Friday, August 5, 2011

న్యూస్: అక్కినేనిగారూ ఇది సభ్యతేనా?

అక్కినేని నాగేశ్వరరావు దేశం గర్వించే మహానటుడు. 'దేవదాసు' పాత్రని ఆయన పోషించినట్లుగా ఇంకెవ్వరూ పోషించలేదనే కీర్తి పొందినవారు. ఆరున్నర దశాబ్దాలుగా అలుపన్నది లేకుండా ఇంకా నటిస్తూనే ఉన్నారు. చివరి శ్వాస వరకూ నటిస్తూనే ఉంటానని తన అంకిత భావాన్ని ప్రదర్శించే అసలు సిసలు కళాకారుడు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న బాపు 'శ్రీరామరాజ్యం'లో వాల్మీకిగా నటిస్తున్నారు. అలాంటి ఆయన అదుపుతప్పి, అసభ్యకర రీతిలో మాట్లాడటమేమిటా అని అందరూ ఆశ్చర్యచకితులవుతున్నారు. మీడియా అంతా పాల్గొన్న ఓ ఆడియో వేడుకలో, టెలివిజన్‌లో ప్రత్యక్షప్రసారమవుతున్న ఆ కార్యక్రమంలో ఆయన ఆడవారి వక్షస్థలం గురించి కొద్దిసేపు అలాగే మాట్లాడటం అందర్నీ బిత్తరపోయేలా చేసింది. కొంతమంది ఆయన మాటల్ని ఎంజాయ్ చేసినా ఎక్కువమంది అంత పెద్దవారు, అందరూ గౌరవించే స్థాయిలో ఉన్నవారు అలా మాట్లాడవచ్చునా? అని పెదవి విరిచారు. గురువారం (ఆగస్ట్ 4) రాత్రి ప్రసాద్ ల్యాబ్ ప్రివ్యూ థియేటర్‌లో జరిగిన 'దగ్గరగా.. దూరంగా...' ఆడియో వేడుకలో ఈ సందర్భం చోటు చేసుకుంది. ఇందులో అందరికంటే చివరగా సుదీర్ఘంగా మాట్లాడిన ఆయన మధ్యలో అకస్మాత్తుగా 'అమాయకురాలు' సినిమా సంగతి ప్రస్తావిస్తూ అందులో నాయిక కాంచనని తను హత్తుకునే సన్నివేశం గురించి చెప్పుకొచ్చారు. "ఆ సమయంలో నిర్మాత మధుసూదనరావు గారు లేరు. నేను, కాంచన ఒకరినొకరం తన్మయత్వంతో గట్టిగా హత్తుకోవాలి. ఆ సీనులో ఆమె 'బ్రెస్ట్స్' కదిలాయి. ఈ సంగతి నాకెలా తెలుస్తుంది? రషెస్ చూసిన మధుసూదనరావు గారు నన్ను పిలిచారు. 'నీకు బుద్ధుందా? అంత గట్టిగా వత్తుకోవాలా? ఆ బ్రెస్ట్స్ చూడు ఎలా కదిలాయో. చూసుకోవద్దా?' అనరిచారు. అప్పట్లో అసభ్యతకు తావు లేకుండా అంత జాగ్రత్త తీసుకునేవారు. ఇప్పుడు అలాంటివేమీ లేవు. అయినా ఇప్పుటి హీరోయిన్లవి కదులుతున్నా అవి నిజమైనవో, కాదో.. ఇప్పుడు కృత్రిమమైనవేవో తొడుక్కుంటున్నారుగా" అని చెప్పుకొచ్చారు. ఆయన ఈ మాటలు చెప్పేప్పుడు ఆయన పక్కనే ఆ సినిమా హీరోయిన్ వేదిక ఉంది. వేడుకకి వచ్చిన వాళ్లలో ఆడవాళ్లు ఉన్నారు. ఆయన ఇలా సినిమాల్లో అసభ్యత గురించి మాట్లాడుతూ, తనే అసభ్యంగా మాట్లాడటం వాళ్లని తలలు దించుకునేలా చేసింది. "ఆడవాళ్ల వక్షస్థలం గురించి అది మాట్లాడే సందర్భమేనా? ముసలాయనకి ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలీకుండా పోతోంది" అనే కామెంట్లు వినిపించాయి.

No comments: