Tuesday, August 16, 2011

మన చరిత్ర: ఆంధ్రరాష్ట్ర ఉద్యమం

ఆంధ్రరాష్ట్ర నిర్మాణావశ్యకత ఓ ఉద్యమంగా జనంలో పాకుతోంది. రాజమండ్రిలో జరిగిన ఓ సభలో టంగుటూరి శ్రీరాములు, మరికొంతమంది ఈ ఉద్యమం తమిళులతో కలిసి ఉండటంవల్ల కలిగే మంచిని గమనించక లేవదీసిందంటూ ప్రసంగించారు. దాంతో సభలో ఉన్న చిలకమర్తి లక్ష్మీనరసింహం చాలా ఉద్వేగంతో వారి వాదాన్ని ఖండిస్తూ ఆంధ్ర జనాభ్యుదయానికి ఆంధ్రరాష్ట్ర నిర్మాణం అత్యవసరమని గట్టిగా నొక్కి చెప్పారు. దాంతో ఆ సభాసదులందరూ అంగీకరించక తప్పింది కాదు.
1914 వేసవిలో విశాఖపట్నంలో మూడవ ఆంధ్ర మహాసభ అప్పటి కేంద్ర శాసనసభలో సభ్యులైన పానుగంటి రామారాయణిం అధ్యక్షతన జరిగింది. ఈ సభ ఆంధ్రరాష్ట్రాన్ని నిర్మాణం చెయ్యాలని ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానించింది. ఈ ఆంధ్ర మహాసభ మోచర్ల రామచంద్రరావు, వరాహగిరి జోగయ్య, పట్టాభి సీతారామయ్య సభ్యులుగా; కొండా వెంకటప్పయ్య కార్యదర్శిగా ఒక స్థాయీ సంఘాన్ని ఏర్పాటుచేసింది.
1915లో కాకినాడలో నాలుగో ఆంధ్ర మహాసభలు జరిగాయి. మోచర్ల రామచంద్రరావు అధ్యక్షత వహించారు. విశాఖపట్నం సభలవరకూ వీరు ఆంధ్రరాష్ట్ర నిర్మాణ ఉద్యమ విషయంలో అనుమానాలు వ్యక్తపరుస్తున్నా, కాకినాడ సభల నాటికి పూర్తిగా ఉద్యమాన్ని బలపర్చేవారుగా మారారు. సభలు అత్యంత ఉత్సాహపూరిత వాతావరణంలో జరిగాయి.
1916లో నెల్లూరు పట్టణంలో 5వ ఆంధ్రరాష్ట్ర మహాసభలు జరిగాయి. ఈ సభలకు కొండా వెంకటప్పయ్య అధ్యక్షత వహించారు. వంగోలు వెంకటరంగయ్య పూనికతో సభల్ని నిర్వహించారు. సభలో ఆంధ్రరాష్ట్రానికి ప్రతికూలురు కూడా ఉన్నారు. అత్యధిక మెజారిటీతో ఆంధ్ర రాష్ట్ర తీర్మానం నెగ్గింది. కోడి రామ్మూర్తి, బయ్యా నరసింహేశ్వరశర్మ తదితరులు చాలా కృషిచేసి తీర్మానాన్ని నెగ్గించారు.
1917లో ఆరో ఆంధ్ర మహాసభ కడపలో జరిగింది. ఈ సభలకు నెమిలి పట్టాభిరామారావు అధ్యక్షత వహించారు. చాలా జయప్రదంగానే సభలు ముగిశాయి. ఈలోగా ఆంధ్రరాష్ట్ర నిర్మాణావశ్యకతను వివరిస్తూ, మొత్తం దేశాన్ని భాషాప్రయుక్త రాష్ట్రాలుగా విభజించడం అవసరమంటూ ఆంధ్రరాష్ట్ర స్థాయీ సంఘం పక్షాన న్యాపతి సుబ్బారావు, కొండా వెంకటప్పయ్య ఒక నివేదికను మాంటేగుకు సమర్పించారు.
1935లో ఆంగ్లేయులు సింధ్, ఒరిస్సాలను ప్రత్యేక రాష్ట్రాలుగా ఏర్పాటు చేసేంతవరకూ ఇక్కడి ఆంధ్రరాష్ట్ర ఉద్యమంలో స్తబ్దత వచ్చింది. జాతీయోద్యమం సాగుతున్నా ఇది అంతగా ప్రస్ఫుటం కాకపోవడం గమనించాల్సిన విషయం.

No comments: