Friday, August 26, 2011

న్యూస్: మహా 'దూకుడు'మీదున్న పాటలు

మహేశ్ సినిమా 'దూకుడు' పాటలు అదరగొడుతున్నాయ్. శ్రీను వైట్ల డైరెక్షన్‌లో తయారైన ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ అందించాడు. మహేశ్ సినిమాకి అతను పనిచేయడం ఇదే తొలిసారి. ఆగస్ట్ 18న అఫిషియల్‌గా విడుదలైన ఆడియో అప్పుడు మ్యూజిక్ చార్టుల్లో ముందుకు దూసుకుపోతోంది. ఇందులోని ఆరు పాటల్లో నాలుగు పాటల్ని రామజోగయ్యశాస్త్రి రాయగా, ఓ పాటని విశ్వా, ఇంకో పాటని భాస్కరభట్ల రవికుమార్ రాశారు. ముఖ్యంగా భాస్కరభట్ల రాయగా రంజిత్, దివ్య ఆలపించిన 'ఇటు రాయే ఇటు రాయే నీ మీదే మనసాయే' పాట శ్రోతల్ని అమితంగా ఆకట్టుకుంటోంది. 'దూకుడు' ఆల్బంలో ఇదే నెంబర్ వన్ సాంగ్. ఈ పాటలో దివ్య గొంతులోంచి వచ్చిన 'దేత్తడి దేత్తడి' అనే మాటలు అలరిస్తున్నాయి. దీని తర్వాతి స్థానం టైటిల్ సాంగ్‌ది. "నీ దూకుడూ కాదెవ్వడూ' అంటూ సాగే ఈ పాటని విశ్వా రాయగా శంకర్ మహదేవన్ ఆలపించాడు. మిగతా పాటల్లో రాహుల్ నంబియార్ పాడిన సోలో సాంగ్ 'గురువారం మార్చి ఒకటీ', కార్తీక్, రీటా పాడిన డ్యూయెట్ 'చుల్‌బులీ నా చుల్‌బులీ', కార్తీక్, రామజోగయ్యశాస్త్రి, వర్ధని కలిసి పాడిన 'అదర అదరగొట్టు' పాట బాగున్నాయి. ఎన్.ఎస్. రమ్య, నవీన్ మాధవ్ పాడిన 'పువ్వాం పువ్వాం అంటాడు ఆటో అప్పారావు' పాట ఏమంత ఆకట్టుకునే రీతిలో లేదు. ఆల్బంలో ఇదొక్కటే వీక్ సాంగ్. ఇప్పటివరకు ఒకే రకంగా ట్యూన్స్ ఇస్తూ వస్తున్న తమన్ ఇందులోనూ అదే బాణీని అనుసరించాడు. 'ఇటు రాయే ఇటు రాయే', టైటిల్ సాంగ్ ఇందుకు ఉదాహరణలు. ఏదేమైనా పాటలు హిట్టవడంతో ఇక సినిమా రావడమే తరువాయి. 'పోకిరి' తర్వాత తమ హీరోకి సరైన హిట్టులేకపోవడంతో మహేశ్ ఫాన్స్ యమ ఆకలి మీదున్నారు. సినిమా ఏమాత్రం బాగున్నా పెద్ద హిట్టవడం ఖాయం.

No comments: