Wednesday, August 24, 2011

న్యూస్: ఎన్టీఆర్, శ్రీను వైట్ల కాంబినేషన్!

పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో 2012 ఏప్రిల్ నుంచి ఓ సినిమా చేయనున్న ఎన్టీఆర్ అంతకంటే ముందు శ్రీను వైట్ల డైరెక్షన్‌లో నటించేందుకు సిద్ధమవుతున్నాడు. ఆ ఇద్దరి కాంబినేషన్ కలవడం ఇదే తొలిసారి. ఎన్టీఅర్, పూరి కాంబినేషన్ సినిమాని నిర్మించే పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ అధినేత బండ్ల గణేశ్ ఈ సినిమానీ నిర్మించబోతున్నాడు.
ఎన్టీఆర్ ప్రస్తుతం సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో 'ఊసరవెల్లి'తో పాటు బోయపాటి శ్రీను దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు. "బోయపాటి డైరెక్షన్లో క్రియేటివ్ కమర్షియల్స్ అధినేత కె.ఎస్. రామారావు నిర్మిస్తున్న సినిమా తర్వాత నేను చేసేది శ్రీను వైట్ల దర్శకత్వంలోనే. అతను చెప్పిన కథ ఇన్‌స్పైరింగ్‌గా ఉంది. మా ఫస్ట్ కాంబినేషన్ ద బెస్ట్ అనిపించుకునేలా మంచి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తయారవుతుంది" అని ఎన్టీఆర్ తెలిపాడు.
మరోవైపు మహేశ్ హీరోగా తను రూపొందిస్తున్న 'దూకుడు' తర్వాత తను డైరెక్ట్ చేసేంది ఎన్టీఆర్‌నేనని శ్రీను వైట్ల తెలిపాడు. 'అతడు', 'దూకుడు' సినిమాలకి సినిమాటోగ్రఫీ అందించిన గుహన్ ఈ సినిమాకీ పని చేయబోతున్నాడు. మొత్తానికి మంచి మంచి కాంబినేషన్స్ పట్టుకుంటూ నిర్మాత బండ్ల గణేశ్ వార్తల్లో వ్యక్తిగా మారాడు.

No comments: