Monday, August 15, 2011

మన చరిత్ర: ప్రథమాంధ్ర మహాసభ

జొన్నవిత్తుల గుర్నాధం సహాయంతో కొండా వెంకటప్పయ్య 'ఆంధ్రోద్యమము' అనే ఓ చిన్న పుస్తకాన్ని ఇంగ్లీషు, తెలుగుల్లో రాశారు. తెలుగుదేశంలో ప్రజల్ని స్వరాష్ట్ర వాంఛకు అనుకూలంగా తయారుచేయడానికి కొండా వెంకటప్పయ్య పర్యటన చేశారు.
పర్యవసానంగా బాపట్లలో 1913 ఎండాకాలంలో ప్రథమాంధ్ర మహాసభగా అవతరించింది. 800 మంది ప్రతినిథులొచ్చారు. ఈ సభలకు బయ్యా నరసింహేశ్వరశర్మ అధ్యక్షత వహించారు. తర్వాత ఆంధ్ర రాష్ట్ర నిర్మాణాన్ని గూర్చి వేమవరపు రామదాసు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. సభలో చాలా కలకలం పుట్టింది. న్యాపతి సుబ్బారావు, మోచర్ల రామచంద్రరావు, గుత్తి కేశవపిళ్లె వంటివారు ప్రతికూలంగా ప్రసంగించారు. ఈ ముగ్గురూ వ్యతిరేకిస్తే ఈ ఉద్యమం ముందుకెళ్లదని సభ అభిప్రాయపడింది. ప్రజల్లో కూడా దీని గురించి మరింత విస్తృతంగా ప్రచారం జరగాలనీ, ఆ తర్వాత ఇలాంటి తీర్మానం చేస్తే ఉద్యమం బాగా వేళ్లూనుతుందనీ అందరూ అనడంతో దాన్నే తీర్మాన రూపంలో అంగీకరించడం జరిగింది. దీని ప్రచారకులు పట్టాభి సీతారామయ్య, ముట్నూరి కృష్ణారావు, వల్లూరి సూర్యనారాయణరావు, కొండా వెంకటప్పయ్య. వీరు 1913 డిసెంబరులో తెలుగుదేశమంతా పర్యటించారు.
1914 ఎండాకాలంలో బెజవాడలో రెండో ఆంధ్ర మహాసభ జరిగింది. పెద్దిభోట్ల వీరయ్య, అయ్యదేవర కాళేశ్వరరావ్, అయ్యంకి వెంకటరమణయ్య తదితరులు దీనికి నడుంకట్టారు. హఠాత్తుగా వచ్చిన గాలివానతో బ్రహ్మాండమైన సభాస్థలి రెండుసార్లు నేలకూలింది. అయినా చివరకు సభలు ఉత్సాహపూరిత వాతావరణంలో న్యాపతి సుబ్బారావు అధ్యక్షతన జరిగాయి. వేలాదిమంది ప్రతినిథులొచ్చారు. ఆంధ్ర రాష్ట్ర నిర్మాణాన్ని గూర్చీ, కొన్ని కాలేజీల్ని స్థాపించాలనీ, ఉద్యోగాల్లో ఆంధ్రులకు ఎక్కువ అవకాశాలివ్వాలనీ తెలిపే అనేక తీర్మానాల్ని సభ ఆమోదించింది. జోరున కురుస్తున్న వానను సైతం లెక్కచేయకుండా ప్రతినిథులు గొడుగులేసుకుని ఈ తీర్మానాల అంగీకారం వరకూ ఉండి ఆంధ్రరాష్ట్ర నిర్మాణం యెడల తమ దీక్షను ప్రకటించడం ఈ సభల ప్రత్యేకత. రాష్ట్ర ఉద్యమపథంలో ఇదో మైలురాయి.

No comments: