రూపం దాల్చలేదు. ఈలోపు రచయితగా ఆయనకు చాలా గ్యాప్ వచ్చింది. ఆయన డైరెక్షన్ అంటే పెద్ద హీరోలెవరూ ముందుకు రాకపోవడంతో చేసేది లేక మళ్లీ మనసు మార్చుకుని దర్శకత్వ ఆలోచనని విరమించుకున్నాడు. కథా రచయితగానే కొనసాగాలని నిర్ణయించుకున్నాడు. ఇప్పుడు 'బద్రినాథ్' కలెక్షన్లు పూర్తి స్థాయిలో సంతృప్తినివ్వకపోయినా చిన్నికృష్ణ కథ మీద అరవింద్ నమ్మకం సడలలేదు. అందుకే ఆయన కథతో అర్జున్ హీరోగా గీతా ఆర్ట్స్ బేనర్‌పై మరో సినిమా చేస్తానని ప్రకటించారు. చిన్నికృష్ణ కథ అంటేనే భారీతనం కావాలి కాబట్టి మరో 40 నుంచి 50 కోట్ల రూపాయల సినిమాకి తెరతీయబోతున్నారన్న మాట.

No comments: