Saturday, August 6, 2011

న్యూస్: 'రంగం' తర్వాత 'రౌద్రం'!

మెగా సూపర్‌గుడ్ మూవీస్ అధినేత ఆర్.బి. చౌదరి కుమారుడు జీవా తమిళంలో నటించిన సూపర్‌హిట్ ఫిల్మ్ 'కో' తెలుగులో 'రంగం' పేరుతో విడుదలై ఇక్కడ కూడా ఘన విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. 75 కేంద్రాల్లో 75 రోజులు ఆడిన ఈ సినిమా ఆగస్ట్ 20వ తేదీతో 100 రోజులు పూర్తి చేసుకోబోతోంది. ఆర్.బి. చౌదరి ప్రకారం ఇది 20 సెంటర్లలో శత దినోత్సవం జరుపుకోబోతోంది. ఇందులో ఫొటో జర్నలిస్ట్ అశ్విన్‌గా జీవా నటన అందర్నీ ఆకట్టుకుంది. ఈ విజయం ఇచ్చిన స్ఫూర్తితో జీవా తాజా చిత్రం 'రౌథిరం'ని 'రౌద్రం' పేరుతో అనువదిస్తున్నారు చౌదరి. రెండు భాషల్లో ఒకేసారి ఈ సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అందాల తార శ్రియ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా ద్వారా డైరెక్టర్‌గా గోకుల్ పరిచయమవుతున్నాడు. ప్రీతి జంగియాని, ప్రకాశ్‌రాజ్, జయప్రకాశ్‌రెడ్డి ప్రధాన పాత్రధారులైన ఈ సినిమా ఆగస్టులోనే ఆడియన్స్ ముందుకు రాబోతోంది. చౌదరి పెద్ద కుమారుడు రమేశ్ హీరోగా నిలదొక్కుకోక పోయినా చిన్న కుమారుడు జీవా ఆ లోటును తీరుస్తుండటం గమనార్హం. తమిళంలో మంచి హీరోగా రాణిస్తున్న అతను ఇప్పుడు 'రంగం'తో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లోనూ చోటు పొందాడు. 'రౌద్రం'తో అతను మరింతగా తెలుగువాళ్లని అలరిస్తాడేమో చూడాలి.

No comments: